silver articles
-
కరుగుతున్న వెండి కొండలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ఆలయాల్లో వెండి నిల్వలు కొండల్లా పేరుకుపోతున్నాయి. శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల ఇలా ప్రముఖ దేవాలయాల్లో వేల కిలోల వెండి నిల్వలు ఉన్నాయి. వీటిని భద్రపరచడం ఆయా దేవస్థానాలకు భారంగా మారింది. బ్యాంకుల్లో వెండిని డిపాజిట్ చేస్తే వడ్డీ ఇచ్చే విధానం లేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం బంగారాన్ని బ్యాంకుల్లో బాండ్ల రూపంలో దాచుకునే పథకాన్ని ప్రకటించి వడ్డీ కూడా చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా దేవాలయాలు తమ వద్ద ఉన్న వెండి నిల్వలను అమ్మి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఏకంగా 21 వేల కిలోల వెండి నిల్వలు ఉన్నాయి. శని దోష నివారణకు భక్తులు శ్రీకాళహస్తిలో రాహు–కేతు పూజలు నిర్వహించి వెండి నాగ పడగలను సమర్పిస్తుంటారు. ఇక్కడే కాకుండా.. శ్రీశైలం, విజయవాడ, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల ఆలయాల్లో కూడా ప్రతి చోటా వెయ్యి కిలోలకు పైగా వెండి నిల్వలు పేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం బంగారాన్ని బాండ్ల రూపంలో దాచుకునే పథకాన్ని ప్రకటించడంతో.. దేవుడి బంగారు ఆభరణాలను డిపాజిట్ చేస్తే బ్యాంకులు వాటి విలువ ఆధారంగా ఆలయానికి వడ్డీ చెల్లించే వెసులుబాటు ఏర్పడింది. వెండి నిల్వలను డిపాజిట్ చేస్తే వడ్డీ చెల్లించే విధానం లేకపోవడంతో వాటిని అమ్మేందుకు జేఎస్వీ ప్రసాద్ దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు వెండిని అమ్మి బంగారంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికనుగుణంగా డిసెంబర్లో శ్రీకాళహస్తి ఆలయం తమ దగ్గర ఉన్న వెండి నిల్వల్లో 14,935 కిలోల అమ్మకానికి ఈ – వేలం నిర్వహించింది. 10,282 కిలోల వెండితో 100 కిలోల బంగారం శ్రీకాళహస్తిలో 14,935 కిలోల వెండి ఆభరణాలను కరిగించగా.. కడ్డీల రూపంలో స్వచ్ఛమైన వెండి 10,282 కిలోలు వచ్చింది. ఈ వెండి కడ్డీలను ప్రభుత్వ రంగ సంస్థ మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎంఎంటీసీ)కి అమ్మగా రూ.33.29 కోట్లు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తంతో ఎంఎంటీసీ ద్వారా తిరిగి వంద కిలోల బంగారాన్ని కొనుగోలు చేశారు. ఈ బంగారాన్ని బాండ్ల రూపంలో బ్యాంకుల్లో డిపాజిట్ చేయనున్నట్టు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. శ్రీశైలంలో 2,400 కిలోల వెండి ఆభరణాలు ఉండగా, అందులో 500 కిలోలను కరిగించగా కడ్డీల రూపంలో స్వచ్ఛమైన వెండి 375 కిలోలు వచ్చినట్టు శ్రీశైల ఆలయ అధికారులు చెప్పారు. ఈ 375 కిలోల వెండిని ఎంఎంటీసీ ద్వారా అమ్మగా రూ.1.36 కోట్లు వచ్చాయి. ఈ మొత్తంతో 4.353 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. -
స్టార్ హోటల్లో కక్కుర్తి పనులు
సాక్షి, న్యూఢిల్లీ : స్టార్ హోటళ్లకు వెళ్లినప్పుడు చేతి వాటం చూపించి నచ్చిందేదో ఎత్తుకు రావడం కొందరికి అలవాటుగా ఉంటుంది. స్టార్ హోటళ్లకు వెళ్లే స్థోమతలేని వారు అదృష్టం అడ్డంపడి అనుకోకుండా స్టార్ హోటల్కు వెళితే అందుకు గుర్తుగా ఏదో ఒకటి తస్కరించి తెచ్చుకుంటారు మరికొందరు. అంతేకాకుండా తరచూ స్టార్ హోటళ్లకు వెళ్లే వాళ్లు, అంతటి స్థోమత ఉన్నవారిలో కూడా ఇలాంటి పాడుబుద్ధి కలిగిన వారుంటారని పత్రికల్లో వచ్చిన వార్తల ద్వారా మనకు తెల్సిందే. పత్రికల్లో వార్తలు రాసే జర్నలిస్టులు కూడా చేతివాటం చూపిస్తారని తాజాగా