breaking news
Rachakonda Viswanadha sastri
-
Rachakonda Viswanatha Sastry: అల్పజీవుల బుద్ధిజీవి
మామూలుగా రాయడం రావిశాస్త్రికి రాదు. వాక్యానికి ఏ అలంకరణ చేస్తే పాఠకుడు కళ్లు తిప్పుకోలేడో ఆయనకు తెలుసు. దాన్నే విమర్శకులు శైలి అంటారు. తెలుగు సాహిత్యంలో రావిశాస్త్రి శైలి ఒక మ్యాజిక్. అతి మామూలుగా రాసే ఒక పొట్టి వాక్యం కూడా ఆయన రాసినందువల్ల దానికి ప్రత్యేక ఆకర్షణ వస్తుంది. అలాంటి శైలిని అనుకరించాలని బోల్తాపడిన వాళ్లెందరో. అది అనితర సాధ్యం. ఆధునిక కాలపు గొప్ప రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి. అత్యంత వెనుకబాటుతనానికి గురైన ఉత్తరాంధ్ర నుండి వచ్చిన ఆయన, ఆ ప్రాంత భాషకు పట్టం కట్టారు. వృత్తిపరంగా న్యాయవాది అయినందువల్ల పిపీలికాలు, అల్పజీవుల తరపున మదోన్మత్త గజాల మీద పోరాడారు. జీవితాంతం అతిసామాన్యుని పక్షాన ఉండి, అసామాన్య సాహితీ సృజన చేసిన రాచకొండ విశ్వనాథ శాస్త్రి శత జయంతి నేడు. మొదటిసారి గురజాడ కన్యాశుల్కం చదివినప్పుడు, ఇది దేవతలు మాత్రమే రాయగలరు అని రావిశాస్త్రి అన్నాడు. రావిశాస్త్రి రచనలు మాత్రం దేవతలు కూడా రాయలేరు. ఎందుకంటే దేవతలు సిరిమంతులు, నీతిమంతులు, బలవంతులు వంటి మర్యాదస్తుల పక్షాన వుంటారు. రావిశాస్త్రి పాత్రల్ని ఆయనే సృష్టించగలడు. వారి భాషనీ, వారి తెగువనీ, వారి దైన్య హైన్య సాహసాలనీ రావిశాస్త్రి మాత్రమే రాయగలడు. రావి శాస్త్రి స్పెషాలిటీ కేవలం శైలి మాత్రమే కాదు. ఆయన గొప్పతనమంతా ప్రమాణాలను పటాపంచలు చేయడమే. మట్టిలోంచి కన్నీటిని పిండి అందులో కడిగిన పాత్రల్ని తీసి వారిని ఈ మానవ మాయాప్రపంచంతో యుద్ధం చేయడానికి సిద్ధం చేశాడు. ఒక కన్యాశుల్కాన్ని గురజాడ మాత్రమే రాయగలడు. ఒక మైదానం చలం మాత్రమే రాయగలడు. ఒక అల్పజీవిని రావిశాస్త్రి మాత్రమే రాయగలడు. ‘అల్పజీవి’ నుండి ‘ఆరు సారా కథలు’ మీదుగా ‘రాజు మహిషి’, ‘రత్తాలు రాంబాబు’ వంటి నవలలు దాకా రావిశాస్త్రి చేసిందల్లా తనలోని అద్భుతాన్ని అక్షరాల్లోకి అనువదించడమే. వచనాన్నీ, కవిత్వాన్నీ, వస్తువునీ... సమస్తాన్నీ కాలం మిక్సీలో వేసి తనకు మాత్రమే అబ్బిన వింత విద్యతో... సత్యాసత్య సంఘర్షణల అద్భుతాలను వెలికి తీసి, తన కాలపు రంగస్థలం మీద గెంతులేయించాడు. అది మేజికల్ రియలిజమా... చైతన్య స్రవంతి మహత్యమా! ఆయన రచనలను ఆస్వాదించడం