క్రైస్తవ ఆస్తులను పరిరక్షించాలి
కర్నూలు సిటీ: నగరంలోని క్రైస్తవ ఆస్తులను పరిరక్షించాలని కోరుతూ శుక్రవారం కోల్స్ కళాశాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, దళిత సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోల్స్ కాలేజీ నుంచి కొండారెడ్డి బురుజు మీదుగా అంబేడ్కర్ విగ్రహాం వరకు ర్యాలీ సాగింది. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్, రాజ్కుమార్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి ఆనంద్బాబు, కోల్ప్ పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు జరదొడ్డి జయన్న, ఆ కాలేజీ ప్రిన్సిపాల్ జాన్సీరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిస్టియన్లుగా చెప్పుకుంటున్న కొంత మంది చీడపురుగులు కర్నూలు నగరంలోని క్రిస్టియన్ విద్యా సంస్థల ఆస్తులను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాయన్నారు.
దశబ్దాలుగా చరిత్ర ఉన్న కోల్స్ కాలేజీ ఆస్తులపై ఓ వ్యక్తి కన్నేసి కబ్జా చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. లక్షలాది మంది పేద విద్యార్థులకు అక్షర జ్ఞానాన్ని అందించిన కోల్స్ను కబ్జా చేసే ప్రయత్నాలను విరమించుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఆందోళనలో పాస్టర్ పాస్కల్ ప్రకాష్, సంజీవన్రాజు, అధ్యాపకులు విజయ్కుమార్, ఎస్ఎఫ్ఐ నగర నాయకులు అక్బర్, వెంకటేష్, పూర్వ విద్యార్థులు రాజ్కుమార్, దినేష్, అయ్యరాజు, సందీప్, భార్గవ్, మహిమాకర్, షాకీర్ తదితరులు పాల్గొన్నారు.