వెల్లడైంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంట లండన్ వెళ్లిన జర్నలిస్టులు అక్కడ ఓ స్టార్ హోటల్లో అక్కడి ప్రభుత్వం ఇచ్చిన విందులో పాల్గొన్నారు. వెండి పాత్రలు, వెండి కంచాల్లో, వెండి చెంచాలతో స్వదేశీ వంటకాలతోపాటు భారతీయ వంటకాలను కూడా వడ్డించడంతో జర్నలిస్టులంతా లొట్టలేసుకుంటూ తెగతిన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత కొందరు శుభ్రంగా ఉన్న వెండి పాత్రలను, వెండి చెంచాలను తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో సర్దుకున్నారు. ఇలా ఒకరిని చూసి ఒకరు చేతివాటం చూపించారు. విందు జరిగిన హాలులో ఉన్న సీసీటీవీ కెమేరాలన్నీ ఈ దృశ్యాలను చక్కగా రికార్డు చేశాయి. జర్నలిస్టులను రెడ్ హాండెడ్గా పట్టుకోకుండా అనంతరం విందు ఏర్పాటు చేసిన వారికి జరిగిన విషయం ఫిర్యాదు చేయాలకున్నది హోటల్ యాజమాన్యం. కానీ లండన్ విదేశాంగ శాఖ ఈ విందును ఏర్పాటు చేసిన కారణంగా రాద్ధాంతం జరిగితే పరువు పోతుందని భావించిన యజమాన్యం. ఆ సమస్యను అక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో తమ సెక్యూరిటీ సిబ్బందికి తగిన ఆదేశాలను జారీ చేసింది. ఆ సిబ్బంది చేతివాటం చూపిన జర్నలిస్టులందరి దగ్గరికి వెళ్లి తమ నిర్వాకం సీసీటీవీ కెమేరాల్లో రికార్డయిందని, ఎక్కడి నుంచి తీసిన వస్తువులు అక్కడనే వదిలేసి వెళ్లాలని హెచ్చరించారు. ఇబ్బందిపడ్డ జర్నలిస్టులు వారు చెప్పినట్లే చేసి మౌనంగా తలొంచుకొని బయటకు దారి తీశారు. వారిలో ఒక జర్నలిస్టు మాత్రం సెక్యూరిటీ గార్డు ఎంతగా హెచ్చరించినా వినలేదు. తాను దేన్ని చోరీ చేయలేదని, అవసరమైతే తన బ్యాగ్ను తనిఖీ చేసుకోవచ్చని ప్రతి సవాల్ చేశారు. ‘బాబు! నీవు దొంగతనం చేసి పాత్రను నీ బ్యాగులో పెట్టుకోలేదు. తోటి జర్నలిస్టు బ్యాగులో పెట్టావ’ ని సెక్యూరిటీ గార్డు చెప్పడంతో సదరు జర్నలిస్ట్ తెల్లబోయాడు. చెప్పినప్పుడు వినకుండా అంతగా వాదించినందుకు, గొడవ పడ్డందుకు ఆ జర్నలిస్టును ముందుగా పోలీసులకు అప్పగిద్దామనుకున్న హోటల్ యాజమాన్యం. చివరకు ఆయనకు 50 పౌండ్లు, అంటే 4,500 రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించిన సదరు జర్నలిస్ట్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంట భారత్కు వెన్నంటి వచ్చారు. ఈ విషయాన్ని ‘అవుట్లుక్’తో పాటు కొన్ని బెంగాల్ పత్రికలు ధ్రువీకరించాయి. చేతివాటం చూపిన జర్నలిస్టుల పేర్లను అవుట్లుక్ వెల్లడించలేదు. బెంగాల్ పత్రికలు ముందుగా వెల్లడించినా తర్వాత వాటిని తొలగించింది. ఈ సంఘటన లండన్లో మమతా బెనర్జీ గౌరవార్థం ఇచ్చిన విందులో అని పేర్కొన్నారుగానీ, ఎప్పుడు, ఏ హోటల్లో జరిగిందో తెలియజేయలేదు. మమతా చివరిసారి లండన్లో పర్యటించిందీ మాత్రం గత నవంబర్ నెలలో. చేతి వాటం చూపిన జర్నలిస్టుల్లో బెంగాల్ వాళ్లే ఎక్కువ ఉన్నారు. సీసీటీవీ కెమేరాలున్నా వారు చోరీ చేయడానికి కారణం అవి పనిచేయకపోవచ్చనే అభిప్రాయమేనని, ఎందుకంటే బెంగాల్లో ఎక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు పనిచేయవని తోటి జర్నలిస్ట్ ఒకరు వ్యాఖ్యానించారు. -
భారీగా వెండి ఆభరణాలతో వ్యక్తి పట్టివేత
సికింద్రాబాద్: భారీగా వెండి ఆభరణాలను రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం చెన్నై ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్కు వచ్చిన కె.శ్రీను అనే వ్యక్తిని పోలీసులు తనిఖీ చేశారు. అతడి వద్ద 28.7 కిలోల వెండి ఆభరణాలను గుర్తించారు. సరైన పత్రాలు లేకపోవడంతో అతడ్ని అదుపులోకి తీసుకుని వాణిజ్య శాఖ అధికారులకు అప్పగించారు.