
డబుల్స్ టైటిల్ గెలిచిన సానియా జోడి
టోక్యో: డబ్ల్యూటీఏ పసిఫిక్ ఓపెన్ టైటిల్ ను భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి కైవసం చేసుకుంది. డబుల్స్ విభాగంలో శనివారం జరిగిన ఫైనల్లో సానియా జోడి 6-2, 7-5 తేడాతో గార్బైన్ ముగుర్జా, కార్లా నవారోలపై విజయం సాధించి టైటిల్ ను చేజిక్కించుకున్నారు. వరుస రెండు సెట్లలో దూకుడుగా ఆడిన సానియా జోడి స్పెయిన్ జంటను మట్టికరిపించింది. టోర్నీ ఆద్యంతం ఆకట్టుకున్న సానియా జోడి టైటిల్ ను సునాయసంగా ఎగురవేసుకుపోయింది.
గత యూఎస్ ఓపెన్ లో మిక్సిడ్ విభాగంలో టైటిల్ సాధించిన ఊపులో ఉన్న సానియా.. అదే ఊపును ఈ టోర్నీలో కూడా ప్రదర్శించింది. అంతకుముందు శుక్రవారం టాప్సీడ్ సానియా-బ్లాక్ 6-3, 6-2తో అన్సీడ్ జలెనా జంకోవిచ్ (సెర్బియా)-అరంటా పారా సంటోజా (స్పెయిన్)లపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దక్షిణ కొరియాలోని ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో పాల్గొనేందుకు సానియా మీర్జా బయల్దేరి వెళ్లనుంది.