గ్రామీణ జర్నలిస్టులకూ హెల్త్కార్డులు
గజ్వేల్/నర్సాపూర్ రూరల్ : తెలంగాణలోని గ్రామీణ జర్నలిస్టులకు త్వరలోనే ప్రభుత్వం హెల్త్కార్డులు అందించనున్నదని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ వేగంగా జరుగుతోందని ప్రెస్ అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లం నారాయణ వెల్లడించారు. సోమవారం ఆయన గజ్వేల్, నర్సాపూర్లలో ఆయన పర్యటించారు. గజ్వేల్లోని శ్రీలక్ష్మీ గార్డెన్స్లో నిర్వహించిన టీయూడబ్ల్యూజే గజ్వేల్ నియోజకవర్గస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో టీజేఎఫ్ (తెలంగాణ జర్నలిస్టుల ఫోరం)గా 13 ఏళ్ల పాటు కీలకపాత్రను పోషించిన ఘనత ప్రస్తుత టీయూడబ్ల్యూజేదని చెప్పారు. తమ సంఘం ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి ఫలితంగా నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత కార్పొరేట్ విద్య అందుతుందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ పథకం అన్ని జిల్లాలకు వర్తిస్తుందని చెప్పారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతికిరణ్ మాట్లాడుతూ టీజేఎఫ్పై ఎన్నో రకాల కుట్రలు కొనసాగినా అధిగమించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేసినట్లు వెల్లడించారు.
సమావేశంలో గజ్వేల్ ఏరియా డెవలెప్మెంట్ అథారిటీ ఓఎస్డీ హనుమంతరావు, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ అరుణ, టీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా విభాగం అధ్యక్షులు రమణ, మెదక్ జిల్లా శాఖ అధ్యక్షులు విష్ణువర్దన్రెడ్డి, గౌరవాధ్యక్షులు జానకీరాం, ప్రధాన కార్యదర్శి యాదగిరి, కోశాధికారి మారుతీప్రసాద్, గజ్వేల్ నియోజకవర్గ బాధ్యులు ఉస్మాన్పఠాన్, నవీన్, మహిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమన్వయంతోనే సమస్యలు పరిష్కారం
జర్నలిస్టులంతా ఐక్యంగా ఉంటూ సమన్వయంతో సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సూచించారు. సోమవారం నర్సాపూర్ నియోజకవర్గ టీయూడబ్ల్యూజే సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ నర్సాపూర్లో ప్రెస్క్లబ్ ఏర్పాటును అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
టీయూడబ్ల్యూజే 2001 నుంచి 2014 తెలంగాణ వచ్చే వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొందన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాజమణి, ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న జర్నలిస్టులను ప్రభుత్వం మరిచిపోదన్నారు. అంతకు ముందు నర్సాపూర్ ప్రెస్క్లబ్ను అల్లం నారాయణ ప్రారంభించారు. నర్సాపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అల్లం నారాయణతో పాటు జెడ్పీ చైర్పర్సన్ రాజమణి , ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఇతర టీయుడబ్ల్యూజే రాష్ట్ర, జిల్లా నాయకులను మెమోంటో, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాం తికిరణ్, రమణ, వీ వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదగిరి, యోగానందరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మురళీయాదవ్, తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, టీయుడబ్ల్యూజే రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జీ భిక్షపతి, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.