మానసిక వికలాంగురాలిపై వీఆర్ఓ గ్యాంగ్రేప్
మానసిక విలాంగురాలిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో వీఆర్ఓతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో మార్చిలో జరిగిన ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముచ్చింతల్ గ్రామానికి చెందిన ఓ యువతి (23) ఇంటి వద్దనే ఉంటుంది. అయితే పొరుగింటికి చెందిన వీఆర్వో చంద్రమోహన్తో పాటు అదే గ్రామానికి చెందిన మహేందర్, శేఖర్, ఓ తోటలో పనిచేసే జిత్తు తనపై అత్యాచారం చేశారని యువతి రెండు రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించింది.
మార్చి నెలలో చంద్రమోహన్ తన ఇంట్లోకి పిలువగా నలుగురూ కలిసి తనపై లైంగిక దాడికి పాల్పడి.. అనంతరం స్నానం చేయించి తనను బయటకు పంపేశారని పేర్కొంది. దీంతో పోలీసులు అనుమానితులను అదే రోజు ఠాణాకు పిలిపించి విచారించారు. బాధితురాలి నుంచి ఆదివారం సాయంత్రం వరకు రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదూ అందకపోవడంతో పోలీసులు దర్యాప్తును కొనసాగించలేదు. మరోసారి బాధితురాలు ఆదివారం స్టేషన్కు రాగా.. రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆదివారం బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై అట్రాసిటీ, అత్యాచారం కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ ఉమామహేశ్వర్రావు తెలియజేశారు. బాధితురాలికి మతిస్థిమితం సరిగా లేదని, ఆమె మానసిక విలాంగురాలని పోలీసులు అన్నారు.