370 కిలోల గంజాయి స్వాధీనం
12 మంది అరెస్టు
మాడుగుల, గొలుగొండ, హుకుంపేట మండలాల్లో పోలీసులు 370 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మాడుగుల మండలంలో ఇద్దర్ని, గొలగొండ మండలంలో నలుగుర్ని, పెదబయలు మండలంలో ఆరుగుర్ని అరెస్టు చేశారు.
మాడుగుల : విశాఖ ఎన్ ఫోర్స్మెంట్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించి, 310 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్ ఫోర్స్మెంట్ సీఐ సీవీవీఎస్ ప్రసాద్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నా యి. ముందస్తు సమాచారం మేరకు దాడులు జరిపి, ఆటోలో తరలిస్తున్న 310 కిలోల గంజాయిని ముకుందపురం వద్ద స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎస్.దుర్గ, కాళ్ల వెంకట మాలిబాబును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని స్థానిక ఎక్సైజ్ స్టేషన్కు తరలించినట్టు సీఐ ప్రసాద్ తెలిపారు.
గొలుగొండ: ఏజెన్సీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న 40 కిలోల గంజాయిని శనివారం గొలుగొండ పోలీసులు పాలకపాడు ప్రాంతాలలో పట్టుకున్నారు. ఎస్ఐ ఉమామహేశ్వరరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కారులో 40 కిలోల గంజాయిని తరలిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు దాడిచే శారు. బీహార్కు చెందిన ఎం.ఆలీమ్, సీలేరుకు చెందిన భద్ర, బిస్మమ్, గణేష్ అనే నలుగుర్ని అరెస్టు చేసి, కోర్టుకు తరలించినట్టు ఎస్ఐ చెప్పారు. వీరి వద్ద నుంచి కారు, బైక్, నాలుగు సెల్ఫోన్లు, రూ.40 నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో ఏఎస్ఐ కేశవరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
హుకుంపేట: పెదబయలు మండలంలోని మారుమూల ప్రాంతం నుంచి హుకుంపేట మీదుగా అరకులోయ ప్రాంతానికి ఆటోలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని హుకుంపేట పోలీసులు శనివారం పట్టుకున్నారు. కొంతిలి సమీపంలోని రోడ్డు వద్ద హుకుంపేట ఎస్ఐ బొండా నాగకార్తీక్, సిబ్బంది శనివారం వాహనాలను తనిఖీ చేశారు. ఆ సమయం లో మఠం ప్రాంతం నుంచి వస్తున్న ఆటోను తనిఖీ చేయగా 30 కిలోల గంజాయి బయటపడింది. ఆటోను సీజ్ చేసి, మఠం గ్రామానికి చెందిన జన్ని భాస్కరరావు, అరకులోయకు చెందిన పి.కృపానందం, కొర్రా చిత్రు,బీహర్ రాష్ట్రానికి చెందిన చందన్ కుమార్, మిధున్ కుమార్, జగ్రనా«థ్ సాహూను అరెస్ట్ చేసి, విశాఖ సెంట్రల్ జైల్కు రిమాండ్కు తరలించారు.