breaking news
Sakshi Special
-
మండిపోయింది..
అనుకున్నట్టుగానే 2025 పర్యావరణపరంగా మరో అవాంఛనీయ రికార్డు మూటగట్టుకుని ని్రష్కమించింది. చరిత్రలో అత్యంత ఎక్కువ వేడిమి నమోదైన మూడో ఏడాదిగా నిలిచింది. నంబర్లపరంగా మూడో స్థానమే అయినా, ప్రపంచవ్యాప్తంగా 2025 పొడవునా అత్యంత తీవ్రతతో కూడిన వాతావరణ మార్పులు పదేపదే చోటుచేసుకుని వణికించాయి. ముఖ్యంగా అతి తీవ్ర వాతావరణ పరిస్థితుల ఉదంతాలు ఏకంగా 157 నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ‘‘ఇవన్నీ పర్యావరణ మార్పుల విపరిణామాలే. ఈ విపత్తును దీటుగా ఎదుర్కొనే ప్రయత్నాలను తక్షణం ముమ్మరం చేయాలి. ఇందుకు ప్రపంచ దేశాలన్నీ కలసి రావాలి. లేదంటే అంతే సంగతులు. మరో రెండు మూడేళ్ల తర్వాత తత్వం బోధపడ్డా, దిద్దుబాటు చర్యలకు అప్పటికి బాగా ఆలస్యమవుతుంది. అప్పుడిక ఏం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమే కాగలదు’’అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పరిమితిని దాటేశాం! 2025 అత్యంత భారీ ఉష్ణోగ్రతలు చవిచూసిన సంవత్సరాల జాబితాలో మూడో స్థానంలో నిలిచిందంటే మనిషి అత్యాశ వల్ల పుట్టుకొచ్చిన పర్యావరణ విపరిణామాల వల్లేనని సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాదు, గత మూడేళ్ల భూ సగటు ఉష్ణోగ్రత పెరుగుదల 2015 నాటి పారిస్ ఒప్పందంలో నిర్దేశించుకున్న 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పరిమితిని దాటేసింది. ఇలా జరగడం ఇదే తొలిసారి!. ఇది కచ్చితమైన ప్రమాద సంకేతమేనని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025లో కేవలం అత్యుష్ణ ప్రతాపాలే కాదు, భయానక తుఫాన్లు, వరదల వంటివి కూడా బెంబేలెత్తించడం గమనార్హం. నిజానికి 2025లో వాతావరణాన్ని సాధారణంగా చల్లబరిచే లా నినా ఆధిపత్యమే కొనసాగింది. అయినా యూరప్తో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఎండలు మండిపోయాయంటే ఆలోచించాల్సిన విషయమేనన్నది నిపుణుల మాట. ‘‘ముఖ్యంగా శిలాజ ఇంధనాల వాడకానికి మనం తక్షణం గుడ్బై చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే అతి త్వరలో పరిస్థితులు చేయి దాటిపోవచ్చు’’అని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ సహ వ్యవస్థాపకుడు, లండన్ ఇంపీరియల్ కాలేజీ పర్యావరణ శాస్త్రవేత్త ఫ్రెడరిక్ ఒట్టో స్పష్టం చేశారు. ‘‘2025లో వచ్చిన పలు వడగాడ్పులు 2015తో పోలిస్తే ఏకంగా 10 రెట్లు శక్తిమంతమైనవి. పైగా ఏడాది పొడవునా అవి పదేపదే సంభవించాయి. ఇదంతా మనిషి కోరి తెచ్చుకుంటున్న విపత్తే’’ అని ఆయన అన్నారు. ప్రమాదంలో కోట్ల మంది 2025లో ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల వాతావరణ పరిస్థితులు అతి వేడిమి నుంచి తీవ్ర వరదలదాక చూస్తుండగానే మారుతూ వచ్చాయి. ‘‘గ్రీస్, టర్కీ మొదలుకుని అమెరికా, ఆ్రస్టేలియా దాకా పలు దేశాల్లో ఎటు చూసినా కార్చిచ్చులు, మెక్సికోను వణికించిన వరదలు, ఫిలిప్పీన్స్ను కుండపోత వానలతో ముంచెత్తిన ఫుంగ్ వాంగ్ తుఫాను, భారత్లో వానాకాలమంతా ఏదో ఒక ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన వరదలు... ఇవన్నీ వాతావరణ మార్పుల విపరిణామాల సంకేతాలే’’ అని ఫ్రెడరిక్ స్పష్టం చేశారు. ‘‘జమైకా, క్యూబా, హైతీ వంటి దేశాలను హరికేన్ మెలిస్సా రెప్పపాటులో అతలాకుతలం చేసింది. కనీసం హెచ్చరికల జారీకి వ్యవధి ఇవ్వకుండా మెరుపు వేగంతో వచ్చి పడింది. ఆ తర్వాత వెంటనే ఆయా దేశాలను ఉష్ణోగ్రతలు అల్లాడించాయి. ఇలాంటి వెంటవెంట మార్పులకు తట్టుకోలేక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రభావితులవుతున్నారు. వారి జీవనోపాధి దెబ్బతింటోంది. ఇది లక్షలాది కుటుంబాలను దారిద్య్రం దిశగా నెడుతోంది. తద్వారా పలు దేశాల్లో నిశ్శబ్దంగా అతి పెద్ద సంక్షోభాలు పురుడు పోసుకునేందుకు కారణంగా మారుతోంది’’ అని ఆయన అన్నారు.‘శిలాజ’ ముప్పుపై చర్యలేవీ? ఇటీవల బ్రెజిల్లో జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ చర్చలు ఈ ప్రమాదకర పరిణామాన్నే హైలైట్ చేశాయి. ముఖ్యంగా గ్లోబల్ వారి్మంగ్కు ప్రధాన కారకాల్లో ఒకటైన శిలాజ ఇంధనాల వాడకాన్ని శరవేగంగా తగ్గించి, వీలైనంత త్వరగా సున్నాకు తేవాలని తీర్మానించాయి. ‘‘కానీ దేశాలన్నీ ఇలాంటి ప్రమాణాలు ఏటా చేస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత తీరిగ్గా విస్మరిస్తూనే ఉన్నాయి. చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలు మాత్రం ఎక్కడా పెద్దగా జరగడం లేదు. చైనాయే ఇందుకు ఉదాహరణ. ఒకవైపు సంప్రదాయేతర ఇంధన వనరుల సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటూనే, మరోవైపు బొగ్గు గనుల తవ్వకాన్ని కూడా విపరీతంగా విస్తరిస్తోంది. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు కొనసాగినంతకాలం పర్యావరణ మార్పులపై సమర్థంగా యుద్ధం చేయడం అసాధ్యమే’’ అని ఫ్రెడరిక్ కుండబద్దలు కొట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇలా ఉంటే చాలు
2026 జనవరి 1.. కొత్త ఏడాది వచ్చేసింది. ‘న్యూ’ ఇయర్లో మనకు నిజంగా కిక్ ఇచ్చేదేమిటి? ‘‘జన వరి 1 నుండి ఇలా ఉండాలి’’ అని గట్టిగా ఒట్టేసు కోవటమే కదా! కానీ ఏమౌతుంది? ఫిబ్రవరి రాగానే.. మాట మీద నిలబడలేక నీరసించి పోతాం. అలాంటి నీరసాలు రాకుండా ఉండాలంటే.. కాస్తంటే కాస్తంత ప్రాక్టికల్గా ఉండే చాలు. మీ జీవితంలో ఇది నిజంగానే ‘న్యూ ఇయర్’ అవుతుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్జీవితం సినిమా కాదుజనవరి 1 నుంచి.. ఎవ్వరూ పూర్తిగా వేరే మనిషి అయిపోరు. లైఫ్ అంటే సినిమా కాదు, స్క్రీన్ ప్లే ప్రకారం మొదలవ్వడానికి! ఒక్క అడుగు ముందుకు పడినా అది విజయమే. సౌండ్ స్లీప్నిద్ర అంటే కష్టపడి పనిచేశాక, అలసిపోయి తీసుకునే విశ్రాంతి కాదు. బాడీ, మైండ్ అన్నింటికీ అదే ఆధారం. ఉదయం లేవగానే.. ఒక చాట్జీపీటీ లేదా జెమినై పనిచేసినట్టు చురుగ్గా పనిచేయాలంటే సౌండ్ స్లీప్ అవసరం. రాత్రి ప్రశాంతంగా పడుకోండి.. ఉదయాన్నే ఫ్రెష్గా నిద్ర లేవండి. ‘జలయజ్ఞం’ ఎందుకు?యాప్లతో కొలుచుకుంటూ, అదో ‘జలయజ్ఞం’లా నీళ్లు తాగకండి. స్విచ్చేస్తేనే పని చేస్తాం అన్నట్టు మనం మరీ యంత్రాల్లా తయారైపోతే ఎలా? పక్కనే ఒక వాటర్ బాటిల్లో ఉంచుకొని ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఒక సిప్ వేయండి చాలు.కదలిక సరిపోతుందిమిమ్మల్ని జిమ్కి వెళ్లి బరువులు ఎత్తమని ఎవరన్నారు? ఎవరో జిమ్ చేసేస్తున్నారని మీరు ఫీలైతే ఎవరిది తప్పు? కాసేపు నడవండి. కాస్త ఒళ్లు విరుచుకోండి. ఓ 10 నిమిషాలు ఏదో ఒక పని చేయండి. నిన్నటి కంటే ఈరోజు కాస్త ఎక్కువ కదిలినా అదే పెద్ద సక్సెస్!వివరణల పురాణంఎవరికైనా, ఎందుకైనా ‘నో’ చెప్పటానికి వెయ్యి పురాణాల వివరణ ఇవ్వక్కర్లేదు. సోషల్ మీడియాలో లైకో షేరో కొట్టినంత ఈజీగా ‘నో’ చెప్పేయండి. మొదట ‘గిల్టీ’గా అనిపించినా, ఒకసారి ‘నో’ చెప్పేశాక చాలా ప్రశాంతంగా ఉంటుంది.ఆన్లైన్ యుద్ధాలేల?!సోషల్ మీడియా యుద్ధాలను ఆపేయండి. ట్రెండింగ్ పోస్టు వైరల్ అయినంత వేగంగా బీపీ పెరగటం తప్ప, అక్కడ గెలిస్తే మీకేమీ ‘ఆస్కార్’ రాదు. కనిపించే ప్రతి పోస్ట్కీ, కామెంట్కీ సమాధానం చెప్పి మీ టైమ్నీ, ఎనర్జీనీ వేస్ట్ చేసుకోకండి.బండి ‘స్టార్ట్’ చేయండికాన్ఫిడెన్స్ వచ్చాకే మొదలుపెడదాం అని వెయిట్ చేయకండి! ఏదైనా పని మొదలుపెట్టిన తర్వాతే ధైర్యం వస్తుంది. అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాకే అడుగు వేస్తాను అనుకుంటే, ఉన్నచోటే ఉండిపోతారు.‘క్యాష్’ ఫీలింగ్మీరు సంపాదించే ప్రతి రూపాయీ జాగ్రత్త. అలాగని.. తినే తిండిని, ఎంజాయ్మెంట్నీ కట్ చేయకండి. మీ జేబులోంచి రూపాయి ఎక్కడికి, ఎందుకు వెళ్తుందో గమనించండి. ఆ మాత్రం ‘క్యాష్’ ఫీలింగ్ ఉండాలి.ఒకటైనా ఫర్ఫెక్ట్గా..ఏ పనైనా స్టార్ట్ చేసిన తర్వాత వర్కవుట్ అవ్వట్లేదనిపిస్తే, దాన్ని అక్కడితో వదిలేసి ప్రశాంతంగా ఉండండి. సగం సగం వదిలేసిన పది పనుల కంటే, పర్ఫెక్ట్గా పూర్తి చేసిన ఒక్క పని మీకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది.రక్త పిశాచులకు దూరం!మీ ఎనర్జీని పీల్చేసే రక్త పిశాచులకు కాస్త దూరంగా ఉండండి! మీ మనశ్శాంతిని మీరు కాపాడుకోవడం స్వార్థం ఏమీ కాదు, అది ఒక ‘లైఫ్ సేవింగ్’ టెక్నిక్. వారానికో ఆశమన సంతోషాన్ని మనమే షెడ్యూల్ చేసుకోవాలి. ఒక ప్లాన్ ఉందంటే, ‘ఆహా, ఈ సండే ఎంజాయ్ చేయొచ్చు’ అనే ఆశ ఉంటుంది. ఆ అనుభవం మధురానుభూతిగా మిగులుతుంది. లేదంటే ప్రతి వారం ఒకేలా చప్పగా ఉంటుంది.వదిలేసి చూద్దురూ..!పాత పగల్ని, కక్షల్ని, కోపాల్ని పట్టుకుని వేలాడకండి. అవి అనవసర రోగాలు తీసుకొచ్చి ఆసుపత్రులను పోషించడానికి తప్ప ఎందుకూ పనికిరావు. ఒకసారి పగలూ, కోపాలూ ప్రతీకారాలూ వదిలేసి చూడండి, సోషల్ మీడియా కాసేపు స్తంభించిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత హాయిగా ఉంటుంది.మీకు మీరే సపోర్ట్ఎప్పుడూ మిమ్మల్ని మీరే తిట్టుకుంటూ, తక్కువ చేసుకుంటూ ఉంటే.. మీ పతనానికి బయట శత్రువులు అవసరమే లేదు. మీకు మీరే సపోర్టింగ్ పిల్లర్. ప్రాంప్ట్ ఇస్తేనే పనిచేసే ఏఐ చాట్బాట్లా ఉండకండి.కొత్తగా ఏదైనా..కొత్త లాంగ్వేజ్ లేదా ఒక కొత్త సాఫ్ట్వేర్ లేదా మ్యూజిక్.. ఇలా మీకు నచ్చింది, కొత్తది ఏదో ఒకటి నేర్చుకోండి. టార్గెట్లు అవీ పెట్టేసుకుని.. ఒక్కరోజులోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయాల్సిన టాస్క్లా ఫీల వకండి. మెల్లగా నేర్చుకున్నా సరే, అది నేర్చుకోవడమే.చెప్పుకొంటే తప్పేంటిమీకు సలహా కావాలన్నా, కాస్త సపోర్ట్ కావాలన్నా, లేదంటే మీ గోడు వినే మనిషి కావాలన్నా.. మీ సర్కిల్లో ఎవరో ఒకర్ని ఎంచుకోండి. మీ బాధలు చెప్పే క్రమంలో.. తనను హింసించకండి. తను కూడా మీలాంటి మనిషే అని గుర్తుంచుకోండి.మారటం మంచిదేఈ ఏడాది మీ ఇష్టాలు మారొచ్చు, కొన్ని లక్ష్యాలు మీకు పనికిరావు అనిపించవచ్చు. అది ఫెయిల్యూర్ కాదు, మీ ఎదుగుదల! పరిస్థితులకు తగ్గట్టుగా ప్లాన్స్ మార్చుకోవడం కూడా అప్డేట్ అవటమే.ఇల్లు ‘షోరూమ్’ కాదుమీ ఇల్లేమీ షోరూమ్ కాదు.. తళతళలాడుతూ ఉండాల్సిన అవసరమే లేదు. ఒకే రోజు ఇల్లంతా ఊడ్చి, తుడిచి, సర్ది నడుము విరగ్గొట్టుకోవడం కంటే.. రోజుకి కొంచెంగా క్లీన్ చేసుకోండి. అలాగే మెంటెయిన్ చేయండి చాలు!క్యాచ్ ద సిగ్నల్స్మీ బాడీ ఇచ్చే ‘సిగ్నల్స్’ని గమనించండి. అలసట, నొప్పులు.. ఊరికే రావు. అలాగని అన్నింటికీ భయాలూ పెంచుకోకండి. ఓ వయసు దాటాక అవసరమైన టెస్టులు చేయించుకోవ డం.. అత్యవ సరమైతే డాక్టర్లని సంప్రదించడం సర్వ సాధారణం అన్న విషయాన్ని మనసుకు సర్దిచెప్పండి.సిలబస్ ‘బుక్’ కాదుమంచి పుస్తకాల్ని చదవడం మంచిదే. కానీ అదేదో ఎగ్జామ్లానో సిలబస్ లానో ఫీల్ అవ్వకండి! ఎవరో చదువుతున్నారని మీరు కూడా ఏదో పుస్తకాన్ని కొని.. పట్టుకుని వేలాడాల్సిన అవసరం లేదు.అంతిమంగా..2026లో మీరు ఒక ‘పర్ఫెక్ట్ బొమ్మ’లా ఉండక్కర్లేదు. తప్పులు జరిగితే సరిచేసుకునే.. అలసిపోతే రెస్ట్ తీసుకునే.. మళ్లీ మళ్లీ ప్రయత్నించే ఒక ‘నిజమైన’ మనిషిగా ఉంటే చాలు. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా తడబడినా.. సో వాట్? తిరిగి కొత్తగా మొదలుపెట్టండి. దాని కోసం మళ్లీ జనవరి 1 దాకా ఆగక్కర్లేదు. ఏదో ఒక మామూలు గురువారం (ఇది మీ ఇష్టం) మధ్యాహ్నం (ఇది కూడా..) 3 గంటలకు (ఇది.. కూడా) మీ లైఫ్ని మీరు రీస్టార్ట్ చేయొచ్చు!మీ లైఫ్.. మీ ఇష్టం.. దాన్ని బాగుచేసుకునేందుకు అది మీరు పడే కష్టం. ఆ కష్టం ఎవ్వరూ పడరు.. మీకు కష్టమొస్తే ఎవ్వరూ తీర్చరు. మైండిట్!హ్యాపీ న్యూ ఇయర్.. -
2025 ఏ టు జెడ్
2025 ప్రపంచమంతటికీ తీపి, చేదుల మిశ్రమంగా గడిచింది. ప్రాకృతిక విపత్తులు, ఘోర ప్రమాదాలు, రాజకీయపుటెత్తులు, యుద్ధక్రీడలు, నేతల నోటి దురుసులు, ఎన్నికల సమరాంగణాలు... ఇలా మొత్తమ్మీద మోదం పంచిన ఘటనలు కొన్నే కాగా చాలావరకు ఖేదమే మిగిలించాయి. ఆంగ్ల అక్షరక్రమంలో అలాంటి ఘటనల సమాహారం...ఎ - ఎయిరిండియా ప్రమాదం జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా–171 విమానం టేకాఫైన 32 సెకన్లకే రన్వే ఎదురుగా ఉన్న మెడికల్ కాలేజీ హాస్టల్పై కుప్పకూలింది. విమానంలోని 242 మంది, కింద ఉన్న మరో 19 మంది నిర్భాగ్యుల ప్రాణాలను గాల్లో కలిపింది. ఈ ఘోర ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక ప్రయాణికుడు మృత్యుంజయునిగా చిన్నపాటి గాయాలతో బయటపడటం విశేషం.బి - బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలను అధికార ఎన్డీఏ, ఆర్జేడీ సారథ్యంలోని విపక్ష మహాఘట్బంధన్ కూటములు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్డీఏ కూటమి 243 అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా 202 చోట్ల విజయదుందుభి మోగించి ఆశ్చర్యపరిచింది. ఘట్బంధన్ కేవలం 35 స్థానాలతో ఘోర పరాభవం మూటగట్టుకుంది. నితీశ్కుమార్ సీఎంగా ఏకంగా పదోసారి ప్రమాణస్వీకారం చేశారు. సి - క్యాస్ట్ సెన్సెస్ కరోనా కారణంగా 2020లో వాయిదాపడ్డ జనగణనను దేశవ్యాప్తంగా చేపట్టనున్నట్లు కేంద్రం ఏప్రిల్లో ప్రకటించింది. ఇది 2027 మార్చి నుంచి మొదలవనుంది. అందులో భాగంగా కులగణన సైతం చేపడుతున్నట్టు వెల్లడించడం విశేషం. బ్రిటిష్ హయాంలో మన దేశంలో 1881 నుంచి 1931 దాకా కులగణన జరిగింది. కుల విభజనను పెంచరాదనే ఉద్దేశంతో స్వాతంత్య్రానంతరం ఆ ప్రక్రియను నిలిపేశారు. 2011లో సామాజిక, ఆర్థిక కులగణన చేసినా దాన్ని పూర్తిస్థాయి కులగణనగా పరిగణించడం లేదు. డి - డీప్సీక్ ఈ చైనా ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ప్రపంచవ్యాప్తంగా పెను దుమారమే రేపింది. డౌన్లోడ్ చార్టుల్లో చూస్తుండగానే అగ్రస్థానానికి దూసుకెళ్లి ప్రత్యర్థి ఓపెన్ ఏఐకి చెందిన చాట్జీపీటీని తోసిరాజంది. దాంతో పోలిస్తే కారుచౌకగా సేవలందిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా డీప్సీక్–ఆర్1ను విడుదల చేసింది. దీని దెబ్బకు ఓపెన్ఏఐ మార్కెట్ విలువ 600 బిలియన్ల మేరకు తగ్గిపోయింది. ఇ - ఎప్స్టీన్ ఫైల్స్ 20 ఏళ్లనాటి ఈ కామ భూతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. వారి లైంగికానందం కోసం బాలికలను ఎరవేసిన వ్యాపారి ఎప్స్టీన్ చివరికి ఆత్మహత్య చేసుకున్నా, ఆ ఉదంతం ఇప్పటికీ దుమారం రేపుతూనే ఉంది. ఈ కేసు విచారణ ఫైళ్లను బయటపెట్టాలన్న కాంగ్రెస్ ఉత్తర్వులపై ట్రంప్ అయిష్టంగానే సంతకం చేసినా, తనకు నష్టం లేనివాటిని మాత్రమే, అదీ విడతలవారీగా వదులుతూ సాగదీస్తున్నారు. ఎఫ్ - ఫ్లడ్స్ ఇన్ ఆసియా నానాటికీ తీవ్రమవుతున్న పర్యావరణ మార్పుల సమస్యకు ఈ ఏడాది ఆసియా దేశాలను అతలాకుతలం చేసిన వరదలు అద్దంపట్టాయి. శ్రీలంక, ఇండొనేసియా, థాయ్లాండ్, మలేసియా, వియత్నాం తుఫాన్ల దెబ్బకు కుదేలయ్యాయి. ఈ విపత్తు భారత్ను కూడా తీవ్రంగానే నష్టపరిచింది. ఆగ్నేయాసియా దేశాల్లో ఆకస్మిక వరదలు, తుపాన్లు వేలాది నిండు ప్రాణాలను బలిగొన్నాయి. జెన్–జెడ్ ఆందోళనలు ప్రభుత్వాల, పాలకుల కర్రపెత్తనంపై ఆన్లైన్ వీరులు ఆఫ్లైన్లో ఆందోళనలకు దిగితే ఎలా ఉంటుందో నవతరం రుచిచూపింది. ఈ నవయువత నిరసన గళాల ధాటికి నేపాల్లో ప్రధాని కేపీ శర్మ ఓలి గద్దె దిగాల్సి వచ్చింది. జెన్–జెడ్ ఆందోళనలు నేపాల్కే పరిమితం కాలేదు. ఇండొనేసియా మొదలుకుని మడగాస్కర్, బల్గేరియా మీదుగా పెరు, మెక్సికో దాకా విస్తరించాయి.జి - హాంకాంగ్ అగ్ని ప్రమాదంఅగ్నిగోళంలా మండిపోతున్న ఆకాశహర్మ్యం. దానికేసి వేలెత్తి చూపుతూ, తన భార్య అందులో చిక్కుబడిందంటూ విలపిస్తున్న వృద్ధుని ఫొటో. ఇటీవల ఆన్లైన్లో వారాల తరబడి వైరల్గా మారిన చిత్రమిది. అందుకు కారణమైన హాంకాంగ్లోని వాంగ్ఫుక్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం 160 మందిని పొట్టనపెట్టుకుంది. 40 గంటలకు పైగా శ్రమిస్తేనే గానీ మంటలు అదుపులోకి రాలేదు.హెచ్ - ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్12 రోజుల యుద్ధంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఈ పోరు ఇరాన్ను కోలుకోలేని దెబ్బ తీసింది. అమెరికా దన్నుతో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక, క్షిపణి దాడులు ఇరాన్ సైనిక వ్యవస్థలతో పాటు అణు వ్యవస్థలనూ తీవ్రంగా నష్టపరిచాయి. ఇరాన్పై బంకర్ బస్టర్ బాంబులేసి అమెరికా యుద్ధజ్వాలల్లో చలికాచుకుంది. తర్వాత తీరిగ్గా తానే సంధి చేసి జబ్బలు చరుచుకుంది.జె జగ్దీప్ ధన్ఖడ్మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఉపరాష్ట్రపతి పదవికి హఠాత్తుగా రాజీనామా చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు ధన్ఖడ్. ఆరోగ్య కారణాలను చూపుతూ జూలై 21న తప్పుకున్నారు. రాజ్యసభ చైర్మన్గా సభలో చురుగ్గా వ్యవహరిస్తూ, అధికార పక్షానికి పెట్టని కోటగా నిలుస్తూ వచ్చిన ఆయన రాజీనామా సంచలనమే సృష్టించింది. ఇలా తప్పుకున్న తొలి ఉపరాష్ట్రపతి ఆయనే కావడం విశేషం. పలు అంశాలపై కేంద్రంతో ఆయనకు కొంతకాలంగా అంతరం పెరుగుతూ వచ్చిందంటారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు రాజ్యసభలో విపక్షాలిచ్చిన నోటీసును ధన్ఖడ్ స్వీకరించడాన్ని ప్రభుత్వ పెద్దలు తప్పుబట్టడం రాజీనామాకు తక్షణ కారణంగా నిలిచిందని అంటారు.కె కర్ణాటకలో సిద్ధూ వర్సెస్ డీకే కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత పవర్ పాలిటిక్స్ కుస్తీ పోటీలను తలపిస్తున్నాయి. గద్దె దిగేందుకు సీఎం సిద్ధరామయ్య ససేమిరా అంటుండటం, ఒప్పందం ప్రకారం కురీ్చని తనకు అప్పగించాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పట్టుబడుతుండటం అధిష్టానానికి తీరని తలనొప్పిగా మారింది. చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రులుగా కొనసాగేలా హైకమాండే ఒప్పందం కుదిర్చిన నేపథ్యంలో ఇప్పుడు తన వంతు వచ్చిందన్నది డీకే వాదన.ఎల్ - లౌరే దోపిడీ ఈ శతాబ్దంలోనే అతి పెద్ద దోపిడీగా సంచలనం సృష్టించింది. పారిస్లోని లౌరే ఆర్ట్స్ గ్యాలరీలోకి అక్టోబర్ 19న ఆదివారం వేళ నలుగురు దోపిడీ దొంగలు చొరబడ్డారు. అత్యంత విలువైన, చారిత్రక ప్రాధాన్యమున్న 8 అమూల్య ఆభరణాలను కాజేశారు. వాటి విలువ ఏకంగా 10 కోట్ల డాలర్లుగా తేలింది. ఇంతటి దోపిడీని దొంగలు కేవలం ఏడంటే 7 నిమిషాల్లో పని ముగించి జారుకోవడం విశేషం. ఎం - మోదీ 2025లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభ మరింత పెరిగింది. నిజానికి గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీని నిలబెట్టుకోకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయా ల్సి వచ్చింది. జేడీ (యూ) వంటి పారీ్టల మద్దతు కీలకంగా మారడంతో మోదీకి ఇక కష్టకాలమేనన్న అంచనాలూ వెలువడ్డాయి. కానీ కీలకమైన ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయాలతో ఆయన గ్రాఫ్ మరింత పెరిగింది. అంతర్జాతీయ వేదికలపైనా మోదీ పేరుప్రఖ్యాతులు మరింతగా పెరిగాయి. జీ7తో పాటు ఏ శిఖరాగ్ర సదస్సులోనైనా ఆయనే ప్రధాన ఆకర్షణగా మారుతున్న పరిస్థితి!ఎన్ - నెట్ఫ్లిక్స్–వార్నర్ బ్రదర్స్ డీల్ ప్రపంచవ్యాప్తంగా వినోదపు తీరుతెన్నులనే సమూలంగా మార్చేయగల పరిణామంగా అంతా పేర్కొంటున్న ఒప్పందమిది. వార్నర్ బ్రదర్స్ టీవీ స్టూడియోలతో పాటు కీలకమైన స్ట్రీమింగ్ విభాగాన్ని నెట్ఫ్లిక్స్ ఏకంగా 6.47 లక్షల కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది! హ్యారీపోటర్, సూపర్మ్యాన్, బ్యాట్మ్యాన్, గేమ్ ఆఫ్ థోర్న్ వంటి బ్లాక్బస్టర్ మూవీ సిరీస్లతో పాటు స్కూబీ డూ, టామ్ అండ్ జెర్రీ కామిక్స్, హెచ్బీఓ మాక్స్ ఓటీటీ ప్లాట్ఫాం, డిస్కవరీ చానల్ వంటివన్నీ వార్నర్ నుంచి నెట్ఫ్లిక్స్ సొంతమవుతాయి. ఈ దెబ్బకు చాలా దేశాల్లో సినిమా థియేటర్లు మూతబడటం ఖాయమన్న అంచనాలున్నాయి. ఓ - ఆపరేషన్ సిందూర్ మే 7 తెల్లవారుజాము. బైసారన్ లోయలో 26 మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్నందుకు ప్రతీకారంగా మన సైన్యం కొట్టిన దెబ్బకు దాయాది గింగిరాలు తిరిగిన రోజు. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి వందలాది ముష్కరులను హతమార్చి భరతమాతకు రక్తసిందూరం దిద్దిన రోజు. సరిహద్దుల వెంబడి చిన్నాచితకా దాడులతో ఒకట్రెండు రోజులు ప్రతిఘటిస్తున్నట్టు నటించినా, మన దెబ్బకు కీలక వైమానిక స్థావరాలన్నీ వరుసబెట్టి ధ్వంసం కావడంతో మూడో నాటికే పాక్ కాళ్లబేరానికి వచ్చి సంధి చేసుకుంది. పి - పహల్గాం ఉగ్ర దాడి ఏప్రిల్ 22న జమ్మూకశీ్మర్లోని పహల్గాం ప్రాంతం అమాయక పర్యాటకుల రక్తంతో ఎరుపెక్కింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా హిందువులనే లక్ష్యం చేసుకుంటూ ఉన్మాదులు హత్యాకాండకు తెగబడ్డారు. వారిని పేర్లడిగి మరీ కాల్చి చంపారు. దేశమంతటినీ ఆగ్రహావేశాలకు లోను చేసిన ఈ దారుణం ఆపరేషన్ సిందూర్కు దారితీసింది.క్యూ - క్వైట్, పిగ్గీ! మహిళా జర్నలిస్టులను అవమానించే దుర్లక్షణం ట్రంప్ను ఓ పట్టాన వదిలేలా లేదు. ఎప్స్టీన్ వివాదానికి సంబంధించి ప్రశ్నించిన బ్లూంబర్గ్ న్యూస్ జర్నలిస్టు కేథరిన్ లూసీపై ఆయన దారుణంగా నోరు పారేసుకున్నారు. అదే అంశంపై ఆమె రెట్టించడంతో ఉక్రోషానికి లోనై ‘క్వైట్, క్వైట్, పిగ్గీ!’అంటూ అవమానకర పదజాలం వాడుతూ అరుపులకు దిగారు. సదరు వీడియోను మిలియన్ల మంది వీక్షించారు. ట్రంప్ తీరును అంతా తీవ్రంగా ఆక్షేపించారు. ‘క్వైట్, పిగ్గీ’ హా‹Ùట్యాగ్తో నెటిజన్లు హోరెత్తించారు. ట్రంప్ను గేలి చేస్తూ దీనిపై మీమ్లూ ఇంటర్నెట్ను ముంచెత్తాయి. ఆర్ - రాహుల్గాంధీ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాం«దీకి 2025 కష్టకాలంగానే సాగింది. విపక్ష నేత పదవికి న్యాయం చేయడంలో ఆయన విఫలమవుతున్నారన్న అభిప్రాయాలు నానాటికీ విస్తరిస్తున్నాయి. ఢిల్లీతో పాటు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరీ సోదిలో కూడా లేకుండాపోవడం రాహుల్ నాయకత్వ సామర్థ్యంపై అనుమానాలకు తావిచ్చింది. వయనాడ్ నుంచి లోక్సభకు ఎన్నికైన ఆయన సోదరి ప్రియాంకా పారీ్టలో ఇక మరింత ‘క్రియాశీలక’ పాత్ర పోషించాల్సిన సమయం వచ్చిందని పలువురు కాంగ్రెస్ నేతలే అభిప్రాయపడుతున్న పరిస్థితి! ఎస్ - సెంగర్ అత్యాచార కేసు తీర్పు సంచలనం సృష్టించిన ఉన్నావ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగర్ తాజాగా మరోసారి పతాక శీర్షికల్లోకి ఎక్కాడు. అతని జీవితఖైదును సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనపై అత్యాచారానికి ఒడిగట్టడమే గాక న్యాయ పోరాటానికి దిగిన తన తండ్రిని కూడా చంపించిన సెంగర్కు ఉరిశిక్ష పడేదాకా వదిలేది లేదని బాధితురాలు అన్నారు.ఎక్స్ - షీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ ఏడాది చాలారకాలుగా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ట్రంప్ టారిఫ్లకు బెదరకుండా అమెరికాపై అంతకుమించిన స్థాయిలో టారిఫ్లు బాదారు. ఎన్నడూ లేనట్టుగా మోదీతో సాన్నిహిత్యం పెంచుకుని భారత్నూ ఆకట్టుకున్నారు. వారిద్దరూ కలిసి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో నవ్వులు చిందిస్తున్న ఫొటో అయితే ట్రంప్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. వై - యమున ప్రక్షాళన నానాటికీ కాలుష్య కాసారంగా మారుతున్న యమునా నదిని తిరిగి పరిశుభ్రంగా మార్చేందుకు కేంద్రంతో పాటు ఢిల్లీ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం ఏకంగా రూ.57 వేల కోట్లతో మాస్టర్ ప్లానే ప్రకటించింది. దేశ రాజధానిలో మురుగునీటి శుద్ధి సామర్థ్యం పెంపు కోసం 9 ప్రాజెక్టులను తెరపైకి తెచ్చింది. ఢిల్లీ పరిధిలోని కేవలం 22 కిలోమీటర్ల నిడివే యమున కాలుష్యంలో ఏకంగా 80 శాతానికి కారణంగా మారుతోంది! జెడ్ - జొహ్రాన్ మమ్దానీ ఒక మేయర్ ఎన్నికకు ఏకంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే కూడా క్రేజ్ వచ్చిన సందర్భం బహుశా ఇదొక్కటేనేమో! న్యూయార్క్ మేయర్గా 34 ఏళ్ల ముస్లిం విద్యాధికుడు జొహ్రాన్ మమ్దానీ ఎన్నిక పలు రకాలుగా చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది. ఆయన్ను ఓడించేందుకు ట్రంప్ అపార శక్తియుక్తులన్నీ వినియోగించినా లాభం లేకపోయింది. మమ్దానీ ప్రఖ్యాత భారతీయ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు.టి - టారిఫ్లు ఈ ఏడాదంతా దేశదేశాలను వణికించిన పదమిది. ట్రంప్ ఎడాపెడా పెంచిన టారిఫ్ల దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ తొలుత బెంబేలెత్తిపోయాయి. కానీ చైనా ప్రతీకార టారిఫ్ల దెబ్బకు ట్రంపే చివరికి కాళ్లబేరానికి రావాల్సి వచ్చింది. తర్వాత ఒక్కొక్క దేశంపైనా టారిఫ్లను ఇష్టానికి పెంచుతూ, తగ్గిస్తూ తన స్థాయినీ, అమెరికా స్థాయినీ పలుచన చేసుకున్నారాయన. భారత్పైనా ఒక దశలో 50 శాతం దాకా భారీ టారిఫ్లు విధించినా, వాటిని వెనక్కు తీసుకుని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే పనిలో పడ్డారు.యు - ఉక్రెయిన్ శాంతి చర్చలు ప్రపంచానికి ఈ ఏడాది కాస్త ఉపశమనం ఇచ్చిన ఉదంతమిది. మూడున్నరేళ్ల పై చిలుకు యుద్ధానికి తెర దించేందుకు రష్యా సుముఖత వెలిబుచ్చడంతో ఇరు దేశాలతో అమెరికా అత్యున్నత స్థాయిలో శాంతి చర్చలు జరుపుతోంది. ఈ శాంతి వీచికల కారణంగా ఉక్రెయిన్పై రష్యా దాడుల ధాటి బాగా తగ్గింది.వి - వెనెజులా ధిక్కారం వెనెజులాలోని అపార చమురు నిల్వలపై కన్నేసిన తెంపరి ట్రంప్, వాటిని సొంతం చేసుకునేందుకు అవసరమైతే ఆ దేశంపై యుద్ధానికి వెనకాడబోనని ప్రకటించి ప్రపంచానికి షాకిచ్చారు. ఆ దేశపు చమురు నౌకలను నానా సాకులతో దిగ్బంధిస్తూ, పేల్చేస్తూ కల్లోలం సృష్టిస్తున్నారు. ఏదేమైనా అమెరికాకు తలొగ్గేదే లేదని అధ్యక్షుడు మదురో ధిక్కార స్వరం వినిపించడంతో ట్రంప్ నోట్లో పచ్చి వెలక్కాయ పడింది.డబ్ల్యూ - వక్ఫ్ సవరణ చట్టం మోదీ సర్కారు తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం–2025ను వివాదాలు చుట్టుముట్టాయి. వక్ఫ్ ఆస్తులపై కర్రపెత్తనమే దీని లక్ష్యమని ముస్లిం బోర్డులు, సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పుంఖానుపుంఖాలుగా పిటిషన్లు దాఖలయ్యాయి. కనీసం ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తున్నవారు మాత్రమే వక్ఫ్ (దానం) ఇవ్వొచ్చు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిళ్లలో ఇద్దరు ముస్లిమేతర సభ్యుల వంటి నిబంధనలన్నీ వక్ఫ్ ఆస్తుల స్వా«దీనం కోసం పెట్టినవేనని దుయ్యబడుతున్నాయి. సుప్రీంకోర్టు కొన్ని నిబంధనలను తాత్కాలికంగా పక్కన పెట్టగా మరికొన్నింటిపై పిటిషనర్ల అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో వక్ఫ్ కేసులో తుది తీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
2025..1.22 లక్షలు ఉద్యోగాలు ఔట్..
సాక్షి, స్పెషల్ డెస్క్: సాంకేతికరంగ కంపెనీల్లో ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఏఐ చిచ్చు ప్రధానంగా ఐటీ రంగంపైనే ప్రభావం చూపుతోంది. కంపె నీలు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, పునర్ వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తుండటంతో ఉద్యోగుల తీసివేతలు తప్పడం లేదన్నది పరిశ్రమ వర్గాల మాట. కోవిడ్–19 మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా కొంత కాలంపాటు టెక్ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా నియామ కాలు చేపట్టాయి. అయితే స్థూల ఆర్థిక ఒత్తిళ్లతోకొన్నాళ్లుగా మార్కెట్ దిద్దుబాటుకు గురవుతోంది. ఇటీవలి కాలంలో ఏఐ, ఆటోమేషన్ వైపు పరిశ్రమ మళ్లుతోంది. దీని ఫలితంగా 2025లో ప్రపంచవ్యాప్తంగా 257 టెక్ సంస్థలు 1.22 లక్షల మందికి ఉద్వాసన పలికాయని ఉద్యోగుల తొలగింపులను ట్రాక్ చేస్తున్న లేఆఫ్స్. ఎఫ్వైఐ వెబ్సైట్ వెల్లడించింది. సిబ్బందిని ఇంటికి సాగనంపిన సంస్థల్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ దిగ్గజాలూ ఉన్నాయి. కానీ 2023తో పోలిస్తే ఈ తీసివేతలు సగానికంటే తక్కువే కావ డం గమనార్హం. మరో సాంకేతిక దిగ్గజం యాపిల్ సైతం డజన్లకొద్దీ సేల్స్ సిబ్బందిని కుదించింది. ద్రవ్యోల్బణం, సుంకాల కారణంగా పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో కంపెనీలు వ్యయాలను తగ్గించుకోవడానికి మార్గాలను అన్వే షిస్తున్నాయి. తక్కువ మంది ఉద్యోగులతో కార్యకలా పాలను నిర్వహించడం, ఏఐపై ఆధారపడటం కంపెనీలకు ఆకర్షణీయమైన స్వల్పకాలిక పరిష్కారంగా కనిపిస్తోంది.లేఆఫ్స్కు ప్రధాన కారణాలు ఇవీ..1. ఓవర్ హైరింగ్–మార్కెట్ కరెక్షన్ కోవిడ్–19 సమయంలో ఈ–కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, రిమోట్ వర్క్ టూల్స్కు డిమాండ్ పెరిగింది. దీంతో టెక్ పరిశ్రమలో భారీ నియామకాలకు దారితీసింది. ప్రస్తుతం మార్కెట్ యథాతథ స్థితికి చేరుకోవడం, డిమాండ్ వృద్ధి సాధారణం కావడంతో కంపెనీలు తాము అధిక సిబ్బందితో ఉన్నట్లు గుర్తించాయి. ప్రస్తుత డిమాండ్కు అనుగుణంగా శ్రామిక శక్తిని సరైన పరిమాణంలో ఉపయోగిస్తున్నాయి.2. పెట్టుబడిదారుల డిమాండ్స్ అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, మాంద్యం భయాలు వంటి ప్రపంచ ఆర్థిక ఎదురుగాలులు నిర్వహణ ఖర్చులను పెంచడంతోపాటు లాభాలను తగ్గించాయి. పెట్టుబడి దారులు ఇప్పుడు లాభదాయకత, ఆర్థిక క్రమశిక్ష ణను కోరుతున్నారు. ఖర్చులను తగ్గించడానికి, లాభాలను మెరుగుపరచడానికి తొలగింపులను కంపెనీలు తక్షణ మార్గంగా భావిస్తున్నాయి.3. ఏఐ, ఆటోమేషన్ వైపు పయనం ఏఐ, ఆటోమేషన్ విభాగాల్లో వేగవంతమైన అభివృద్ధి, స్వీకరణ ఉద్యోగుల తొలగింపులకు ప్రధాన కారణం. కంపెనీలు ఏఐ మౌలిక సదుపాయాలు, పరిశోధనలో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెడుతున్నాయి. నిధులు సమకూర్చ డానికి ఇతర విభాగాల్లో సిబ్బందిని తగ్గిస్తున్నాయి. కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ వంటి రంగాల్లో రోజువారీ పనులను ఏఐ ఆటోమేట్ చేస్తోంది. కార్మికుల అవసరాన్ని తగ్గిస్తోంది. ఐటీ పరిశ్రమలో నైపుణ్యాల పునఃసమీక్షకు దారితీస్తోంది.4. సమర్థతకు పెద్దపీట అనేక టెక్ దిగ్గజాలు నిర్వహణ సామర్థ్యం, వేగంపై దృష్టిసారించాయి. భవిష్యత్ వృద్ధి విభాగాలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు వీలుగా అప్రాధాన్య ప్రాజెక్టులు, పేలవమైన పనితీరుగల యూనిట్లను తగ్గించుకుంటున్నాయి.5. నిర్దిష్ట రంగాల్లో తగ్గుతున్న డిమాండ్ వ్యక్తిగత కంప్యూటర్లు, గేమింగ్ కన్సోల్స్, సంప్రదాయ నెట్వర్కింగ్ హార్డ్వేర్ వంటి కొన్ని ఉత్పత్తులకు డిమాండ్ తగ్గింది. ఫలితంగా వాటితో ముడిపడి ఉన్న నిర్దిష్ట వ్యాపార యూనిట్లలో ఉద్యోగాల కోతలు ఏర్పడుతున్నాయి. -
మిడిల్ క్లాస్ సప్తపది
జీతం చాలా ఎక్కువ. ఖర్చులు అంతకన్నా ఎక్కువ. ఏం లాభం? అందుకే... ఎంత సంపాదించామన్నది కాదు..! ఎంత ఖర్చు పెట్టాం, ఎంత పొదుపు చేశాం? అన్నదే ముఖ్యం. అదే మన జీవిత గమనాన్ని నిర్ణయిస్తుంది. మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక సమస్యలకు ప్రధాన కారణం ఆదాయం తక్కువగా ఉండడం కాదు. కాలం చెల్లిన ‘మనీ’ సూత్రాలను పట్టుకుని వేలాడటమే. ఖర్చులు ఆదాయాన్ని మించకుండా చూసుకుంటే మధ్యతరగతి వారయినా మహారాజుల్లా బతికేయొచ్చు. అందుకోసం ఈ 7 సూత్రాలు పాటించడం మాత్రం తప్పనిసరి. కొత్త సంవత్సరంలోనైనా పాటించాల్సిన ఈ ‘సప్త పది’ గురించి వివరించేదే ఈ ‘వెల్త్’ స్టోరీ...అత్యవసర నిధి.. అవసరం వచ్చినప్పుడు సాయం కోసం ఒకరి దగ్గర చేయి చాచటమనేది చాలా ఇబ్బందికరం. ఒకప్పుడు మనుషుల మధ్య బంధాలను డబ్బుతో కొలవటమనేది తక్కువ. ఇపుడు ఎవరినైనా అడిగినా... వారు ఎంత దగ్గరివారైనా ఇస్తారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే వాళ్లకూ ఏవో అవసరాలు ఉండి ఉండొచ్చు. పైపెచ్చు మన అవసరాన్ని వాళ్లు గుర్తించకపోవచ్చు. అందుకని ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా ఎదుర్కొనేందుకు వీలుగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం తెలివైన నిర్ణయం. అత్యవసర నిధి అన్నది ఆప్షనల్ కాదు. తప్పనిసరి. రాజీపడకూడనిది. → కరోనా సమయంలో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండి. ఆస్పత్రిలో వైద్యం కోసం చాలామంది లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అదే సమయంలో ఉద్యోగం, ఉపాధి కోల్పోయిన వారెందరో. కొన్ని సంస్థలు అయితే వేతనాలకు కోత పెట్టాయి. చేస్తున్న ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని అనిశ్చితి. → వైద్యం కూడా అంతే. ఎప్పుడు ఏ ప్రమాదం, ఏ అనారోగ్యం ముంచుకొస్తుందో ఊహించలేం. → అందుకే కనీసం ఆరు నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధి ప్రతి కుటుంబానికి ఉండాలి. కుదిరితే 9 నెలలు, 12 నెలల అవసరాలకు సరిపడా నిధిని పక్కన పెట్టుకోవాలి. → ఇలా చేయడం వల్ల దీర్ఘకాల లక్ష్యాల కోసం చేస్తున్న పెట్టుబడులను కదపకుండా ఉండొచ్చు. అధిక రేటుపై రుణాలు తీసుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూసుకోవచ్చు. ఈఎంఐలు గీత దాటొద్దు.. → అవసరం వస్తే క్రెడిట్ కార్డు చేతిలో ఉందిలే... వెంటనే రుణం దొరుకుతుందిలే. అనే రీతిలో అన్నింటికీ ‘రుణ’ మంత్రం పనికిరాదు. బ్యాంక్లు, ఫిన్టెక్లు పిలిచి రుణం ఇస్తున్నాయి కదా అని చెప్పి.. ఇల్లు, కారు, ఇంట్లో వస్తువులు ఇలా ప్రతిదానికీ అప్పు చేసుకుంటూ వెళితే, ఆర్థిక పరిస్థితులు క్రమంగా అదుపు తప్పుతాయి. నెల సంపాదనలో 50–60 శాతం వరకు రుణ చెల్లింపులకే వెచ్చించే కుటుంబాలు మన మధ్య ఎన్నో ఉన్నాయి. → ఆదాయంలో నెలవారీ రుణ వాయిదాలను (ఈఎంఐలు) 35–40 శాతం మించకుండా చూసుకోవాలన్నది ముఖ్యమైన ఆర్థిక సూత్రం. దీనివల్ల ఇతర ముఖ్యమైన జీవన అవసరాలకు (గ్రోసరీ, యుటిలిటీ, విద్యా వ్యయాలు) ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. → ఆదాయమనేది నేటి అవసరాల కోసమే కాదు. భవిష్యత్ లక్ష్యాలు, విశ్రాంత జీవన అవసరాల కోసం కూడా. దీనికోసం ప్రతినెలా కొంత పక్కన పెట్టుకోవాలి. → పిల్లల విద్య, వివాహాలు, సొంతిల్లు, రిటైర్మెంట్ జీవితం కోసం పెట్టుబడులకు కొంత కేటాయించుకోవాలంటే, ఆదాయంలో ఈఎంఐలు లక్ష్మణ రేఖ దాటకుండా చూసుకోవడం ముఖ్యం. → ఈఎంఐలు హద్దు మీరి చెల్లింపుల్లో విఫలమైతే, అది క్రెడిట్ హిస్టరీని దెబ్బతీస్తుంది. ఆదాయం అప్పులకే పోతుంటే సంపద సృష్టి ఎప్పటికీ సాధ్యం కాదు. ఆదాయాన్ని మించి పెట్టుబడి.. → సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఇపుడు బాగా ప్రాచుర్యం పొందిన పెట్టుబడి సాధనం. ఈ విధానంలో చేస్తున్న పెట్టుబడి, మన వార్షిక ఆదాయ వృద్ధికి మించి పెరిగేలా చూసుకోవాలి. వార్షిక వేతన పెరుగుదల సాధారణంగా 8–10 శాతంగా ఉంటుంది. కానీ, సిప్ పెట్టుబడులపై 12–15 శాతం వరకు రాబడి వచ్చేలా పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవాలి. → ద్రవ్యోల్బణం కారణంగా కొంత కాలానికి మన పెట్టుబడి దాని విలువను కోల్పోతుంటుంది. మన దగ్గర వార్షిక సగటు ద్రవ్యోల్బణం 5–6 శాతం స్థాయిలో ఉంటోంది. కనుక ఈ మేరకు మన పెట్టుబడి విలువ ఏటా క్షీణిస్తుంటుంది. → ఇపుడు మన జీవన వ్యయాలు నెలవారీ రూ.10,000గా ఉన్నాయనుకుంటే.. 6 శాతం ద్రవ్యోల్బణం రేటు ప్రకారం పదేళ్ల తర్వాత అవే అవసరాల కోసం రూ.17,908 ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే 20 ఏళ్ల తర్వాత అయితే రూ.32,071 అవసరం అవుతుంది. → ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే పదేళ్లకు మించిన కాలంలో 12–15 శాతం రాబడులు సాధ్యమేనని చరిత్ర చెబుతోంది. → ఇక నెలవారీ చేస్తున్న సిప్ పెట్టుబడిని సైతం ఏటా ఆదాయ పెరుగుదలను మించిన స్థాయిలో పెంచుకోవడం ప్రధానం. లేదంటే కనీసం ద్రవ్యోల్బణం రేటు స్థాయిలో అయినా సిప్ పెట్టుబడిని ఏటా పెంచుకుంటూ వెళ్లాలి. → ఇలా సిప్ పెట్టుబడిని పెంచుకుంటూ, ఆ పెట్టుబడి ద్రవ్యోల్బణం మించి వృద్ధి చెందేలా చూసుకుంటే, కాంపౌండింగ్ ప్రయోజనంతో పెద్ద మొత్తంలో నిధి సమకూరుతుంది. ఆరోగ్య బీమా రూ.5 లక్షలు చాలదు.. → మనలో చాలా మందికి ఆరోగ్య బీమా రక్షణ లేదు. ఉన్న వారిలోనూ చాలా మందికి రూ.5 లక్షలకు మించి కవరేజీ లేదు. కానీ, మారుతున్న పరిస్థితుల కోణంలో చూస్తే ఈ రక్షణ ఎంత మాత్రం చాలదని స్పష్టమవుతోంది. → వైద్య రంగంలో ద్రవ్యోల్బణం 12– 14 శాతం స్థాయిలో ఉంటోంది. అంటే చికిత్సలు, ఔషధాలు, ఇతరత్రా చార్జీలు ఈ స్థాయిలో ఏటా పెరుగుతున్నట్టు లెక్క. → అత్యాధునిక వైద్య విధానాలు, రోబోటిక్ తరహా టెక్నాలజీలు రావడంతో క్లిష్టమైన సర్జరీలను సైతం సునాయాసయంగా, విజయవంతంగా చేస్తున్నారు. వీటి కోసం పెద్ద మొత్తంలో ఖర్చవుతోంది. అవయవ మార్పిడి కోసం రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చవుతోంది. → కనుక రూ.5 లక్షల కవరేజీ ఎంతమాత్రం సరిపోదు. ఒక కుటుంబానికి కనీసం రూ.10– 20 లక్షల వరకు అయినా బేసిక్ హెల్త్ ప్లాన్ ఉండాలి. రూ.10–20 లక్షల డిడక్టబుల్తో సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి. వైద్య బిల్లు రూ.10– 20 లక్షల్లోపు ఉంటే బేసిక్ప్లాన్ నుంచి, అంతకు మించిన సందర్భాల్లో సూపర్ టాపప్ ప్లాన్ నుంచి చెల్లింపులు జరుగుతాయి. రెండు చేతులా సంపాదించాల్సిందే.. → ఒకవైపు కరెన్సీ విలువ క్షీణిస్తుండగా... మరోవైపు జీవన వ్యయాలు భారీగా పెరుగుతున్నాయి. కాబట్టి వీటికి తగ్గట్టు ఆదాయం కూడా వృద్ధి చెందాలి. కానీ మన ఆర్థిక డేటాను పరిశీలిస్తే.. ఆదాయ వృద్ధి కంటే జీవన వ్యయ పెరుగుదలే ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే రెండో ఆదాయ మార్గంపై దృష్టి పెట్టాలి. → అద్దె రూపంలో ఆదాయం లేదంటే తమ నైపుణ్యాల ఆధారంగా ఖాళీ సమయంలో ఫ్రీలాన్స్ వర్క్ లేదంటే వడ్డీ ఆదాయం లేదా డివిడెండ్ ఆదాయం ఇలా ఏదో ఒక మార్గం గుర్తించాలి. ఖర్చులపై కన్ను.. టీవీ ఛానళ్ల కోసం ఒకటి, నెట్ఫ్లిక్స్–అమెజాన్ ప్రైమ్, ఆహా ఇలా వేర్వేరు ఓటీటీ చందాలు, క్లౌడ్ స్టోరేజీ, లెరి్నంగ్ యాప్లు ఇలా చెప్పుకుంటూ పోతే డిజిటల్ లైఫ్ కోసం ప్రతి కుటుంబంలో నెలతిరిగేసరికి చందా చెల్లింపుల జాబితా పెరిగిపోతోంది. ఒక సర్వే ప్రకారం ఒక కుటుంబం ఈ తరహా రీచార్జ్ల కోసం కనీసం రూ.25,000– 40,000 వరకు ఖర్చు చేస్తోంది. కనుక ఏదో ఒక వినోద ఓటీటీ, ఒక లెర్నింగ్ యాప్నకు పరిమితమై, అనవసర దుబారాను అదుపు చేసుకోవడం ద్వారా ఆర్థిక స్వేచ్ఛకు మార్గం వేసుకోవచ్చు. బంగారం కూడా బీమా లాంటిదే..→ బంగారాన్ని ఒక పెట్టుబడి సాధనంగా కంటే రక్షణ కవచంగానే (హెడ్జింగ్ సాధనం) ఎక్కువ పరిగణిస్తారు. ఆర్థిక అస్థిరతలప్పుడు, కరెన్సీ విలువ క్షీణించినపుడు, ద్రవ్యోల్బణం నుంచి పెట్టుబడి విలువను కాపాడుకోవడంలో బంగారం కీలకంగా పనిచేస్తుంది. → ఈ ఏడాది బంగారం ధర దేశీ మార్కెట్లో 78 శాతం పెరిగింది. 2020లో రూ.48,000 స్థాయిలో ఉంది. ఐదేళ్లలో రెండు రెట్లు (200 శాతం వృద్ధి) పెరిగింది. గత రెండు దశాబ్దాల్లో చూస్తే బంగారంపై వార్షిక రాబడి 11–12 శాతంగా ఉంది. → భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కంపెనీల లాభదాయకత ఆశాజనకంగా లేకపోవడం, వాణిజ్య అనిశి్చతులతో గడిచిన ఏడాది కాలంలో ఈక్విటీలు ఎలాంటి రాబడులు ఇవ్వలేదు. ఈ కాలంలో బంగారం విలువను సృష్టించి పెట్టింది. → కనుక పెట్టుబడుల్లో వైవిధ్యానికి, అనిశి్చతులు, కరెన్సీ విలువల నుంచి పెట్టుబడి విలువకు రక్షణ కోసం, అత్యవసరాల్లో రుణం పొందేందుకు సైతం బంగారం అక్కరకు వస్తుంది. → అందుకే ప్రతి ఒక్కరూ తమ పెట్టుబడుల్లో బంగారానికి 10–15 శాతం కేటాయించుకోవాలి.2026 చెక్ లిస్ట్అత్యవసర నిధి: 6–9 నెలలు ఆదాయంలో ఈఎంఐలు: 35 శాతం మించొద్దు సిప్ పెట్టుబడి: ఏటా పెంచుకుంటూ వెళ్లాలి, ఆదాయాన్ని మించి వృద్ధి చెందాలి హెల్త్ కవరేజీ: కనీసం రూ.10–20 లక్షలకు బీమా ఉండాలి పెట్టుబడుల్లో బంగారానికి కేటాయింపులు: 10–15 శాతం రెండో ఆదాయం తప్పనిసరి డిజిటల్ లైఫ్ ఖర్చును నియంత్రించుకోవాలి -
భారతీయ వారసత్వ విశ్వరూపం
ప్రయాగరాజ్ మహాకుంభం నుండి పారిస్ వేదికపై మరాఠా పరాక్రమం వరకు.. మట్టి ప్రమిదల వెలుగు నుండి వందేమాతరం శంఖారావం వరకు.. 2025 సంవత్సరం భారతీయ సంస్కృతికి స్వర్ణయుగంగా నిలిచింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పురాతన సంప్రదాయాలను, ఆధునిక డిజిటల్ యుగంతో మేళవిస్తూ సాగిన ఈ ఏడాది ప్రయాణం.. ‘వికసిత్ భారత్’దిశగా బలమైన ముద్ర వేసింది. ఇది కేవలం కాలాన్ని లెక్కించడం కాదు, ప్రపంచ యవనికపై భారత్ తన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని సువర్ణాక్షరాలతో లిఖించిన అద్భుత ఘట్టం. మహా కుంభమేళా, ‘కళాగ్రామ్’ హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాతి్మక కలయికగా భావించే కుంభమేళాను ప్రయాగ్రాజ్ (అలహాబాద్)లో గంగ, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద నిర్వహించారు. మహా కుంభమేళా జనవరి 13, 2025న ప్రారంభమై, ఫిబ్రవరి 26, 2025న ముగిసింది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత పవిత్రమైన ఘట్టంగా దీనిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని టెంట్ సిటీలో 10.24 ఎకరాల్లో ’కళా గ్రామం’ ఏర్పాటు చేశారు. ఇది భారతీయ హస్తకళలు, సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. కుంభమేళా చిహ్నాన్ని దేశవ్యాప్తంగా ఉన్న రక్షిత కట్టడాలపై ప్రదర్శించి, దీనిని ఒక జాతీయ పండుగలా జరిపారు. వందేమాతరం @ 150 1875–76 ప్రాంతంలో బంకిం చంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గీతం 2025 నాటికి 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ’వందేమాతరం’ నినాదం పోషించిన వీరోచిత పాత్రను స్మరించుకుంటూ ఏడాది పొడవునా సాగే ఉత్సవాలకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నవంబర్ 2025లో శ్రీకారం చుట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, సాంస్కృతిక కేంద్రాల్లో ఈ వేడుకలను నిర్వహించారు. దేశవ్యాప్తంగా చారిత్రక కట్టడాల వద్ద వందేమాతరం గీతంతో కూడిన ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. బుద్ధుడి వారసత్వం – దౌత్య నీతి పైప్రావా (కపిలవస్తు) వద్ద లభించిన బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలను థాయ్లాండ్, భూటాన్ దేశాల్లో ప్రదర్శించడం ద్వారా భారత్ తన ‘సాంస్కృతిక దౌత్యం’చాటింది. 1898లో కనుగొన్న అత్యంత విలువైన పిప్రావా పవిత్ర అవశేషాల వేలాన్ని హాంగ్కాంగ్లో భారత్ విజయవంతంగా అడ్డుకుంది. ఒక ప్రైవేట్ పారిశ్రామిక సంస్థ, ప్రభుత్వ దౌత్య సహకారంతో అమూల్యమైన బంగారు, స్ఫటిక ఆభరణాల నిధిని తిరిగి స్వదేశానికి రప్పించింది. గుజరాత్ (దేవ్నిమోరి) నుండి లభించిన అవశేషాలను శ్రీలంకలోని కొలంబోకు 2026 ఫిబ్రవరిలో తీసుకెళ్లనున్నారు. జ్ఞాన భారతం – డిజిటల్ విప్లవం సెపె్టంబర్లో ప్రధాని మోదీ ప్రారంభించిన ‘జ్ఞాన భారతం’పోర్టల్ ద్వారా దేశంలోని అరుదైన రాత ప్రతులను భద్రపరిచి, డిజిటలైజ్ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ‘వికసిత్ భారత్ 2047’లక్ష్యంలో భాగంగా ‘ఢిల్లీ డిక్లరేషన్’తో ముగిసింది. దీపావళికి విశ్వ కిరీటం భారతీయుల ఆరాధ్య పండుగ ’దీపావళి’కి యునెస్కో తన ప్రతిష్టాత్మకమైన ’మానవత్వపు అమూల్య సాంస్కృతిక వారసత్వ’ జాబితాలో చోటు కల్పించింది. డిసెంబర్ 10న లభించిన ఈ గుర్తింపుతో భారత్ నుండి ఈ జాబితాలో చేరిన అంశాల సంఖ్య 16కు చేరింది.మరాఠా కోటల ప్రపంచ రికార్డు జూలైలో పారిస్లో జరిగిన సమావేశంలో శివనేరి, రాయ్గఢ్ సహా 12 మరాఠా సైనిక కోటలకు ‘ప్రపంచ వారసత్వ హోదా’లభించింది. శత్రు దుర్భేద్యమైన భారతీయ యుద్ధ తంత్రానికి ఇది దక్కిన అంతర్జాతీయ గౌరవం. మహనీయుల స్మరణఅహిల్యాబాయి హోల్కర్ 300 వ జయంతి, సర్దార్ పటేల్ 150వ జయంతి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ (125 ఏళ్లు), గాడియా మిషన్ స్థాపకుడు శ్రీల ప్రభుపాద 150వ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహించి, భారతీయ మూలాలను స్మరించుకున్నారు. ఎర్రకోట వేదికగా ప్రపంచ సదస్సుయునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ 20వ సమావేశాన్ని తొలిసారిగా భారత్ నిర్వహించింది. వారసత్వ సంపద రక్షణపై ‘ఢిల్లీ డిక్లరేషన్’ద్వారా ప్రపంచానికి దిశానిర్దేశం చేసింది. గతాన్ని గౌరవించడం, వర్తమానాన్ని వేడుకగా జరుపుకోవడం, భవిష్యత్తు కోసం వారసత్వాన్ని భద్రపరచడం.. ఈ మూడింటి కలయికే 2025 భారత సాంస్కృతిక గమనం. భారతావనికి ఒక ‘సాంస్కృతిక వసంతం’! – సాక్షి, నేషనల్ డెస్క్ -
విమానయానం.. ‘శత’మానం!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ఎత్తుకు ఎదిగింది. వంద జాతీయ, అంతర్జాతీయ నగరాలకు హైదరాబాద్ నుంచి తాజాగా విమాన కనెక్టివిటీ విస్తరించింది. వందో నగరంగా నవీ ముంబైకి ఇటీవల ఇండిగో విమాన సర్వీసులను అందుబాటులోకి తెచి్చంది. హైదరాబాద్ ఎయిర్పోర్టు ప్రతి ఏడాది ప్రగతిపథంలో పరుగులు తీస్తోంది. దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయాల్లో అగ్రభాగాన ఉంది. ఏటేటా హైదరాబాద్ నుంచి జాతీయ, అంతర్జాతీయ నగరాలకు విమాన సర్విసుల సేవలు విస్తరిస్తూనే ఉన్నాయి. ఈ సంవత్సరం కొత్తగా 8 నగరాలకు కనెక్టివిటీ అందుబాటులోకి వచి్చంది. తాజాగా విమాన సేవలు ప్రారంభమైన నవీ ముంబైతోపాటు వియత్నాంలోని హనోయ్, హోచిమిన్, అథియోపియా అడిడ్ అబాబా, థాయ్లాండ్లోని పుకెట్, హాంకాంగ్, ఆమ్స్టర్డామ్, నగరాలకు విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం 74 జాతీయ నగరాలకు, 26 అంతర్జాతీయ నగరాలకు హైదరాబాద్ నుంచి విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ ఏడాది విమాన సర్విసులు ప్రారంభమైన అంతర్జాతీయ నగరాల్లో వియత్నాంకు పర్యాటకుల నుంచి భారీ డిమాండ్ ఉన్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు కొత్త ఏడాది సందర్భంగా కొద్ది రోజులుగా వియత్నాంతోపాటు సింగపూర్, మలేసియా, థాయ్లాండ్, శ్రీలంక, మాల్దీవులు తదితర దేశాలకు పర్యాటకుల రద్దీ పెరిగింది. చికాగో, ప్యారిస్ తదితర నగరాలకు వచ్చే ఏడాది విమాన సేవలను విస్తరించే అవకాశముంది. ప్రతి నెలా 20 లక్షల మందికిపైగా.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతినెలా 20 లక్షల మందికిపైగా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. దేశీయ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, పర్యాటకులు రైళ్లకు ప్రత్యామ్నాయంగా విమాన సర్విసులను ఎంపిక చేసుకుంటున్నారు. కార్పొరేట్ సంస్థలు, వ్యాపార వర్గాలు సైతం విమాన ప్రయాణాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ప్రయాణికుల డిమాండ్ మేరకు పలు ఎయిర్లైన్స్ సంస్థలు కొత్త నగరాలకు కనెక్టివిటీని అందుబాటులోకి తెస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయ నగరాలకు సైతం రద్దీ పెరిగింది. గత నవంబర్లో అత్యధికంగా సుమారు 27.4 లక్షల మంది హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి ప్రయాణం చేశారు. వారిలో అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 5 లక్షలకుపైగా ఉన్నట్లు అంచనా. ప్రతిరోజు హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి సుమారు 65 వేల నుంచి 75 వేల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. వీరిలో 55 వేల మందికిపైగా దేశీయ ప్రయాణికులు ఉంటారు. 10 వేల నుంచి 15 వేల మందికిపైగా అంతర్జాతీయ ప్రయాణికులు ఉంటారు. ప్రయాణికుల డిమాండ్ మేరకే ఈ ఏడాది హైదరాబాద్ నుంచి హాంకాంగ్, వియత్నాం, ఆమ్స్టర్డ్యామ్, ఇథియోపియా తదితర దేశాలకు విమాన సర్విసులు అందుబాటులోకి వచ్చాయి.మూడు నెలల్లో 52 వేల సర్విసులు.. ఈ ఏడాది ఆగస్టు–అక్టోబర్ మధ్య హైదరాబాద్ నుంచి 52 వేలకుపైగా విమాన సర్విసులు రాకపోకలు సాగించాయి. ప్రతి నెలా సగటున 15 వేల జాతీయ, అంతర్జాతీయ నగరాలకు విమానాలు నడిచాయి. ప్రతి రోజు సుమారు 450 సర్విసులు రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. దేశీయ విమాన సర్వీసుల్లో ఇండిగో మొదటి స్థానంలో ఉండగా, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్లైన్స్ సంస్థలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అంతర్జాతీయ సర్విసుల్లో ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ మొదటి స్థానంలో ఉంది. ఖతార్ ఎయిర్లైన్స్ రెండోస్థానంలో ఉండగా, ఎయిర్ అరేబియా మూడో స్థానంలో నిలిచింది.నగరంలో నేడు⇒ మాదాపూర్లోని శిల్పారామంలో హ్యండ్లూమ్స్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, నేషనల్ జ్యూట్ బోర్డు సంయుక్త నిర్వహణలోని అలిండియా క్రాప్్ట్స మేళా ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ⇒ బంజారాహిల్స్ నందిగిరి హిల్స్లోని లేపాక్షి షోరూమ్లో ప్రత్యేక హస్తకళా వస్తువుల ప్రదర్శన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగల సందర్భంగా 30 శాతం రాయితీ ఇస్తున్నారు.⇒ ఇందిరాపార్క్ సమీపంలోని ఎనీ్టఆర్ స్టేడియంలో హైదరాబాద్ పుస్తక ప్రదర్శన సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.⇒ మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన హైలైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.⇒ మణికొండ పైప్లైన్ రోడ్డులోని సుందర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆల్ ఇండియా హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాప్ట్ ఎగ్జిబిషన్ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. -
మెరుపులు.. కొన్ని మరకలు.. ఇంకొన్ని వివాదాలు
