కోర్టులపై నమ్మకముంది.. జైహింద్- ఒవైసీ
హైదరాబాద్: గొంతు మీద కత్తిపెట్టినా.. భారతమాతకు జై అనను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరుసటి రోజే... జైహింద్ అనడం విశేషం. ఆయన వ్యాఖ్యలపై అహ్మదాబాద్ కోర్టులో ఆర్ఎస్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేసినట్టు వచ్చిన వార్తలపై ఓవైసీ పై విధంగా స్పందించారు. తనకు కోర్టులపై పూర్తి విశ్వాసముందని, తన వ్యాఖ్యలపై ఇప్పటి వరకూ ఎలాంటి కేసులు నమోదు అయినట్లు తన దృష్టికి రాలేదంటూ... జై హింద్ అన్నారు.
అటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలుపై లోక్సభలో చర్చ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై విరుచుకుపడ్డారు. భారతమాతకు వందనం చేయబోనని సిగ్గు లేకుండా మాట్లాడటం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మజ్లిస్ అధినేత వ్యాఖ్యలపై శివసేన ఘాటుగా స్పందించింది. 'భారత్ మాతా కీ జై’అని ఉచ్చరించకపోతే... తక్షణమే ఆయన పాకిస్థాన్ వెళ్లిపోవాలని మహారాష్ట్ర శివసేన అధికార ప్రతినిధి రాందాస్ కదమ్ ఘాటుగా విమర్శించారు,
కాగా నా గొంతులో కత్తి దిగేసినా భారత్ మాతాకీ జై అనను అన్న ఒవైసీ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రాజేశాయ. లాతూర్ లో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగించిన ఆయన కొత్త తరానికి భారత మాతను కీర్తిస్తూ నినాదాలు చేయడం నేర్పాలని ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భగవత్ సూచించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.