వాహనాలకు రెట్టింపు పోటు
అరసవల్లి: రాష్ట్ర విభజన ప్రభావం రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పన్ను భారం రెట్టింపు కావడంతో వాహన యజమానులతోపాటు ప్రయాణికులు, సరుకు రవాణాపై పెను భారం పడుతోంది. రాష్ట్రం విడిపోయిన రోజు.. అంటే జూన్ రెండో తేదీకి ముందు రిజిస్ట్రేషన్ చే యించుకున్న వాహనాలకు రెండు రాష్ట్రాల్లో నూ ఒకే పన్నుతో తిరిగే వెసులుబాటు ఉన్నా.. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాహనాలకు మాత్రం ఆంధ్ర, తెలంగాణల్లో తిరగాలంటే రెండు రాష్ట్రాల్లోనూ వేర్వేరుగా పన్ను చెల్లించాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఎక్కడికెళ్లాలన్నా ఒకే పన్ను చలానాతో సరి పోయేది. ఇప్పుడు అదే చలానాతో కొత్త ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లోనే తిరిగేం దుకు అనుమతి ఉంది.
తెలంగాణ భూభాగంలోకి ప్రవేశించాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లీ పన్ను కట్టాల్సిందే. అలాగే జూన్ రెండో తేదీ తర్వాత కొనుగోలు చేసిన ఏ వాహనాన్నయినా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటే పోలీస్ క్లియరెన్స్ తప్పని సరి. ఉదాహరణకు గతంలోశ్రీకాకుళం జిల్లాలో కొన్న వాహనాన్ని ఏదైనా తెలంగాణ జిల్లాకు బదిలీ చేయాలంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ సరిపోయేది. కొత్త నిబంధనల ప్రకారం ఆ సర్టిఫికెట్తోపాటు వాహనంపై ఏ విధమైన కేసులు లేవని ధ్రువీకరిస్తూ పోలీసులు ఇచ్చే క్లియరెన్స్ సరిఫికెట్ జత చేయాల్సి ఉంటుంది. జూన్ 2వ తేదీకి ముందు కొన్న వాహనాలకు ఈ కొత్త నిబంధన వర్తించదు.
సొంత వాహనదారులకు ఇబ్బందులు ఈ ఏడాది జూన్ రెండు తర్వాత మోటారు సైకిళ్లు, కార్లు తదితర వ్యక్తిగత వాహనాలను ఏ రాష్ట్రంలో కొంటే అక్కడే లైఫ్ ట్యాక్స్ చెల్లిం చాలి. అయితే ఆ వాహనాలు రెండో రాష్ట్రంలోకి వెళ్లి, అక్కడ నెల రోజులకు మించి ఉంటే మాత్రం అక్కడ మళ్లీ లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన పాటించకుండా తిరిగే వాహనాలపై భారీగా జరిమానాలు వడ్డిస్తారు. మోటారు సైకిల్పై 9 శాతం, కార్లు ఇతర తేలికపాటి వాహనాలపై 12 శాతం జరి మానా వసూలు చేస్తారు.
ప్రైవేటు బస్సులకు భారం
రాష్ట్ర విభజన తో రవాణా శాఖ కూడా రెం డుగా విడిపోయింది. ఈ ప్రభావం వాణి జ్య వాహనాలు, ప్రైవేటు బస్సులపై తీవ్రం గా పడింది. రాష్ట్ర పర్మిట్పై తిరిగే ప్రైవేట్ బస్సుల యజమానులు ఇంతకు ముందు ప్రతి మూడు నెలలకు ఒక్కో సీటుకు రూ.3,675 చొప్పున పన్ను చెల్లించేవారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ అంతే మొత్తం చొప్పున కట్టాల్సి వస్తోంది. అంటే ఒక్కో సీటుకు మూడు నెలలకు రూ.7,350 చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారాన్నంతా ప్రైవేట్ ఆపరేటర్లు సహజంగా ప్రయాణికులపైనే మోపుతారు. ఆర్టీసీ బస్సులకు ఏడాదిపాటు ఇప్పుడున్న పర్మిట్లతో రాష్ట్రాల్లో తిరిగే వెసులుబాటు కల్పించినా.. వాటి కాలపరిమితి తీరిన తర్వాత రెండు రాష్ట్రాల్లో తిరగాలంటే వేర్వేరుగా పర్మిట్లు తీసుకోకతప్పదు.
వాణిజ్య వాహనాలదీ ఇదే పరిస్థితి
జూన్ రెండో తేదీకి ముందు పర్మిట్ తీసుకున్న వాణిజ్య వాహనాలకు పర్మిట్ కాలపరిమితి పూర్తియ్యేవరకు రెండు రాష్ట్రాలోనూ తిరిగే అవశాం కల్పిం చారు. ఆ తర్వాత మాత్రం రెండు రాష్ట్రాల్లో తిరగాలం టే వేర్వేరు పర్మిట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని లారీ యజమానులు వ్యతిరేకిస్తున్నారు. రవాణా రంగం సంక్షోభంలో ఉన్నందున రెండు చోట్లా పన్న చెల్లించడం భారమవుతుందని వాహన యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.