ఏప్రిల్ 6న హెచ్సీయూ ముట్టడి
గచ్చిబౌలి : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జేఏసీ ఏప్రిల్ 6న ‘చలో హెచ్సీయూ’కు పిలుపునిచ్చింది. శనివారం హెచ్సీయూలో జేఏసీ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రోహిత్ వేముల ఆత్మహత్య, మార్చి 22న జరిగిన లాఠీ చార్జీ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలిసింది. మీడియా, ఇతర నాయకులు, ప్రముఖులను లోపలికి అనుమతించక పోవడంతో ఉద్యమం ఆశించిన స్థాయిలో జరగడం లేదని జేఏసీ అభిప్రాయపడినట్లు సమాచారం.
ఈ క్రమంలో యూనివర్సిటీ ప్రధాన ద్వారం ముందు నిరసన తెలపాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే 6న చలో హెచ్సీయూకు పిలుపునిచ్చింది. దేశంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు చలో హెచ్సీయూకు తరలిరావాలని కోరింది. పది వేల మంది విద్యార్థులతో హెచ్సీయూను ముట్టడించన్నుట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు.