
ఏపీలో గూండా సర్కారు
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదని సీపీఎం నేత బృందా కారత్ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు : బృందా కారత్ ధ్వజం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదని.. లాఠీలు, తుపాకీ గుళ్లను ప్రయోగించే గూండా సర్కారు రాజ్యమేలుతోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందా కారత్ ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా గోదావరి మెగా ఆక్వా ఫుడ్పార్క్ను నిర్మించడాన్ని నిరసిస్తూ..
భీమవరం పాత బస్టాండ్ వద్ద గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు వ్యతిరేకిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు చట్టాలను ఉల్లంఘిస్తూ ఫుడ్పార్క్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం దారుణమని దుయ్యబట్టారు. ప్రజల అంగీకారం లేకుండా పార్క్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించా రు. ఫుడ్పార్క్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆధైర్యంతో కన్నీరు పెట్టుకోకుండా, ప్రభుత్వంపై పోరాడి చంద్రబాబుకు కంటనీరు తెప్పించాలని పిలుపునిచ్చారు.
కాలుష్య కారక పరిశ్రమలకు అనుమతులిస్తారా?
స్వచ్ఛభారత్ అంటూ ప్రచారం చే స్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాలుష్య కారక పరిశ్రమలకు అనుమతులిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం దారుణమని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. ప్రజలు వ్యతిరేకిస్తున్న తుందుర్రు ఆక్వా ఫుడ్పార్క్ను వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు.