అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్నారై మహిళ మృతి
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొని శెట్టిపల్లి సుష్మ అనే ఎన్నారై మహిళ (32), ఆమె రెండేళ్ల కుమారుడు మహీధర్ అక్కడికక్కడే మరణించారు. ఆమె భర్త తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టాడుతున్నాడు. శెట్టిపల్లి రత్నాకర్ కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు కలిసి షికాగో, సెయింట్ లూయిస్ మీదుగా ప్లానోకు వెళ్తున్నప్పుడు ఎదురుగా రాంగ్ రూటులో వచ్చిన మరో వాహనం వీళ్ల వ్యానును ఢీకొంది.
వ్యానులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగే సమయానికి శెట్టిపల్లి సుష్మ వ్యాను నడుపుతున్నట్లు తెలిసింది. వ్యానులో ఉన్న మిగిలిన ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లకు పలు చోట్ల ఫ్రాక్చర్లు అయినట్లు తెలుస్తోంది. సెయింట్ లూయిస్లోని మెర్సి హాస్పిటల్లో వారు చికిత్స పొందుతున్నారు. కాగా, ఎదురుగా రాంగ్ రూటులో వచ్చిన వాహనం డ్రైవర్ కూడా ఈ ప్రమాదంలో మరణించాడు.