త్వరలో కాలగర్భంలో కలిసిపోనున్న 2025 సుప్రీంకోర్టు చరిత్రలో చిరకాలం గుర్తుండిపోయే ఏడాదిగా నిలవనుంది. పలు సంచలనాత్మక కేసులు, వక్ఫ్ చట్టం వంటి వివాదాస్పద అంశాలు, రాజ్యంగపరంగా కీలకమైన సందేహాలు లేవనెత్తిన రాష్ట్రపతి రిఫరెన్సు వంటివి సంవత్సరం పొడవునా అత్యున్నత న్యాయస్థానానికి ఊపిరి సలపనివ్వలేదు. ఆ కేసులను పరిష్కరించే క్రమంలో సుప్రీం పలు చరిత్రాత్మక తీర్పులు వెలువరించింది. ప్రజాప్రయోజనాలు, రాజకీయాలు, పర్యావరణం, నేర సంబంధిత కేసులతో పాటు పలు సంక్లిష్టమైన పౌరసంబంధ తగాదాలను సైతం సమర్థంగా పరిష్కరించింది. కీలకమైన కేసుల్లో రాష్ట్రపతి, గవర్నర్లకు డెడ్లైన్ వంటి తీర్పుల విషయంలో కాస్త చూసీచూడనట్టు పోయిందన్న అభిప్రాయాలకు కూడా తావిచ్చింది. ఈ ఏడాది అత్యున్నత న్యాయస్థానం ముందుకొచ్చిన పలు కీలక కేసులను ఓసారి చూస్తే... వ్యవస్థల నడుమ... టగ్ ఆఫ్ వార్!గవర్నర్లు, విపక్ష పాలిత రాష్ట్రాల మధ్య చిరకాలంగా పెను వివాదంగా మారిన బిల్లుల ఆమోదం అంశం ఈ ఏడాది సుప్రీంకోర్టుకు అగ్నిపరీక్షే పెట్టింది. బిల్లులను తమిళనాడు గవర్నర్ రవి తొక్కిపట్టడాన్ని సవాలు చేస్తూ తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టడంతో న్యాయవ్యవస్థకే సుదీర్ఘ, సంక్లిష్ట సవాలుకు తెరలేచింది. గవర్నర్తో పాటు రాష్ట్రపతి కూడా మూడు నెలల్లోపు బిల్లులకు ఆమోదం తెలపడం, వాటిని తిప్పి పంపడమో చేయని పక్షంలో అవి ఆమోదం పొందినట్టే భావించాలంటూ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు పెను సంచలనమే సృష్టించింది. అధికార బీజేపీకి ఖేదం, విపక్షాలకు మోదం కలిగించింది. దాంతో, ఇలా గడువు విధించడం సబబేనా అంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తన అసాధారణ అధికారాలను ఉపయోగించుకుంటూ, ఈ అంశంపై కోర్టుకు 14 ప్రశ్నాస్త్రాలు సంధించి వాటికి బదులు కోరారు. దాంతో సమస్య కీలక మలుపు తిరిగింది. ఒక దశలో అతి కీలకమైన న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అమీతుమీ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి రాష్ట్రపతికి, గవర్నర్లకు కోర్టులు అలా గడువు విధించలేవంటూ ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించడం ద్వారా ఈ వివాదానికి సామరస్యపూర్వకంగా తెర దించింది. అయితే ఆ క్రమంలో న్యాయవ్యవస్థ ఒక మెట్టు దిగిందన్న అభిప్రాయాలు విపక్షాలతో పాటు న్యాయ నిపుణుల నుంచి కూడా విన్పించాయి. కాకపోతే గవర్నర్లు బిల్లులపై ఏ నిర్ణయమూ తీసుకోకుండా సుదీర్ఘకాలం సాగదీస్తే ఊరుకునేది లేదని, అలాంటప్పుడు న్యాయసమీక్ష సబబేనని ధర్మాసనం పేర్కొనడం ప్రజాస్వామ్యవాదులకు కాస్త ఊరటనిచ్చింది. ‘వక్ఫ్’పై మధ్యేమార్గంవక్ఫ్ ఆస్తులను క్రమబద్ధీకరించే క్రమంలో మోదీ సర్కారు తీసుకొచ్చిన అత్యంత వివాదాస్పద కొత్త వక్ఫ్ (సవరణ) చట్టం–2025 కేసు విషయంలో సుప్రీంకోర్టు వీలైనంత సమతుల్యత పాటించే ప్రయత్నం చేసింది. వక్ఫ్ బై యూజర్ ప్రయోజనాన్ని తొలగింపు సక్రమమేనని, ఈ నిర్ణయం ద్వారా వక్ఫ్ భూములను కేంద్రం లాక్కుంటుందన్న వాదనలో పస లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో కనీసం ఐదేళ్లుగా ఇస్లాంను అనుసరిస్తున్న వాళ్లు మాత్రమే వక్ఫ్ కింద దానాలు ఇవ్వొచ్చన్న నిబంధనను ప్రస్తుతానికి పక్కన పెట్టింది. సోషల్ న్యూసెన్స్కు ముకుతాడుభావ ప్రకటన స్వేచ్ఛ పేరిట హద్దు మీరుతున్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూ యన్సర్లకు సుప్రీంకోర్టు ముకుతాడు వేసింది. తల్లిదండ్రులు–పిల్లలపై అసహ్యకరమైన లైంగిక వ్యాఖ్యలు చేసిన రణ్వీర్ అలహాబాదియా, దివ్యాంగులను కించపరిచిన సమయ్ రైనా వంటి పలువు రు ఇన్ఫ్లూయన్సర్లను కోర్టు గట్టిగా నలుగు పెట్టి వదిలింది. మున్ముందు ఇలాంటి ఉదంతాల్లో కఠిన శిక్షలు విధించేలా ఎస్సీ, ఎస్టీ చట్టం తరహాలో గట్టి చట్టం తేవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆన్లైన్ కంటెంట్ను క్రమబద్ధీకరించేలా గైడ్లైన్స్ విడుదల రూపొందించాలని పేర్కొంది. గ్రామ సింహాల గోలఏ వీధికి వెళ్లినా సర్వసాధారణంగా కన్పించే వీధి కుక్కల బెడద సుప్రీం దృష్టికీ వెళ్లింది. దీనిపై మీడియా కథనాలను సుమోటోగా విచారణకు స్వీకరించడమే గాక వీధి కుక్కలను శాశ్వతంగా తరలించే దిశగా కేంద్ర, రాష్ట్రాలకు పలు నిర్దేశాలు జారీ చేసింది. దీనిపై జంతు ప్రేమికుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాల నేపథ్యంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం లోతైన విచారణ జరిపింది. కుటుంబనియంత్రణ ఆపరేష్ల అనంతరం కుక్కల్ని తిరిగి వీధుల్లోకి వదలవచ్చంటూ తీర్పును కాస్త సవరించింది. సీజేపైకి బూటుఅక్టోబర్ 6వ తేదీ. సుప్రీంకోర్టులో అత్యంత అరుదైన, అవాంఛనీయమైన ఉదంతం జరిగిన రోజు. రాకేశ్ కిషోర్ అనే సీనియర్ న్యాయవాది ఏకంగా నాటి సీజేఐ జస్టిస్ గవాయ్పైకి బూటు విసిరి కలకలం రేపాడు. అంతకుముందు విచారణ సందర్భంగా హిందూ దేవీ దేవతలపై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ మతిలేని చర్యకు పూనుకున్నాడు.న్యాయమూర్తుల ఆస్తుల వెల్లడిన్యాయవ్యవస్థలో మరింత పారదర్శకత, విశ్వసనీయత దిశగా న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను బయట పెట్టాలని అత్యున్నత న్యాయస్థానం మరో కీలక నిర్ణయమూ తీసుకుంది. వాటిని ఆన్లైన్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంది. అలాగే న్యాయ సిబ్బంది తదితర నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రజలకు రిజర్వేషన్ల కల్పన కూడా వినూత్నమే.జడ్జి ఇంట్లో నోట్ల కట్టలుదేశ రాజధానిలో హైకోర్టు న్యాయ మూర్తిగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో కట్టలు కట్టలుగా కరెన్సీ నోట్లు సగం కాలిపోయిన స్థితిలో బయటపడ్డ ఉదంతం దేశమంతటా పెను ప్రకంపనలు సృష్టించడమే గాక న్యాయవ్యవస్థ ప్రతిష్టకే మచ్చగా నిలిచింది. మార్చి 14వ తేదీ రాత్రి ఢిల్లీలోని ఆయన అధికార నివాసంలో చెలరేగిన మంటలను ఆపేందుకు వెళ్లిన అగ్నిమాపక, పోలీసు సిబ్బంది స్టోర్ రూములో నేలపై పరిచిన భారీస్థాయిలో నోట్ల కట్టలు చూసి నోరెళ్లబెట్టారు. ఇతర పౌరుల్లాగే ఆయన్ను కూడా చట్టప్రకారం కఠినంగా శిక్షించి న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలని సామాన్యులంతా ఆశించారు. సుప్రీంకోర్టు నియమించిన అంతర్గత న్యాయ మూ ర్తుల కమిటీ సైతం ఆయన్ను దోషిగా తేల్చి చర్యలకు సిఫార్సు చేసింది. రాజీ నామా చేయాల్సిందిగా నాటి సీజేఐ జస్టిస్ ఖన్నా సూచించినా జస్టిస్ వర్మ ససేమిరా అన్నారు. దాంతో ఆయన్ను అభి శంసించాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధానులకు సీజే లేఖ రాయాల్సి వచ్చింది. జస్టిస్ వర్మను తొలగించాలని పలువురు ఎంపీలు కూడా పార్లమెంటుకు లేఖ రాశారు. అభిశంసన ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఆయనపై పార్లమెంటరీ ప్యానల్ విచారణ కొన సాగుతోంది. దాన్ని కూడా సవాలు చేస్తూ జస్టిస్ వర్మ సుప్రీం మెట్లెక్కడం అందరినీ నిర్ఘాంతపరిచింది.ముగ్గురు సీజేలుసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీఠంపై ముగ్గురు అత్యంత సీనియర్ జడ్జీలు కొలువుతీరడం ఈ ఏడాది ప్రత్యేకతగా చెప్పొచ్చు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ గవాయ్ ఈ ఏడాదే రిటైరవగా జస్టిస్ సూర్యకాంత్ సీజేగా బాధ్యతలు స్వీకరించారు. న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని నిలబెట్టే క్రమంలో రిటైర్మెంట్ అనంతరం ఎలాంటి ప్రభుత్వ పదవులూ స్వీకరించబోమని జస్టిస్ ఖన్నా, జస్టిస్ గవాయ్ స్పష్టం చేయడం మరో విశేషం.మరిన్ని కీలక తీర్పులు...→ పెచ్చరిల్లుతున్న సైబర్ నేరాలపైనా సుప్రీంకోర్టు ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను, ముఖ్యంగా వృద్ధులను భయభ్రాంతులకు గురిచేసి భారీగా డబ్బు కొల్లగొడుతున్న ఆన్లైన్ మోసగాళ్లపై ఉక్కుపాదం మోపాల్సిందిగా సీబీఐని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇందుకోసం దేశవ్యాప్త విచారణ జరపాలని సూచించింది.→ బోగస్ ఓట్ల ఏరివేతకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే రాజకీయ రంగు పులుముకుని సుప్రీంకోర్టుకు చేరింది.→ పశ్చిమబెంగాల్లో దశాబ్దం క్రితం నియమి తులైన ఏకంగా 25,753 మంది ప్రభుత్వ టీచర్లు, సిబ్బంది నియామ కాన్ని సుప్రీం ఒక్క కలం పోటుతో రద్దు చేయడం మమత సర్కారుకు తీరని షాకిచ్చింది.→ లాయర్లు, కక్షిదారులను దర్యాప్తు సంస్థలు తమ ఇష్టమొచ్చిన రీతిలో విచారించేందుకు వీల్లేదంటూ, వారి ప్రత్యేక హక్కుల పరిరక్షణకు పలు చర్యలు ప్రకటించిన సుప్రీం తీర్పు కూడా చరిత్రాత్మకమైనదే.→ నోయిడాలో 2006లో 8 మంది పేద చిన్నారుల అస్థిపంజరాలు ఓ కాలువలో బయటపడ్డ ఉదంతంలో ప్రధాన నిందితుడు సురేంద్ర కోలీని నిరపరాధిగా సుప్రీం తేల్చడం విస్మయం కలిగించింది.→ జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలకు లాయర్లకు కనీసం మూడేళ్ల అనుభవం తప్పనిసరని, న్యాయాధికారులు బార్ కోటా కింద పదోన్నతి పరీక్షలు రాయొచ్చంటూ ఇచ్చిన తీర్పులు చర్చనీయంగా మారాయి.→ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పిడి ఉదంతంపై తాము సూచించినట్టుగా మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోనందుకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్పై సుప్రీంకోర్టు ధిక్కరణ చర్యలకు దిగడమూ సంచలనమే సృష్టించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
బంగ్లా చెరలో ‘అల’వికాని వేదన
బంగ్లాదేశ్ పరిణామాలు అక్కడి భారతీయులనే కాదు.. ఆంధ్రప్రదేశ్లోని మత్స్యకారుల కుటుంబాలనూ కల్లోలపరుస్తున్నాయి. పొరపాటున తీరం దాటి బంగ్లా దళాల చేతుల్లో చిక్కుకున్న విజయనగరానికి చెందిన 9 మంది మత్స్యకారులు 75 రోజులకుపైగా అక్కడి జైలులో మగ్గిపోతున్నారు. వారి కుటుంబాలు ఇక్కడ తల్లడిల్లిపోతున్నాయి. ఒకవైపు ఇల్లుగడవడం కష్టమైపోతోంది.. ప్రభుత్వమేమో లేఖలు, మాటలతోనే సరిపెడుతోంది తప్పితే విడిపించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. బంగ్లాలో పరిస్థితులు దిగజారిపోతుండటంతో తమవారు జైలులో ఎలా ఉన్నారో.. చెర వీడుతారా.. లేదా... అని ఆ కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. – ఏపీ సెంట్రల్ డెస్క్సముద్రంలో వేటకు వెళ్లి దారి తప్పి బంగ్లాదేశ్ కోస్ట్గార్డుకు చిక్కిన 9 మంది మత్స్యకారులు 75 రోజులకుపైగా జైలులో మగ్గిపోతున్నారు. వారిని స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో చొరవ చూపకపోవడంతో వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. అసలేం జరిగిందంటే.. విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామానికి చెందిన మత్స్యకారులు నక్కా రమణ, వాసుపల్లి సీతయ్య, భోగాపురం మండలం కొండ్రాజుపాలెం గ్రామానికి చెందిన మరుపల్లి చిన్నప్పన్న, మరుపల్లి రమేష్, సూరాడ అప్పలకొండ, మరుపల్లి ప్రవీణ్, సురపతి రాము, చిన్నప్పన్న, మైలపల్లి అప్పన్న జీవనం కోసం వైజాగ్కు వలస వచ్చారు. అక్కడే చేపల వేట కొనసాగించే వారు. అక్టోబర్ 13న విశాఖ చేపల రేవు నుంచి (బోటు నంబరు : ఎంఎం 75) సముద్రంలోకి వేటకు వెళ్లారు. దురదృష్టవశాత్తు అక్టోబర్ 14న అర్ధరాత్రి 2 గంటల సమయంలో దారి తప్పి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ పరిధిలోకి ప్రవేశించడంతో అక్కడి నేవీ అధికారులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.కడుపులో బిడ్డ.. జైలులో భర్తప్రసవ సమయంలో భర్త తన పక్కనే ఉండాలని భార్య కోరుకుంటుంది. భర్త కూడా తన బిడ్డ ఈ లోకంలోకి రాగానే ఎత్తుకుని మురిసిపోవాలనుకుంటాడు. దురదృష్టవశాత్తూ సూరాడ అనిత, అప్పలకొండ దంపతులకు ఆ అవకాశం లేకుండా పోయింది. బంగ్లాదేశ్ జైలులో బందీగా ఉన్న సూరాడ అప్పల కొండ భార్య అనిత ప్రస్తుతం 9వ నెల గర్భిణి. వచ్చే నెలలో ప్రసవించే అవకాశం ఉందని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో తన భర్త ఆచూకీ కోసం అనిత ఆందోళన చెందుతోంది. పురిటి నొప్పులకు తోడు మనోవేదనతో ఆమె సతమతమవుతోంది. తన భర్త రాకకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.బాధితులను విడిపించేందుకు వైఎస్సార్సీపీ యత్నాలు బంగ్లాదేశ్లో చిక్కుకుపోయిన 9 మంది మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్సార్ సీపీ అండగా నిలిచింది. ఆర్థిక సహాయం అందించడంతోపాటు విడుదల కోసం కూడా ప్రయత్నాలు చేస్తోంది. మత్స్యకారుల విడుదల కోసం వైఎస్సార్ సీపీ నాయకుడు, ఈస్ట్కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాసుపల్లి జానకీరామ్ బంగ్లాదేశ్ వెళ్లారు. జైలులో ఉన్న మత్స్యకారులకు ఆహారం, నిత్యావసర సరుకుల కోసం కొంత మొత్తాన్ని డిపాజిట్ చేశారు. వారి విడుదలకు బంగ్లాదేశ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి కోసం ఢాఖాలోని సుప్రీంకోర్టు అడ్వకేట్ మహమ్మద్ రెహ్మాన్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే భారత విదేశాంగ శాఖ అధికారులతోనూ సమావేశమై కేసు వివరాల డాక్యుమెంట్స్ను అందజేశారు.నాడు వైఎస్ జగన్ చొరవతో 22 మందికి పాక్ చెర నుంచి స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మత్స్యకారులు గుజరాత్లోని ఓ చేపల వ్యాపారి వద్ద పని చేస్తూ 2018 నవంబర్ 31న అరేబియా సముద్రంలో వేటకు వెళ్లారు. గుజరాత్ తీరం నుంచి పాకిస్తాన్ జలాల వైపు వెళ్లి అక్కడి భద్రత దళాలకు ఈ 22 మంది చిక్కారు. అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు మత్స్యకారులను విడిపించేందుకు కనీస చర్యలు చేపట్టలేదు. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చి న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో రాష్ట్ర మంత్రులు, అధికారులు కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరిపారు. ఫలితంగా విదేశాంగ శాఖ అధికారులు పాక్ అధికారులతో మాట్లాడి.. 22 మంది మత్స్యకారులను 2020 జనవరి 6న సురక్షితంగా భారత్కు తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మొత్తంగా కోటీ పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా అందించారు.బంగ్లాలో పరిస్థితులు దిగజారడంతో ఆందోళనబంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటుతో నెలకొన్న అస్థిరత నేటికీ కొనసాగుతోంది. సైన్యం ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఉన్నప్పటికీ భారత్తో దౌత్యపరమైన సంబంధాలు క్షీణించాయి. మరోవైపు తాజాగా భారత వ్యతిరేకి, ఇంక్విలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. తాజాగా ఓ హిందూ యువకుడు దీపూ చంద్రదాస్ను నిరసనకారులు క్రూరంగా కొట్టి చంపేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో అరాచక శక్తుల ఆగడాలు మితిమీరిపోయి సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. దౌత్యపరంగానూ భారత్ – బంగ్లాదేశ్ మధ్య దూరం పెరిగిన ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అక్కడి జైలులో మగ్గిపోతున్న ఆంధ్రా మత్స్యకారుల విడుదలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాలో పరిస్థితులు పూర్తిగా క్షీణించక ముందే.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని బందీలను విడిపించేందుకు చర్యలు చేపట్టాలని బాధితుల కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.సర్కారు చర్యలు శూన్యం బంగ్లాదేశ్ జైలులో బందీలుగా ఉన్న మత్స్యకారులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వంతో కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందే తప్ప ఆ దిశగా దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం ప్రకటనలకే పరిమితమయ్యారు తప్పితే గంగపుత్రులను విడుదల చేయించేందుకు చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. మత్స్యకారులంతా విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గం పరిధి పూసపాటిరేగ, భోగాపురం మండలాలకు చెందిన వారే. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన ఎమ్మెల్యే పట్టించుకున్న పాపాన పోవడం లేదు. బాధిత కుటుంబాలకు భరోసానివ్వాలి దురదృష్టవశాత్తూ దారి తప్పి బంగ్లాదేశ్ కోస్టుగార్డుకు చిక్కిన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి భరోసానివ్వాలి. జైలులో మగ్గిపోతున్న తమ వారు ఎప్పుడొస్తారో తెలియక ఇక్కడ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇంటికి పెద్ద దిక్కైన వారు పరాయి దేశంలో బందీలుగా ఉండడంతో ఆర్థిక ఇబ్బందులతో పూట గడవడం కష్టంగా మారింది. వారికి ఆర్థిక భరోసానివ్వడంతోపాటు బందీలను వీలైనంత త్వరగా విడిపించాలి. – సూరాడ చిన్నారావు, కొండ్రాజుపాలెం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంకా జైల్లో..బంగ్లాదేశ్ జైలులో 75 రోజులకు పైగా మగ్గిపోతున్న మత్స్యకారులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే జైలు అధికారులతోపాటు బంగ్లా సుంప్రీంకోర్టు న్యాయవాదితో కేసు విషయమై మాట్లాడాను. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే 9 మంది నేటికీ జైలులో వున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ద్వారా బంగ్లా విదేశాంగ శాఖతో చిత్తశుద్ధితో సంప్రదింపులు జరిపి మత్స్యకారులను విడిపించి స్వస్థలాలకు తీసుకురావాలి. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి. – వాసుపల్లి జానకీరామ్, ప్రెసిడెంట్, ఈస్ట్కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ -
విందుల హోరు..యాంటాసిడ్స్ జోరు!
ఆరోగ్య సమస్య తలెత్తగానే ఆసుపత్రికో, మందుల షాపుకో పరుగు తీస్తుంటారు చాలా మంది. కోవిడ్–19 మహమ్మారి నేరి్పన పాఠాలతో జనంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. సమస్య రాక ముందే భారతీయులు ముందస్తు నివారణకు ప్రాధాన్యమిస్తున్నారు. అయితే నచ్చిన వంటకాలను ఆరగించడంలో ఏమాత్రం ఆలోచించడం లేదు. అందుకే కాబోలు శని, ఆదివారం వచ్చిందంటే చాలు యాంటాసిడ్స్ కోసం కస్టమర్లు పరుగులు తీస్తున్నారు. హెల్త్కేర్ ప్లాట్ఫామ్ ఫార్మ్ఈజీ తన వేదిక ద్వారా ఔషధాలు, ఆరోగ్య ఉత్పత్తుల అమ్మకాలు, రోగ నిర్ధారణ పరీక్షల బుకింగ్స్ను విశ్లేషించి హెల్త్ రిపోర్ట్–2025 రూపొందించింది. విటమిన్స్, సప్లిమెంట్స్ కొనుగోళ్లు, రోగ నిర్ధారణ పరీక్షలు, దీర్ఘకాలిక, తీవ్ర అనారోగ్య సమస్యల పరిష్కారానికి చికిత్సలు.. కాలానుగుణంగా లేదా సంక్షోభం తలెత్తినప్పుడే కాకుండా ప్రణాళికాబద్ధంగా, ఏడాది పొడవునా అలవాట్లుగా ఉద్భవిస్తున్నాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ ట్రెండ్ మెట్రోలకే పరిమితం కాలేదని.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ వ్యాపించిందని వివరించింది. - సాక్షి, స్పెషల్ డెస్క్పోషకాహార లోపాలకు చెక్.. మొదటిసారిగా విటమిన్స్, సప్లిమెంట్స్ అత్యధిక ఆర్డర్లు నమోదైన కేటగిరీగా మారాయని నివేదిక తెలిపింది. పోషకాహార లోపాలకు చెక్ పెట్టడంలో భాగంగా మల్టీ విటమిన్స్కు కస్టమర్లు జై కొట్టారు. విటమిన్–బి సప్లిమెంట్లు టాప్లో నిలిచాయి. ఏడాదిలో వీటి విక్రయాలు 33% పెరిగాయి. కాల్షియం సప్లిమెంట్స్, విటమిన్–డి తరువాతి స్థానాల్లో నిలిచాయి. పోషకాహార లోపాలు, ఎముకలు, కీళ్ల ఆరోగ్యం గురించి జనంలో అవగాహన పెరుగుతోందనడానికి ఇది నిదర్శనం. ముందస్తుగా తెలుసుకోవడానికి.. రోగ నిర్ధారణ పరీక్షల్లో భాగంగా అత్యధికులు విటమిన్–డి పరీక్షలు చేయించుకున్నారు. థైరాయిడ్ గ్రంథి పనితీరును తెలుసుకునే టెస్టులు, రక్తంలో చక్కెర స్థాయిని కొలిచే హెచ్బీఏ1సీ పరీక్షలు టాప్–3లో నిలిచాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో క్రమం తప్పకుండా ఈ పరీక్షలు చేయిస్తున్నారు. అనారోగ్యానికి గురైనప్పుడే కాకుండా.. మొత్తం ఆరోగ్యాన్ని వివరంగా చూపే కంప్లీట్ బ్లడ్ కౌంట్ (సీబీసీ), కొవ్వు స్థాయిని తెలిపే లిపిడ్ ప్రొఫైల్స్ టెస్టులు క్రమంగా సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగమయ్యాయి. ఎప్పుడేం కొంటున్నారంటే..ఉదయం 6–9 మధ్య: విటమిన్స్, కాల్షియం, దీర్ఘకాలిక రోగాలకు మందులు. రాత్రి 10 నుంచి ఉదయం 4 వరకు: రక్తపోటు, హృదయ సంబంధ ఔషధాలు, విటమిన్–సి, కాల్షియం సప్లిమెంట్స్. వారాంతాల్లో: యాంటాసిడ్స్, స్కిన్ కేర్, సన్ కేర్, ఎనర్జీ డ్రింక్స్, ఓవర్ ద కౌంటర్కు మారిన కొత్త మందులు, స్పోర్ట్స్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్, మొక్కలతో తయారైన ఉత్పత్తులు, గ్లూకోజ్, బీపీని చెక్ చేసే డిజిటల్ మెషీన్స్. ఆదివారాల్లో: నచ్చిన వంటకాలతో ఇంటిల్లిపాదీ ఎంజాయ్ చేసే రోజు. బంధువులు, స్నేహితులు తోడైతే ఇక విందు భోజనమే. అందుకే కాబోలు యాంటాసిడ్స్ కొనుగోళ్లు 14–18% పెరిగాయి. కాలాన్నిబట్టి కొనుగోళ్లు.. వర్షాకాలం: జ్వరం సంబంధ టెస్టులు, ఎలక్ట్రోలైట్స్, యాంటీ ఫంగల్ క్రీమ్స్, దోమల నివారణ ఉత్పత్తులు. శీతాకాలం: జలుబు, దగ్గు మందులు, విటమిన్–సి, మాయిశ్చరైజర్స్. వేసవి: సన్్రస్కీన్స్, ఎలక్ట్రోలైట్ సప్లిమెంట్స్.నివేదిక హైలైట్స్.. » 2025లో ఫార్మ్ఈజీ అమ్మకాల్లో 71% సోమ–శుక్రవారం మధ్య నమోదయ్యాయి. » కాలుష్యం కారణంగా ఢిల్లీ, ముంబైలో మాస్క్లు, నెబ్యులైజర్స్, ఇన్హేలర్స్, ఆక్సిమీటర్స్ కొనుగోళ్లు ఎక్కువ. » ప్రతి రెండో కుటుంబం సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా జీర్ణ సంబంధ ఉత్పత్తిని కొనుగోలు చేసింది. » మధుమేహ (జీఎల్పీ–1) మందులు వేగంగా వృద్ధి చెందుతున్న విభాగం. ప్రతి నెల సేల్స్ 12% దూసుకెళ్తున్నాయి. » డయాబెటిస్ ఔషధాలు కొంటున్నవారిలో సగం మంది 25–45 ఏళ్ల మధ్య వయస్కులు. -
విందుల హోరు.. యాంటాసిడ్స్ జోరు!
ఆరోగ్య సమస్య తలెత్తగానే ఆసుపత్రికో, మందుల షాపుకో పరుగు తీస్తుంటారు చాలా మంది. కోవిడ్–19 మహమ్మారి నేర్పిన పాఠాలతో జనంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. సమస్య రాక ముందే భారతీయులు ముందస్తు నివారణకు ప్రాధాన్యమిస్తున్నారు. అయితే నచ్చిన వంటకాలను ఆరగించడంలో ఏమాత్రం ఆలోచించడం లేదు. అందుకే కాబోలు శని, ఆదివారం వచ్చిందంటే చాలు యాంటాసిడ్స్ కోసం కస్టమర్లు పరుగులు తీస్తున్నారు.హెల్త్కేర్ ప్లాట్ఫామ్ ఫార్మ్ఈజీ తన వేదిక ద్వారా ఔషధాలు, ఆరోగ్య ఉత్పత్తుల అమ్మకాలు, రోగ నిర్ధారణ పరీక్షల బుకింగ్స్ను విశ్లేíÙంచి హెల్త్ రిపోర్ట్–2025 రూపొందించింది. విటమిన్స్, సప్లిమెంట్స్ కొనుగోళ్లు, రోగ నిర్ధారణ పరీక్షలు, దీర్ఘకాలిక, తీవ్ర అనారోగ్య సమస్యల పరిష్కారానికి చికిత్సలు.. కాలానుగుణంగా లేదా సంక్షోభం తలెత్తినప్పుడే కాకుండా ప్రణాళికాబద్ధంగా, ఏడాది పొడవునా అలవాట్లుగా ఉద్భవిస్తున్నాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ ట్రెండ్ మెట్రోలకే పరిమితం కాలేదని.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ వ్యాపించిందని వివరించింది. పోషకాహార లోపాలకు చెక్.. మొదటిసారిగా విటమిన్స్, సప్లిమెంట్స్ అత్యధిక ఆర్డర్లు నమోదైన కేటగిరీగా మారాయని నివేదిక తెలిపింది. పోషకాహార లోపాలకు చెక్ పెట్టడంలో భాగంగా మల్టీ విటమిన్స్కు కస్టమర్లు జై కొట్టారు. విటమిన్–బి సప్లిమెంట్లు టాప్లో నిలిచాయి. ఏడాదిలో వీటి విక్రయాలు 33% పెరిగాయి. కాల్షియం సప్లిమెంట్స్, విటమిన్–డి తరువాతి స్థానాల్లో నిలిచాయి. పోషకాహార లోపాలు, ఎముకలు, కీళ్ల ఆరోగ్యం గురించి జనంలో అవగాహన పెరుగుతోందనడానికి ఇది నిదర్శనం. ముందస్తుగా తెలుసుకోవడానికి.. రోగ నిర్ధారణ పరీక్షల్లో భాగంగా అత్యధికులు విటమిన్–డి పరీక్షలు చేయించుకున్నారు. థైరాయిడ్ గ్రంథి పనితీరును తెలుసుకునే టెస్టులు, రక్తంలో చక్కెర స్థాయిని కొలిచే హెచ్బీఏ1సీ పరీక్షలు టాప్–3లో నిలిచాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో క్రమం తప్పకుండా ఈ పరీక్షలు చేయిస్తున్నారు. అనారోగ్యానికి గురైనప్పుడే కాకుండా.. మొత్తం ఆరోగ్యాన్ని వివరంగా చూపే కంప్లీట్ బ్లడ్ కౌంట్ (సీబీసీ), కొవ్వు స్థాయిని తెలిపే లిపిడ్ ప్రొఫైల్స్ టెస్టులు క్రమంగా సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగమయ్యాయి. ఎప్పుడేం కొంటున్నారంటే..⇒ ఉదయం 6–9 మధ్య: విటమిన్స్, కాల్షియం, దీర్ఘకాలిక రోగాలకు మందులు. ⇒ రాత్రి 10 నుంచి ఉదయం 4 వరకు: రక్తపోటు, హృదయ సంబంధ ఔషధాలు, విటమిన్–సి, కాల్షియం సప్లిమెంట్స్. ⇒ వారాంతాల్లో: యాంటాసిడ్స్, స్కిన్ కేర్, సన్ కేర్, ఎనర్జీ డ్రింక్స్, ఓవర్ ద కౌంటర్కు మారిన కొత్త మందులు, స్పోర్ట్స్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్, మొక్కలతో తయారైన ఉత్పత్తులు, గ్లూకోజ్, బీపీని చెక్ చేసే డిజిటల్ మెషీన్స్.⇒ ఆదివారాల్లో: నచ్చిన వంటకాలతో ఇంటిల్లిపాదీ ఎంజాయ్ చేసే రోజు. బంధువులు, స్నేహితులు తోడైతే ఇక విందు భోజనమే. అందుకే కాబోలు యాంటాసిడ్స్ కొనుగోళ్లు 14–18% పెరిగాయి. కాలాన్నిబట్టి కొనుగోళ్లు.. వర్షాకాలం: జ్వరం సంబంధ టెస్టులు, ఎలక్ట్రోలైట్స్, యాంటీ ఫంగల్ క్రీమ్స్, దోమల నివారణ ఉత్పత్తులు. శీతాకాలం: జలుబు, దగ్గు మందులు, విటమిన్–సి, మాయిశ్చరైజర్స్. వేసవి: సన్్రస్కీన్స్, ఎలక్ట్రోలైట్ సప్లిమెంట్స్.నివేదిక హైలైట్స్.. ⇒ 2025లో ఫార్మ్ఈజీ అమ్మకాల్లో 71% సోమ–శుక్రవారం మధ్య నమోదయ్యాయి. ⇒ కాలుష్యం కారణంగా ఢిల్లీ, ముంబైలో మాస్క్లు, నెబ్యులైజర్స్, ఇన్హేలర్స్, ఆక్సిమీటర్స్ కొనుగోళ్లు ఎక్కువ. ⇒ ప్రతి రెండో కుటుంబం సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా జీర్ణ సంబంధ ఉత్పత్తిని కొనుగోలు చేసింది. ⇒ మధుమేహ (జీఎల్పీ–1) మందులు వేగంగా వృద్ధి చెందుతున్న విభాగం. ప్రతి నెల సేల్స్ 12% దూసుకెళ్తున్నాయి. ⇒ డయాబెటిస్ ఔషధాలు కొంటున్నవారిలో సగం మంది 25–45 ఏళ్ల మధ్య వయసు్కలు.నగరాల వారీగా ఇలా.. హైదరాబాద్: యాంటాసిడ్స్, ప్రోబయోటిక్స్ కొనుగోళ్లలో అగ్రస్థానంలో ఉండటంతో గట్–హెల్త్ హబ్గా ఉద్భవించింది. కడుపులో అధికంగా ఉండే ఆమ్లాన్ని తటస్థీకరించి గుండెల్లో మంట, అజీర్ణం వంటి సమస్యల నుండి త్వరగా ఉపశమనం కలిగించే ఔషధాలే యాంటాసిడ్స్. ముంబై: మల్టీ విటమిన్స్, సప్లిమెంట్స్, ప్రివెంటివ్ కేర్లో ముందుంది. కాల్షియం, ప్రోటీన్ పౌడర్స్, ఫిట్నెస్ సప్లిమెంట్స్, ఒత్తిడిని కట్టడి చేసే ఆరోగ్య ఉత్పత్తులకు బలమైన డిమాండ్ ఉంది.ఢిల్లీ: కస్టమర్లు జీర్ణ వ్యవస్థ సంరక్షణ (గట్ కేర్), లైంగిక ఆరోగ్య ఉత్పత్తులను అధికంగా కొన్నారు. దగ్గు, జలుబు, అలెర్జీ మందుల అమ్మకాలూ ఎక్కువే.బెంగళూరు: రోగ నిర్ధారణకు పెద్దపీట వేశారు. గట్, చర్మ ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చారు. సాధారణ సప్లిమెంట్లను అధికంగా స్వీకరించారు.కోల్కతా: డైజెస్టివ్ ఎంజైమ్స్, ఎలక్ట్రోలైట్స్ను విపరీతంగా వాడారు. ఫిట్నెస్, ప్రోటీన్–వినియోగ మార్కెట్గా క్రమంగా మారుతోంది. చెన్నై: గర్భనిరోధక, పునరుత్పత్తి ఆరోగ్య ఉత్పత్తుల కొనుగోళ్లకు ఈ దక్షిణాది నగరం ప్రత్యేకంగా నిలిచింది. -
ఫొటో 2025
వేయి వాక్యాల్లో చెప్పలేని విషయాన్ని ఒక్క ఫొటో పట్టిచూపుతుందని ఒక విశ్లేషణ. అలా 2025 ఏడాదిలో విశ్వవ్యాప్తంగా పలు ఘటనలు చరిత్రలో నిలిచిపోయాయి.సమాజంపై ప్రభావితంచూపిన, చర్చనీయాంశమైన చిత్రాలివి..పెళ్లయి కాళ్లకు పారాణి కూడా ఆరకముందే ఉగ్రవాదుల పైశాచికకాండలో భర్తను కోల్పోయి అతని మృతదేహం వద్ద నిశ్చేష్టురాలై కూలబడిన నవ వధువు ఫొటో ఇది. పెళ్లయిన ఆరు రోజులకే నూరేళ్లు నిండిపోయిన భారత నావికాదళాధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకోగా కాపాడండి అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరచి అలసిపోయిన భార్య హిమాన్షీ ఫొటో ప్రపంచవ్యాప్తంగా అన్ని మీడియాలో ప్రచురితమైంది. ఏప్రిల్ 22వ తేదీ జమ్మూకశ్మీర్లోని పహల్గాం పరిధిలోని బైసారన్ పచ్చికబయళ్లలో అమాయక పర్యాటకులపై ఉగ్రమూకలు దాడిచేయడం, అందుకు ప్రతిగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రమూకల స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట దాడులు చేయడం తెల్సిందే.అగ్రరాజ్యాధినేత అధికారి నివాసం వైట్హౌస్ ఒక్కసారిగా రచ్చబండగా మారిన అరుదైన క్షణం తాలూకు ఫొటో ఇది. మాట్లాడుకుందాం అంటూ ఆహా్వనించి మీడియా ప్రతినిధుల ఎదుట ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తక్కువచేసి మాట్లాడటం, దానికి జెలెన్స్కీ దీటుగా బదులివ్వడం, చివరకు ద్వైపాక్షిక భేటీ వాగ్వాదాలమయంగా మారడం తెల్సిందే. ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన ఈ వాగ్వాదాన్ని ప్రత్యక్ష ప్రసారాల్లో ప్రపంచదేశాలన్నీ చూశాయి. అతిథిని అవమానించిన ట్రంప్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయల్దేరిన విమానం గాల్లోకి లేచిన 32 సెకన్లకే ఎదురుగా ఉన్న వైద్యకళాశాల భవనంపై కుప్పకూలిన అత్యంత విషాధ ఘటన తాలూకు ఫొటో ఇది. 12 మంది విమాన సిబ్బంది, 230 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలి అగ్నిగుండంగా మారి బూడిదైంది. ఈ ఘటనలో ఒక్కరే బతికి బయటపడ్డారు. విమానంలో సాంకేతిక లోపమా? పైలట్ తప్పిదమా అనేది మిస్టరీగా మారింది. దేశీయ విమానయాన రంగ భద్రతపైనా ఈ దుర్ఘటన నీలినీడలు కమ్మేలా చేసింది.వేగంగా మండే స్వభావమున్న వెదురు కర్రలు, స్టీరోఫోమ్ కిటికీలను నెలలతరబడి మరమ్మతుల కోసం వినియోగించడంతో అనుకోకుండా అంటుకున్న నిప్పురవ్వలు చివరకు హాంకాంగ్లోని ప్రముఖ వాంగ్ఫుక్ కోర్ట్ కాంప్లెక్స్ బహుళ అంతస్తుల భవనాలను నిలువునా బూడిదచేసిన దారుణోదంతం ఫొటో ఇది. ఈ ఘటనలో ఏకంగా 161 మంది ప్రాణాలు కోల్పోయారు. నవంబర్ 26వ తేదీన జరిగిన ఈ ఘోర అగ్నిప్రమాదం తర్వాత హాంకాంగ్లో వెదురు కర్రలు, స్టీరోఫోమ్ వినియోగంపై పెద్ద చర్చే మొదలైంది. అవినీతి, వారసత్వ రాజకీయాలు, నేతల విలాసవంత జీవితం, అసమర్థ, అస్తవ్యస్త పాలనతో విసిగిపోయిన నేపాల్ యువత ఉవ్వెత్తున నిరసనోద్యమంగా ఎగసిపడిన క్షణం నాటి ఫొటో ఇది. జెన్ జెడ్ ఉద్యమంగా నేపాల్ ప్రధాన నగరాల్లో వేలాదిగా బారులుతీసిన విద్యార్థులు ప్రభుత్వాన్ని బలవంతంగా కూలదోశారు. ఈ దెబ్బకు సెపె్టంబర్ 9న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, కేబినెట్ మంత్రులు పదవులకు రాజీనామాచేసి సురక్షిత ప్రాంతాలకు పారిపోవడం తెల్సిందే. వారం తిరిగేలోపే మాజీ సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి సుశీల కర్కి తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.గాజాపై నెలల తరబడి వేల కొద్దీ బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతుండటంతో ఇళ్లు, ఆస్పత్రులు సహా ప్రతి కట్టడం కుప్పకూలడంతో నిలువనీడలేక, తినడానికి తిండిలేక, దుర్భర దారి్రద్యంలో బతుకీడుస్తూ అన్నదాన శిబిరాల వద్ద గిన్నె పట్టుకుని ఆహారం కోసం పోటీపడుతున్న చిన్నారులు వీరంతా. ఈ ఏడాది మొదట్లో గాజాలో ఓ శరణార్థి శిబిరంలో తీసిన ఈ ఫొటో అక్కడి దయనీయ స్థితికి అద్దంపడుతోంది. ఇకనైనా ఇజ్రాయెల్ దారుణదాడులను నిలిపివేయాలని ప్రపంచదేశాలు వేడుకుంటున్నా అమెరికా అండతో ఇజ్రాయెల్ ఈ అభ్యర్థనలను పెడచెవిన పెడుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యాపద్బాంధవులు
ఏ పుట్టలో ఏ పాము ఉందో...అన్నట్లు మహిళల భద్రతకు సంబంధించి ఎక్కడ ఏ ముప్పు పొంచి ఉంటుందో తెలియదు. ఏ ప్రయాణంలో ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియదు. ఈ నేపథ్యంలో ఉమెన్ సేఫ్టీ యాప్స్కు ప్రాధాన్యత పెరిగింది. రకరకాల మార్గాల ద్వారా మహిళలు ప్రమాదాల బారిన పడకుండా, ప్రమాదాల నుంచి రక్షించడానికి ఈ యాప్లు ఉపయోగపడుతున్నాయి. 2025 సంవత్సరం ట్రెండింగ్ ఉమెన్ సేఫ్టీ యాప్స్ గురించి...మై సేఫ్టీపిన్క్రౌడ్ సోర్స్ డేటాను ఉపయోగించి వివిధ ప్రాంతాలకు సంబంధించి భద్రతా స్కోర్లను అందిస్తుంది... మై సేఫ్టీపిన్ యాప్. సురక్షితమైన మార్గాలను సూచిస్తుంది. ఆపద సమయంలో పోలీసులు రంగంలోకి దిగేలా చేస్తుంది. షెల్టర్ల గురించి చెబుతుంది. నగరాలను నావిగేట్ చేయడంలో సహాయపడడానికి ‘లైవ్ ట్రాకింగ్’ను అనుమతిస్తుంది. సేఫ్టీ స్కోర్, సేఫెస్ట్ రూట్, క్విక్ అడిట్, సపోర్ట్ నెట్వర్క్, లైవ్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్లాంటి కీలకమైన ఫీచర్లు ‘మై సేఫ్టీపిన్’ యాప్లో ఉన్నాయి.నూన్లైట్నూన్లైట్ అనేది మహిళలకు సంబంధించిన పర్సనల్ సేఫ్టీ యాప్. 24/7 అత్యవసర పర్యవేక్షణను అందిస్తుంది. బటన్ను ప్రెస్ చేయడం ద్వారా మనం ఉన్న స్థల వివరాలను పోలీసు, అగ్నిమాపక సిబ్బంది, వైద్యసిబ్బందిని పంపించి సర్టిఫైడ్ ఆపరేటర్లను మనకు కనెక్ట్ చేస్తుంది.ఎలా పనిచేస్తుందంటే... ‘సురక్షితంగా లేను’ అని భావించినప్పుడు ఆన్స్క్రీన్ బటన్ను నొక్కాలి. సర్టిఫైడ్ ఆపరేటర్లు మనకు టెక్ట్స్ లేదా ఫోన్ కాల్ చేస్తారు. మనం ఉన్న లొకేషన్కి సంబంధించిన సమాచారాన్ని సమీపంలోని 811 కేంద్రానికి పంపుతారు. అలర్ట్, లోకేషన్ షేరింగ్, పీస్ ఆఫ్ మైండ్లాంటి కీలక ఫీచర్లు ‘నూన్లైట్’లో ఉన్నాయి.112 ఇండియా యాప్మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం ఆవిష్కరించిన యాప్...112 ఇండియా. ఇది కస్టమర్లను ఒకే నంబర్ (112) ద్వారా పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్ సిబ్బందికి అనుసంధానించి వారి సేవలు అందుబాటులోకి వచ్చేలా చేస్తుంది. కంట్రోల్ రూమ్ లేదా సమీపంలోని వాలంటీర్లకు ఇబ్బందుల్లో ఉన్న మహిళ లొకేషన్ పంపుతుంది. తక్షణ సహాయం కోసం ఇందులో ‘షౌట్’ ఫీచర్ ఉంది. అత్యవసర సమయాలలో ‘షౌట్’ సమీపంలోని రిజిస్టర్డ్ వాలంటీర్లను అప్రమత్తం చేస్తుంది.యూ ఆర్ సేఫ్హ్యాండ్స్–ఫ్రీ ఎమర్జెన్సీ అలార్ట్స్కు ఉపయోగపడే పర్సనల్ సేఫ్టీ యాప్... యూఆర్సేఫ్. ఇందులోని కీ ఫీచర్లు... హ్యాండ్స్–ఫ్రీ ఎస్వోఎస్: సింగిల్ ట్యాప్ లేదా వాయిస్ కమాండ్తో అలర్ట్స్ను యాక్టివేట్ చేస్తుంది. లైవ్ ట్రాకింగ్ అండ్ స్ట్రీమింగ్: అత్యవసర సమయాల్లో మహిళ లొకేషన్ను ఆడియో, వీడియో స్ట్రీమింగ్తో సేఫ్టీ స్కాడ్ (మన సన్నిహిత బృందం)కి షేర్ చేస్తుంది.ఫాలోమీ: ప్రయాణాలలో మన లొకేషన్ను లేదా ఇటీఏను మన సన్నిహితులకు షేర్ చేస్తుంది. సేఫ్టీచెక్స్: లొకేషన్ బేస్డ్ సేఫ్టీ ట్రిగ్గర్స్తో మన భద్రతను పర్యవేక్షిస్తుంది. క్రాష్ అండ్ ఫాల్ డిటెక్షన్: ప్రమాదాలకు గురైనప్పుడు అలర్ట్స్ పంపుతుంది.విత్ యూ‘ఐయామ్ ఇన్ డేంజర్’లాంటి మెసేజ్ల ద్వారా మన భద్రతకు రక్షణగా నిలిచే యాప్... ‘విత్యూ’. అవతలి వ్యక్తి స్పందించే వరకు ఈ మెసేజ్ పదేపదే రిపీట్ అవుతుంది. గూగుల్ మ్యాప్స్ ద్వారా యూజర్స్ మూమెంట్ను ట్రాక్ చేస్తుంది. ఫోన్ పవర్ బటన్ను డబుల్ క్లిక్ చేయడం ద్వారా ‘విత్యూ’ యాక్టివేట్ అవుతుంది. ‘ఐయామ్ ఇన్ డేంజర్’ ‘ఐ నీడ్ హెల్ప్’ ‘ప్లీజ్ ఫాలో మై లొకేషన్’లాంటి మెసేజ్లను ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కు పంపుతుంది.షేక్ 2 సేఫ్టీమహిళా భద్రతకు సంబంధించిన ఆండ్రాయిడ్ యాప్... ‘షేక్ 2 సేఫ్టీ’. ఫోన్ను షేక్ చేయడం ద్వారా లేదా పవర్బటన్ను నాలుగుసార్లు నొక్కడం ద్వారా హెచ్చరికలను(ఎస్ఎంఎస్/కాల్) పంపుతుంది. ఆఫ్లైన్, లాక్డ్ స్క్రీన్లోనూ పనిచేస్తుంది. యాప్ సెట్టింగ్స్లో ఎమర్జెన్సీ కాంటాక్స్ను యాడ్ చేయాలి. ఎమర్జెన్సీ సమయాలలో ఎస్వోఎస్ మెసేజ్లకు సంబంధించి సైరన్ బట్ యాడ్ చేయవచ్చు. సర్కిల్ ఆఫ్ 6మహిళల భద్రతకు సంబంధించిన ‘సర్కిల్ ఆఫ్ 6’ యాప్ను కాలేజీ విద్యార్థులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆరుగురు నమ్మకమైన స్నేహితులతో మన భద్రతకు సంబంధించిన నెట్వర్క్ను ఏర్పాటు చేస్తుంది సర్కిల్ ఆఫ్ 6. ఆపదలో ఉన్నప్పుడు,అత్యవసర సమయాల్లో మనం ఉన్న లొకేషన్ వివరాల ప్రీ-ప్రోగ్రామ్డ్ ఎస్ఎంఎస్ను మన సర్కిల్కు పంపిస్తుంది. హాట్లైన్కు వేగంగా యాక్సెస్ అయ్యేలా చేస్తుంది. సింపుల్ ఐకాన్స్, జీపీఎస్ని ఉపయోగించి ‘సర్కిల్’ ద్వారా మన భద్రతను పర్యవేక్షిస్తుంది. స్పీడ్ అండ్ సింప్లీసిటీతో ప్రైవసీ ప్రధానంగా, కమ్యూనిటీ ఫోకస్డ్గా రూపొందించిన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.వరల్డ్ ఎమర్జెన్సీ అసోషియేషన్... టాప్ 10 ఉమెన్ సేఫ్టీ యాప్స్దిల్లీ పోలీసులు ‘హిమ్మత్ ప్లస్’ అనే ఉమెన్ సేఫ్టీ యాప్ను రూపొందించారు. ఫ్యామిలీ సేఫ్టీ కోసం రూపొందించిన పాపులర్ లొకేషన్–షేరింగ్ యాప్...లైఫ్360. లైవ్ లొకేషన్ షేరింగ్, ఎస్వోఎస్ అలర్ట్స్. ప్లేస్ అలార్ట్స్, రైడ్–షేర్ సేఫ్టీ, ఫ్యామిలీసేఫ్టీలాంటి కీ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మహిళల భద్రతకు సంబంధించి ‘ది వరల్డ్ ఎమర్జెన్సీ అసోసియేషన్’ ప్రకటించిన టాప్ 10 సేఫ్టీ యాప్లలో...మై సేఫ్పిన్, నూన్లైట్, లైఫ్ 360, యూఆర్సేఫ్ యాప్లతో పాటు మై ఎస్వోఎస్ ఫ్యామిలీ, ఎమర్జెన్సీ యాప్ ఆల్ట్రా, అమెరికాలో పాపులర్ అయిన సిటిజన్, ఐయామ్ సేఫ్. గూగుల్ పర్సనల్ సేఫ్టీ, సేఫ్టీ యాప్లు ఉన్నాయి.అక్కలాంటి... అమ్మలాంటి యాప్ముంబైలోని ధారావి మహిళలకు స్వచ్ఛంద సంస్థ ‘స్నేహాస్ లిటిల్సిస్టర్’ వారి యాప్ అక్కలా, అమ్మలా ధైర్యాన్ని ఇస్తోంది. ఆపదలో, కష్టాల్లో ఉన్న మహిళలు సహాయం కోసం ఎక్కడికో వెళ్లకుండ ‘స్నేహాస్ లిటిల్ సిస్టర్ యాప్’ను ఆశ్రయిస్తున్నారు. ఈ యాప్ వారికి తగిన భద్రతను, భరోసాను ఇస్తుంది. ‘సే హెల్ప్’ అనే యాప్ ద్వారా ఇటీవల దిల్లీ పోలీసులు కిడ్నాప్కు గురైన ఆరుగురు మహిళలను రక్షించారు...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ‘ఒకప్పుడు ఒంటరిగా బయటికి వెళ్లాలంటే భయంగా ఉండేది. ఉమెన్ సేఫ్టీ యాప్ల వల్ల ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ యాప్లు ధైర్యాన్ని, రక్షణను ఇస్తున్నాయి’ అంటుంది చెన్నైకి చెందిన 24 సంవత్సరాల రవళి. -
ఏఐ పొట్ట కొట్టింది.. డిజైనర్ దారి తప్పాడు
ఒకవైపు ఆధునిక ప్రపంచం ’ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్’ విజయాలను వేడుక చేసుకుంటుంటే.. అదే టెక్నాలజీ ఒక 18 ఏళ్ల కుర్రాడి పొట్ట కొట్టింది. చేతిలోని పనిని ఏఐ లాగేసుకోవడంతో, ఆకలి తట్టుకోలేక ఆ యువకుడు తన స్నేహితురాలితో కలిసి చోరీ చేసి పోలీసులకు పట్టుబడ్డారు. ఏం జరిగిందంటే? ఇండోర్లోని రావు పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 22వ తేదీ రాత్రి ఒక నగల దుకాణంలో సుమారు రూ.16 లక్షల విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలు చోరీ అయ్యాయి. ఈ కేసును ఛేదించిన పోలీసులు, భోపాల్లో తలదాచుకున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు 18 ఏళ్ల గ్రాఫిక్ డిజైనర్ కాగా, మరొకరు డాక్టర్ కావాలని కలలు కంటూ ’నీట్’ పరీక్షకు సిద్ధమవుతున్న యువతి. ‘బంటీ ఔర్ బబ్లీ’ సినిమా స్ఫూర్తితో.. డీసీపీ శ్రీకృష్ణ లాల్చందాని తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఇద్దరూ చిన్నప్పటి స్నేహితులు. మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు. 2005లో వచి్చన ‘బంటీ ఔర్ బబ్లీ’ సినిమా చూసి స్ఫూర్తి పొందారు. ఎలాగైనా సులభంగా డబ్బు సంపాదించాలని ప్రణాళిక వేసుకుని ఈ చోరీకి పాల్పడ్డారు. బతకడం కష్టమై తప్పు చేశా.. పోలీసుల విచారణలో.. ‘నేను ఒక ఐటీ కంపెనీలో పార్ట్ టైమ్ గ్రాఫిక్ డిజైనర్గా పని చేసేవాడిని. కానీ కంపెనీ వాళ్లు ఏఐ టెక్నాలజీని వాడటం మొదలుపెట్టి, నా ఉద్యోగం తీసేశారు. చేతిలో పైసా లేక, బతకడం కష్టమై ఈ దారి ఎంచుకున్నాను’.. అని ఆ యువకుడు కన్నీళ్లు పెట్టుకోవడం కలచివేసింది. దొంగతనం చేసిన నగలను అమ్మడానికి వారు ప్రయతి్నంచారు కానీ, చూడ్డానికి చిన్నపిల్లల్లా ఉండటంతో ఎవరూ వాటిని కొనడానికి ముందుకు రాలేదు. తక్కువ ధర కోట్ చేయడంతో, క్రిస్మస్ సెలవుల తర్వాత నిదానంగా అమ్ముదామని వేచి చూస్తుండగా పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం పోలీసులు వారి దగ్గర నుండి నగలను స్వా«దీనం చేసుకున్నారు. సాంకేతికత తెచి్చన మార్పు ఒక యువకుడిని నేరస్తుడిగా మార్చడం.. నేటి సామాజిక సంక్షోభానికి అద్దం పడుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రాంతీయ భాషలే ప్లస్
రోజువారీ ఉద్యోగ విధుల్లో భాగంగా కస్టమర్లతో మాట్లాడాల్సిన ఫ్రంట్లైన్ ఉద్యోగులను తీసుకునేందుకు అంకుర సంస్థలు కొత్త పంథాను ఎంచుకుంటున్నాయి. ప్రాథమికంగా దరఖాస్తులను మదింపు చేయడంలాంటి పనుల కోసం ప్రాంతీయ భాషల్లోని కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ టూల్స్ వినియోగంతో నియామకాలకు పట్టే సమయం దాదాపు 40% వరకు ఆదా అవుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. షెఫ్లు, స్టోర్ ఆపరేటర్లలాంటి ఉద్యోగాలకు చాలా మంది దరఖాస్తుదారులు, ఇంగ్లిష్ కన్నా, ప్రాంతీయ భాషల్లోనే మాట్లాడటమే సౌకర్యవంతంగా భావిస్తున్నారనే విషయం గ్రహించిన క్లౌడ్ కిచెన్ ఆపరేటరు క్యూర్ఫుడ్స్ ఈ ఏడాది నుంచి నియామకాల ప్రక్రియ కోసం నేటివ్ ల్యాంగ్వేజ్ ఏఐ సాధనాలను ఉపయోగించడం ప్రారంభించింది. ప్రస్తుతం తొలి దశ స్క్రీనింగ్ను ఆటోమేటెడ్ వాయిస్బాట్స్తో నిర్వహిస్తోంది. దీని వల్ల రిక్రూట్మెంట్ విభాగం సిబ్బందిపై ఒత్తిడి, అలాగే నియామకాలకు పట్టే సమయం తగ్గుతోందని కంపెనీ పేర్కొంది. తెలుగు, తమిళం, హిందీ తదితర ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యమిచ్చే, ద్వితీయ..తృతీయ శ్రేణి పట్టణాల్లో నివసించే ప్రతిభావంతులైన దరఖాస్తుదార్లనూ పరిగణనలోకి తీసుకునేందుకు వీలవుతోందని తెలిపింది. వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడుతోందని పేర్కొంది. వాహన్ ఏఐ తదితర థర్డ్ పార్టీ ప్లాట్ఫాంలు కొన్ని ఈ–కామర్స్, టెక్ స్టార్టప్లలో సిబ్బంది సంఖ్య 70 శాతం పైగా పెరిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. చాలా అంకుర సంస్థలు తమ మానవ వనరుల విభాగంలో సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం లేకుండా, ప్రాంతీయ భాషల్లో హైరింగ్ సొల్యూషన్స్ అందించే థర్డ్ పార్టీ ప్లాట్ఫాంల సర్వీసులను వినియోగించుకుంటున్నాయి. దీంతో వాహన్ ఏఐ, బోల్నా ఏఐ, సంవాదిని లాంటి కంపెనీల సేవలకు డిమాండ్ పెరుగుతోంది.స్టార్టప్లు చిన్న పట్టణాల్లోని ప్రతిభావంతులను కూడా తీసుకునేందుకు ఈ తరహా హైరింగ్ విధానం ఉపయోగపడుతోందని ఇన్స్టాహైర్ వర్గాలు వివరించాయి. దేశీయంగా ఏఐ ప్రొఫెషనల్స్ 23.5 లక్షల మంది పైగా ఉన్నప్పటికీ వివిధ కార్యకలాపాల నిర్వహణకు తగినంత మంది దొరకడం లేదు. డిమాండ్, సరఫరాకి మధ్య 51% పైగా వ్యత్యాసం ఉంటోంది. దీనితో ఎక్కువగా సంక్లిష్టత ఉండని, పెద్ద స్థాయిలో నిర్వహించాల్సిన ప్రాథమిక స్క్రీనింగ్, రొటీన్గా వచ్చే ప్రశ్నలకు సమాధానాలివ్వడం, ఇంటర్వ్యూలను ఫిక్స్ చేయడంలాంటి పనుల కోసం అంకురాలు ఏఐ టూల్స్ని ఎంచుకుంటున్నాయి. ప్రాంతీయ భాషల్లోని వాయిస్ బాట్స్ ఏకకాలంలో పెద్ద సంఖ్యలో కాల్స్ని హ్యాండిల్ చేయగలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్నాలాంటి జాబ్స్ మార్కెట్ప్లేస్ అంకుర సంస్థ అంతర్గతంగా రూపొందించిన ఏఐ కాలింగ్ ఏజెంటును వినియోగిస్తోంది. తొలి దశ స్క్రీనింగ్కి దీన్ని ఉపయోగిస్తోంది. రిక్రూటర్లు నిర్దిష్టంగా ప్రశ్నలను తయారు చేసి సిస్టమ్లో ఫీడ్ చేస్తారు. ఆ తర్వాత సదరు సిస్టమే, దరఖాస్తుదార్లకు కాల్ చేసి, వారి సమాధానాలను విశ్లేíÙంచుకుని, షార్ట్లిస్ట్ చేస్తుంది. దీని వల్ల మాన్యువల్గా స్క్రీనింగ్కి పట్టే సమయం సగానికి పైగా తగ్గింది. ఈ టూల్ని అప్నా తమ క్లయింట్ కంపెనీలకూ ఆఫర్ చేస్తోంది. మెరుగ్గా అంచనా వేసేందుకు వీలు .. అలాగే దేశవ్యాప్తంగా చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) రుణ సేవలందించే ఫ్లెక్సిలోన్స్ కూడా ఇదే తరహాలో నియామకాలకు ఏఐ టూల్స్ని ఉపయోగిస్తోంది. దీనితో ఫ్రంట్లైన్ సిబ్బంది నియామకాల ప్రక్రియకు పట్టే సమయం 30–40 శాతం మేర తగ్గిందని కంపెనీ వివరించింది. అభ్యర్ధులు తమకు సౌకర్యవంతంగా ఉండే భాషలో మాట్లాడటం వల్ల వారి సామర్థ్యాలను మరింత మెరుగ్గా అంచనా వేసేందుకు వీలవుతోందని తెలిపింది. ఇలాంటి సిస్టమ్స్ ఇచ్చే విశ్లేషణల వల్ల పక్షపాత ధోరణి తగ్గి, అభ్యర్ధుల షార్ట్లిస్టింగ్ ప్రక్రియ వేగవంతమవుతుందని ఫ్లెక్సిలోన్స్ వివరించింది. ముఖ్యంగా రాతపరమైన ఇంగ్లిష్ నైపుణ్యాల కన్నా స్థానిక భాషల్లో మాట్లాడే నైపుణ్యాలు ఎక్కువగా అవసరమయ్యే సేల్స్, కలెక్షన్ మొదలైన ఉద్యోగాలకు ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొంది. సాక్షి, బిజినెస్డెస్క్ -
పిల్లలూ ప్రపంచమూ
బై బై 2025... వెల్కమ్ 2026. మరో నాలుగు రోజుల్లో అందరూ ఇదే అనబోతున్నారు. న్యూ ఇయర్లో చేయాల్సిన పనులు, అందుకోవాల్సిన విజయాల గురించి ఆరాటపడుతున్నారు. ఈ పెద్దల ప్రపంచం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. మరి పిల్లలూ... మన సంగతి? 2025 ఘటనలు, పరిణామాలు మనకు ఏం చెప్పాయి? ఎలా స్ఫూర్తినిచ్చాయి? ఏం నేర్పాయి? ఏమి హెచ్చరికలు చేశాయి? ఒకసారి అలా ఒక రౌండేసి చూద్దామా?వీరే మన ఇన్స్పిరేషన్2025లో మెరిసిన తారలు బాలల్లో ఉన్నారు. బాలలకు స్ఫూర్తినిచ్చేలా వార్తల్లో నిలిచినవారూ ఉన్నారు.టైమ్ పత్రిక ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’ అమెరికన్ టీనేజర్ తేజస్వి మనోజ్ ప్రోగ్రామర్గా, వెబ్సైట్ డెవలపర్గా వార్తల్లో నిలిచింది. కాలిఫోర్నియాలో జన్మించిన తేజస్వి టెక్సాస్లో పెరిగింది. సైబర్ నేరాల నుండి వృద్ధులను రక్షించడానికి ఒక యాప్ను కనిపెట్టింది. ఆమె చొరవకు 2025లో టైమ్ పత్రిక వారి ’కిడ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకుంది. ఆమె ఫ్రిస్కోలోని లెబనాన్ ట్రైల్ హైస్కూల్లో చదువుకుంటోంది.‘సర్కాడియావి’ యాప్..ఎన్ ఆర్ఐ విద్యార్థి అయిన సిద్ధార్థ్ నంద్యాలకు 14ఏళ్లు. అంత చిన్న వయసులోనే గుండె జబ్బులను గుర్తించడానికి ఏఐను ఉపయోగించి ‘సర్కాడియావి’ అనే యాప్ను అభివృద్ధి చేశాడు. సిద్ధార్థ్ ఆవిష్కరణ గురించి తెలుసుకున్న రాష్ట్రనేతలు అతన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ యాప్ ద్వారా గుండె జబ్బులను నియంత్రించడంతో పాటు మరణాలను అరికట్టవచ్చు.గుకేష్... ది గ్రాండ్మాస్టర్..2025లో భారతీయ చదరంగంలో డి.గుకేశ్ పేరు మారుమోగింది. 2025లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్మాస్టర్గా మారి, ఆ తర్వాత క్యాండిడేట్స్ టోర్నమెంట్ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. గుకేశ్ తన ఆట శైలికి, ఆత్మవిశ్వాసానికి ప్రసిద్ధి చెందాడు. కష్టపడితే కలలెలా నిజమవుతాయో చెప్పడానికి అతను నిదర్శనంగా మారాడు. గుకేష్ చాలా మంది పిల్లలకు నేడు ఐడెల్గా కనిపిస్తున్నాడు.క్రికెట్ స్టార్... వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ క్రికెట్లో దూసుకు΄ోతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. జనవరి 2024లో అరంగేట్రం చేసి ఇండియన్ లిస్ట్ ఏలో కెరీర్ మొదలుపెట్టిన అతి పిన్న వయస్కుడిగా పేరుపొందాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అరంగేట్రం చేసిన అతి చిన్నవయసు ఆటగాడిగా మారాడు. ఇటీవల రాష్ట్రపతి భవన్ లో వైభవ్ సూర్యవంశీకి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ను అందజేశారు.2025ల పిల్లలూ.. పరిణామాలుసోషల్ మీడియా ఈ ఏడాది జరిగిన పరిశోధనల్లో సోషల్ మీడియా ప్రభావం చిన్నారులపైనా పడుతోందని గుర్తించారు. చాలామంది తల్లిదండ్రులు తమ 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఎలా వాడుతున్నారు, ఎందుకోసం వాడుతున్నారనేది గమనించడం లేదు. అయితే కొందరు చిన్నారులు అనైతిక చర్యల కోసం సోషల్ మీడియాను వాడుతున్నారని, మరికొందరు మానసిక సంబంధిత సమస్యలకు గురవుతున్నారని తేలడంతో ఆస్ట్రేలియా ఇటీవల చిన్నారుల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. తమ పిల్లలకు డిజిటల్ వ్యవహారజ్ఞానం అందించాలని అనుకోవడం మంచిదే కానీ, దానిపైనా పెద్దల అజమాయిషీ అవసరం అని 2025లో నిపుణులు తేల్చారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్2025లో ఏఐ బలంగా దూసుకు΄ోయింది. రాబోయే కాలంలో దీని ప్రభావం మరింత పెరుగనుంది. ఈ నేపథ్యంలో పిల్లల హక్కులపై దాని ప్రభావం తప్పకుండా పడుతుందని నిపుణులు అంటున్నారు. 16 ఏళ్లలోపు పిల్లలు ఏఐ మీద నమ్మకంతో అన్ని విషయాలు దాంతో పంచుకుంటున్నారు. కొందరు తమ ఆస్తిపాస్తుల వివరాలు, తమ వ్యక్తిగత విషయాలు, తన లైంగికేచ్ఛలు కూడా వాటితో చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఒంటరితనం నుంచి వారు దూరమవడానికి చేసే క్రమంలో జరుగుతున్న పరిణామం ఇది. దీనివల్ల దీర్ఘకాలికంగా చాలా నష్టాలు ఉన్నాయనేది నిపుణుల మాట. ముఖ్యంగా పిల్లలు బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచేసుకొని, కేవలం ఏఐతోనే అనుబంధం పెంచుకోవడం భారీ ముప్పుగా మారుతుందని అంటున్నారు.రికార్డ్స్ కామిక్ పుస్తకం ఖరీదు రూ.81.8 కోట్లు2025 నవంబర్లో అత్యంత అరుదైన ఓ కామిక్ పుస్తకం 9.12 మిలియన్ డాలర్ల (రూ.81.8 కోట్ల)కు అమ్ముడు΄ోయింది. సూపర్మ్యాన్ కథలుండే ‘సూపర్మ్యాన్’ కామిక్ పుస్తకాల శ్రేణిలో ఇది మొదటి సంచిక. ఒక అటకపై కనుగొన్న ఈ పుస్తకాన్ని ఆ ఇంటివారు వేలం వేయగా ఇంత భారీ ధర పలికింది. ఇప్పుడిది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కామిక్ పుస్తకంగా నిలిచింది.80 ఏళ్ల వయసు ఐరన్ మ్యాన్అక్టోబర్ 11న, 2025 ఐరన్ మ్యాన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ట్రయాథ్లాన్ లో 1,600 మందికి పైగా అథ్లెట్లు ఈత కొట్టారు. అనంతరం వారు 100 మైళ్లకు పైగా సైకిల్ తొక్కారు. ఆ తర్వాత ఒక మారథాన్ పరుగును పూర్తి చేశారు. ఇందులో 80 ఏళ్ల నటాలీ గ్రాబో ఈ మొత్తం రేసును పూర్తి చేశారు. ఈ ΄ోటీని పూర్తి చేసిన అత్యంత వృద్ధ మహిళగా రికార్డు సృష్టించింది.ఓటీటీ స్పెషల్ ‘అడాలసెన్స్’ సైకలాజికల్ క్రైమ్ డ్రామా సిరీస్2025లో విడుదలైన ‘అడాలసెన్స్’ సైకలాజికల్ క్రైమ్ డ్రామా సిరీస్ అనేకమందికి కనువిప్పుగా మారింది. 13 ఏళ్ల పిల్లాడు తన పాఠశాలలో ఒక అమ్మాయి హత్య చేసి అరెస్టయిన ఉదంతం ఇందులోని కథ. కథంతా అతని చుట్టూ, అతని ఆలోచనల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ను ఒకే టేక్లో చిత్రీకరించడం విశేషం. మార్చి 13, 2025న నెట్ఫ్లిక్స్లో ఈ సిరీస్ విడుదలైంది.వాతావరణంలో మార్పులు..వాతావరణ మార్పు పిల్లల భవిష్యత్తుకు అత్యంత తీవ్రమైన ముప్పుగా మారుతోందని 2025 హెచ్చరించింది. పర్యావరణానికి జరుగుతున్న నష్టం వల్ల ఆహార అభద్రత ఏర్పడి ఆరోగ్య సంక్షోభాలు లక్షలాది మంది పిల్లల భవితను ప్రశ్నార్థకంగా మార్చవచ్చు. అందుకే 2025లో పలు దేశాల్లో చిన్నారులు బృందాలుగా ఏర్పడి పర్యావరణ పరిరక్షణ కోసం తమ వాణి వినిపించారు. భూమిని కాపాడాలని, తమ భవితకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలని కోరారు. 2026 నుంచి ప్రపంచమంతా ఈ విషయంపై బలమైన దృక్పథం ఏర్పరచుకోవాలని నిపుణులు అంటున్నారు.ఆరోగ్యంపిల్లలకు తినడానికి ఆహారం ఇచ్చి స్కూళ్లకు పంపితే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అయితే శ్రమ లేని జీవనశైలి, మానసిక ఒత్తిడి, ఆటపాటలకు దూరమవడం, రసాయనిక ఆహార పదార్థాలు, వేళ కాని వేళల్లో నిద్ర వంటి అంశాలన్నీ కలిసి చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి. పెరుగుతున్న ఊబకాయం రేట్లు ఒకపక్క, ప్రపంచ ΄ోషకాహార లోపం మరో పక్క 2025ను ఆందోళనకు గురి చేశాయి. ఈ ప్రభావం చిన్నారుల మీద వెంటనే పడక΄ోయినా, రానున్న కాలంలో మరింత గడ్డు పరిస్థితిని తేనుందని నిపుణులు అంటున్నారు. జంక్ ఫుడ్ ఉత్పత్తులను చిన్నారుల దాకా చేరకుండా అడ్డుకోవడం తల్లిదండ్రులకు సవాలే అని తేల్చారు.బాల కార్మికులుగా చాకిరీలో..2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థను అంతం చేయాలని 2015లో ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 2025 వచ్చి వెళ్లి΄ోతున్నా ఇంకా 138 మిలియన్ల మంది పిల్లలు బాల కార్మికులుగా ఉన్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ, యూఎన్ బాలల నిధి విడుదల చేసిన బాల కార్మిక నివేదికలో పేర్కొంది. అతి త్వరలో ప్రపంచంలో బాల కార్మిక వ్యవస్థ రూపుమాసి΄ోతుందని తెలిపింది. అందరూ సమష్టిగా కృషి చేసి ఎక్కడా బాలకార్మికులు లేకుండా చూడాలని పిలుపునిచ్చింది.పరిశోధనలూ హెచ్చరికలూ జన్యు–సవరణ విధానంపిల్లలూ... ఈ సంవత్సరం వైద్య రంగంలో ఒక మంచి జరిగింది. జన్యుపరమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే చిన్నారుల కోసం శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారి జన్యు–సవరణ విధానాన్ని సృష్టించారు. తన డీఎన్ఏలో సమస్య కారణంగా అనారోగ్యంతో ఉన్న ఓ చిన్నారిపై అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఈ CRISPR (Clustered Regularly Interspaced Short Palindromic Repeats) విధానంతో చికిత్స అందించారు. ఆ చిన్నారి ఇప్పుడు చాలా వరకు కోలుకున్నాడు. త్వరలోనే ఇతర పిల్లల్లాగే అతనూ ఎదుగుతాడని, వైద్యశాస్త్రంలో ఇది కీలక పరిణామని శాస్త్రవేత్తలు అంటున్నారు.2025 పుస్తకాలు2025లో పిల్లల కోసం అనేక పుస్తకాలు మార్కెట్లోకి వచ్చాయి. అందులో కొన్ని మాయలు, మంత్రాలతో కూడిన ఊహా ప్రపంచం కాగా, మరికొన్ని వారిలో మంచిని పెంచి, ఆసక్తికరంగా చదివించే విషయాలు ఉన్నాయి. ఇవి బాగా అమ్ముడు΄ోయాయి.ది లాస్ట్ బుక్స్టోర్ ఆన్ ఎర్త్ – లిల్లీ బ్రాన్–ఆర్నాల్డ్ ఒక వినాశకరమైన తుఫాను లిజ్ ప్రపంచాన్ని ఛిన్నాభిన్నం చేసి ఏడాది సంవత్సరం గడిచింది. ఇప్పుడు మరో ప్రళయం రాబోతోంది. ఈ సమయంలో ఆమె సురక్షితంగా భావించిన ఏకైక ప్రదేశంలో ఆమె గతంలో పని చేసిన పుస్తకాల దుకాణం ఉంది. అక్కడ ఏం జరిగిందనేది ఇందులోని కథ.పీపుల్ లైక్ స్టార్స్ – పాట్రిస్ లారెన్స్ 13 ఏళ్ల ముగ్గురు అపరిచితులకు నడుమ ఒక పెద్ద రహస్యం ముడిపడి ఉంది. అదేమిటనేదే ఇందులోని కథ. వారెవరు? వారికీ, ఆ రహస్యానికీ సంబంధం ఏమిటి అనే ఆసక్తికరంగా సాగుతుంది. విచ్ఛిన్నమైన కుటుంబాలు తిరిగి కలవడం, చరిత్రలోని రహస్యాలు తెలుసుకోవడం ఇందులో చూడొచ్చు.ది డే మై స్కూల్ గాట్ ఫేమస్ – జెన్ కార్నీ పాఠశాలకు మంచి డిజైన్ సూచించాలని ప్రధాన ఉపాధ్యాయుడు సవాలు విసిరారు. గెలిచినవారికి బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ఫెర్రిస్ తన సోదరుడు నైల్తో కలిసి ఆ డిజైన్ కోసం ప్రయత్నించాలనుకున్నాడు. కానీ అతను ఎక్కడికి వెళ్ళినా అల్లరి చేస్తాడు. బహుమతిని గెలుచుకోవడానికి వారిద్దరూ తమ విభేదాలను పక్కన పెట్టారా అనేది ఇందులోని కథ. పులోమా అండ్ ది బేర్ – జస్బిందర్ బిలాన్ పులోమా అనే బాలికకు సవాల్ ఎదురైంది. ఓ ప్రమాదం నుంచి ఒకేసారి నైలా అనే ఎలుగుబంటిని, తనను తాను రక్షించుకోవాలి. అది సాధ్యమేనా? అప్పుడు ఆమె ఏం చేసింది? ఎటువంటి మార్గాలు అన్వేషించింది? ఉత్కంఠభరితమైన ఈ సాహసయాత్ర చిన్నారుల్ని విశేషంగా అలరిస్తోంది. బందీగా ఉన్న ఎలుగుబంటిని రక్షించడానికి పులోమా ధైర్యాన్ని చదివి తీరాలి. -
మన బ్రాండ్.. స్విచ్ ఆఫ్!
