'వైద్య పరీక్షలు చేయమంటే...జాతకం చూడమన్నారు' | US ayurvedic doctor molested on BHU campus in PM Modi's Varanasi | Sakshi
Sakshi News home page

'వైద్య పరీక్షలు చేయమంటే...జాతకం చూడమన్నారు'

May 9 2015 11:33 AM | Updated on Jul 23 2018 8:49 PM

'వైద్య పరీక్షలు చేయమంటే...జాతకం చూడమన్నారు' - Sakshi

'వైద్య పరీక్షలు చేయమంటే...జాతకం చూడమన్నారు'

ప్రసిద్ధ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆవరణలో దేశంలో మహిళల భద్రతను సవాల్ చేసే మరో అవమానకర సంఘటన చోటు చేసుకుంది.

వారణాసి:  ప్రసిద్ధ బనారస్  హిందూ విశ్వవిద్యాలయం ఆవరణలో దేశంలో మహిళల భద్రతను  సవాల్ చేసే మరో అవమానకర సంఘటన   చోటు చేసుకుంది.   క్యాంపస్లో తనపై లైంగిక దాడికి యత్నించారని ఆమెరికాకు చెందిన భారతీయ మహిళా డాక్టర్ ...పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కేసు నమోదుకు సుమారు తొమ్మిది రోజుల పాటు తాత్సారం చేశారు. ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. అయితే వైద్య పరీక్షల కోసం వెళ్లిన  ఆ వైద్యురాలికి మరో చేదు అనుభవం ఎదురైంది.... వివరాల్లోకి వెళితే..

డాక్టర్ భాస్వతి భట్టాచార్య. వారణాసిలోని బనారస్ యూనివర్శిటీలో  ఆయుర్వేదంలో  పీహెచ్డీ చేస్తున్నారు.  సుగర్ వ్యాధి-నివారణపై ఆమె పరిశోధన చేస్తున్నారు. ఏప్రిల్ 22న తన   ఫ్రెండ్తో కలిసి  యూనివర్శిటీలో క్యాంపస్లో నడుస్తుండగా  అయిదుగురు వ్యక్తులు ఆమెపై  లైంగిక దాడికి ప్రయత్నించారు. సెల్ఫోన్ ఎత్తుకుపోయారు. లాప్టాప్ను  ధ్వంసం చేశారు. దీనిపై స్థానిక లంకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి ఆమె చాలా కష్టపడాల్సి వచ్చింది.

ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి  పోలీస్ స్టేషన్కు వెడితే.. నిర్లక్ష్యంగా  వ్యవహరించడమే కాకుండా, కామ్గా ఉండమని సలహా ఇచ్చారన్నారు.  అదృష్టవశాత్తు ఆ రోజు జరిగిన దాడి నుండి తాను తప్పించుకున్నాననీ, లేకుంటే తాను మరో నిర్భయగా మారేదాన్ని అని ఆమె వాపోతున్నారు.  ఆత్మరక్షణ కోసం గతంలో  తాను తీసుకున్న శిక్షణ  ఈ సందర్భంగా తనకు  బాగా ఉపయోగపడిందని డా.భట్టాచార్య తెలిపారు.

చివరికి ఎస్పీ జోక్యం తరువాత కానీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.    లైంగిక దాడి బాధితులను మహిళా  వైద్యులు మాత్రమే పరీక్షించాలన్న కనీస నిబంధనను పక్కన బెట్టి, ఇద్దరు మగ డాక్టర్లు, ఒక మహిళా పోలీస్ అధికారి సమక్షంలో పరీక్షలు నిర్వహించారనీ అది తనకు చాలా బాధ  కలిగించిందని.. మరోసారి లైంగిక దాడి జరిగినంత ఆవేదన కలిగిందని ఆమె వాపోయారు.

అంతేకాదు.. తాను ఆయుర్వేద డాక్టర్  అని తెలియగానే.. తమ అరచేతులు చూపించి, తమ  భవిష్యత్తు చూడమంటూ వైద్యులు బలవంతం చేశారన్నారు.  ఇదంతా  ఒక ఎత్తయితే.. దాడి జరిగిన ప్రదేశానికి తనను  తీసుకెళ్లి అప్పటి సంఘటనను నటించి చూపాలని  పోలీసు అధికారి  వేధించడం మరో ఎత్తు అని డాక్టర్ భాస్వతి భట్టాచార్య ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాని నరేంద్రమోదీ  ఈ సంఘటనపై జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసిన డా.భట్టాచార్య..ప్రధాని విదేశాలపై మోజును విడిచిపెట్టి తనసొంత నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మండిపడ్డారు.  విదేశీ పెట్టుబడిదారుల కంటే దేశంలోని ప్రజల  బాగోగులు ముఖ్యమనే విషయాన్ని మోదీ గుర్తించాలన్నారు.

అయితే దీనిని లంకా పోలీస్ స్టేషన్ అధికారి రమేష్  యాదవ్ ఖండిస్తున్నారు.  కేసు నమోదులో  ఆలస్యానికి కారణం భట్టాచార్యేనన్నారు.  నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.కాగా  ప్రధాని మోదీ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకర్గం వారణాసి.  నిర్భయ డాక్యుమెంటరీ ఉదంతంతో  దేశంలో మహిళలపై పెరుగుతున్న లైంగికదాడులు, మహిళా రక్షణ అంశాలు  ప్రపంచవ్యాప్తంగా  చర్చనీయాంశమైన సంగతి  తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement