ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా
మహబూబ్ నగర్ (నాగర్కర్నూల్) : ప్రేమించి పెళ్ళి చేసుకుని మోసగించిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా నాగర్కర్నూల్ మండలంలోని వనపట్లలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని వనపట్లకు చెందిన దొడ్ల రాజవర్ధన్ రెడ్డి 2003లో జిల్లా కేంధ్రంలోని అంబేద్కర్నగర్లో సుక్కల లక్ష్మణ్ ఇంట్లో అద్దెకు వుంటూ అక్కడే రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించాడు . కాగా టీటీసీ చదువుతున్న లక్ష్మణ్ కూతురు సుక్కల రాధికతో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఆమెతో శారీరక సంబంధం ఏర్పరచుకుని కొన్నాళ్ల తర్వాత రహస్య వివాహం చేసుకున్నాడు. అయితే విషయం వనపట్లలోని రాజవర్ధన్ రెడ్డి ఇంట్లో తెలియడంతో తల్లి,తండ్రులు వివాహాన్ని నిరాకరించడంతో రాధికను దూరం పెట్టాలని భావించాడు.
ఇరువురు రాసుకున్న ప్రేమలేఖలు, ఇరువురు కలసి తీయించుకున్న ఫోటోలను కాల్చివేయడంతో పాటు తన మెడలో కట్టిన తాళిని కూడా తెంపి కాల్చివేశాడని రాధిక తెలిపింది. 2006లో తనకు న్యాయం చేయాలని మహబూబ్నగర్లో ఎస్ఐ సైదులుకు ఫిర్యాదు ఇవ్వడంతో ఎస్ఐ రాజవర్ధన్ రెడ్డిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తానని చెప్పి తనతో ఎఫ్ఐఆర్ రాయించుకుని తనకు సమాచారం ఇవ్వకుండా రాజవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించినట్లు తెలిపింది. ఈ విషయంపై జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అప్పటి నుంచి రాజవర్ధన్ రెడ్డి కనిపించకుండా తిరుగుతున్నట్లు వివరించింది. ఇతరుల ద్వారా గ్రామంలో ఉన్నట్లు సమాచారం తెలుసుకుని తనకు న్యాయం జరిగే వరకు ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేసేందుకు నిర్ణయించుకుని తల్లి విజయలక్ష్మి, తండ్రి లక్ష్మణ్తో కలిసి వనపట్లకు వచ్చినట్లు తెలిపింది. కాగా ఈ సమయంలో ప్రియుడు రాజవర్ధన్ రెడ్డి, అతని తల్లి ఇంట్లోనే ఉన్నారు. రాధిక మాత్రం తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఇంటి ముందు బైటాయించింది.