సాక్షి, స్పెషల్ డెస్క్ : మొబైల్ ఫోన్ల తయారీలో చైనా తర్వాతి స్థానం భారత్దే. యూఎస్, యూఏఈ, నెదర్లాండ్స్, యూకే, ఆ్రస్టియా, ఇటలీ వంటి దేశాలకు మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్తో ఐఫోన్లూ ఎగుమతి అవుతున్నాయి. స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో భారత్ రెండవ స్థానంలో ఉంది. ఏటా 15 కోట్లకుపైగా స్మార్ట్ఫోన్లు వినియోగదారుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఈ స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నా ఇండియన్ బ్రాండ్స్ కనిపించకపోవడం గమనార్హం. మైక్రోమ్యాక్స్ వంటి దేశీ బ్రాండ్స్ వచ్చినా.. భారత మొబైల్ ఫోన్ల విపణిలో 2010కి ముందు వరకు నోకియా (ఫిన్లాండ్), మోటరోలా (యూఎస్), ఎరిక్సన్ (స్వీడన్), సీమెన్స్ (జర్మనీ), సామ్సంగ్ (దక్షిణ కొరియా), సోనీ ఎరిక్సన్ (జపాన్/స్వీడన్), బ్లాక్బెర్రీ (కెనడా), ఎల్జీ (దక్షిణ కొరియా) కంపెనీలు రాజ్యమేలాయి. 2003లో చెన్నైకి చెందిన వీకే మునోత్తోపాటు పలు కంపెనీలు ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా రాణించలేదు. కానీ 2008లో మైక్రోమ్యాక్స్ రాకతో భారతీయ చవక హ్యాండ్సెట్స్ యుద్ధం మొదలైంది. క్రమంగా కార్బన్, లావా, సెల్కాన్, ఇంటెక్స్ వంటి దేశీ బ్రాండ్ల రాకతో 2010–12 మధ్య మొబైల్ ఫోన్ల కంపెనీల మధ్య పోటీ తారస్థాయికి చేరింది. దేశీయ మొబైల్ కంపెనీల దెబ్బకు ఒక దశలో నోకియా, సామ్సంగ్ మార్కెట్ వాటా తగ్గింది. ఏకంగా 230 బ్రాండ్స్.. భారత మొబైల్స్ రంగంలో ఒకానొక దశలో 50%పైగా వాటాను దేశీయ కంపెనీలు చేజిక్కించుకున్నాయంటే అతిశయోక్తి కాదు. 230 దాకా భారతీయ బ్రాండ్స్ అమ్మకాలు సాగించాయి. ఫీచర్ ఫోన్లతోపాటు స్మార్ట్ఫోన్స్, ట్యాబ్లెట్ పీసీలు, టీవీల తయారీలోకి సైతం ప్రవేశించాయి. 2010లో చైనా కంపెనీ హువావే భారత్లో అడుగుపెట్టగా షావొమీ, వివో, ఒప్పో ప్రవేశంతో 2014 నుంచి అసలైన యుద్ధం మొదలైంది. చైనా బ్రాండ్ల ముందు మన కంపెనీలు నిలవలేకపోయాయి. కొన్ని భారతీయ కంపెనీలు ఇప్పుడు ఫీచర్ ఫోన్లతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నా స్మార్ట్ఫోన్ల విభాగం పోటీలో మాత్రం విదేశీ కంపెనీల దరిదాపుల్లో కూడా లేవు. ఎలా సాధ్యమైందంటే..చవక ధరలో విక్రయించాలన్న లక్ష్యంతో ప్రవేశించిన దేశీయ బ్రాండ్స్ రిటైలర్ల మార్జిన్లపై దృష్టిపెట్టలేదనేది మార్కెట్ వర్గాల మాట. పైగా రూ. 10 వేలలోపు ధరల విభాగంలోనే ఇవి ప్రధానంగా దృష్టిపెట్టాయి. ఇక్కడే చైనా కంపెనీలు చక్రం తిప్పాయి. అధిక ఫీచర్లు, నాణ్యతకుతోడు రిటైలర్లకు అధిక లాభాలను అందించాయి. పైగా సొంత పరిశోధన, అభివృద్ధి విభాగాలతోపాటు స్మార్ట్ఫోన్ల తయారీ సైతం వాటి చేతుల్లోనే ఉండటంతో ధరలను శాసించాయి. విక్రయానంతర సేవలను చిన్న పట్టణాలకూ విస్తరించాయి. క్రమంగా చైనా బ్రాండ్లు భారతీయ మార్కెట్ను కైవసం చేసుకున్నాయి. ప్రస్తుతం మార్కెట్ పరిమాణం పరంగా దాదాపు 70% వాటా చైనా కంపెనీలదే. ప్రభుత్వం చొరవ తీసుకుంటే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశీయ బ్రాండ్లకు అవకాశమే లేదన్నది నిపుణుల మాట.ఇదీ భారత మార్కెట్..» 2025 జూలై–సెప్టెంబర్ మధ్య 4.8 కోట్లస్మార్ట్ఫోన్లుఅమ్ముడయ్యాయి. » టాప్–10లోని సామ్సంగ్, యాపిల్, మోటరోలా మినహా మిగిలినవన్నీ చైనావే. » మన దేశంలో అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్సగటు ధర రూ. 26,400పైమాటే. » రూ.72 వేలు, ఆపై ఖరీదు చేసేమోడళ్ల అమ్మకాలు ఏడాదిలో53 శాతం పెరిగాయి. » విక్రయాల్లో ఆఫ్లైన్ వాటా48.3 నుంచి 56.4 శాతానికిదూసుకెళ్లగా ఆన్లైన్ విభాగం 51.7నుంచి 43.6 శాతానికి తగ్గింది.» ఈ ఏడాది స్మార్ట్ఫోన్ మార్కెట్ రూ. 4.34 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతంస్మార్ట్ఫోన్లనువినియోగిస్తున్నవారి సంఖ్య70కోట్లు -
ఖర్చు తక్కువైతేనే విదేశీ విద్య!
‘విదేశాల్లోని పేరొందిన యూనివర్సిటీల్లో చదువుకోవాలి. కోర్సు పూర్తి కాగానే మంచి జీతంతో ఉద్యోగం సంపాదించాలి’అన్నది భారతీయ విద్యార్థుల కల. కానీ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిణామాలు, వీసా విధానాలు ఎప్పటికప్పుడు మారుతున్న నేపథ్యంలో యూనివర్సిటీల ర్యాంకుల బదులుగా తక్కువగా ఉండే విదేశీ చదువు ఖర్చులు, ఉద్యోగ అవకాశాలు, చేసిన ఖర్చుకు వచ్చే రాబడి వంటి అంశాలు విద్యార్థుల ‘విదేశీ విద్య’నిర్ణయాలను అత్యంత ప్రభావితం చేస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్మార్కెట్ విలువ ఆధారంగా లెక్కలు.. మంచి జరుగుతుందని వేచి చూసే ధోరణి గతం. ఈ విధానం నుంచి విద్యార్థులు బయటకు వచ్చారు. చేయబోయే కోర్సు లేదా డిగ్రీ ఉత్తమమైనదా కాదా అని బేరీజు వేసుకొనే రోజులు వచ్చాయి. ప్రపంచ పోటీ నేపథ్యంలో ప్రతి డిగ్రీకి మార్కెట్ విలువ ఉందా అని లెక్కలు వేసుకుంటున్నారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే అభ్యర్థులకు సహాయం, సమాచారం అందిస్తున్న లీప్ స్కాలర్ అనే కంపెనీ 2020–2025 మధ్య 30 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణుల దరఖాస్తులు, పరస్పర సంప్రదింపుల ఆధారంగా రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. తక్కువ వ్యయంతో.. ‘విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లగలనా’అనే సందేహం స్థానంలో ‘ఈ డిగ్రీ నాకు నిజంగా ఏమి ఇస్తుంది’అని విద్యార్థులు ప్రస్తుతం ప్రశ్నించుకుంటున్నారు. యూఏఈలో చదువుకోవడానికి పెరిగిన 55 రెట్ల ఆసక్తి మొదలు.. ట్యూషన్ ఫీజురహిత జర్మనీలో అడుగుపెట్టాలన్న కుతూహలం వరకు.. భారతీయ విద్యార్థులు తక్కువ వ్యయంతో అధిక నైపుణ్యాన్ని అందించే దేశాల కోసం ప్రపంచ పటాన్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు వృత్తి నిపుణులు నైపుణ్యాన్ని పెంచుకోవాలన్న డిమాండ్ కారణంగా ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్లో (ఏఐ) మాస్టర్స్ చేయాలనుకుంటున్న వారి సంఖ్య ఏకంగా 186% పెరిగింది.తిరిగి ఏం లభిస్తుంది? చదువుకు నిధులు సమకూర్చుకోవడం నుంచి కెరీర్కు ఆర్థిక సాయం చేసుకోవడం వైపు విద్యార్థుల ఆలోచనలు మళ్లుతున్నాయి. స్పష్టమైన కెరీర్ మార్గాలు, ప్రపంచంలో ఎక్కడైనా బతకగలిగేలా ఉపాధి, దీర్ఘకాలిక నివాస స్థిరత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. పెరుగుతున్న ప్రపంచ ద్రవ్యోల్బణం నేపథ్యంలో 2025–26లో ఆశావహులు విద్యను వ్యూహాత్మక పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. ఒక నిర్దిష్ట డిగ్రీ వారి దీర్ఘకాలిక ఆదాయ సామర్థ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో లెక్కించడానికి అభ్యాసంపై రాబడిని (రిటర్న్ ఆన్ లెర్నింగ్) కొలుస్తున్నారు. రాబోయే రోజుల్లో కాలేజీల్లో ప్రవేశాలు కేవలం డిగ్రీ గురించి కాదు.. ప్రపంచ జాబ్ మార్కెట్లో స్థానం సంపాదించడం కోసం అని స్పష్టం అవుతోంది. రూట్ మారింది.. సంప్రదాయ కేంద్రాలకు అతీతంగా విద్యార్థులు ఎంచుకుంటున్న దేశాలు మారుతున్నాయి. సంప్రదాయ కేంద్రాలైన యూఎస్, యూకే, కెనడా, ఆ్రస్టేలియాలో అధిక ఖర్చులు, మారుతున్న వీసా నిబంధనలు విద్యార్థుల ప్రాథమ్యాలను మార్చాయి. వారసత్వ ప్రతిష్ట కంటే దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికిగాను యూఏఈకి 5,400%, న్యూజిలాండ్ 2,900%, జర్మనీకి 377% దరఖాస్తులు పెరగడం ఇందుకు నిదర్శనం. కెరీర్ పురోగతికే పట్టం.. ⇒ 85% మంది అభ్యర్థులు విద్యార్హతల కంటే చదువు తర్వాత కెరీర్ పురోగతికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ⇒ 68% మంది విద్యార్థులు ‘అందుబాటులో వ్యయాలు’అత్యంత ప్రాధాన్యంగా పేర్కొంటున్నారు. ⇒ విదేశాల్లో విద్యనభ్యసించాలనుకున్న అభ్యర్థుల్లో 65.5% మంది 18–25 ఏళ్ల వయస్కులు. ⇒ 26 ఏళ్లకుపైగా ఉన్నవారి వాటా 34.5%. కెరీర్ పురోగతికై ప్రత్యేక డిగ్రీలను వృత్తి నిపుణులు కోరుకుంటున్నారు. ⇒ విద్యార్థుల్లో పురుషులు 58%, మహిళలు 42% ఉన్నారు. ⇒ అభ్యర్థుల్లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్ 54.7%, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు కోరుకునేవారు 23.7% ఉన్నారు. ⇒ దరఖాస్తుల్లో 6.3% పీహెచ్డీ కోసం అభ్యరి్థంచినవే. వీటి సంఖ్య ఏడాదిలో 60% పెరిగింది.ఏఐపై పట్టు సాధించేందుకు.. ⇒ ఏఐ కోర్సుల్లో ప్రత్యేక మాస్టర్స్ ప్రవేశాలు 2023తో పోలిస్తే 2024లో దాదాపు 3 రెట్లు పెరిగాయి. ⇒ ఈ విద్యార్థులలో 49.9% మంది పూర్తిగా రంగాలను మార్చడం కంటే మార్కెటింగ్ అనలిటిక్స్, ఫైనాన్స్ వంటి వారి ప్రస్తుత రంగాల్లో నైపుణ్యాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ⇒ ఏఐ కోర్సులు చేద్దామనుకుంటున్న ఆశావహుల్లో దాదాపు 36% మంది ఇప్పటికే వృత్తి నిపుణులు. సాంకేతిక నైపుణ్యం పెంచుకోవడం వృత్తిపరంగా అవసరమని వారు రుజువు చేస్తున్నారు. -
'రబ్బరు' విప్లవం
మన్యం కొండల్లో ప్రకృతి ప్రసాదించిన చల్లని వాతావరణం ఇప్పుడు గిరిజన రైతుల పాలిట వరంగా మారుతోంది. మారేడుమిల్లి ప్రాంతం రబ్బరు సాగుకు అనుకూలంగా ఉన్నందున ఇక్కడ ఆధారిత పరిశ్రమ ఏర్పాటుకు రంపచోడవరం ఐటీడీఏ కసరత్తు మొదలుపెట్టింది. మూడు దశాబ్దాల క్రితం చిన్నగా మొదలైన ఈ రబ్బరు సాగు ప్రస్థానం, ఇప్పుడు వేల ఎకరాలకు విస్తరించడమే కాకుండా.. స్థానికంగానే వస్తువుల తయారీ పరిశ్రమ ఏర్పడే స్థాయికి చేరింది. రూ. 5 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమతో గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడనుంది. రంపచోడవరం: అల్లూరి జిల్లాలో సముద్ర మట్టానికి ఎత్తులో ఉండి, చల్లని వాతావరణం కలిగిన మారేడుమిల్లి ప్రాంతం రబ్బరు సాగుకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. ఇక్కడి వాతావరణ పరిస్థితులు రబ్బరు ఉత్పత్తికి అనుకూలంగా ఉండటంతో, గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధిని కాంక్షిస్తూ ఐటీడీఏ అధికారులు ఈ ప్రాంతంలో రబ్బరు పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 1994లో మొదలైన ప్రస్థానం.. రబ్బరు బోర్డు పర్యవేక్షణలో 1994లోనే ఇక్కడ సాగుకు పునాదులు పడ్డాయి. ఐటీడీఏ – రబ్బరు బోర్డు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టాయి. బ్లాక్ ప్లాంటేషన్–1: దేవరపల్లి గ్రామంలో 1994లో 50 హెక్టార్లలో తొలిసారిగా రబ్బరు మొక్కలు నాటారు. బ్లాక్ ప్లాంటేషన్–2 : పుజారిపాకలు, వేటుకూరు గ్రామాల్లో 1998 – 2003 మధ్య 35 మంది రైతులకు చెందిన 45 హెక్టార్లలో సాగు చేపట్టారు. బ్లాక్ ప్లాంటేషన్–3 : పందిరిమామిడి కోటలో 2009–2013 మధ్య వంద హెక్టార్లలో మొక్కలు నాటారు. మొక్కలు నాటిన మూడేళ్ల వరకు రైతులకు సాంకేతిక సహకారం అందించగా, ఆ తర్వాత రెండేళ్లకు పాల ఉత్పత్తి ప్రారంభమై రైతులకు ఆదాయం మొదలైంది. ఐటీడీఏ సహకారంతో విస్తరిస్తున్న సాగు గతంలో సాంకేతిక లోపాలతో కొన్ని మొక్కలు దెబ్బతిన్నప్పటికీ, ప్రస్తుతం గిరిజనులు ఈ సాగుపై మక్కువ చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఐటీడీఏ భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది: » రంపచోడవరం, మారేడుమిల్లి, వై.రామవరం (అప్పర్ పార్ట్) పరిధిలో 3 వేల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ ఏడాది వెయ్యి ఎకరాల్లో మొక్కలు నాటేందుకు రైతులను సిద్ధం చేస్తోంది. » మిగిలిన రెండేళ్లలో మరో 2వేల ఎకరాల్లో సాగు విస్తరించనున్నారు. ఈ ప్రాంతంలో రబ్బరు బోర్డు ద్వారా 2024లో 370 ఎకరాలు, 2025లో 501 ఎకరాల్లో సాగు చేపట్టారు.» ఎకరానికి 450 కిలోల వరకు రబ్బరు షీట్లు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుతం కిలో ధర రూ. 170 వరకు ఉంది రూ. 5 కోట్లతో పరిశ్రమ మారేడుమిల్లిలో పండుతున్న రబ్బరుకు స్థానికంగానే విలువల జోడింపునకు రూ. 5 కోట్ల వ్యయంతో వస్తువుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రూ. 2.50 కోట్ల నిధులు విడుదలయ్యాయి. స్థల సేకరణ ప్రక్రియ పూర్తయింది. రబ్బరు బోర్డు నుంచి డీపీఆర్ అనుమతి వచ్చిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పరిశ్రమ అందుబాటులోకి వస్తే స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, రబ్బరు సాగుచేసే రైతులకు గిట్టుబాటు ధర లభించనుంది. ఏడాదికి రూ.8 లక్షల ఆదాయం పందిరిమామిడి కోటలో ఆరు ఎకరాల్లో 1200 రబ్బరు మొక్కలు ఉన్నాయి. ఏడాదికి రూ. 8లక్షలు వరకు ఆదాయం వస్తుంది. రబ్బరు పాల సేకరణ కోసం గ్రామంలో కొంత మందికి ఉపాధి కూడా కలి్పస్తున్నా. రబ్బరు సాగుకు మరింత ప్రోత్సాహం ఇస్తే ఇంకా రైతులు సాగు చేసేందుకు అవకాశం ఉంటుంది. – కత్తుల సోమిరెడ్డి, పందిరిమామిడి కోట స్మోక్ రూమ్లకు ప్రతిపాదనలు రబ్బరు సాగు చేసే రైతుల సంఖ్య పెరగడంతో రబ్బరు షీట్ల తయారీకి స్మోక్ రూమ్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఇప్పటికే ఐదు స్మోక్ రూమ్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు. మూడు వేల ఎకరాల్లో రబ్బరు మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. – దేవనందం, పీహెచ్వో, రంపచోడవరంఆదాయం పెరుగుతుంది రబ్బరు ఆధారిత పరిశ్రమ ఏర్పాటుతో సాగు రైతులకు ఆదాయం పెరుగుతుంది. రబ్బరు ఆధారిత పరిశ్రమలో రైతులను భాగస్వాములను చేస్తే బాగుంటుంది. ఈ దిశగా రంపచోడవరం ఐటీడీఏ, రబ్బరు బోర్డు అధికారులు చర్యలు చేపట్టాలి. – కత్తుల రామిరెడ్డి, వేటుకూరు, మారేడుమిల్లి మండలంఆన్లైన్లో మార్కెటింగ్ రబ్బరు సాగు తొలుత దేవరపల్లిలో ప్రారంభమైంది. ఉత్పత్తి చేసిన రబ్బరును ఆన్లైన్ మార్కెట్లో ధరల వివరాలు తెలుసుకుని అమ్ముకుంటున్నాం. ఎటువంటి మోసాలకు అవకాశం లేదు. రబ్బరు బోర్డు, ఐటీడీఏ సహకారంతో మెరుగైన ఆదాయం పొందగలుగుతున్నాం. – పల్లాల సూర్యవతి, దేవరపల్లి -
‘బార్’ బరి.. గెలుపెవరిదో మరి!
ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల నగారా ఎట్టకేలకు మోగింది. 2014లో ఉమ్మడి రాష్ట్రం విడిపోయినా.. హైకోర్టు మాత్రం 2018 డిసెంబర్ వరకు కలిసే పనిచేసింది. 2019 నుంచి ఇరు హైకోర్టులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత బార్ కౌన్సిల్కు జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే. అంటే.. తెలంగాణ బార్ కౌన్సిల్ మొదటి ఎన్నికలివి. దీంతో తీవ్ర పోటీ నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగానే ‘ప్రాధాన్యత’ క్రమంలో సభ్యులను ఎన్నుకుంటారు. సభ్యులు.. చైర్మన్, వైస్ చైర్మన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సభ్యుడిని ఎన్నుకుంటారు. 25 మంది సభ్యుల కోసం జరిగే ఈ ఎన్నికల్లో దాదాపు 100 మందికి పైగా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు జిల్లాల్లోని కోర్టుల్లో తిరుగుతూ ప్రచారం షురూ చేశారు. మరికొందరు త్వరలో రంగంలోకి దిగనున్నారు. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ ఎప్పుడు ఏర్పడింది? దాని విధులేంటి?.. తదితర ఆసక్తికర అంశాలపై కథనమిది. – సాక్షి, హైదరాబాద్వృత్తిపరమైన విభేదాలతో న్యాయవాదిపై దాడి చేసినా.. హింసించినా ఎవరిని ఆశ్రయించాలి?.. న్యాయవాది (Advocate) సంక్షేమాన్ని ఎవరు పర్యవేక్షిస్తారు? న్యాయ విద్యాలయాలకు అనుమతులు, సీట్ల కేటాయింపు.. వీటికి సమాధానమే బార్ కౌన్సిల్. ఇది ఓ చట్టబద్ధమైన సంస్థ. న్యాయవాదిగా నమోదు చేసుకోవడం, వారి హక్కులు, అధికారాలు, ప్రయోజనాలు కాపాడటం, దుష్ప్రవర్తనకు పాల్పడితే ఫిర్యాదులు స్వీకరించి చర్యలు చేపట్టడం.. ఇదంతా బార్ కౌన్సిల్ విధి. దేశవ్యాప్తంగా అతిపెద్ద చట్టబద్ధమైన సంస్థలో బీసీఐ ఒకటి. న్యాయవాదుల చట్టం ప్రకారం రాష్ట్ర కౌన్సిల్లో న్యాయవాదుల సంఖ్య 10,000 దాటితే సభ్యులు 25 మంది ఉండాలి. ఈ మేరకు తెలంగాణ కౌన్సిల్లో సభ్యుల సంఖ్య 25. వీరు చైర్మన్, వైస్ చైర్మన్ను ఎన్నుకుంటారు. బరే యాక్ట్ చాప్టర్ 2 ప్రకారం రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుల కాల పరిమితి ఐదేళ్లు. ఆ తర్వాత 6 నెలల వరకు పొడిగించే అధికారం బీసీఐకి ఉంది. బీసీఐ అవసరాన్ని నొక్కి చెబుతూ 1953లో ఎస్ఆర్ దాస్ నేతృత్వంలోని ‘ఆల్ ఇండియా బార్ కమిటీ’ ఓ నివేదిక సమర్పించింది. ప్రతి రాష్ట్రానికో బార్ కౌన్సిల్ ఉండాలని, వీటన్నింటిపై అత్యున్నత సంస్థగా అఖిల భారత స్థాయి బార్ కౌన్సిల్ పర్యవేక్షణ ఉండాలని ప్రతిపాదించారు. అనంతరం 1961లో న్యాయవాదుల చట్టం అమల్లోకి వచ్చింది. ఇందులో సెక్షన్ 3 మేరకు ప్రతి రాష్ట్రానికో బార్ కౌన్సిల్ ఉండాలన్న నిబంధన ప్రకారం ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్ ఏర్పాటు జరిగింది. 2018, జూలైలో తెలంగాణ బార్ కౌన్సిల్ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్లో (Bar Council of Telangana) దాదాపు 50,785కి పైగా న్యాయవాదులున్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్కు సభ్యుల ఎన్నికలో వీరంతా ఓటర్లుగా ఓటు వేస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో ‘ప్రాధాన్యత’ ఓటు ఆధారంగా సభ్యులను ఎన్నుకుంటారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ విధులు..» న్యాయవిద్య పూర్తి చేసిన వారిని న్యాయవాదులుగా చేర్చుకోవడం» వారి జాబితాను సిద్ధం చేయడం, విధులను పర్యవేక్షించడం » న్యాయవాదులెవరైనా దుష్ప్రవర్తనకు పాల్పడితే కేసులను స్వీకరించడం, చర్యలు చేపట్టడం » న్యాయవాదుల హక్కులు, అధికారాలు, ప్రయోజనాలను కాపాడటం» నిరుపేదలు, దివ్యాంగులు, ఇతర న్యాయవాదుల కోసం సంక్షేమ పథకాల నిర్వహణ» విపత్కర సమయాల్లో పేద న్యాయవాదులకుఆర్థిక సహాయం అందించడం» ప్రముఖ న్యాయనిపుణులతో చట్టపరమైన అంశాలపై సెమినార్లు, చర్చలు నిర్వహించడం » పేదలకు నిర్దేశించిన పద్ధతిలో న్యాయ సహాయం అందించడం» న్యాయ విశ్వవిద్యాలయాలను, కాలేజీలను తనిఖీ చేయడం» న్యాయ విద్య పూర్తి చేసిన వారికి విధిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరీక్ష నిర్వహించాలిబార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా..దేశవ్యాప్తంగా న్యాయవాదుల వృత్తిని నియంత్రించడానికి, ప్రాతినిధ్యం వహించడానికి పార్లమెంట్ ఏర్పాటు చేసిన ఓ చట్టబద్ధమైన సంస్థ. వృత్తిపరమైన ప్రవర్తన, మర్యాదల ప్రమాణాలను నిర్దేశించడం, బార్పై క్రమశిక్షణ అధికార పరిధిని అమలు చేస్తూ నియంత్రణ విధులను నిర్వహిస్తారు. » న్యాయ విద్యకు ప్రమాణాలను కూడా నిర్దేశిస్తుంది» న్యాయవాదులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికార పరిధి ఉంటుంది» న్యాయవాదుల విధులను నియంత్రిస్తుంది. » న్యాయ డిగ్రీ విశ్వవిద్యాలయాలకు గుర్తింపును మంజూరు చేస్తుంది» న్యాయవాదుల హక్కులు, అధికారాలు, ప్రయోజనాలను పరిరక్షిస్తుంది» సంక్షేమ పథకాల నిర్వహణకు ఆర్థిక సహాయం అందించడానికి నిధులను సృష్టిస్తుంది» న్యాయవాదుల వృత్తిపరమైన ప్రవర్తన, ప్రమాణాలను నిర్దేశిస్తుంది.» రాష్ట్ర బార్ కౌన్సిల్ క్రమశిక్షణ కమిటీలు అనుసరించాల్సిన విధానం నిర్దేశం» న్యాయవాదుల హక్కులు, అధికారాలు, ప్రయోజనాలను కాపాడటం» చట్ట సంస్కరణలను ప్రోత్సహించడం, మద్దతు ఇవ్వడం» రాష్ట్ర బార్ కౌన్సిల్ సూచించే ఏదైనా సమస్యను పరిష్కరించడం» బార్ కౌన్సిల్ నిధుల నిర్వహణ.. పెట్టుబడి పెట్టడం» ప్రతి రాష్ట్ర బార్ కౌన్సిల్ నుంచి ఐదేళ్ల కాలపరిమితితో బీసీఐకి సభ్యులు ఎన్నికవుతారు. » వీరంతా రెండేళ్ల కాలపరిమితికి చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు.» బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అటార్నీ జనరల్ ఎక్స్–అఫీషియో సభ్యునిగా ఉంటారు.» బీసీఐ తొలి చైర్మన్ ఎంసీ సెతల్వాడ్. ప్రస్తుతం మనన్ కుమార్ మిశ్రా.» దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో బార్ కౌన్సిళ్లు ఉన్నాయి.తెలంగాణ బార్ కౌన్సిల్లో మొత్తం సభ్యుల సంఖ్య 25 వీరిలోచైర్మన్,వైస్ చైర్మన్ల సంఖ్య 2బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నామినేటయ్యే సభ్యుల సంఖ్య 1ఎక్స్–అఫీషియో సభ్యుల సంఖ్య 1 (అడ్వొకేట్ జనరల్)ఆలిండియా బార్ కౌన్సిల్ పరీక్షన్యాయవాద వృత్తి ప్రమాణాలను మెరుగుపరచడమే ఏకైక ఉద్దేశంతో బీసీఐ దీన్ని ప్రవేశపెట్టింది. 2009–2010 విద్యా సంవత్సరం నుంచి పట్టభద్రులైన న్యాయ విద్యార్థులకు ఈ పరీక్ష తప్పనిసరి చేస్తూ బీసీఐ నిర్ణయం తీసుకుంది. న్యాయవాదుల చట్టం 1961లోని సెక్షన్ 24 ప్రకారం న్యాయవాదులుగా నమోదు చేసుకున్న తర్వాత మాత్రమే అభ్యర్థులు పరీక్షకు హాజరు కావడానికి దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అభ్యర్థికి ప్రాక్టీస్ సర్టిఫికెట్ ఇస్తారు. దేశంలోని ఏ కోర్టులోనైనా ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉంటుంది. ఈ పరీక్ష దేశంలోని జాతీయ, ప్రాంతీయ భాషల్లో ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. అభ్యర్థి విశ్లేషణాత్మక నైపుణ్యాలను అంచనా వేయడంతో పాటు, ప్రాథమిక స్థాయి జ్ఞానాన్ని అంచనాకు, న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించడానికి కనీస బెంచ్మార్క్ను ఈ పరీక్ష నిర్దేశిస్తుంది. న్యాయ విద్య పట్టా పొందినా వృత్తిలోకి ప్రవేశించడానికి ఆసక్తి లేని వారికి ఈ పరీక్ష అవసరం లేదు. న్యాయవ్యవస్థ ప్రధాన పిల్లర్ న్యాయవాదులే..ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించే న్యాయవ్యవస్థకు ప్రధాన పిల్లర్ న్యాయవాదులే. అలాంటి వారి రక్షణకు చట్టం అవసరం తప్పనిసరి. వైరి కక్షిదారుల బెదిరింపులు, దాడులు, హత్యలు ఇటీవల కాలంగా పెరిగిపోయాయి. యువ న్యాయవాదులకు శిక్షణా తరగతులు అవసరం. అత్యుత్తమ న్యాయవాదులను తయారు చేస్తే న్యాయవ్యవస్థ ఔన్నత్యం మరింత ఇనుమడిస్తుంది. సత్వర న్యాయానికి దోహదం చేస్తుంది. – బీఎస్ ప్రసాద్, మాజీ అడ్వొకేట్ జనరల్సంక్షేమానికి పాటుపడాలిబార్ కౌన్సిల్ న్యాయవాదులు సంక్షేమానికి పాటుపడాలి. మరిన్ని పథకాలు అమలు చేసే దిశగా కృషి చేయాలి. వీలైతే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి న్యాయవాదుల సమస్యలను వివరించాలి. జిల్లా కోర్టుల్లో డిస్ప్లే బోర్డుల సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కేసు ఎప్పుడు వస్తోందో తెలియక న్యాయవాదులు అవస్థలు పడుతున్నారు. న్యాయవాదుల రక్షణ చట్టంతోపాటు ఇలాంటి సమస్యలు పరిష్కరించే ‘కౌన్సిల్’ను ఎన్నుకోవాలి. – పొన్నం అశోక్గౌడ్, మాజీ అధ్యక్షుడు, హెచ్సీఏఏ న్యాయవాదులకు ఆప్తుడు వైఎస్సార్న్యాయవాదులకు ఆప్తుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. నేరుగా కౌన్సిల్కు సాయం చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఆయన. దాదాపు 20 ఏళ్లుగా చైర్మన్గా సేవలందిస్తున్నాను. రెండు దశాబ్దాల్లో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. ఇతర సభ్యులు, న్యాయవాదులు అందరూ తమ వంతు సహకరించారు. ఇన్నేళ్లు చైర్మన్గా కొనసాగడం ఓ రికార్డే. 2006 చైర్మన్గా తొలిసారి వైఎస్సార్ను కలిశా. అడిగిన వెంటనే రూ.1.65 కోట్లను మంజూరు చేశారు. విడతలవారీగా ఒక్కో పని చేసుకుంటూ పోదామని చెప్పారు. అడిగిన వెంటనే నిధులిచ్చే అలాంటి ముఖ్యమంత్రిని మళ్లీ చూడలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రూ.3 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అందులో సగం మంజూరు చేశారు. – నరసింహారెడ్డి, చైర్మన్, రాష్ట్ర బార్ కౌన్సిల్ ప్రధాన హామీ.. న్యాయవాద రక్షణ చట్టంన్యాయవాదులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. వైరి వర్గాల వారు హత్య చేయడం, దాడులు చేయడం సర్వసాధారణంగా మారింది. ఓ న్యాయవాద దంపతుల కేసును సుప్రీంకోర్టు ఏకంగా సీబీఐకే అప్పగించింది. ఈ నేపథ్యంలో న్యాయవాద రక్షణ చట్టం తీసుకురావాలన్నది ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. యువ న్యాయవాదులకు స్టైపెండ్, శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, జీవిత బీమా, ప్రమాద బీమా మరింత మందికి అందుబాటులోకి తెస్తామని, సడలింపులు చేస్తామంటూ ప్రచారం సాగించనున్నారు. పకడ్బందీగా నిర్వహణబార్ కౌన్సిల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఓటర్ల జాబితాను రాష్ట్రంలో అన్ని బార్ అసోసియేషన్లకు పంపిన తర్వాతే తుది జాబితాను ప్రచురించాం. సుప్రీంకోర్టు నియమించిన ఎన్నికల కమిటీ సూచనల మేరకు చర్యలు చేపడుతున్నాం. ఎన్నిక లు ప్రజాస్వామ్యానికి నిదర్శనం. న్యాయవాదులు తమ ఓటు వినియోగించుకోవాలని కోరుతున్నాం. – నాగలక్ష్మి, కార్యదర్శి, బార్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించండి..రాష్ట్ర బార్ కౌన్సిల్కు ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించడం లేదంటూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నవంబర్లో తీర్పునిచ్చింది. ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహించాలో గడువు నిర్దేశించింది. ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి ఎన్నికల కమిటీ పర్యవేక్షణ జరుపుతుంది.జనవరి 31: ఉత్తరప్రదేశ్, తెలంగాణఫిబ్రవరి 28: ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, త్రిపుర, పుదుచ్చేరిమార్చి 15: రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కర్ణాటక, గుజరాత్, పంజాబ్మార్చి 31: మేఘాలయ, మహారాష్ట్రఏప్రిల్ 30: తమిళనాడు, కేరళ, అస్సాంఉన్నతస్థాయి కమిటీ..జస్టిస్ రవిరాజన్ (చైర్మన్)మాజీ ప్రధాన న్యాయమూర్తి, జార్ఖండ్ హైకోర్టుజస్టిస్ ఏఆర్ మక్సూది మాజీ న్యాయమూర్తి, అలహాబాద్, హైకోర్టుజస్టిస్ రేఖా పల్లి మాజీ న్యాయమూర్తి, ఢిల్లీ హైకోర్టుప్రస్తుత బార్ కౌన్సిల్ ఏం చేసింది..?» న్యాయవాది మరణ ప్రయోజనాలను రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు » కోవిడ్ సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు రూ.25 కోట్లు మంజూరు చేసేలా సర్కార్ను ఒప్పించడం» కరోనా మహమ్మారి కష్టకాలంలో అనేక మంది నిరుపేద న్యాయవాదులకు ఆర్థిక సహాయం పంపిణీ » అంతర్గత సెమినార్ల నిర్వహణ, ఐసీఎఫ్ఏఐ లా స్కూల్తో కలిసి రెండు రోజుల కీలకసెమినార్» ఉమ్మడి బార్ కౌన్సిల్ విభజన తర్వాత తలెత్తిన వివిధ సమస్యలను విజయవంతంగా పరిష్కరించడం» న్యాయవాదులు వృత్తికి సంబంధించి సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడం » నిర్ణీత వయసు (35 ఏళ్లు) దాటిన న్యాయవాదులు అడ్వొకేట్స్ వెల్ఫేర్ ఫండ్లో సభ్యులు కావడానికి అవకాశం కల్పించడం. తెరపైకి మహిళా రిజర్వేషన్రాష్ట్ర బార్ కౌన్సిళ్ల పదవుల్లో 30 శాతాన్ని మహిళా న్యాయవాదులకు కేటాయించాలి. ఈ ఏడాది ఇంకా బార్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాని రాష్ట్రాల్లో ఈ ఆదేశాలను అమలు చేయాలి. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో మాత్రం నోటిఫికేషన్ ప్రకారం ముందుకు సాగవచ్చు. ఒకవేళ తగినంత మంది మహిళా న్యాయవాదులు లేకున్నా, పోటీ చేయడానికి ఇష్టపడకున్నా.. 20 శాతం పదవులను ఎన్నిక ద్వారా, మిగిలిన 10 శాతం పదవులను కో–ఆప్షన్ ద్వారా నియమించుకోవచ్చు. కో–ఆప్షన్ ద్వారా నియమించేందుకు ప్రతిపాదించే మహిళా న్యాయ వాదుల పేర్లను తొలుత కోర్టు ముందు ఉంచాలి.మహిళలకు సీట్ల రిజర్వు హర్షణీయంమహిళలకు 30 శాతం రిజర్వేషన్ పాటించాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పు హర్షణీయం. దశాబ్దాల తర్వాత బార్ కౌన్సిల్లో మహిళలకు సముచిత స్థానం దక్కనుంది. ఈ బార్ కౌన్సిల్ కార్యవర్గంలో ఒక్కరూ మహిళలు లేకపోవడం శోచనీయం. చట్టాల అమలు కోసం సమర్థవంతమైన వాదనలు వినిపించే మహిళా న్యాయవాదులు ముందుకు రావాలి. కేసులకే పరిమితం కాకుండా ఎన్నికల్లో పోటీ చేసి.. విజయం సాధించి మహిళా న్యాయవాదుల సంక్షేమానికి పాటుపడాలి. – జి.సుభాషిణి, న్యాయవాది వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించాలి..ఈ వృత్తిలో న్యాయవాద సంబంధిత అంశాలతో పాటు అంగ్ల పరిజ్ఞానం తప్పనిసరి. పేద, మధ్య తరగతి న్యాయవాదుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారున్నారు. వారు ఇబ్బంది పడకుండా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు బార్ కౌన్సిల్ కృషి చేయాలి. స్కిల్స్ లేకుండా రాణించడం కష్టం. కోర్టులో వాదనలు ఎలా జరుగుతాయి.. క్రిమినల్, సివిల్ చట్టాలపై తరగతులు నిర్వహించాలి. వారు కూడా చర్చల్లో పాల్గొనే అవకాశం ఇచ్చి భయాందోళన దూరం చేయాలి. దీని కోసం కౌన్సిల్ కృతనిశ్చయంతో పనిచేయాలి. – పాలకుర్తి కిరణ్, మాజీ న్యాయమూర్తిముఖ్యమైన పాయింట్లు...» 1961లో బార్ కౌన్సిళ్లు ఏర్పాటైనా.. చైర్మన్ల ఎన్నిక మాత్రం 1969 నుంచి ప్రారంభమైంది. అప్పటివరకు అడ్వొకేట్ జనరల్ ఎక్స్ అఫీషియోమెన్ హోదాలో చైర్మన్గా ఉండేవారు. » బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తొలి చైర్మన్ ఎంసీ సెతల్వాడ్» ఆర్బీ జఠ్మలానీ, వీసీ మిస్త్రా, మనన్ కుమార్ మిస్త్రా.. బీసీఐ చైర్మన్గా రెండు సార్లు ఎన్నికయ్యారు.» మనన్కుమార్ మిస్త్రా.. అత్యధిక కాలం... దాదాపు 14 ఏళ్లు చైర్మన్గా సేవలందించారు. 2012, ఏప్రిల్ 17 నుంచి 2014, ఏప్రిల్ 16 వరకు.. 2014, నవంబర్ 9 నుంచి ప్రస్తుతం...» దేశవ్యాప్తంగా మొత్తం 24 బార్ కౌన్సిళ్లున్నాయి. » మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్లో 2 లక్షలకుపైగా న్యాయవాదులున్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల షెడ్యూల్..ప్రాథమిక ఓటర్ల జాబితా జారీ: డిసెంబర్ 1తుది జాబితా విడుదల: డిసెంబర్ 10నోటిఫికేషన్ గెజిట్ జారీ: డిసెంబర్ 20నామినేషన్లు ప్రారంభం: డిసెంబర్ 29నామినేషన్లు గడువు ముగింపు: జనవరి 9నామినేషన్ల పరిశీలన: జనవరి 10నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం: జనవరి 13 నుంచి 16 వరకుఅభ్యర్థుల తుది జాబితా ప్రచురణ: జనవరి 17బ్యాలెట్ పేపర్లు, బాక్సుల పంపిణీ: జనవరి 19ఎన్నికల తేదీ: జనవరి 30ఓట్ల లెక్కింపు: ఫిబ్రవరి 10(బార్ కౌన్సిల్కు పోటీ చేయాలనుకునే వారు రూ.1.25 లక్షల నాన్ రిఫండబుల్ రిక్లరేషన్ సమర్పించాలి. ఒక్కో అభ్యర్థికి మద్దతుగా 10 మంది న్యాయవాదులు సంతకం పెట్టాలి)ఓటు హక్కు వినియోగించుకోనున్న మొత్తం ఓటర్ల సంఖ్య: 35,316మహిళలు: 7,637 పురుషులు: 27,679 -
2025లో అహో 2026లో ఒహో
ఈ కేలండర్ ఏడాది(2025) దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి ప్రైమరీ మార్కెట్లు లిస్టింగ్లతో సెంచరీ కొట్టాయి. మరోపక్క సెకండరీ మార్కెట్లు సైతం సరికొత్త గరిష్టాలను చేరడం ద్వారా చరిత్ర సృష్టించాయి. ఇందుకు ప్రధానంగా రిటైలర్లు, దేశీ ఫండ్స్ కనీవినీ ఎరుగని రీతిలో చేపడుతున్న భారీ పెట్టుబడులు తోడ్పాటునిస్తున్నాయి. దీంతో కొత్త ఏడాది(2026)లోనూ ప్రైమరీ మార్కెట్లు సుప్రసిద్ధ కంపెనీల ఐపీవోలతో కదం తొక్కేందుకు సిద్ధపడుతున్నాయి. వివరాలు చూద్దాం.. సరికొత్త చరిత్రకు తెరతీస్తూ 2025 జనవరి–డిసెంబర్ కాలంలో 103 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. తద్వారా ఇంతక్రితం ఎన్నడూలేని విధంగా రూ. 1.75 లక్షల కోట్లు సమకూర్చుకున్నాయి. నిజానికి గతేడాది(2024)లోనూ ప్రైమరీ మార్కెట్లు సందడి చేశాయి. రూ. 27,870 కోట్లు సమీకరించిన హ్యుందాయ్ మోటార్ ఇండియా తదితర ఇష్యూలతో 91 కంపెనీలు రూ. 1,59,784 కోట్లు అందుకున్నాయి. ప్రైమ్ డేటాబేస్ వివరాల ప్రకారం ఈ రికార్డును టాటా క్యాపిటల్, హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఎల్జీ ఎల్రక్టానిక్స్, ఐసీఐసీఐ ప్రు ఏఎంసీ తదితరాల లిస్టింగ్తో 2025 అధిగమించింది. అయితే స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ, డిజిటల్ సేవల దిగ్గజం రిలయన్స్ జియోసహా.. ఫ్లిప్కార్ట్, ఫోన్పే, జెప్టో, ఓయో, బోట్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ తదితరాలు ఐపీవోకు క్యూ కట్టడం ద్వారా 2026లోనూ ప్రైమరీ మార్కెట్లు దుమ్మురేపే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 84 కంపెనీలకు సెబీ సై ఈ ఏడాదిలో మార్కెట్ చరిత్రలోనే తొలిసారి సెన్సెక్స్ 86,000, నిఫ్టీ 26,000 పాయింట్ల మైలురాళ్లను అధిగమించాయి. మరోపక్క ఇప్పటివరకూ 103 కంపెనీలు రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించి లిస్ట్కావడం ద్వారా సరికొత్త రికార్డ్ నెలకొల్పాయి. ఈ బాటలో 2026 కొత్త ఇష్యూలతో మరింత కళకళలాడనుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇప్పటికే 84 కంపెనీల ప్రాస్పెక్టస్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సహకరించనుంది. తద్వారా రూ. 1.14 లక్షల కోట్లు సమకూర్చుకునేందుకు తెరలేవనుంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఇంతకుమించి మరో 108 కంపెనీలు సెబీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. తద్వారా రూ. 1.46 లక్షల కోట్ల నిధుల సమీకరణపై కన్నేశాయి. వెరసి 190 కంపెనీలు రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు అందుకోవడం ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు ఎదురుచూస్తున్నాయి. కొన్నేళ్లుగా విదేశీ ఇన్వెస్టర్లకు మించి దేశీ ఇన్వెస్టర్లు స్టాక్స్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తుండటం గమనార్హం! దీనికి కార్పొరేట్ పెట్టుబడులు సైతం జత కలుస్తుండటం విశేషమని విశ్లేషకులు తెలియజేశారు. కంపెనీలు విస్తరణ ప్రణాళికలు లేదా వృద్ధి ఆధారిత పెట్టుబడుల ప్రణాళికలు పక్కనపెట్టినప్పుడు ఆదాయ మార్గంగా మ్యూచువల్ ఫండ్ పథకాలలో అధికంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. వెరసి విదేశీ పెట్టుబడులను దేశీ ఇన్వెస్టర్లు తోసిరాజంటున్నట్లు వివరించారు. పెట్టుబడుల విక్రయంఐపీవో ద్వారా పలు దిగ్గజాలు నిధుల సమీకరణ చేపడుతుండటం పెట్టుబడుల విక్రయానికి దారి చూపుతోంది. తొలి దశ ఇన్వెస్టర్లు లేదా ప్రమోటర్లు కొంత వాటా విక్రయించడం ద్వారా నిధుల సమీకరణతోపాటు పెట్టుబడులపై లాభాలను ఆర్జిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. 2025లో లిస్టయిన దిగ్గజాలను తీసుకుంటే.. ఉమ్మడిగా రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాయి. వీటిలో కొత్తగా ఈక్విటీ జారీని పక్కనపెడితే ప్రమోటర్లు లేదా ముందస్తు ఇన్వెస్టర్లు రూ. 1.1 లక్షల కోట్లను అందుకున్నారు. టాటా క్యాపిటల్ ఐపీవోలో టాటా మోటార్స్(రూ. 15,512 కోట్లు), హెచ్డీబీ ఫైనాన్షియల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్(రూ. 12,500 కోట్లు) భారీగా నిధులు సమకూర్చుకున్నాయి. ఇక ఐసీఐసీఐ ప్రు ఏఎంసీ ద్వారా యూకే భాగస్వామ్య సంస్థ రూ. 10,603 కోట్లు సమకూర్చుకుంది. ఈ బాటలో ఎల్జీ ఎల్రక్టానిక్స్(రూ. 11,607 కోట్లు), కేఎస్హెచ్ ఇంటర్నేషనల్(రూ. 290 కోట్లు)తో పాటు 2024లో స్విగ్గీ(రూ. 6,828 కోట్లు) అందుకోవడం ప్రస్తావించదగ్గ అంశం!--సాక్షి బిజినెస్ డిస్క్ -
మెదడు ఆరోగ్యంలోనూ తేడాలు
మహిళల కంటే వేగంగా పురుషుల మెదళ్లు కుంచించుకుపోతున్నాయి...వయసు పెరిగే కొద్దీ ఈ మార్పు బయటపడుతోంది...ఇది మెదడు ఆరోగ్యంలో తేడాలు, చిత్త వైకల్యం ప్రమాదం గురించి కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది...పురుషుల మెదళ్లు వయసు పెరిగే కొద్దీ మహిళల కంటే వేగంగా కుంచించుకుపోతున్నాయని తాజాగా ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్లో ప్రచురించిన ఈ పరిశోధనలో భాగంగా... పురుషులు– మహిళల మెదడు వయస్సు ఎలా భిన్నంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి వేలాది ఎమ్మారై స్కాన్లను విశ్లేషించారు. కాలక్రమేణా మెదడు నిర్మాణంలో మార్పులను ట్రాక్ చేయడానికి పరిశోధకులు 17 నుంచి 95 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యకరమైన పెద్దల నుంచి 12,000 కంటే ఎక్కువ ఎమ్మారై స్కాన్లను పరిశీలించారు. ముఖ్యాంశాలు... ⇒ పురుషులలో కార్టెక్స్ (మెదడు పైభాగాన పొరగా కప్పబడిన పదార్థం), సబ్కార్టెక్స్ ప్రాంతాలతో సహా అనేక మెదడు ప్రాంతాలలో నిర్మాణాత్మక క్షీణత ఎక్కువగా ఉంది.⇒ మహిళలలో మొత్తం సంకోచం తక్కువగా కనిపించింది. అయినా వృద్ధాప్యంలో ద్రవంతో నిండిన జఠరికల విస్తరణ పెరుగుదల ఉంది.⇒ లింగాల మధ్య మెదడు పరిమాణంలో తేడాలను సర్దుబాటు చేసిన తర్వాత ఈ మార్పులు గమనించారు. ⇒ పురుషుల మెదళ్లు మహిళల కంటే నిర్మాణ స్థాయిలో త్వరగా వృద్ధాప్యం చెందుతాయని నిర్ధారించారు.⇒ ఆయురార్థంలో తేడాలను పరిగణించిన తర్వాత, పురుషులు, స్త్రీల మధ్య అనేక మెదడు–వృద్ధాప్య అసమానతలు తగ్గాయి.⇒ ఇది వృద్ధాప్య స్త్రీ మెదడుపై మరింత సూక్ష్మ పరిశోధన అవసరాన్ని సూచిస్తుంది.ఇది ఎందుకు కీలకం ? మెదడు సంకోచం తరచుగా క్షీణత అని పిలుస్తారు, ఇది వృద్ధాప్యంలో సహజమైన ప్రక్రియే అయినా ఈ సంకోచం యొక్క వేగం, నమూనా విస్తృతంగా మారొచ్చు. ఈ ప్రక్రియలో లింగ వ్యత్యాసాలను అర్థం చేసుకోవడం వల్ల, చిత్తవైకల్యం అల్జీమర్స్ వ్యాధి వంటి కొన్ని వయస్సు సంబంధిత పరిస్థితులు పురుషులు–మహిళలను భిన్నంగా ఎందుకు ప్రభావితం చేస్తాయో శాస్త్రవేత్తలు గుర్తించడంలో ఈ అధ్యయనం సహాయపడుతుంది. ఆసక్తికరంగా, పురుషుల మెదళ్లు వేగంగా కుంచించుకుపోతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, మహిళల్లోనే అధికంగా అల్జీమర్స్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అల్జీమర్స్ కేసులలో దాదాపు మూడింట రెండు వంతుల మంది మహిళలే.పురుషుల మెదడుల్లో నిర్మాణాత్మక వృద్ధాప్యం వేగంగా ఉన్నప్పటికీ, ఈ తేడాలు మహిళలకు అల్జీమర్స్ వచ్చే అవకాశం ఎందుకు ఎక్కువగా ఉందనే దానికి కారణాలు కనుక్కోలేకపోయారు. హార్మోన్లు, జన్యుశాస్త్రం, జీవనశైలి లేదా జీవరసాయన మార్పులు వంటి ఇతర అంశాలు మహిళల చిత్తవైకల్య ప్రమాదంలో పెద్ద పాత్ర పోషిస్తాయని ఈ పరిశోధన సూచిస్తోంది. ‘మహిళల మెదళ్లు మరింత క్షీణించి ఉంటే, అది వారి అధిక అల్జీమర్స్ ప్రాబల్యాన్ని వివరించడానికి సహాయపడి ఉండేది’అని నార్వే ఓస్లో విశ్వవిద్యాలయంలో న్యూరో సైంటిస్ట్, సహ పరిశోధకురాలు అన్నే రావ్డాల్ పేర్కొన్నారు. అయితే మెదడులో వచ్చే మార్పులు, జ్ఞానం, ఆరోగ్యానికి అర్థం ఏమిటో పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని పరిశోధకులు గుర్తించారు.అధ్యయన పరిమితులు...⇒ ఎమ్మారై– ఆధారిత విశ్లేషణ మెదడు వృద్ధాప్య నమూనాలను చూపుతుంది కానీ అంతర్లీన జీవసంబంధమైన కారణాలను వివరించలేదు.⇒ ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై దృష్టి సారించారు. పాల్గొనేవారికి నాడీ సంబంధిత వ్యాధి నిర్ధారణ కాలేదు.⇒ ఈ మార్పులు అల్జీమర్స్ పురోగతికి ఎలా సంబంధం కలిగి ఉన్నాయనే దానిపై అంతర్దృషు్టలను పరిమితం చేస్తాయి.⇒ఈ అధ్యయనం అభిజ్ఞా పనితీరు లేదా జ్ఞాపకశక్తి ఫలితాలను కాకుండా మెదడు వాల్యూమ్ మార్పులను అంచనా వేసింది.⇒ ముఖ్యమైన ప్రమాద కారకాలు కొలవలేదు.. హార్మోన్ల స్థితి, జన్యుపరమైన ప్రమాదం, జీవనశైలి ప్రభావాలను నేరుగా విశ్లేషించలేదు. -
ఆయన నమస్కార్తో ఎవరికీ నోట మాట రాలేదు!
భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడు అటల్ బిహారీ వాజ్పేయి. రాజనీతిజ్ఞుడిగా, రాజకీయాల్లో అజాత శత్రువనే గుర్తింపు దక్కించుకున్న ఆయన.. సాహితి లోకానికి కవిగా, ఆరేళ్లపాటు ప్రధానిగా, బీజేపీకి ముఖ్యనేతగా సేవలందించారు. అయితే చివరిసారిగా ఆయన పబ్లిక్కు కనిపించింది ఎప్పుడో, అదీ ఏ సందర్భంలోనో తెలుసా?..గెలుపు-ఓటమి ఈ రెండింటినీ నవ్వుతూ స్వీకరించే నైజం వాజ్పేయిది. 2004లో దారుణ ఓటమి తర్వాత కూడా.. ఎలా ఓడిపోయారు? అంటే.. ‘ఓడిపోయాం.. అంతే’ అంటూ చిరునవ్వు విసిరారు ఆయన. అందుకే అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయనపై అందరికీ గౌరవం ఉండేది. అయితే ఆయన పాలనను, ఆదర్శాలను పొగిడేటోళ్లే తప్పించి.. వాటిని ఆచరించే నేతలు ఈరోజుల్లో లేరనే అంటారు రాజకీయ విశ్లేషకులు.2004 ఓటమి తర్వాత వాజ్పేయి.. పార్లమెంటరీ పార్టీ చైర్మన్గా, బీజేపీ కీలక సమావేశాల్లో మాత్రమే పాల్గొంటూ వచ్చారు. అయితే 2005 డిసెంబర్లో పుట్టినరోజు దగ్గరపడుతుండగా.. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించి, అభిమానులకు, కార్యకర్తలకు పెద్ద షాక్ ఇచ్చారు ఆయన. ఇక ఎన్నికల బరిలోకి దిగనప్పటికీ.. పార్టీకి తన సేవలు అవసరమైనప్పుడు అందిస్తానని పార్టీ సారధ్య బాధత్యల నుంచి తప్పుకున్నాడాయన. ఆపై అనారోగ్యంతో ఆయన వీల్చైర్కే పరిమితం అయ్యారు.ఫిబ్రవరి 11, 2007.. పంజాబ్లో జరిగిన ఓ బహిరంగ సమావేశం. బీజేపీ టికెట్తో అమృత్సర్ నుంచి లోక్ సభ స్థాన ఉప ఎన్నిక కోసం నవజోత్ సింగ్ సిద్దూ పోటీకి దిగాడు. ఆ ప్రచార సభకు ప్రధాన ఆకర్షణ ఎవరో కాదు.. మాజీ ప్రధాని వాజ్పేయి. చాలా గ్యాప్ తర్వాత ఆయన ఓ బహిరంగ సభకు వస్తుండడంతో వేలమంది ఆ సభకు హాజరయ్యారు. టెంట్ల కింద జనం కిక్కిరిసి పోవడంతో.. బయట ఉండేందుకు వీలుగా సుమారు 10 వేల మందికి గొడుగుల్ని అందజేసింది బీజేపీ కమిటీ. కుర్చీలోనే కవితతో మొదలుపెట్టిన ఆయన ఉపన్యాసాన్ని .. ఎలాంటి కోలాహలం లేకుండా ఆసక్తిగా తిలకించారు ఆ జనం. ఆ రాజకీయ ఉద్దండుడి చివరి సభ అదేనని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.చలించిన పోయిన మీడియా ప్రతినిధులుఎంతటి విపత్కర పరిస్థితినైనా జర్నలిజం క్యాష్ చేసుకుంటుందనే ఒక అపవాదు ఉంది. అందుకు తగట్లు కొందరు జర్నలిస్టులు ప్రవర్తించడమే అందుకు కారణం. సాధారణంగా.. నేతలను ఎన్నిరకాలుగా వీలైతే అన్నిరకాలుగా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయడం.. ఇరకాటంలో పడేయడం జాతీయ మీడియా చానెల్స్ జర్నలిస్టులకు వెన్నతో పెట్టిన విద్యం. కానీ, వాజ్పేయి విషయంలో మాత్రం వాళ్లు అలా చేయలేకపోయారు.2007, డిసెంబర్ 25న పుట్టినరోజు సందర్భంగా కొందరు జర్నలిస్టులు వాజ్పేయిను కలవాలనుకున్నారు. ‘2009లో మరోసారి రాజకీయ పోరాటానికి ఆయన సిద్ధమేనా? ప్రచారంలో అయినా పాల్గొంటారా? లేదంటే ఆరోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉంటారా? అద్వానీకి పగ్గాలు అప్పజెప్తారా? ఇలాంటి ప్రశ్నలతో ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలనే ఉద్దేశంతో ఓ జర్నలిస్ట్ బృందం అపాయింట్మెంట్ కోసం ఎదురుచూశారు.వాళ్ల అజెండాపై స్పష్టత లేని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ దగ్గరుండి 10 మంది జర్నలిస్టులను విజయ్ మీనన్ మార్గ్లో ఉన్న వాజ్పేయి ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆయన అనారోగ్యంతో ఉన్నారు. అయినప్పటికీ కొద్దినిమిషాల మీటింగ్ అరేంజ్ చేయించాడు హుస్సేన్. లోపలికి వెళ్లిన జర్నలిస్టులు.. వాజ్పేయి చూడగానే ఆశ్చర్యపోయారు.ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే వాజ్పేయి.. కుర్చీలో కూర్చుకుని పాలిపోయిన ముఖంతో కదల్లేని స్థితిలో కనిపించేసరికి షాక్ తిన్నారంతా. చుట్టూ చేరి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బదులుగా ‘నమస్కార్’ అనే మాట మాత్రమే వచ్చింది ఆయన నోటి నుంచి. అంతే.. వాజ్పేయి పరిస్థితి అర్థం చేసుకుని అంతా బయటకు వచ్చేశారు.ఇంటికెళ్లి మరీ..2009లో ఛాతీ ఇన్ఫెక్షన్తో ఎయిమ్స్లో చేరిన వాజ్పేయి..కాస్త కొలుకున్నాక ఇంటికే పరిమితం అయ్యారు. అనారోగ్యంతో 2009 ఎన్నికల క్యాంపెయిన్కు హాజరు కాలేదు. కానీ, ఆయన పేరు మీద లేఖలు మాత్రం విడుదల చేసింది బీజేపీ. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం అస్సలు సహకరించకపోవడంతో.. కీలక నేతలే అప్పుడప్పుడు ఒక్కొక్కరుగా ఆయన్ని ఇంటికి వెళ్లి ప్రైవేట్గా కలుస్తూ వచ్చారు.వాజ్పేయికి కేంద్రం 2015లో భారతరత్న ప్రకటించింది. మార్చిన ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా వాజ్పేయి ఇంటికి వెళ్లి మరీ భారత రత్న అందుకున్నారు. సాధారణంగా పురస్కారాలను రాష్ట్రపతి భవన్లోనే అందుకోవాలి. కానీ, వాజ్పేయి ఆరోగ్య దృష్ట్యా, ప్రైవసీని కాపాడాలన్న ఉద్దేశంతో.. స్వయంగా రాష్ట్రపతే వెళ్లి అందించారు. చివరి రోజుల్లో.. ఆ రాజకీయ ఉద్దండుడు మతిమరుపు, కిడ్నీ సమస్యలు.. డయాబెటిస్, కదల్లేని స్థితిలో కనిపించిన ఫొటోలు చాలామందిని కదిలించివేశాయి. అందుకే.. 2018 ఆగస్టు 16వ తేదీన మరణించేంతవరకు ఆయన్ని మీడియా కంటపడకుండా జాగ్రత్తగా చూసుకున్నారు.ఇవాళ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి -
2025 వెడ్డింగ్స్.. రాయల్గా పెళ్లి..రీల్స్ మళ్లీ మళ్లీ!
బంగారం ధర కొండెక్కి కూర్చుంది.. వెండి వెల వెలుగులు జిమ్ముతోంది.. అయితే ఏంటట..? పెళ్లి మాత్రం ‘రాయల్’గా జరగాల్సిందే.. 2025 వెడ్డింగ్ సీజన్ కేవలం మూడు ముళ్ల ముచ్చట కాదు.. ఇప్పుడు అదొక భారీ ‘ఇన్స్ట్రాగామ్ ఈవెంట్’. స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వంటి ప్రముఖుల పెళ్లిళ్లు ఆగిపోయి వార్తల్లో నిలిచినా.. అదర్ జైన్, అర్మాన్ మాలిక్ వంటి స్టార్ల పెళ్లి సందడి ట్రెండ్ సెట్ చేసింది. కేవలం కోటీశ్వరులే కాదు, మధ్యతరగతి జంటలు కూడా ’లగ్జరీ’ బాట పట్టడంతో వెడ్డింగ్ మార్కెట్ కళకళలాడుతోంది. ఇప్పుడు పెళ్లి అంటే కేవలం అక్షింతలు వేయించుకోవడం కాదు.. ఇన్స్టాలో ట్రెండ్ కావడం.. డెస్టినేషన్ వెడ్డింగ్లో మెరిసిపోవడం.. ఖర్చు భారమైనా, అప్పులైనా.. పెళ్లి వేడుక మాత్రం ‘బ్లాక్ బస్టర్’ సినిమా రేంజ్లో ఉండాల్సిందేనని కుర్రకారు ఫిక్సయిపోయింది. → ఖర్చులో తగ్గేదే లే! ‘వెడ్మిగుడ్’ సంస్థ నివేదిక ప్రకారం.. 2025లో పెళ్లిళ్ల ఖర్చు సగటున 8 శాతం పెరిగింది. ఒక్కో పెళ్లి బడ్జెట్ సగటున రూ.39.5 లక్షలకు చేరింది. ఇక 2026లో ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. → డెస్టినేషన్ వెడ్డింగ్కే ఓటు ఇప్పుడు ప్రతి నలుగురిలో ఒకరు సొంతూరు వదిలి గోవా, జైపూర్ లేదా రిషికేష్ లాంటి ప్రాంతాల్లో ‘డెస్టినేషన్ వెడ్డింగ్’ సెలబ్రేట్ చేసుకున్నారు. రూ.కోటి మించిన బడ్జెట్ ఉన్న పెళ్లిళ్లలో 60 శాతం డెస్టినేషన్ వెడ్డింగ్స్వే. సగటున ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం రూ.58 లక్షలు ఖర్చు చేస్తున్నారు. బాలి, వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాలు ఇప్పుడు ఇండియన్ జంటలకు ఫేవరెట్ వెడ్డింగ్ స్పాట్లుగా మారిపోయాయి. → రీల్స్ కోసమే అసలు గోల.. గతంలో లాగా పాత ఫొటోలు, గంటల కొద్దీ వీడియోలు ఇప్పుడు ఎవరికీ అక్కర్లేదు. పెళ్లి పూర్తవగానే నిమిషాల్లో ఇన్స్టాలో పోస్ట్ చేయడానికి వీలుగా ’క్విక్ అండ్ క్వాలిటీ’ కంటెంట్ కావాలి. అందుకే ఫొటోగ్రఫీ శైలి కూడా మారింది. క్యాండిడ్ షాట్స్, డాక్యుమెంటరీ స్టైల్ వీడియోల కోసం జంటలు ఎగబడుతున్నాయి. ఫొటోగ్రఫీ మార్కెట్లో అసైన్మెంట్లు కొంచెం తగ్గినా, డిమాండ్ మాత్రం పీక్స్లో ఉంది. → పాత బంగారానికే జై! 2025లో బంగారం ధర ఏకంగా 74 శాతం పెరిగి పెళ్లి కొడుకులు, పెళ్లి కూతుళ్ల తండ్రులకు చుక్కలు చూపించింది. వెండి ధర అయితే ఏకంగా 137 శాతం ఎగబాకింది. దీంతో చాలామంది కొత్త నగలు కొనేకంటే, ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని కరిగించి కొత్త డిజైన్లు చేయించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ రీసైక్లింగ్ ట్రెండ్ గతంతో పోలిస్తే 25 శాతానికి పైగా పెరిగింది. → హోటళ్లకు కాసుల వర్షం హోటల్ రంగం కూడా ఈ వెడ్డింగ్ సీజన్లో భారీగా లాభపడుతోంది. మునుపటిలా ఒక రోజులో పెళ్లి ముగించకుండా, 2–3 రోజుల పాటు ఈవెంట్లను హోటల్స్లోనే ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సాగే ఈ ‘పెళ్లిళ్ల సీజన్’.. హోటళ్ల వ్యాపారంలో దాదాపు 12 శాతం వృద్ధిని నమోదు చేసింది. → 2026పై గురి.. ముందుముందు పెళ్లిళ్లలో ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరగనుంది. ప్రణాళికల నుంచి చెల్లింపుల వరకు అంతా డిజిటల్ మయం కాబోతోంది. మొత్తానికి ధరల భారమున్నా.. భారతీయ పెళ్లిళ్ల గ్లామర్ మాత్రం తగ్గట్లేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ముంచనున్న మంచు!
ఫక్తు ఎడారి దేశమైన సౌదీ అరేబియాలో మంచు తుఫాన్. ఎవరూ ఊహించని ఈ పరిణామం ఇప్పుడు గుబులు రేపుతోంది. అంతర్జాతీయంగా పర్యావరణవేత్తల్లో ఇది పెద్ద చర్చకే దారితీసింది. భూ వాతావరణ వ్యవస్థలోనే అవాంఛనీయమైన మౌలిక మార్పులు భారీ స్థాయిలో చోటు చేసుకుంటున్నాయని చెప్పేందుకు ఇది ప్రబల సాక్ష్యమని వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దీని నుంచి ముఖ్యంగా భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు... సౌదీ అరేబియాలోని ఉత్తరాది ప్రాంతాలు తాజాగా మంచులో తడిసి ముద్దయిపోయాయి. ముఖ్యంగా టాబుక్, దాని సమీప పర్వత ప్రాంతా లు పూర్తిగా మంచు దుప్పటి కప్పుకున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. ప్రపంచమంతటికీ ఆశ్చర్యం కలిగించేలా అచ్చం శీతల దేశాల్లో మాదిరి పరిస్థితులు నెలకొన్నాయి. మంచుమయంగా మారిన సౌదీ ఎడారుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారా యి. పర్యావరణ మార్పులు ఇంకెంతమాత్రమూ సుదూర, లేదా కాల్పనిక ముప్పు కాదని, అన్ని దేశాలనూ తీవ్రంగా పట్టి పీడించబోతున్న పెను సమస్య అనీ ఈ పరిణామం స్పష్టంగా చాటింది. విపరీత పరిస్థితులు వాతావరణ మార్పులు అనగానే కేవలం ఎండ ప్రచండంగా మండిపోయే రోజుల సంఖ్య పెరుగుతుందని చాలామంది భావిస్తారు. వాస్తవానికి చాలాసార్లు అందుకు విరుద్ధంగా జరుగుతుందని సైంటిస్టుల మాట. భూమి వేడెక్కిన కొద్దీ వాతావరణం మరింత తేమను, శక్తిని సంగ్రహిస్తుంది. వాటి దెబ్బకు చిరకాలం స్థిరంగా కొనసాగుతూ వస్తున్న వాతావరణ ధోరణులు కాస్తా గాడి తప్పుతాయి. ఫలితంగా ఇలా అప్పుడే ప్రచండంగా ఎండ, కొద్దికాలానికే విపరీతమైన కుండపోత వానలు, ఆ వెంటనే వణికించే చలి, ఊహించని ప్రాంతాల్లో హిమపాతం... భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా కొన్నేళ్లుగా ఈ ధోరణులు పెరిగిపోతున్నాయి. మనకు వారి్నంగ్ బెల్స్ సౌదీ మంచు తుఫాన్ ఉదంతం నుంచి భారత్ తక్షణం నేర్వాల్సిన పాఠాలు ఉన్నాయి. ఎందుకంటే పర్యావరణ మార్పుల తాలూకు దు్రష్పభావం కొన్నేళ్లు మన దేశంపై తీవ్రంగానే ప్రభావం చూపు తూ వస్తోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా కనిపించిన విపరీత వాతావరణ ధోరణులే ఇందుకు రుజువు. తొలుత ఉత్తర, మధ్య భారతంలో రికార్డు స్థాయి ఎండలు కాచాయి. ఆ వెంటనే ఉత్తరాఖండ్ మొద లుకుని హిమాచల్ ప్రదేశ్, సిక్కిం దాకా క్లౌడ్ బరస్ట్ విలయమే సృష్టించింది. చాలా రాష్ట్రాల్లో వర్షాకా లం ఆలస్యంగా వస్తే కొన్నింటిలో విపరీతమైన వరదలు అపార నష్టం కలుగజేశాయి. ఇవేవీ యా దృచ్చిక ఘటనలు కాదు. వాతావరణ వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉండనేందుకు స్పష్టమైన సంకేతాలు. తక్షణం మేల్కొనాలి ప్రభుత్వాలు ఇప్పటికీ మేల్కొనకపోతే భారత్లో పర్యావరణ వ్యవస్థే పూర్తిగా కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే సాగు సీజన్లు, నీటి యాజమాన్యం, పట్టణ ప్రణాళికలు మొదలుకుని విద్యుత్ డిమాండ్ దాకా అన్నింటికీ సజావైన వాతావరణ వ్యవస్థే మూలం. అదే దెబ్బ తింటే పంటల వైఫల్యం మొదలుకుని అన్నీ వినాశకర పరిణామాలే తలెత్తుతాయి. దేశవ్యాప్తంగా కాలుష్యాన్ని కట్టడి చేసే చర్యలను చిత్తశుద్ధితో అమలు చేయడం అత్యవసరం. అలాగే వాతావరణానికి తగ్గట్టుగా సాగు పద్ధతులు, ధోరణులను కూడా మార్చుకుంటూ పోవడం ప్రస్తుత అవసరం. లేదంటే పరిస్థితి చూస్తుండగానే చేయి దాటిపోతుంది. అప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ25 దిశగా భారత్!
సాక్షి, స్పెషల్ డెస్క్: పెట్రోల్లో ఇథనాల్ వాటా మన దేశంలో అక్టోబర్ నాటికి 19.97% వచ్చి చేరింది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (ఈబీపీ) కార్యక్రమం గడువు కంటే ముందుగా భారత్ లో సక్సెస్ అయింది. ఈ ఊపుతో కేంద్ర పెట్రో లియం మంత్రిత్వ శాఖ తదుపరి కార్యాచరణ సిద్ధం చేస్తోందని సమాచారం. ఈ25 లక్ష్యానికి కొన్ని నెలల్లోనే శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా దశలవారీగా ఈ27, ఈ30 కార్యక్రమం సైతం పూర్తవుతుందని ధీమాగా ఉంది.ఈబీపీ కార్యక్రమంలో భాగంగా 2030 నాటికి ఈ20 (పెట్రోల్లో ఇథనాల్ వాటా 20%) సాధించాలని ప్రభుత్వం గతంలో లక్ష్యం విధించుకుంది. కానీ గడువు కంటే వేగంగా.. అది కూడా పదేళ్లు ముందుగానే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి జోష్ తెచ్చింది. తదుపరి ఈ25 (పెట్రోల్లో ఇథనాల్ వాటా 25%) నిబంధన అమలు దిశగా పావులు కదుపుతున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశ ఇథనాల్ ప్రయాణం ఆపలేనిదని కొన్ని రోజుల క్రితం పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ వ్యాఖ్యానించారు. ఇథనాల్కు హామీ ధర నిర్ణయించడం, తయారీకి బహుళ ముడిపదార్థాలను అనుమతించడం, దేశవ్యాప్తంగా డిస్టిలేషన్ సామర్థ్యం పెంచడం వంటి స్థిరమైన విధాన సంస్కరణల ద్వారా ఈ విజయం సాధ్యమైందని ప్రభుత్వం చెబుతోంది. బీఐఎస్ ప్రమాణాలు, ఆర్థిక ప్రోత్సాహకాల మద్దతుతో దశలవారీగా ఈ25, ఈ27, ఈ30 వైపు భారత్ మళ్లుతుందని స్పష్టం చేస్తోంది.ఏడేళ్లలో రూ.1.5 లక్షల కోట్లువాస్తవానికి 2022 నవంబర్ నాటికి పెట్రోల్లో ఇథనాల్ వాటా 10.02% మాత్రమే. మూడేళ్లలోనే ఈ వాటా రెండింతలు అయిందంటే ప్రభుత్వం, ఆయిల్ కంపెనీల దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్లో ఇథనాల్ వాటా 2014లో కేవలం 1.53% మాత్రమే. ఈబీపీ కారణంగా భారత్కు ముడి చమురు దిగుమతి ఖర్చులు భారీగా తగ్గుతున్నాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెద్ద ఎత్తున అదా అవుతుండడంతోపాటు స్థిరమైన ఇంధన వినియోగం దిశగా ఈ కార్యక్రమం ఒక పెద్ద ముందడుగు అని ప్రభుత్వం భావిస్తోంది. ఈ జీవ ఇంధనం వాడటంతో ఏడేళ్లలో రూ.1.5 లక్షల కోట్లకుపైగా ఆదా కావడం విశేషం. ఈ20 సాధించేందుకు బ్రెజిల్కు 20 ఏళ్లు పట్టిందని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల టెండర్ల ప్రకారం 2025–26 ఇథనాల్ సరఫరా సంవత్సరానికిగాను మన దేశంలో డిమాండ్ను మించి ఇథనాల్ సప్లై ఉంది. మొత్తం డిమాండ్: 1,350 కోట్ల లీటర్లు (ఈబీపీ కోసం 1,050 కోట్ల లీటర్లతో సహా).సరఫరా: 1,775 కోట్ల లీటర్లు.ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం: 1,900 కోట్ల లీటర్లు. -
ఐఫోన్, నిమ్మ సోడా!
దుకాణానికి వెళ్లి నేరుగా సరుకులు కొనుక్కోవడం లేదా ఈ–కామర్స్ సైట్లలో ఆర్డర్ పెట్టే పద్ధతి పెద్ద నగరాల్లో క్రమంగా గతంగా మారుతోంది! కాలంతో పోటీపడుతూ క్విక్ కామర్స్ సంస్థలు చిటికెలో ఆర్డర్లు డెలివరీ చేస్తున్న ఇన్స్టంట్ విధానానికే ఇప్పుడందరూ జై కొడుతున్నారు. అది ఎంతగా అంటే రూ. 1.7 లక్షల విలువైన ఐఫోన్ను కూడా ఇన్స్టంట్గా పొందే అంత! అదొక్కటే ఆర్డర్ పెడితే మజా ఏం ఉంటుందనుకున్నాడో ఏమో కానీ.. బెంగళూరుకు చెందిన ఓ వినియోగదారుడు ఐఫోన్తోపాటు ఒక నిమ్మ సోడా కూడా జోడించారని క్విక్ కామర్స్ కంపెనీ ఇన్స్టామార్ట్ వార్షిక నివేదిక చెబుతోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్10 నిమిషాల్లో డెలివరీ హామీతో.. బెంగళూరు వినియోగదారుడు రూ. 10 ఖరీదు చేసే ప్రింట్ అవుట్ మొదలు.. మూడు ఐఫోన్ల కోసం ఓ హైదరాబాదీ పెట్టిన రూ. 4.3 లక్షల విలువైన సింగిల్ ఆర్డర్ వరకు దేశంలో క్విక్ కామర్స్ పోకడలపై హౌ ఇండియా ఇన్స్టామార్టెడ్ 2025 పేరుతో స్విగ్గీకి చెందిన ఇన్స్టామార్ట్ ఒక నివేదికను విడుదల చేసింది. అందులో ఎన్నో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ‘10 నిమిషాల’డెలివరీ హామీతో క్విక్ కామర్స్ కంపెనీలు భారత రిటైల్రంగ రూపురేఖలను మారుస్తున్న తీరుకు ఈ నివేదికే నిదర్శనంగా నిలుస్తోంది. కరివేపాకూ ఉండాల్సిందే.. ఇన్స్టామార్ట్ వేదికగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా కస్టమర్లు సెకనుకు 4 ప్యాకెట్ల పాలు కొనుగోలు చేశారు. దేశంలోని 10కిగాను 9 ప్రధాన నగరాల్లో రాత్రివేళ ఆర్డర్స్లో మసాలా ఆలు చిప్స్ టాప్లో నిలిచాయి. కొచి్చకి చెందిన ఓ వినియోగదారుడు ఏడాదిలో ఏకంగా 368 సార్లు కరివేపాకును ఆర్డర్ పెట్టాడు. మరోవైపు లక్నోకు చెందిన ఓ కస్టమర్కు కేవలం 2 నిమిషాల్లోనే మ్యాగీ మేజిక్ మసాలా నూడుల్స్ను డెలివరీ ఎగ్జిక్యూటివ్ చేర్చాడు. ఉదయం 7 నుంచి 11 గంటల మధ్య, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల మధ్యే ఎక్కువగా ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ఖరీదైనా సరే..ఏడాది మొత్తంలో ఓ కస్టమర్ ఏకంగా రూ. 22 లక్షలు వెచ్చించారంటే క్విక్ కామర్స్ ఏ స్థాయిలో ప్రాచుర్యం పొందిందో అర్థం చేసుకోవచ్చు. ఐఫోన్–17 మోడల్లో 22 ఫోన్లు, 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్స్, ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్.. ఇలా ఒకటేమిటి పాలు, గుడ్లు, ఐస్క్రీమ్, పండ్లను సైతం ఆ వినియోగదారుడు చేసిన ఆర్డర్లలో ఉన్నాయి. అలాగే నోయిడావాసి సింగిల్ ఆర్డర్లో ఏకంగా రూ. 2.69 లక్షలతో బ్లూటూత్ స్పీకర్స్, ఎస్ఎస్డీలు ఆర్డర్ పెట్టాడు. దీపావళి రోజున ఓ బెంగళూరు కస్టమర్ రూ. 1.97 లక్షలు వెచ్చించి ఒక కిలో వెండి కొన్నాడు. ఇక చెన్నైకి చెందిన ఓ వినియోగదారుడు ఏడాదిలో కాండోమ్స్ కోసం 228 ఆర్డర్లు పెట్టి రూ. 1,06,398 ఖర్చు చేశారు. స్విగ్గీ వేదికగా ఇలా... ⇒ ఈ ఏడాది కస్టమర్లు 9.3 కోట్ల బిర్యానీలు ఆర్డర్ చేశారు. అంటే నిమిషానికి 194 అన్నమాట. వాటిలో 5.77 కోట్ల చికెన్ బిర్యానీలు ఉన్నాయి. ⇒ వినియోగదారులు మొత్తం 4.42 కోట్ల బర్గర్స్, 4 కోట్ల పిజ్జాలు, 2.62 కోట్ల దోశలు ఆరగించారు. ⇒ మధ్యాహ్నం 3–7 గంటల మధ్య 34.2 లక్షల సమోసాలు, 29 లక్షల అల్లం చాయ్లను ఆస్వాదించారు. ⇒ 69 లక్షల వైట్ చాక్లెట్ కేక్స్, 54 లక్షల చాక్లెట్ కేక్స్, 45 లక్షల గులాబ్ జామూన్స్ ఆర్డర్లున్నాయి. ⇒ కస్టమర్లు ఏకంగా 1.1 కోట్ల ఇడ్లీలు, 1.6 కోట్ల మెక్సికన్, 1.2 కోట్ల టిబెటన్, 47 లక్షల ఆర్డర్లతో కొరియన్ ఫుడ్ రుచి చూశారు. ⇒ రూ. 47,106తో 65 బాక్సుల డ్రై ఫ్రూట్ కుకీస్ గిఫ్ట్ ప్యాక్లను ఓ హైదరాబాదీ స్వీకరించాడు. ⇒ ఓ ముంబైకర్ ఏడాది పొడవునా 3,196 ఆర్డర్లతో టాప్లో నిలిచాడు. ⇒ ఆర్డర్ల సంఖ్యలో బెంగళూరు, హైదరాబాద్, ముంబై టాప్–3లో ఉన్నాయి. ⇒స్విగ్గీ డెలివరీ పార్ట్నర్స్ 2,400 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి కస్టమర్లకు ఉత్పత్తులను చేరవేశారు. ⇒ బెంగళూరుకు చెందిన మొహమ్మద్ రాజిక్ అనే డెలివరీ పార్ట్నర్ 11,718 డెలివరీలతో టాప్లో నిలిచాడు. ఇన్స్టామార్ట్ కస్టమర్ల రేంజ్ ఇదీ..⇒ రెడ్బుల్ షుగర్ ఫ్రీ డ్రింక్స్ కోసం ముంబై కస్టమర్ ఏకంగా రూ. 16.3 లక్షలు ధారపోశాడు. ⇒ ముంబైకి చెందిన ఓ వ్యక్తి రూ. 15.16 లక్షల విలువ చేసే పుత్తడి కొన్నాడు. ⇒ బెంగళూరు వినియోగదారుడు ఏడాదిలో రూ. 4.36 లక్షల విలువైన నూడుల్స్ కొనుగోలు చేశాడు. ⇒ నోయిడా కస్టమర్ రూ. 2.8 లక్షలతో 1,343 ప్రొటీన్ ఉత్పత్తులు ఆర్డర్ చేశాడు. ⇒ చెన్నై కస్టమర్ పెట్ ఫుడ్ కోసం రూ. 2.41 లక్షలు ఖర్చుపెట్టాడు. ⇒ గులాబీలకు రూ. 31,240 వెచ్చించి హైదరాబాదీ తన ప్రేమను చాటుకున్నాడు. ⇒ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్కు టిప్స్ రూపంలో బెంగళూరు కస్టమర్ రూ. 68,600, చెన్నైవాసి రూ. 59,505 అందించారు. ⇒ వాలెంటైన్స్ డే రోజున గులాబీల కోసం సగటున నిమిషానికి 666 ఆర్డర్లు వెల్లువెత్తాయి. -
తేజస్.. మరింత సేఫ్
దేశీయతయారీ తేలికపాటి యుద్ధవిమానం తేజస్ భద్రతను మరింత పెంచే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. అత్యాధునిక హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ను తేజస్ వెనుకభాగంతో అనుసంధానించింది. అత్యవసర సందర్భాల్లో అత్యంత వేగంగా యుద్ధవిమానవాహక నౌక లేదా రన్వేపై దిగాల్సిన సందర్భాల్లో ఎలాంటి ప్రమాదం జరక్కుండా పైలట్కు, విమానానికి సాయపడేలా హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ను డిజైన్చేశారు. పూర్తి దేశీయంగా గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ అధునాతన పారాచూట్కు తుదిరూపునిచ్చింది.తేజస్ వంటి యుద్ధవిమానాల రక్షణను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని దీనిని తయారుచేశారు. ఈ పారాచూట్ బరువు సైతం చాలా తక్కువ. దీంతో పేలోడ్(మందుగుండు)ను మోసుకెళ్లే తేజస్కు కొత్తగా అదనపు బరువు లాంటి సమస్యలేవీ ఉండబోవు. దీంతో అత్యంత వేగంగా గాల్లో దూసుకెళ్లేటప్పుడు భార సంబంధ ఇబ్బందులు తలెత్తబోవు. దీంతో అత్యవసర సందర్భాల్లో అత్యల్ప పొడవైన రన్వేలపై ల్యాండ్ అయ్యాక తక్కువ దూరంలో ఆగిపోయేలా ఈ పారాచూట్ ఎంతగానో సాయపడుతుంది. ఎలా ఉపయోగకరం? సాధారణ పౌరవిమానాలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ల్యాండ్ అయినప్పుడు రన్వేకు ఆ కొన వద్ద ల్యాండ్ అయి రెండు, మూడు కిలోమీటర్ల దూరం దాకా రన్వేపై పరుగులు తీస్తాయి. అత్యవసర సందర్భాల్లో తేజస్ వంటి యుద్ధవిమానాలకు అంత పొడవాటి రన్వే ఉండే విమానాశ్రయాలు అందుబాటులో ఉండవు. తక్కువ పొడవున్న రన్వేలపై ల్యాండ్ అయ్యాక వేగంతో అలాగే ముందుకు దూసుకెళ్లకుండా ఈ హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ నిలువరిస్తుంది. దీంతో బ్రేకింగ్ వ్యవస్థలపై పనిభారం భారీగా తగ్గుతుంది. వెడల్పాటి ప్లస్ గుర్తు ఆకృతిలో ఉండే భారీ వస్త్రపు చివరలను కలుపుతూ గొడుగు ఆకృతిలో దీనిని తయారుచేస్తారు.ల్యాండింగ్ పూర్తయ్యాక రన్వే మీద విమానం అటూఇటూ ఊగకుండా స్థిరంగా ముందుకు కదిలేలా ఈ పారాచూట్ సాయపడుతుంది. రన్వే మీద విమానం ముందుకు దూసుకెళ్లేటప్పుడు ఎదురుగా వచ్చే అత్యధిక గాలి, ఒత్తిడిని తట్టుకుని ఇది విమానాన్ని వేగంగా ఆపేయగలదు. పారాచూట్ వెడల్పు కేవలం 5.75 మీటర్లు. విస్తీర్ణం 17 చదరపు మీటర్లు. దీని బరువు కేవలం 10 కేజీలు. యుద్ధవిమానం గంటకు 285 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ హఠాత్తుగా రన్వేపై ల్యాండ్ అయినా కూడా సమయానుగుణంగా విచ్చుకుని త్వరగా విమానం రన్వే మీద ఆగేలా చేస్తుంది. హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ అంటే?సాధారణ సందర్భాలతోపాటు అత్యవసర సమయాల్లోనూ విమానాన్ని నిర్దేశిత దూరం తర్వాత రన్వే మీద ఆపగలిగే సామర్థ్యమున్న పారాచూట్ను హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్గా పిలుస్తారు. తెగిపోని, అత్యంత కఠినమైన నైలాన్, కెవ్లార్ వంటి కృత్రిమ రసాయన దారాలతో ఈ పారాచూట్ను తయారుచేస్తారు. విమానం రకం, బరువు, ల్యాండింగ్ గరిష్ట వేగాలకు తగ్గ బరువు, సైజు, డిజైన్తో పారాచూట్ను తయారుచేస్తారు. -
కృత్రిమ గర్భాశయం!
నెలలు నిండకుండానే జననం. నవజాత శిశు మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటి. ఈ సమస్యకు సైంటిస్టులు తాజా వినూత్న పరిష్కారం కనిపెట్టారు. అదే... కృత్రిమ గర్భాశయం! 37 వారాలు నిండకముందే పుడితే నెల తక్కువ శిశువు అంటారు. అదే 23 నుంచి 27వ వారం మధ్యలోనే, అంటే ఆరు లేదా ఏడు నెలలకే కాన్పు జరిగితే అలాంటి శిశువు బతకడం చాలాసార్లు కష్టమవుతుంది. అంత లేత ఊపిరితిత్తులు బయటి ప్రపంచపు పరిస్థితులను తట్టుకునేందుకు అనువుగా ఉండవు. మిగతా కీలక శరీరాంగాలదీ అదే పరిస్థితి. ఆస్పత్రుల్లో ఇంక్యూబేటర్లలో ఉంచినా, ఎంత వైద్య చికిత్స అందించినా చాలాసార్లు లాభముండదు. అలాంటి శిశువుల్లో ఎక్కువమంది మృత్యువాత పడుతుంటారు. సైంటిస్టులు రూపొందించిన కృత్రిమ గర్భాశయం ఇందుకు పరిష్కారంగా కనిపిస్తోంది. ఇందులో ఉమ్మ నీటితో సహా అన్నీ అచ్చం అమ్మ గర్భంలో లాంటి పరిస్థితులే ఉండటం విశేషం! సంక్లిష్టమే కృత్రిమ గర్భాశయం ఆలోచన వినేందుకు సింపుల్ గానే ఉన్నా దాని రూపకల్పన మాత్రం చాలా సంక్లిష్టం. అది పరిమాణంలో దాదాపు ఇళ్లలో పెట్టుకునే సాధారణ అక్వేరియాల మాదిరిగా ఉంటుంది. సిజేరియన్ ద్వారా పుట్టిన నెలలు నిండని శిశువును వెంటనే ఉమ్మనీటితో నిండిన సంచీలో పెడతారు. అక్కడ శిశువుకు వెచ్చదనంతో పాటు తల్లి గర్భంలోని అన్ని పరిస్థితులూ అమరుతాయి. మరి పుట్టిన క్షణం నుంచీ అతి కీలకంగా మారే శ్వాసక్రియ పరిస్థితి ఏమిటంటారా? దానికీ మార్గం కనిపెట్టారు. బొడ్డుతాడుకు అనుసంధానించి సింథటిక్ ఉమ్మసంచీ ద్వారా శిశువుకు నిరంతరం ఆక్సిజన్ అందుతూ ఉంటుంది.ఈ కృత్రిమ గర్భాశయంలో అవసరాన్ని బట్టి కొద్ది రోజులు, వారాల నుంచి నెల, ఆపైన కూడా ఉంచే వెసులుబాటు ఉందంటున్నారు దీన్ని రూపొందించిన సైంటిస్టులు. అయితే ఈ కృత్రిమ గర్భాశయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి ఒకటి రెండేళ్ల కన్నా ఎక్కువే పట్టవచ్చట. కానీ ఈ పద్ధతిపై ఇప్పటికే నైతిక తదితర సందేహాలు తలెత్తుతుండటం విశేషం! అవన్నీ తీరి, నెలలు నిండకుండా పుట్టే ప్రతి పాపాయీ బతికి బట్ట కట్టే రోజు వస్తే బాగుంటుంది కదా అన్నది సైంటిస్టుల మాట. –సాక్షి, నేషనల్ డెస్క్ -
కొండలపై కత్తి!
ఒకసారి కాలంలో ఓ 300 కోట్ల ఏళ్లు వెనక్కి వెళ్లి, అంతరిక్షం నుంచి ప్రస్తుత భారతదేశాన్ని ఒక్కసారి చూస్తే? ఉత్తర ప్రాంతంలో కన్పించే ఏకైక భౌగోళిక స్వరూపం ఏమిటో తెలుసా? ఆరావళీ పర్వత శ్రేణులు! భూమిపై అత్యంత పురాతన పర్వతాల్లో ఒకటిగా అది గుర్తింపు పొందింది. కానీ, వందలాది కోట్ల ఏళ్లుగా అతి కఠినమైన కాలపరీక్షకు తట్టుకుని మరీ ఉనికిని కాపాడుకుని నిలిచిన ఆరావళీ శ్రేణులు మనిషి పేరాశ పాలిట పడి త్వరలోనే ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. వాటి పరిరక్షణకు తాము చిరకాలంగా చేస్తున్న ప్రయత్నాలకు సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పు గొడ్డలిపెట్టుగా మారిందని పర్యావరణవేత్తలు వాపోతున్నారు. ‘‘ఫలితంగా పంజాబ్, హరియాణా మొదలుకుని దేశ రాజధాని ఢిల్లీ దాకా ఆరావళి శ్రేణులు చూస్తుండగానే గనులుగా, రియల్ వెంచర్లుగా మారిపోవడం ఖాయం. అదే జరిగితే థార్ ఎడారి అడ్డూ అదుపూ లేకుండా విస్తరిస్తుంది. దాంతో ఉత్తరాదిలో చాలా భాగం అతి త్వరలోనే ఎడారిగా మారిపోతుంది’’అని హెచ్చరిస్తున్నారు! ఆరావళి. గుజరాత్ మొదలుకుని ఢిల్లీ దాకా 650 కిలోమీటర్ల పై చిలుకు విస్తరించిన పర్వత శ్రేణులు. ఉత్తరాదిని అన్నివిధాలా పెట్టని కోటలా కాపాడుకుంటూ వస్తున్నాయి. థార్ ఎడారి తూర్పు దిశగా విస్తరించకుండా అడ్డుకుంటున్నాయి. ఉత్తరాదిన అంతంత మాత్రమే ఉండే భూగర్భ జలాలను గుజరాత్ నుంచి ఢిల్లీ దాకా 4 రాష్ట్రాల పరిధిలో ఎప్పటికప్పుడు రీచార్జి చేయడమే గాక రాజధాని ప్రాంతంలోని అపార కాలుష్యాన్ని వీలైనంత మేరకు తగ్గిస్తున్నాయి.కోర్టు తీర్పుతో...ఆరావళి రగడ ఇప్పటిది కాదు. దశాబ్దాలుగా ఉన్నదే. సుప్రీంకోర్టు ఇటీలి తీర్పుతో తాజాగా అది మరోసారి రగులుకుంది. అసలు ఆరావళి పర్వత శ్రేణుల నిర్వచనం పరిధిలోకి వచ్చే ప్రాంతాలు ఏమిటన్న దానిపై కోర్టు చిరకాలంగా విచారణ జరుపుతూ వస్తోంది. ఈ విషయంలో కేంద్రం వాదనతో ఏకీభవిస్తూ గత నవంబర్ 20న కోర్టు తీర్పు వెలువరించింది. దానిప్రకారం పరిసర ప్రాంతాలతో పోలిస్తే కనీసం 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న వాటిని మాత్రమే గుట్టలుగా, అంటే ఆరావళీ ప్రాంతంగా గుర్తిస్తా రు! ఇది చాలా ప్రమాదకరమైన తీర్పు అని విపక్షాలు మొత్తుకుంటున్నాయి. హరియాణా, దేశ రాజధాని ప్రాంతంలో అస్మదీయులైన రియల్టీ, ఇన్ఫ్రా వ్యాపార దిగ్గజాలకు మేలు చేసేందుకే కేంద్రం ఈ వాదన లేవనెత్తింది. దానితో సుప్రీంకోర్టు ఏకీభవించడం తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుంది. దోపిడీదారులు ఇప్పుడిక చట్టబద్ధంగానే పేట్రే గుతారు’’అని పేర్కొంటున్నాయి. పర్యావరణవేత్తలు కూడా ఈ వాదనతో ఏకీభవిస్తున్నారు. ఆరావళి శ్రేణుల్లో దాదాపు 90 శాతం ప్రాంతం 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తే ఉంటుందని వారు గుర్తు చేస్తున్నారు. ‘‘కనుక నయా నిర్వచనం ప్రకారం అది గుట్టల లెక్కలోకి రాదు. కనుక అక్కడ గనులు తవ్వుకోవడం మొదలుకుని రియల్టీ వెంచర్ల దాకా ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఇది పర్యావరణానికే గాక మొత్తం ఉత్తరాదికే తీరని నష్టం చేస్తుంది. చూస్తుండగానే ఢిల్లీ నుంచి పంజాబ్ దాకా ఏమాత్రమూ నివాసయోగ్యం కాకుండా పోవ డం ఖాయం’’అని వారు హెచ్చరిస్తున్నారు.కొట్టిపారేస్తున్న కేంద్రంపాలక బీజేపీ మాత్రం ఆరావళి విషయమై విపక్షాలు, పర్యావరణవేత్తల ఆందోళనలను అసంబద్ధమైనవిగా కొట్టిపారేస్తోంది. ఆరావళి శ్రేణుల నిర్వచనం విషయంలో సుప్రీంకోర్టు నిజానికి ఎలాంటి సడలింపులూ ఇవ్వలేదని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పుకొచ్చారు. ఆరావళి శ్రేణులు నిత్యం పచ్చగా ఉండాలన్నదే కేంద్రం ఆకాంక్ష అన్నా రు. అయితే, ‘100 మీటర్ల ఎత్తు’నిర్వచనం ప్రపంచవ్యాప్తంగా అంగీకరించినదేనంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారాయన! ఆరావళి శ్రేణుల్లో కేవలం 0.19 శాతం ప్రాంతంలో మాత్రమే మైనింగ్కు అనుమతిస్తున్నట్టు వివరించారు. మొత్తమ్మీద 90 శాతం పర్వతాలను పూర్తిస్థాయిలో పరిరక్షిస్తున్నామన్నారు.సేవ్ ఆరావళిఅతి పురాతనమైన ఆరావళి పర్వత శ్రేణులను విధ్వంసం బారినుంచి కాపాడుకుందామంటూ ఆన్లైన్లో ఉద్యమం ఊపందుకుంటోంది. ‘సేవ్ ఆరావళి’హాష్ట్యాగ్కు సోషల్ సైట్లలో మద్దతు వెల్లువెత్తుతోంది. ఇది క్రమంగా ఉత్తరాదిని దాటుకుని జాతీయ ఆందోళనగా రూపుదిద్దుకునే సూచనలు కన్పిస్తున్నాయి.–సాక్షి, నేషనల్ డెస్క్ -
కేకో.. కేక!
పుట్టినరోజు అంటే కేకులు, బహుమతులు, శుభాకాంక్షల సందేశాలతో సందడిగా ఉండాలి. కానీ జొమాటో డెలివరీలో జరిగిన ఒక చిన్న పొరపాటు.. ఒక పుట్టినరోజు వేడుకను నవ్వుల విందుగా మార్చేసింది. ఆ వింత అనుభవం ఏంటో చదవండి. చెప్పిందొకటి.. రాసిందొకటి నక్షత్ర అనే యువతి పుట్టినరోజు సందర్భంగా ఆమె స్నేహితుడు జొమాటోలో ఒక అందమైన కేక్ ఆర్డర్ చేశాడు. అయితే, డెలివరీ చేసే వ్యక్తికి అర్థం కావాలని సూచనల విభాగంలో ‘లీవ్ ఎట్ సెక్యూరిటీ’(సెక్యూరిటీ దగ్గర ఇచ్చేయండి) అని రాశాడు. పాపం ఆ కేక్ షాపు యజమాని దాన్ని పొరపాటుగా అర్ధం చేసుకున్నాడు. అదేదో కేక్ మీద రాయాల్సిన శుభాకాంక్షల సందేశం అనుకున్నాడు. కళ్లు తేలేసిన బర్త్డే బేబీ కేక్ బాక్స్ తెరవగానే నక్షత్ర కళ్లు తేలేసింది. కేక్ మీద ఉండాల్సిన ’హ్యాపీ బర్త్డే’ మాయమై, నీటుగా ‘లీవ్ ఎట్ సెక్యూరిటీ’అని రాసి ఉంది. ఆమె ఆశ్చర్యంతో చూస్తుంటే, పక్కన ఉన్న స్నేహితులు మాత్రం ఆ కేక్ చూసి నవ్వు ఆపుకోలేక కిందపడిపోయారు. ఆ గందరగోళాన్ని ఆమె వీడియో తీసి ఇన్స్టా్రగామ్లో పోస్టు చేయడంతో.. అది కాస్తా వైరల్గా మారింది. దీనిపై ఒక నెటిజన్ వెటకారంగా స్పందిస్తూ.. ‘జొమాటో డెలివరీ సూచనల విషయంలో ఎప్పుడూ పొరపాటు చేయదు!’.. అని వ్యాఖ్యానించాడు. ఒకసారి మా అమ్మ పుట్టిన రోజుకి ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా.. అని రాయి’.. అని సూచిస్తే.. వాళ్లు యథాతథంగా కేకుపై ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా.. అని రాయి’ అని రాసేశారు.. అని తన పాత జ్ఞాపకాన్ని ఇంకో నెటిజన్ గుర్తు చేసుకున్నారు. ‘మరిచిపోలేని కామెడీ’.. ఉచిత డెలివరీ కేక్ మీద ఉండాల్సిన ‘హ్యాపీ బర్త్ డే’కాస్తా.. ఇలా ‘సెక్యూరిటీ’పాలవడంతో.. ఆ పుట్టినరోజు వేడుక కాస్తా నవ్వుల జాతరలా మారిపోయింది. నిజానికి ఆ ’మెసేజ్’ చూశాక.. కేక్ కట్ చేయాలా? లేక సెక్యూరిటీ గార్డ్కి పార్సిల్ చేయాలా?.. అన్నది ఆ అమ్మాయికి అర్థం కాలేదు. ఆ కేక్ రుచి ఎలా ఉన్నా.. జొమాటో వారు మాత్రం ఆమెకు ‘మర్చిపోలేని కామెడీ’ని ఉచితంగా డెలివరీ చేసేశారు. ఆ మెసేజ్ పుణ్యమా అని కేక్ కడుపులోకి వెళ్లకముందే, నవ్వులతో అందరి కడుపులు నిండిపోయాయన్నమాట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
వెంటాడే గీతానికి ‘వంద’నం
‘భాయో ఔర్ బెహనో!’.. ఈ గంభీరమైన స్వరం వినిపించగానే భారతీయుల ఇళ్లలో సమయం స్తంభించిపోయేది. టీవీలు లేని కాలంలో.. ఇంటర్నెట్ ఊసే లేని రోజుల్లో.. సరిహద్దులు దాటి వచ్చి మన గుండె తలుపులు తట్టిన ఆ అద్భుతమే ’రేడియో సిలోన్’. ఆసియాలోనే మొదటి కమర్షియల్ షార్ట్–వేవ్ స్టేషన్గా వెలిగిన ఈ రేడియో, ఈ వారంతో విజయవంతంగా 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఒక చరిత్ర.. ఒక ప్రస్థానం డిసెంబర్ 16, 1925న అధికారికంగా ప్రారంభమైన ఈ రేడియో సర్వీస్, ఆసియాలోనే అతిపెద్ద రికార్డెడ్ సాంగ్స్ లైబ్రరీని కలిగి ఉంది. భారత్లో కూడా దొరకని అరుదైన హిందీ పాటల రికార్డులు, ప్రపంచ దేశాల నేతల గొంతులు ఇక్కడ భద్రంగా ఉండటం విశేషం. 1949లో ’రేడియో సిలోన్’గా మారి, 1967లో ’శ్రీలంక బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (ఎస్ఎల్బీసీ)గా రూపాంతరం చెందినా, శ్రోతల మనసుల్లో మాత్రం అది ఎప్పటికీ ’రేడియో సిలోన్’ మాత్రమే.. అమీన్ సయానీ మ్యాజిక్.. ప్రతి బుధవారం రాత్రి 8 గంటలవుతోందంటే చాలు.. రేడియో దగ్గర జనం గుమిగూడేవారు. అమీన్ సయానీ తన అద్భుత గళంతో హిందీ సినిమా పాటల ర్యాంకింగ్స్ను ప్రకటిస్తుంటే, ఆ ఉత్కంఠే వేరు. 1952 నుండి 1988 వరకు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ’బినాకా గీత్మాల’ భారతీయులను ఉర్రూతలూగించింది. నేటికీ శ్రీలంక రేడియోలో ’కోరా కాగజ్ థా యే మన్ మేరా’ వంటి పాత బాలీవుడ్ పాటలు వినిపిస్తుంటే, అదొక మధురమైన కాలయానమే.. పీవో బాక్స్ 574.. ఉత్తరాల వెల్లువ అప్పట్లో రేడియో సిలోన్కు వచ్చే ఉత్తరాల సంఖ్య చూసి శ్రీలంక తపాలా శాఖ ఆశ్చర్యపోయేదట. ముఖ్యంగా ’ఆల్ ఆసియా ఇంగ్లిష్ సర్వీస్’ కోసం భారత్ నుండి వేల సంఖ్యలో ఉత్తరాలు వచ్చేవి. ‘అప్పట్లో ఉత్తరాల వెల్లువను తట్టుకోవడానికి ‘పీవో బాక్స్ 574, కొలంబో’ అనే ప్రత్యేక చిరునామాను సృష్టించాల్సి వచ్చింది. చిత్రమేమిటంటే, ఆ ఉత్తరాల్లో అత్యధికం సికింద్రాబాద్ నుండే వచ్చేవి. ఆ తర్వాత ముంబై, షిల్లాంగ్ నుంచి ఉండేవి’.. అని ప్రస్తుత నిర్వాహకులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రపంచ పరిణామాలకు సాక్షి ప్రస్తుతం ఎల్బీసీ సింహళ, తమిళ, ఇంగ్లిష్తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా సేవలు అందిస్తోంది. 70,000కు పైగా మ్యూజిక్ రికార్డులు, 78 ఆర్పీఎం నాటి పాత కాలపు రికార్డుల నుండి నేటి డిజిటల్ యుగం వరకు ఈ రేడియో అన్నీ చూసేసింది. ఎవరెస్ట్ శిఖరారోహణ వార్త దగ్గర నుండి, మనిషి చంద్రుడిపై అడుగు పెట్టిన విశేషాల వరకు ప్రపంచ పరిణామాలన్నింటికీ సాక్షిగా నిలిచింది. తరాలు మారినా.. తరగని మమకారం ప్రైవేట్ రేడియోలు, మ్యూజిక్ యాప్లు ఎన్ని వచ్చినా.. రేడియో సిలోన్ అందించిన ఆ అనుభూతి సాటిలేనిది. క్లాసికల్ నుండి పాప్ వరకు, జాజ్ నుండి కంట్రీ మ్యూజిక్ వరకు శ్రోతలకు షడ్రసోపేతమైన విందు వడ్డించిన ఈ రేడియో సర్వీస్, మరో వందేళ్ల పాటు తన ప్రయాణాన్ని దిగి్వజయంగా కొనసాగించాలని కోరుకుందాం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సౌదీలో ‘మధు’మాసం!
ఇస్లాం పవిత్ర పుణ్యక్షేత్రాలకు నిలయమైన సౌదీ అరేబియాలో ఒకప్పుడు ’మద్యం’ మాట వినిపిస్తేనే కఠిన శిక్షలు ఉండేవి. కానీ, ఇప్పుడక్కడ క్రమేపీ వాతావరణం మారుతోంది. దశాబ్దాల నిషేధాన్ని పక్కన పెట్టి, అత్యంత రహస్యంగా మద్యం విక్రయాలను విస్తరిస్తోంది సౌదీ ప్రభుత్వం.నిశ్శబ్దంగా.. నిషా వైపు! రియాద్లోని ’డిప్లొమాటిక్ క్వార్టర్’లో ఒక గుర్తు తెలియని దుకాణం ఉంది.. బయట బోర్డు ఉండదు. లోపలికి కెమెరాలను రానివ్వరు. 2024 జనవరిలో కేవలం ముస్లిమేతర దౌత్యవేత్తల కోసం మొదలైన ఈ దుకాణం తలుపులు ఇప్పుడు మరికొందరికి తెరుచుకున్నాయి. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే, ’ప్రీమియం రెసిడెన్సీ’ ఉన్న విదేశీయులకు కూడా ఇక్కడ మద్యం కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. రక్షణ మామూలుగా లేదు! ఈ దుకాణంలోకి వెళ్లడం అంత సులభం కాదు. ప్రవేశ ద్వారం దగ్గర క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు. ఫోన్లు, కెమెరాలను అనుమతించరు. ఆఖరికి మీరు పెట్టుకున్న కళ్లద్దాలు కూడా ’స్మార్ట్ గ్లాసెస్’ ఏమో అని సిబ్బంది తనిఖీ చేస్తారు. ధరల విషయానికి వస్తే.. దౌత్యవే త్తలకు పన్ను ఉండదు కానీ, ఈ కొత్త వినియోగదారులకు మాత్రం జేబులు ఖాళీ కావల్సిందే.ఇప్పుడిక రియాద్లోనే ‘కిక్కు’ ఇప్పటి వరకు మందు తాగాలనిపిస్తే సౌదీ వాసులు పక్కనే ఉన్న బహ్రెయిన్ ద్వీపానికో లేదా దుబాయ్కో వెళ్లేవారు. కొంతమంది స్మగ్లింగ్ చేసిన మందును భారీ ధరకు కొనేవారు. కానీ, తాజా మార్పులతో ధనవంతులైన విదేశీయులకు ఇప్పుడు రియాద్లోనే ’కిక్కు’ దొరుకుతోంది. సౌదీలో సినిమాలు వచ్చాయి, మహిళలు డ్రైవింగ్ సీట్ ఎక్కారు, ఇప్పుడు మద్యం దుకాణాలు కూడా వచ్చేశాయి. అయితే ఇది కేవలం విదేశీయులకే పరిమితమా? లేక భవిష్యత్తులో అందరికీ అందుబాటులోకి వస్తుందా?.. అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా, సౌదీలో ఈ ’లిక్కర్ ఎక్స్పెరిమెంట్’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.దశాబ్దాల నిషేధం! సౌదీలో మద్యం ఎందుకు నిషేధించారో తెలుసా? 1951లో సౌదీ వ్యవస్థాపక రాజు అబ్దుల్ అజీజ్ కుమారుడు ప్రిన్స్ మిషారీ, మద్యం మత్తులో జెడ్డాలోని బ్రిటిష్ వైస్ కాన్సుల్ను కాల్చి చంపాడు. ఆ చేదు జ్ఞాపకంతో అప్పట్లో మద్యంపై కఠిన నిషేధం విధించారు. ఇప్పుడు విజన్ 2030లో భాగంగా మొహమ్మద్ బిన్ సల్మాన్ మళ్లీ మెల్లమెల్లగా నిబంధనలను సడలిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కర్మ యోగం... కర్తవ్య పాలన
భారతీయ జీవన దర్శనం ప్రకారం ఈ జగత్తంతా దైవమయం. మనం చేసే ప్రతి కర్మను ఆ పరమాత్మకు అర్పించే ‘నైవేద్యం’గా భావించాలి. ఉపనిషత్తులు బోధించిన సూత్రం ప్రకారం, కర్మలను చేస్తూనే వాటి ఫలితాలకు అంటకుండా ఉండటమే జీవన ముక్తి. అహంకారాన్ని వీడి, ‘నేను కర్తను కాదు, కేవలం ఒక నిమిత్త మాత్రుడను’ అనే భావనతో పని చేసినప్పుడు ఆ కర్మకు పుణ్యపాపాలు అంటవు.ఆర్ష ధర్మం ప్రతిపాదించిన అద్భుత జీవన వేదాంతం కర్మయోగం. లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కర్మ చేయక తప్పదు. అయితే, ఆ కర్మను బంధనంగా మార్చుకోవాలా లేక మోక్ష మార్గంగా మలచుకోవాలా అన్నదే ఇక్కడి అసలైన ప్రశ్న. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అందించిన ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’ అనే దివ్య శ్లోకం మానవాళికి ఒక శాశ్వత దిక్సూచి. పని చేయడంపైనే నీకు అధికారం ఉంది గానీ, ఫలితంపై లేదని చెప్పడం వెనుక లోతైన మనస్తత్వ శాస్త్రం దాగి ఉంది. ఫలితంపై అతిగా ఆశ పెంచుకున్నప్పుడు మనిషిలో ఆందోళన, భయం, అసహనం ప్రవేశిస్తాయి. అదేపనిని దైవ కార్యంగా భావించి చేసినప్పుడు ఆ కర్మ ‘యోగం’గా మారుతుంది. ఇది కేవలం సిద్ధాంతం కాదు, నిత్య జీవితంలో అనుసరించదగిన పరమ సత్యం.కర్మయోగం అంటే పలాయనవాదం కాదు, అది సంపూర్ణమైన క్రియాశీలత. ఒక శిల్పి విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు కేవలం ఆ ప్రతిమ ఎంత ధరకు అమ్ముడవుతుందనే ఆలోచనతో ఉంటే, ఆ శిల్పంలో జీవం ఉట్టిపడదు. అదే శిల్పి తన నైపుణ్యాన్ని పరమాత్మకు అర్పిస్తున్నాననే భావనతో చెక్కితే, ఆ పనిలో ఒక అలౌకికానందం వెల్లివిరుస్తుంది. అలాగే ఒక వైద్యుడు కేవలం ధనం కోసమే చికిత్స చేస్తే అది వ్యాపారం అవుతుంది. అదే వైద్యుడు రోగిలో దైవాన్ని చూస్తూ, తన విజ్ఞానాన్ని ప్రాణదానానికి అంకితం చేస్తే అది పవిత్ర యజ్ఞమవుతుంది. ఫలితం భగవంతుడి నిర్ణయమని నమ్మి, తన శక్తినంతా చికిత్సపైనే కేంద్రీకరించినప్పుడు ఆ వైద్యుడికి మానసిక ఒత్తిడి ఉండదు. ఈ నిష్కామ బుద్ధి మనిషిని నిరంతరం ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. అగ్ని తన ధర్మాన్ని తాను నిర్వర్తించినట్లు, మనిషి తన స్వధర్మాన్ని నిష్కామంగా ఆచరించాలి.ఈ మార్గంలో అత్యంత ముఖ్యమైనది ‘ఫలత్యాగం’. అంటే ఫలితాన్ని వదిలేయడం కాదు, ఫలితం వల్ల కలిగే హర్ష విచారాలకు అతీతంగా ఉండటం. విజయం వస్తే పొంగిపోకుండా, అపజయం ఎదురైతే కుంగిపోకుండా ఉండే స్థితి కర్మయోగికి మాత్రమే సాధ్యం.యోగశాస్త్రం బోధించిన ఈ నిష్కామ కర్మ సిద్ధాంతం వ్యక్తిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది. చేసే పనిలో దైవత్వాన్ని వెతుక్కున్నప్పుడు ఒత్తిడి మాయమై శాంతి ప్రవహిస్తుంది. ప్రతి క్షణం మన కర్మను ఒక ఆరాధనగా మలుచుకుంటే, ఈ ప్రపంచమే ఒక వైకుంఠమవుతుంది. స్వార్థపు చీకటిని తొలగించి, సేవా భావం అనే జ్యోతిని వెలిగించుకుందాం. సర్వం ఈశ్వరార్పణమస్తు! నిప్పు నిప్పును కాల్చదు గానీ, దానిపై పడిన వస్తువును కాలుస్తుంది. అలాగే, అహంకారంతో చేసే కర్మలు బంధాలను సృష్టిస్తే, నిరహంకారంతో చేసే కర్మలు మనసును నిర్మలం చేస్తాయి. సూర్యుడు ప్రతిరోజూ లోకానికి వెలుగును ఇస్తాడు, తనే వెలుగునిస్తున్నాననే అహంకారం ఆయనకు ఉండదు. అటువంటి నిస్వార్థ గుణమే మనల్ని మహోన్నతులుగా తీర్చిదిద్దుతుంది. నిత్య జీవిత సవాళ్లను సాకులు చెప్పకుండా ఎదుర్కోవడం, బాధ్యతలను భారం కాకుండా గౌరవంగా భావించడం కర్మయోగపు అంతరార్థం. ఈ జ్ఞానమే మనల్ని నిరంతరం కర్మపథంలో నడిపిస్తూ, అంతిమంగా ఆత్మానందానికి చేరువ చేస్తుంది.– కె. భాస్కర్ గుప్తా వ్యక్తిత్వ వికాస నిపుణులు -
పొగబట్టిన కాలుష్యం!
