breaking news
poverty demolish
-
భారత్లో తగ్గిన పేదరికం! ఎలాగంటే..
భారత్లో గడిచిన దశాబ్దకాలంలో పేదరికం తగ్గుతుందని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచబ్యాంకు ఇటీవల విడుదల చేసిన ‘పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ ఆన్ ఇండియా’ రిపోర్ట్లో పేదరిక నిర్మూలనలో దేశం సాధించిన పురోగతిని హైలైట్ చేసింది. 2017 పీపీపీ(పర్చేజింగ్ పవర్ పారీటీ-కొనుగోలు శక్తి సమానత్వ సూచీ) నిబంధనల ప్రకారం రోజుకు 2.15 డాలర్ల కంటే తక్కువ ఆదాయం సంపాదిస్తున్నవారు ‘తీవ్ర పేదరికం’లో ఉన్నట్లు భావిస్తున్నారు. ఇటీవల ఆ సూచీని భారత్ గణనీయంగా అధిగమించినట్లు నివేదిక తెలుపుతుంది. 2011-12లో 16.2%గా ఉన్న తీవ్ర పేదరికం 2022-23 నాటికి కేవలం 2.3%కు పడిపోయిందని పేర్కొంది. ఈ మార్పు 17.1 కోట్ల మందిని తీవ్రమైన పేదరికం నుంచి దూరం చేసింది.పేదరిక నిర్మూలనకు కొన్ని ప్రధాన కారణాలుదేశంలో 80 కోట్లకు పైగా లబ్ధిదారులకు ఆహార ధాన్యాలను విస్తృతంగా పంపిణీ చేయడం వంటి ఆహార భద్రత కార్యక్రమాలు ఇందులో కీలక పాత్ర పోషించాయి. జన్ ధన్ యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, రాష్ట్ర స్థాయి సంక్షేమ పథకాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్స్ (డీబీటీలు) ద్వారా ప్రజలకు సహాయం అందింది. 2022-23, 2023-24 సంవత్సరాలకుగాను గృహ వినియోగదారుల వ్యయ సర్వేల్లో (హెచ్సీఈఎస్) ఉపయోగించిన కొత్త పద్ధతులు పేదరిక గణాంకాలను మరింత కచ్చితంగా తెలియజేశాయి.తీవ్ర పేదరికానికి అతీతంగా..తక్కువ, మధ్య ఆదాయ దేశంలో పేదరికాన్ని కొలిచేందుకు రోజుకు 3.65 డాలర్ల (పీపీపీ) సంపాదనను బెంచ్మార్క్గా తీసుకుంటారు. దీన్ని పరిగణలోకి తీసుకుంటే భారత్లో 2011-12లో 61.8 శాతంగా ఉన్న పేదరికం 2022-23 నాటికి 28.1 శాతానికి పడిపోయింది. ఈ దశాబ్దంలో 37.8 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.అసమానతలు..వినియోగ ఆధారిత అసమానతలు తగ్గినప్పటికీ, దేశంలో ఆదాయ అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2023-24లో సంపాదనలో దిగువన ఉన్న 10% ప్రజల కంటే టాప్లో నిలిచిన 10% మంది 13 రెట్లు అధికంగా సొమ్ము కూడగట్టుకున్నారు. పట్టణ-గ్రామీణ వినియోగంలో వ్యత్యాసం 2011-12లో 84% నుంచి 2023-24 నాటికి 70%కి తగ్గింది. అయినప్పటికీ గణనీయమైన అసమానతలు కొనసాగుతున్నాయి. దేశంలో పేదరికాన్ని కట్టడి చేసేందుకు ‘ఉచితాలు’ లేదా సంక్షేమ పథకాల్లోని అంశాలను మరింత విశ్లేషించాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: వడ్డీ రేట్ల తగ్గింపు.. లాభామా? నష్టమా?