తప్ప ఆయనలా రాయాలను కోవడం అసాధ్యం. రావిశాస్త్రి పాత్రలు ముత్యాలమ్మ, నూకాలమ్మ, పోలమ్మ, పోచమ్మ, అంకాలమ్మలు వంటి ఎవరెవరో ఈ నీతిమంతుల ప్రపంచం మీద ఒకసారిగా విరుచుకుపడతారు. నేరస్థులు పోలీసులకు బుద్ధి చెబుతారు. ముద్దాయిలు న్యాయమూర్తులకు, అవినీతిపరులు నీతిమంతులకు, అలగాజనం ఆస్తిమంతులకు బుద్ధి చెబుతారు. ఒకసారి రావిశాస్త్రి లోకి దిగిన తర్వాత ఆ పాత్రలు మాట్లాడుతుంటే మనం తలదించుకొని ఏదో నేరం చేసినట్టు ఉండి పోతాం. ఎదురుపడితే ఏదో దారి చూసుకొని వాళ్ళ నుంచి తప్పుకుపోతాం. ఆయన అననే అన్నాడుగా ‘‘ఎల్లకాలం వాళ్ళు అలా వెంగళప్పల్లా ఉండిపోరు. ఎప్పుడో అప్పుడు ఏదో రోజున వాళ్ళందరూ ఒక్కసారిగా గప్పున తెలివి తెచ్చుకుంటారు. అప్పుడు పుణ్యం వర్ధిల్లుతుంది. అంచేత అప్పుడు మనలాంటి పాపులు జాగ్రత్తగా ఉండాలి.’’ అదీ సంగతి. వర్ణనలు బాబోయ్ వర్ణనలు అని గగ్గోలు పెట్టారు కొందరు. వర్ణనలు బోర్ కొడుతున్నాయని మహామహులైన విమర్శకులు కూడా అన్నారు. కానీ ఆ వర్ణనల వల్లే రావిశాస్త్రి ఒకే ఒక్కడుగా మిగిలిపోయాడు. రాజు–మహిషిలో అనవసరమైన వర్ణనలు మితిమీరి ఉండడమే దాని లోపం అని కదా ‘రారా’ రాద్ధాంతం. అదేమో గాని రాజు–మహిషి నవలలో మందుల భీముడు లోకంలోని పాపాల మీద ఇచ్చిన పెద్ద ఉపన్యాసం ఒక్కటి చాలు అసలు రావిశాస్త్రి అంటే వర్ణనలే అని ఒప్పేసుకుంటాం. అందుకేనేమో ఆ అసంపూర్తి నవలకు శ్రీశ్రీ ‘అపరిచయం’ రాసి దాన్ని నిజమైన క్లాసిక్గా వర్ణించాడు. ఇస్మాయిల్, మార్క్సిస్టుల్లో కూడా మహాత్ములు ఉంటారని రావిశాస్త్రి గురించి మాట్లాడుతూ చేసిన వెటకారం బహుశా రారా లాంటి వాళ్లు గుర్తించాలనే కాబోలు. అదేం కాదులెండి. కేవీఆర్, చలసానిలాంటి ఉద్దండ మార్క్సిస్టులే భుజాన మోశారు కదా. అజంతా మాత్రం నిజమే చెప్పాడు. ‘‘అశ్రు గంగాజలాలలో అగ్నిసుందరిని సృష్టించిన ఒకే ఒక కథకుడు’’ అని. అంతేకాదు ‘‘అతడే అతడే అతడు నడుస్తున్నంతమేరా కదం తొక్కుతున్న శబ్ద ధీర గంభీర జీవన కథా సరిత్సాగర ఘోష’’ అని కూడా ముక్తాయింపు ఇచ్చాడు అజంతా. అందుకే రావిశాస్త్రి నిజంగా ఒకే ఒక్కడు. వన్ అండ్ ఓన్లీ. ఆయన పుట్టి వందేళ్ళు అంటున్నారు. ఇలాంటి రచయితలు వందల సంవత్సరాలకి ఒకసారి పుడతారు. వందల వేల సంవత్సరాలు జీవిస్తారు. ఆయనకు నా పాదాభివందనాలు. - డాక్టర్ ప్రసాదమూర్తి కవి, జర్నలిస్ట్ భూమ్మీద మనిషికి ముఖ్యమైన పనులు