రూపీ బాండ్లకు ఆర్బీఐ అనుమతి
బ్యాంకుల నిధుల సమీకరణకు వీలుగా నిర్ణయం
ముంబై: మసాలా బాండ్ల (రూపీ-డినామినేటెడ్ బాండ్లు) జారీ ద్వారా విదేశీ మార్కెట్లో బ్యాంకులు నిధుల సమీకరించుకోడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. దీర్ఘకాలిక నిధుల సమీకరణకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆర్బీఐ తెలిపింది. ‘‘రూపీ బాండ్ల విదేశీ మార్కెట్ను అభివృద్ధి చేయాలన్న సూత్రప్రాయ నిర్ణయం నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నాం. పరిమితులకు లోబడి ఈ బాండ్ల జారీ జరుగుతుంది’’ అని ఆర్బీఐ నోటిఫికేషన్ ఒకటి తెలిపింది. ఇన్ఫ్రా, చౌక ఇళ్లకు తగిన నిధుల సమీకరణకు తాజా నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంది. మసాలా బాండ్ల జారీ ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.5,000 కోట్ల సమీకరణకు ఈ ఏడాది మొదట్లో సంస్థలకు ఆర్బీఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకంటే ఎక్కువ నిధుల సమీకరణకు ఆర్బీఐ ముందస్తు అనుమతి తప్పనిసరి.