పరిష్కారాలుదేశంలో పేదరికాన్ని తగ్గించడానికి సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే ఆర్థిక అసమానతల మూల కారణాలను పరిష్కరించాలని నిపుణులు చెబుతున్నారు. అందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటి ప్రకారం.. తయారీ, వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానం వంటి పరిశ్రమలను ప్రోత్సహించి మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించాలి. రుణాలు, సబ్సిడీలు, టెక్నాలజీ అప్గ్రేడ్ల ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ ఎంఈ) మద్దతు ఇవ్వాలి. నాణ్యమైన విద్యను విస్తరించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వేతనంతో కూడిన ఉద్యోగాల కోసం వ్యక్తులకు తగిన నైపుణ్యాలు అందించాలి. శిశుసంరక్షణ సౌకర్యాలు, సురక్షితమైన పనివాతావరణాలు, ఆర్థిక స్వాతంత్ర్య కార్యక్రమాలను అందించడం ద్వారా శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. -
Sakshi Excellence Awards: ఈ అవార్డు మాలో మరింత బాధ్యతను పెంచింది
Sakshi Excellence Awards: హైదరాబాద్లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘ఎక్స్లెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్’ అవార్డును నాంది ఫౌండేషన్ ఫైనాన్స్ మేనేజర్ కె సతీష్ కుమార్ అందుకున్నారు. పేదరికాన్ని నిర్మూలించడానికి నిస్వార్థంగా ఆవిర్భవించినదే.. ‘నాంది’ ఫౌండేషన్. ఎ.పి., తెలంగాణతో సహా దేశంలోని 17 రాష్ట్రాలలో ఇంతవరకు 70 లక్షల మంది జీవితాల్లో మార్పు తెచ్చిన ‘నాంది’ 1998లో హైదరాబాద్లో ఆవిర్భవించింది. పేదరికాన్ని నిర్మూలించే ఒక శక్తిగా అవతరించింది. ఆదివాసీ వ్యవసాయదారులకు చేయూతనిచ్చి, వారితో చేతులు కలిపి లక్ష మందిని దారిద్య్రరేఖ దిగువ నుంచి ఎగువకు తెచ్చింది. ‘అరకు కాఫీ’తో దేశానికి బ్రాండ్ ఇమేజ్ తెచ్చింది. అల్పాదాయ కుటుంబాల్లోని 4 లక్షల మంది బాలికలకు విద్యను అందించింది. బాధ్యత పెంచింది సాక్షి మీడియా గ్రూప్కు, న్యాయ నిర్ణేతల బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అవార్డు మాలో మరింత బాధ్యతను పెంచింది. పాఠశాల విద్యార్ధుల కోసం మేం చేస్తున్న కృషి ఫలాలు మరింత మందికి అందాలని కోరుకుంటున్నాం. – కె. సతీష్ కుమార్, ఆరకు ఫైనాన్స్ మేనేజర్ -
‘హోదా’ హిమాచల్ వృద్ధి పథం
అభివృద్ధిలో అట్టడుగునున్న పర్వత రాష్ట్రం ప్రత్యేక హోదాతో శరవేగంగా వృద్ధి చెందింది. కేంద్ర నిధులు వెల్లువెత్తాయి. ప్రత్యేకించి వాటిలో 90 శాతం గ్రాంటు కావడం సంజీవనిలా పని చేసింది. దీంతో హిమాచల్ ముఖచిత్రమే మారిపోయింది. పన్నెండేళ్ల కిందటి ఆపిల్ రాష్ట్రం పారిశ్రామిక రాష్ట్రమైంది. పెద్ద ఎత్తున విద్య, ఉద్యోగ అవకాశాలు ఏర్పడి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. మానవాభివృద్ధిలో అది దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. పేదరిక నిర్మూలనలో, అక్షరాస్యతలో, సంతులిత వృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. హిమాచల్ప్రదేశ్ 1971లో పంజాబ్ నుంచి విడిపోయిన తరువాత అనాథలా మిగిలింది. ప్రధానంగా పర్వతప్రాంతంగా ఉండి, చదునైన నేల లేని ఆ రాష్ట్రాభివృద్ధి అసాధ్యమేమోనని ఆనాడు అనినిపించింది. వనరులు పరిమితం, పైగా ఎక్కడికి వెళ్లాలన్నా సరైన రోడ్డు మార్గమే లేని దుస్థితి. జనసాంద్రత అతి తక్కువగా ఉన్న (చదరపు కిలోమీటరుకు 123 మంది) ఆ రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తలు కన్నెత్తిచూడని