కోర్టు ఆవరణలో కాల్పుల కలకలం
ఘాజీపూర్: కోర్టు ఆవరణలో కొందరు గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడటం కలకలం సృష్టించింది. హత్యకేసులో ప్రధాన నిందితుడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపేందుకు యత్నంచేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ రామ్ కిషోర్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ హత్యకేసులో నిందితుడు చందన్ సింగ్ ను జిల్లా జైలులో పోలీసు కస్గడీలో ఉన్నాడు. ఈ క్రమంలో చందన్ సింగ్ ను కోర్టులో హాజరు పరిచారు.
కోర్టులో కేసు విచారణ పూర్తికాగానే అతడిని స్టేషన్ కు తరలించేందుకు పోలీసులు సిద్దమయ్యారు. ఇంతలోనే కొందరు గుర్తుతెలియని దుండగులు చందన్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చదన్ వీపు భాగంలో గాయాలుకాగా, చికిత్స నిమిత్తం అతడిని వారణాసిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. గతేడాది జూలైలో జరిగిన ఓ హత్య కేసులో చందన్ ప్రధాన నిందితుడని, పాతకక్షలతోనే ఈ కాల్పులకు పాల్పడి ఉంటారని ఎస్పీ రామ్ కిషోర్ అభిప్రాయపడ్డారు.