
సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుందీ చిత్రం!
పారిశ్రామికవేత్తగా ఎంత బిజీగా ఉన్నా... కేవలం సినిమాపై ఇష్టంతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు డా.కె.వి.సతీశ్. ఎందరో ఔత్సాహికులను తెరకు పరిచయం చేసిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి... సతీశ్ని హీరోగా పరిచయం చేసే బాధ్యతను తలకెత్తుకొని ‘యమలీల-2’ని తెరకెక్కించారు. డి.ఎస్.మ్యాక్స్ సమర్పణలో క్రిష్వి ఫిలింస్ పతాకంపై ఆశా సతీశ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా సతీశ్ చెప్పిన కబుర్లుఆయనే నా గురువు: నాకు సినిమాలంటే ఇష్టం. చిన్నప్పట్నుంచీ సినిమాలు బాగా చూసేవాణ్ణి. ముఖ్యంగా ఇంట్లో టీవీల్లో వచ్చే సినిమాలను వదిలేవాణ్ణి కాదు.
ఇప్పుడు కెమెరా ముందు తేలిగ్గా నటించగలిగానంటే కారణం ఆ అలవాటే. నేను నటనలో శిక్షణ ఎక్కడా తీసుకోలేదు. ఎస్వీ కృష్ణారెడ్డిగారి స్కూల్లోనే అభినయాన్నీ, సంభాషణలు పలికే తీరును, డాన్సులను, ఫైట్లను అభ్యసించాను. ఓ విధంగా నా నట గురువు కృష్ణారెడ్డిగారే. నా శ్రీమతి సహకారం మరచిపోలేను: అందరూ అనుకుంటున్నట్లు ఇది ‘యమలీల’కు సీక్వెల్ కాదు. ఇది కొత్త కథ. వినోదంతో పాటు సామాజిక అంశాలు కూడా ఇందులో ఉంటాయి. కృష్ణారెడ్డి ప్రతి విషయంలోనూ పకడ్బందీగా ఉంటారు.
ఉదాహరణకు ఈ సినిమా గ్రాఫిక్స్. కథకు సంబంధించి ఎంత పరిధిలో గ్రాఫిక్స్ అవసరమవుతాయి, వాటి ఖర్చు ఎంత అవుతుంది.. వంటి అంశాలన్నీ ముందే చూసుకొని రంగంలోకి దిగాం. ఈ సినిమా విషయంలో నా శ్రీమతి ఆశా సతీశ్ అందించిన సహకారం జీవితంలో మరచిపోలేను. నాకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది కూడా తనే.సినిమాకు నిండుతనం తెచ్చారు: కృష్ణారెడ్డి మార్క్ సినిమా ఇది. ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. యముడిగా మోహన్బాబు, చిత్రగుప్తునిగా బ్రహ్మానందం ఈ చిత్రానికి నిండుదనం తెచ్చారు. వారి నుంచి చాలా నేర్చుకున్నాను.