పరిస్థితి. పారిశ్రామిక వాడలు, రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధికి, ప్రోత్సాహకాలు, రాయితీలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తగినన్ని ఆర్థికవనరులు లేవు. దీంతో హిమాచల్ అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచింది. విద్య, వైద్యం, రవాణా, పారిశ్రామికరంగాల్లో అట్టడుగు స్థాయికి చేరింది. హిమాచల్ అంటే ఆపిల్ పళ్లు అని తప్ప మరేమీ చెప్పుకోలేని పరిస్థితి. కానీ నేడది సగర్వంగా మానవాభివృద్ధిలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. పేదరిక నిర్మూలనలో దేశంలోనే ప్రథమస్థానంలో ఉందని ప్రపంచ బ్యాంక్ ప్రశంసలను అందుకుంటోంది. రోడ్లు, తదితర మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, విద్య, వైద్యం తదితర అన్ని రంగాల్లోనూ శరవేగంగా వృద్ధి చెందుతోంది. పైగా తలసరి ఆదాయంలో జాతీయ స్థాయినే (రూ.88,538) అధిగమించి రూ.1,04,943 తలసరి ఆదాయాన్ని నమోదు చేసింది. ఇదంతా నాలుగున్నర దశాబ్దాలలో సాధించిన అభివృద్ధి అనుకుంటే పొరపాటు. కేవలం పన్నెండేళ్లలో జరిగిన అద్భుతం. ప్రత్యేక హోదా సృష్టించిన అద్భుతం. మంత్ర దండంగా మారిన ప్రత్యేక హోదా 2003లో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం హిమాచల్ప్రదేశ్ ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను గుర్తించి ఉత్తరాఖండ్తోపాటు దానికి కూడా ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించింది. దీంతో హిమాచల్ దశ, దిశా మారాయి. అభివృద్ధిలో అట్టడుగున నిలిచిన పర్వత రాష్ట్రం ప్రత్యేకహోదాతో రాకెట్లా దూసుకుపోవడం ప్రారంభించింది. హోదా రావడంతోనే నిత్య వనరుల కొరతకు మారుపేరైన ఆ రాష్ట్రానికి కేంద్ర నిధులు వెల్లువెత్తాయి. ప్రత్యేకించి ప్రత్యేక హోదావల్ల కేంద్ర నిధుల్లో 90 శాతం గ్రాంటుగా లభించడం సంజీవనిలాగా పనిచేసింది. రూ.36,000 కోట్లకు పైగా వచ్చిన గ్రాంట్ల నిధులతో భారీస్థాయిలో మౌలికసదుపాయాల నిర్మాణం చేపట్టారు. పట్టణాలకే సరైన రోడ్లు లేని రాష్ట్రంలో ఎక్కడో కొండకోనల్లోని గ్రామాలకు సైతం రోడ్డు రవాణా సదుపాయాలు విస్తరించాయి. బయటి ప్రపంచంతో హిమాచల్కు, ప్రత్యేకించి రైతాంగానికి, సంబంధాలు పెరిగాయి. విద్య, వైద్యసదుపాయాలను వినియోగించుకునే అవకాశం ప్రజలకు కలిగింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సైతం కేంద్రం 90 శాతం నిధులను సమకూరిస్తే, రాష్ట్రం 10 శాతం మాత్రమే భరించేది. 12వ ఆర్థిక సంఘం 2005 నుంచి 2010 వరకు హిమాచల్కు రూ.14,450 కోట్ల గ్రాంట్లు విడుదల చేయగా, 2010 నుంచి 15 వరకు 13వ ఆర్థిక సంఘం రూ.21,691 కోట్ల గ్రాంట్లను సిఫారసు చేసింది. వీటితో పాటు ఈఏపీ (ఎక్సటర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్) నిధుల కింద బయట నుంచి వరల్డ్ బ్యాంకు లాంటి సంస్థల నుంచి రుణాలు తీసుకునే అవకాశం లభించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది పథకాల కోసం ఈఏపీ కింద రూ.12,040 కోట్ల రూపాయలు సమ కూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో లక్ష్యంగా నిర్దేశించుకుంది. శరవేగంతో పారిశ్రామిక వృద్ధి కేవలం 64 లక్షల జనాభా (2003 నాటికి) ఉన్న హిమాచల్ ప్రత్యేక హోదా రావడంతోనే పారిశ్రామిక ప్యాకేజీలను, రాయితీల వరాలను కురిపించింది. దీంతో రూ.60 వేల కోట్ల మేరకు పారిశ్రామిక ఒప్పందాలు కుదిరి, ఆరు లక్షల ఉద్యోగవకాశాలకు భరోసానిచ్చాయి. వాటిల్లో రూ.16,533 కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు ఇప్పటికే ప్రారంభం కాగా, మూడు లక్షల మందికిపైగా ఉద్యోగాలు దొరికాయి. మరో లక్ష మందికి పరోక్షంగా ఉపాధి లభించింది. అందువల్లనే హిమాచల్ తలసరి ఆదాయం జాతీయ సగటును మించిపోయింది. 40 వేలకుపైగా పరిశ్రమలతో పారిశ్రామికరంగంలో ముందుకు దూసుకుపోతోంది. వాటిలో 90 శాతం 2003 తర్వాత ఏర్పడ్డవి! పదేళ్లపాటు ఎక్సైజ్ డ్యూటీ 100 శాతం మినహాయింపు, ఆదాయపు పన్ను మినహాయింపుతో పాటు రూ.30 లక్షల వరకు కేంద్రం సబ్సిడీలు అందించింది. ప్రత్యేక హోదా పారిశ్రామికవేత్తలకు స్పెషల్ టానిక్గా పని చేసింది. హోదా భరోసాతో రాష్ట్ర ప్రభుత్వం కూడా మరిన్ని ప్రోత్సాహకాలు అందజేసింది. చౌక ధరకే నిరంతర విద్యుత్, అత్యాధునిక సాకేతికతతో అభివృద్ధి చేసిన పారిశ్రామిక ప్రాంతాలు, స్నేహపూర్వక అధికార యంత్రాం గం, వాతావరణం ఉండటంతో ఫార్మా, టెక్స్టైల్స్, ఆపిల్, హెర్బల్స్, మెటల్ తదితర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఇక్కడి పరిశ్రమలు ఎదిగాయి. గత ఏడాది ఎగుమతుల టర్నోవర్ రూ.1,010 కోట్లని అంచనా. ఎగుమతులు, వస్తు తయారీ రంగాల ఫలితంగా రాష్ట్ర జీడీపీలో పారిశ్రామిక రంగం వాటా 17 శాతానికి పెరిగింది. పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలిరావడంతో వాటి అవసరాలకు తగిన మానవ వనరులను సిద్ధం చేయడం ఆవశ్యకమైంది. ఫార్మా కంపెనీల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం 14 కొత్త విద్యా సంస్థలను నెలకొల్పి, డిప్లొమా, డిగ్రీ ఫార్మా కోర్సులను రూపొందించి విద్యార్థులకు శిక్షణనిస్తోంది. అలాగే ఇంజనీరింగ్, ఐటీఐ కాలేజీలను ఏర్పాటు చేసింది. పారిశ్రామికీకరణ తొలినాళ్లలో వివిధ సంస్థలు ఇతర రాష్ట్రాల వారిని ఉద్యోగాల్లోకి తీసుకోక తప్పలేదు. ఇప్పుడు హిమాచల్ విద్యార్థులే అక్కడి పరిశ్రమలకు అవసరమైన వివిధ రకాల నైపుణ్యాలను కలిగిన ఉత్తమ మానవ వనరుల వనరుగా మారారు. ఉద్యోగావకాశాలూ విస్తృతంగా లభిస్తున్నాయి. ప్రత్యేక హోదాకు ముందు - తర్వాత ప్రత్యేకహోదాతో వచ్చిన ప్యాకేజీతో పారిశ్రామిక రంగంలో హిమాచల్ప్రదేశ్ అత్యధికంగా 20.15 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. కాగా ఉత్తరాఖండ్ 18.28 శాతం, జమ్మూకశ్మీర్ 11.20 శాతం వృద్ధిని సాధించగలిగాయి. ఇదే సమయంలో హర్యానా 3.77 శాతం, యూపీ 5.48 శాతం, పంజాబ్ 7.8 శాతం మాత్రమే వృద్ధి సాధించగలిగాయి. జాతీయ వృద్ధిరేటు కేవలం 6.49 శాతమే! ప్రత్యేకహోదాతో లభించే ప్యాకేజీ ప్రభావం ఎలాంటిదో దీన్నిబట్టి సులభంగానే అంచనా వేయొచ్చు. ఇక పారిశ్రామికరంగంలో కూడా ఇదే వృద్ధి కనిపించింది. ఆదర్శంగా మారుతున్న నిన్నటి