
లేటరైట్ మాఫియా బరితెగింపు
సాక్షి విలేకరి ఏడీ బాబుపై హత్యాయత్నం
ఇనుపరాడ్లు..బీరు బాటిళ్లతో దాడి
నర్సీపట్నం : నాతవరం మండలం సాక్షి దినపత్రిక విలేకరి అనిమిరెడ్డి దొంగబాబు (ఏడీ బాబు)పై లేటరైట్ మాఫియా దాడి చేసింది. మారణాయుధాలతో హత్యాయత్నానికి దిగిం ది. బాధితుడు ఏడీ బాబు కథనం ప్రకారం.. మంగళవారం సాయంత్రం తాండవ జంక్షన్లో నెట్సెంటర్ నుంచి ఏడీబాబు వార్తలు పంపే పనిలో ఉన్నారు. అదే సమయంలో మూడు వాహనాలపై ఆరుగురు వ్యక్తులు వచ్చి ఒక్కసారిగా ఏడీబాబుపై దాడి చేశారు. ఇనుపరాడ్లు, బీరుబాటిళ్లతో తీవ్రంగా కొట్టారు. హత్య చేసేందుకు ప్రయత్నించారు. బీరుబాటిళ్లతో తల, చాతి, చేతులపై విచక్షణారహితంగా పొడిచారు. ఇనుపరాడ్డుతో తలపై కొట్టేందుకు ప్రయత్నించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన నెట్ సెంటర్ నిర్వాహకుడి గొంప నాగేశ్వరరావుపైనా దాడి చేశారు.
అప్పటికే చుట్టుపక్కల ఉన్నవారు చేరుకోవడంతో ఆగంతకులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఉడాయిస్తున్న వారిలో ఒకరిని స్థానికులు పట్టుకుని నాతవరం పోలీసులకు అప్పగించారు. అతడు నర్సీపట్నంకు చెందిన బండారు సంతోష్గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఏడీబాబు, నెట్ సెంటర్ నిర్వాహకుడు నాగేశ్వరరావును నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకు ఎవరితోనూ వివాదా లు లేవని, ఇటీవల లేట్రైట్ అక్రమాలపై కథనాలు రాయటంతో లేట్రైట్ మాఫియా తనపై హత్యాయత్నం చేయించిందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రూరల్ సీఐ రేవతమ్మ, నాతవరం ఎస్సైలు ఏడీ బాబు నుంచి వాగ్మూలం తీసుకున్నారు. దాడి ఘటనపై పూర్తి విచారణ చేసి కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.
దోషులను కఠినంగా శిక్షించాలి
ఏడీ బాబుపై హత్యాయత్నంకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గం కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. ఆగంతకుల దాడిలో తీ వ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాబును పరామర్శించారు. ఏఎస్పీ ఐశ్వర్యరస్తోగిని కలిసి సంఘటనపై ఫిర్యాదు చేశా రు. విలేకరిపై దుండగులు చేసిన దాడిని వివరించి దోషులపై తక్షణం కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. దాడి వెనుక లేట రైట్ మాఫియా హస్తం ఉందనే అనుమానాన్ని ఏఎ స్పీ ఎదుట వ్యక్తం చేశారు. బాబును పరా మర్శించిన వారులో పార్టీ పట్టణ అధ్యక్షులు కోనే టి రామకృష్ణ, గొలుసు నర్సింహమూర్తి ఉన్నా రు. అలాగే ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపులేటి రాము, జిల్లా శాఖ అధ్యక్షులు సీహెచ్బీఎల్ స్వామి, ఐజేయూ కౌన్సిల్ సభ్యు డు కె.రామకృష్ణ పరామర్శించారు. పత్రికా విలేకరిపై దాడులు సరైంది కాదన్నారు. దోషులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టు సంఘాల ఖండన
విశాఖపట్నం:విధి నిర్వహణలో ఉన్న ‘సాక్షి’ నాతవరం మండల విలేకరి ఎ.డి.బాబుపై ఆరుగురు దుండగులు మంగళవారం రాత్రి హత్యాయత్నం చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. బీరు సీసాలు, ఇనుప రాడ్లతో దాడి చేయడం దారుణమని, దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.
రూరల్ విలేకరులకు రక్షణ లేకుండా పోయింది
అక్రమాలను పసిగట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తున్న విలేకరులపై దాడులు చేయడం అమానుషం. నిస్వార్ధంగా పనిచేసే రూరల్ విలేకరులకు రక్షణ లేకుండా పోయింది. కొద్ది రోజుల క్రితం రాజమండ్రిలో జర్నలిస్టుపై జరిగిన దాడిని మర్చిపోకముందే ‘సాక్షి’ విలేకరి బాబుపై హత్యాయత్నం జరగడం బాధాకరం. ఇలాంటివి పునరావృతం కాకుండా నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.
–గంట్ల శ్రీనుబాబు, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు
సంఘటితంగా ఎదుర్కోవాలి
చాలా దారుణ సంఘటన ఇది. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు సర్వసాధారణంగా మారుతున్నాయి. జర్నలిస్టుల ఐక్యత చాటుకోవాల్సిన సమయమిది. దాడులను తిప్పికొట్టేందుకు జర్నలిస్టులందరూ సంఘటితం కావాలి. ‘సాక్షి’ విలేకరి ఎ.డి.బాబుపై దాడిని విశాఖ క్రైమ్ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (వీసీఆర్డబ్ల్యూఏ) ఖండిస్తోంది.
–ఎమ్ఎస్ఆర్ ప్రసాద్, కార్యదర్శి, వీసీఆర్డబ్ల్యూఏ
అరెస్టు చేయాలి
సాక్షి విలేకరి ఎ.డి.బాబుపై దాడి చేసింది ఎంతటివారైనా క్రిమినల్ కేసు పెట్టి అరెస్టు చేయాలి. ఇలాంటి దారుణానికి ఒడిగట్టడానికి ఇంకెవ్వరూ ధైర్యం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.
–కాళ్ల సుబ్బారావు, నేషనల్ జర్నలిస్టు ఫోరం సెక్రటరీ, నర్సీపట్నం