రెండే రెండు. ఒకటి: దొంగ తనం చేయడం. రెండు: దొంగల్ని పట్టుకు శిక్షించడం (తలుపు గొళ్ళెం కథ). రాచకొండ విశ్వనాథశాస్త్రి సాహిత్య సారమంతా ఈ రెండు వాక్యాల్లోనే ఇమిడి ఉంది. అంతేకాదు మనిషి జీవితం, మానవ చరిత్ర కూడా అందులోనే ఉన్నాయని కూడా ఆయన అన్నారు. అలాంటి జీవితాలు, జీవిత చరిత్రలు ఆయన రచనా సాగరమంత మేరా పరుచుకున్నాయి. నూరేళ్ల రావిశాస్త్రికి మనం ఏ రకంగా నివాళులర్పించగలం? రావిశాస్త్రి గొప్పతనమూ, కళా నైపుణ్యమూ ఎక్కడు న్నాయంటే... వైవిధ్యమైన వస్తు స్వీకరణలోనూ, అనితర సాధ్యమైన శిల్ప నైపుణ్యంలోనూ. రచయితగా రావిశాస్త్రికి అనుకూల అంశం ఆయన ‘జీవితకాలం’. పుట్టి పెరిగిన కాలం ఆయనకు కలిసి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చేనాటికి న్యాయ కళాశాలలో విద్యార్థిగా జరుగుతున్న జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను నిశితంగా గమనించాడు. కాలిక స్పృహ ఉన్నవాడు కాబట్టే ఆ చారిత్రక సందర్భాన్నీ, సంధి కాలాన్నీ చాలా గడుసుగా ఒడిసి పట్టుకున్నాడు. తత్వ, న్యాయ శాస్త్రాల అధ్యయనం వల్ల సామాజిక చలన సూత్రాలను మా బాగా ఆకళింపు చేసుకున్నాడు. ‘ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క’... అన్న ప్రజాస్వామిక భావన ఆచరణలో విఫలమైందని స్వాతంత్య్రం వచ్చిన పుష్కర కాలానికి తెలియ వచ్చింది. శాసన, న్యాయ, రక్షణ వ్యవస్థల పనితీరులో డొల్లతనం అవగతం అయింది. అంతకుముందు కష్టార్జితం, కోర్టుకు రాని సాక్షులు, నల్ల మేక, అధికారి, పువ్వులు వంటి కథలు రాసినా వర్గ దృక్పథం బల పడింది ఈ సమయంలోనే. ఆ తరువాత వెలువడినవే ‘ఆరుసారా కథలు’. సారా కథలతో తెలుగు కథా సాహిత్యం సారవంతమయింది. అంతవరకు కానరాని కొత్త శిల్ప మర్మమేదో వాళ్ళ కంటికి జిగేల్ మని తాకింది. సారా కథలను సేవించిన శ్రీశ్రీ తన కొంగ్రొత్త అనుభూతికి ‘రసన’ అని నామకరణం చేశాడు. రచయితగా ఆయన న్యాయవాద వృత్తి సాహిత్య సృజనకు ఒక శాస్త్రీయమైన భూమికనిచ్చింది. ‘పతితులార భ్రష్టులారా’ అని శ్రీశ్రీ ఎవరినైతే ఓదార్చాడో వాళ్ళనే రావిశాస్త్రి అక్కున చేర్చుకున్నాడు. రాజు మహిషి, రత్తాలు రాంబాబు, మూడు కథల బంగారం, సొమ్మలు పోనాయండి లాంటి నవలలు; ‘నిజం’ లాంటి నాటకం ఆ నేపథ్యంలో నుంచి వచ్చినవే. ఆ పరంపరలో పుట్టినవే. ఇంట్లో, సంసారంలో, సెక్స్లో పడి కొట్టుకుంటున్న కథని వీధిలోకి