గాంధీలో స్వైన్ఫ్లూ లక్షణాలతో ఒకరి మృతి
హైదరాబాద్: స్వైన్ఫ్లూ లక్షణాలతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఒకరు మృతిచెందారు. మరో ఆరుగురు స్వైన్ఫ్లూ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. నల్లగొండ జిల్లా కందుకూరు గ్రామానికి చెందిన లక్ష్మయ్య(32) చలిజ్వరంతో స్థానిక ఆస్పత్రిలో చేరాడు. స్వైన్ఫ్లూ లక్షణాలు కనిపించడంతో ఆదివారం గాంధీ ఆస్పత్రిలో చేరాడు. నమూనాలు సేకరించి నిర్ధారణ పరీక్షలకు పంపగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. స్వైన్ఫ్లూ లక్షణాలతో పీఐసీయు వార్డులో ముగ్గురు చిన్నారు లు, డిజాస్టర్వార్డులో మరో ముగ్గురి నుంచి నమూనాలు సేకరించి నిర్ధారణ పరీక్షల కు పంపి, వైద్యం అందిస్తున్నామని గాంధీ సూపరింటెండెంట్ జేవీరెడ్డి తెలిపారు.
గాంధీలో భయాందోళనలు...: స్వైన్ఫ్లూ విజృభించడం, గడిచిన 23 రోజుల్లో గాంధీలో ఐదుగురు మృతిచెందడంతో రోగులు, రోగి సహాయకులు, వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. లక్షణాలున్న వారితోపాటు స్వైన్ఫ్లూ రోగుల వార్డులో విధులు నిర్వహించేందుకు సిబ్బంది విముఖత వ్యక్తం చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ను అందుబాటులోకి తేవాలని వైద్యులు, సిబ్బంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా, సిబ్బంది, వైద్యులు, వైద్య విద్యార్థులు మాస్క్లు ధరించి విధులకు హాజరవుతున్నారు.