అటవీ ఆక్రమణలు ఉపేక్షించం
30 శాతం ఆక్రమణ చెరలోనే
ఆక్రమణదారులపై కఠిన చర్యలు
ప్రభుత్వానికి నివేదిక
జిల్లాలో 7శాతమే అడవులు
జిల్లా అటవీశాఖాధికారి ఎస్.రాజశేఖర్
సాక్షి, విజయవాడ : జిల్లాలో అటవీభూముల ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీశాఖాధికారి ఎస్.రాజశేఖర్ హెచ్చరించారు. ఇతర జిల్లాలతో పోలిస్తే జిల్లాలో తక్కువ విస్తీర్ణంలో కేవలం ఏడు శాతం మాత్రమే అడవులున్నాయని తెలిపారు. జిల్లాలో తక్కువ విస్తీర్ణంలో ఉన్న అటవీ భూములను పూర్తిస్థాయిలో పరిరక్షించటానికి శాఖాపరంగా తీసుకుంటున్న చర్యల్ని ఆయన వివరించారు. ఇప్పటికే జిల్లాలోని నూజివీడు డివిజన్లో ఆక్రమణలు అధికంగా జరిగాయని పేర్కొన్నారు. అటవీ భూముల్లో సుమారు 30శాతం ఆక్రమణల్లోనే ఉన్నాయని రాజశేఖర్ చెప్పారు.
జిల్లాలో 49,960 హెక్టార్లలో అటవీప్రాంతం ఉందని తెలిపారు. దీనిలో సుమారు 20శాతం అటవీ ప్రాంతం కొండల్లో ఉందని, విజయవాడ డివిజన్ పరిధిలోని జగ్గయ్యపేట, కొండపల్లి, కంచికచర్ల, శోభనాపురం, విజయవాడ తదితర ప్రాంతాల్లో 25,368.04 హెక్టార్లు అటవీప్రాంతం ఉందని చెప్పారు.
అలాగే మైలవరం డివిజన్ పరిధిలోని జి.కొండూరు, ఎ.కొండూరు, మైలవరం తదితర ప్రాంతాల్లో 11,863.42 హెక్టార్లలో అడవులున్నాయని వివరించారు. నూజివీడు డివిజన్ పరిధిలోని నూజివీడు, సుంకొల్లు, విస్సన్నపేట, తదితర ప్రాంతాల్లో 12,708.83 హెక్టార్లలో అడవులున్నాయని, వీటిలో సుమారు 25 నుంచి 30శాతం అడవులు ఆక్రమణల చెరలోనే ఉన్నాయని తెలిపారు.
40 ఏళ్లుగా ఆక్రమణలు
దాదాపు 40 ఏళ్ల నుంచి జిల్లాలో అడవుల ఆక్రమణలు యథేచ్ఛగా జరగుతున్నాయని రాజశేఖర్ తెలిపారు. ఈ క్రమంలోనే తమశాఖ అధికారులు కొనేళ్ల కిత్రమే అక్రమణలదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరె స్టు చేశారని చెప్పారు. ప్రస్తుతం 50కి పైగా కేసులు కోర్టుల్లో ఉన్నాయని వివరించారు. నూజివీడులో సుమారు 30 వేల ఎకరాల అడవులు అన్యాకాంత్రం అయ్యాయని, వీటిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని చెప్పారు.
అడవుల్లో మామిడి, పామాయిల్, ఇతర పంటలు సాగులో ఉన్నాయని చెప్పారు. అటవీ భూములను ప్రభుత్వం తీసుకోవడానికి సంబంధించి తమ శాఖకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని, గతంలో కలెక్టర్ ఆదేశాలతో భూముల వివరాల నివేదికను పంపామని చెప్పారు. అటవీ భూములను ల్యాండ్ కన్వర్షన్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరని తెలిపారు.