దేశంలో రోజురోజుకూ వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లోని ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. తీవ్ర శ్వాసకోశ సమస్యలతో 2022–24 మధ్య ఢిల్లీలోని ఆరు ప్రభుత్వ ఆసుపత్రులకు 2 లక్షల కంటే ఎక్కువ మంది బాధితులు వచ్చారంటే కాలుష్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్లో ప్రచురితమైన 2024 అధ్యయనం ప్రకారం దీర్ఘకాలం కలుíÙతమైన గాలిని పీల్చడం వల్ల భారత్లో ఏటా 15 లక్షల మంది మరణిస్తున్నారు.వాయు కాలుష్యం వల్ల దేశ సగటు ఆయుర్దాయం 3.5 ఏళ్లు తగ్గిందని షికాగో విశ్వవిద్యాలయం 2025 ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (ఏక్యూఎల్ఐ) వెల్లడించింది. గాలి నాణ్యతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పరి్టక్యులేట్ మ్యాటర్–2.5 (పీఎం) ఒక్కో క్యూబిక్ మీటర్కు 40 ్పమైక్రోగ్రాముల వరకు ఆమోదయోగ్యం. అంటే గాలిలో 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసంతో కలిసిన దుమ్ము, ధూళి, పొగ కణాలు అన్నమాట. గాలిలో ఈ కణాలు ఎన్ని ఎక్కువగా ఉంటే వాయు కాలుష్యం అంత తీవ్రంగా ఉన్నట్లు లెక్క.ఏడాది పొడవునా.. దేశంలో వాయు నాణ్యత సంక్షోభం అంతకంతకూ విస్తృతమవుతోంది. ఈ ఏడాది 256 నగరాలు, పట్టణాల్లో పరీక్షలు జరపగా 150 కేంద్రాల్లో వాయు కాలుష్యం నిర్దేశిత ప్రమాణాలను మించిపోయిందని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ నివేదిక తెలిపింది. చాలా మంది పట్టణవాసులకు అనారోగ్యకర లేదా ప్రమాదకర గాలిని పీల్చడం ఏడాది పొడవునా నిత్యకృత్యంగా మారింది. 2025లో ఢిల్లీలో పీఎం–2.5 స్థాయి రోజుకు క్యూబిక్ మీటర్కు 107–130 మైక్రోగ్రాములుగా³ నమోదైంది. ఇది దేశంలో ఒక రోజు పరిమితి అయిన 60 మైక్రోగ్రాములు, డబ్ల్యూహెచ్ఓ నిర్దేశిత 15 మైక్రోగ్రాముల కంటే చాలా ఎక్కువ. తగ్గుతున్న ఆయుర్దాయం..దేశంలో 46% మంది ప్రజలు పీఎం–2.5 స్థాయి కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారని ఏక్యూఎల్ఐ నివేదిక తెలిపింది. ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రజలు 4.74 ఏళ్ల ఆయుర్దాయం కోల్పోతున్నారని పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన కఠినమైన మార్గదర్శకాలను పాటిస్తే ఆయుర్దాయం 9.4 నెలలు పెరుగుతుందని అంచనా వేసింది.ఎనిమిదిలో ఒకటి..వాయు కాలుష్యానికి సంబంధించిన మరణాలను భారత్లో లెక్కించడం లేదని గ్లోబల్ క్లైమేట్, హెల్త్ అలయన్స్ చెబుతోంది. క్రమబద్ధమైన విధానాలు లేకపోవడమే అందుకు కారణమని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు వాయు కాలుష్యం రెండో ప్రధాన కారణమని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక–2025 తెలిపింది. అన్ని దేశాల్లో కలిపి 2023లో 79 లక్షల మరణాలు వాయు కాలుష్యం వల్ల సంభవించాయని పేర్కొంది. అందులో పీఎం–2.5 స్థాయి కాలుష్యానికి గురై 49 లక్షల మంది మృతిచెందారని తెలిపింది. తగ్గిన సూర్యకాంతి.. 1993–2022 మధ్యకాలంలో గాలిలోని దుమ్ము, ధూళి కారణంగా దేశంలో సూర్యకాంతి దాదాపు 13% తగ్గింది. మేఘాలు అదనంగా 31–44% సూర్యకాంతి క్షీణతకు కారణమయ్యాయని ఐఐటీ కాన్పూర్లోని వాతావరణ శాస్త్రవేత్త సచ్చిదానంద్ త్రిపాఠి తెలిపారు. సూర్యకాంతి తగ్గితే వ్యవసాయం, సౌర శక్తితోపాటు రోజువారీ జీవితాలపైనా ప్రభావం చూపుతుందని వివరించారు. ఫొటోవోల్టాయిక్ సిస్టమ్స్ను బట్టి సౌర విద్యుత్ ఉత్పత్తి 12–41% పడిపోతుందని చెప్పారు. బీజింగ్ ఒక ఉదాహరణ.. చైనాలోని బీజింగ్ 20 ఏళ్ల క్రితం ప్రపంచ పొగమంచు రాజధానిగా పేరొందింది. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా బొగ్గు ఆధారిత బాయిలర్స్ను మూసివేయడం, ప్రజారవాణా, పర్యావరణ అనుకూల వాహనాలను ప్రోత్సహించడం, సాంకేతిక సంస్కరణలు, ఆవిష్కరణలు, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం వంటి చర్యలను చైనా సర్కారు యుద్ధప్రాతిపదికన చేపట్టింది. ఫలితంగా పీఎం–2.5 స్థాయి 2013లో ఒక్కో క్యూబిక్ మీటర్కు 72గా ఉండగా గతేడాది 29.3 ్పమైక్రోగ్రాములకు తగ్గిపోవడం విశేషం. -
అరుదైన అంతరిక్ష అతిథి
అదో అరుదైన అంతరిక్ష అతిథి. ఇంకా చెప్పాలంటే మన సౌర మండలంలోకి దూసుకొచ్చిన చొరబాటుదారు. అదే... 3ఐ/అట్లాస్గా పిలుస్తున్న తోకచుక్క! అది అనంత విశ్వంలో సుదీర్ఘయానం చేసి మరీ మన చెంతకు వచ్చింది. ఆ క్రమంలో భూమికి నష్టమేమైనా చేస్తుందేమోనని సైంటిస్టులు కలవరపడ్డా, అలాంటిదేమీ లేకుండానే తన మార్గాన తిరిగి సుదూర విశ్వంలోకి వెళ్లిపోతోంది! దాంతో అంతా హమ్మయ్యా అని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు...! మతి పోగొడుతున్న ఫొటోలు 3ఐ/అట్లాస్ శుక్రవారం రాత్రి, అంటే డిసెంబర్ 19న భూమికి సైంటిస్టులు ముందుగా వేసిన అంచనా కంటే కూడా అతి సమీపానికి వచ్చింది. 1.8 ఆస్ట్రనామికల్ యూనిట్ల (27 కోట్ల కిలోమీటర్లు) సమీపానికి అని వారు భావించగా, అది ఏకంగా 1.4 ఆస్ట్రనామికల్ యూనిట్ల (20 కోట్ల కి. మీ.) సమీపానికి వచ్చేసింది. ఆ సందర్భంగా ఉటా అబ్జర్వేటరీ తీసిన ఫొటో అందరినీ అలరిస్తోందిప్పుడు. అందులో 3ఐ/అట్లాస్ రెండు తోకలతో వింత హొయలు పోతూ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో లియో నక్షత్ర మండలంలోని తారలు తళుక్కుమంటూ కనువిందు చేస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నేడు డాక్టర్ వైఎస్సార్ స్మృతి మందిరం ప్రారంభం
యానాం: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి పరిధిలోని యానాం నియోజకవర్గానికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయన పేరిట మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు డాక్టర్ వైఎస్సార్ స్మృతి మందిరాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఢిల్లీలో పుదుచ్చేరి ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న ఆయన యానాం యర్రా గార్డెన్స్లోని తన నివాసం ఎదురుగా సొంత నిధులతో దీన్ని నిర్మించారు. ఇందుకోసం రూ.లక్షలు వెచ్చించి స్థలం కొనుగోలు చేశారు. రూ.కోటి పైగా ఖర్చుతో రెండంతస్తుల్లో నిర్మించిన వైఎస్సార్ స్మృతి మందిరాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఆదివారం నాటికి 36 ఏళ్లవుతోందన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. వైఎస్సార్ స్మృతి మందిరం, గోవుల నిలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. యానాం నియోజకవర్గానికి వైఎస్సార్ చేసిన మేలును వివరించారు. -
యాప్స్తో ఫుడ్ పెరిగింది
ఫుడ్ డెలివరీ యాప్స్ రాకతో ప్రజల ఆహార అలవాట్లు, పరిశ్రమ రూపురేఖలు ప్రపంచ వ్యాప్తంగా మారిపోయాయి. కూర్చున్న చోటకే నిమిషాల్లో ఫుడ్ ప్రత్యక్షం అవుతోంది. కస్టమర్లు విభిన్న వంటకాలను ఆస్వాదించే అవకాశాలు పెరిగాయి. అటు రెస్టారెంట్ల వ్యాపారం.. బిర్యానీ తిన్నంత నిండుగా ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగయ్యాయి. ఎన్సీఏఈఆర్ ఏం చెప్పిందంటే... ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ ద్వారా వెల్లువెత్తుతున్న ఆర్డర్ల విలువ రెండేళ్లలోనే రెండింతలైందని ఆర్థిక విధానాల మేధోమధన సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అపైŠల్డ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్) వెల్లడించింది. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ప్రోసస్తో కలిసి ఎన్సీఏఈఆర్ రూపొందించిన నివేదిక ప్రకారం.. గతంతో పోలిస్తే ఫుడ్ డెలివరీ యాప్స్ కారణంగా హోటళ్లు సేవలు అందించే ప్రాంతం విస్తృతి పెరిగింది. వేలాది రెస్టారెంట్లు కస్టమర్ల మొబైల్ తెరపై ప్రత్యక్షం అవుతున్నాయి. కొత్త కొత్త వంటకాలు ఆఫర్ చేసే అవకాశం రెస్టారెంట్లకు కలిగింది. నూతన కస్టమర్లనూ అందిపుచ్చుకున్నాయి. అయితే అధిక కమీషన్ల కారణంగా ఈ ప్లాట్ఫామ్స్ నుంచి తప్పుకోవాలని కొన్ని హోటళ్లు భావిస్తుండడమూ కొసమెరుపు. రెండింతలైన విలువ..: మన దేశంలో 2023–24లో ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ రూ.1.2 లక్షల కోట్ల విలువైన ఫుడ్ను కస్టమర్లకు చేర్చాయి. 2021–22లో ఇది రూ.61,271 కోట్లుగా నమోదైంది. ఈ రంగం భారత ఆర్థికవ్యవస్థ కంటే వేగంగా విస్తరిస్తోంది. తద్వారా శక్తివంతమైన ఆర్థిక చోదకంగా అవతరించింది. దీంతో జాతీయ ఉత్పత్తిలో ఈ రంగం వాటా 0.14 నుంచి 0.21 శాతానికి పెరిగింది. ఇతర సేవల రంగాలతో పోలిస్తే ఫుడ్ యాప్స్ మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. ఫుడ్ డెలివరీ రంగం రెస్టారెంట్లు, వ్యవసాయం, రవాణా, సాంకేతికత విభాగాల్లో రెండింతల ఆర్థిక విలువను జోడిస్తోంది. ఫుడ్ యాప్స్లో రూ.10 లక్షల విలువైన ఆర్డర్లు కొత్తగా తోడైతే.. మొత్తం ఆర్థిక వ్యవస్థలో రూ.20.5 లక్షల విలువైన ఉత్పత్తి అదనంగా వచ్చి చేరుతోందని నివేదిక వెల్లడించింది. ఉపాధి జోరు..: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ ద్వారా ఉపాధి పొందుతున్నవారి సంఖ్య భారత్లో 2021–22లో 10.8 లక్షల నుంచి 2023–24లో 13.7 లక్షలకు చేరింది. ఈ రంగంలో కార్మికుల సంఖ్య ఏటా 12.3% అధికం అవుతోంది. ఇతర రంగాల్లో వార్షిక వృద్ధి 7.9% ఉంది. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్లో ఒకరికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తే.. విస్తృత ఆర్థిక వ్యవస్థలో 2.7 అదనపు ఉద్యోగాల సృష్టి జరుగుతోంది. రుచించని కమీషన్..: ప్రతి ఆర్డర్పై ఫుడ్ యాప్స్ ప్రస్తుతం వసూలు చేస్తున్న కమీషన్ మూడింట ఒక వంతు రెస్టారెంట్ ఓనర్లకు రుచించడం లేదు. ఈ కమీషన్లు ఏటా పెరుగుతూ బిల్ విలువలో గణనీయమైన వాటాను ఆక్రమిస్తున్నాయి. ఆర్డర్ల పరిమాణం బలంగా ఉన్నా, సమకూరే నికర ఆదాయాలు తక్కువగా ఉంటున్నాయి. ఒక్కో ఆర్డర్పై కమీషన్ 2019లో 9.6% నుండి 2023లో 24.6%కి వచ్చి చేరింది. కమీషన్ల విషయంలో పెద్ద హోటళ్లకు ఈ యాప్స్తో బేరమాడుకునే శక్తి ఎక్కువ. కానీ చిన్న హోటళ్లకు ఆ అవకాశం తక్కువగా ఉండడంతో లాభాలపై ఒత్తిడి ఉంటోంది. పేలవమైన కస్టమర్ సర్వీస్, తగినంత లాభదాయకత లేకపోవడం కారణంగా ఫుడ్ డెలివరీ యాప్స్ను విడిచిపెట్టాలని భావిస్తున్నట్టు 35% మంది ఓనర్లు వెల్లడించారు. దేశంలో 28 నగరాల్లోని..: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్తో రెస్టారెంట్లు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా 28 ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని 640 రెస్టారెంట్లను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించారు. 2023లో ఈ ప్లాట్ఫామ్స్ గురించి ఎన్సీఏఈఆర్ విడుదల చేసిన నివేదికతో పోల్చారు. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ రాకతో.. » ఫుడ్ యాప్స్తో తాము సేవలందిస్తున్న ప్రాంత పరిధి పెరిగిందన్న 59% రెస్టారెంట్లు. » నూతన వంటకాలను జోడించినట్టు 52.7% మంది ఓనర్లు తెలిపారు » కస్టమర్ల సంఖ్య దూసుకెళ్లిందని 50.4% మంది పేర్కొన్నారు. » 2019–23 మధ్య ఈ యాప్స్ ద్వారా రెస్టారెంట్ల ఆదాయ వాటా 22% నుంచి 29%కి చేరింది.ఫుడ్ యాప్స్ విశేషాలు..» భారత్లో ఈ ఏడాది జూన్ నాటికి 19.4 కోట్ల మంది ఫుడ్ యాప్స్ను వినియోగిస్తున్నారు. » రెండేళ్ల క్రితం ఈ సంఖ్య 6 కోట్లు మాత్రమే. ఈ కాలంలో యూజర్లు మూడింతలు దాటారు. » ఫుడ్ డెలివరీ యాప్స్ వాడకంలో ప్రపంచంలో మన దేశానిదే పైచేయి. » మొత్తం ఫుడ్ యాప్స్ డౌన్లోడ్స్లో భారత్ వాటా ఏకంగా 43.79% ఉంది. -
యాప్స్తో ఫుడ్ పెరిగింది
ఫుడ్ డెలివరీ యాప్స్ రాకతో ప్రజల ఆహార అలవాట్లు, పరిశ్రమ రూపురేఖలు ప్రపంచ వ్యాప్తంగా మారిపోయాయి. కూర్చున్న చోటకే నిమిషాల్లో ఫుడ్ ప్రత్యక్షం అవుతోంది. కస్టమర్లు విభిన్న వంటకాలను ఆస్వాదించే అవకాశాలు పెరిగాయి. అటు రెస్టారెంట్ల వ్యాపారం.. బిర్యానీ తిన్నంత నిండుగా ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగయ్యాయి. ఎన్సీఏఈఆర్ ఏం చెప్పిందంటే... ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ ద్వారా వెల్లువెత్తుతున్న ఆర్డర్ల విలువ రెండేళ్లలోనే రెండింతలైందని ఆర్థిక విధానాల మేథోమధన సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైల్డ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్) వెల్లడించింది. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ప్రోసస్తో కలిసి ఎన్సీఏఈఆర్ రూపొందించిన నివేదిక ప్రకారం.. గతంతో పోలిస్తే ఫుడ్ డెలివరీ యాప్స్ కారణంగా హోటళ్లు సేవలు అందించే ప్రాంతం విస్తృతి పెరిగింది. వేలాది రెస్టారెంట్లు కస్టమర్ల మొబైల్ తెరపై ప్రత్యక్షం అవుతున్నాయి. కొత్త కొత్త వంటకాలు ఆఫర్ చేసే అవకాశం రెస్టారెంట్లకు కలిగింది. నూతన కస్టమర్లనూ అందిపుచ్చుకున్నాయి. అయితే అధిక కమీషన్ల కారణంగా ఈ ప్లాట్ఫామ్స్ నుంచి తప్పుకోవాలని కొన్ని హోటళ్లు భావిస్తుండడమూ కొసమెరుపు. రెండింతలైన విలువ..: మన దేశంలో 2023–24లో ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ రూ.1.2 లక్షల కోట్ల విలువైన ఫుడ్ను కస్టమర్లకు చేర్చాయి. 2021–22లో ఇది రూ.61,271 కోట్లుగా నమోదైంది. ఈ రంగం భారత ఆర్థికవ్యవస్థ కంటే వేగంగా విస్తరిస్తోంది. తద్వారా శక్తివంతమైన ఆర్థిక చోదకంగా అవతరించింది. దీంతో జాతీయ ఉత్పత్తిలో ఈ రంగం వాటా 0.14 నుంచి 0.21 శాతానికి పెరిగింది. ఇతర సేవల రంగాలతో పోలిస్తే ఫుడ్ యాప్స్ మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. ఫుడ్ డెలివరీ రంగం రెస్టారెంట్లు, వ్యవసాయం, రవాణా, సాంకేతికత విభాగాల్లో రెండింతల ఆర్థిక విలువను జోడిస్తోంది. ఫుడ్ యాప్స్లో రూ.10 లక్షల విలువైన ఆర్డర్లు కొత్తగా తోడైతే.. మొత్తం ఆర్థిక వ్యవస్థలో రూ.20.5 లక్షల విలువైన ఉత్పత్తి అదనంగా వచ్చి చేరుతోందని నివేదిక వెల్లడించింది. ఉపాధి జోరు..: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ ద్వారా ఉపాధి పొందుతున్నవారి సంఖ్య భారత్లో 2021–22లో 10.8 లక్షల నుంచి 2023–24లో 13.7 లక్షలకు చేరింది. ఈ రంగంలో కార్మికుల సంఖ్య ఏటా 12.3% అధికం అవుతోంది. ఇతర రంగాల్లో వార్షిక వృద్ధి 7.9% ఉంది. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్లో ఒకరికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తే.. విస్తృత ఆర్థిక వ్యవస్థలో 2.7 అదనపు ఉద్యోగాల సృష్టి జరుగుతోంది. రుచించని కమీషన్..: ప్రతి ఆర్డర్పై ఫుడ్ యాప్స్ ప్రస్తుతం వసూలు చేస్తున్న కమీషన్ మూడింట ఒక వంతు రెస్టారెంట్ ఓనర్లకు రుచించడం లేదు. ఈ కమీషన్లు ఏటా పెరుగుతూ బిల్ విలువలో గణనీయమైన వాటాను ఆక్రమిస్తున్నాయి. ఆర్డర్ల పరిమాణం బలంగా ఉన్నా, సమకూరే నికర ఆదాయాలు తక్కువగా ఉంటున్నాయి. ఒక్కో ఆర్డర్పై కమీషన్ 2019లో 9.6% నుండి 2023లో 24.6%కి వచ్చి చేరింది. కమీషన్ల విషయంలో పెద్ద హోటళ్లకు ఈ యాప్స్తో బేరమాడుకునే శక్తి ఎక్కువ. కానీ చిన్న హోటళ్లకు ఆ అవకాశం తక్కువగా ఉండడంతో లాభాలపై ఒత్తిడి ఉంటోంది. పేలవమైన కస్టమర్ సరీ్వస్, తగినంత లాభదాయకత లేకపోవడం కారణంగా ఫుడ్ డెలివరీ యాప్స్ను విడిచిపెట్టాలని భావిస్తున్నట్టు 35% మంది ఓనర్లు వెల్లడించారు. దేశంలో 28 నగరాల్లోని..: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్తో రెస్టారెంట్లు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా 28 ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని 640 రెస్టారెంట్లను విశ్లేíÙంచి ఈ నివేదిక రూపొందించారు. 2023లో ఈ ప్లాట్ఫామ్స్ గురించి ఎన్సీఏఈఆర్ విడుదల చేసిన నివేదికతో పోల్చారు. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ రాకతో.. ⇒ ఫుడ్ యాప్స్తో తాము సేవలందిస్తున్న ప్రాంత పరిధి పెరిగిందన్న 59% రెస్టారెంట్లు.⇒ నూతన వంటకాలను జోడించినట్టు 52.7% మంది ఓనర్లు తెలిపారు⇒ కస్టమర్ల సంఖ్య దూసుకెళ్లిందని 50.4% మంది పేర్కొన్నారు.⇒ 2019–23 మధ్య ఈ యాప్స్ ద్వారా రెస్టారెంట్ల ఆదాయ వాటా 22% నుంచి 29%కి చేరింది.ఫుడ్ యాప్స్ విశేషాలు.. ⇒ భారత్లో ఈ ఏడాది జూన్ నాటికి 19.4 కోట్ల మంది ఫుడ్ యాప్స్ను వినియోగిస్తున్నారు. ⇒ రెండేళ్ల క్రితం ఈ సంఖ్య 6 కోట్లు మాత్రమే. ఈ కాలంలో యూజర్లు మూడింతలు దాటారు. ⇒ ఫుడ్ డెలివరీ యాప్స్ వాడకంలో ప్రపంచంలో మన దేశానిదే పైచేయి. ⇒ మొత్తం ఫుడ్ యాప్స్ డౌన్లోడ్స్లో భారత్ వాటా ఏకంగా 43.79% ఉంది. -
మన లోకం పిలుస్తోంది చలో చలో
ఆకాశంలో ఎగిరే ‘మేజిక్ కంబళి’... ‘ఓపెన్ ససేమ్’ అనగానే తెరుచుకునే గుహద్వారం దీపం రుద్దితే వచ్చే ‘జినీ భూతం’... దొంగల భరతం పట్టే ‘తెనాలి రామ’అక్బర్ని పకపకా నవ్వించే ‘బీర్బల్ గారు’ ... అమాయకుల్ని మోసం చేసే ‘బంగారు కంకణం పులి’‘కరటక దమనకులు’ ... ‘మర్యాద రామన్న’లు ... ‘హారీ పాటర్’లూ ‘సూపర్ మేన్’ సిరీస్లూ...బుక్ఫెయిర్ నిండా బాలల లోకమే... ఎన్నో కొత్త కొత్త పుస్తకాలు వారిని అక్కడకు తీసుకెళ్లండి...వాళ్ల లోకాలను సొంతం చేసుకోనివ్వండి...‘నువ్వు ఏ దిక్కయినా వెళ్లు... ఒక్క ఉత్తర దిక్కు తప్ప’ అంటుంది పూటకూళ్ల అవ్వ రాకుమారుడితో పిల్లల కథల్లో. రాకుమారుడు పట్టుబట్టి ఉత్తర దిక్కు వైపే వెళతాడు. ప్రమాదాలను ఎదుర్కొంటాడు. అపాయాలను దాటుతాడు. శాపాలతో బంధించబడిన వారిని విముక్తం చేస్తాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న రాజ్యానికి రాజవుతాడు. అందరూ నడిచే దారుల్లో నడవకుండా కొత్త దారుల్లో ధైర్యంగా వెళ్లమని పిల్లలకు చె΄్తాయి కథలు. ప్రస్తుతం జరుగుతున్న ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’లో అలాంటి ధైర్యాన్ని నూరి పోసే అనేక పుస్తకాలుంటాయి. వాటిని వారికి ఇవ్వండి. అక్కడకు తీసుకెళ్లండి.‘ఈసప్’ అనే పెద్దాయన కనీసం రెండు వేల ఏళ్ల క్రితం కొన్ని కథలు చెప్పి మనుషుల్ని సంస్కరించాడు. ‘బంగారు గొడ్డలి’ కథ అతడు చెప్పిందే. కట్టెలు కొట్టేవాడు తన ఇనుప గొడ్డలి నదిలో పారేసుకుంటే నదీ దేవత వెండి గొడ్డలి తీసుకు వస్తుంది... తనది కాదంటాడు... బంగారు గొడ్డలి తీసుకు వస్తుంది... తనది కాదంటాడు... చివరకు ఇనుప గొడ్డలే తీసుకుంటాడు... నదీ దేవత సంతోషించి మూడు గొడ్డళ్లనూ అతనికి బహూకరిస్తుంది. నిజాయితీతో ఉంటే మంచి ఫలితాలు ఎదురవుతాయి అని పిల్లలకు చె΄్తాయి కథలు. విలువలకు ప్రాముఖ్యం లేకుండా పోతున్న నేటి రోజుల్లో పెద్దలు వాటిని చెప్పకపోతే పోయారు... కనీసం పుస్తకాలైనా చెప్పనివ్వండి... పిల్లల్లో నిజాయితీ పాదుకునేలా చేయండి.ఇంట్లో దొంగలు పడితే వారి చేత బావి లోని నీళ్లన్నీ చేదించి పాదులకు పోయించుకున్నాడు తెలివైన తెనాలి రామలింగడు. ‘ఈ బిడ్డ నాదంటే నాది’ అని ఇద్దరు తల్లులు కొట్లాడుకుంటే వారిలో అసలు తల్లి ఎవరో యుక్తిగా కనిపెట్టాడు మర్యాద రామన్న. నమ్మించి కొంతమంది ఎలా గొంతు కోస్తారో అనడానికి ఉదాహరణగా నిలిచాడు ఆషాఢభూతి. వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్న పావురాలు అన్నీ కలిసి ఐకమత్యంతో వలతో పాటు ఎగిరి వెళ్లిపోయాయి. ఆకాశంలో కొంగలు మోసుకెళుతున్న తాబేలు నోటి తీటతో నోరు తెరిచి నేలన పడి ప్రాణం వదిలింది....ఇవన్నీ పిల్లలకు చెప్పే పాఠాలెన్నో. ఎన్నెన్నో. అందుకే వారికి మంచి స్కూలు, మంచి ట్రాన్స్పోర్టు, ట్యూషను ఎలా పెడతామో మంచి పిల్లల పుస్తకం కూడా అలాగే చేతికివ్వాలి. పిల్లలు నేర్చుకునే విధాలు వేయి. కాని వేయి విధాలుగా నేర్పగల ఒకే సాధనం పుస్తకం.గతంలో చందమామ, బాలమిత్ర, బుజ్జాయి, బొమ్మరిల్లు... పిల్లల కోసం ప్రచురితమయ్యేవి. వాటిలో కథలు, బొమ్మలు, విశేషాలు ఉండేవి. పిల్లలతోపాటు పెద్దలూ ఆసక్తిగా చదివేవారు. కాలం మారింది. పిల్లలు స్కూళ్లు, క్లాసులు, ట్యూషన్ల మధ్య హడావిడి పడుతుండటంతో మెల్లగా ఒక్కో పత్రికా మూతబడింది. ప్రస్తుతం పిల్లల కోసం నడుస్తున్న పత్రికలు అరుదుగా కనిపిస్తున్నాయి. ఈ లోటును తీర్చేందుకు కొందరు రచయితలు పిల్లల పుస్తకాలు రాస్తున్నారు. వాటికి ఆకర్షణీయమైన బొమ్మలు జోడించి ప్రచురిస్తున్నారు. చదవడం, రాయడం వచ్చిన కొందరు పిల్లలు తమ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కథలు, కవితలు రాసి పుస్తకాలు ప్రచురిస్తున్నారు. ఇప్పటికే ‘చిప్పగిరి కథలు’, ‘జక్కాపూర్ బడిపిల్లల కథలు’, ‘నల్లగొండ జిల్లా బడిపిల్లల కథలు’, ‘మా బడి పిల్లల కథలు’, ‘సిద్ధిపేట జిల్లా బడిపిల్లల కథలు’, ‘మన ఊరు–మన చెట్లు’ ‘వరంగల్ జిల్లా బడి పిల్లల కథలు’ వంటి పిల్లలు రాసిన కథలతో వచ్చిన పుస్తకాలు ఆదరణ పొందాయి. దీంతోపాటు చిట్టి పొట్టి పాటలు, బాల గేయాలు, కవితలు రాసి విద్యార్థులు ఉపాధ్యాయుల సాయంతో ప్రచురిస్తున్నారు. కొందరు ఇంగ్లీషులోనూ రాసి పుస్తకాలు తెస్తున్నారు. అవన్నీ బాలసాహిత్యానికి బలమైన చేర్పుగా మారాయి. తెలుగులో బాలసాహిత్యం ఏనాటి నుంచో ఉంది. పాల్కురికి సోమనాథుడు, పోతన వంటి ప్రాచీన కవుల రచనల్లో పిల్లల కోసం తేటతెనుగు మాటలు జాలువారాయి. అనంతర కాలంలో అలపర్తి వెంకటసుబ్బారావు, నార్ల చిరంజీవి, మిరియాల రామకృష్ణ, మహీధర నళినీమోహన్, న్యాయపతి రాఘవరావు, నారంశెట్టి ఉమామహేశ్వరరావు, దాసరి వెంకట రమణ, ఎం.హరికిషన్, చొక్కాపు వెంకటరమణ, భూపాల్, వాసాల నర్సయ్య, పత్తిపాక మోహన్, ఆకెళ్ల వెంకటసుబ్బలక్ష్మి తదితరులు బాలల కోసం అనేక పుస్తకాలు రాశారు. ప్రస్తుతం అనేకమంది రచయితలు బాలసాహిత్యకారులుగా గుర్తింపు పొందారు. రష్యన్ బాల సాహిత్యం కూడా తెలుగులో పునర్ముద్రణ అవుతోంది. అనిల్ బత్తుల ‘రష్యన్ జానపద కథలు’ పుస్తకం తీసుకొచ్చారు. ‘పిల్లల సినిమా కథలు’, ‘బాపు బొమ్మల పంచతంత్రం’ వంటి పుస్తకాలు పిల్లల కోసం తీసుకొచ్చారు. ప్రముఖ రచయిత్రి ముళ్లపూడి శ్రీదేవి రాసిన పిల్లల కథలు ప్రచురితం అయ్యాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుడు జానకీరామ్ ‘ఏడు రంగులవాన’ అనే బాలల కథల పుస్తకం రాయడంతోపాటు విద్యార్థుల చేత కథలు రాయించి, తన సంపాదకత్వంలో ‘ఊహలకు రెక్కలొస్తే’ అనే కథల పుస్తకం తీసుకొచ్చారు. పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి తానా, మంచి పుస్తకం 2025లో పోటీ నిర్వహించగా ‘చతుర్ముఖం’ (శాఖమూరి శ్రీనివాస్), ‘ఆలిబాబా అయిదుగురు స్నేహితులు’ (డా.ఎం.సుగుణరావు), ‘మనకు మనుషులు కావాలి’ (పాణ్యం దత్తశర్మ), ‘మునికిష్టడి మాణిక్యం’ (ఆర్.సి.కృష్ణ స్వామిరాజు), ‘జాను అనే నేను, నా స్నేహితురాళ్లు’(పేట యుగంధర్) పుస్తకాలు ఎంపికయ్యాయి. ఇటీవల రచయిత దొండపాటి కృష్ణ పిల్లలకోసం ‘వింత శాపం’ అనే చిన్ని పుస్తకం తీసుకొచ్చారు. ఇవి కాకుండా ఇంగ్లిష్ భాషలో ఎన్నో పుస్తకాలు పిల్లల కోసం ఉన్నాయి. ఆ నింగి నక్షత్రాలను నేలన ఉన్న తారలకు ఇవ్వండి. తెలుగు నేర్పించేందుకు కథలు చదివిస్తున్నారుఇంతకు ముందు తల్లిదండ్రులు ఇంగ్లిష్ పుస్తకాలు చదివించేందుకు ఆసక్తి చూపేవారు. ఇప్పుడు తెలుగు పిల్లలకు రావాలని తెలుగు పుస్తకాలు చదివిస్తున్నారు. ‘మంచి పుస్తకం’ సంస్థ పిల్లల కోసం ఎన్నో పుస్తకాలు ప్రచురిస్తోంది. పిల్లల ఏజ్ గ్రూప్ను బట్టి వారి కోసం ‘గ్రీన్ సిరీస్’, ‘బ్లూ సిరీస్’... ఇలా పుస్తకాలు ప్రచురిస్తున్నాం. మనకి తెలియాల్సిన విషయం ఏమిటంటే రెండూ రెండున్నర ఏళ్ల పిల్లలు కూడా పుస్తకాలకు ఆకర్షితులవుతారు. వారి కోసం బొమ్మల పుస్తకాలు ఉంటాయి. అప్పటి నుంచి అలవాటు చేయాలి. ‘మంచి పుస్తకం’ తరఫున ‘గిఫ్ట్ ఏ లైబ్రరీ’ కాన్సెప్ట్ ఉంది. మీరు చదివిన స్కూల్కు 10 వేల రూపాయల పుస్తకాలు బహూకరించాలనుకుంటే వాటిని డిస్కౌంట్లో 8500 లకే మేము అందిస్తాం. ఈ ఆలోచనకు మంచి స్పందన ఎదురవుతోంది. పిల్లలకు పుస్తకాలు కొని తెచ్చివ్వడం కన్నా వారిని పుస్తకాల షాపుకు తీసుకెళితే వారికి కలిగే ఉత్సాహం వేరు అని మా అనుభవం చె΄్తోంది. ఇక బుక్ఫెయిర్కు తీసుకెళితే వారు తూనీగలే అవుతారు.– పవిత్ర, మంచి పుస్తకం ఇన్చార్జ్రికార్డుల మోతచిన్న వయసులోనే ఎక్కువ రికార్డ్లు సృష్టించిన యువతిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది చండీగఢ్కు చెందిన జాన్వీ జిందాల్. ప్రీస్టైల్ స్కేటింగ్లో అద్భుతాలు సృష్టిస్తోంది. జాన్వీకి కోచ్ అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. తండ్రి సహాయంతో, యూట్యూబ్ వీడియోల ద్వారా స్కేటింగ్ నేర్చుకుంది.‘భాంగ్రా ఆన్ స్కేట్స్’ ‘యోగా ఆన్ స్కేట్స్’వంటివి సృష్టించి, భారతీయ సంస్కృతిని స్కేటింగ్తో మిళితం చేసింది. పదకొండు గిన్నిస్ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న జాన్వీ, మన దేశంలో అత్యధిక గిన్నిస్ వరల్డ్ రికార్డ్లను సాధించిన తొలి మహిళగా నిలిచింది. -
రన్వేపైనే తల‘రాతలు’
ఆకాశమంత చదువు చదివితే ఏం లాభం.. పొట్టకూటి కోసం నేలపై కూర్చుని పరీక్ష రాయక తప్పలేదు. డిగ్రీలు, పీజీలు చేతిలో ఉన్నా.. కనీసం హోంగార్డు ఉద్యోగమైనా దొరక్కపోతుందా.. అన్న నిరాశ నిండిన నిరీక్షణ అది. ఒడిశాలోని సంబల్పూర్లో డిసెంబర్ 16న కనిపించిన దృశ్యం, దేశంలో నిరుద్యోగ సమస్యకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. కేవలం 187 హోంగార్డు పోస్టుల భర్తీ కోసం ఏకంగా 8,000 మంది యువత కదిలివచ్చారు. దీనికి కనీస అర్హత కేవలం 5వ తరగతి ఉత్తీర్ణత. కానీ, వచ్చిన వారిలో ఎక్కువ శాతం మంది ఉన్నత విద్యావంతులే కావడం గమనార్హం. సాధారణ పరీక్ష కేంద్రాలు సరిపోకపోవడంతో, అధికారులు జమాదర్పాలి ఎయిర్స్ట్రిప్ (విమానాశ్రయం) రన్వేనే వేదికగా మార్చారు. నిరుద్యోగ యువత మండుతున్న ఎండలో, ఆకాశం కింద నేలపైనే కూర్చుని తమ భవిష్యత్తును వెతుక్కుంటూ పరీక్ష రాశారు. ఈ నియామకాలు కేవలం ఒప్పంద ప్రాతిపదికన జరుగుతున్నాయి. అయినప్పటికీ, కనీస ఉపాధి కరువైన తరుణంలో యువత వీటిపైనే ఆశలు పెట్టుకుంది. దాదాపు 10,000 మంది దరఖాస్తు చేసుకోగా, 8,000 మంది హాజరయ్యారు. ఇంతమంది కోసం 20 పాఠశాలల్లో ఏర్పాట్లు చేయాల్సి వచ్చేది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
2 నిమిషాల వినోదం
మైక్రో డ్రామా.. భారత్లో ఇటీవలి కాలంలో ‘తెర’పైకి వచ్చిన నూతన వినోద సాధనం. మొబైల్ ఫోన్లో వీక్షించేందుకు వీలుగా రూపొందుతున్న ఈ 1–2 నిమిషాల చిన్న వీడియోలు ఇప్పుడు మన దేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి. కామెడీ, క్రైమ్, రొమాన్స్, రివెంజ్, ఫాంటసీ.. జానర్ ఏదైనా రీల్స్, షార్ట్స్ స్థానాన్ని మైక్రో డ్రామాలు భర్తీ చేస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్.. వేదిక ఏదైనా ప్రపంచవ్యాప్తంగా యూజర్ల వీక్షణ తీరుతెన్నులు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. మొబైల్ తెరపై గంటల కొద్దీ ఒకే వీడియోను చూడటం పాత కాలం. జెన్ ఆల్ఫా, జెన్–జీ, మిలీనియల్స్, జెన్–ఎక్స్.. తరం ఏదైనా స్క్రీన్ను వేగంగా స్క్రోల్ చేస్తున్నారు. అంటే స్క్రీన్పై ఉన్న వీడియోను తక్కువ సమయంలోనే స్క్రోల్ చేసి మరో వీడియోను చూస్తున్నారు. ఇటువంటి వారి కోసమే రీల్స్, షార్ట్స్ మాదిరిగా మైక్రోడ్రామా వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. చైనాలో మొదలైన మైక్రో డ్రామా ఫీవర్ మన దేశానికీ పాకింది. భారత్లో మైక్రో డ్రామా వ్యూయర్స్ సంఖ్య 10 కోట్లు ఉన్నట్టు అంచనా. ఆర్మాక్స్ మీడియా ప్రకారం వీరిలో 55 శాతానికిపైగా వీక్షకులు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు కావడం గమనార్హం. దిగ్గజ సంస్థలూ ఎంట్రీ..: మెలో డ్రామా, కొరియన్ డ్రామాలు చాలాకాలంగా భారతీయుల వినోదంలో భాగమయ్యాయి. ఇప్పుడు మైక్రో డ్రామాల వంతు వచ్చింది. సిరీస్లోని అన్ని ఎపిసోడ్స్నూ వీక్షించేంతగా ఈ వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. ఇంకేముంది డబ్బులు చెల్లించి మరీ జనం ఆస్వాదిస్తున్నారు. మైక్రోడ్రామాలను ప్రసారం చేసేందుకు మన దేశంలో ప్రత్యేక యాప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయంటే వీటికి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. పైగా అమెజాన్, జీ గ్రూప్ వంటి దిగ్గజాలూ ఈ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చాయి. మైక్రో డ్రామాల చిత్రీకరణకు తక్కువ వ్యయం అవుతుంది. వీటితో కంటెంట్ క్రియేటర్లకు ఆదాయాలు మెరుగ్గా ఉంటాయి. బాక్సాఫీస్ను దాటి..: అతి తక్కువ నిడివితో, సీరియళ్ల రూపంలో వీడియో కథనాలు కోవిడ్–19 మహమ్మారి సమయంలో చైనాలో డ్వాంజూగా ఉద్భవించాయి. ప్రస్తుతం ఇవి చైనా బాక్సాఫీస్ కలెక్షన్లను దాటడం ఆశ్చర్యం కలిగించే అంశం. చైనాలో 66 కోట్ల మంది ఈ మైక్రో వీడియోలను వీక్షిస్తున్నట్టు సమాచారం. ఈ విభాగం ఆ దేశ వినోద పరిశ్రమకు ఏటా 7 బిలియన్ డాలర్ల కాసులు కురిపిస్తోంది. ఇంటర్నెట్ వినోదం.. 31.3 కోట్లు కేవలం ఇంటర్నెట్ ఆధారిత వినోదం ఆస్వాదిస్తున్న వీక్షకుల సంఖ్య మన దేశంలో 31.3 కోట్లు ఉన్నట్టు అంచనా. వీరిలో నాలుగింట మూడు వంతులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కావడం విశేషం. కేబుల్, శాటిలైట్, ఓవర్ ద ఎయిర్ ద్వారా ప్రసారమయ్యే సంప్రదాయ టీవీ వీక్షణానికి వీరు దూరం. గత ఏడాదితో పోలిస్తే డిజిటల్ ఆడియెన్స్ సంఖ్య 30 శాతం పెరిగిందని కాంటార్ తన మీడియా కాంపాస్ నివేదికలో వెల్లడించింది. అవీ ఇవీ...» చైనా తరువాత మైక్రో డ్రామా వీక్షకుల సంఖ్యలో అమెరికా, దక్షిణ కొరియా, ఇండోనేసియా, జపాన్ పోటీపడుతున్నాయి. ఆరో స్థానంలో భారత్ నిలిచింది. » 2030 నాటికి మైక్రో డ్రామా పరిశ్రమ వార్షిక విలువ భారత్లో 5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. » 18–35 ఏళ్ల వయసున్నవారు అత్యధికంగా మైక్రో డ్రామాలను వీక్షిస్తున్నట్లు జీ గ్రూప్ కంపెనీ బులెటిన్ చెబుతోంది. » సంప్రదాయ ఓటీటీ షోలతో పోలిస్తే మైక్రోడ్రామాల రూపకల్పనకు సమయం 80% ఆదా అవుతుందన్నది నిపుణుల మాట. » భారత్లో 70 కోట్ల మంది చేతుల్లో స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. రోజుకు సగటున 5 నుంచి 7.4 గంటలు మొబైల్లో గడుపుతున్నారు. సింహభాగం వాటా వీడియోలదే. » ఈక్విటీ పరిశోధన, బ్రోకింగ్ సంస్థ బెర్న్స్టీన్ రీసెర్చ్ ప్రకారం.. భారత్లో ద్వితీయ శ్రేణి నగరాల్లో కస్టమర్లు నెలకు 35–40 జీబీ ఇంటర్నెట్ డేటాను ఉపయోగిస్తున్నారు. ఇది మెట్రో నగరాల్లోని వినియోగదారుల కంటే 30 శాతం ఎక్కువ. 86% భారతీయులు మైక్రోడ్రామాలతోసహా ఓటీటీలో కంటెంట్ కోసం మొబైల్ డేటా వాడుతున్నారు. -
'భారత్' వన్యమృగాల గమ్యస్థానం
ప్రపంచవ్యాప్తంగా వేలాది వన్యప్రాణులు ఇటీవలి సంవత్సరాలలో ఇండియాలోని వివిధ జంతు ప్రదర్శనశాలలకు చేరుకున్నాయి. ఆ జాబితాలో పులులు, సింహాల వంటి క్రూరమృగాలే కాకుండా పక్షులు, కోతి జాతుల వంటివీ ఉన్నాయి. 2023, 2024లలో ప్రపంచంలో అత్యధిక వన్యమృగాలు దిగుమతి చేసుకున్న దేశం మనదే. – సాక్షి, స్పెషల్ డెస్క్2024లో ప్రపంచవ్యాప్తంగా 2,922 వన్యమృగాలు వివిధ దేశాలలోని ‘జూ’లకు చేరుకున్నాయి. వాటిలో 1,640 ఇండియా దిగుమతి చేసుకున్నవే. ఆ ఏడాది, అంతకుముందు ఏడాది కూడా (మొత్తం 4,051 వన్యమృగాలు) ఇండియానే అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. 2022లో రెండో స్థానంలో, 2021లో నాలుగో స్థానంలో ఉంది. వన్యమృగాల దిగుమతుల్లో ప్రముఖ దేశాలుగా ర్యాంకులు పొందిన సింగపూర్, యూఏఈల నుంచి కూడా ఇండియా దిగుమతి చేసుకోవటం విశేషం. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేజర్డ్ స్పీషీస్ (సి.ఐ.టి.ఇ.ఎస్.) నివేదిక ప్రకారం 1978 నుంచి ఇండియాలోని ‘జూ’లకు చేరుకున్న వన్యప్రాణులలో 90 శాతం గత నాలుగేళ్లలో దిగుమతి అయినవే. దక్షిణాఫ్రికా నుంచే అధికం1978 నుంచి ఇండియా దిగుమతి చేసుకుంటున్న వన్యమృగాలలో దాదాపు 30 శాతం దక్షిణాఫ్రికాకు చెందినవే. ఐరోపా దేశాల నుంచీ దిగుమతులు అధికంగానే ఉన్నాయి. పులులకే డిమాండ్ ఎక్కువప్రపంచంలో అత్యధిక పులులు ఉన్న దేశం మనదే. గత 46 ఏళ్లలో మనదేశం 314 పులులను దిగుమతి చేసుకుంది. తర్వాతి స్థానాలలో సింహాలు, చీతాలు ఉన్నాయి. -
ఊబకాయం తగ్గించే'లా'..
ఊబకాయం.. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికిపైగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. ప్రాసెస్డ్, ఫాస్ట్ ఫుడ్, అధిక కేలరీలతో కూడిన స్నాక్స్, చక్కెర పానీయాల వినియోగం పెరగడం, శారీరక శ్రమ తగ్గడం ఊబకాయానికి ప్రధాన కారణం. శారీరక శ్రమతోపాటు ఆహారపు అలవాట్లు మార్చుకోవడమే దీనికి పరిష్కారం. అయితే ఊబకాయంపై పోరు కోసం జపాన్లో ఓ చట్టం ఉందని మీకు తెలుసా? – సాక్షి, స్పెషల్ డెస్క్ఒక అడుగు ముందుకేసిన జపాన్ బరువు తగ్గడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలకే పరిమితం అవుతున్నాయి. అయితే జపాన్ ఒక అడుగు ముందుకేసి 2008లో ‘మెటబాలిక్ సిండ్రోమ్ కౌంటర్ మెజర్స్ ప్రమోషన్ లా’అమలులోకి తెచ్చింది. దీనిని సింపుల్గా మెటబో చట్టం అని పిలుస్తారు. పురుషులకు నడుము చుట్టుకొలత 85 సెంటీమీటర్లు (సుమారు 33.5 అంగుళాలు) మించి ఉండటం హెచ్చరిక సంకేతంగా పరిగణిస్తారు. మహిళలకు ఈ పరిమితి 90 సెంటీమీటర్లు (సుమారు 35.4 అంగుళాలు). ఒబెసిటీ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండేలా ఇది పౌరులు పాటించే సామాజిక ఒప్పందం లాంటిది. జపాన్ ప్రవేశపెట్టిన ఈ అసాధారణ చట్టం మరోసారి సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ఆరోగ్యకరమైన జీవనశైలి.. సమస్య తీవ్రం కాకముందే ఆరోగ్య ప్రమాదాలను గుర్తించడానికి మెటబో చట్టం ప్రకారం 40 నుంచి 74 సంవత్సరాల మధ్య వయస్సు గల పౌరులందరికీ ఏటా తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేపడతారు. ఈ తనిఖీలో కీలకమైన అంశం ఏమంటే వ్యక్తుల నడుము చుట్టుకొలతను కొలుస్తారు. జీవక్రియ రుగ్మతలతో ముడిపడి ఉన్న హానికరమైన విసెరల్ కొవ్వు స్థాయిని అంచనా వేయడానికి ఇది సహాయపడుతుంది. పరిమితి దాటితే స్థానిక ప్రభుత్వ విభాగాలు, కంపెనీలు రంగంలోకి దిగి ఉచిత ఆరోగ్య సాయం చేస్తాయి. విసెరల్ ఫ్యాట్ అంటే కాలేయం, పేగులు, క్లోమం వంటి అంతర్గత అవయవాల చుట్టూ నిల్వ అయిన కొవ్వు. సమస్య కొనితెచ్చుకొని చికిత్సలు చేయించుకునే బదులు.. అనారోగ్యానికి మూలకారణాన్ని లక్ష్యంగా చేసుకొని మొదటి నుంచీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలని జపనీయులు నమ్ముతారు. శతాధిక వృద్ధులు అత్యధికంగా ఉన్న దేశమూ ఇదే కావడం విశేషం. సమస్యలకు మూలం.. స్థూలకాయం అనేది అనేక దేశాలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్, డైజెస్టివ్, కిడ్నీ డిసీజెస్ ప్రకారం..అధిక రక్తపోటు, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్, టైప్–2 డయాబెటిస్, వివిధ కేన్సర్లు, మూత్రపిండాల సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందుల వంటి ఆరోగ్య ప్రమాదాలకు స్థూలకాయం కారణమవుతోంది. అవగాహన పెరిగింది.. మెటబో చట్టాన్ని నేటికీ పౌరులు అనుసరిస్తున్నారు. ఏటా 5.5 కోట్ల మందికి పరీక్షలు జరుపుతున్నారు. ‘పెద్దల్లో ఊబకాయం రేట్లు స్థిరమైన ధోరణిని చూపిస్తున్నాయి. ప్రజలు తమ ఆరోగ్యం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తున్నారు ’అని జపాన్ అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే జపాన్లో ఊబకాయం సమస్య నియంత్రణలో ఉందని తెలుస్తోంది. ఈ చట్టంపై తాజాగా సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. చాలామంది ఈ చట్టాన్ని భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని చేసిన ఆరోగ్య చర్యగా ప్రశంసిస్తుండగా.. మరికొందరు సుమో రెజ్లర్ల వంటి వారికి ఇది ఎలా వర్తిస్తుందని ప్రశ్నిస్తున్నారు. పరిమితి దాటితే.. » నిర్దేశిత పరిమితి మించి నడుము చుట్టుకొలత ఉంటే జరిమానా లేదా శిక్ష విధించరు. » ప్రమాదం పొంచి ఉన్న వారికి ప్రభుత్వ మద్దతుతో ఉచిత ఆరోగ్య సేవలు అందిస్తారు. » ఇందుకు కంపెనీలూ తమ ఉద్యోగులకు సహాయం చేస్తాయి... తీసుకోవాల్సిన పోషకాహారంపై నిపుణులతో కౌన్సెలింగ్ ఉంటుంది. » వ్యాయామాలు, ఆరోగ్యకర జీవనశైలికి ఫాలో–అప్ కార్యక్రమాలు చేపడుతున్నారు. » జిమ్నాస్టిక్స్, క్రీడా పోటీలను కంపెనీలు నిర్వహిస్తున్నాయి. » మూడు నెలల తర్వాత పురోగతిని సమీక్షిస్తారు. » ఆరు నెలల తర్వాత అవసరమైతే మరోసారి ఆరోగ్య అవగాహన కల్పిస్తారు. బాధ్యులు ఎవరంటే.. » జపాన్ ప్రభుత్వ లక్ష్యం పౌరులను శిక్షించడం కాదు. జీవనశైలి సంబంధిత వ్యాధులు తీవ్రం కాకముందే వాటిని నివారించడం. » దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడం, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యం. » ఉద్యోగులు లేదా నివాసితుల నడుము చుట్టుకొలతలు తగ్గించే బాధ్యత కంపెనీలు, స్థానిక ప్రభుత్వ శాఖలదే. » » ఈ లక్ష్యాలను చేరుకోలేకపోతే కంపెనీలు లేదా స్థానిక ప్రభుత్వ శాఖలు భారీ జరిమానా చెల్లించాల్సిందే. » ఈ మొత్తాలను ఆరోగ్య సంరక్షణ నిధులకు మళ్లిస్తారు. -
ఊరు మూరెడు.. పురుళ్లు బారెడు
అది ఒక చిన్న గ్రామం.. జనాభా కేవలం 1500. కానీ, మూడు నెలలుగా అక్కడ పుట్టిన పిల్లల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాలా 27,397..! వినడానికి విడ్డూరంగా ఉన్నా, ఇది మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో వెలుగుచూసిన ఒక భారీ కుంభకోణం. ఈ లెక్కలు చూసి సాక్షాత్తూ అధికారులే కంగుతిన్నారు. ఈ ’జనన ధ్రువపత్రాల’ మాయాజాలం వెనుక ఉన్న అసలు కథేంటి?సర్వేలో సైబర్ నేరం బట్టబయలు యావత్మాల్ జిల్లా ఆర్నీ తహసీల్లోని షెందురుసాని గ్రామ పంచాయతీలో.. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి నవంబర్ నెలల మధ్య జనన, మరణ ధ్రువపత్రాల తనిఖీ కోసం అధికారులు ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అప్పుడే అసలు బండారం బయటపడింది. జనాభా 1500 దాటని గ్రామంలో, వేల సంఖ్యలో పుట్టినట్లు నమోదైన గణాంకాలను చూసి ఉన్నతాధికారులకు దిమ్మ తిరిగింది. ఇది కేవలం పొరపాటు కాదు.. ఒక వ్యవస్థీకృత సైబర్ నేరమని అర్థమైంది.కుంభకోణంలోని ప్రధానాంశాలు అన్నీ బయటి పేర్లే: ఈ 27,397 మందిలో 99 శాతం పేర్లు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవని బీజేపీ నేత కిరిత్ సోమయ్య వెల్లడించారు. ఐడీ దురి్వనియోగం: గ్రామం పరిధితో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల పేర్లతో జనన ధ్రువపత్రాలు జారీ అయ్యాయి. భారీ నెట్వర్క్: ప్రభుత్వ పథకాల లబ్ధి కోసమో లేదా నకిలీ గుర్తింపు కార్డుల సృష్టి కోసమో ఈ భారీ స్కామ్ జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.దర్యాప్తు ముమ్మరం ప్రస్తుతం భారతీయ న్యాయ సంహిత, ఐటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఒక చిన్న గ్రామం కేంద్రంగా జరిగిన ఈ భారీ సైబర్ నేరం వెనుక ఎవరున్నారు? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్ర కోణం ఏంటి? అనే దిశగా దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఎంత వేగంగా పెరుగుతుందో, దాన్ని అడ్డు పెట్టుకుని జరిగే మోసాలు కూడా అంతే విస్మయం కలిగిస్తున్నాయి. షెందురుసాని గ్రామంలో వెలుగు చూసిన ఈ ’జననాల పెంపు’ కుంభకోణం ఇప్పుడు మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది.ముంబై నుంచి నియంత్రణప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. గ్రామ పంచాయతీకి చెందిన సీఆర్ఎస్ (సివిల్ రిజి్రస్టేషన్ సిస్టమ్) లాగిన్ ఐడీని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ ఐడీని ముంబై నుంచి నియంత్రిస్తున్నట్లు గుర్తించారు. గ్రామానికి సంబంధం లేని వ్యక్తుల పేర్లతో ఈ ధ్రువ పత్రాలను సృష్టించారు.రంగంలోకి ఉన్నతాధికారులుఈ ఘటనపై జిల్లా పరిషత్ సీఈవో మందార్ పట్కీ ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా ఆరోగ్య అధికారి ఫిర్యాదుతో యావత్మాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో మాట్లాడినట్లు, ఈ నకిలీ రిజిస్ట్రేషన్లన్నింటినీ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసినట్లు బీజేపీ నేత కిరిత్ సోమయ్య తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పుస్తకాలు ఎందుకు చదవాలి?
38వ హైదరాబాద్ బుక్ఫెయిర్ డిసెంబర్ 19 నుంచి 29 వరకు 11 రోజుల పాటు ఇందిరా పార్కు వద్ద ఉన్న ఎన్టీఆర్ స్టేడియం (కళాభారతి)లో జరగనుంది. రోజూ మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9వరకు ప్రవేశవేళలు. విద్యార్థులకు ఉచిత ప్రవేశం. ఈసారి మొత్తం 365 స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. దాదాపు 12 లక్షల మంది సందర్శిస్తారని అంచనా. పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చర్చలు చోటు చేసుకుంటాయి.‘పుస్తకం చదివితే వేయి జీవితాలు జీవించవచ్చు. చదవకుంటే ఒక్కటే’...అన్నాడో మహానుభావుడు. పుస్తకం చదవడమంటే మనకోమెదడు ఉందని గుర్తు చేసుకోవడం. పుస్తకం చదవడమంటే మనకో కుతూహలం ఉందని తెలుసుకోవడం. ఫో¯Œ ... మనకు అక్కర్లేని వినోదాలను ఇస్తోంది. పుస్తకం... కచ్చితమైన దిశను సూచిస్తుంది. దిశాబద్ధులై ఉండేందుకు బుక్ఫెయిర్ బాట పట్టండి.‘పుస్తకాలు అపరిచిత మిత్రులకు స్వాగత ద్వారాలు’.మనిషికి ఏం కావాలి? తనను తాను వ్యక్తపరుచుకోవడం కావాలి. అందుకే మాట్లాడాడు. పాడాడు. ఆడాడు. బొమ్మలు గీశాడు. రాశాడు. వాటి ద్వారా తనేమిటో చె΄్పాడు. ఇదే మనిషికి సాటి మనిషి ఎలా వ్యక్తమవుతాడో కూడా కావాలి. అతని జీవితం ఎలా ఉంది... ఆలోచనలు ఏమిటి... సమస్యలు ఏమిటి... వాటిని ఎలా ఎదుర్కొన్నాడు.... అందుకే ఆట, పాట, బొమ్మ, కథల్లో సాటి మనిషి గురించి తెలుసుకోవడానికి ఉబలాట పడ్డాడు.ఈ ఇచ్చి పుచ్చుకోవడాలు సజీవంగా ఉన్నంత కాలం మనిషి సజీవంగా ఉన్నట్టే లెక్క. లేకుంటే పాకుడు నీళ్లతో సమానం. అందుకే పుస్తకాలు చదవాలి. తనను తాను తెలుసుకునేందుకు, ఇతరుల గురించి తెలుసుకునేందుకూ. ఈ విశాల సృష్టిలో మనుషులంతా ఒక్కలాంటి వాళ్లే... రకరకాల పద్ధతుల్లో జీవిస్తూ ఒకేరకమైన ఉద్వేగాలను అనుభవిస్తుంటారని తెలుసుకుని... అందరి నుంచి ఉమ్మడి శక్తిని పొంది వ్యక్తిగత జీవితాన్ని ఒడ్డున చేర్చుకునేందుకు పుస్తకాలు చదవాలి.పెద్దబాలశిక్షతో మొదలుపుస్తకం ప్రాథమిక కర్తవ్యం జ్ఞానాన్ని ఇవ్వడమే. అందుకే పుస్తకం విద్యాసాధనం అయ్యింది. అయితే విద్యతో మనిషి ఆగడు. కడుపు నిండిన మనిషి కళ కోసం చూసినట్టే విద్య నేర్చిన మనిషి వికాసం వైపు చూశాడు. వికాసానికి పుస్తకం దారి చూపింది. భాష, సంస్కృతి, సాహిత్యం, చరిత్ర... ఇవన్నీ పుస్తకంలో నిక్షిప్తమయ్యి తరం నుంచి తరానికి అందాయి. అయితే వికాసంతో కూడా మనిషి ఆగడు. వినోదం కావాలి, ఆహ్లాదం కావాలి, అనుభూతి కావాలి, ఉద్వేగం కావాలి, కల్పిత గాథలు... పుక్కిటి పురాణాలు కావాలి... ఫ్యాంటసీ ప్రపంచాలు కావాలి... అవన్నీ పుస్తకమే ఇచ్చింది. పుస్తకం ఇచ్చేలా చేసుకున్నాడు. పుస్తకాలను నిచ్చెనమెట్లుగా చేసుకుని మనిషి దినదిన ప్రవర్థమానమయ్యాడు. అయితే పుస్తకాన్ని వదిలిపెట్టిన, నిర్లక్ష్యం చేసిన జాతి చీకటిలో ప్రయాణిస్తుంది. కొనసాగింపు ముఖ్యం. అందుకే యూరోపియన్ దేశాలలో పుస్తకాన్ని వదిలిపెట్టడం అనేది అక్కడివాళ్లు కల్లో కూడా ఊహించరు. మనవాళ్లు పుస్తకం విలువ కనిపెట్టారు కాబట్టి ప్రతి ఇంట్లో కనీసం పెద బాలశిక్ష అయినా ఉండాలని తలిచారు. నేడు మన ఇళ్లల్లో పెద బాలశిక్షకు బదులు ఫోన్లు చేరాయి.జీవితాన్ని మార్చే పుస్తకాలుపుస్తకాలు జీవితాలను మార్చేస్తాయి. ఒక్క పుస్తకం చదివి లక్ష్యాన్ని ఏర్పరచుకున్నవాళ్లు, ఒక్క పుస్తకం చదివి జీవితాన్ని మార్చుకున్నవారు, ఒక్కపుస్తకం చదివి శాసనంగా మలుచుకున్నవారు ఉన్నారు. ‘విద్య లేని వాడు వింత పశువు’ అన్నారు పెద్దలు గానీ ‘పుస్తకం చదవని వాడే వింత పశువు’ అనుకోక తప్పదు. ‘తిని తొంగుంటే మనిషికీ గొడ్డుకీ తేడా ఏం ఉంటుంది’ అన్నట్టుగా పుస్తకం చదవకపోతే వివేచన, వివేకం ఎలా జాగృతమవుతాయి? ఏది న్యాయమో ఏది అన్యాయమో ఎలా తెలుస్తుంది? మనిషిగా పుట్టినందుకు మంచివైపు నిలబడాలన్న బాధ్యత ఎక్కడినుంచి వస్తుంది?పుస్తకం చిరంజీవిపుస్తకాన్ని చంపే మారణాయుధాలు ఎన్నో వచ్చాయి. సినిమాలు, టీవీలు, వీడియో కేసెట్లు, వీడియో గేమ్స్, ఓటీటీలు, రీల్సు... ఎన్నో. కాని పుస్తకం చిరంజీవిగానే ఉంది. పుస్తకం వేయి పుటలతో లక్ష కన్నులతో లోకాన్ని చూపుతుంది. సినిమా ఆ పని చేయదు. పుస్తకం ఒక గాథను వాస్తవ పరిథిలో చూపి కొంత ఊహకు వదిలిపెడుతుంది. అది వీడియో చేయదు. పుస్తకం ప్రశ్నను లేవనెత్తుతుంది. వెంటాడుతుంది. ప్రశ్న లేని మనిషి, ప్రశ్నించని మనిషి శిథిలమయ్యి మానసిక సంపద కోల్పోతాడు. అందుకే ‘మనీప్లాంట్ సరే. పుస్తకం ఉంచుకోవడం కూడా సంపదతో సమానమే’ అని గ్రహించాలి. మనుషులకు పండగ ఉన్నట్టు పుస్తకాలకు కూడా పండగ ఉంటుంది. ప్రతి సంవత్సరం ‘హైదరాబాద్ బుక్ఫెయిర్’లో పుస్తకాలన్నీ కూడబలుక్కుని ఒకచోటకు చేరుతాయి. వాటిని చూడటానికి వెళ్లాలి. చేతుల్లోకి తీసుకోవాలి. వాటితో స్నేహం చేయాలి. ఇంటికి పిల్చుకోవాలి. పుస్తకాలు ఇంటికి వచ్చాక దీపాలుగా మారడం మీరే గమనిస్తారు. ఆ కాంతులు ఇంటిని వెలిగించడం చూస్తారు. ఆ కాంతుల్లో వర్థిల్లడం ఎంతటి భాగ్యమో తప్పక తెలుసుకుంటారు.అందరికీ తల ఊపడం మానేలా చేస్తాయిపుస్తకాలు ఎందుకు చదవాలి? నా చిన్నప్పుడు నన్నెవరన్నా ఈ ప్రశ్న అడిగి ఉంటే ఆశ్చర్యపోయి ఉండేవాడిని. ఎందుకంటే పుస్తకాలు చదవడం వల్లనే నాకు లోకం తెలిసింది. ప్రపంచపు పోకడ తెలిసింది. మానవజాతి గతం గురించీ, వర్తమానం గురించీ తెలిసింది. మానవుడి భవిష్యత్తు ఎలా ఉండాలన్న దాని మీద కవులూ, రచయితలూ, తత్త్వవేత్తలూ శాస్త్రవేత్తలూ ఎటువంటి కలలుగన్నారో తెలిసింది. నేను పుట్టి పెరిగిన మారుమూల కొండ కింద పల్లెలో ఆ రోజుల్లో నాకు దొరికిన ఆ కొద్దిపాటి పుస్తకాలు ఆ రోజు దొరకకపోయి ఉంటే నా జీవితం గురించి నాకు ఎప్పటికీ అర్థమయ్యే దారి దొరికి ఉండేది కాదు. ఇప్పుడు ఇన్ని మాధ్యమాలు మన అరచేతుల్లోకి అందుబాటుకొచ్చాక పుస్తకాలు ఎందుకు చదవాలి అన్న ప్రశ్న తలెత్తుతున్నదేమో! ఇన్ని మాధ్యమాలున్నా, పుస్తకాలు చదవకపోతే మనం ఎప్పటికీ పక్కవాడి అభి్రపాయాలకే తలూపుతూ బతుకుతుంటాం. కాబట్టి ఈ మాధ్యమాలన్నింటిలోనూ అత్యంత విశ్వసనీయమైన మాధ్యమం పుస్తకాలు మాత్రమే.– వాడ్రేవు చినవీరభద్రుడు,సుప్రసిద్ధ రచయితపుస్తకాలు అందరినీ మనవాళ్లను చేస్తాయిపుస్తకాలు అనేక మానవ జీవిత అనుభవాల సారాన్ని నింపుకున్న పాత్రలు. అమూల్యమైన జ్ఞానాన్ని పొందడానికి మన కళ్లను తెరిపించే వెలుతురు కిరణాలు. బలహీనులకు బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చే టానిక్లు. ప్రపంచాన్నంతా మనకు పరిచయం చేస్తాయి. మన జీవితాలను అర్థం చేసుకోవడం ఎలాగో నేర్పుతాయి. పుస్తకాలు నవ్విస్తాయి, ఏడిపిస్తాయి, దయ, జాలి, కరుణ, ప్రేమ, సహోదర భావనలను మన హృదయాల్లో నింపుతాయి. వాట్సప్, యూట్యూబ్ల వంటివి మనల్ని మనం పరాయివారిగా చేస్తే పుస్తకాలు అందరినీ మనవాళ్ళుగా చేసుకోవటం నేర్పుతాయి. పుస్తకాలు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కాదు. అసలైన వివేకం. పుస్తక స్పర్శ కోసం, ప్రపంచాన్ని ఆలింగనం చేసుకోవడం కోసం పుస్తక ప్రదర్శనలకు వెళ్ళాలి. మనం స్వయంగా ఎంచుకుని స్వంతం చేసుకొన్న పుస్తక పఠన అనుభూతికి సాటివచ్చేది లేదు. పుస్తకం కోసం తహతహలాడటమంత అందమైన అనుభూతి మరొకటి లేదు.– ఓల్గా, సుప్రసిద్ధ రచయిత్రి -
నిఘా నీడలో నిజాల వేట
దండకారణ్యం నుంచి సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కల్లోలిత ప్రాంతమైన దండకారణ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను బయటి ప్రపంచానికి చెప్పేందుకు జర్నలిస్టులు ఒంటరిగా వెళ్లే పరిస్థితులు లేవు. ముఖ్యంగా తెలుగు మీడియా జర్నలిస్టులైతే జట్టుగా వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. హిడ్మా మరణం తర్వాత సర్వత్రా ఆసక్తి నెలకొన్నందున.. అక్కడి అంశాలను బయటి ప్రపంచానికి తెలియజేసేందుకు తెలుగు జర్నలిస్టుల బృందం ఇటీవల వెళ్లింది. తెలంగాణ సరిహద్దు నుంచి పువ్వర్తికి వెళ్లాలంటే కనీసం 11 సీఆర్పీఎఫ్ క్యాంపులను దాటాల్సిందే. ఈక్రమాన మీడియా బృందం ఓ క్యాంపు దాటుతుండగా సాయుధ జవాన్లు ఆపేశారు. పేరు, సంస్థ, ఫోన్ నంబర్, ఇన్టైం వివరాలతో పాటు ఫొటోలు తీసుకుని పంపించారు. మీడియా బృందం పువ్వర్తికి చేరుకునేసరికి తెలుగు మాట్లాడే ఓ సీఆర్పీఎఫ్ జవాన్ అక్కడికి వచ్చాడు. ‘ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. ఇక్కడ పరిస్థితులు బాగాలేవు. మీకేమైనా ఇబ్బందులు వస్తాయి. అందుకే మీ బాగోగులు చూడటానికి వచ్చాను’ అంటూ తనను పరిచయం చేసుకున్నాడు. అక్కడ మీడియా బాధ్యులు ఎవరెవరిని కలుస్తున్నారు, ఎలాంటి ఇంటర్వ్యూలు చేస్తున్నారనే విషయాలను సదరు జవాన్ ఎప్పటికప్పుడు తన ఫోన్లో బంధించాడు.అన్నల అడవిలో..హిడ్మా తల్లి పువ్వర్తి నుంచి ఐదు కిలోమీటర్ల దూరాన ఓయ్పారా అనే గ్రామంలో ఉందని తెలియడంతో.. మీడియా బృందం అక్కడికి పయనమైంది. గ్రామం నుంచి కొద్ది దూరం వెళ్లాక వాగు ఎదురై.. అక్కడితో ఇటీవల సర్కార్ వేసిన రోడ్డు ముగిసింది. జర్నలిస్టులు వాగు దాటుకుని ముందుకు వెళ్తుంటే, జవాన్ అక్కడే ఆగిపోయాడు.‘ఇక్కడి నుంచి నేను ముందుకు రాలేను. మీరు వెళ్లి ఇంటర్వ్యూ తీసుకుని త్వరగా వచ్చేయండి’ అని చెప్పాడు. జర్నలిస్టుల బృందం ఓయ్పారాకు చేరేసరికి సీఆర్పీఎఫ్ జవాన్ నుంచి మిస్డ్ కాల్స్ ఉన్నాయి. తిరిగి ఫోన్ చేస్తే ‘మిమ్నల్ని ఫాలో అవుతూ అడవిలోకి వచ్చాను, కానీ ఇక్కడ కాలి బాటలు పాయలుగా విడిపోయి ఉన్నాయి, ఏ దారిలో ముందుకు రావాలి’ అని అడిగాడు.ముప్పిరిగొన్న సందేహాలుజర్నలిస్టుల బాగోగులు కోసమని వచ్చిన జవాన్.. అన్నల అడవిలో’ తప్పిపోతే పరిస్థితి ఏంటనే సందేహాలు రావడంతో అందరూ వెనక్కి వెళ్లారు. ఏడు నిమిషాల ప్రయాణం తర్వాత ఆయన కనిపించగా అప్పటికే మరో ఆరు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అతడిని ఓయ్పారాకు తీసుకొచ్చేసరికి హిడ్మా తల్లి పొలం పనుల కోసం వెళ్లినట్టు తెలిసింది. హిడ్మా తల్లి ఉంటున్న ఇంటి ఫొటోలను ఆ జవాన్ తీసుకున్నాడు. ‘ఆలస్యం అయ్యేలా ఉంది. నేను ఇక్కడ ఎక్కువ సేపు ఉండడం అంత మంచిది కాదు. త్వరగా వచ్చేయండి’ అంటూ వెళ్లిపోయాడు. ఆయన క్షేమంగా వెళ్లాడా, లేదా అని ఫోన్ చేయాలని భావించినా.. ఆయన కదలికలను బయటపెట్టినట్లవుతుందనే భావనతో జర్నలిస్టులంతా వెనక్కి తగ్గారు.డ్రోన్ నిఘా..హిడ్మా తల్లి కోసం నిరీక్షిస్తుండగా జుమ్... అంటూ శబ్దం వినిపించింది. జర్నలిస్టుల బృందం ఉన్న పాకపై డ్రోన్ ఎగురుతోందని అర్థమైంది. కొద్ది సేపటి తర్వాత శబ్దం ఆగిపోయింది. అంతకు ముందు మాట్లాడిన జవాన్ మాటల ఆధారంగా.. ‘ఆ రోజు లంచ్ కోసం జర్నలిస్టులు ఏ గ్రామంలో వాకబు చేశారు, ఎలాంటి వార్తలు, ఏ తరహాలో అందిస్తున్నారు’ అనే విషయాలపై వారికి పక్కా సమాచారం ఉందనేది అర్థమైంది. అంతేకాదు దండకారణ్యంలోకి వచ్చి వెళ్లే తెలుగు వాళ్ల వివరాలు తెలుసుకునేందుకు ప్రతీ సీఆర్పీఎఫ్ క్యాంపులో ప్రత్యేకంగా తెలుగు మాట్లాడే జవాన్లు ఉంటారని తెలిసొచ్చింది. ఓ వైపు ప్రభుత్వ పారా మిలిటరీ నిఘా ఇలా ఉంటే.. మరోవైపు అసలు ఆనవాళ్లే గుర్తించలేనంతగా మావో మద్దతుదారులు జర్నలిస్టు బృందంపై కన్నేసి ఉంచారు. ఆ నిఘా నీడలో సంచరిస్తూ హిడ్మా తల్లిని కలిసిన బృందం ఆమె బాగోగులు తెలుసుకుంది. -
నోట మాట రాలేదు..!