ఆపిల్ రాష్ట్రం ప్రత్యేక హోదాతో హిమాచల్ ముఖ చిత్రమే మారిపోయింది. పన్నెండేళ్ల కిందటి ఆపిల్ రాష్ట్రం ఇప్పుడు పారిశ్రామిక రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది. పారిశ్రామికీకరణ ఫలితంగా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడడంతో ప్రజల జీవనప్రమాణాలు మెరగయ్యాయి. ప్రత్యేక హోదాకు ముందు మానవాభివృద్ధిలో ఎనిమిదో స్థానంలో నిలబడిన హిమాచల్ ఆ తర్వాత జరిగిన అభివృద్ధితో మూడో స్థానానికి ఎగబాకింది. సమ్మిళిత అభివృద్ధి, ఆదాయపంపిణీతో ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటు లోకి వచ్చాయి. అన్ని ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం ఏర్పడడంతో రవాణా, విద్య, వైద్య సేవలు అందుకునేందుకు ప్రజలకు వీలుకలిగింది. మాతా,శిశు మరణాలు తగ్గాయి. పిల్లలందరికీ టీకాలు వేయించగలిగారు. మధ్యలో బడి మానివేసే విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గింది. అక్షరాస్యతలో కేరళ తర్వాత హిమాచల్ రెండో స్థానంలో నిలిచింది. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు హిమా చల్కు తరలివచ్చాయి. వందలాదిగా కొత్త ఐటీఐలు ఏర్పడ్డాయి. ‘స్కేలింగ్ ది హైట్స్’ అనే పేరుతో వరల్డ్ బ్యాంకు విడుదల చేసిన తాజా నివేదిక హిమా చల్ అభివృద్ధిని ప్రశంసించింది. 1993లో 36.8 శాతంగా ఉన్న పేదరికం ప్రస్తుతం 8.5 శాతానికి తగ్గింది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో పేదరిక నిర్మూలన జరగలేదని వరల్డ్ బ్యాంకు పేర్కొంది. ఈ స్థాయి పేదరిక నిర్మూలనకు ప్రత్యేక హోదా, దానివల్ల జరిగిన పారిశ్రామికాభివృద్ధే కారణం. ఆర్థికవృద్ధిని, మానవాభివృద్ధిని సమతూకంగా సాధించడమే కాదు, పర్యావరణానికి హాని కలగకుండా పారిశ్రామికీకరణ జరగడం మరొక రికార్డు. హిమాచల్ మహిళల్లో ఉపాధి 63 శాతం ఉండడం విశేషం. జాతీయ సగటు 27 శాతం! దీంతో కుటుంబాలన్నీ ఆర్థికంగా బలప డ్డాయి. మాతా, శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. జీవన ప్రమాణాలు మెరుగై సగటు జీవిత కాలం 3.4 సంవత్సరాల మేరకు పెరగడం విశేషం. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగు కావడంతో జీవన ప్రమాణాల స్థాయి పెరిగింది. ఈ మౌలిక సదుపాయలను కల్పించేందుకు అవసరమైన నిధులు కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదాతోనే సాధ్యమైంది. కేంద్రం నుంచి, బయటి సంస్థల నుంచి వచ్చిన గ్రాంట్లు, అదనపు నిధులతో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు రోడ్లు, విద్యుత్, వైద్యం, విద్య సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ హిమాచల్కు కొన్ని సవాళ్లు ఎదురువుతున్నాయి. నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణలోటు కారణంగా ఆయా రంగాల్లో యువతకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు సరైన విధాననిర్ణయాలు తీసుకోవాలని వరల్డ్బ్యాంకు నివేదిక సూచిస్తోంది. (సిమ్లా నుంచి ‘సాక్షి’ టీవీ ప్రిన్సిపల్ కరస్పాండెంట్) మొబైల్: 9911042464 - నాగిళ్ల వెంకటేశ్