ఒంగోలులో కొనసాగుతున్న ఆందోళనలు
ఒంగోలు టౌన్, న్యూస్లైన్ : జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలో సమైక్యవాదుల నిరసనలు మిన్నంటుతున్నాయి. రాష్ట్ర సమైక్యత కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. రోజుకో తరహా నిరసన వ్యక్తం చేస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం కూడా నగరంలో సమైక్యవాదుల నిరసనలు జోరుగా సాగాయి.
నిరసన ర్యాలీ
రాష్ట్ర విభజనను నిరసిస్తూ హౌసింగ్బోర్డు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలు వినూత్న నిరసనకు దిగారు. కాలనీ నుంచి చర్చి సెంటర్ వరకు కే సీఆర్ దిష్టిబొమ్మను ఊరేగించారు. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. కేసీఆర్ దిష్టిబొమ్మను టమోటాలతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పోరాడుతున్నారన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు తెలుగు మాట్లాడేవారందరినీ ఒకే రాష్ట్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే వచ్చే లాభాల కంటే నష్టాలే అధికంగా ఉన్నాయని, తాగునీటికి, సాగునీటికి యుద్ధాలు జరిగే ప్రమాదం ఉంద న్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఈదర వెంకట సురేశ్బాబు, కార్యదర్శి రావూరి లక్ష్మయ్య, కోశాధికారి టీవీ శేషయ్య, యన్జీఓ నాయకులు ఖాశిం, టి.కరుణాకర్, రాజేశ్, ఓలేటి ప్రసాద్, దండే కృష్ణారావు, తిరుపాలయ్య, కృష్ణారావు, సత్యసాయి, అరుణ, డాక్టర్ రాధాకృష్ణమూర్తి, రామకృష్ణ, జైపాల్, ఉదయ్, కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
వాటర్ ట్యాంకర్లతో..
ఉద్యమంలో అగ్రభాగాన ఉంటూ రోజుకో వినూత్న నిరసనతో ఆందోళన తెలుపుతున్న కార్పొరేషన్ ఉద్యోగులు తమ నిరసనల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. నగరంలోని కాలనీలకు మంచినీటిని సరఫరా చేసే ట్యాంకర్లతో నగరంలో భారీ ప్రదర్శన చేపట్టారు. స్థానిక కాార్పొరేషన్ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి చర్చి సెంటర్లో మానవహారంగా ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగిరావాలని, లేదంటూ తగిన బుద్ధి చెప్తామని ఉద్యోగులు హెచ్చరించారు.
న్యాయవాదుల ఆందోళన
రాష్ట్ర విభజనను నిరసిస్తూ జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షలు 50వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా బుధవారం 50 మంది న్యాయవాదులు రిలే దీక్షలకు కూర్చుని నిరసన తెలిపారు. రాష్ట్ర సమైక్యత కోసం 57 రోజులుగా పోరాడుతున్న ఉద్యోగులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆందోళనలు కేంద్ర ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. కేంద్రం దిగిరాకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమైక్య రాష్ట్ర ప్రకటన వచ్చే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామన్నారు.
రోడ్లు ఊడ్చిన పీఆర్ ఉద్యోగులు
పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగులు వినూత్న నిరసన తెలిపారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ స్థానిక పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్లో కార్మికుల వేషధారణలతో రోడ్లు ఊడ్చారు. కడుపులు మాడ్చుకొని ఉద్యమిస్తున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఉద్యోగుల, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
రెవెన్యూ ఉద్యోగుల ైబె కు ర్యాలీ
సమైక్యాంధ్రకు మద్దతుగా నగరంలో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పొట్టి కర్నూల్ రోడ్, ఆర్టీసీ డిపో, అద్దంకి బస్టాండ్, మార్కెట్ సెంటర్, ట్రంకురోడ్ మీదుగా చర్చి సెంటర్, ప్రకాశం భవన్ వరకు ర్యాలీ కొనసాగింది. రాష్ట్ర సమైక్యత కోసం ఎంత వరకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్లో పదవులే లేకండా పోతాయని హెచ్చరించారు. ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కేఎల్ నర సింహారావు పాల్గొన్నారు.