తీసుకొచ్చానని మాత్రమే చెప్పే రావిశాస్త్రి నిజానికి చేసిన పని అంతేనా? పిల్లి పిల్లల్ని పెట్టి ఏడిళ్లు తిప్పినట్టు, కథ కాళ్ళకి బలపం కట్టి వాడల్లో, గుడిసెల్లో తిప్పిన చోట తిప్పకుండా తిప్పాడు. తన భాషా పాటవమంతా పాటకజనం నుంచే స్వీకరించాడు. మాకూ ఉన్నాడు ఒక మహా రచయిత అని తెలుగువాడు బోరవిరుచుకునేటట్టు రచనలు చేశాడు. ఆయన పేదలపక్షమే వహించాడు. ‘మనం పేదవాళ్ళం రా’ అని చిన్ననాట తల్లి ఏరోజైతే చెప్పిందో ఆ రోజు నుంచి ఆ మరణాంతం మరిచిపోలేదు. అందుకే రత్తాలు, నూకాలు, ముత్యాలమ్మ, పోలమ్మ, బోడి గాడు లాంటి అల్పజీవుల తరఫున వకాల్తా పుచ్చుకుని వాళ్లకి జీవితం పొడవునా కొండంత అండగా నిలబడ్డాడు రాచకొండ. సార్వ భౌమారావు, మందుల భీముడు, రాజయోగి, భీమసేనారావు, లక్ష్మినాథరావు లాంటి కుహనా పెద్ద మనుషుల ‘మాయ’, ‘మోసం’ బయటపెట్టి బోనెక్కించాడు. లోకానికి ‘నిజం’ తెలియజేశాడు. రావిశాస్త్రి విరసం వ్యవస్థాపక ఉపాధ్యక్షుడిగా కొంతకాలం బాధ్యత వహించాడు. తర్వాత విరసంలో లేకపోయినా చివరంటా విరసంతోనే ఉన్నాడు. రచనలు చేసిన నేరానికి ఎమర్జెన్సీలో జైలుకెళ్లి అక్కడ కూడా ఆ ప్రక్రియనే కొనసాగించాడు. చివరి నవల ‘ఇల్లు’ రాసి చివరాఖరికి సొంత ఇల్లు లేకుండానే జీవితాన్ని ముగించాడు. అసలు సిసలైన మార్క్సిస్ట్ రచయితగా నిలబడి బతికాడు. (చదవండి: అసమానతలపై ఎక్కుపెట్టిన బాణం!) - జి.ఎస్. చలం సాహితీ విమర్శకుడు -
గుమస్తా జీవుల అనర్థ బతుకులు... అల్పజీవి
మన నవలలు: ఫలానా డిగ్రీ చదువు అన్నారు. చదివాడు. ఫలానా గుమస్తా ఉద్యోగం చెయ్ అన్నారు. చేస్తున్నాడు. ఉద్యోగం కోసం చదువు. చదివేదంతా ఉద్యోగం కోసమే. కాళ్లు తీసేసి కుర్చీలో కూచోబెట్టడం ఇది. జీవితాంతం పరాన్నభుక్కును చేసేయడం. ఉద్యోగం పోతే ఇంతే సంగతులు. ఈ భయం.... భయం... భయం... నరాల్లోకి ఎక్కడిదాకా పాకిందంటే ఆఖరుకు నచ్చిన ఆడది పిలిస్తే భయపడ్తూ భయపడ్తూ వెళ్లి ఎవరైనా చూస్తారేమోనని భీతిల్లి తీరా ఆమె చేరువ అయితే బిక్కముఖం వేసి నీరుగారిపోయి.... సుబ్బయ్య కొంచెం పిరికివాడు. గుమస్తా కావడం వల్ల పిరికివాడయ్యాడా పిరికివాడు కావడం వల్లే గుమస్తా అయ్యాడా చెప్పలేం కాని మొత్తం మీద పిరికివాడు. భయపడతాడు. పెళ్లాన్ని అసేయ్ ఒసేయ్ అనడానికి భయపడతాడు. ఆఫీసులో తనని ఏడిపించిన హెడ్ క్లర్క్ని- ఏరా ఒళ్లు కొవ్వెక్కిందా అని ఎదిరించడానికి భయపడతాడు. కుదర్దు... ఇంతే ఇస్తా అని కూరగాయలవాడితో దెబ్బలాడ్డానికి భయపడతాడు. పిల్లల మీద చేయెత్తడానికి భయపడతాడు. లోకం మీద నోరెత్తడానికీ భయపడతాడు. అధికారం అంటే భయం. పోలీసులంటే భయం. కోర్టులంటే భయం. హాస్పిటల్స్ అన్నా భయమే. చక్కగా ఒక గుల్ల కావాలి సుబ్బయ్యకి. పొద్దున తొమ్మిదింటికి ఆఫీసుకు వెళ్లడం. గొడ్డులా చాకిరీ చేయడం. సాయంత్రం ఇంటికి తిరిగి రావడం. నిద్ర పోవడం. మళ్లీ తిరిగి ఆఫీసుకు వెళ్లడం. నెల తిరిగే సరికల్లా వచ్చిన నాలుగు డబ్బుల్తో వెచ్చాలు తెచ్చుకోవడం. గుట్టుగా సంసారం నెట్టుకురావడం. చిన్న చిన్న అవస్థలు వస్తే ఇబ్బంది పడటం. పెద్ద పెద్ద అవస్థలే దాపురిస్తే గుటుక్కుమనడం. ఒక సేఫ్ రొటీన్ జీవితం. ఇది కావాలి సుబ్బయ్యకి. దీనికి భిన్నంగా ఏది జరిగినా భయపడతాడు. హడలెత్తి పోతాడు. ఆఫీసులో బిల్స్ క్లియర్ చేసే పని అతనిది. బావమరిది ఇది గమనించాడు. ఎవరి బిల్సు క్లియర్ చేయాలో వాడి దగ్గర ఐదు వందలు అడిగి తనకు ఇమ్మన్నాడు. ఇలా చేయొచ్చా? కూడదు. కాని సుబ్బయ్యకు వేరే దారి లేదు. అడుగుతున్నది బావమరిది. అడగమన్నది కట్టుకున్న భార్య. చెప్పిన పని చేయకపోతే చేతగానివాడంటారు. సుబ్బయ్య ఐదువందలు కాంట్రాక్టర్ని అడిగేశాడు. చేబదులు అన్నట్టుగా అడిగాడు. కాని అది లంచం. అతడు చేబదులే అన్నట్టుగా ఇచ్చాడు. కాని అది దక్షిణ. ఇచ్చిన ఐదు వందలు బావమరిదికి అందింది. కాని, ఆ వెంటనే సెక్షన్ కూడా మారిపోయింది. మరి? తను కాకుండా వేరెవరైనా తింటుంటే హెడ్ క్లర్క్ ఊరుకుంటాడా? మార్చాడు. దక్షిణ అని ముట్టజెప్పినవాడు ఇప్పుడు కాబూలీవాలా అయ్యాడు. తన బిల్స్ క్లియర్ చేయకుండా అప్పనంగా ఐదు వందలు తీసుకుంటే ఎవరు ఊరుకుంటారు? కాని ఐదు వందలు! జీతం వందో నూటేభయ్యో ఉన్నప్పుడు ఇంటి అద్దె ఐదూ పదీ రూపాయలు ఉన్నప్పుడు పావలాకి బేడకి కావలసిన వస్తువులు దొరుకుతున్నప్పుడు ఐదువందలంటే ఎంత పెద్ద మొత్తం. ఇప్పుడు ఏం చేయాలి? సుబ్బయ్య భయపడిపోయాడు. ఇచ్చిన కాంట్రాక్టర్ దుర్మార్గుడు. పుచ్చుకున్న బావమరిది అవకాశవాది. తానేమో పిరికివాడు. ఎలా... ఎలా... ఎలా. సుబ్బయ్య వెర్రెత్తిపోయాడు. పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని ఎక్కడికని పారిపోగలడు? ఒక ఐదు వందల మొత్తం! అతడి జీవితంలోని ప్రశాంతతను అంతా సర్వనాశనం చేసేసింది. కాదు... అతడిలోని పిరికితనమే అతణ్ణి సర్వనాశనం చేసేసింది. ధైర్యంగా ఎప్పుడైనా ఉన్నాడా తను. ధైర్యంగా దేన్నయినా ఎదిరించాడా తను. ధైర్యంగా ఇది తప్పు అని వాదించాడా తను. ధైర్యం చేసి దీనిని సరి చేయాలి అని రంగంలో దిగాడా తను? లేదే. ఫలానా డిగ్రీ చదువు అన్నారు. చదివాడు. ఫలానా గుమస్తా ఉద్యోగం చెయ్ అన్నారు. చేస్తున్నాడు. ఉద్యోగం కోసం చదువు. చదివేదంతా ఉద్యోగం కోసమే. కాళ్లు తీసేసి కుర్చీలో కూచోబెట్టడం ఇది. జీవితాంతం పరాన్నభుక్కును చేసేయడం. ఉద్యోగం పోతే ఇంతే సంగతులు. గుమస్తా కాకపోతే ఇంతే సంగతులు. ఈ భయం.... భయం... భయం... నరాల్లోకి ఎక్కడిదాకా పాకిందంటే ఆఖరుకు నచ్చిన ఆడది పిలిస్తే భయపడ్తూ భయపడ్తూ వెళ్లి ఎవరైనా చూస్తారేమోనని భీతిల్లి తీరా ఆమె చేరువ అయితే బిక్కముఖం వేసి నీరుగారిపోయి.... మగాడిగా బతకడం అంటే స్త్రీ దగ్గర మగతనం ప్రదర్శించడం కాదు. అన్ని సందర్భాల్లోనూ మగాడిగా బతకడమే. సుబ్బయ్య గుమస్తా బతుకు అతణ్ణుంచి ఆ మగతనాన్ని హరించేసింది. ఇక మిగిలిందల్లా పిరికి పిప్పి. అతడేనా? దేశమంతా ఈ పిరికి పిప్పే. పెద్ద గుమాస్తాలు... చిన్న గుమస్తాలు.... కార్లూ టైలూ ఉన్న బడా గుమస్తాలు.... టెన్ టు ఫైవ్ బందీలు.... నోరెత్తకుండా పని చేసుకుపోయే కూలీలు... నవల: అల్పజీవి; రచన: రాచకొండ విశ్వనాథ శాస్త్రి తొలి ముద్రణ: 1955; రావిశాస్త్రికి విశేషమైన పేరు తెచ్చిన ఆయన తొలి నవల. జేమ్స్ జాయిస్, శ్రీశ్రీ ‘కోనేటి రావు’ పాత్రల ప్రభావంతో తాను ఈ నవల రాశానని రావిశాస్త్రి చెప్పుకున్నారు. రచనలో విశేషమైన వేగం ఆ రోజుల్లో కొత్త కావడం వల్ల కూడా దీనికి ఆదరణ లభించింది. కథ కంటే కథనమే ముఖ్యం. రాజు- మహిషి, రత్తాలు - రాంబాబు... ఆయన ఇతర నవలలు. మనసు ఫౌండేషన్ ప్రచురించిన రావి శాస్త్రి రచనలులో ఈ నవల లభ్యం. ఆ ప్రతులు దొరకని వారు జిరాక్స్ కాపీ కోసం పుస్తకాభిమాని అనిల్ బత్తులను సంప్రదించవచ్చు. ఆయన నం.9059134111 అందుకే ఒక పది మందో ఇరవై మందో కలసి ఆట ఆడిస్తుంటారు. ఓట్లు వేయకపోయావో చస్తావ్ అంటారు. చెప్పినట్టు వినకపోయావో చంపుతాన్ అంటారు. రెంటు పెంచినా, కరెంటు పెంచినా, సిలిండర్ పెంచినా, పార్కింగ్ ఫీజు పెంచినా, సినిమాహాళ్లలో నోటికొచ్చిన రేటును పెంచినా, ప్లాట్ పెంచినా, ఫ్లాట్ పెంచినా నోర్మూసుకొని ఉండాలి. రైళ్లు లేవు ఫో అంటే సణుక్కుంటూ పోవాలి. బస్సులు చంపితే ఛావ్ అంటే జీ హుజూర్ అనుకుంటూ చావాలి. అందరూ అంతే. భరించడం తప్ప మార్చడం తెలియనివారు. మార్చాలంటే లంపటంలో దిగాలి. లంపటంలో దిగితే అమ్మో.... అవతల ఆఫీసుకు వెళ్లాలి.... గుమస్తాలు! సుబ్బయ్య కూడా అలాంటి గుమాస్తానే. ఒరే కాంట్రాక్టర్ వెధవా... నీ డబ్బు నీకు తిరిగి ఇవ్వనురా అని చెప్పడం చేతగాని గుమాస్తా. చచ్చు మనిషి. చచ్చిన మనిషి. అయితే అప్పుడప్పుడు కొంత వెలుతురు వస్తుంది. కొంత మార్చ ప్రయత్నిస్తుంది. సుబ్బయ్య జీవితంలో కూడా అలాంటి వెలుతురు వచ్చింది. ఒక స్నేహితురాలు పరిచయమైంది. ఆమె అతణ్ణి ఆదరించింది. ఊరడించింది. పవిటతో నుదుటి చెమట తుడిచి కొంచెం ధైర్యంగా ఉండమని ధైర్యం చెప్పింది. కాని ధైర్యంగా ఉండటానికి సుబ్బయ్యకు ధైర్యం కావాల్సి వచ్చింది. అతడు ఆలోచిస్తూ ఉన్నాడు. అతడే కాదు దేశంలోని గుమస్తాలందరూ ఆ ధైర్యాన్ని ఇంకా అందుకోవలసి ఉంది. రావిశాస్త్రి 1953లో రాసిన నవల ‘అల్పజీవి’. పిరికితనంతో బతుకులీడ్చే మధ్యతరగతి వర్గం మీద, గుమస్తా మనస్తత్వాలతో కునారిల్లుతున్న మధ్యతరగతిలోని ప్రధాన వర్గం మీద ఆయన కొట్టిన కొరడా దెబ్బ ఇది. ఆయన బాధ ఏమిటంటే చదువుకోని వారు ఎలాగూ చస్తున్నారు. బాగా చదువుకున్నవారు లొసుగులు లోపాలను ఉపయోగించి ఎక్కడికో చేరుతున్నారు. కాని ఈ గుమస్తాలే- ఈ అపసవ్యతను తొలగించాల్సిన బాధ్యత ఉన్న ఈ గుమస్తాలే ఆ బాధ్యత నుంచి దూరంగా తొలగిపోతున్నారు. మనిషి పిరికితనం దాటాలని రావిశాస్త్రి కోరిక. ధైర్యలక్ష్మి ఉంటేనే తక్కిన లక్ష్ములన్నీ ఉంటాయని ఆయన ఈ నవలలో చెప్పదల్చుకున్నారు. లక్ష్ములు కావలసింది వ్యక్తిగతానికి కాదు. సమాజానికి. దేశానికి. ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్ అని గురజాడ అనింది అందుకే. చెహోవ్ వంటి మహా రచయిత ‘గుమస్తా మరణం’ వంటి కథలు రాసిందీ అందుకే. పిరికిగుణం ఉన్న సమాజం పైకి రాదు. పిరికి గుణం వల్లే మధ్యతరగతి పైకి రావడం లేదు. ఈ మాటను పదే పదే చెప్పడానికి ఇష్టపడ్డారు రావిశాస్త్రి. అందుకే ‘అల్పజీవి’ రాసినా అదేకథాంశాన్ని ‘వర్షం’ కథలో రిపీట్ చేశారు. చలిచీమలే కాదు గుమస్తాలు కూడా మహా సర్పాలను చంపగలవు అని ఆమ్ ఆద్మీ వంటి ఉదంతాలు ఒకటీ అరా కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి. అన్నివైపులా రాబందులను తరిమే పావురాల గుంపులు కమ్ముకోవాలి. అప్పుడే ‘అల్పజీవి’కి ధన్యత. రావి శాస్త్రి రచనకు సార్థకత.