విమాన ప్రయాణంలో కిటికీ పక్కన కూర్చుని అద్భుతమైన ఫొటో తీసి, దాన్ని చూపించి ‘ఒక ఫ్రీ టికెట్ ఇస్తారా?’ అని మీరెప్పుడైనా అడిగారా? అడిగి ఉండరు కదా.. ‘రైనైర్’.. అంటేనే, టికెట్ ధర కంటే లగేజ్ రుసుము ఎక్కువ ఉండే బడ్జెట్ ఎయిర్లైన్ అని ప్రపంచం మొత్తం తెలుసు. అలాంటిది.. ఐర్లాండ్ దేశానికి చెందిన ఈ ఎయిర్లైన్ని ఫ్రీ టికెట్ అడగడం అంటే.. గోతికాడ నక్కని బిర్యానీ అడిగినట్లే.. ఓకే, కథలోకి వెళ్దాం. అనగనగా ఒక తింగరోడు విమానంలో రోమ్ నగరం మీదుగా వెళ్తున్నాడు. ఆకాశం నీలం, కింద ఇటలీ రాజధాని నగరం అద్భుతంగా కనిపిస్తున్నాయి. వెంటనే తన మొబైల్లో ఓ అద్భుతమైన ఏరియల్ షాట్ తీశాడు. అందులో విమానం రెక్క, కింద పట్నం కళ్లకు విందు చేసేలా ఉన్నాయి. ఫొటో తీశా చూడండి.. ఆ ఫొటో చూశాక మనోడిలో ఆశ చిగురించింది. ‘ఆహా! ఈ ఫొటోకి కనీసం ఒక ఫ్రీ టికెట్ అడగాల్సిందే!’ అనుకున్నాడు. ఇంకేముంది, ఆలస్యం చేయకుండా, ఆ గొప్ప ఫొటోను ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. దానిని రైనైర్ ఎయిర్లైన్కి ట్యాగ్ చేశాడు. ‘ఈ అద్భుతమైన ఫొటోకి బదులుగా నాకు ఒక ఉచిత విమాన టికెట్ ఇవ్వగలరా?’.. అని మరీ అమాయకంగా అడిగాడు. దానికి ఏదో నవ్వుతూ, నాలుగు మంచి మాటలు చెబుతారని, లేదా ఓ నవ్వుతున్న ఎమోజీ పంపిస్తారని ఆశించినట్లున్నాడు పాపం. ఒక్క మాటతో కథ క్లోజ్! రైనైర్ సోషల్ మీడియా టీమ్ ఉంది చూశారూ.. వాళ్లు సామాన్యులు కారు. వీళ్లు వెటకారానికి బ్రాండ్ అంబాసిడర్లు. విషయం ఏంటంటే, వారు నిమిషం కూడా ఆలోచించకుండా, మర్యాదలన్నీ తుంగలో తొక్కి.. కేవలం ఒక్కే ఒక్క మాట.. నో.. (లేదు) అని జవాబిచ్చారు. అతన్ని ఏ మాత్రం నొప్పించకుండా, నెప్పి తెలియకుండా.. ఒక్కే ఒక్క పదంతో ‘గేట్’ మూసేశారు. అడగ్గానే ‘ఫ్రీ టికెట్’ దొరుకుతుందనుకున్న ఆ ప్రయాణికుడికి.. ఎయిర్లైన్ స్టైల్లో ముఖం మీదే ‘ఇక్కడ చపాతీ కూడా ఉచితంగా దొరకదు, నువ్వా ఫ్రీ టికెట్ అడుగుతున్నావ్?’ అని సూటిగా చెప్పినట్లయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇదోరకం ప్రేమ!
అది అక్టోబర్ 30, 2024. బెంగళూరులోని రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్లో 45 ఏళ్ల ఇన్స్పెక్టర్, తన దైనందిన పనుల్లో నిమగ్నమై ఉన్నారు. హఠాత్తుగా.. ఆయన అధికారిక ఫోన్కి ఒక అపరిచిత నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ తర్వాత.. వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్, మెసేజ్లు వెల్లువెత్తాయి. అవతలి నుంచి మాట్లాడుతున్న మహిళ మాటలు అస్పష్టంగా, గందరగోళంగా ఉన్నాయి. మొదట్లో ఇన్స్పెక్టర్ దాన్ని ఏదో సాధారణ ఫిర్యాదు అనుకున్నారు. కానీ, అసలు ట్విస్ట్ అప్పుడే మొదలైంది!ప్రేమించకపోతే ఉద్యోగం తీయిస్తా.. ఆ మహిళ పదేపదే ఫోన్ చేసింది. తనకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి వంటి అత్యున్నత రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పడం మొదలుపెట్టింది. వాట్సాప్లో ఆ ప్రముఖులతో తాను ఉన్న ఫొటోలను పంపింది. ఆమెది ఫిర్యాదు కాదని, ప్రేమ ప్రతిపాదన అని ఇన్స్పెక్టర్కు అర్థమైంది. ‘నా ప్రేమను అంగీకరించండి. లేదంటే, నా పలుకుబడిని ఉపయోగించి మీ ఉద్యోగాన్ని, కెరీర్ను నాశనం చేస్తాను’.. అంటూ బెదిరింపులకు దిగింది. నిందితురాలి అధికారం, పలుకుబడి ఇన్స్పెక్టర్ను మానసిక ఆందోళనకు గురిచేసింది.రక్తంతో లేఖ అధికారిక విధులకు ఆటంకం కలుగుతుండడంతో, ఇన్స్పెక్టర్ ఆమెను పోలీస్ స్టేషన్కు వచ్చి రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వమని పదేపదే సూచించారు. కానీ, ఆమె స్టేషన్కు రాలేదు.. వేధింపులు కూడా ఆపలేదు. నవంబర్ 7వ తేదీన ఆమె వేధింపులు పతాక స్థాయికి చేరాయి. ఆ మహిళ ఏకంగా ఇన్స్పెక్టర్ కార్యాలయానికి వచ్చింది. అతనికి ఒక కవరును అందజేసింది. ఆ కవరులో కొన్ని మాత్రలు, చేతితో రాసిన లేఖలు ఉన్నాయి. అత్యంత భావోద్వేగపూరితంగా ఉన్న ఆ లేఖలు తన రక్తంతో రాసినవని ఆమె స్పష్టం చేసింది. ఇది ఆమె తీవ్రమైన మానసిక సమస్యకు నిదర్శనం. ఇన్స్పెక్టర్ అధికారిక డ్యూటీ నంబర్కు అనవసర కాల్స్, మెసేజ్లు పంపిస్తూ.. ఆయన రోజువారీ పనులకు తీవ్ర ఆటంకం కలిగిస్తూనే ఉంది. పోలీసుల విచారణలో, ఈ మహిళ గతంలో కూడా ఇతర పోలీసులు, ప్రభుత్వ అధికారుల్ని ఇలాగే వేధించినట్లు వెల్లడైంది.ఆత్మహత్య చేసుకుంటా.. డిసెంబర్ 12న, ఇన్స్పెక్టర్పై వేధింపుల పర్వం తారస్థాయికి చేరింది. ఆ మహిళ నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి, అందరూ చూస్తుండగానే అరిచింది. ‘నా ప్రేమ ప్రతిపాదనను అంగీకరించకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను. నీ ఉద్యోగాన్ని, కెరీర్ను నాశనం చేస్తాను’.. అని బెదిరించింది. ఈ తీవ్ర పరిణామాల నేపథ్యంలో, రామమూర్తి నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదు ఆధారంగా, ఆ మహిళపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 132 (ప్రభుత్వ ఉద్యోగిని విధులకు ఆటంకం కలిగించడం), 351(2) (క్రిమినల్ బెదిరింపు), 221 (ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ విచిత్ర కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఒక పోలీసు అధికారికి తన విధి నిర్వహణలో ఎదురైన ఈ ‘ప్రేమ ఉచ్చు’రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సంపద అంతా ఒకరిద్దరి దగ్గరే..
భారతీయులలో 1 శాతం మంది దగ్గరే.. దేశంలోని మొత్తం సంపదలో దాదాపు 40 శాతం పోగుపడి ఉందని ‘వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్’ తాజాగా వెల్లడించింది. భారతదేశంలో ఆదాయ అసమానత.. ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని పేర్కొంది. – సాక్షి, స్పెషల్ డెస్క్ దిగువ సగం అంతంత మాత్రమేదేశంలో అత్యధిక సంపన్నులైన 10 శాతం మంది.. మొత్తం దేశ సంపదలో 65 శాతం కలిగి ఉన్నారని నివేదిక తెలిపింది. అదే 10 శాతం మంది దగ్గర 58 శాతం జాతీయ ఆదాయం ఉందని, దిగువ 50 శాతం మంది 15 శాతం ఆదాయాన్ని మాత్రమే పొందుతున్నారని నివేదిక వివరించింది. మహిళల కష్టానికి విలువే లేదునివేదిక ప్రకారం, దేశంలో మహిళా కార్మిక భాగస్వామ్యం చాలా తక్కువగా 15.7 మాత్రమే ఉంది. గత దశాబ్దకాలంగా ఇందులో ఎటువంటి మెరుగుదలా కనిపించలేదు. మొత్తం మీద భారతదేశంలో ఆదాయం, సంపద; స్త్రీ, పురుష కార్మిక భాగస్వామ్యాలలోని అసమానత లోతుగా వేళ్లూనుకుని పోయిందని నివేదిక వ్యాఖ్యానించింది. పురుషులతో పోలిస్తే 32 శాతమేప్రపంచంలో మహిళలు.. పురుషులు ఒక గంటకు సంపాదిస్తున్న మొత్తంలో 32 శాతం వేతనాలు మాత్రమే (ఆర్థిక ప్రతిఫలం లేని ఇంటిపని, ఇతర సేవలకు కూడా లెక్కించి కలుపుకొంటే) పొందగలుగుతున్నారని నివేదిక లెక్కించింది. ఉద్యోగాలలో పురుషులతో సమానంగా పనిచేస్తున్న మహిళలకు.. పురుషులతో పోలిస్తే 62 శాతం మాత్రమే వేతనం లభిస్తోందని తెలిపింది.అసమానతల్లో ‘ప్రపంచ ఐక్యత’అసమానతల్లో ప్రపంచ దేశాలన్నీ ‘ఐక్యం’గా ఉన్నట్లు కనిపిస్తోందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలోని ఉన్నత ఆర్థిక వర్గాలలో ఒక చిన్న భాగం... ప్రపంచ జనాభాలో దిగువన ఉన్న సగం మంది కంటే మూడు రెట్లు ఎక్కువ సంపదను కలిగి ఉండటం అసమానతలకు స్ప ష్టమైన నిదర్శనం అని నివేదిక అభిప్రాయపడింది. ప్రపంచంలో 0.001 శాతంగా ఉన్న ఇంచుమించు 60,000 మల్టీ మిలియనీర్లు సగటున దాదాపు 1.2 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారని నివేదిక తెలిపింది. 1995లో 4 శాతంగా ఉన్న వారి వాటా, నేడు 6 శాతాని కంటే ఎక్కువగా పెరి గిందని, ఇది ప్రపంచ అసమానతల విస్ఫోటం వంటిదని పేర్కొంది. ఈ ఆర్థిక అసమానతను తగ్గించడానికి ప్రభుత్వాలు ధనికులపై అత్యధికంగా ఆదాయ పన్నులను విధించి, తక్కువ ఆదాయం ఉన్నవారికి ప్రభుత్వ ప్రయోజనాలను చేకూర్చాలని నివేదిక సిఫారసు చేసింది. -
‘లవ్’ లీవ్ కావాలి!
అది చలికాలం మధ్యాహ్నం.. ఢిల్లీలోని ఒక కార్పొరేట్ కార్యాలయం.. అందరూ మధ్యాహ్న భోజనం తర్వాత పనిలోకి జారుకుంటున్న వేళ.. ఓ కుర్ర ఉద్యోగికి మాత్రం మనసు మనసులో లేదు. ఎందుకంటే.. డిసెంబర్ 17న అతని గర్ల్ఫ్రెండ్ స్వరాష్ట్రం ఉత్తరాఖండ్కు వెళ్తోంది. మళ్లీ వచ్చేది జనవరి మొదటి వారంలోనే.. ఈ సుదీర్ఘ వియోగానికి ముందు ఆమెతో ఒక రోజు మొత్తం గడపాలి.. కానీ ఎలా?.. ఎలా? మేనేజర్కి ఏం చెప్పాలబ్బా..! సమస్య అల్లా మేనేజర్ వీరెన్ ఖుల్లర్.. సెలవు అడిగితే రొటీన్ సాకు చెప్పాలా? ’మామయ్యకి సుస్తీ’, ’ట్రైన్లో టిక్కెట్ కన్ఫర్మ్ కాలేదు’.. లాంటి పాత ట్రిక్స్ వాడాలా? ఇవేవీ వద్దనుకున్నాడు మన లవర్బాయ్.. ఎందుకంటే, నిజాయితీనే అతిపెద్ద ఆయుధమని అతనికి తెలుసు. ఈమెయిల్ బాంబు.. మొత్తానికి అబ్బాయి.. ధైర్యం చేశాడు. కీబోర్డుపై వేళ్లు ఆనించి ఒక పారదర్శకమైన ఈమెయిల్ను టైప్ చేసేశాడు. అందులో ఎలాంటి అతిశయోక్తులు.. అలంకారాలు లేనేలేవు. సూటిగా చెప్పేశాడు.. ‘డిసెంబర్ 16న వ్యక్తిగత కారణాల వల్ల సెలవు కావాలి, ఎందుకంటే నా గర్ల్ఫ్రెండ్ తన సొంతూరు ఉత్తరాఖండ్కు డిసెంబర్ 17న వెళ్తోంది. జనవరి మొదటి వారం వరకు తిరిగి రాదు. అందుకే ఆమె వెళ్లే ముందు ఆ ఒక్కరోజు తనతో గడపాలని కోరుకుంటున్నాను..’ఇదీ సెలవు దరఖాస్తు సారాంశం. ఆ మెయిల్ ’సెండ్’ బటన్ నొక్కిన క్షణం.. ఆఫీసులో కాదు, కుర్రాడి గుండెల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. వీడు మామూలోడు కాదు మేనేజర్ వీరెన్ ఖుల్లర్ మధ్యాహ్న భోజనం తర్వాత ఈమెయిల్స్ పరిశీలిస్తుండగా, ఆ అసాధారణమైన ’లవ్ రిక్వెస్ట్’ కంట పడింది. ఖుల్లర్ ముఖంలో చిరునవ్వు, ఆశ్చర్యం కలగలిసిన భావం. ‘ఓహో! పాత రోజుల్లో అయితే వీడు ఉదయం 9.15 గంటలకే ’ఫీవర్’ అని మెసేజ్ పెట్టేవాడు. కానీ ఇప్పుడు చూడండి, ఎంత ధైర్యం!‘ అనుకున్నారు. నిజానికి, గతంలో ఇలాంటి రిక్వెస్ట్లు రాత్రికి రాత్రి ’జబ్బు’గా మారి, మర్నాడు ఉదయం అపాయింట్మెంట్ అడిగేవి. కానీ కుర్రాడి నిజాయితీ, పారదర్శకత బాస్కి తెగ నచ్చేశాయి. ప్రేమకు జై.. ఈ పోస్ట్ తక్షణం వైరల్ అయింది. నెటిజన్లు కుర్రాడి ధైర్యాన్ని, ఖుల్లర్ ఔదార్యాన్ని చూసి మనసారా మెచ్చుకున్నారు. ‘అసలైన వర్క్–లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇదే!’, ‘ఆ మేనేజర్కి సలామ్’, ‘సెలవు దొరకడమే కష్టం అనుకుంటే, ప్రేమ పేరుతో దొరకడం అంటే లక్’.. అంటూ ప్రశంసించారు. ఆఫీసు అంటే కేవలం కట్టుబాట్లు, కఠిన నియమాలు కాకుండా, నమ్మకం, మానవత్వం కూడా ఉంటాయని ఈ చిన్న సంఘటన నిరూపించింది. ప్రేమోద్యోగి కథ సుఖాంతమైంది. అతను తన ప్రేయసితో హ్యాపీగా గడిపేందుకు టిక్కెట్ సంపాదించాడు. బేబీ ప్రేమ విషయంలో, బాసు కూడా ఓడిపోక తప్పలేదు! పండగ చేస్కోరా బుడ్డోడా..అప్పుడే మేనేజర్ ఖుల్లర్ ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఈ క్షణికావేశంలో, తాను ఒక డైరెక్టర్ కాదు, కేవలం ఒక మనిషి మాత్రమే అని గుర్తు చేసుకున్నాడు. మనిషి జీవితంలో ప్రేమకు ఉన్న ప్రాధాన్యాన్ని ఆయన గౌరవించాడు. సెలవు మంజూరు చేస్తూ.. ఆ మహా ప్రేమ లేఖ స్క్రీన్షాట్ను లింక్డ్ఇన్లో పోస్ట్ చేశాడు. దానికి ఆయన జత చేసిన వ్యాఖ్యే ఈ కథకు ’పంచ్’ పాయింట్.. ‘ప్రేమకు ’నో’ చెప్పే ధైర్యం మనకు ఎక్కడిది? సెలవును ఆమోదించాను! నువ్వు హ్యాపీగా వెళ్లు తమ్ముడూ!’.. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పల్లెంత తుళ్లింత కావాలిలె!
ఆలమూరు/బిక్కవోలు: తెలుగు సంస్కృతికి, సనాతన సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు, గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలిచే మకర సంక్రాంతి పండగకు పల్లె సీమలు ముస్తాబవుతున్నాయి. మార్గశిర కృష్ణ పక్ష ద్వాదశి, మూల కార్తీ రోజైన మంగళవారం మ«ధ్యాహ్నం 1.23 గంటలకు సూర్యుడు «ధనురాశిలో ప్రవేశించడంతో శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ధనుర్మాసం ప్రారంభమయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ధనుర్మాసాన్ని నెల పట్టుట లేదా నెలగంట అంటారు. జనవరి 14న జరిగే భోగి పండగ వరకూ నెల రోజుల పాటు ఈ ధనుర్మాసం ఉంటుంది. విష్ణాలయాల్లో ధనుర్మాస పూజలు చేసేందుకు దేవదాయశాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. కోనసీమ జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఉన్న విష్ణాలయాల్లోని దేవతామూర్తులు ప్రతి రోజూ పల్లకిలో ఊరేగింపుగా వెళ్లి భక్తులకు దర్శనివ్వనున్నారు. సంప్రదాయ కళల కోలాహలం సంక్రాంతి ధనుర్మాసం ప్రారంభం కావడంతో సంప్రదాయ కళల కోలాహలం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభం కానుంది. తెల్లవారుజామున ఇంటి ముంగిట ఆడపడుచుల రంగు రంగుల హరివిల్లులు, హరిదాసు కీర్తనలతో మేలుకొలుపు, సంప్రదాయ పిండివంటలతో లోగిళ్లు కళకళలాడనున్నాయి. సంక్రాంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు, కోడి, ఎడ్ల పందేలను నిర్వహించేందుకు పల్లెలు సమాయత్తం అవుతున్నాయి. భోగి పండగను పురస్కరించుకుని చిన్నారులు ఆవు పేడను సేకరించి భోగి పిడకలను తయారు చేసే పనిలో నిమగ్నమవుతున్నారు. ఏడాదికోసారి వచ్చే కొమ్మదాసులు, గంగిరెద్దుల వారు, కోయదాసులు వంటి కళాకారులు గ్రామాల్లో సందడి చేయనున్నారు. సంప్రదాయ కళలుగా భావిస్తున్న కోడిపందేలను పోలీసుల కళ్లు గప్పి ఏవిధంగా నిర్వహించాలనే ఆలోచనలో పందెం రాయుళ్లు ఉన్నారు. ఇప్పటికే పందెం కోళ్లను జీడిపప్పు, బాదం పప్పు వంటి పౌష్టికాహారంతో ఇంటి ఆవరణలో పెంచుతున్నారు. పాకశాలలుగా పల్లె లోగిళ్లు సంక్రాంతి నెల ప్రారంభం కావడంతో గ్రామాల్లోని లోగిళ్లు పిండివంటల తయారు చేస్తూ పాకశాలలుగా మారనున్నాయి. ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్లు, దేశ విదేశాల నుంచి వచ్చే కుటుంబ సభ్యులు, బంధువులకు తెలుగు సంప్రదాయ వంటకాలైన సున్నుండలు, గజ్జికాయలు, జంతికలు, గవ్వలు, పోకుండలు తయారు చేసేందుకు మహిళలు సమాయత్తమవుతున్నారు. రైతులకు పంట చేతికందడంతో సంక్రాంతిని మరింత ఉత్సాహంగా జరుపుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. సంక్రాంతికి నూతన వ్రస్తాలు కొనుగోలు చేయడంతో పాటు తమ లోగిళ్లను సుందరంగా అలంకరించే పనిలో నిమగ్నమవ్వనున్నారు. ఇతర దేశాల్లో కాని, రాష్ట్రాల్లో కాని నివసించే తెలుగు ప్రజలు స్వగ్రామానికి రావడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే విమానం, రైలు, బస్ టికెట్లు బుక్ అయిపోయాయి. పోటాపోటీగా ప్రభల ఉత్సవాలు సంక్రాంతి పండగను పురస్కరించుకుని రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా కోనసీమలోని సుమారు 15 మండలాల్లో ప్రభల తీర్థ మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఏకాదశ రుద్రులుగా భావించే ప్రభల ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే ఈ ప్రభల ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. ఈ ప్రభలను పండగ మూడురోజుల పాటు ఊరేగించి పొలిమేరలు దాటిస్తే ఆ గ్రామానికి శుభం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే గ్రామాలు, పట్టణాల్లో పోటీ పడి ప్రభల ఉత్సవాలను జరుపుతున్నారు. బాణసంచా పేలుళ్లు, కోలాటాలు, బ్యాండుమేళాలు వంటివి ఏర్పాటు చేసి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. గొబ్బెమ్మకు పూజలు పండగ నెల ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి ఇంటి ముందు ఉదయాన్నే కళ్లాపు చల్లి అందమైన ముగ్గులు వేసి వాటి మధ్యన గొబ్బెమ్మను పెట్టి పూజిస్తారు. తెలుగు సంప్రదాయం ప్రకారం గొబ్బెమ్మలను గోదాదేవి, లక్ష్మీ దేవి, గౌరీ మాతగా భావిస్తారు. గోవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గుల మధ్యలో ఉంచి గుమ్మడి, తంగేడు, గురుగు పూలు, పసుపు కుంకుమ సమర్పించి పూజిస్తారు. ధనుర్మాసం పొడవునా గొబ్బెమ్మను పూజించడం ఆనవాయితీ. -
మంచు పేరిట ముంచేశారు!
మంచు అందాలను ఆస్వాదించడానికి మనాలీకి వెళ్లే పర్యాటకులకు షాకింగ్ నిజం బయటపడింది. అక్కడి గైడ్లు.. పర్యాటకుల నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేసి, కృత్రిమ మంచుతో మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్న ఒక పర్యాటకుడి వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.ట్రక్కుల్లో మంచును తరలించి..ట్రక్కుల్లో మంచును తరలించి, దానిని నేలపై పోసి, పర్యాటకులతో ఆటలు ఆడిస్తుండటాన్ని ఈ వీడియో బయటపెట్టింది. అతుల్ చౌహాన్ అనే పర్యాటకుడు ఇన్స్ట్రాగామ్లో షేర్ చేసిన ఈ వీడియోలో, మనాలీలో జరుగుతున్న ’స్నో స్కామ్’ను బట్టబయలు చేశారు. ‘చివరికి, మనాలీలో మంచు ఎలా కురుస్తుందో మీకు చూపిస్తాను. చూడండి.. ఈ వ్యక్తులు మంచును ట్రక్కుల్లో తీసుకువచ్చారు. ఇక్కడ కుమ్మరిస్తున్నారు. ఆ తర్వాత ఈ మంచుపై పర్యాటకులతో ఆడిస్తారు’.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో సహజమైన మంచు ఏ మాత్రం లేదని, పరిసరాలు బీడు భూమిలా కనిపిస్తున్నాయని వీడియో స్పష్టం చేసింది. కొందరు వ్యక్తులు ట్రక్కుల నుంచి పారలతో కృత్రిమ మంచును దించి, నేలపై చల్లడం కనిపించింది. పర్యాటకులు కృత్రిమ మంచుపైనే స్కేటింగ్ చేస్తూ, ఆటలాడుతూ కనిపించారు.గ్లోబల్ వార్మింగ్ఈ వీడియో ఇంటర్నెట్లో కలకలం సృష్టించింది. చాలా మంది నెటిజన్లు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధిక అడవుల నిర్మూలన, అనియంత్రిత నిర్మాణాల కారణంగా.. సహజంగా మంచు కురవడం తగ్గిపోయిందని, ఇది గ్లోబల్ వార్మింగ్ ప్రభావమని కొందరు వ్యాఖ్యానించారు. మరొకరు స్పందిస్తూ, ‘పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మంచు ఉంటుందని చెప్పి, స్నో సూట్ల కోసం అధిక రేట్లు వసూలు చేస్తున్నారు. కానీ పర్యాటకులు చివరకు చూసేది చిన్న మంచు ప్యాచ్ మాత్రమే. దానికి అంత డబ్బు, శ్రమ అవసరం లేదు’.. అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ’స్నో స్కామ్’ ఘటన.. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాన్ని, మరోవైపు పర్యాటక రంగంలో జరుగుతున్న మోసాలను బట్టబయలు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వారానికి 4 రోజులే పని?
వారానికి పని దినాలు ఎన్ని? ఇదేం ప్రశ్న అంటారా? మన దగ్గరైతే మెజారిటీ కంపెనీలు, సంస్థల్లో ఆరు పనిదినాలు. విదేశాల్లోనైతే ప్రభుత్వంలోనైనా, ప్రైవేటులోనైనా ఐదుకు మించవు. మన దగ్గర కూడా ఐటీ వంటి రంగాల్లో ఎన్నో ఏళ్లుగా వారానికి ఐదు రోజుల పని సంస్కృతి అమల్లో ఉంది. కాకపోతే ఆరేడు రోజులకు మించిన పని ఆ ఐదు రోజుల్లోనే చేయిస్తారని ఈ ఐటీ జీవులు వాపోతూ ఉంటారన్నది వేరే సంగతి. అయితే, వారానికి నాలుగే పని దినాలుంటే? ఆ ఆలోచనే చాలా బాగుంది కదా! విదేశాల్లో సాధ్యమేమో గానీ మన దగ్గర ఎక్కడ కుదురుతుంది లెమ్మని అనిపిస్తోందా? కానీ ఇది అచ్చంగా భారత్ గురించే! కొత్త కార్మిక చట్టాలు వారానికి నాలుగు రోజుల పనికి నిజంగానే వీలు కల్పిస్తున్నాయి. ఇక కంపెనీలు నిర్ణయం తీసుకోవడం తరువాయి, ఉద్యోగులు వారంలో నాలుగే రోజులు పని చేసి, మూడు రోజులు వేతనంతో కూడిన సెలవులు ఆస్వాదించవచ్చు...!పాతకాలం నాటి 29 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం గత నవంబర్ 21న రద్దు చేసింది. వాటి స్థానంలో నాలుగు కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి తేవడం తెలిసిందే. వాటిలో భాగంగా వారానికి నాలుగు పని దినాలకు కూడా అనుమతిస్తోంది. కొందరు ఉద్యోగులతో పాటు కొన్ని సంస్థలు వ్యక్తం చేసిన అనుమానాల నేపథ్యంలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ దీనిపై స్పష్టత ఇచ్చింది. వారం మొత్తానికి సంబంధించిన పని గంటలను సర్దుబాటు చేసుకునే వెలుసుబాటు సంస్థలు, కంపెనీలకు ఇస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు కూడా పెట్టింది. అయితే ఇందుకు కొన్ని షరతులు వర్తించనున్నాయి! రోజుకు 12 గంటల పని...!వారంలో పని దినాల సంఖ్య తగ్గినా మొత్తం పనిగంటల సంఖ్య మాత్రం తగ్గబోదు. ఉద్యోగులు వారం మొత్తమ్మీద కనీసం 48 గంటలు పని చేయాల్సిందే. అంటే వారంలో 4 రోజులే పనిచేసేలా ఉంటే రోజుకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ‘కొత్త కార్మిక చట్టాలు ఇందుకు అనుమతిస్తాయి. అయితే వారంలో పని గంటల సంఖ్య 48కి మించేందుకు వీల్లేదు. మించితే ఆ అదనపు గంటలకు గాను ఉద్యోగులకు కంపెనీలు రెట్టింపు వేతనం చెల్లించాల్సి ఉంటుంది‘ అని కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేసింది. ఆ 12 గంటలు కూడా ఉద్యోగులు నిరంతరాయంగా పని చేయాల్సిన అవసరం లేదు. భోజన విరామం, షిఫ్టులు మారే నడుమ విరామం వంటివి ఆ 12 గంటల్లో కలిపే ఉంటాయి. వీటన్నింటికీ కంపెనీలు, కొన్నిసార్లు సిబ్బంది ఎంతవరకు ఒప్పుకోవచ్చన్నది ప్రశ్న. అందుకే, ‘వారానికి నాలుగు రోజుల పని కేవలం ఐచ్ఛికమే. కంపెనీ, సిబ్బంది పరస్పర అంగీకారంతో ఆ మేరకు పని చేసుకోవచ్చు. కంపెనీ విధానాలు, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు తదితరాలు కూడా దీనిపై ప్రభావం చూపుతాయి‘ అని కార్మిక శాఖ పేర్కొంది. 24 గంటలూ నిరంతరాయంగా పని చేయాల్సిన రంగాలు, విభాగాలకు ఈ నాలుగు రోజుల పని పనికొచ్చే వ్యవహారం కాదన్నది కార్మిక రంగ నిపుణుల అభిప్రాయం. దీనిపై కంపెనీలు, ఉద్యోగుల స్పందన ఎలా ఉంటుందన్నది తెలిసేందుకు కొద్ది రోజులు పట్టవచ్చు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫ్యాన్స్ ఫుట్బాల్ ఆడేసుకున్నారు
ఫుట్బాల్ దేవుడు లియోనెల్ మెస్సీని కళ్లారా చూసేందుకు కోల్కతాలో అభిమానుల సాహసాలు, పడిన ఆరాటం అంతా ఇంతా కాదు. కొందరు వేలకు వేలు చెల్లించగా, ఓ అభిమాని ఏకంగా తన పెళ్లి వేడుకలను పక్కనపెట్టి స్టేడియానికి వచ్చాడు. కానీ, అంతిమంగా వారందరికీ మిగిలింది తీవ్ర నిరాశే. ’గోట్ టూర్ 2025’లో భాగంగా సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ అడుగుపెట్టినప్పటికీ, ఆయన ముందుగానే నిష్క్రమించడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఈ అస్తవ్యస్థ, పేలవమైన నిర్వహణతో వేలాది మంది అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మెస్సీ కనిపించలేదు.. కార్పెట్ తీసుకుపోతున్నా! మెస్సీని దగ్గరగా చూడాలని రూ.10,000 చెల్లించిన ఓ అభిమాని, తీవ్ర నిరాశతో.. ఆవేశంతో ఊగిపోయాడు. స్టేడియం లోపలికి చొచ్చుకొచ్చి.. ఏకంగా మైదానంలోని గడ్డి కార్పెట్ను చుట్టి, మోసుకుపోతూ కనిపించాడు. ‘మెస్సీ ముఖం కూడా కనిపించలేదు. చాలా డబ్బు పోయింది, అందుకే ఈ కార్పెట్ను ఇంటికి తీసుకెళ్లి ప్రాక్టీస్ చేస్తా!’.. అని ఆగ్రహం, వ్యంగ్యం మిళితమైన స్వరంతో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. నెటిజన్లు అతన్ని ’అత్యంత ప్రాక్టికల్ అభిమాని’గా అభివరి్ణంచారు. మెస్సీ కంటే ఎక్కువ సేపు స్టేడియంలో ఆ కార్పెట్ మాత్రమే ఉందంటూ మీమ్స్ వెల్లువెత్తాయి. కుండీలు మోసుకెళ్లిన మరో అభిమాని కార్పెట్ దొంగతనం జరిగిన కొద్దిసేపటికే, మెస్సీ జెర్సీ ధరించిన మరో వ్యక్తి సైతం మైదానం నుంచి రెండు పూలకుండీలను మోసుకెళ్తూ కనిపించాడు. పూలకుండీలను ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా.. ‘వీటి ని మా ఆవిడకు ప్రేమగా బహుమతిగా ఇస్తాను’.. అని ఆ వ్యక్తి చెప్పాడు. అభిమానులు అందినకాడికి స్టేడియంలోని వస్తువులను దోచుకుపోయారు. మొత్తం మీద, మెస్సీని చూడాలనే ఆశ నెరవేరక, సోఫాలు పీకివేయడం, సీట్లు ధ్వంసం చేయడం, బాటిళ్లు విసరడం వరకు విధ్వంసం కొనసాగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆటుపోట్లున్నా ముందుకే..!
గత వారం తొలుత అంచనాలకు విరుద్ధంగా దేశీ స్టాక్ మార్కెట్లు బలహీనపడినప్పటికీ చివర్లో కొంత కోలుకున్నాయి. వెరసి ఈ వారం సైతం మార్కెట్లు ఆటుపోట్ల మధ్య ముందుకుసాగే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. బుల్లిష్ ట్రెండ్ కొనసాగవచ్చని భావిస్తున్నారు. మరోపక్క దేశ, విదేశీ ఆర్థిక గణాంకాలు సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు చెబుతున్నారు. వివరాలు చూద్దాం.. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ ఇండెక్స్(డబ్ల్యూపీఐ) గణాంకాలు నేడు(సోమవారం) విడుదలకానున్నాయి. అక్టోబర్(2025)లో ప్రతిద్రవ్యోల్బణం(మైనస్ 1.21 శాతం) నమోదుకాగా.. నవంబర్ నెలకు సైతం ధరల క్షీణత కనిపించనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. దీంతో అక్టోబర్తో పోలిస్తే గత నెలలో కాస్తమెరుగ్గా మైనస్ 0.5 నుంచి –0.6 శాతంస్థాయిలో గణాంకాలు వెలువడవచ్చని చెబుతున్నారు. ఈ బాటలో నవంబర్ నెలకు వాణిజ్య సంబంధ గణాంకాలు విడుదలకానున్నట్లు తెలియజేశారు. ప్రధానంగా పసిడి ధరలు భారీగా పెరగడంతో అక్టోబర్లో వాణిజ్య లోటు(ఎగుమతి, దిగుమతుల మధ్య అంతరం) రికార్డ్ గరిష్టం 41.68 బిలియన్ డాలర్లను తాకింది. నవంబర్లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అక్టోబర్లో దిగుమతుల బిల్లు 76 బిలియన్ డాలర్లను దాటగా.. ఎగుమతులు 34.38 బిలియన్ డాలర్లు మాత్రమే. కరెన్సీ మారకంపై కన్ను గత వారం డాలరుతో మారకంలో రూపాయి ఇంట్రాడేలో చరిత్రాత్మక కనిష్టం 90.56కు పడిపోయింది. ఆరు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 98.4కు బలహీనపడగా.. 10ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ తొలుత నీరసించినప్పటికీ 4.18 శాతానికి కోలుకున్నాయి. ఫెడ్, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోతలు కరెన్సీ, బాండ్లపై ప్రభావం చూపుతున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. కాగా.. యూఎస్ విధించిన అదనపు టారిఫ్లకుతోడు మెక్సికో సైతం భారత్ దిగుమతులపై సుంకాలను పెంచడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు తెలియజేశారు. అయితే ఇటీవల యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్తో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చర్చలు, మెక్సికో వాణిజ్య అధికారులతో భారత అధికారుల భేటీ టారిఫ్ల సమస్యలకు చెక్ పెట్టే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. విదేశీ గణాంకాలు యూఎస్, యూరోజోన్ ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం విడుదలకానున్నాయి. గత నెలకు యూఎస్ వినియోగ ధరలు, రిటైల్ అమ్మకాలు, వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. వెరసి అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతర్గత పటిష్టత, ద్రవ్యోల్బణ ఔట్లుక్ తదితర అంశాలు ఫెడ్ మానిటరీ పాలసీపై ప్రభావం చూపనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు. ఈ బాటలో విడుదలకానున్న జపనీస్ ద్రవ్యోల్బణం, వాణిజ్య గణాంకాలు బ్యాంక్ ఆఫ్ జపాన్ పరపతి సమీక్షను ప్రభావితం చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ వారం సైతం మార్కెట్లలో హెచ్చుతగ్గులకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. చిన్న షేర్లు భళా అంచనాలకు అనుగుణంగా గడిచిన వారం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటులో 0.25 శాతం కోత పెట్టడంతో చివర్లో మార్కెట్లు రికవరీ అయ్యాయి. వెరసి ఎన్ఎస్ఈ నిఫ్టీ 26,000 పాయింట్లకు ఎగువన, బీఎస్ఈ సెన్సెక్స్ 85,200స్థాయికి పైన నిలిచాయి. డాలరుతో మారకంలో రూపాయి చరిత్రాత్మక కనిష్టానికి చేరడం, యూఎస్కు తోడు కొత్తగా దేశీ ఎగుమతులపై మెక్సికో సుంకాల పెంపు ప్రకటించడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో గత వారం నికరంగా సెన్సెక్స్ 445 పాయింట్లు(0.51 శాతం) క్షీణించి 85,268 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 140 పాయింట్ల(0.53 శాతం) వెనకడుగుతో 26,047 వద్ద ముగిసింది. అయితే బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.14 శాతం, స్మాల్ క్యాప్ 0.65 శాతం చొప్పున పుంజుకోవడం గమనార్హం! సాంకేతికంగా ముందుకే.. చార్టుల ప్రకారం గత వారం అంచనాలకు భిన్నంగా దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. అయితే రెండో సపోర్ట్ స్థాయిల వద్ద నుంచి కోలుకున్నాయి. వెరసి సాంకేతికంగా కీలకమైన 85,000 పాయింట్లు(సెన్సెక్స్), 26,000 పాయింట్ల(నిఫ్టీ) కీలకస్థాయిలకు ఎగువన ముగిశాయి. ఈ వారం సైతం ఆటుపోట్ల మధ్య బలపడే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. → నిఫ్టీకి తొలుత 26,000 పాయింట్లు సపోర్ట్గా నిలవవచ్చు. తదుపరి 25,800 వద్ద తిరిగి మద్దతు లభించే వీలుంది. 26,000 పాయింట్ల స్థాయికి ఎగువన నిలదొక్కుకుంటే 26,350 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. ఆపై సమీప భవిష్యత్లో 26,900–27,000 వరకూ పుంజుకునే చాన్స్లున్నాయ్. → సెన్సెక్స్ జోరందుకుంటే తొలుత 85,700–85,800 పాయింట్ల వద్ద అమ్మకాల ఒత్తిడి కనిపించవచ్చు. ఈ స్థాయిలను అధిగమిస్తే 88,000–88,500 వరకూ బలపడే వీలున్నట్లు అంచనా. ఒకవేళ అమ్మకాలతో బలహీనపడితే 85,000 నుంచి 84,000 పాయింట్లవరకూ క్షీణించవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
కో–లివింగ్.. ఇన్వెస్ట్మెంటే!
ఒకప్పుడు సింగిల్గా అద్దెకుండే వారికి సింగిల్ రూమ్లు దొరికేవి. కానీ ఇప్పుడు ఆ జమానా పోయింది. అయితే సింగిల్ బెడ్రూమ్ తీసుకోవాలి. ఇపుడు అవీ దొరకటం లేదు. ఇక డబుల్ లేదా ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లు తీసుకుంటే అద్దెలు తడిసి మోపెడవుతాయి. హైదరాబాద్ వంటి నగరాల్లోనైతే కో–లివింగ్ లేదా షేర్డ్ రెంటల్ ఇళ్లు బాగా దొరుకుతాయి. అంటే ఒక ట్రిపుల్ బెడ్రూమ్ను మూడు బెడ్రూమ్లుగా విభజించి... కిచెన్, హాల్ వంటివి కామన్గా వినియోగించుకోవటమన్న మాట. ఆ సింగిల్ బెడ్రూమ్లో ఒక్కరే గానీ, ఇద్దరు గానీ ఉండొచ్చు. దాన్ని బట్టే అద్దె ఉంటుంది. అభివృద్ధి చెందిన పెద్ద నగరాలకే పరిమితమైన కో–లివింగ్ రెంటల్ హౌసింగ్ విధానం ఇపుడు ద్వితీయ శ్రేణి (టైర్–2) నగరాల్లోనూ పెరుగుతోంది. హైదరాబాద్తో పాటు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాల్లోనూ ఈ సంస్కృతి ఇపుడిపుడే ప్రాచుర్యం అందుకుంటోంది. అటు ప్రొఫెషనల్స్తో పాటు ఇటు పెట్టుబడులపై అధిక రాబడులనిచ్చే కొత్త మార్గాలను అన్వేíÙస్తున్న ఇన్వెస్టర్లకు కూడా ఇది మంచి అవకాశమేనని చెప్పాలి. నాస్కామ్ తాజా నివేదిక ప్రకారం విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ వంటి నగరాలు కొత్త టెక్నాలజీ, ఎడ్యుకేషన్ హబ్లుగా ఎదుగుతున్నాయి. దీనితో ఆయా ప్రాంతాలకు యువ ప్రొఫెషనల్స్, విద్యార్థులు బాగా వస్తున్నారు. సౌకర్యవంతంగా ఉంటూనే, తక్కువ అద్దెకు లభించే వసతి సదుపాయాల కోసం వారు వెతుక్కుంటున్నారు. ఫలితంగా... అలాంటి సౌకర్యాలను అందిస్తున్న కో–లివింగ్ ప్రాజెక్టులకు ఆదరణ పెరుగుతోంది. సింగిల్ బెడ్రూమ్ అద్దెకన్నా సుమారు 35 శాతం చౌకగా, సరళతరమైన నిబంధనలతో లీజుకు తీసుకునేందుకు వీలుగా ఉండటంతో పాటు వై–ఫై, క్లీనింగ్, కమ్యూనిటీ కార్యక్రమాల్లాంటి హంగులెన్నో ఉంటుండటంతో జెన్ జెడ్ వీటివైపు మొగ్గు చూపుతోంది. నిర్వహణ బాదరబందీ లేకుండా... ఇలాంటి ప్రాపర్టీలను కో–లివింగ్ తరహాలో అద్దెకు ఇవ్వాలనుకునే యజమానులకు నిర్వహణ బాధ్యతలను గానీ, కిరాయిదార్లతో డీల్ చేయటం వంటి బాధ్యతలు గానీ లేకుండా వాటన్నిటినీ తామే చూసుకునే నిర్వహణ ఏజెన్సీలు చాలా వస్తున్నాయి. నెస్ట్ అవే, స్టాంజా లివింగ్, కోలివ్, యువర్స్పేస్ లాంటి కంపెనీలు రకరకాల విధానాల్లో నిర్వహణ సేవలను అందిస్తున్నాయి. కిరాయిదారుకు అద్దెకివ్వడం నుంచి గదుల మెయింటెనెన్స్, ఫరి్నíÙంగ్, అద్దెల వసూళ్లు మొదలైన పనులన్నీ ఓనర్ల ప్రమేయం లేకుండా అవే చూసుకుంటాయి. ఫలితంగా నిర్వహణ బాదరబందీ లేకుండా యజమానులకు స్థిరంగా నెలకి ఇంత చొప్పున అద్దె లభిస్తుంది. సాధారణ ఫ్లాటు కాస్త అధిక రాబడి అందించే సాధనంగా మారుతుంది. లాభసాటి ఇన్వెస్ట్మెంట్ కూడా... ఓనరు ఏమాత్రం కలుగజేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ వసతి సదుపాయాలను మేనేజ్ చేసే సంస్థలిపుడు చాలా వస్తున్నాయి. వాటి కారణంగా ఇలాంటి ప్రాపర్టీలు ఆదాయ వనరులుగా మారుతున్నాయి. ఉదాహరణకు వైజాగ్లో సాధారణ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దె నెలకు రూ.18,000 ఉందనుకుంటే, ఆ ఇంటినే కో–లివింగ్ కింద (మూడు వేర్వేరు గదులుగా) మారిస్తే రూ. 24,000– రూ. 30,000 వరకు వస్తోంది. అంటే దాదాపు 35–40 శాతం మేర అధికంగా రాబడి వచి్చనట్లే. సంప్రదాయ రెంటల్ విధానమైతే పెట్టుబడిపై వార్షికంగా సుమారు 2 నుంచి 3 శాతం మేర నికరంగా రాబడి లభిస్తుంటే... ఈ కో–లివింగ్ విధానంలో 5 నుంచి 7 శాతం రాబడి వస్తోంది. అదే ఎడ్యుకేషన్, టెక్నాలజీ సెంటర్లకు దగ్గర్లో ఉన్నవైతే కొన్ని సందర్భాల్లో 8 శాతం వరకు రాబడి ఉంటోంది. అంటే బ్యాంకు వడ్డీతో సమానంగా వస్తున్నట్లే. పైపెచ్చు దీర్ఘకాలంలో విలువ పెరగటం లాంటి రియల్ ఎస్టేట్ ఆస్తులకు ఉండే పెరుగుదల ప్రయోజనాలు ఎలాగూ ఉంటాయి. ఖాళీగా ఉండేది తక్కువే.. సాధారణంగా విద్యార్థులు, జూనియర్ ఐటీ ఉద్యోగులు కొంత సమయం పాటు వచ్చి వెళ్లిపోతుంటారు. ఫలితంగా కో–లివింగ్ ప్రాపరీ్టలకు డిమాండ్ స్థిరంగా ఉంటోంది. వైజాగ్లోని మధురవాడ, విజయవాడలోని బెంజ్ సర్కిల్లాంటి ప్రాంతాల్లో ఏడాది పొడవునా 90– 95 శాతం ఆక్యుపెన్సీ రేటు ఉంటున్నట్లు కన్సలి్టంగ్ సంస్థల చెబుతున్నాయి.రిస్క్ లు తెలుసుకోవాలి.. షరా మామూలుగా ఏ పెట్టుబడి సాధనంలోనైనా ఎంతో కొంత రిస్క్ లు ఉంటాయి. కో–లివింగ్లోనూ అలాంటివి కొన్ని ఉంటాయి. కిరాయిదారులు తరచుగా మారుతుండటం వల్ల ప్రాపర్టీ పాతబడిపోతుంటుంది. నిర్వహణ వ్యయాలు పెరుగుతుంటాయి. వివాదాలు తలెత్తవచ్చు. ప్రమాదాలు, డ్యామేజ్లకు ఆస్కారం ఉండటం వల్ల ఖరీదైన ఇన్సూరెన్స్ పాలసీని కూడా తీసుకోవాల్సి రావచ్చు. ఇవి కాకుండా జోనింగ్ పరిమితుల్లాంటి రెగ్యులేటరీ నిబంధనల అవరోధాలు, పరస్పరం సంబంధంలేని కిరాయిదార్లు, స్వల్పకాలిక రెంటల్ నిబంధనలపరంగా ఏవైనా వివాదాలు తలెత్తడంలాంటి సమస్యలు రావచ్చు. అయితే, ద్వితీయ శ్రేణి నగరాల్లో రిస్క్ లతో పోలిస్తే ప్రయోజనాలే ఎక్కువన్నది నిపుణుల మాట. -
సన్ క్యాండిల్
సకల ప్రాణకోటికి దినకరుడే ప్రత్యక్ష దైవం. నిత్యం ఉదయిస్తూ, అస్తమిస్తూ ప్రకృతిలో భిన్న కాలాలకు సూరీడే కారణభూతంగా నిలుస్తున్నాడు. సకల చరాచర జీవకోటికి శక్తిప్రదాతగా దేదీప్యమానంగా వెలిగిపోయే సూర్యుడు ఇదే ప్రకృతిలో ఎన్నెన్నో వింతలకు హేతువుగా ఉన్నాడు. అందులో ఒకటే సన్ క్యాండిల్. సముద్ర మట్టం నుంచి అత్యంత ఎత్తులో కదలాడే సిర్రస్ మేఘాల్లోని స్ఫటిక మంచు బిందువుల కారణంగా ఈ సూర్య కొవ్వుత్తులు వెలిగి చూపరులకు నేత్రానందం కల్గిస్తున్నాయి. తాజాగా ఆ్రస్టియాలోని ఒక మంచుమయ పర్వత సానువుల్లో స్కీయింగ్ చేస్తున్న ఒక బృందం ఎదుట ఈ సన్ క్యాండిల్ ప్రత్యక్షమైంది. దీంతో అక్కడి వాళ్లంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అత్యంత అరుదైన ఈ వింతను అక్కడి స్కీయర్ లెంకా ల్యాంక్ వెంటనే తన కెమెరాకు పనిచెప్పారు. ల్యాంక్ తీసిన ఈ వీడియో ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్గా మారింది. ‘‘సైన్స్ఫిక్షన్ సినిమాల్లో చూపించినట్లుగా హఠాత్తుగా ఏర్పడిన ఈ వింతను చూసి కంగారుపడ్డా. దగ్గరికెళ్లి చూద్దామనుకున్నాగానీ భయపడిపోయా. ఎందుకంటే సమాంతర విశ్వానికి ఇది ముఖద్వారమేమో అన్నట్లు అనిపించింది’’అని లెంకా ల్యాంక్ వీడియో లైసెన్సింగ్ వేదిక అయిన ‘వైరల్హోగ్’లో రాసుకొచ్చారు.ఎలా ఏర్పడుతుందంటే?.. ఇదొక సూర్యకాంతి సంబంధ దృగి్వషయం. సిర్రస్ మేఘాల మీదుగా కాంతి నేల మీదపై పడే సందర్భాల్లో ఈ సన్ క్యాండిల్ ఏర్పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. మంచు పొగలో కోట్ల సంఖ్యలో అతి సూక్ష్మ, స్ఫటికాకార, సమతల మంచు బిందువులు ఉంటాయి. వీటిల్లో కొన్ని భూమికి సమాంతరంగా ఏర్పడినప్పుడు చూడ్డానికి అవన్నీ స్ఫటికాల్లా ప్రవర్తిస్తాయి. అంటే అద్దంలా అన్నమాట. తమ మీద పడిన కాంతిని అచ్చంగా మళ్లీ అదే దిశలో పరావర్తనం చెందిస్తాయి. అలా పై నుంచి కిందకు వచ్చే కాంతి కిరణాలను ఈ స్ఫటిక బిందువులు తిరిగి ఎగువ దిశలో పంపిస్తాయి. దీంతో వెండి రంగులో దేదీప్యమానంగా వెలిగిపోయే కొవ్వొత్తులు ఏర్పడతాయి. సాధారణంగా పర్వత శిఖరాల వంటి అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో సన్ క్యాండిల్ ఆవిష్కృతమవుతుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లోనే ఈ క్యాండిళ్లు ఏర్పడే అవకాశాలుంటాయి. సూర్యకాంతి పుంజం ఇలా పడి మళ్లీ అలా పైకి వెళ్తుండటంతో వీటిని సూర్య స్తంభాలు అని కూడా అంటారు. విమానాల్లోంచి కిందకు చూసినప్పుడు కూడా మంచు పర్వతాల సమీపంలో ఇలాంటి కాంతి కొవ్వొత్తులను చూడొచ్చు. ఎంత ఎక్కువగా స్ఫటిక మంచు బిందువులు ఒకే కోణంలో ఏర్పడతాయో అంతగా అతిపెద్ద కొవ్వొత్తి ఏర్పడుతుంది. అప్పుడు దానిని నేరుగా కంటితో చూడలేం. అంత ధగద్దాయమానంగా అది వెలిగిపోతుంది. మేఘాల లోపలి నుంచి దూసుకెళ్తున్నప్పుడు ఇలాంటివి కొన్ని సార్లు విమాన కాక్పిట్లోని పైలట్ల కంట పడతాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
18 ఏళ్ల వేట
కాలం మారినా.. చట్టం మాత్రం నిద్రపోలేదు. తన వేటను ఆపలేదు. సరిగ్గా పద్దెనిమిదేళ్ల క్రితం.. అంటే 2007లో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి, అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారైన నిందితుడి కోసం పోలీసులు సాగించిన సుదీర్ఘ వేట ఎట్టకేలకు ముగిసింది. చిన్నారిపై ‘హత్యాచారం’ తరువాత, నిందితుడు సరిహద్దులు దాటి అదృశ్యమయ్యాడు. పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. నేపాల్ అడవుల్లోని అజ్ఞాతం.. యూపీలోని ఇటుక బట్టీలో దాక్కున్న రహస్యం.. ఇవేవీ చట్టం కళ్లుగప్పలేకపోయాయి. ఎట్టకేలకు మీరా భయందర్–వసాయ్ విరార్ (ఎంబీవీవీ) పోలీసులకు కీచకుడు పట్టుబడ్డాడు. క్రైమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మదన్ బల్లాల్ తెలిపిన వివరాలివి. అది కాళరాత్రి మాణిక్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ అమానుష ఘటన. 2007 మార్చి 31 రాత్రి, 22 ఏళ్ల నంద్లాల్ అలియాస్ నందు రాందాస్ విశ్వకర్మ అనే యువకుడు ఒక చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి లోబరుచుకున్నాడు. మర్నాడు తెల్లవారుజామున బాలిక ఉసురు తీశాడు. అత్యాచారం, హింసతో పాటు, చివరకు ఉరితాడు బిగించి ఆమెను హత్య చేశాడు. నేపాల్కు పరారైన హంతకుడు నేరం చేసిన వెంటనే, నందు విశ్వకర్మ అంతర్జాతీయ సరిహద్దులు దాటి నేపాల్ పారిపోయాడు. అతను చాలా ఏళ్లు అక్కడే అజ్ఞాతంలో గడిపాడు. ఆ కేసు ఫైల్ మాణిక్పూర్ పోలీసుల దగ్గర దుమ్ము పట్టి ఉన్నా, దర్యాప్తు అధికారులు మాత్రం వదిలేయలేదు. అతి ముఖ్యమైన క్లూ.. వేట మొదలు అయితే.. ఇటీవల కేసును మళ్లీ తిరగదోడిన క్రైమ్ డిటెక్షన్ సెల్–2, వసాయ్ బృందానికి ఊహించని క్లూ దొరికింది. నిందితుడు పాత జీవితాన్ని వదిలి, యూపీకి తిరిగి వచి్చ, సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని స్వగ్రామం ఖర్దౌరీలో ఇటుక బట్టీలో కూలీగా దాక్కుని ఉన్నాడని తెలిసింది. దీంతో ఏసీపీ మదన్ బల్లాల్ నాయకత్వంలో, సీనియర్ ఇన్స్పెక్టర్ అవిరాజ్ కుర్హాడే బృందం తక్షణమే కదిలింది. పట్టుబడిన క్షణం నిందితుడి ఆచూకీ పక్కాగా ధ్రువీకరించుకున్నాక.. డిసెంబర్ 10న యూపీలోని ఖర్దౌరీకి చేరుకున్న పోలీసు బృందం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. 18 ఏళ్లుగా స్వేచ్ఛా జీవితం గడిపిన విశ్వకర్మ, తన చుట్టూ ఉచ్చు బిగుస్తోందని ఊహించలేకపోయాడు. చివరకు నంద్లాల్ అలియాస్ నందు రాందాస్ విశ్వకర్మను డిసెంబర్ 10న అతని స్వగ్రామం ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని ఖర్దౌరీలో అరెస్టు చేసి మహారాష్ట్రకు తరలించారు. నిజం నిప్పులాంటిది ఎంతకాలం దాచినా, పాపం పండక తప్పదు. న్యాయం ఆలస్యమై ఉండవచ్చు.. కానీ జరిగి తీరుతుంది. చాక్లెట్ ఆశ చూపించి చిన్నారిని చిదిమేసిన హంతకుడికి పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ అజ్ఞాతం తరువాత సంకెళ్లు పడటమే దీనికి నిదర్శనం. చట్టంపై విశ్వాసాన్ని నిలబెడుతూ పోలీసులు సాగించిన వేట నేటితో ముగిసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢీ కొట్టింది నేనే!
ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా.. ప్రవర్తనే మన విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని బయటపెడుతుంది. ఆ్రస్టేలియాలోని ఒక పార్కింగ్ స్థలంలో జరిగిన సంఘటన, అక్కడి పౌరుల నైతికతకు అద్దం పట్టింది. ఎవరో ఒక వ్యక్తి, అనుకోకుండా పార్క్ చేసిన కారును ఢీకొట్టాడు. మన ఊహ ప్రకారం.. భయపడిపోవాలి.. పలాయనం చిత్తగించాలి. మౌనంగా ఉండాలి.. కానీ అక్కడ జరిగింది వేరు. ఆ వ్యక్తి పరారైపోలేదు. జరిగిన నష్టానికి నైతిక బాధ్యత స్వీకరించాడు. తన పేరు, చిరునామా, బీమా వివరాలను ఒక కాగితంపై రాసి పెట్టాడు. విదేశాల్లోని పౌర స్పృహ, నిజాయితీ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి నిదర్శనంగా నిలిచిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అద్భుతాన్ని కళ్లారా చూసిన దేవాంగ్ సేథి అనే భారతీయుడు ఈ సంఘటన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు.కాగితంపై ఏముంది? వీడియోలో సేథి మాట్లాడుతూ, తాను ఒక పార్క్లో ఉన్నప్పుడు ఈ నోట్ను గమనించానన్నారు. ఎవరో ఒక వ్యక్తి అనుకోకుండా మరో కారును ఢీకొట్టాడని తెలిపారు. కానీ ఆయన పారిపోకుండా, కారు యజమాని నష్టపరిహారం క్లెయిమ్ చేసుకోవడానికి వీలుగా, ఒక కాగితంపై తన పేరు, వాహనం రిజి్రస్టేషన్ నంబర్, ఇన్సూరెన్స్ వివరాలను స్పష్టంగా రాసిపెట్టారని వివరించారు. బీమా సంస్థను ఎలా సంప్రదించాలో కూడా అందులో సూచించారని ప్రశంసించారు. ఆ నోట్ను సేథి కెమెరాకు చూపిస్తూ, ఇది బాధ్యతాయుత ప్రవర్తనకు స్పష్టమైన ఉదాహరణని కొనియాడారు. భారత్లో ఊహించగలమా?..ఈ దృశ్యాన్ని చూసిన సేథి, తాను తరచూ స్వదేశంలో (భారత్లో) చూసిన పరిస్థితులతో ఈ సంఘటనను పోల్చారు. ‘భారత్లో ఎవరైనా ఇంకొకరి కారును గుద్దితే, వాళ్లు సాధారణంగా అక్కడి నుంచి పారిపోతారు’.. అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలే.. కొన్ని సమాజాలు ఇతరుల కంటే మెరుగ్గా పనిచేయడానికి కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఒక దేశం గొప్పగా మారుతుందంటే, దానికి కారణం అక్కడి మంచి మనుషులు మాత్రమే’.. అని సేథి తన వీడియోను ముగించారు. పౌర ధర్మంలోనే దేశ వైభవం నిజాయితీ అనేది అసాధారణ చర్య కాకూడదు, అది సమాజపు ఊపిరి కావాలి. ఈ చిన్న నోట్, కేవలం ఇన్సూరెన్స్ క్లెయిమ్ గురించి మాత్రమే కాదు. ఇది బాధ్యత, నైతికత, సామాజిక విలువలపై ప్రపంచ వ్యాప్తంగా ఒక ఉది్వగ్న చర్చకు తెరలేపింది. కొందరు దీనికి విద్యా వ్యవస్థను, నాయకత్వాన్ని ఆపాదించవచ్చు. కానీ అంతిమ సత్యం ఒక్కటే: ఒక దేశ వైభవం దాని భవంతులలో కాదు, దాని ప్రజల చిన్న చిన్న పౌర ధర్మంలో దాగి ఉంది. చేసిన తప్పును అంగీకరించే ఆ క్షణంలోనే, ఒక దేశపు అంతరాత్మ ప్రతిబింబిస్తుంది. చిన్న నోట్తో.. ప్రపంచానికి పాఠం చెప్పిన ఆ్రస్టేలియన్ స్ఫూర్తి ఇది.. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చిట్కాలున్నా... చికిత్సే ముఖ్యం!
సోషల్ మీడియా వచ్చాక ఓ ఉత్పాతమూ వచ్చిపడింది. ‘పాత పేషెంట్ కొత్త డాక్టర్తో సమాన’మంటూ అప్పట్లో ఓ సామెత లాంటి వాడుక ఉండేది. దాన్ని నిజం చేస్తూ పాత పేషెంట్లూ అంతకుమించి పాపులర్ సెలిబ్రిటీలైన సోనాలీ బెంద్రే, మనీషా కోయిరాలా, క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్, హాలీవుడ్ మోడల్ లీజా రే వంటి జనాల్లో మంచి క్రేజ్ ఉన్న వ్యక్తులు... ‘ఆటోఫేజీ’ అనే ఓ సైంటిఫిక్ పదాన్ని... ఇటీవలి పాపులర్ చిట్కా మంత్రా పదమైన ‘వెల్నెస్ చికిత్స’తో కలగలిపి ‘వెల్నెస్’ అద్భుతాల తాలూకు ప్రభావాలను సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు. ఉపవాసాలూ, డీటాక్స్ విధానాల్లాంటివే అద్భుత మాయా–మంత్రాలంటూ ప్రజలకు ఇంపుగా ప్రజెంట్ చేస్తున్నారు. అసలు అన్నం కంటే పక్కన అంచుకుపెట్టుకుని నంజుకునే చిరుతిండినే నిజభోజనంగా వర్ణిస్తున్నారు. వాళ్ల మాటల మాయల్లో పడుతున్న జనాలు... అసలు వాస్తవాల కంటే అద్భుతాలనే ఎక్కువగా నమ్ముతున్నారు. ఫలితంగా ఈ ‘మిరాకిల్స్ థెరపీ’లను ఎక్కువగా నమ్ముతూ ఉండే అదే క్యాన్సర్కు అద్భుత చికిత్సేమోనంటూ అమాయక ప్రజలు అసలుకే మోసం తెచ్చుకుంటున్నారు. ఈ విషయంపై క్యాన్సర్ నిపుణులైన డాక్టర్ల మాటేమిటో చూద్దాం.వాళ్లు క్యాన్సర్ను జయించిన యోధులే. అద్భుత మనోబలంతో క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొన్న మహామహులే. తాము క్యాన్సర్ను అధిగమించాక తాము అనుసరించిన చిట్కాలను వెల్లడిస్తూ వాళ్లు చెబుతున్న కొన్ని మాటలేమిటో చూద్దాం. → ఇంటర్మిట్టెంట్ ఫాస్టింగ్ (రోజుకు నియమిత వేళల్లోనే తిని... మిగతా సమయమంతా ఉపవాసంలో గడపడం), యాంటీ ఇన్ఫ్లమేషన్ డైట్ తీసుకోవడం, కొద్దిపాటి వ్యాయామంతో తాను క్యాన్సర్నుంచి బయటపడ్డానంటోంది ప్రముఖ బాలీవుడ్– టాలీవుడ్ ఫేమ్ సోనాలి బెంద్రే. → క్లీన్ ఈటింగ్ ప్రాసెస్ చేయని, రిఫైన్ చేయని, పొట్టుతీయని ముడి ధాన్యాలతో వండిన భోజనం)తో పాటు యోగా, ప్రాణాయామం వంటి వాటితో క్యాన్సర్ను జయించానన్నది ప్రముఖ నటి మనీషా కోయిరాలా మాట. → కీమోతో పాటు... క్రమశిక్షణతో కూడిన జీవనమూ భోజనమూ, దేహంలోని విషాలను శుభ్రపరిచే డీ–టాక్స్ ఆహార విహారాలూ తననుంచి క్యాన్సర్ను దూరం చేశాయంటాడు క్రికెటర్ యూవీ (యువరాజ్ సింగ్). → శాకాహారంతో కూడిన భోజనం, ధ్యానం (మెడిటేషన్), యోగా ఆయుర్వేద మార్గాల పయనం వల్లనే తనకు క్యాన్సర్ నయమయ్యిందంటోంది ప్రముఖ మోడల్, లీజా రే. ఇక్కడ ఈ ప్రముఖులు చెప్పిన చిట్కాలన్నీ ‘ఆటోఫేజీ’ అనే ప్రక్రియను వేగవంతం చేశాయనీ... అందువల్లనే తమకు క్యాన్సర్ వేగంగా, ప్రభావపూర్వకంగా నయమైందంటూ చెబుతున్న సోషల్ మీడియా వేదికగా చెబుతున్న మాటలు సాధారణ ప్రజల మెదళ్లలోకి తేలిగ్గా ఎక్కుతున్నాయి. వాళ్ల మనసుల్లోకి సులువుగా వెళ్తున్నాయి. అయితే జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులైన ఆ వెల్నెస్ మార్గాలు మంచివే. కానీ అవే క్యాన్సర్ను పూర్తిగా నయం చేయలేవని అంటున్నారు. ‘ఆటోఫేజీ’ అనే ఇటీవలి సైంటిఫిక్ పరిభాషకు చెందిన ఆ పదం అర్థం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉందన్నది వైద్యప్రముఖుల మాట. దాంతోపాటు ‘అపాప్టోసిస్’, ‘ ప్రోటీయోజోమ్’ అనే పదాలకు అర్థాలు వాటి వెనక పరమార్థాలూ తెలుసుకుంటే కేవలం అద్భుతాలనిపించే చికిత్సప్రక్రియలు... (మిరాకిల్ రెమిడీలు) మాత్రమే కాకుండా వాస్తవ చికిత్సలకు తోడుగా... ఈ అనుబంధ మార్గాలూ జతగూడినప్పుడే అసలు ఫలితాలు వస్తాయంటున్న డాక్టర్ల మాటల ఆంతర్యాలను తెలుసుకుందాం...అసలు ‘ఆటోఫేజీ’ అంటే ఏమిటి? దేహంలో ఎప్పటికప్పుడు కణాలు పుడుతూ, చనిపోతూ ఉంటాయి. అందులో చనిపోయిన కణాలతో పాటు కొన్ని నిరర్థకమైనవీ, వ్యర్థమైనవీ ఉంటాయి. మన దేహంలోని శుభ్రం చేసే వ్యవస్థ ఇలాంటి మృతకణాలూ, నిరర్థక, వ్యర్థకణాలను తొలగిస్తూ ఉంటుంది. ఇలా ఆరోగ్యకరమైన కణాల మనగడను సుగమం చేస్తూ, ఈ మృత, వ్యర్థ, నిరర్థక కణాలను తినేసే ప్రక్రియనే ‘ఆటోఫేజీ’ అంటారు. ఈ సెలిబ్రిటీల మాటేమిటంటే... పైన చెప్పిన ఉపవాసాలూ, ప్రాణాయామ ధ్యానాలూ, డీటాక్స్ ప్రక్రియల వంటి వెల్నెస్ మార్గాల ద్వారా మన ఆరోగ్యకరమైన కణాలన్నీ ‘క్యాన్సర్ కణాలనే’ తినేస్తే? అప్పుడు క్యాన్సర్ హరించుకుపోయి ఆరోగ్యం దక్కుతుందనేలా వారి సోషల్ మీడియా సందేశాలు ప్రజలకు చేరుతున్నాయి. అంతకంటే సంక్లిష్టమైనది ఆటోఫేజీ...నిజానికి ‘క్యాన్సర్ బయాలజీ’లో ఆటోఫేజీ ప్రక్రియ అంతకంటే చాలా సంక్లిష్టమైనది అంటున్నారు ఆధునిక వైద్యచికిత్సకులు. ఒకసారి అదేమిటో చూద్దాం. ∙కణంలో మరిన్ని సూక్షమైన అంతర్గతమైన భాగాలు (ఆర్గనెల్స్) దెబ్బతిన్నప్పుడు ఆ కణం మనుగడ కష్టం. అది చనిపోయే ప్రక్రియలో దేహం దాన్ని శుభ్రం చేసి తొలగిస్తుంది. అందులోని ప్రోటీన్ శిథిలాలను ఒకచోట చేర్చి ఊడ్చేస్తుంది. అలా చనిపోయిన లేదా బలహీనపడి నిరర్థకం కాబోతున్న కణాలను దేహం తొలగించివేస్తుంది. దీన్నే ‘ఆటోఫేజీ’ అంటారు.అదీ మరచిపోతున్న ముప్పు... ఇదీ చేస్తున్న తప్పు... ఇక్కడ సెలిబ్రిటీలు ఒక విషయం మరచిపోతున్నారు. తమకున్న పరిమితమైన వైద్యపరిజ్ఞానంతో అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉపవాసాలు చేస్తున్నప్పుడు తన జీవక్రియల కోసం దేహంలోని కణాలు తమకు కావాల్సిన ఆహారం కోసం మృత/వ్యర్థకణాలనూ, క్యాన్సర్ కణాలనూ తినేస్తాయని భావిస్తున్నారు. కానీ ఇక్కడ వారు ఒక ముప్పును విస్మరిస్తున్నారు. క్యాన్సర్ కణం కూడా ఒక కణమే. దానికీ ఆహారం కావాలి. ఉపవాసం ద్వారా దానికి అవసరమైన ఆహారాలు అందనప్పుడు అది కూడా ఆరోగ్యకరమైన కణాలనూ తినేయడం మొదలుపెట్టేందుకు అవకాశాలు ఎక్కువ. అంతేకాదు... మామూలు కణం కంటే కూడా అది మరింత చురుగ్గా, మరింత వేగంగా ఆరోగ్యకరమైన కణాలను కబళించవచ్చు. పైగా ఆహారం అందకపోవడంతో దేహాన్ని రక్షించుకునే వ్యాధి నిరోధక వ్యవస్థ మరింత బలహీనపడితే క్యాన్సర్ కణజాలాలే మామూలు ఆరోగ్యవంతమైన కణాలను తినేయడం ప్రారంభిస్తే అది మొదటికే మోసం వచ్చే పరిస్థితి! అంటే ఉపవాసం వల్ల క్యాన్సర్ ఎండిపోవడానికి (ఫాస్టింగ్ స్టార్వ్స్ క్యాన్సర్) బదులుగా తామే ఆకలితో మాడాల్సి వస్తుందని తెలిసినప్పుడు క్యాన్సర్ కణాలు ఇంకా ఇంకా కుతంత్రాలతో (కన్నింగ్గా) ఆరోగ్యవంతమైన కణాలను తినేయడం మొదలుపెట్టే ప్రమాదలెన్నో పొంచి ఉంటాయి.ఆటోఫేజీ లాంటిదే ఆటాప్టోసిస్... సెలిబ్రిటీలు ఆటోఫేజీ గురించి సోషల్ మీడియాలో మాట్లాడటం వల్ల దాని గురించి మామూలు ప్రజలకు తెలియరావచ్చు. కానీ... ఈ రంగంలో ఇలా ఆటోఫేజీలా పనిచేస్తూ క్యాన్సర్ కణాలను తినేసేందుకు దోహదపడే పరిశోధనలూ, అలాంటి పరిజ్ఞానాలూ, పరిభాషా... ఇలాంటివి వాళ్లకు తెలియని అంశాలెన్నో ఇంకా ఉన్నాయి. ఉదాహరణకు అటాప్టోసిస్, యూబిక్విటిన్– ప్రోటియోజోమ్ సిస్టమ్ వంటివి. ఉదాహరణకు అటాప్టోసిస్ అంటే ఏమిటో చూద్దాం. ఎవరినైనా బాగా కించపరిచి, కోలుకోలేనంతగా నిందిస్తే వాళ్లేం చేస్తారు? తట్టుకోలేక ఆత్మహత్యకూ ఒడిగట్టవచ్చు కదా! అచ్చం అపాప్టోసిస్ ప్రక్రియలో కూడా అలాంటిదే జరుగుతుంది.యుబిక్విటిన్ – ప్రోటియోజోమ్ సిస్టమ్ అంటే... యుబిక్విటిన్ అనేది ఏ ప్రోటీన్కు అంటుకుంటుందో దాన్ని కాలపరిమితి ముగిసిపోయిన లేదా చెడిపోయిన / లోపభూయిష్టమైన ప్రోటీన్గా గుర్తించవచ్చు. అది కణంలో ఉన్నప్పుడు కణం సమతౌల్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే యుబిక్విటిన్ ప్రోటీన్ కణం నుంచి తొలగిపోవాలి. అప్పుడే కణం చురుగ్గా నార్మల్ కణంగా ఉంటుంది. అలా కణం నుంచి యుబిక్విటిన్ను తొలగించడానికి తోడ్పడేందుకు ఉద్దేశించిన వ్యవస్థ... అంటే యుబిక్విటిన్ ప్రోటీన్ను ధ్వంసం చేసేందుకు తోడ్పడే వ్యవస్థే ప్రోటియోజోమ్ వ్యవస్థ. అంటే ప్రోటియోజోమ్ అన్నది ప్రోటీన్ డిస్ట్రక్షన్ సిస్టమ్ అన్నమాట. ఈ యుబిక్విటిన్ అనేది అలాగే ఉంటే అది చెడిపోయిన కణానికి అమరత్వం ఇస్తుంది. ఒకవేళ ఆ చెడిపోయిన కణాలకు అమరత్వం ఉంటే అవి తొలగిపోవు. కాబట్టి ఈ ప్రోటియోజోమ్... తన డబుల్ నెగెటివ్ మార్గంలో వాటిని గుర్తించి ధ్వంసం చేస్తుంది. అలా చెడుకణాలూ లేదా దెబ్బతిన్న/లోపభూయిష్టమైన కణాలను తొలగిస్తుంది. ఇతి జరిగేందుకు దోహదపడేదే ‘యుబిక్విటిన్ – ప్రోటియోజోమ్ వ్యవస్థ’గా చెబుతారు.కొన్ని మందులతో ప్రోటీయోజోమ్ ప్రక్రియను అడ్డుకుని క్యాన్సర్ను తగ్గించడం ఇలా... ఈ యుబిక్విటిన్– ప్రోటియోజోమ్ ప్రక్రియను గుర్తించిన వైద్య శాస్త్రవేత్తలు ‘బార్టెజోమిబ్’ అలాగే ‘కార్ఫిల్జోమిబ్’ వంటి ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్లను తయారు చేసి ప్రయోగించారు. ఈ మందులతో ‘మైలోమా’ అనే క్యాన్సర్ నయం కావడం మొదలైంది. ఇలాంటి మందులను ( ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్స్ను) మరిన్ని కనుగొనడం ద్వారా అనేక రకాల క్యాన్సర్లను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా చూసినప్పుడు ఆటోఫేజీ, అపాప్టోసిస్, ప్రోటీయోజోమ్ అనేవి చాలా సంక్లిష్టమైన ప్రక్రియలు. అవి కొనసాగే మార్గాలను (పాత్ వేస్) అనేక మందుల సహాయంతో నిర్వహితమయ్యేలా చేయడం వల్ల క్యాన్సర్ కణం తనంతట తాను మటుమాయమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికి ఇది ‘మైలోమా’లోనే సఫలీకృతమైంది. కానీ ఇంకా కొన్ని క్యాన్సర్ల (సాలిడ్ ట్యూమర్స్) విషయంలోనూ, మరిన్ని క్యాన్సర్లలోనూ విజయవంతం కావాల్సి ఉంది. ఇందుకోసం రకరకాల కాంబినేషన్లలో అపాప్టోసిస్ మాడ్యులేటర్లు, ఇమ్యూనో, టార్గెట్ థెరపీ ప్రక్రియలూ, ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్లు రూపొందించడంలో వైద్యశాస్త్రజ్ఞులు నిమగ్నమై ఉన్నారు.ఆ అపోహలన్నీ అలా ఆవిర్భవించినవే... ఎన్నో ఏళ్లుగా అటాప్టోసిస్ ప్రక్రియను క్యాన్సర్ను జయించేందుకు ఒక ప్రత్యామ్నాయ ‘నేచర్ క్యూర్’ ప్రక్రియగా జనం అపోహపడుతున్నారు. కొన్ని ఆహారాల ద్వారా క్యాన్సర్ లాంటి లోపభూయిష్టమైన కణాలు తమంతట తామే తమ మరణశాసనం రాసుకునేలా చేయడం (యాక్టివేటెడ్ / ప్రోగ్రామ్డ్ సెల్ డెత్)గా చాలామంది పొరబడుతుంటారు. కానీ అది పొరబాటు. క్యాన్సర్ కణాలు ఎంత జిత్తులమారివి అంటే... అవి ‘అటాప్టోసిస్’నూ తప్పించుకోగలవు. అదెలాగంటే... సెల్ను అపాప్టోసిస్కు గురిచేసే ప్రక్రియలో క్యాన్సర్ కణంలోని పవర్హౌజ్ అయిన మైటోకాండ్రియాను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. అదే సమయంలో ‘బీసీఎల్–2’ అనే కుటంబానికి చెందిన మరో ప్రోటీన్ విడుదలై అది యాంటీ అపాప్టోటిక్ ప్రక్రియ ద్వారా క్యాన్సర్ కణంలోని మైటోకాండ్రియాలోకి రసాయనాలు వెళ్లకుండా చేయడం ద్వారా తనను తాను రక్షించుకుంటుంది.చివరగా... ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ప్రభావవంతమైన క్యాన్సర్ చికిత్సలు రేడియోథెపీ, కీమోథెరపీ, శస్త్రచికిత్సలే. వీటి తర్వాతే ఉపవాసాలూ, యోగా, ధ్యానం, డీ–టాక్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలూ, పోషకాహారాలూ, నేచురోథెరపీలను అనుబంధంగా ఉపయోగించుకోవాలి. ఏ సెలిబ్రిటీలు చెప్పినా అవి ప్రత్యామ్నాయ చిట్కాలే తప్ప ప్రధాన చికిత్సలు కావని అందరూ తెలుసుకోవాలంటున్నారు డాక్టర్లు.అపాప్టోసిస్ అంటే... క్యాన్సర్ అంటేనే అది చెడిపోయిన / నార్మల్గా ఉండని కణం అన్న విషయం తెలిసిందే. ఏవైనా రసాయనాల ద్వారా ఓ చెడిపోయి దెబ్బతిన్న కణాన్ని మరింతగా అవమానించేలా చేస్తే అది బాగా కుంగి కుచించుకుపోయి నశించిపోయే పరిస్థితే ‘అపాప్టోసిస్’ అని చెప్పవచ్చు. నిజానికి చాలా సంక్లిష్టమైన జీవరసాయన పద్ధతికి ఇక్కడ చెప్పినది మామూలు ప్రజానీకానికి అర్థమయ్యేలా చెప్పేందుకు ఇదో సింపుల్ వివరణ అనుకోవచ్చు. అంటే కొన్ని రసాయనాలను ఉపయోగించి ఓ కణాన్ని అవమానించడం ద్వారా దాని మరణాన్ని అదే తెచ్చుకునే ‘ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్’ కార్యక్రమం ఈ అపాప్టోసిస్.నిర్వహణ: యాసీన్ -
పర్యాటకుల స్వర్గధామం.. కాజీరంగా
కాజీరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్... పర్యాటకులకిది గమ్యస్థానమే కాదు.. జీవవైవిధ్యానికి అతి పెద్ద ఉదాహరణ. ప్రపంచంలోనే అత్యధిక ఒంటికొమ్ము ఖడ్గమృగాలున్న జాతీయ పార్క్ ఇదే. ఇలా చెప్పుకుంటూ పోతే కాజీరంగాకు ఎన్నెన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ పార్క్ అసోంలోని గోలాఘాట్, నాగావ్ జిల్లా పరిధిలో విస్తరించి ఉంది. బ్రహ్మపుత్ర నదీ తీరంలో నీటి గలగలలు వినసొంపుగా ఉంటాయి. కార్బీ ఆంగ్లాంగ్ కొండల మధ్య దృశ్యాలు కనువిందు చేస్తాయి. కాజీరంగా దాదాపు 430 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది. ఈ జాతీయ పార్క్ను ఎన్హెచ్–37 మధ్యగా చీల్చుతుంది. ఈ నేషనల్ పార్క్ చుట్టూ తేయాకు తోటలు పరుచుకుని ఎంతో అహ్లాదకరంగా, ఎటుచూసినా పచ్చని దృశ్యాలే కనిపిస్తుంటాయి. ఈ జాతీయ రహదారిలో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు రహదారి పక్కన ఖడ్గమృగాలు, ఏనుగులు, అడవి దున్నలు, జింకలు తిరుగుతూ కనిపిస్తుంటాయి. – కాజీరంగా నుంచి సాక్షి ప్రతినిధికాజీరంగాలో అత్యధిక ప్రాంతం చిత్తడి నేలలతోనే కనిపిస్తుంది. భారీ, ఎత్తైన గడ్డిపొదలతో ఈ అడవి దట్టంగా కనిపిస్తుంది. ఈ వాతావరణ పరిస్థితులే వన్యప్రాణులకు ఎంతో ఇష్టమైన ఆవాసంగా మారింది. ఈ అడవిలో పెద్దసంఖ్యలో అడవి పందులు కూడా ఉన్నాయి. చిత్తడి నేలలు ఒక ఎత్తయితే.. చాలాచోట్ల చెరువులు, కుంటలు వన్యప్రాణులకు జీవం పోస్తున్నాయి. ఏడాదిలో కేవలం వేసవి సీజన్లోని కొన్నిరోజులు మినహాయిస్తే... ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ పార్క్లోకి సందర్శకులను అక్టోబర్ రెండో వారం నుంచి మే నెలాఖరు వరకు మాత్రమే అనుమతిస్తారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ రెండో వారం వరకు వర్షాల నేపథ్యంలో పర్యాటకులను అనుమతించరు. బ్రహ్మపుత్ర నది పోటెత్తినప్పుడు, భారీ వర్షాలతో ఈ అడవిలోనూ వరదలు సంభవిస్తాయి. ఆయా సమయాల్లో వన్యప్రాణులు మృత్యువాత పడటం, గాయపడటం లాంటివి జరుగుతుంటాయి. బ్రహ్మపుత్ర నదీ ప్రవాహంతో ఈ పార్కు స్వరూపం కూడా మారుతుంటుంది. ఈ పార్కులో మానవప్రమేయం చాలా తక్కువ. ఖడ్గమృగాలపై గతంలో వేటగాళ్లు విరుచుకుపడ్డ పరిస్థితులను అస్సాం ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు పూర్తిగా నిలువరించారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి మారింది. వేట చాలావరకు తగ్గింది. కాజీరంగా జాతీయ ఉద్యానవనం కేవలం పర్యాటక కేంద్రం మాత్రమే కాకుండాం ప్రకృతి పరిరక్షణకు నిదర్శనంగా మారింది. జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ అనే సందేశాన్ని కాజీరంగా గట్టిగా వినిపిస్తోంది.» 1905లో పార్లమెంటులో నోటిఫికేషన్ ద్వారా కాజీరంగాను రిజర్వ్ ఫారెస్టుగా నిర్ధారించారు. 1908లో తుది నోటిఫికేషన్ వచ్చింది. » 1916లో కాజీరంగాను అభయారణ్యంగా డిక్లేర్ చేశారు. » 1937లో పర్యాటకులు/సందర్శకులకు అనుమతిచ్చారు. » 1950లో వన్యప్రాణుల అభయారణ్యంగా నోటిఫై చేశారు. » 1974లో జాతీయ పార్కుగా నోటిఫై చేశారు. » 1985లో అంతర్జాతీయ చారిత్రక సంస్థగా యునెస్కో గుర్తించింది. » 2007లో దీన్ని టైగర్ రిజర్వ్గా నోటిఫై చేశారు. » 2018లో కాజీరంగాను ఐకానిక్ టూరిస్ట్ డెస్టినేషన్గా ఖరారు చేశారు. » 2022లో స్మగ్లింగ్/వేట రహితంగా ప్రకటించారు. » 2024లో జాతీయ పార్కుగా పేరొంది 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.కాజీరంగానేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్లోని జంతు సంపద (2022 పశుగణన లెక్కల ప్రకారం)...2,613 ఒంటికొమ్ము ఖడ్గమృగాలు 104 రాయల్ బెంగాల్ టైగర్1,129 చిత్తడి జింకలు553 పక్షి జాతులు550 వృక్ష జాతులు1,200+ ఏనుగులు 2,565 అడవి దున్నలుప్రత్యేకతలుప్రపంచంలోనే అత్యధిక ఒంటి కొమ్ము ఖడ్గమృగాలున్నది ఇక్కడే. 1966లో ఇక్కడ 366 ఒంటికొమ్ము ఖడ్గమృగాలుండగా... ఇప్పుడు వాటి సంఖ్య 2,613కి చేరింది. వచ్చేఏడాది వైల్డ్లైఫ్ సెన్సెస్ నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేషనల్ పార్కులో అత్యధిక రాయల్ బెంగాల్ టైగర్లు ఉన్నాయి. అంతేకాకుండా అడవిదున్నల సంఖ్య కూడా ఇక్కడే అత్యధికంగా ఉంది. ఏనుగుల సంఖ్యతో పాటు చిత్తడి జింకలు సైతం ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. 25 రకాల అంతర్జాతీయ పక్షి జాతులు ఇక్కడికి వలస వస్తుంటాయి.» జంతువుల దాడిలో పదేళ్లలో 19 మంది మృత్యువాత పడ్డారు. 2014, 2015, 2016లో మరణాలు నమోదు కానప్పటికీ... ఆ తర్వాత ఏటా సగటున 3 చొప్పున మరణాలు నమోదయ్యాయి. ఈ దాడుల్లో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించింది. గాయపడిన వారికి ఆర్థిక సాయంతో పాటు మెరుగైన చికిత్సకు చర్యలు తీసుకుంది. » కాజీరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ కేంద్రానికి ఏటా టికెట్ల రూపంలో రూ.3.5 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ పులుల సంరక్షణ ప్రాజెక్టుకు ఏటా సగటున రూ.10 నుంచి రూ.12 కోట్ల మేర నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 90 శాతం కాగా... 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. » ఈ అటవీ సంరక్షణలో 367 మంది ఉద్యోగులు విధులు ని ర్వహిస్తున్నారు. డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్తో పాటు అసిస్టెంట్ కన్జర్వేటర్, ఫారెస్ట్రేంజ్ ఆఫీసర్లు, వెటర్నరీ ఆఫీ సర్లు, ఫారెస్ట్ గార్డ్లు తదితర కేటగిరీల్లో ఉద్యోగులున్నారు. » కాజీరంగా జాతీయ పార్క్ను నాలుగేళ్లుగా ఏటా సగటున 3 లక్షల మంది సందర్శిస్తున్నారు. ఇందులో 5 శాతం విదేశీ సందర్శకులే కావడం గమనార్హం. పదేళ్ల క్రితం ఈ పార్క్ విజిటర్ల సంఖ్య 1.31 లక్షలు కాగా.. ఇందులో విదేశీ పర్యాటకులు 8 వేలు. పదేళ్లలో ఈ పర్యాటకుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. » ఉదయం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు ఎలి ఫెంట్ సఫారీ చేయొచ్చు. ఉదయం7.30 గంటల నుంచి మ ధ్యాహ్నం 3 గంటల వరకు జీపు సఫారీకి అనుమతిస్తారు. » పార్కులో ప్రవేశానికి దేశ పౌరులకు రూ.100, విదేశీయులకు రూ.650 చొప్పున రుసుము చెల్లించాలి. ఏనుగుపై సఫారీకి విదేశీయులకు రూ.2 వేలు, దేశ పౌరులు రూ.1,200 చెల్లించాలి. » జీపు సఫారీకి రూ.2,200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కెమెరా షూట్, వీడియో కెమెరా షూట్, డాక్యుమెంటరీలు, ఫీచర్ఫిల్మ్ తదితరాలకు వేరువేరు ఫీజులుంటాయి. నిర్దేశించిన ప్రాంతాల్లో ట్రెక్కింగ్ కూడా చేసే అవకాశం ఉంది. » సందర్శకులు ఇక్కడ ఉండేందుకు ప్రత్యేకంగా గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా రుసుము చెల్లించాలి. ఆన్లైన్ విధానంలో కూడా ముందస్తుగా గెస్ట్హౌస్లు, సందర్శనకు బుక్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. -
హైదరాబాద్.. రీ రిలీజ్కా బాప్
సినిమా అంటేనే వినోదం.. భారతీయుల జీవితంలో ఒక భాగం. థియేటర్లో కొత్త మూవీ రిలీజ్ అయినప్పడే కాదు.. పాత సినిమాలు మళ్లీ సిల్వర్ స్క్రీన్పై విడుదల అయినా జనంలో ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. రీరిలీజ్ సినిమాలను ఆదరించడంలో భారత్లో మన హైదరాబాద్ ముందుండటం విశేషం. థ్రో బ్యాక్–2025 పేరుతో...సినిమాలు, లైవ్ ఈవెంట్స్, నాటకాలు, కచేరీలు, క్రీడల ఆన్లైన్ టికెటింగ్లో మార్కెట్ లీడర్ బుక్మైషో.. థ్రోబ్యాక్–2025 పేరుతో రూపొందించిన నివేదిక ద్వారా ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఈ ఏడాది జనవరి–నవంబర్ మధ్య దేశవ్యాప్తంగా 58 లక్షల మంది రీరిలీజ్ సినిమాలను థియేటర్లలో వీక్షించారు. రీరిలీజ్ విభాగంలో దేశంలో ఇంటర్స్టెల్లర్ టాప్లో నిలిచింది. అభిమాన తారల సినిమా మళ్లీ వెండి తెరపైకి రావడం ఒక ఎత్తు అయితే.. ఏళ్లు గడిచినా ఆ చిత్రం తాలూకా జ్ఞాపకాలు, కథ, పాత్రలు వీక్షకుల మదిలో ఎంత పాతుకుపోయాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. రీరిలీజ్ మూవీలకు అడ్డాగా మన భాగ్యనగరి నిలవడం గమనార్హం. మరో నగరానికి వెళ్లి మరీ.. లైవ్ ఈవెంట్స్ను ఆస్వాదించేందుకు జనం గడప దాటుతున్నారు. అంతేకాదు మరో నగరానికి వెళ్లి మరీ ఆస్వాదిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో అహ్మదాబాద్లోని 1,32,000 సీట్ల సామర్థ్యం గల నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన కోల్డ్ప్లే లైవ్ మ్యూజిక్ ప్రేక్షకులతో కిక్కిరిసిపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ ఈవెంట్తో స్థానికంగా రూ.649 కోట్ల వ్యాపారం జరిగిందని సమాచారం. భారతీయులు వినోదాన్ని జీవనశైలిలో భాగంగా చేసుకున్నారని నివేదిక తెలిపింది. ఇందుకోసం ఖర్చుకూ వెనుకాడడం లేదు. 18 లక్షల మందికిపైగా సోలోగా వెళ్లి ఈవెంట్స్ను ఎంజాయ్ చేశారు. అంటే వ్యక్తిగత స్వేచ్ఛ పట్ల పెరుగుతున్న విశ్వాసానికి ఇది శక్తివంతమైన నిదర్శనం. ముఖ్యంగా పట్టణ మిలీనియల్స్, జెన్జీ ప్రేక్షకులు సోలో హాజరును సామాజిక వైఫల్యానికి బదులుగా స్వీయ భరోసాకు చిహ్నంగా భావిస్తున్నారు. వినోదానికే పండుగ» దేశవ్యాప్తంగా దసరా వీకెండ్లో 68 లక్షల మంది థియేటర్లలో అడుగుపెట్టారు. సంఖ్యాపరంగా ఆ తర్వాతి స్థానంలో ఇండిపెండెన్స్ డే వీకెండ్ నిలిచింది. » ముందస్తు టికెట్ల బుకింగ్లో రజనీకాంత్ ‘కూలీ’మూవీ రికార్డు సృష్టించింది. రిలీజ్కు ముందే 24 లక్షల మంది తమ టికెట్లను సొంతం చేసుకున్నారు. » కాంతార చాప్టర్–1 సినిమాను 6 లక్షల మందికిపైగా అభిమానులు రెండుసార్లు వీక్షించారు. » ఒక నగరం నుంచి మరోచోటకు వెళ్లి 5.62 లక్షల మంది ఫ్యాన్స్ లైవ్ మ్యూజిక్ను ఆస్వాదించారు.» రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల మధ్య థియేటర్లకు పరుగుతీయడంలో బెంగళూరు వరుసగా రెండేళ్లు టాప్లో నిలిచింది. » 34,086 లైవ్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే వీటి సంఖ్య 17% పెరిగింది. » ప్రీమియం సీట్స్ బుకింగ్స్ రెట్టింపు అయ్యింది. అభిమానులు వీఐపీ సీట్స్, ఎలివేటెడ్ డెక్స్, ప్రీమియం లాంజ్, ఖరీదైన ఆతిథ్యం కోరుకుంటున్నారు. » లైవ్ ఎంటర్టైన్మెంట్ వీక్షకుల సంఖ్య వైజాగ్లో 409%, వడోదర 230, ఇండోర్లో 214, షిల్లాంగ్లో 213% పెరిగింది. » నాటక ప్రదర్శనలు వీక్షిస్తున్న అభిమానుల సంఖ్య 45% అధికమైంది. -
కాస్ట్లీ అభిమానం.. కాసులు కుమ్మరిస్తేనే ఆ మహాభాగ్యం!
ఫుట్బాల్ లెజెండ్ మెస్సీతో ఒక్క ఫొటోకి 10 లక్షలంట!.. “అంత ఖర్చా?” అని ఆశ్చర్యపోయినవాళ్లు ఎందరో.కానీ ఆ ఒక్క ఫొటో కోసం టికెట్లు క్షణాల్లో అమ్ముడుపోయాయని తెలుసా?అటు స్టేడియం, థియేటర్ గేట్ల వద్ద పొడవైన క్యూలు సరిపోదన్నట్లు ఇటు ఆన్లైన్లో వీఐపీ ప్యాకేజీల హడావిడి.గుండెల నిండా ఉండాల్సిన అభిమానం.. ఇప్పుడు కాసులు కుమ్మరించి కొనుగోలు చేసే ట్రెండ్గా మార్కెట్లో దూసుకుపోతోంది..తమ అభిమాన తారలను, ఆటగాళ్లను.. గ్రౌండ్లలో, స్క్రీన్లపైనే చూడడంతో సరిపోదన్నట్లు వ్యవహరిస్తున్నారు కొందరు. ప్రత్యక్షంగా కలిసి వీలైతే ఓ ఫొటో.. కుదిరితే కలిసి భోజనం చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వేల నుంచి లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఫుట్బాల్ రారాజుగా పేరున్న మెస్సీతో ఫొటో కోసం రూ.10 లక్షల దాకా ఖర్చు ఇందులో భాగమే!. అది ఎలాగంటే..🐐గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా మెస్సీ భారత్లో పర్యటిస్తున్నారు. ఆయనతో మీట్ అండ్ గ్రీట్ ప్యాకేజీ కోసం రూ.9.95 లక్షలు + జీఎస్టీ కలిపి రూ.10 లక్షల దాకా అవుతోంది. ఈ ప్యాకేజీలో మెస్సీతో షేక్ హ్యాండ్, ప్రొఫెషనల్ గ్రూప్ ఫొటో(ఆరగురు దాకా ఉండొచ్చు.. నో సెల్ఫీ.. నో సోలో ఫొటో!), ప్రైవేట్ లౌంజ్ యాక్సెస్ (ఒక గంట పాటు, ప్రత్యేక ఫుడ్ & బేవరేజెస్తో) అన్నీ కలిపే ఉంటాయి. ఆయన ఎలాగూ వీవీఐపీ కాబట్టి ఆయనకు ఉండే భద్రత నడుమే ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే అవి మనకూ వర్తిస్తాయన్నమాట. సాధారణంగా.. బ్రాండ్ అంబాసిడర్గా మెస్సీ కొన్ని సెకన్లు కనిపిస్తే చాలని కోట్లు కమ్మరిస్తుంటాయి కంపెనీలు. సో.. జస్ట్ ఫొటోకే అంత ఖర్చా?.. అని అనుకోవడానికి ఏమాత్రం లేదు. 😲మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు ఖర్చవుతున్నట్లే.. మరో ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో విషయంలోనూ భారీగానే ఈ ఛార్జ్ ఉంటోంది. ఫుట్బాల్ స్పెషల్ ఈవెంట్స్లో పాస్తో కలిపి ఫొటో కోసం రూ. 5-7 లక్షల దాకా వసూలు చేస్తుంటారు. పాప్ సింగర్లు టేలర్ స్విఫ్ట్ ప్రదర్శన పాస్తో పాటు ఫొటో కోసం రూ.40 వేల నుంచి 80 వేల మధ్య, అలాగే.. మరో పాప్ సెన్సేషన్ జస్టిన్ బీబర్తో ఫొటో, సంతకం కోసం లక్ష దాకా ఛార్జ్ చేస్తున్నారు. కొరియాకు చెందిన బీటీఎస్ బ్రాండ్ మీట్ అండ్ గ్రీట్ ప్యాకేజీ రూ.2 లక్షలకు తక్కువ కాకుండా ఉన్నాయి మరి.👉ఎంతసేపు హాలీవుడ్ రేంజేనా?.. మన దగ్గర అలాంటి తారలు లేరని అనుకుంటున్నారా?. అక్కడికే వస్తున్నాం. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, షారూఖ్ ఖాన్, రణ్బీర్ కపూర్, అలియా భట్, దీపికా పదుకొనే.. కొందరు సెలబ్రిటీల విషయంలో ఇలాంటి చార్జీలు రూ.లక్షకు తక్కువ కాకుండానే ఉన్నాయి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఒకటి ఉంది. 😇ఈ డబ్బులు సెలబ్రిటీలు వసూలు చేసేవి కావు. కార్పొరేట్ ఈవెంట్స్, బ్రాండ్ ప్రమోషన్స్, చారిటీ ఈవెంట్లలో భాగంగా ఏర్పాటు చేసే మీట్ ద గ్రీట్లో భాగంగా వసూలు చేస్తారు. ఇందులో వీఐపీ ఆతిథ్యం, స్పెషల్ పాస్, బ్యాక్ స్టేజ్ ఫొటోలు.. వగైరాతో బోనస్గా ఫొటో దిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అవేవీ వాళ్లు వాళ్ల జేబుల్లో వేసుకునేందుకు నిర్ణయించే చార్జీలు కావన్నమాట. (నోట్: పైన పేర్కొన్న ఛార్జీలు ఫిక్స్ చేసినవి కావు.. ఈవెంట్లను.. డిమాండ్ను బట్టి మారే అవకాశమూ లేకపోలేదు). ☠️ఇది ప్రత్యేక వీఐపీ అనుభవం మాత్రమే. ఛార్జీలు ఉంటాయి కాబట్టి సాధారణ ప్రేక్షకులకు ఈ అవకాశం దక్కేది చాలా తక్కువ. పైగా వీటిని నిర్వాహకులు పక్కా వెబ్సైట్ల నుంచే నిర్వహిస్తుంటారు. అదే సమయంలో ఇక్కడ స్కామ్లకు అవకాశం లేకపోలేదు. అందుకే అధికారిక టికెట్ ప్లాట్ఫారమ్ల ద్వారా కాకుండా ఇతర మార్గాల్లో కోనే ప్రయత్నంలో మోసపోకూడదని చెబుతుంటారు. 🥱ఇంత చెప్పాక కూడా.. లక్షల తగలేసి ఇదేం వెర్రితలలు వేసిన అభిమానం రా అయ్యా?.. అంతెందుకు బుజ్జీ అనుకుంటున్నారా?.. ఎవరి ఇష్టం వారిది కదా!. సినీ తారలు క్యాజువల్గా బయట తిరిగినప్పుడు కూడా రిక్వెస్ట్ చేసి దిగొచ్చు. ఒకవేళ వాళ్లు నో చెప్పడమో.. ఫోన్లు లాక్కోవడమో.. కుదరితే నాలుగు పీకడమో చేశారాంటరా?.. అప్పుడు ఏ మహేష్బాబునో, వెంకీ మామనో, ఐకాన్ స్టార్ బన్నీనో, రౌడీ విజయ్దేవరకొండనో లేదంటో పరభాషల్లో రజినీకాంత్, విజయ్, విజయ్ సేతుపతినో, మమ్మూటీ, మోహన్లాల్ మాదిరి అభిమానుల కోసం స్పెషల్ సెషన్లు నిర్వహించి ఫ్రీగా ఫొటోలకు ఫోజులు ఇచ్చే తారలు బోలెడు మంది ఉండనే ఉన్నారు. అసలు ఇవన్నీ ఎందుకు.. ఏఐ ఉండనే ఉందిగా! అంటారా?.. మ్.. అది మీ ఇష్టం ఇక.. చెలరేగిపోండి. -
తండ్రి సొంతింటి కల నెరవేర్చిన బిడ్డ
అహ్మదాబాద్లోని కొత్త ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్న 61 ఏళ్ల గిర్ధర్భాయ్ జిరావాలా కళ్ల ముందు.. విషాద జ్ఞాపకాలు ఒకేసారి మెదిలాయి. వజ్రాల పాలిషింగ్ కార్మికునిగా కష్టపడి జీవితాన్ని నెట్టుకొచ్చిన ఆయన, ప్రస్తుత సొంత ఇంటిని, కొత్త ఫర్నిచర్ను చూస్తున్న ప్రతిసారీ, గుండెలో ఏదో తెలియని భారం. ఎందుకంటే, ఇది ఆయన కష్టంతో కొనుక్కున్న ఇల్లు కాదు. అది.. మరణానంతరం ఆయన పెద్ద కొడుకు మహేష్ జిరావాలా నెరవేర్చిన వాగ్దానం. కొద్ది రోజుల ముందు, గిర్ధర్భాయ్కి గుండెపోటు వచి్చంది. అప్పటివరకు కుటుంబంపై ఉన్న కొంత అప్పుల భారం, నరోడా ప్రాంతంలో అద్దె ఇంట్లో ఆరుగురు సభ్యుల జీవితం.. ఇవన్నీ ఆయనకు నిద్ర పట్టనివ్వలేదు. నేనున్నాను నాన్నా..కానీ, 34 ఏళ్ల సినీ నిర్మాత మహేష్, అన్నీ తానై తండ్రిని చూసుకునేవాడు. తండ్రి బాధను చూసి తట్టుకోలేక, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ‘నాన్నా! మీరు ఇకపై పనికి వెళ్లొద్దు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకోండి. నా తాజా సినిమాల నుంచి మంచి ఆదాయం వస్తుంది, దీపావళి లోపు అప్పులన్నీ తీర్చేసి, కొత్త ఇంటిని కొనుగోలు చేస్తాను’.. అని గట్టిగా మాటిచ్చాడు. ఆకాశం నుంచి దిగిన మృత్యువుఅప్పటికి మహేష్.. హేతల్ను వివాహం చేసుకుని కేవలం మూడు నెలలే అయింది. కొత్త జీవితం, పెద్ద కలలు.. కుటుంబమంతా ఆశగా దీపావళి పండుగ కోసం ఎదురుచూస్తోంది. కానీ, ఆశలకు ఆయుష్షు తక్కువైంది. జూన్ 12వ తేదీ.. విధి వక్రీకరించింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కుప్పకూలి, అగి్నకీలల్లో చిక్కుకుంది. ఆ భయంకరమైన విషాదంలో విమానంలోని ప్రయాణికులే కాక, నేల మీదున్న 19 మంది అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోయారు. హాస్టల్ పక్కన రోడ్డుపై నుంచి వెళ్తున్న మహేష్ జిరావాలా కూడా ఆ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. మరణం తర్వాత నెరవేరిన కల మహేష్ మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచినా, అతని వాగ్దానాన్ని మాత్రం మరిచిపోలేదు. విమాన ప్రమాదంలో పరిహారంగా ఎయిర్ ఇండియా, టాటా గ్రూప్ నుంచి మహేష్ కుటుంబానికి రూ.1.25 కోట్లు అందాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా హేతల్కు పరిహారంగా రూ.4 లక్షలు లభించాయి. మొత్తంగా అందిన రూ.1.29 కోట్ల నుంచి, మహేష్ భార్య హేతల్ తన వాటా కింద రూ.54 లక్షలు తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. మిగిలిన రూ.75 లక్షలు గిర్ధర్భాయ్ చేతికొచ్చాయి. కొడుకు కల నెరవేర్చాను.. కళ్లలో వేదన సుడులు తిరుగుతున్నా, గిర్ధర్భాయ్ మనసులో తన కొడుకు కోరికను నెరవేర్చాలనే తపన బలంగా ఉంది. ‘ఆ రూ.75 లక్షలతో, ముందుగా మహేష్ కలలుగన్నట్టు రూ.15 లక్షల అప్పును తీర్చేశాను. ఆ తర్వాత, రూ.45 లక్షలతో ఇంటిని కొనుగోలు చేశాను.. ఇలా నా కొడుకు కోరికను నెరవేర్చాను’.. అని గిర్ధర్భాయ్ చెప్పారు. కొత్త ఇంట్లో ఫర్నిచర్ కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసి, మిగిలిన రూ.5 లక్షలను తన మనవరాలి (తమ్ముడు కార్తీక్ కూతురు) భవిష్యత్తు కోసం పక్కన పెట్టారు. మహేష్ ఆ చిన్నారికి ఆరేళ్లు రాగానే దత్తత తీసుకోవాలని కలలు కనేవాడు. ‘ఆ రూ.75 లక్షల్లో ఇప్పుడు నా దగ్గర ఏమీ మిగలకపోయినా, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇకపై పనిచేయలేను. నా కొడుకు మరణం తర్వాత కూడా మా కుటుంబానికి గౌరవాన్ని అందించాడు’.. అని వణుకుతున్న గొంతుతో గిర్ధర్భాయ్ చెప్పారు. ఆకాశం నుంచి దిగిన మృత్యువు మహేష్ను దూరం చేసింది. కానీ, ఆ బిడ్డ త్యాగం ఒక తండ్రికి.. ఒక కుటుంబానికి ఆర్థిక ఆసరా కలి్పంచింది. సొంత ఇంటి కల నెరవేర్చి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. ఇది ప్రేమ.. వాగ్దానం ముందు మరణం కూడా ఓడిపోయిన విషాదగాథ.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫోన్ ఆఫ్.. బంధాలు ఆన్!
సెల్ఫోన్..సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది. యావత్ ప్రపంచాన్నీ గుప్పిట పెట్టేసింది. ఇది లేకపోతే ఎలా అన్నంతగా దైనందిన జీవితంలో మమేకమైంది. అయితే ఈ అద్భుత ఉపకరణం ఇతరత్రా దుష్ప్రభావాల మాటెలా ఉన్నా..కుటుంబ సభ్యుల అంతరాన్నీ గణనీయంగా పెంచుతోంది. అతిగా మొబైల్ ఫోన్ వాడకం కుటుంబ బంధాలు బీటలు పడడానికి కారణం అవుతోంది. ఇలాంటి సెల్ఫోన్ను కాసేపైనా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తే..! ఇతరత్రా ప్రయోజనాలతో పాటు జీవితంలోని అనేక మధుర క్షణాలను ఆస్వాదించే అవకాశమూ లభిస్తుందని స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో చెబుతోంది.చిన్న పనే..పెద్ద ప్రభావంఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలో సాధారణంగా ఒక్క భోజన సమయంలోనే కుటుంబ సభ్యులంతా కలుస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో కూడా ఫోన్ మాట్లాడటం లేదా వీడియోలు చూస్తుండటం అలవాటుగా మారిపోయింది. అయితే కనీసం ఆ టైమ్లోనైనా ఎలాంటి అంతరాయానికి తావు లేకుండా ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసేస్తే.. బంధాలు బలపడటం ఖాయమని వివో స్విచ్ ఆఫ్ స్టడీ–2025 వెల్లడిస్తోంది.శ్రేయస్సు, వ్యక్తిగత వృద్ధిని పెంపొందించుకోవడానికే ప్రజలు సాంకేతికతను ఉపయోగించుకోవాలని, ప్రియమైనవారితో లోతైన సంబంధాలను ఏర్పరచుకోవాలని సూచిస్తోంది. ఫోన్లు లేని క్షణాలు తమకు మధురానుభూతులు మిగిలిస్తున్నాయని, బలమైన బంధానికి బాటలు వేస్తున్నాయని తల్లిదండ్రులు, పిల్లలు సైతం భావిస్తుండడం విశేషం. ‘స్విచ్ ఆఫ్’ ఆలోచన చాలా చిన్నదే కావొచ్చు. కానీ కాస్త పరిణితి ప్రదర్శిస్తే అదో శక్తివంతమైన విధానంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుండటం గమనార్హం.ఏం చేయాలి..?భోజన సమయంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల పిల్లలతో ఎక్కువ అనుబంధం ఏర్పడినట్టు 81% మంది తల్లిదండ్రులు తెలిపారు. తల్లిదండ్రులు ఫోన్లలో బిజీగా ఉండటం వల్లే తాము వారితో తక్కువగా మాట్లాడుతున్నామని, ప్రత్యామ్నాయంగా ఏఐ వైపు మొగ్గు చూపుతున్నామని 67% మంది పిల్లలు చెబుతున్నారు.ఏది ఏమైనా గ్యాడెŠజ్ట్స్ను పక్కన పెట్టినప్పుడు కుటుంబంలో సంభాషణలు సులభంగా, అర్థవంతంగా అనిపిస్తాయన్నది 91% మంది పిల్లల మాట. నోటిఫికేషన్స్ను తగ్గించేలా ఫోన్ సెట్టింగ్స్ మార్చడం, అందరూ కూర్చునే ప్రదేశాలకు దూరంగా ఉపకరణాన్ని ఉంచడం వంటి చిన్నచిన్న మార్పులతో తల్లిదండ్రులు, పిల్లలు ప్రయోగాలు చేస్తున్నారు. ఫోన్ రహిత అలవాట్లను ఎంత ఎక్కువగా పాటిస్తే నిజమైన మధుర క్షణాలను పదిలపర్చుకోవచ్చని వారు అంటున్నారు.ఎవరెవరు పాల్గొన్నారంటే..స్మార్ట్ఫోన్ అధికంగా వాడడం వల్ల తల్లిదండ్రులు–పిల్లల సంబంధాలపై ఎటువంటి ప్రభావం పడుతుందో తెలుసుకునేందుకు మార్కెట్ రీసెర్చ్ కంపెనీ సైబర్ మీడియా రీసెర్చ్తో కలిసి వివో ఈ అధ్యయనం చేపట్టింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల నుంచి 1,017 మంది తల్లిదండ్రులు, 500 మంది పిల్లలు ఇందులో పాలుపంచుకున్నారు. ఈ స్మార్ట్ఫోన్ యూజర్లలో పెద్దల వయసు 35–50 కాగా, పిల్లలు 10–16 ఏళ్లవారు.స్టడీ హైలైట్స్⇒ రాత్రి భోజనం సమయంలోనే 72% మంది పిల్లలు తమ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడుపుతున్నారు.⇒ డైనింగ్ టేబుల్ వద్ద ఫోన్లలో మునిగితేలడం సంభాషణకు ప్రధాన నిరోధకమని 72% తల్లిదండ్రులు, 30% పిల్లలు పేర్కొన్నారు.⇒ ఉదయం నోటిఫికేషన్లు చెక్ చేయడం, మధ్యాహ్నం ఓటీటీల వీక్షణం, రాత్రిపూట స్క్రోలింగ్.. ఇదీ యూజర్ల తీరు.⇒ ఫోన్ రహిత విందులు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన, నమ్మకం, భాగస్వామ్యం గణనీయంగా మెరుగుపరుస్తాయి.⇒ స్విచ్ ఆఫ్ సమయంలో తల్లిదండ్రులతో మాట్లాడటానికి 87% మంది పిల్లలు మరింత సౌకర్యంగా ఉంటారు.⇒ తమ చుట్టూ ఉన్నవారు ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు పిల్లలు సైతం వారిని అనుసరిస్తున్నారు.అంకెల్లో యూజర్లు..ప్రపంచవ్యాప్తంగా 580 కోట్ల మంది స్మార్ట్ఫోన్ యూజర్లు న్నారు. ఒక్కో వ్యక్తి రోజుకు సగటున నాలుగున్నర గంటలు ఫోన్లో విహరిస్తున్నారు. మనవాళ్లేం తక్కువ కాదు. మన దేశంలో 70 కోట్ల మంది చేతుల్లో స్మార్ట్ఫోన్లు ఉంటే.. రోజుకు సగటున 5–7.4 గంటలు స్క్రోల్ చేస్తున్నారు. -
ఇండిగో.. ఇదేందయ్యో!
టికెట్ బుక్ అయిందంటే చాలు.. విమాన సంస్థ నమ్మకంగా తమను సమయానికి గమ్యానికి చేరుస్తుందన్న హామీ లభించినట్టు భావిస్తాం. వాతావరణం అనుకూలించక, సాంకేతిక సమస్యతో సర్వీసు రద్దయితే ప్రత్యేక పరిస్థితుల వల్లే ఇలా జరిగిందేమోనని అర్థం చేసుకుంటాం. అలాకాకుండా కార్యాచరణ నిర్లక్ష్యంతో కస్టమర్లకు ఇచ్చిన హామీని ఆపరేటర్ ఉల్లంఘిస్తే..? దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కార్పొరేట్ ఉదాసీనతగా భావించాలి. అంతేకాదు పెద్ద వైఫల్యం కూడా. ఇండిగో విషయంలో ఇదే జరిగింది. ప్రపంచం నివ్వెరపోయిన ఈ ఘటనతో కేంద్ర ప్రభుత్వం జవాబుదారీగా నిలవడానికి బదులుగా నిశ్శబ్దంగా వెనక్కి తగ్గడం కోట్లాది మందిని ఆశ్చర్యంలో ముంచెత్తిందని విశ్లేషకులు చెబుతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్భారత్లో ప్రజల ఊహలకు అతీతంగా ప్రభుత్వం ప్రవర్తించిందన్నది ప్రయాణికుల మాట. దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు తలెత్తినప్పుడు పౌర విమానయాన నియంత్రణ సంస్థ కఠిన చర్యల అమలుకు బదులు సలహా ప్రకటనలకే పరిమితమైంది. వివిధ దేశాల్లో విమానయాన సంస్థలు విఫలమైనప్పుడు ప్రయాణికులకు పరిహారం అందుతుంది. ఆపరేటర్లను వదిలిపెట్టరు. టికెట్కు అయిన ఖర్చు వెనక్కి ఇవ్వడం, భోజనాలు, పానీయాలు, ప్రత్యామ్నాయ విమానాల ఏర్పాటు వంటివి ఒకప్పుడు భారత్లో అమలయ్యాయి. కానీ దశాబ్ద కాలంగా నియంత్రణ చర్యలు పేలవంగా, అస్థిరంగా, అరుదుగా శిక్షలతో అమలవుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమి చేయొచ్చంటే.. సర్వీసు ఆలస్యం, కంపెనీ ప్రకటనలు, సమాచారాన్ని కస్టమర్లు రికార్డ్ చేయాలి. చాంతాడంత క్యూలు, ఖాళీ అయిన కౌంటర్లు, సిబ్బంది ప్రవర్తన మొదలైన వాటి ఫొటోలు, వీడియోలను సేకరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘భోజనం, వసతి, ప్రత్యామ్నాయ విమానం, ప్రయాణ బిల్లులను ఉంచుకోవాలి. వినియోగదారుల ఫోరమ్స్లో పరిష్కారం కోసం ఇటువంటి ఆధారాలు అవసరం. డీజీసీఏ ఎయిర్సేవా పోర్టల్కు ఫిర్యాదు చేయాలి.జిల్లా వినియోగదారుల కోర్టులనూ ఆశ్రయించాలి. సేవా ఉల్లంఘన కింద ఆపరేటర్కు చట్టపరమైన నోటీసు పంపాలి. బాధిత ప్రయాణికులు సమూహంగా ఏర్పడి ప్రభుత్వానికి, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, ఉమ్మడి పరిహార దావాలకు క్లాస్ పిటిషన్లను దాఖలు చేయవచ్చు’అని చెబుతున్నారు.బిజినెస్ క్లాస్ అంటేనే..: ఇండిగో వైఫల్యాన్ని బహిరంగంగా ఖండించాలని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ‘వివిధ కంపెనీల ప్రముఖులు, తరచూ ప్రయాణించేవారు ఆపరేటర్ను సామాజిక మాధ్యమాల్లో ఎండగడితే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నియంత్రణ సంస్థల కంటే బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు విమానయాన సంస్థలు ఎక్కువగా భయపడతాయి. పదేపదే సేవలు ఉల్లంఘించే ఆపరేటర్లతో ఒప్పందాలను కార్పొరేట్ సంస్థలు నిలిపివేయొచ్చు. పెద్ద క్లయింట్లను కోల్పోవడం అంటే వ్యాపారాన్ని పోగొట్టుకున్నట్టేనని విమానయాన సంస్థలు భావిస్తాయి’అని చెబుతున్నారు.మన దగ్గరా అమలవ్వాలి..: నియంత్రణ పరంగా సంస్కరణలకు పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేయాలన్నది నిపుణుల మాట. ‘ఈయూ 261 తరహా నిబంధనల కోసం ఒత్తిడి చేయాలి. ఎయిర్లైన్ వల్ల కలిగే అంతరాయానికి కస్టమర్ల అభ్యర్థన ఆధారంగా కాకుండా ఆటోమేటిక్గా పరిహారం అందాలి. ఆపరేటర్లే భోజనాలు, ఆశ్రయాన్ని కల్పించాలి. జరిమానాలు ఆర్థికంగా ఉండాలి. ఉల్లంఘనలు పెరిగిన కొద్దీ జరిమానా అదే స్థాయిలో అధికం కావాలి’అని సూచిస్తున్నారు.ఏ దేశంలో ఎలా ఉందంటే..చాలా పరిణతి చెందిన విమానయాన మార్కెట్లలో కంపెనీల నిర్లక్ష్యంతో ఇటువంటి పరిస్థితులు తలెత్తితే అక్కడి ప్రభుత్వాలు చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తాయి. భారీ జరిమానాలు, కోర్టులు, వినియోగదార్ల ఫోరమ్స్లో వ్యాజ్యాలు, ఆపరేటర్లపై కఠిన చర్యలతోపాటు నియంత్రణ పరంగా జోక్యం చేసుకుంటాయి. యూరప్: ఈయూ నిబంధన 261 ప్రకారం.. విమానం ఆలస్యం, రద్దు అయితే ఒక్కో ప్యాసింజర్కు 600 యూరోల వరకు పరిహారం చెల్లించాలి. తప్పనిసరి భోజనం, పానీయాలు, వసతి కల్పించాలి. టికెట్ ధరను పూర్తిగా వెనక్కి ఇవ్వడం లేదా మరో మార్గంలో (రీ–రూటింగ్) గమ్యస్థానానికి పంపించాల్సిన బాధ్యత ఆపరేటర్దే. అమెరికా: 2022లో సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ సంక్షోభంతో ప్రజల ఆగ్రహం, కోర్టుల్లో వ్యాజ్యాల కారణంగా ప్రభుత్వం దర్యాప్తు జరిపింది. భారీ మొత్తంలో కంపెనీ రీఫండ్ చేయాల్సి వచ్చింది. ప్రయాణికులకు హోటల్ కవరేజ్, భోజనం, రీబుకింగ్ సహాయం, రీఫండ్స్ లభించాయి.కెనడా: ఎయిర్ ప్యాసింజర్ ప్రొటెక్షన్ నిబంధనల ప్రకారం ఎయిర్లైన్ లోపం కారణంగా తలెత్తే అంతరాయాలకు ప్రతి ప్యాసింజర్కు 125–1,000 కెనడియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఆ్రస్టేలియా: ప్రయాణికులను తప్పుదారి పట్టించడం, వారికి ఏదైనా హాని కలిగితే విమానయాన నియంత్రణ సంస్థలు ఆపరేటర్లకు జరిమానా విధిస్తాయి. -
కోర్–5 సూపర్ క్లబ్
వరల్డ్ ఆర్డర్. ఒక్క వాక్యంలో చెప్పాలంటే బలం, సామర్థ్యం ఆధారంగా వరుస క్రమంలో దేశాల అమరిక. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాలే శాసించే ఈ వరల్డ్ ఆర్డర్ త్వరలో పెను మార్పులను చవిచూడనుందా? ఇప్పటిదాకా అత్యంత బలోపేతమైన కూటమిగా ఉన్న జీ7 వైభవం గతించనుందా? దాన్ని తోసిరాజనేలా అతి శక్తిమంతమైన సరికొత్త కూటమి ఒకటి శరవేగంగా పురుడు పోసుకుంటోందా? అన్ని రంగాల్లోనూ నిర్నిరోధంగా దూసుకుపోతున్న నయా భారత్ ది అందులో అతి కీలక పాత్ర కానుందా? అంటే, అవుననే అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ముఖ్యంగా కొద్దిరోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు, చేతలు, చాప కింద నీరులా ఆయన చకచకా సాగిస్తున్న ప్రయత్నాలు ఇందుకు ప్రబల సంకేతాలేనని చెబుతున్నారు. కోర్–5 పేరిట కొత్త కూటమికి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు అమెరికాకు చెందిన ప్రఖ్యాత డిజిటల్ వార్తా పత్రిక పొలిటికో రాసి కథనం అంతర్జాతీయంగా పెను సంచలనమే సృష్టిస్తోంది. అమెరికా, భారత్, మరో రెండు ఆసియా దిగ్గజాలైన చైనా, జపాన్ తో పాటు ఆశ్చర్యకరంగా రష్యా కూడా ఇందులో భాగస్వామి కానుందని పొలిటికో కథనం సారాంశం. అమెరికాకు సంబంధించిన రక్షణ, జాతీయ భద్రతా వ్యవహారాలను అత్యంత కచి్చతత్వంతో నివేదించే డిఫెన్స్ వన్ సైట్ ను ఉటంకిస్తూ అది ఈ మేరకు పేర్కొంది. ఈ కోర్ గ్రూప్నకు ముద్దుగా ’సీ5 సూపర్ క్లబ్’ గా నామకరణం కూడా చేసింది! నిజంగా గనుక అదే జరిగితే చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన కూటమి ఇదే అవుతుందని అంతర్జాతీయ నిపుణులు ముక్తకంఠంతో చెబుతున్నారు. అమెరికా జాతీయ భద్రతా వ్యూహంలో ప్రచురించకుండా రహస్యంగా ఉంచిన భాగంలో సీ5 గురించి వివరంగా ఉన్నట్టు వాషింగ్టన్, వైట్ హౌస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి! ట్రంప్ తీసుకువస్తున్న సరికొత్త సీ 5 ప్రతిపాదనలపై భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధినేత జిన్పింగ్, జపాన్ ప్రధాని తకాయిచీ స్పందనలేమిటో తెలియాల్సి ఉంది. యూరప్ దేశాలకు చెక్? జీ7 కూటమిలో అమెరికా, కెనడా , జపాన్ ను మినహాయిస్తే బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ రూపంలో నాలుగు యూరప్ దేశాలే ఉన్నాయి. పలు అంశాల్లో వాటి దూకుడు పట్ల ట్రంప్ కొద్దికాలం గుర్రుగా ఉన్నారు. చీటికిమాటికి అన్ని విషయాల్లోనూ తమ మాటే నెగ్గాలనే ఒంటెత్తు పోకడతో అవి శిరోభారంగా మారాయని భావిస్తున్నారు. వాటికి చెక్ పెట్టేందుకే ఈ కొత్త కూటమికి ఆయన తెర తీస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే అమెరికా విదేశాంగ విధానంలోనే ఇది పెను మార్పు కానుంది! అమెరికా అంతర్జాతీయ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరించడం మొదలుపెట్టిన గత 80 ఏళ్లలో నిత్యం యూరప్ ను తన అతి సన్నిహిత భాగస్వామిగానే పరిగణిస్తూ రావడం తెలిసిందే.ట్రంప్ సంకేతాలు సీ 5 గ్రూప్ గురించి నిజానికి ట్రంప్ కొంతకాలంగా స్పష్టమైన సంకేతాలే ఇస్తూ వస్తున్నారు. గత జూన్ లో జరిగిన జీ7 శిఖరాగ్రాన్నే ఇందుకు ఆయన వేదికగా మలచుకోవడం విశేషం. జీ7 కూటమిలో రష్యా కొనసాగి ఉండాల్సిందని, ఆ మాటకొస్తే చైనాకూ ఎన్నడో చోటు దక్కాల్సిందని ఆయన కుండబద్ధ్దలు కొట్టారు. తొలుత జీ8గా ఉన్న ఈ కూటమి కాస్తా, 2014లో క్రిమియాను ఆక్రమించిన కారణంగా రష్యాకు ఉద్వాసన పలకడంతో జీ7గా మారింది. ‘నిజానికి అతి పెద్ద తప్పిదమది. అలా చేయకుంటే నేడు ఇంత భారీ యుద్ధమే జరుగుతుండేది కాదు‘ అని ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఉదేశించి జీ7 వేదికగానే ట్రంప్ కుండబద్ధ్దలు కొట్టారు. సి5 మరీ సత్యదూరం ఏమీ కాకపోవచ్చని బైడెన్ హయాంలో అమెరికా జాతీయ భద్రతా మండలిలో కీలకపాత్ర పోషించిన టోరీ తౌసిగ్ చెప్పడం విశేషం. ‘ట్రంప్ కు సిద్ధాంతాలపై పెద్దగా నమ్మకం లేదు. తన ఆలోచనలకు, వ్యూహాలకు, ప్రణాళికలకు ఏది పనికొస్తే అదే అప్పటికి ఆయన సిద్ధాంతం! ఆ లెక్కన కొంతకాలంగా తనకు శిరోభారంగానే గాక అమెరికాకు ఆర్థికంగానూ, ఇతరత్రా కూడా భారంగానే పరిణమిస్తున్న యూరప్ దేశాలను వదిలించుకునేందుకే ట్రంప్ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది‘ అని ఆయన వివరించారు.అప్పుడే ఎజెండా రెడీ? అవుననే అంటోంది పొలిటికో. జీ7 మాదిరిగా తర చూ భేటీ కావాలని, అంతర్జాతీయ అంశాలపై లోతుగా చర్చించాలని ట్రంప్ భావిస్తున్నట్టు అది వివరించింది. అంతేకాదు, పశ్చిమాసియా భద్రతే సీ5 తొలి ఎజెండా అని కూడా డిఫెన్స్ వన్ ను ఉటంకిస్తూ చెప్పేసింది! ముఖ్యంగా ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య ఉప్పూ నిప్పుగా ఉన్న సంబంధాలను సరిదిద్దడం సీ5 ’తొలి అసైన్ మెంట్’ అని చెప్పుకొచి్చంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫస్ట్ క్లాస్ నేషనల్ హైవేలు.. మృత్యు మృగాలు!
