
జానమద్ది హనుమచ్ఛాస్త్రి కన్నుమూత
కడప: ప్రముఖ రచయిత జానమద్ది హనుమచ్ఛాస్త్రి (90) కన్నుమూశారు. గత కొద్దికాలంగా ఆయన కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు జానమద్ది హనుమచ్ఛాస్త్రి మరణించారు. కడపలోని సిపి బ్రౌన్ లైబ్రరీ వ్యవస్థాపక కార్యదర్శిగా సేవలందించిన హనుమచ్ఛాస్త్రి, తెలుగు సాహిత్య రంగానికి విశేష సేవలందించారు. ప్రజల సందర్శనార్థం జానమద్ది భౌతికకాయం బ్రౌన్ గ్రంథాలయంలో ఉంచనున్నారు. ఈ రోజు సాయంత్రం జానమద్ది భౌతికకాయానికి కడపలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జానమద్ది హనుమచ్ఛాస్త్రి సెప్టెంబరు 5, 1926 సంవత్సరంలో అనంతపురం జిల్లా రాయదుర్గంలో జన్మించాడు. 1946లో బళ్ళారిలోని ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. కడపలో సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ ట్రస్టును నెలకొల్పి, దాని కార్యదర్శిగా అహర్నిశలూ పాటుపడ్డారు.
జానమద్ది కథా రచనే కాకుండా వివిధ పత్రికలలో, సంచికలలో 2,500 పైగా వ్యాసాలు రాసారు. 16 గ్రంథాలు వెలువరించారు. మా సీమకవులు, నాట్యకళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, కస్తూరి కన్నడ సాహిత్య సౌరభం 2, కడప సంస్కృతి- దర్శనీయ స్థలాలు, రసవద్ఘట్టాలు, మన దేవతలు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర, సి.పి.బ్రౌన్ చరిత్ర మొదలైన గ్రంథాలు ప్రచురించారు.