మెసేజ్లు పెట్టి... ఉరితాడుకు వేలాడాడు
ఎస్వీయూ ఉద్యోగి మరణశాసనం
ఆత్మహత్య చేసుకోవాలని ముందురోజే నిర్ణయం
స్నేహితులకు ఎస్ఎంఎస్
యూనివర్సిటీక్యాంపస్ (తిరుపతి): తనను వదిలి పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ భర్త ప్రేమికుల దినోత్సవం రోజునే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదీ తన డెత్డేట్ అంటూ స్నేహితులకు మెసేజ్లు పంపించి మరీ ఉరితాడుకు వేలాడాడు. చనిపోయే ముందు జనన, మరణ తేదీలు, ఉరితాడుతో వాట్సప్ ప్రొఫైల్ పిక్చర్ తయారు చేసి అందరికి షేర్ చేశాడు. మెసేజ్ చూసి ఇంటికి రావాలని.. ఇది చివరి కోరిక అని అందులో పేర్కొన్నాడు. కుటుంబ సభ్యులు రావడానికి వీలుగా ముందురోజే ఫ్లైట్ టికెట్లు కూడా తీశాడు. మంగళవారం తిరుపతిలో జరిగిన ఈ విషాదాంతం వివరాలిలా ఉన్నాయి.
ఎస్వీయూ వీసీ చాంబర్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎన్.శ్రీహరి 2006లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరాడు. బీటెక్ చదివిన శ్రీహరికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటంతో, 2015 అక్టోబర్లో వీసీ దామోదరం పీఏగా నియమించుకున్నారు. శ్రీహరికి ఆరు సంవత్సరాల క్రితం నెల్లూరుకు చెందిన విద్యాలతతో వివాహమైంది. కొంతకాలం తిరుపతిలోని ఎస్వీనగర్లో నివాసం ఉండేవారు. వీసీ పీఏగా నియమితులయ్యాక రెడ్బిల్డింగ్ క్వార్టర్స్లోని హౌస్ నెంబర్ 42కు షిఫ్ట్ అయ్యారు. పెళ్లి అయి ఆరు సంవత్సరాలైనా పిల్లలు లేకపోవడంతో నిత్యం భార్య భర్తలు గొడవలు పడేవారని సన్నిహితులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆరు నెలల క్రితం విద్యాలత పుట్టింటికి వెళ్లి పోయింది. మళ్లీ తిరిగిరాలేదు. అప్పటి నుంచి బాధ పడుతూ వచ్చిన శ్రీహరి మంగళవారం తనువు చాలించాడని వారు తెలిపారు. శ్రీహరి ఆత్మహత్మకు ముందు వాట్సప్లో డిస్ప్లే పిక్చర్లో పుట్టిన తేదీ.. మరణించిన తేదీ అని, ఫోటోల మధ్యలో ఉరితాడు పెట్టి పిక్చర్ తయారు చేశాడు. కొంత మంది మిత్రులకు ఫోస్ట్ చేశాడు. హైదరాబాద్ లో ఉన్న తమ్ముడు, చిన్నాన్నకు మంగళవారం తిరుపతికి రావడానికి వీలుగా ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు. మెసేజ్కు స్పందించి శ్రీహరి ఇంటికి చేరిన మిత్రులకు ఉరితాడుపై వేలాడుతూ కన్పించాడు.
పలువురి సంతాపం
ఎస్వీయూ వీసీ దామోదరం, రెక్టార్ భాస్కర్, రిజిస్టార్ దేవరాజులు, పాలకమండలి సభ్యుడు గురుప్రసాద్, నాన్టీచింగ్ అసోసియేషన్ అధ్య క్షుడు పీకే సుబ్రమణ్యం శ్రీహరి మృత దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.