తండ్రి అపరకర్మలు నిర్వర్తించిన దేవిశ్రీప్రసాద్ | Musical director devisriprasad Father funerary | Sakshi
Sakshi News home page

తండ్రి అపరకర్మలు నిర్వర్తించిన దేవిశ్రీప్రసాద్

Published Thu, Jan 21 2016 2:04 AM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

Musical director devisriprasad Father funerary

  కోటిలింగాలరేవులో పిండప్రదానం  
 గోదావరిలో అస్థికల నిమజ్జనం
 
 కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తన తండ్రి, ప్రసిద్ధ రచరుుత సత్యమూర్తికి రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన పిండప్రదానం చేశారు. దేవిశ్రీ తమ్ముడు సాగర్‌తో కలిసి బుధవారం కోటిలింగాలరేవులో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. నదిలో నీరు తక్కువగా ఉండడంతో రెండు పడవల సాయంతో నది లోపలికి అస్థికలను నిమజ్జనం చేశారు. అనంతరం దేవిశ్రీ మాట్లాడుతూ తన తండ్రికి రాజమండ్రి అంటే చాలా ఇష్టమైన ప్రదేశమని, అందుకే ఆయన అస్థికల్ని మొదట ఇక్కడ నిమజ్జనం చేసి, తర్వాత కాశి, ఇతర పుణ్యక్షేత్రాల్లో నిమజ్జనం చేయనున్నామన్నారు.
 
 జిల్లాలోని రాయవరం మండలం వెదురుపాకలో తన తండ్రి ఆయన తల్లిదండ్రులకు ‘సూర్యోదయం’ పేరుతో ఇంటిని నిర్మించారని చెప్పారు. ఆయనకు ఎంతో ఇష్టమైన సొంత గ్రామంలోనే ఆయన విగ్రహాన్ని నెలకొల్పే యోచన ఉందన్నారు. ఆయన పుట్టిన రోజైన మే 24న వెదురుపాకలో జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని, ఆయన పేరుపై పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. నిమజ్జనం అనంతరం దేవిశ్రీ అక్కడి శివాలయంలో పూజలు నిర్వహించారు. కాగా దేవిశ్రీప్రసాద్ రాక గురించి తెలిసి పలువురు అభిమానులు కోటిలింగాలరేవుకు వచ్చారు.
 

Advertisement

పోల్

Advertisement