
పాలనలో వైఎస్కు సాటిలేరు
రాయచోటి/చిన్నమండెం
వైఎస్ పాలనకు ఏ ముఖ్యమంత్రి సాటి లేరని ఎమ్మేల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఏన్జీవో కాలనీలో బుధవారం 18వ వార్డుకు సంబంధించి జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ నసిబున్ఖానం,కౌన్సిలర్ లక్ష్మీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మేల్యే శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాలకు అతి దగ్గరగా చేరువైన వ్యక్తి ఒక వైయస్ఆర్ మాత్రమేనని గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం ప్రతి పక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ రాయచోటి ప్రాంత అభివృద్ధి కోసం ఏ నాయకునితోనైనా కలిసి పని చేసేందుకు సిద్దమని ప్రకటించారు. రెండేళ్ల క్రితం ఏన్జీవో కాలనీకి పార్కు మంజూరైందని దానిని వెంటనే చేపట్టేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు. మున్సిపల్ ఛైర్మన్ నసిబున్ఖానం మాట్లాడుతూ అర్హులైన వారి పింఛన్లను తొలగించడం భావ్యం కాదన్నారు. .
కౌన్సిలర్ దశరధరామిరెడ్డి మాట్లాడుతూ పింఛన్లు తొలగించడంతో వృద్ధులు ఆవేదనతో రగిలిపోతున్నారన్నారు. కో ఆఫ్షన్ సభ్యుడు సలావుద్దీన్ కూడా మాట్లాడారు. కార్యక్రమంలో తెలుగు దేశం నాయకుడు ప్రసాద్బాబు,కౌన్సిలర్ చిల్లీస్ఫయాజ్,వైయస్ఆర్సీపీ నాయకులు జయరామిరెడ్డి ,కొలిమిచాన్బాషా ,జాకీర్, ఎస్పియస్ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.
హామీలు నెరవేర్చాలని పోరాడతాం
ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ప్రజల తరపున పోరాడతామని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. వండాడి గ్రామపంచాయతీలో బుధవారం జరిగిన జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న వారికి ఏదో వంక చూపి పింఛన్లు రాకుండా చూస్తున్నారన్నారు.
భూ నిబంధన సడలించి అర్హులైన అందరికీ పించన్లు మంజూరు చేయాలని కోరారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అంతకు ముందు సర్పంచ్ హేమావతమ్మ ఆధ్యక్షన జరిగిన సమావేశంలో సీఎం సందేశం చదివి వినిపించారు. మాజీ ఎమ్మెల్యేలు పాలకొండ్రాయుడు, రమేష్రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.