అమ్మ నిర్ణయం: తమిళనాడులో కీలక పరిణామం
చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత సుదీర్ఘకాలం ఆసుపత్రిలోనే ఉండాల్సిన నేపథ్యంలో పరిపాలనను సంబంధించి తమిళనాడులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు సీఎం జయలలిత నిర్వహించిన శాఖలన్నింటినీ ఆమె నమ్మిన బంటు, ఆర్థిక మంత్రి అయిన పన్నీర్ సెల్వంకు అప్పగించారు. ఈ మేరకు రాజ్ భవన్ మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. (సీఎంపై ట్విట్టర్లో భారీగా ప్రచారం)
గత 18 రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం జయలలిత.. సోమవారం నాటికి కొద్దిగా కోలుకున్నారని వైద్యులు ప్రకటించారు. తన శాఖలను పన్నీర్ సెల్వంకు అప్పగించాలనే నిర్ణయం కూడా అమ్మదేనని తెలిసింది. రాజ్యాంగంలోని 166వ ఆర్టికల్ క్లాజ్ నెంబర్ -3 ను అనుసరిస్తూ ముఖ్యమంత్రి శాఖలను ఆర్థిక మంత్రికి అప్పగించడంతో పాటు కేబినేట్ సమావేశాలను నిర్వహించే బాధ్యతలను అప్పగిస్తున్నట్లు రాజ్ భవన్ ప్రకటనలో తెలిపింది. (జయ పోరాట యోధురాలు)
సీఎం జయలలిత.. కీలకమైన హోం శాఖతోపాటు రెవెన్యూ, సాధారణ పరిపాలన, ప్రజా సంబంధాల శాఖలను తన వద్దే ఉంచుకుని నిర్వహిస్తున్నారు. అయితే సెప్టెంబర్ మూడో వారం నుంచి ఆమె ఆసుపత్రికే పరిమితమైపోవడంతో పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం తలెత్తుతున్నది. ఒక దశలో డిప్యూటీ సీఎం లేదా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని నియమిస్తారనే వార్తలు కూడా వినిపించాయి. (జయకు పాసివ్ ఫిజియోథెరపీ!) వీటన్నింటి నడుమ పన్నీర్ సెల్వంకు అదనపు బాధ్యతలు కట్టబెడుతున్నట్లు రాజ్ భవన్ ప్రకటించడంతో సస్సెన్స్ కు తెరపడింది. జయలలిత ఆరోగ్యం మెరుగుపడే వరకు పన్నీర్ సెల్వమే కీలక శాఖలను నిర్వహించాల్సి ఉంటుంది. (జయలలిత వారసుడిగా హీరో అజిత్ కుమార్!)