అల్లర్లపై పది కేసులు నమోదు
ఐదు కేసుల దర్యాప్తు పూర్తి
23 మంది అరెస్టు
కొనసాగుతున్న కర్ఫ్యూ
రంగంలోకి అదనపు బలగాలు
అఅత్తాపూర్, న్యూస్లైన్: సిక్ చావ్నీ అల్లర్లకు సంబంధించి పోలీసులు మొత్తం పది కేసులు నమోదు చేసి, 23 మందిని అరెస్టు చేశారు. మరోపక్క ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, బీఎస్ఎఫ్, సాయుధ పోలీసు బలగాలతో కవాతు నిర్వహించారు.ఇతర ప్రాంతాలకు అల్లర్లు విస్తరించకుండా.. ముఖ్యంగా పాతబస్తీలో అదనపు బలగాలను రంగంలోకి దింపారు.
శుక్రవారం ప్రార్ధనలు, ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అధికారులు సిక్ చావ్నీపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజల వెసులుబాటు కోసం గురువారం ఉదయం గంట పాటు కర్ఫ్యూను సడలించారు. ఈ సమయంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ అత్యవసర పనులు చక్కబెట్టుకున్నారు. ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
కిషన్బాగ్ నుంచి ఎంఎం పహాడీ వరకు చెక్పోస్టులను ఏర్పాటుచేశారు. కిషన్బాగ్, చింతల్మెట్, నందిముస్లాయిగూడ ప్రాంతాల నుంచి సిక్ చావ్నీ హర్షమహల్ వైపు వాహనాల రాకపోకలను నిషేధించారు. కాగా, కర్ఫ్యూ కారణంగా ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం సాహసించడంలేదు. జనం సంచారం లేకపోవడంతో రహదారులన్నీ ఖాళీగా కనిపించాయి.
పోలీసులు ఎక్కడికక్కడ నిషేధాజ్ఞలు విధించడంతో పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తుండటంతో ప్రశాంత వాతావరణం నెలకొంది. ముందస్తు చర్యగా దక్షిణ మండల పరిధిలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో శుక్రవారం 144 సెక్షన్ను విధించారు. కాగా, కాల్పులు జరిగిన ప్రాంతాన్ని గురువారం రాష్ర్ట డీజీపీ ప్రసాద్రావు సందర్శించారు. ఇరువర్గాలు సంయమనం పాటించాలని కోరా రు. ఇదిలా ఉండగా, పోలీసు కాల్పుల్లో చనిపోయిన ముగ్గురి కుటుంబసభ్యులకు రూ. 6 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి, రాజేంద్రనగర్ తహసీల్దార్ అశోక్కుమార్ గురువారం అందజేశారు.
ప్రార్ధనలకు గట్టిబందోబస్తు....
శుక్రవారం ప్రత్యేక ప్రార్ధనల సందర్భంగా ఆయా ప్రాంతాలలో గట్టిబందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ సీహెచ్ కుశాల్కర్ తెలిపారు. ప్రార్ధనలు జరిగే హర్షమహల్, అత్తాపూర్ బడీమసీద్, చోటామసీద్, నౌనెంబర్, ఎంఎం పహాడీ, మహ్మదాబాద్, వాదియా మహ్మద్, చింతల్మెట్, జలాల్బాబానగర్, బాసిత్బాబానగర్ ప్రాంతాలలో పికెట్లను ఏర్పాటు చేశామన్నారు. అలాగే రాంబాగ్, చింతల్మెట్, నందిముస్లాయిగూడ ప్రాంతాలలోని ఆలయాల వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతుందన్నారు. ఎక్కడైన అనుమానిత వ్యక్తులు కనిపించినా, అవాంఛనీయ సంఘటనలు జరిగినా.. వెంటనే 100 నెంబర్కు సమాచారం అందించాలని ఇన్స్పెక్టర్ కుషాల్కర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
క్షతగాత్రులకు ఉచిత చికిత్స...
మెహిదీపట్నం: సిక్ చావ్నీ అల్లర్లలో గాయపడ్డ వారికి ఉచితంగా చికిత్స చేస్తున్నట్టు నానల్నగర్లోని ప్రీమియర్ ఆస్పత్రి ఎండీ డాక్టర్మహేష్ మర్దా తెలిపారు. తూటాలు, ఇతర గాయాలతో ఆస్పత్రిలో చేరిన వారిలో అవసరమైన వారికి తమ డాక్టర్ల బృందం విజయవంతంగా శస్త్ర చికిత్సలను నిర్వహించిందని ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
పుకార్లను నమ్మవద్దు: సీవీ ఆనంద్
సిక్ చావ్నీ అల్లర్ల ఘటనపై పది కేసులు నమోదు చేసినట్టు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. గురువారం రాత్రి రాజేంద్రనగర్లోని ఏసీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సిక్ చావ్నీ ఘటనపై పది కేసులు నమోదు చేశామని, వీటిలో ఐదు కేసులు దర్యాప్తు పూర్తి చేసి 23 మందిని నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. అల్లర్లును అదుపుచేసే క్రమంలో బీఎస్ఎఫ్ దళాలు వంద రౌండ్లు వరకు కాల్పులు జరిపాయని చెప్పారు.
ఇంటర్నెట్, ఫేస్బుక్, వాట్స్యాప్లో ఘటనకు సంబంధించి కొందరు నకిలీ ఫొటోలు అప్లోడ్ చేసినట్టు గుర్తించామన్నారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని, పుకార్లు నమ్మవద్దని కోరారు. శుక్రవారం ప్రత్యేక ప్రార్ధనలు ఉండడంతో పాటు బందోబస్తు దృష్ట్యా 17వ తేదీ ఉదయం 10 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.
అల్లర్లు చెలరేగడానికి కారణమైన అల్లరి మూకలను గుర్తించడానికి ఫొటోలు, వీడియోలను పరిశీలిస్తున్నామన్నారు. కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలకు రూ.6 లక్షల ఎక్స్గ్రేషియా అందించామన్నారు. గాయపడ్డ వారికి రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు.