మున్సిపల్ ఎన్నికలకు 3 వేల మంది సిబ్బంది
రేపల్లెరూరల్, న్యూస్లైన్: మున్సిపల్ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా మూడు వేల మంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ తెలిపారు. రేపల్లె సర్కిల్ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1000 మంది సివిల్, 1000 మంది స్పెషల్పోలీస్లతో పాటు 1000 మంది హోంగార్డులతో భద్రత కల్పిస్తామని వెల్లడించారు.
జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 35 చెక్పోస్టుల్లో కోటి 45 లక్షల రూపాయలు, 31 కిలోల వెండి సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 1,023 మంది రౌడీషీటర్లలో ఇప్పటివరకు 803 మంది రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి బైండవర్ చేశామన్నారు. ఎన్నికల్లో అల్లర్లు చేసే అవకాశం ఉన్నవారిని 15 వేల మంది (ట్రబుల్ మంగర్స్)ని గుర్తించి 11 వేల మందిని మండల మెజిస్ట్రేట్ సమక్షంలో బైండవర్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి అతిక్రమించిన 39 మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు.
11 వాహనాలను ఎన్నికల నియమావళి అతిక్రమించినందున సీజ్ చేశామన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 3,485 లిక్కర్ బాటిల్స్ను, 180 లీటర్ల సారా సీజ్ చేసి 59 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల బందోబస్తుపై సీఐలు, ఎస్ఐలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు ఇచ్చారు. సమావేశంలో బాపట్ల, గుంటూరు డీఎస్పీలు జోసఫ్ రాజ్కుమార్, సత్యనారాయణ, రేపల్లె టౌన్, రూరల్ సీఐలు యు.నాగరాజు, పెంచల రెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు.