
● ‘100 యాప్’ తో పెట్రోలింగ్ పర్యవేక్షణ ● 2023లో సరాసర
మంచిర్యాలక్రైం: రాష్ట్ర పోలీస్ శాఖ నేరాల నియంత్రణ, సత్వర సమాచారం, సమస్యల పరిష్కారం కోసం డయల్ 100 నంబర్ను ప్రవేశపెట్టింది. అత్యవసర సమయాల్లో ప్రజలకు తక్షణ సాయం అందించే లక్ష్యంతో ఈ సేవను ఏర్పాటు చేశారు. గతంలో హైదరాబాద్ కేంద్రంగా ఒక ప్రైవేట్ సంస్థ దీనిని నిర్వహించగా, ప్రస్తుతం ఇది పోలీస్ శాఖ అధీనంలో సమర్థవంతంగా కొనసాగుతోంది. సాంకేతికతను ఉపయోగించి స్పందన సమయాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ‘100 యాప్’ను ప్రవేశపెట్టారు.
గతంలో సవాళ్లు..
గతంలో ఎవరైనా డయల్ 100కు కాల్ చేస్తే, అది నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరేది. అక్కడి సిబ్బంది బాధితుడు ఏ ఠాణా పరిధిలో ఉన్నాడో తె లుసుకుని, కాల్లోని వివరాలను సంక్షిప్త సందేశంగా మార్చి సంబంధిత ఠాణా, జోన్ కార్యాలయం, కమిషనరేట్ కంట్రోల్ రూమ్లకు పంపేవారు. వాకీటాకీ ద్వారా గస్తీ వాహనాలు, బ్లూ కోల్ట్స్ను అప్రమత్తం చేసేవారు. అయితే, గస్తీ వాహనం ఎక్కడ ఉంది, బాధితుడికి ఎంత దూరంలో ఉంది అనే వివరాలు తెలుసుకునే సాంకేతికత లేకపోవడంతో స్పందన సమయం ఎక్కువగా ఉండేది. ఘటనా స్థలానికి చేరిన తర్వాత సిబ్బంది నివేదించిన వివరాల ఆధారంగా కాల్ను మూసివేసేవారు. దీంతో అధికారులకు ఘటనపై స్పష్టత లభించేది కాదు.
ఇప్పుడు సమర్థవంతమైన స్పందన
ప్రస్తుతం డయల్ 100 సేవలు సాంకేతికతతో మెరుగైన స్థితిలో ఉన్నాయి. బాధితుడు కాల్ చేసిన వెంటనే కంట్రోల్ సెంటర్ సిబ్బంది అతని స్థానాన్ని గుర్తిస్తారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి గస్తీ వాహనం, బ్లూ కోల్ట్స్ టీమ్కు ట్యాబ్లను అందించారు. ఈ ట్యాబ్లు జీపీఎస్ పరికరాలుగా పనిచేస్తూ, ఏ వాహనం ఎక్కడ ఉందో కంట్రోల్ సెంటర్కు తెలియజేస్తాయి. బాధితుడికి సమీపంలోని వాహనానికి కాల్ను డైవర్ట్ చేసే ప్రక్రియ కొన్ని సెకన్లలో పూర్తవుతుంది. ట్యాబ్లో ప్రత్యేక రింగ్టోన్ ద్వారా కాల్ వచ్చినట్లు సిబ్బందికి తెలుస్తుంది. బాధితుడి వివరాలు, ఫిర్యాదు స్వభావం ట్యాబ్ తెరపై కనిపిస్తాయి. సిబ్బంది ‘రిసీవ్డ్’ బటన్ నొక్కడం ద్వారా కాల్ అందినట్లు ధ్రువీకరిస్తారు.
7 నిమిషాల్లో పోలీస్ రెస్పాన్స్..
2023లో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన సర్వే ప్రకారం, డయల్ 100 కాల్కు సగటున 7 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. దీనిని ‘పోలీస్ రెస్పాన్స్ టైమ్’ అంటారు. ఈ సమయాన్ని మరింత తగ్గించేందుకు ట్యాబ్లను జీపీఎస్గా మార్చి, ప్రతీ పెట్రోలింగ్ టీమ్కు అందజేశారు. కాల్ అందిన వెంటనే సమీప టీమ్ ఘటనా స్థలానికి చేరుకొని, సమస్యను అధికారులకు వివరిస్తూ అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంది. ప్రమాదాల్లో క్షతగాత్రులకు సహాయం, ఫోటోలు, వీడియోలు తీసి ఆన్లైన్ ద్వారా సంబంధిత అధికారులకు పంపడం జరుగుతోంది.