మంత్రోపదేశం?!
సారయ్య ఒత్తిడికి తలొగ్గిన ఆర్టీసీ అధికారులు
హైదరాబాద్ రూట్లో ఒకే పాయింట్ కేటాయింపు
బస్వరాజు బంక్ వద్ద జాతర బస్సుల క్యూ
ఇంధనం కోసం గంటల తరబడి నిరీక్షణ
సుబేదారి, న్యూస్లైన్ : మేడారం మహా జాతర నేపథ్యంలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన బస్సులు ఇవి. జాతర ముగియడంతో శనివారం రాత్రి తిరుగుముఖం పట్టాయి. ఈ క్రమంలో మడికొండ శివారులోని పెట్రోల్ పంప్ వద్ద ఇలా బారులుదీరాయి. పెట్రోల్పంప్ నుంచి డీజిల్ కాలనీ వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర నిలిచిపోయూయి. శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఇదే పరిస్థితి.
హైదరాబాద్ మార్గంలో స్టేషన్ ఘన్పూర్, జనగామ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో డీజిల్ పోసేందుకు సంస్థ అధికారులు ఒకే బంక్ కేటాయించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయితే... ఈ బంక్ స్వయూనా రాష్ర్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్యకు చెందినది కావడం విమర్శలకు దారితీసింది. హైదరాబాద్ రూట్లో మరిన్ని బంక్లు ఉన్నప్పటికీ... ఇందులోనే డీజిల్ పోసుకునేలా ఆదేశాలు ఇవ్వడం వెనుక మతలబు దాగి ఉందనే ప్రచారం జరిగింది. ఆయన ఆదేశాలతోనే ఆర్టీసీ అధికారులు ఇలా వ్యవహరించారనే అనుమానాలు వ్యక్తం చేశారు.
కొందరైతే మంత్రా.. మజాకా... చెప్పిన మాట వినకుంటే అంతే మరి... బదిలీ కావాల్సిందే... అధికారులు ఏం చేస్తారంటూ నిట్టూరుస్తూ వెళ్లడం విశేషం. పడిగాపులు కాయలేక ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, సిబ్బంది ఇక్కట్లు ఎదుర్కొన్నారు. రాత్రంతా జాగారం చేయడంతోపాటు భోజనం చేయకపోవడంతో వారు అసహనం వ్యక్తం చేశారు. బంక్ సిబ్బందిపై రుసరుసలాడినట్లు తెలిసింది.