ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందే
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయంలోని పరీక్షల నియంత్రణా విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ బి. లక్ష్మీప్రసాద్ను ఫోన్లో దూషించిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వైవీయూ అధ్యాపకులు పట్టుపట్టారు. బుధవారం వైవీయూలో వీసీ ఛాంబర్కు అధ్యాపక సిబ్బంది యావత్తు కదలి వచ్చి తమతోటి సహాయ ఆచార్యునికి బాసటగా నిలిచారు. దుర్భాషలాడిన టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నరుకుతా.. అంటూ ఫోన్లో దుర్భాషలాడినందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనబాట తప్పదని తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. గతంలో కూడా పలు సందర్భాలలో విధుల్లో ఉన్న అధ్యాపకులను కొందరు పార్టీల పేర్లు చెప్పి బెదిరించారని వీసీ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన వైస్ ఛాన్స్లర్ ఆచార్య బేతనభట్ల శ్యాంసుందర్ మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలను సభ్యసమాజం ఆమోదించదన్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయాలని ఎస్పీని, కలెక్టర్ను కోరుతామని తెలిపారు. దీంతో అధ్యాపకులు తిరిగి విధులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య టి. వాసంతి, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య జి. సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వీసీ శ్యాంసుందర్ ఏమన్నారంటే..
ఫోన్లో మాట్లాడిన వ్యక్తి గోవర్ధన్రెడ్డినో లేక అతని పేరుచెప్పి ఎవరైనా మాట్లాడారో ముందు విచారణ చేయిస్తాం. వీసీతో సహా అందరి సంగతి చూస్తామన్న నాయకులకు మమల్ని తొలగించే అధికారం లేదన్న విషయం గమనించుకోవాలి. నరుకుతాం అంటూ పరుషమైన పదజాలం వాడినట్లు నిర్ధారణ జరిగితే క్రిమినల్ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటాం.