బెజవాడకు ఐదు మండలాలు
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినరెవెన్యూ అధికారులు
జేసీ, సబ్కలెక్టర్లతో కలిసి కసరత్తు
విజయవాడ : బెజవాడలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఐదు రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేయాలని అధికారులు తాజాగా ప్రభుత్వానికి నివేదిక పంపారు. స్థానిక జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం జేసీ గంధం చంద్రుడు, సబ్కలెక్టర్ డాక్టర్ జి.సృ జన, ఇతర రెవెన్యూ అధికారులు సమావేశమై కొత్త మండలాల ఏర్పాటుపై కసరత్తు చేశారు. నగరంలో ప్రస్తుతం ఉన్న తహశీల్దారు కార్యాలయ పరిధిని గతంలో 3 రెవెన్యూ మండలాలుగా విభజిస్తూ చేసిన ప్రతిపాదనలపై పునః సమీక్షించారు. ప్రజలు, పరిపాలనా సౌలభ్యం నేపథ్యంలో నగరంలో ఐదు, కనీసం నాలుగైనా రెవెన్యూ మండలాలు అవసరమని అధికారులు భావించారు.
ఈ సందర్భంగా 2011 జనాభా లెక్కల ప్రకారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 3.31 లక్షలు, పశ్చిమలో 3.03 లక్షలు, సెంట్రల్లో 4.66 లక్షల మంది ఉన్నారని నివేదిక తయారు చేశారు. తాజా లెక్కల ప్రకారం 15 లక్షల జనాభా ఉంటారని అంచనా వేశారు. అధిక జనాభా కలిగి ఉన్న విజయవాడ మధ్య నియోజకవర్గంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో 4 లేక 5 రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేయాలని జేసీ సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలందించటానికి ప్రతి 3 లక్షల జనాభాకు రెవెన్యూ మండలం అవసరమని, కొత్త మండలాల కూర్పుపై ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామన్నారు. సబ్ కలెక్టర్ సృ జన, అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు, రూరల్ తహశీల్దార్ వి.మదన్మోహన్తో ఆయన చర్చించి నివేదిక తయారు చేశారు.