పోడు భూముల్లో పచ్చని పంటలు ధ్వంసం
125 ఎకరాల్లో స్వాధీనం చేసుకున్న ఫారెస్టు అధికారులు
నలుగురు రైతుల అరెస్టు.. స్పృహ కోల్పోయిన ఇద్దరు మహిళా రైతులు
టేకులపల్లి : మండలంలోని కొప్పురాయి పంచాయతీ ఒడ్డుగూడెం సమీపంలో పోడు భూముల్లో 125 ఎకరాల పచ్చని పంటలను ధ్వంసం చేశారు. పోలీసుల సహకారంతో ఫారెస్టు అధికారులు పంతం నెగ్గించుకున్నారు. జూలై 23 నుంచి పలు దఫాలుగాఅధికారులు దాడులకు పాల్పడ్డారు.అయితే బాధిత రైతులు ప్రతిఘటిస్తున్న నేపథ్యంలో శుక్రవారం భారీ బందోబస్తుతో ఒడ్డుగూడెం గ్రామం నుంచి,రాజారాం తండా గ్రామం నుంచి రైతులు పంట చేల వైపు రాకుండా మధ్యలోనే రహదారులపై అడ్డుకున్నారు.దీంతో రైతులను వెనక్కి పంపించి వేస్తున్న క్రమంలో తీవ్రంగా ప్రతిఘటించిన చింత భద్రమ్మ, పూనెం భద్రమ్మ, పూనెం కోటమ్మ, జర్పుల విజయలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. చింత లక్ష్షి్మనారాయణ, భూక్య లింగ్యా, భిక్షంలను సైతం అదుపులోకి తీసుకుని వదిలేశారు.ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో రైతుల కళ్లముందే పంటలను ధ్వంసం చేశారు. దీంతో ఇద్దరు మహిళా రైతులు భూక్య జిజానీ, భూక్య అచ్చాలీలు రోదించి స్పృహతప్పి పడిపోయారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ మంజుల, బోడు ఎస్ఐ బొడ్డు అశోక్, నరేష్, ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, రామవరం, వైల్డ్లైఫ్ ఫారెస్టు అధికారులు, సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.
నిబంధనల ప్రకారమే...ఎఫ్ఆర్ఓ
హరితహారంలో మొక్కలు నాటేందుకు 125 ( 50 హెక్టార్లు) ఎకరాలను నిబంధనల ప్రకారమే భూమిని స్వాధీనం చేసుకున్నామని ఎఫ్ఆర్ఓ మంజుల తెలిపారు.ఈ భూముల్లో సాగు చేయవద్దని గతంలోనే అనేక పర్యాయాలు చెప్పామని అయినా వినకుండా రైతులు సాగు చేశారని తెలిపారు. వీఎస్ఎస్ ద్వారా లబ్ధి పొందాలని రైతులకు చెప్పిన వారు ఒప్పుకోలేదని పేర్కొన్నారు.