ప్రతి నిమిషానికి 2.. గంటకు 136.. రోజులో 3,260 మంది.. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల రూపంలో పోతున్న ప్రాణాల సంఖ్య ఇది. సేఫ్టీ ప్రచారాలు.. చర్యలు ఈ లెక్కను మరుసటి ఏడాదికి పెరగకుండా ఆపలేకపోతున్నాయి. ఇందునా భారతదేశం యాక్సిడెంట్లకు హాట్స్పాట్గా కొనసాగుతూ వస్తోంది. లక్షలాది ప్రమాదాలు, అపార ప్రాణనష్టం దేశానికి ఒక పెద్ద సవాలుగా మారాయి. అందునా.. శీతాకాలంలో ఈ రేటు మరింతగా ఉంటోంది. ఆ లోతుల్లోకి వెళ్తే.. భారతదేశం రోడ్డు భద్రతలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది. 2025 జనవరి-జూన్ మధ్య యాక్సిడెంట్లో రూపంలో 29,000 మంది(కేవలం జాతీయ రహదారులపైన) బలయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. కానీ, భారత్లో ప్రతి సంవత్సరం సుమారు 1.5–1.7 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు (అన్నిరకాల యాక్సిడెంట్ల రూపంలో). ఇది ప్రపంచ మొత్తం మరణాల్లో 11%గా ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా (2025) నివేదిక ప్రకారం.. రోడ్డు ప్రమాదాల రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఐదవ అత్యంత ప్రమాదకర దేశంగా ర్యాంక్ అయ్యింది. డ్రైవింగ్ పరిస్థితులు, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు, అధిక వేగం ప్రమాదాలకు కారణంగా ఈ నివేదిక చూపించింది. డాటా ఫర్ ఇండియా అనే సంస్థ సర్వే ప్రకారం.. భారత్ ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలు నమోదు చేసే దేశం.కారణాలు ఇవిగో..👇👉చాలా రహదారులు సరైన డిజైన్ ప్రమాణాలు లేకుండా నిర్మించబడ్డాయి. వాటిపై సంకేతాలు (sign boards), స్పీడ్ బ్రేకర్లు, డివైడర్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్ట్రీట్ లైటింగ్ లేకపోవడం రాత్రి సమయంలో ప్రమాదాలకు దారితీస్తోంది. 👉ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం.. అధిక వేగం, తప్పు దిశలో డ్రైవింగ్, రెడ్ సిగ్నల్ దాటడం వంటి ఉల్లంఘనలు కారణాలుగా ఉంటున్నాయి. మద్యం సేవించి డ్రైవింగ్, మొబైల్ వాడుతూ డ్రైవింగ్ కూడా ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ తక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రమాదాలు అధికంగా జరుగతున్నాయి. వీటికి తోడు.. 👉టూవీలర్ హెల్మెట్, ఫోర్ వీలర్లో సీటు బెల్ట్ వాడకాలు కూడా మరణాల రేటుపై ప్రభావం చూపెడుతోంది. హిట్ అండ్ రన్, ఓవర్ స్పీడ్లు కూడా మరణాలకు కారణం అవుతున్నాయి.డబ్యూహెచ్వో అంచనా ప్రకారం, హెల్మెట్ వాడితే తల గాయాలు 40% తగ్గుతాయి, సీటు బెల్ట్ వాడితే మరణాలు 50% తగ్గుతాయి.👉ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ (Golden Hour) లో చికిత్స అందకపోవడం వల్ల మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అంబులెన్స్ సేవలు, ట్రామా కేర్ సెంటర్లు సరైన స్థాయిలో ఉండడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రులు దూరంగా ఉండటం వల్ల సమయానికి చికిత్స అందక ప్రాణాలు పోతున్నాయి.శీతాకాలంలో రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరగుతున్నాయి. గణాంకాల ప్రకారం.. చలికాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య 30వేలకు తక్కువగా ఉండడం లేదు. ఇందుకు కారణాలు లేకపోలేదు. పొగమంచు (Fog): దృశ్యమానం(విజిబిలిటీ) తగ్గిపోవడం వల్ల వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడం సాధారణంగా మారింది.తడి రహదారులు: మంచు, తేమ కారణంగా రహదారులు జారిపోవడం, బ్రేకులు సరిగా పనిచేయకపోవడం.అధిక వేగం: డ్రైవర్లు వేగం తగ్గించకపోవడం, ఫాగ్ లైట్లు వాడకపోవడం.అత్యవసర సేవల ఆలస్యం: ప్రమాదం జరిగిన వెంటనే వైద్య సహాయం అందకపోవడం వల్ల మరణాలు పెరుగుతాయి.యాక్సిడెంట్.. డెత్స్.. లెక్కలు:2022లో: 4.5 లక్షల ప్రమాదాలు, 1.5 లక్షల అధికారిక మరణాలు2023లో: 4.8 లక్షల ప్రమాదాలు, 1.72 లక్షల మరణాలు2024లో.. 4.73 లక్షల యాక్సిడెంట్లు(కాస్త తగ్గినా) మరణాలు 1.77 లక్షలకు పెరిగాయి2025 (జనవరి–జూన్): జాతీయ రహదారులపై 29,018 మరణాలు (పూర్తి గణాంకాలు రావాల్సి ఉంది) భారతదేశంలో హైవేలు మొత్తం రహదారి నెట్వర్క్లో ఉండేది కేవలం 2% మాత్రమే. వీటికి ఫస్ట్ క్లాస్ హైవేల గుర్తింపు ఉంది. కానీ, దేశంలో జరిగే రోడ్డు ప్రమాద మరణాల్లో 50% కంటే ఎక్కువ వాటా వీటికే ఉంది. 2025లో ఇప్పటిదాకా సగటున రోజుకి హైవేల మీద 150 మరణాలు సంభవించాయి. అంటే.. ప్రతీ గంటకూ ఆరు మరణాలు అన్నమాట. ఈ లెక్కన హైవేలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వెనుక నుంచి ఢీకొనడం (Rear-end collisions) రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా జరుగుతున్న విభాగం. ఇవి మొత్తం ప్రమాదాల్లో 21%కి కారణమవుతాయి. అలాగే మొత్తం మరణాల్లో 20% వీటి నుంచే ఉంటున్నాయి.హిట్-అండ్-రన్ కేసులు రోడ్డు ప్రమాదాల్లో మరణాలకు పెద్ద కారణం. ఇవి మొత్తం మరణాల్లో 18% వాటా కలిగి ఉన్నాయి. లోయల్లో వాహనాల పడి జరిగే ప్రమాదాలు.. ఐదు శాతం కంటే తక్కువే ఉంటోంది. కానీ, వీటి ద్వారా భారీ ప్రాణ నష్టం సంభవిస్తోంది. మధ్యాహ్నా టైంలోనే అధిక యాక్సిడెంట్లు!గణాంకాలను (MoRTH నివేదికలు) పరిశీలిస్తే.. ఉదయం 6 గంటల నుండి 12 గంటల మధ్య ప్రమాదాలు 25–30% వరకు నమోదవుతాయి. - మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల సమయంలో సుమారు 40% దాకా ఉంటోంది(అధిక రద్దీ కారణంగా..). ఇక.. సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి మధ్య ప్రమాదాల సంఖ్య 20–25% దాకా ఉంటోంది. అర్ధరాత్రి నుండి ఉదయం 6 గంటల సమయంలోనే ప్రమాదాల సంఖ్య కనిష్టంగానే ఉంటోంది. కానీ, అర్ధరాత్రి దాటాక జరిగే యాక్సిడెంట్లలోనే మరణాల రేటు అధికంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాల సంభవించే దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. ఉత్తర ప్రదేశ్(2024లో 24వేల మరణాలు.. ఈ ఏడాది కూడా అంతకు మించే..), తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ,రాజస్థాన్లో అత్యధిక మరణాల నమోదు అవుతున్నాయి. ఈ లెక్కన సగం రోడ్డు ప్రమాదాలు ఈ రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయి. -
ఆమె టైమ్ బాలేదు!
సాధారణంగా ఉద్యోగులు ఆలస్యంగా ఆఫీసుకు వస్తేనే కంపెనీలు కఠిన చర్యలు తీసుకుంటాయి. కానీ, స్పెయిన్లో ఒక మహిళ.. చాలా ముందుగా ఆఫీసుకు వస్తోందన్న కారణంతో ఆమెను ఉద్యోగం నుంచి పీకేశారు. మీరు చదివింది నిజమే.. స్పెయిన్లో రూల్ అంటే రూలే మరి. మేనేజర్ల ఆదేశాలుబేఖాతర్.. స్పెయిన్కు చెందిన 22 ఏళ్ల ఒక ఉద్యోగిని అధికారికంగా ఉద యం 7.30 గంటలకు పని ప్రారంభించాలి. కానీ, ఆమె అలవాటు ప్రకారం రోజూ దాదాపు 6.45 గంటలకే కార్యాలయానికి చేరుకునేది. ఒకరోజు, రెండు రోజులు కాదు.. ఏకంగా ఏడాదికి పైగా ఇదే పద్ధతిని పాటించింది. ఈ విషయంలో కంపెనీ ఆమెకు చాలాసార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఆ సమయంలో ఆమెకు కేటాయించిన పనులేవీ లేవని, ముందే రాకూడదని స్పష్టంగా చెప్పినా.. ఆమె వినిపించుకోలేదు.ఎందుకుముందే వచ్చావ్! కంపెనీ యాజమాన్యానికి సహనం నశించింది. ఆదేశాలను ఉద్యోగిని పట్టించుకోకపోవడం, నియమాలను ఉల్లంఘించడం తీవ్రమైన దు్రష్పవర్తనగా భావించింది. ‘ఇది కేవలం ఉత్సాహం కాదు, కంపెనీ ఆదేశాలను పదేపదే ధిక్కరించడమే’.. అని మేనేజర్లు స్పష్టం చేశారు. ఆ సమయంలో చేయగలిగిన ముఖ్యమైన పనులేవీ లేనప్పటికీ, కావాలనే పదేపదే ఆదేశాలను బేఖాతర్ చేయడంతో ఆమెను ఉద్యోగం నుండి తొలగించారు.న్యాయస్థానంలో నూచుక్కెదురుకంపెనీ నిర్ణయంతో ఆగ్రహించిన ఆ మహిళ.. తన తొలగింపు అన్యాయమని వాదిస్తూ అలికెంట్ సోషల్ కోర్టులో సవాలు చేసింది. అయితే, కోర్టులో విచారణ సందర్భంగా.. సంస్థ ఎన్ని హెచ్చరికలు చేసినా ఆమె అదే అలవాటును కొనసాగించిందని తేలింది. కొన్నిసార్లు, ఆమె ఆఫీసుకు రాకముందే కంపెనీ యాప్లో లాగిన్ కావడానికి కూడా ప్రయతి్నంచినట్లు కోర్టు దృష్టికి వచి్చంది.రూల్ అంటే రూలే మరి..న్యాయమూర్తి.. ఉద్యోగం నుండి తొలగించడానికి కారణం ‘ముందే ఆఫీస్కు రావడం’కాదని, పనిచేసే చోట నియమాలను పాటించడానికి నిరాకరించడమే ప్రధాన కారణమని తన తీర్పులో స్పష్టం చేశారు. ఉద్యోగుల చట్టం ఆర్టికల్ 54 ప్రకారం ఇది నిబంధనల ఉల్లంఘనే అని తేలి్చ, కంపెనీ తొలగింపు నిర్ణయాన్ని కోర్టు సమరి్థంచింది. ప్రస్తుతానికి తీర్పు మారకపోయినా, ఆమె ఇంకా వాలెన్సియా సుప్రీంకోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాల్కనీకి వేలాడింది..
అది చైనాలోని ఒక నగరం. అందులో ఓ హై–రైజ్ అపార్ట్మెంట్లోని 10వ అంతస్తు.. అకస్మాత్తుగా ఓ మహిళ బాల్కనీ నుంచి వేలాడటం కనిపించింది. అది చూసినవారంతా హడలిపోయారు. చెమటలు పట్టించిన ఈ దృశ్యం వెనుక కథ తెలిసి ముక్కున వేలేసుకున్నారు. ఒక వ్యక్తి భార్య లేని సమయంలో.. అతని ఇంటికి ప్రియురాలు వెళ్లింది. వారిద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో.. భార్య హఠాత్తుగా ఇంటికి తిరిగి వచ్చేసింది. దీంతో భయపడిన ఆ వ్యక్తి.. తన ప్రియురాలిని దాచిపెట్టే ప్రయత్నంలో ఆమెను బాల్కనీలోకి నెట్టేశాడు. పది అంతస్తుల ఎత్తులో ఆ మహిళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వేలాడటం మొదలుపెట్టింది. అది చుట్టుపక్కల వారు గమనించారు, పట్టు కోల్పోకుండా నిలబడటానికి ఆమె విఫలయత్నం చేసింది. ఇది గమనించిన వారు అరుపులతో, ఆందోళనతో గంటల తరబడి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇంట్లో ప్రియుడు.. బయట ప్రియురాలు ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో, ఫ్లాట్ లోపల ఉన్న ప్రియుడు.. కిటికీలోంచి ప్రియురాలితో ఏదో మాట్లాడటం కనిపించింది. ఇంతకీ ఆమె వేలాడటానికి కారణం ఏంటంటే... ఆ మహిళ ప్రియుడి భార్యకు దొరక్కుండా దాక్కోవడానికి ప్రయతి్నంచడమే.. తన భార్య రాగానే ప్రియుడు ఆ మహిళను హడావిడిగా బాల్కనీ వైపు నెట్టేశాడని, దాక్కోవాలని సూచించాడని స్థానిక మీడియా పేర్కొంది. పరువు పోతుందనే భయం.. ఆమెను చావు అంచుల్లోకి నెట్టింది. ప్రాణభయంతో వణికిపోతున్న ఆ మహిళ చేతిలో ఫోన్ పట్టుకునే ఉంది. ఏం చేయాలో తోచక, చివరికి బలం తెచ్చుకుని.. డ్రైన్పైప్లను, కిటికీ అంచులను పట్టుకుని ధైర్యంగా కిందకు దిగడం ప్రారంభించింది. పక్కింట్లో ఆపద్బంధువు!భవనం పక్క గోడకు వేలాడుతూ, అతి కష్టం మీద ఓ వాటర్ పైప్ పట్టుకుని పక్క ఫ్లాట్ కిటికీ వైపు ఆమె జారింది. పక్క ఫ్లాట్ యజమాని కిటికీ తట్టగా.. చివరకు ఆ ఆపద్బాంధవుడు ఆమెను లోపలికి సురక్షితంగా లాగాడు. ఎట్టకేలకు ప్రాణాలను దక్కించుకున్నా.. ఈ సంఘటన మాత్రం ఆమె పరువును, ప్రియుడి పరువును నిలువునా బజారున పడేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మంచుకొండల్లో పెనుముప్పు!
హిమాలయాలు ప్రస్తుతం నివురుగప్పిన నిప్పేనా? మంచుకొండల్లో పెను విలయం తప్పదా? అది కూడా అతి త్వరలోనే ముంచుకురానుందా? ఆ ఆస్కారం చాలానే ఉందని చెబుతున్నారు సైంటిస్టులు. ఏకంగా 7.6 తీవ్రతతో జపాన్ ను తాజాగా వణికించిన లేను భూకంపం ఇందుకు సూచికేనని అని వారు అభిప్రాయపడుతున్నారు. రానున్న ఉత్పాతాన్ని ఇప్పటి నుంచే ’గ్రేట్ హిమాలయన్ ఎర్త్ క్వేక్’ గా పిలిచేస్తున్నారు కూడా! పేలనున్న మందుపాతర! జపాన్ భూకంపం వంటి ప్రాకృతిక విలయాలకు ఆస్కారం అత్యంత ఎక్కువగా ఉండే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ మీద ఉన్న విషయం తెలిసిందే. దాంతో అక్కడ జనానికి ఈ విపత్తులు, ముఖ్యంగా భూకంపాలతో సహజీవనం పరిపాటిగా మారింది. త్వరలో హిమాలయాల్లో కూడా అదే పరిస్థితి తలెత్తేలా ఉందన్నది భూ భౌతిక శాస్త్రవేత్తల ఆందోళన. హిమాలయ ప్రాంతాన్ని ఏ క్షణంలోనైనా పేలనున్న మందుపాతరగా వాళ్లు అభివరి్ణస్తున్నారు. హిమాలయాల అడుగున టెక్టానిక్ ప్లేట్ల కుమ్ములాటే ఇందుకు ప్రధాన కారణం. ఎందుకంటే అక్కడ ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ నిరంతరం యురేషియన్ ప్లేట్ ను ఢీకొడుతూ వస్తోంది. దాంతో కొన్ని సహస్రాబ్దాలుగా ఆ ప్రాంతమంతటా భూగర్భంలో విపరీతమైన ఒత్తిడి నెలకొని ఉంది. అది ఎప్పుడో ఒకప్పుడు అతి భారీ పరిమాణంలో విడుదలవడం ఖాయమన్నది సైంటిస్టుల మాట. ‘అదే జరిగితే రిక్టర్ స్కేలుపై ఏకంగా 8, లేదా అంతకు మించిన తీవ్రతతో భూమి కంపిస్తుంది. దాని ప్రభావానికి మొత్తం ఉత్తర భారతమే గాక నేపాల్, ఇరుగుపొరుగు దేశాలు కూడా కనీవినీ ఎరగనంతటి స్థాయిలో భారీ ప్రాణ, ఆస్తి నష్టాలను చవిచూడాల్సి రావచ్చు‘ అని వారు హెచ్చరిస్తున్నారు. చరిత్రే సాక్షి హిమాలయాలకు భూకంపాలు, అందులోనూ భారీ ప్రకంపాలు నిజానికి కొత్తేమీ కాదు. 1934లో ఏకంగా 8 తీవ్రతతో సంభవించిన భూకంపం బిహార్ మీదుగా నేపాల్ దాకా ఉత్పాతం సృష్టించింది. ఇటీవలి చరిత్ర చూసుకున్నా, 2015లో నేపాల్లోని హిమ సానువుల్లో 7.8 తీవ్రతతో వచి్చన భూకంపం అక్కడ భారీ జన, ఆస్తి నష్టాలకు కారణమైంది. అయితే హిమాలయాల్లో భూకంపం వచ్చేస్తుందని ఆందోళన అక్కర్లేదన్నది నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ డైరెక్టర్ డాక్టర్ ఓం ప్రకాశ్ మిశ్రా మాట. ‘హిమాలయాల్లో సైంటిస్టులు చెబుతున్నట్టు ప్రాకృతిక ఉత్పాతమేదీ రాబోదు. నిజానికి ఎన్నెన్నో ఉత్పాతాల నుంచి దేశాన్ని కాపాడుతున్న పెట్టని కోట మన హిమ సానువులు. భూ పలకల ఒరిపిడి విలయానికి దారి తీస్తుందని బెంబేలు పడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఆ ఒరిపిడి తాలూకు ఒత్తిడి 2.5 నుంచి 3.5 తీవ్రతతో కూడిన భూకంపాల రూపంలో ఎప్పటికప్పుడు విడుదలవుతూనే ఉంది. కనుక గ్రేడ్ హిమాలయన్ ఎర్త్ క్వేక్ గురించి మరీ ఆందోళన పనిలేదు‘ అని చెప్పుకొచ్చారాయన. కానీ ఎవరెన్ని చెప్పినా సమీప కాలంలో భారీ భూకంపానికి హిమ సానువులు సిద్ధమవుతున్నాయన్నదే మెజారిటీ శాస్త్రవేత్తల అభిప్రాయం. బీఐఎస్ దీ అదే మాట ఇటీవల జరిగిన దేశ భూకంప రిస్కు జోన్ల మ్యాపింగ్ కూడా మెజారిటీ శాస్త్రవేత్తల అభిప్రాయాయాన్నే బలపరుస్తుండటం విశేషం. అందులో భాగంగా భూకంప జోన్ రూపురేఖలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) తాజాగా సవరించింది. అత్యధిక రిసు్కతో కూడిన జోన్ 6 ను కొత్తగా ఏర్పాటు చేయడమే గాక హిమాలయ ప్రాంతమంతటినీ దాని పరిధిలోనే చేర్చింది! ఇవన్నీ మంచు కొండల్లో ముంచుకు రాగల పెను ముప్పు ముందస్తు సూచికలేనని చెబుతున్నారు. -
తల వేలాడేస్తున్న.. పైలట్ పక్షులు
పైలట్ల పని వేళల విషయంలో పౌర విమానయాన సంస్థ (డీజీసీఏ) ఇచ్చిన మార్గదర్శకాలను పాటించడం ఇష్టం లేక ఇష్టారాజ్యంగా విమానాలు రద్దుచేసి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసింది ఇండిగో సంస్థ. ఈ నేపథ్యంలో పైలట్ల పని గంటలు, వారిపై ఒత్తిడి వంటి అంశాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భారత పౌర విమానయాన రంగం శరవేగంతో ‘టేకాఫ్’ అవుతున్నప్పటికీ, నియమ నిబంధనలకు విరుద్ధంగా పైలట్ల చేత పని చేయించటం అన్నది ఊహించని ‘పక్షిఘాతం’లా పరిణమించే ప్రమాదం ఉందని ‘సేఫ్టీ మేటర్స్ ఫౌండేషన్’ అనే ఎన్జీఓ గత జూన్లోనే హెచ్చరించిన విషయం తాజాగా వార్తల్లోకి వచ్చింది.‘సేఫ్టీ కల్చర్ సర్వే –2024: పైలట్ ఫెటీగ్ అండ్ వర్క్ ఎన్విరాన్మెంట్’ పేరిట 530 మంది పైలట్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న ‘సేఫ్టీ మేటర్స్ ఫౌండేషన్’.. పనిభారం పైలెట్లకు కుంగదీస్తోందని వెల్లడించింది. ఇది భారతీయ పైలట్ల ఆరోగ్యం, భద్రత వంటి అంశాలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థ.విమాన విధులు–సమయ పరిమితులలో ప్రభుత్వం చేసిన మార్పులను అమలు చేయకపోవటం వల్ల పైలట్లు అలసటకు గురవుతున్నారని తెలిపింది. పైలట్లకు విశ్రాంతి తప్పనిసరి అని, రాత్రి విధులను కుదించవలసిన అవసరం కూడా ఉందని సూచించింది.డిమాండ్ను తట్టుకునేందుకే!అదనపు పనిగంటలు, ఇతర వృత్తి సంబంధ మార్పుల వల్ల భారతీయ పైలట్లలో 83 శాతం మంది తీవ్రమైన అలసటకు గురవుతున్నట్లు సర్వే గుర్తించింది. పౌర విమానయానం వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో డిమాండ్ను తట్టుకోవటానికి రాత్రి నడిపే విమాన సర్వీసులను పెంచటం కూడా సమస్యకు కారణం అవుతున్నట్లు సర్వే వివరించింది. ఇండియాలో ఒక పైలట్ సగటు విమాన పని గంటలు 2015లో 407 వరకు ఉండగా, 2020లో అవి 165 గంటలకు తగ్గినప్పటికీ, తిరిగి 2024లో 246 గంటలకు పెరిగాయని సర్వే పేర్కొంది.‘రోస్ట్’ చేస్తున్న రోస్టర్! సేఫ్టీ కల్చర్ సర్వే – 2024 ప్రకారం, తరచు జరుగుతున్న రోస్టర్ మార్పులు (పైలట్ విధుల వేళల్లో మార్పులు) తమ అలసటకు కారణం అవుతున్నట్లు 74 శాతం పైలట్లు తెలిపారు. 19.4 శాతం మంది మరీ అంత స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ, మార్పులు గణనీయమైన ప్రభావాన్నే చూపుతున్నాయని అంగీకరించారు.రీ–అసైన్ మెంట్లువిమానయాన సంస్థలు పైలట్లకు మొదట కేటాయించిన విమానాన్ని మార్చినప్పుడు (టెయిల్ స్వాప్) పైలట్లు ఒత్తిడికి, అలసటకు లోనవుతున్నట్లు సర్వే గుర్తించింది. దాదాపు 63.8 శాతం మంది పైలట్లు టెయిల్ స్వాప్ అనేది తీవ్రమైన అలసటను కలిగిస్తుందని అన్నారు.పెద్దగా పెరగలేదుభారతదేశంలో పైలట్ల సంఖ్య 2015లో 3,973 నుండి 2024లో 11,775కి పెరిగింది. కానీ ఈ పదేళ్లలో పైలట్–ఎయిర్ క్రాఫ్ట్ నిష్పత్తి 13.8–14.5 మధ్యలోనే స్థిరంగా ఉంది. అంటే ప్రతి విమానానికీ 13 నుంచి 15 మధ్య మాత్రమే పైలట్లు ఉన్నారన్నమాట. (ఆధారం : డి.జి.సి.ఎ.)పెరిగిన పని గంటలుకోవిడ్ తర్వాత చాలా భారతీయ విమానయాన సంస్థలు పైలట్ సగటు విమాన ప్రయాణ గంటలను పెంచేశాయి. 2024 (నవంబర్ వరకు) లో మాత్రం ప్రయాణ గంటల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. -
భారత్లో నచ్చిన పార్టీకి ఓటేసే ఛాన్స్ వస్తే..
నచ్చిన అభ్యర్థికే ఓటేయడం అన్నది ఓటర్ల ఇష్టం. కానీ, నచ్చిన పార్టీకి కూడా ఓటేసే అవకాశం వస్తే.. దాని ఆధారంగానే ప్రభుత్వాలు ఏర్పడే పరిస్థితుల ఏర్పడితే??. ఇందుకోసం ఒక ఓటరు.. రెండు ఓట్ల విధానం మన దేశంలోనూ అమలయ్యేలా చూడాలని హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అంటున్నారు. లోక్సభ వేదికగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ విప్లవాత్మక సంస్కరణను ప్రతిపాదన చేశారాయన. ఇంతకీ ఇలాంటి విధానం ఒకటి ఉందని.. అది ఏ దేశంలో అమల్లో ఉందని.. అది ఎలా పని చేస్తుందనే విషయం మీకు తెలుసా?..ఎమ్ఎమ్పీ (మిక్స్డ్ మెంబర్ ప్రపొర్షనల్) మోడల్.. జర్మనీ దేశం ఈ పద్దతిని ఫాలో అవుతోంది. దీని ప్రకారం.. అర్హత గల పౌరులకు రెండు ఓట్లు ఉంటాయి. ఒక ఓటుతో అభ్యర్థులను నేరుగా ఎన్నుకుంటారు. గెలిచిన వారు నేరుగా పార్లమెంట్కి వెళ్తారు. మరో ఓటు మాత్రం పార్టీలకు వేయాల్సి ఉంటుంది!.దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయో దాని ఆధారంగా మొత్తం పార్లమెంట్లో ఆ పార్టీకి ఉండాల్సిన సీట్లు(అదనపు) నిర్ణయిస్తారు. ఆ గణాంకాల ఆధారంగానే ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయి కూడా.!ఉదాహరణకు.. A, B, C అనే మూడు పార్టీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఓటర్లు.. తమ నియోజకవర్గంలో ఎవరు గెలవాలో నిర్ణయించడానికి ఓటేస్తారు.. రెండో ఓటు దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఎంత శాతం సీట్ల రావాలో నిర్ణయించడానికన్నమాట. ఇందులో A అనే పార్టీ స్థానికంగా 180 సీట్ల నెగ్గింది. B అనే పార్టీ 90 సీట్లు గెలిచింది. C అనే పార్టీ 29 సీట్లు మాత్రమే గెల్చుకుంది. అయితే.. దేశవ్యాప్తంగా ఓట్ల శాతం అంటే పార్టీ ఏకి వచ్చిన ఓట్లు 40% ఓట్లు( రేషియో ప్రకారం.. 280 సీట్లు రావాల్సి ఉంటుంది), పార్టీ బీకి 35% ఓట్లు(రేషియో ప్రకారం.. 245 సీట్లు రావాల్సి ఉంటుంది). పార్టీ సీకి 25% ఓట్లు(175 సీట్లు రావాల్సి ఉంటుంది) పోలయ్యాయి. ఈ లెక్క ప్రకారం.. పార్టీ ఏకి అదనంగా 100 సీట్లు, పార్టీ బీకి అదనంగా 155 సీట్లు, పార్టీ సీకి అదనంగా 146 సీట్లు కేటాయిస్తారు.జర్మనీలో ఎవరు అధికారంలోకి వస్తారో అనేది ఎక్కువ ఓట్లు పొందిన పార్టీ + ఎవరు కూటమి చేస్తారో దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పార్టీ A (40%) ఒంటరిగా మెజారిటీ సాధించలేకపోతే, పార్టీ C (25%)తో కలిస్తే 65% మెజారిటీ వస్తుంది. అలాగే పార్టీ B (35%) + పార్టీ C (25%) కలిస్తే 60% మెజారిటీ వస్తుంది. ఇలా MMPలో స్థానిక గెలుపు + జాతీయ ఓట్ల శాతం రెండూ కలిపి తుది ఫలితాన్ని నిర్ణయిస్తాయి.భారత్లో.. భారత్ పార్లమెంటరీ ఎన్నికల విధానాన్ని అవలంభిస్తోంది. దీనిని ఎఫ్పీటీపీ ( First Past The Post)గా వ్యవహరిస్తారు. ఈ విధానంలో ప్రజలు నేరుగా అభ్యర్థులను ఎన్నుకుంటారు. ఏ వ్యక్తికైతే అధికంగా ఓట్లు పోలవుతాయో వారినే విజేతగా నిర్ణయిస్తారు. ఎక్కువ సభ్యులు ఏ పార్టీ వాళ్లు ఉంటే.. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మెజారిటీ గనుక సాధించకపోతే అప్పుడు కూటమికి వెళ్తుంది. అంతేగానీ.. పార్టీలకు ప్రత్యేకించి సీట్ల కేటాయింపు అనేది ఉండదు.మిక్స్డ్ విధానం వల్ల ఒరిగేదేంటి?..ఎంఎంపీ విధానం వల్ల ప్రజలు వేసిన ఓట్ల శాతం పార్లమెంట్లో న్యాయంగా ప్రతిబింబిస్తుంది. అంటే, ఒక పార్టీకి వచ్చిన ఓట్ల శాతం ప్రకారం సీట్లు కేటాయించబడతాయి, దీనివల్ల చిన్న పార్టీలకు కూడా అవకాశం కలగవచ్చు. అలాగే స్థానిక ప్రతినిధులు కూడా ఎలాగూ ఉండనే ఉంటారు. చట్ట సభలో స్థానికత ఫ్లస్ జాతీయ విధానం రెండూ ప్రతిబింబిస్తాయి.ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ రావడం అరుదుగా జరగొచ్చు. కాబట్టి రెండు లేదంటే అంతకంటే ఎక్కువ పార్టీలు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి. దీని వల్ల సహకారం, చర్చలు, సమతుల్య నిర్ణయాలు ఎక్కువగా జరుగుతాయి.ఓటర్లు తమ ప్రాంతానికి ఒక ప్రతినిధిని ఎంచుకోవచ్చు. అదే సమయంలో, తమకు నచ్చిన పార్టీకి ఓటు వేసి దేశవ్యాప్తంగా ఆ పార్టీకి సీట్లు పెంచవచ్చు. దీని వల్ల ఓటు వృథా అనే ప్రస్తావనే ఉండదు. ఎంఐఎం అధినేత ఒవైసీ ఈ ఎంఎంపీ మోడల్ను భారతదేశంలో అమలు చేయాలని ప్రతిపాదించడం వెనుక బలమైన కారణం ఉంది, భారత్లో ప్రస్తుతం అమలువుతున్న FPTP విధానం వల్ల చట్టసభలో చిన్న పార్టీలకు, మైనారిటీలకు, ప్రాంతీయ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే ఎంఎంపీ విధానం వల్ల ప్రజలు వేసిన ఓట్ల శాతం న్యాయంగా ప్రతిబింబిస్తుంది. అలాగే ప్రాతినిధ్యం కూడా సమతుల్యంగా ఉంటుంది. ఎఫ్పీటీపీ వల్ల విధానంలో ఒక పార్టీకి తక్కువ శాతం ఓట్లు వచ్చినా ఎక్కువ సీట్లు రావొచ్చు. కానీ ఎంఎంపీలో అలాంటిది జరిగే అవకాశం ఉండదు. తద్వారా ప్రజాస్వామ్యం మరింత సమతుల్యంగా ఉంటుంది. -
ఒక నోట్ల కట్ట.. డజను ఎంపీలు
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో సోమవారం జరిగిన ఒక సంఘటన, ’నవ్వుకు నోబెల్ బహుమతి’ ఉంటే.. అది పాకిస్తాన్ పార్లమెంటుకే దక్కేదని నిరూపించింది. స్పీకర్ అయజ్ సాదిక్ గారు, పార్లమెంటు ఫ్లోర్పై పడి ఉన్న ఒక చిల్లర నోట్ల కట్టను చూశారు. అందులో ఏకంగా 10.. రూ.5,000 పాకిస్తాన్ కరెన్సీ నోట్లు ఉన్నాయి. అంటే, భారతీయ కరెన్సీలో దాదాపు రూ.16,500 విలువ అన్నమాట. ఈ మొత్తం పాక్ కరెన్సీలో మహా అయితే రెండు బిర్యానీ ప్యాకెట్లకు సరిపోతుంది. నోట్లు పది.. చెయ్యెత్తింది డజను మంది స్పీకర్ సాదిక్.. ఎంపీల నిజాయితీకి పరీక్ష పెడదామని గొప్పగా అనుకున్నారు. అయితే, అది ఎంత హాస్యాస్పదంగా మారుతుందో ఆయన ఊహించలేకపోయారు. ‘ఎవరి డబ్బు ఇది? దయచేసి చేయి ఎత్తండి!’.. అని ఆ నోట్ల కట్టను గాల్లో ఊపుతూ అడిగారు. ఆయన నోటి మాట పూర్తి కాకముందే, అదో కబాబ్ దొరికినట్లు.. ఒక్క సెకన్లో 12 మంది ఎంపీలు హుటాహుటిన చేతులు పైకెత్తేశారు. ఎంపీల వేగం చూసి స్పీకర్ గారికి నోట మాట రాలేదు. ‘నోట్లు ఉన్నది పదే. మరి యజమానులు ఏకంగా పన్నెండు మందా??’.. అంటూ కడుపు చెక్కలయ్యేలా నవ్వారు. పాకిస్తాన్కు చెందిన ఆజ్ టీవీ కథనం ప్రకారం, ఆ డబ్బు దాని నిజమైన యజమాని అయిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ ఎంపీ ముహమ్మద్ ఇక్బాల్ అఫ్రిదికి చేరింది. ఆయన అసెంబ్లీ కార్యాలయం నుండి ఆ మొత్తాన్ని అందుకున్నారు. తలంటిన పాకిస్తానీలు సోషల్ మీడియాలో తెగ వైరలైన ఈ వీడియోపై చాలా మంది పాకిస్తానీలు తమ చట్టసభ సభ్యుల వైఖరిని ఛీత్కరించుకున్నారు. ఆ నోట్లు తమవేనని చేతులెత్తిన 12 మంది ఎంపీలను పదవుల నుంచి తొలగించాలని కొందరు పాకిస్తానీలు కోరారు. ‘స్పీకర్ షరీఫ్ సోదరుల నుండి వచ్చిన 25 మిస్డ్ కాల్స్ గమనించలేదు’.. అని మహ్నూర్ ఆసిఫ్ వెటకారంగా ట్వీట్ చేశాడు. మరొకరు ‘ఎంపీలు లక్షల్లో జీతాలు, ప్రోత్సాహకాలు తీసుకుంటారు, అయినా వారి పరిస్థితి ఇదే’.. అని ట్వీట్ చేశారు. పార్లమెంటులో దొరికిన డబ్బులు కూడా అప్పుగా తీసుకొచి్చనవేమో అని పాకిస్తానీలు వెటకారంగా వ్యాఖ్యానించడం మరో హైలైట్. రజియా సుల్తాన్ అనే ఫేస్బుక్ యూజర్ నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ను ఇందులోకి లాగారు. ‘పీఎంఎల్ఎన్ చాలా పేద పార్టీ. స్పీకర్ వారికి ఆ డబ్బు ఇవ్వాల్సింది.. అది మరియం నవాజ్ సన్నబడేందుకు సహాయపడుతుంది’.. అని పోస్టు చేశారు. మొత్తానికి, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అప్పుల మీద నడుస్తుంటే, పార్లమెంటు సభ్యులు మాత్రం ఫ్లోర్పై పడి ఉన్న రూ.16 వేల చిల్లర నోట్ల కోసం ప్రపంచం ముందు పరువు మొత్తం పోగొట్టుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారీ తారల... రుజువులు చిక్కాయి
భారీ తారలు. మన సూర్యుని కంటే ఏకంగా పది వేల రెట్లు పెద్దవి! పైగా నిన్నా మొన్నటికి కూడా కావవి! తొలి విస్ఫోటం (బిగ్ బ్యాంగ్) జరిగిన కొన్ని కోట్ల ఏళ్ల వ్యవధిలోనే పుట్టుకొచ్చాయి. అంటే అతి పురాతన నక్షత్రాలన్నమాట. ఇలాంటివి ఈ అనంత విశ్వంలో ఉన్నాయనింతకాలం సైంటిస్టులు అనడమే తప్పించి ఇదమిత్థంగా తేల్చిచెప్ దాఖలాలు మాత్రం లేవు. అలాంటి తొలినాళ్ల భారీ తారల ఉనికికి సంబంధించి పక్కా రుజువులను మానవాళి తాలూకు అతి పెద్ద అంతరిక్ష నేత్రం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా ఒడిసిపట్టింది..!దొరికాయిలా...ఈ భారీ తారలను రాకాసి నక్షత్రాలుగా సైంటిస్టులు ముద్దు పిలుచుకుంటూ ఉంటారు. వాటి పరిమాణే అందుకు కారణం. సూర్యునితో పోలిస్తే అవి కనీసం 1,000 నుంచి 10,000 రెట్లు పెద్దవి మరి! జీఎస్ 3073 అనే అతి సుదూర నక్షత్ర మండలంలోని రసా యనిక అవశేషాలను జేమ్స్ వెబ్ తాజాగా పట్టించింది. వాటిని అనంతరం ఈ రాకాసి తారల ఉనికిని సైంటిస్టులు అసందిగ్ధంగా నిర్ధారించారు.పురాతన క్రిష్ణ బిలాలకూ మూలమివేసృష్టి ఆవిర్భావం జరిగిన కొన్ని కోట్ల ఏళ్లకే అతి భారీ కృష్ణ బిలాలు ఊపిరి పోసుకున్నాయి. ఇందుకు ఎన్నో రుజువు కూడా దొరికాయి. అదెలా సాధ్యపడిందీ అనే సందేహా లకు కూడా ఈ తొలినాళ్ల రాకాసి తారల ఉనికితో సమా దానం దొరికినట్టయింది.ఇలా అధ్యయనం..తొలి తరల ఉనికి కోసం సెంటర్ ఫర్ ఆస్ట్రో ఫిజిక్స్, హార్వర్డ్, స్మిత్సోని యన్, యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్ మౌత్ సంయుక్తంగా పరిశోధన చేపట్టాయి. ఇందుకో సం తొలుత జీఎస్ 3073 నక్షత్ర మండలంలోని నైట్రోజన్ – ఆక్సిజన్ నిష్పత్తిని అవి లెక్కగట్టి 0.46గా తేల్చాయి. సాధారణ తారలతో కూడిన గెలాక్సీల్లో ఇంతటి నిష్పత్తి అక్షరాలా అసాధ్యం. జీఎస్ 3073లో వందలాది కోట్ల ఏళ్ల క్రితమే భారీ, అంటే రాకాసి తారలు మనుగడ సాగించాయని దీన్నిబట్టి వర్సిటీల బృందం తేల్చింది. ‘తొలినాళ్ల రాకాసి తారలు నిజమేనా అని 20 ఏళ్లుగా నెలకొన్న సందిగ్ధానికి ఈ అధ్యయనం తెర దించింది. ఇందుకు సంబంధించిన తొలి పక్క రుజువులు జీఎస్ 3073లో చిక్కాయి‘ అని అధ్యయన బృంద సారథి డానియల్ వాలెన్ హర్షం వెలిబుచ్చారు. వీటిని తొలి తరం తారలుగా ఆయన అభివర్ణించారు. ఈ ఆసక్తికర అధ్యయన ఫలితాలను ఆస్ట్రో ఫిజికల్ జర్నల్ లెటర్స్ లో ప్రచురించారు.కొసమెరుపుజీఎస్ 3037 గెలాక్సీ కేంద్ర స్థానంలో ప్రస్తుతం సూపర్ నోవాలను కూడా తలదన్నే అతి భారీ కృష్ణబిలం ఉందట. అది బహుశా కచ్చితంగా తొలి తరం రాకాసి తార తాలూకు రూపాంతరమే అయి ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మనకూ సొంత స్పేస్ స్టేషన్
గుజరాత్ నుంచి సాక్షి ప్రతినిధి : ‘సొంత అంతరిక్ష కేంద్రాలు కలిగిన దేశాల సరసన త్వరలో భారత్ నిలవనుంది. 2028లో భారతీయ అంతరిక్ష కేంద్రం నిర్మాణం షురూ అవ్వనుంది’ అని ఇస్రోలో భాగమైన అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎస్ఏసీ) డైరెక్టర్ నీలేశ్ ఎం.దేశాయ్ తెలిపారు. స్వదేశీ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి ఐదు రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి విడి భాగాలు పంపాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగా 2028లో తొలి రాకెట్ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. 2035 నాటికి విడి భాగాలన్నింటినీ అంతరిక్షంలోకి చేర్చి ఇంటిగ్రేషన్ పూర్తి చేస్తామన్నారు. దీంతో భవిష్యత్తులో రోదసీ యాత్ర చేసే వ్యోమగాములు స్వదేశీ అంతరిక్ష కేంద్రంలో దిగి చంద్రుడి మీదకు వెళ్తారని చెప్పారు. ఎస్ఏసీ పనితీరు గురించి నీలేశ్ ఎం.దేశాయ్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 2027లో మానవ సహిత ప్రయోగం మానవ రహిత అంతరిక్ష ప్రయోగం దిశగా ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) వేగంగా అడుగులు వేస్తోంది. గగన్యాన్ ప్రయోగంలో భాగంగా తొలుత నాలుగు మానవ రహిత ప్రయోగాలు చేయాలని ఇస్రో నిర్ణయించింది. 2026 ఫిబ్రవరిలో తొలి ప్రయోగం చేపట్టబోతున్నాం. 2026లోనే మరో రెండు, 2027లో చివరి ప్రయోగం పూర్తి చేస్తాం. అదే ఏడాది ఆఖరులో మానవ సహిత ప్రయోగం పూర్తి చేస్తాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా 2022లోనే గగన్యాన్ పూర్తి చేయాల్సి ఉంది. కరోనా, ఇతర సాంకేతిక కారణాలతో ప్రయోగం వాయిదా పడింది. గగన్యాన్ యాత్రకు వ్యోమగాములుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నలుగురు కెపె్టన్లను ఎంపిక చేశాం. వీరిలో ఒకరైన శుభాన్షు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి తిరిగి వచ్చారు. మిగిలిన ముగ్గురిలో ఒకరు తిరిగి ఎయిర్ ఫోర్స్కు వెళ్లగా, ఇద్దరు శిక్షణలో కొనసాగుతున్నారు. 2027లో గగన్యాన్లో ఎంత మంది వ్యోమగాములు రోదసీ యాత్ర చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇద్దరు వ్యోమగాములు ఉంటే మంచిదని భావిస్తున్నాం. వ్యోమగాములు సురక్షితంగా అంతరిక్ష యాత్ర చేసి, తిరిగి వచ్చేందుకు వీలుగా వాహక నౌకను తీర్చి దిద్దుతున్నాం. డీఆర్డీఏ, ఇతర స్వతంత్ర సంస్థలు నౌకను సర్టిఫై చేస్తాయి. స్వదేశీ సాంకేతికతతో సెమీ కండక్టర్ల తయారీ సెమీ కండక్టర్లలో స్వయం సమృద్ధి సాధనే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. ఇస్రో కార్యకలాపాలకు సెమీ కండక్టర్లు కీలకమైనవి. ఇస్రో అవసరాల కోసం సెమీ కండక్టర్లు బయట నుంచి కొనే పని లేకుండా చేస్తున్నాం. అంతే కాకుండా బయటి సంస్థల అవసరాలకూ సెమీ కండక్టర్లు సరఫరా చేస్తున్నాం. ఎస్ఏసీలో దేశంలోనే మొదటి సారిగా పూర్తి స్వదేశీ సాంకేతికతతో సెమీ కండక్టర్లు తయారు చేస్తున్నాం. ఈ సాంకేతికను వాడుకోవడానికి ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తున్నాయి. సెమీ కండక్టర్ల విషయంలో ఎంతో చిన్న దేశమైన తైవాన్పై ప్రపంచం మొత్తం ఆధారపడి ఉంది. ఎస్ఏసీ ఎంతో విభిన్నం ఇస్రోలో భాగమైన మిగిలిన సంస్థలతో పోలిస్తే ఎస్ఏసీ ఎంతో విభిన్నమైంది. ఉపగ్రహ పేలోడ్లను ప్రజలు, ప్రభుత్వం, సమాజానికి ఉపయోగకరమైన కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్, నావిగేషన్, దేశ రక్షణ, జాతీయ ప్రయోజనం కోసం అభివృద్ధి చేయడంలో ఎస్ఏసీకి ప్రత్యేకత ఉంది. దేశంలో వాతావరణాన్ని అంచనా వేయడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. అంతరిక్షంలోని శాటిలైట్ వ్యవస్థ ద్వారా 15 రోజుల ముందే వాతావరణ పరిస్థితులను అంచనా వేసి, సమాచారాన్ని ఐఎండీకి చేరవేస్తున్నాం. దీంతో తుపానులు, ఇతర ప్రకృతి విపత్తుల పట్ల ప్రభుత్వాలు అప్రమత్తం అవుతాయి. -
లాగ్ ఔట్ అంటే 'లాగ్ ఔటే'!
రిమోట్, హైబ్రీడ్ వర్క్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్.. విధానం ఏదైనా ఈ డిజిటల్ యుగంలో ఒకవైపు పనిభారం మరోవైపు కెరీర్లో పరుగు. వెరసి ఉద్యోగులు విశ్రాంతి కరువై అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. తీవ్ర పని ఒత్తిడితో కొందరు ‘కఠిన నిర్ణయాలూ’ తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ కల్చర్ వచ్చాక ఉద్యోగుల పనితీరు మారింది. గంటలకొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చోవడం ఉద్యోగుల వంతు అవుతోంది. ఇదంతా ఒక ఎత్తైతే.. పని గంటలు ముగిశాక కూడా ఆఫీస్ నుంచి ఫోన్, వీడియో కాల్స్, మెయిల్స్, సందేశాలకు స్పందించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ స్పందించకపోతే ఎక్కడ వేటుపడుతుందోనన్న ఆందోళన ఉద్యోగులను వెంటాడుతోంది. దీనికితోడు వారానికి 90 గంటల పని ఉండాలంటూ ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ ఈ ఏడాది ప్రారంభంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, ఓలా భవీశ్ అగర్వాల్ సైతం ఇదే రీతిన స్పందించడంతో పని గంటల విషయంలో భారత్లో కార్పొరేట్ కంపెనీల వర్క్ప్లేస్ కల్చర్కు వారి వ్యాఖ్యలు ప్రతిబింబం అంటూ పెద్ద దుమారమే రేగింది. వర్క్–లైఫ్ బ్యాలెన్స్పై తీవ్ర చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ‘రైట్ టు డిస్కనెక్ట్’ బిల్లు తెరపైకి వచ్చింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే ఇటీవల లోక్సభలో రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు–2025ను ప్రవేశపెట్టారు. అధికారిక పని గంటలు ముగిశాక.. సెలవు దినాల్లో పని సంబంధిత కాల్స్, సందేశాలు, ఈ–మెయిల్స్, వీడియో కాల్స్ను ఉద్యోగులు తిరస్కరించేలా చట్టపరమైన హక్కును కల్పించాలని కోరుతూ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. – సాక్షి, స్పెషల్ డెస్క్నిరంతరం అందుబాటులో..నేటి డిజిటల్ ప్రపంచంలో అధిక పని కారణంగా తీవ్ర మానసిక, భావోద్వేగ, శారీరక ఒత్తి డిని తగ్గించడం ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు, ఆరోగ్యకరమైన పని–జీవిత సమతౌల్యతను ప్రోత్సహించడం ‘రైట్ టు డిస్కనెక్ట్’ లక్ష్యమని సుప్రియా సూలే చెప్పారు. ‘ఆధునిక వర్క్ కల్చర్లో ఉద్యో గులు నిరంతరం అందుబాటులో ఉండటం సర్వసాధార ణమైంది. స్పందించేందుకు డిజి టల్ సాధ నాలు సౌలభ్యంగానే ఉన్నప్పటికీ కార్మికులు రేయింబవళ్లు ఈ–మెయిల్స్ను తనిఖీ చేయ డానికి, సందేశాలకు ప్రతిస్పందించడానికి ఒత్తిడిని అనుభవిస్తున్న సంస్కృతిని కూడా ఈ సాధనాలు సృష్టించాయి’ అని సభ దృష్టికి తీసుకెళ్లారు. పని గంటలకు మించి డిజిటలై జేషన్ ద్వారా విధులు నిర్వర్తించినప్పటికీ అదనపు చెల్లింపులు చేయకుండా కంపెనీలు సాగిస్తున్న కార్యకలాపాలను అడ్డుకోవడం కూడా ఈ బిల్లు ఉద్దేశమని ఆమె వివరించారు.అమలుపైనే ఆధారం..కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న సిబ్బందిలో రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఇది కార్యరూపంలోకి వస్తే వర్క్ప్లేస్ కల్చర్ మారడం ఖాయమని వారు భావిస్తున్నారు. ఈ బిల్లు ఉద్యోగుల వ్యక్తిగత సమయాన్ని కాపాడటం, శ్రేయస్సును ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ బిల్లు ఉద్దేశం నిజంగా నెరవేరడంపై సందేహం తలెత్తుతోంది. బిల్లు చట్టంగా మారి ఉద్యోగులకు బలమైన రక్షణ కల్పించినా దీర్ఘకాలంగా పాతుకుపోయిన పని సంస్కృతి నిబంధనలను మార్చడానికి ఇది ఒక్కటే సరిపోకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ‘డిస్కనెక్ట్ బిల్లు కాగితంపై చాలా బాగుంది. కానీ సంస్థలు అమలు చేసే పని విధానంపై నిజమైన మార్పు ఆధారపడి ఉంటుంది. అవాస్తవిక పనిభారం, సరిహద్దులు లేకపోవడం, పేలవమైన సమయ నిర్వహణ పద్ధతుల వంటి సమస్యలను కంపెనీలు పరిష్కరించకపోతే లొసుగులు రాజ్యమేలతాయి’ అని ఓ సైకాలజిస్ట్ వ్యాఖ్యానించారు. మూలాన్ని మార్చడం ద్వారా..రైట్ టు డిస్కనెక్ట్తో ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. పనివేళల్లో ఉత్సాహంగా ఉండటానికి కష్టపడటం, కఠినమైన గడువులను జయించడానికి ఒత్తిడిని ఎదుర్కోవడం లేదా సిబ్బంది కొరత వంటివి ఉద్యోగులు తరచూ ఎదుర్కొనే సవాళ్లను ఈ బిల్లు పరిష్కరించదని నిపుణులు చెబుతున్నారు. ‘చట్టపరమైన నిబంధనలు మాత్రమే కార్యాలయాల్లో పని సంస్కృతిని మార్చలేవు. సమస్య మూలానికి మందు వేయడం ద్వారా ఆరోగ్యకరమైన పని–జీవిత సమతౌల్యత సాధించవచ్చు. అనుకూలమైన, ఆచరణాత్మకమైన, రోజువారీ వాస్తవాలపై ఆధారపడిన వ్యవస్థలు ఉద్యోగులకు అవసరం’ అని వారు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలను అర్థవంతంగా రూపొందించడానికి ఉద్యోగులు, సంస్థలు కలిసి పనిచేయాలన్నది నిపుణుల భావన.బిల్లులో ఏముందంటే..» అధికారిక పని గంటల తరువాత, సెలవు రోజుల్లో ఆఫీస్ ఫోన్కాల్స్, వీడియోకాల్స్, మెయిల్స్, సందేశాలను ఉద్యోగులు తిరస్కరించవచ్చు. » స్పందించని సిబ్బందిపై కంపెనీ ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు.» ఒకవేళ నిబంధనలను కంపెనీ ఉల్లంఘిస్తే.. మొత్తం ఉద్యోగుల వేతనంలో ఒక శాతానికి సమానమైన మొత్తాన్ని జరిమానాగా విధిస్తారు.» సిబ్బంది హక్కుల పరిరక్షణకు ప్రత్యేక సంక్షేమ సంస్థ ఏర్పాటు.» అధికారిక సమయానికి మించి పనిచేసే ఉద్యోగులకు ప్రామాణిక వేతనాల ప్రకారం ఓవర్ టైం చెల్లింపుతో పరిహారం. » పనివేళల తరువాత ఉద్యోగులను సంప్రదించడానికి పరస్పరం అంగీకరించిన నిబంధనలను రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు. -
టెక్ దిగ్గజాల పెట్టుబడులజోరు..
సాంకేతిక ఆవిష్కరణలకు భారత్ మెగా హబ్గా మారే దిశగా చురుగ్గా అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ నుంచి ఇంటెల్ వరకు పలు అగ్రగామి సంస్థలు వరుస కడుతున్నాయి. దేశీయంగా డేటా సెంటర్లు, ఏఐ ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభించడంతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్ల వ్యవధిలో క్లౌడ్, కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాల కల్పనపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. ఆసియాలో మైక్రోసాఫ్ట్ ఇంత భారీగా ఇన్వెస్ట్ చేయడం ఇదే ప్రథమం. భారత్ సాంకేతిక సామర్థ్యాలపై కంపెనీకి గల నమ్మకానికి ఇది నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చిప్ దిగ్గజం ఇంటెల్ కూడా భారత్ సెమీకండక్టర్ల లక్ష్యాల సాధనకు మద్దతుగా నిల్చేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం టాటా ఎలక్ట్రానిక్స్తో జట్టు కట్టింది. కంపెనీ సీఈవో లిప్–బు టాన్ ప్రధాని మోదీతో కూడా సమావేశమయ్యారు. అటు మరో అగ్రగామి సంస్థ అమెజాన్ సైతం భారత్పై మరింతగా దృష్టి పెడుతోంది. ఏఐ, ఎగుమతులు, ఉద్యోగాల కల్పనపై 35 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇక్కడ అదనంగా పది లక్షలకుపైగా ఉద్యోగావకాశాలను కల్పించాలనే ప్రణాళికల్లో ఉంది. భారత్ నుంచి 80 బిలియన్ డాలర్ల ఈ–కామర్స్ ఎగుమతులను లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక సెర్చ్ దిగ్గజం గూగుల్ .. వైజాగ్లో డేటా సెంటర్పై 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఓపెన్ఏఐ కూడా భారత్లో డేటా హబ్ ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. రియల్టీకి కూడా ఊతం.. దేశవ్యాప్తంగా డేటా సెంటర్లను నిర్మించడంపై పెద్ద సంస్థలు ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఊతం లభించనుంది. డేటా సెంటర్ల రాకతో నిర్మాణ, రిటైల్, నిర్వహణ విభాగాల్లో పెద్ద సంఖ్యలో పరోక్ష ఉద్యోగాలకు ఊతం లభించనుంది. వైజాగ్లో గూగుల్ ఏఐ, డేటా సెంటర్ హబ్తో 1,00,000 పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని అంచనా. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అధ్యయనం ప్రకారం డేటా సెంటర్లతో వచ్చే ఒక్క ప్రత్యక్ష ఉద్యోగంతో ఆరు రెట్లు పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది. ఏఐ డేటా సెంటర్ బూమ్తో ఇంజినీర్లు, ఐటీ నిపుణులు, నిర్మాణ రంగ వర్కర్లు, రిటైల్ తదితర పరి శ్రమలలో మరింత ఉద్యోగ కల్పన జరగనుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఇక రైల్వే వంతు!
విమానయాన రంగంలో ఇటీవల చోటుచేసుకున్న సంక్షోభం ఎంతటి గందరగోళానికి, నష్టానికి దారి తీసిందో తెలిసిందే. పైలట్ల విషయంలో రెస్ట్ రూల్స్ అమల్లోకి రావడం.. దాంతో కొరత తలెత్తి విమాన సర్వీసులు ఆగిపోవడం(కృత్రిమ కొరత సృష్టించారనే ఆరోపణలున్నాయ్).. చివరకు తాత్కాలికంగా ఆ రూల్స్ను కేంద్రం వెనక్కి తీసుకోవడం.. చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఇప్పుడు ఆ ఫోకస్ భారతీయ రైల్వే వైపు మళ్లే అవకాశం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా రైళ్లను నడిపే లొకో పైలట్లు (train drivers) తమకూ విశ్రాంతి అవసరమనే గళం వినిపించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కోట్లాది ప్రయాణికుల భద్రతను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ‘‘రైల్వేలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. కానీ, మేం తీసుకునేది అతికొద్ది విశ్రాంతి. చేసేది 14 నుంచి 23 గంటలపాటు నిరంతరంగా పని. ఇలాంటి దీర్ఘకాలిక డ్యూటీలు అలసటను పెంచి, ఏకాగ్రతను తగ్గిస్తాయి. ఫలితంగా.. లక్షల మంది మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే ఎఫ్ఆర్ఎంఎస్(Fatigue Risk Management System) ఆధారంగా డ్యూటీ అవర్స్ పరిమితులు అమలు చేయాలి’’ అని లోకోపైలట్లు డిమాండ్ చేస్తున్నారు.ప్రస్తుతం రైల్వేలో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా, రైళ్లను నడిపే పైలట్లపై ఒత్తిడి తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో కఠిన డ్యూటీ అవర్స్పై పరిమితులు ఉన్నాయి. భారతదేశంలో మాత్రం రైల్వేలో అలాంటివేం లేకపోవడంతో వాళ్ల ఆందోళనను తీవ్ర తరం చేస్తోంది. ఒకవైపు భారతీయ రైల్వేస్ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా.. మరోవైపు లోకో పైలట్లకు సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల మానవ తప్పిదాలు జరిగే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిమాండ్లు:భద్రతాపరమైన నియమాలు.. లోకో పైలట్లకు అలసటను తగ్గించే విధానాలు, నియమాలు అమలు చేయాలి.రోస్టర్.. షిఫ్ట్లను శాస్త్రీయంగా, సమయపూర్వకంగా కేటాయించాలి.వారంతాపు విశ్రాంతి.. వారానికి కనీసం ఒక విశ్రాంతి రోజు తప్పనిసరిగా ఇవ్వాలి.పోలిక సబబేనా?.. విమానయానం.. రైల్వే.. ఈ రెండు రంగాల్లో పైలట్లు, లోకో పైలట్ల అలసట, దీర్ఘకాలిక డ్యూటీలు, విశ్రాంతి లేకపోవడం వల్ల ప్రయాణికుల విషయంలో భద్రతా సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మొదటి నుంచి పైలట్ల విశ్రాంతి నియమాలను పాటించకపోవడం వల్ల విమానయాన రంగంలో పెద్ద సంక్షోభం ఏర్పడింది. కానీ, ఇదే సమస్య రైల్వేలోనూ ఎన్నో ఏండ్ల నుంచి కొనసాగుతోందని ఏఐఎల్ఆర్ఎస్ఏ(All India Loco Running Staff Association) చెబుతోంది. ప్రభుత్వ రంగ ఉద్యోగుల ఆందోళనలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటారు. అదే ప్రైవేట్ కార్పొరేషన్లు (ఇండిగో వంటి సంస్థలు) భద్రతా నియమాలను పాటించకపోతే.. ప్రభుత్వం వారికి తలొగ్గుతుంది అని కొందరు లోకో పైలట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా.. రోజుకు 6 గంటల డ్యూటీ పరిమితి. ప్రతి డ్యూటీ తర్వాత 16 గంటల విశ్రాంతి. వారానికి ఒక కంపల్సరీ రెస్ట్.. డిమాండ్లను 1970 నుంచే ఏఐఎల్ఆర్ఎస్ఏ వినిపిస్తోంది. 80-90 మధ్య కాలంలో నిరంతర ఆందోళనలు జరిగాయి. కాస్త గ్యాప్ తర్వాత.. 2000 సంవత్సరం నుంచి మళ్లీ ఉద్యమాలు జరిగాయి. 2024 అక్టోబర్లో దేశవ్యాప్త నిరసన నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వేలాది లొకో పైలట్లు సమావేశమై, రైల్వే బోర్డుకు మెమోరాండం సమర్పించారు. అయినా చలనం లేకపోవడంతో.. ఇప్పుడు ఇండిగో సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ కేంద్రంపై ఒత్తిడి పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘లొకో పైలట్ల ఆందోళనలు ప్రజల భద్రతకు సంబంధించిన కీలక హెచ్చరికగా భావించాలి. రైల్వే మంత్రిత్వ శాఖ తక్షణమే కొత్త నియమాలు, విశ్రాంతి విధానాలు అమలు చేయకపోతే, రైళ్ల భద్రతకు పెద్ద ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. విమానయాన రంగంలో జరిగిన సంక్షోభం తర్వాత, రైల్వేలోనూ ప్రయాణికుల ప్రాణాలను కాపాడే చర్యలు అత్యవసరం’’ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
అంగారకునిపైనా... ఒక గంగ!
అవును. నిజమే. ఇప్పుడు పూర్తిగా పొడిబారి కనిపిస్తున్న అంగారక గ్రహం ఒకప్పుడు జల కళతో మురిసిపోయేదట. దానిమీద కూడా గంగ వంటి జీవ నదులు పొంగి పారేవట. అలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 16 అతి పెద్ద నదీ వ్యవస్థలతో ఆ గ్రహం కళకళలాడిపోయేదట. ఇందుకు సంబంధించి పక్కా రుజువులు తాజాగా వెలుగు చూడటం విశేషం...!అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ బృందం అంగారకునిపై ఒకప్పుడు కొనసాగిన నదీ వ్యవస్థలను మ్యాపింగ్ చేసింది. అక్కడి నీటిపారుదల వ్యవస్థలపై తొలిసారిగా జరిగిన ఈ సమగ్ర పరిశోధనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కనీసం 16 భారీ నదీ వ్యవస్థలు ఒకనాడు గురు గ్రహంపై విలసిల్లినట్టు తేలింది. ప్రాంతాలన్నిటా ఒకప్పుడు జీవం ఉనికి ఉండేదనేందుకు ఇది ఒక ప్రబల తార్కాణమని అధ్యయన బృందం చెబుతోంది.జల కళ ఇలా... గురు గ్రహంపై జలావిర్భావం గురించి పలు ఆసక్తికర అంశాలు పరిశోధనలో వెలుగులోకి వచ్చాయి. కొన్ని వందల కోట్ల ఏళ్ల కిందట అంతూ పొంతూ లేని రీతిలో కురిసిన వర్ష ధారల ధాటికి అక్కడ లోయలు, భారీ నదీ వ్యవస్థలు పుట్టుకొచ్చాయట. అవి ప్రస్తుతం భూమిపై తిరుగులేని జీవ వైవిధ్యానికి ప్రతీకలుగా విలసిల్లుతున్న అమెజాన్ వంటి నదీ వ్యవస్థలకు ఏ మాత్రమూ తీసిపోవని అధ్యయన బృందం అంటోంది. ఆ లెక్కన ఒకనాడు గురు గ్రహమూ చక్కని జల కళతో విలసిల్లే ఉంటుందని చెబుతోంది. అంతేకాదు, ఆ భారీ జల రాశి ఏకంగా మహా సముద్రాలుగా కూడా రూపు దాలి్చందట! ‘గురు గ్రహంపై నదులు ఉండేవన్నది చాలాకాలంగా మనకు తెలిసిన సంగతే. అయితే బతికి సంబంధించి ఇంత స్పష్టతతో కూడిన వివరాలు వెలుగులోకి రావడం మాత్రం ఇదే తొలిసారి‘ అని అధ్యయన బృంద సారథి తిమోతీ ఎ.గౌడ్జ్ హర్షం వెలిబుచ్చారు. నదులు, లోయలు, అగాథాలు, పర్వతాలు తదితరాల చిహా్నలతో కూడిన 19 వ్యవస్థలను పరిశోధకులు గుర్తించారు. వీటిలో 16 ఏకంగా లక్ష చదరపు కిలోమీటర్లకు మించిన విస్తీర్ణంతో కూడుకుని ఉండటం విశేషం. ‘‘అయితే భూమిపై ఉన్న జల వ్యవస్థలతో పోలిస్తే ఇవి మరీ పెద్దవే కావు. ఉదాహరణగా చెప్పాలంటే ఒక్క అమెజాన్ నదీ వ్యవస్థ విస్తీర్ణమే ఏకంగా 62 లక్షల చదరపు కి.మి. ఉంటుంది’’అని తిమోతీ వివరించారు.అమూల్య వివరాలు సమీప భవిష్యత్తులో అంగారక యాత్రలకు నాసా తదితర అంతరిక్ష సంస్థలు సిద్ధమవుతుండటం తెలిసిందే. అందుకు ఈ అరుణ గ్రహం మీద ఏ ప్రాంతాలను ఎంచుకోవాలో తేల్చుకునేందుకు ఈ పరిశోధన చక్కని వీలు కలి్పస్తుందని సైంటిస్టులు ఉంటున్నారు. అంతేగాక అక్కడ ఏయే ప్రాంతాలు ఆవాసయోగ్యమో కూడా కచి్చతమైన అంచనాకు వచ్చేందుకు తోడ్పడుతుందని హర్షం వెలిబుచ్చుతున్నారు. పరిశోధన పూర్తి వివరాలు పీఎన్ఏఎస్లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తీర్పు ఏదైనా...పోరుకు ప్రశంస
శక్తిమంతులతో పోరాడే సమయంలో పోరాటమే విజయంతో సమానం. ఆ తర్వాత దక్కిన న్యాయం సంతృప్తిని ఇవ్వొచ్చు ఇవ్వకపోవచ్చు. కేరళ సూపర్స్టార్ దిలీప్ తనపై అత్యాచారం చేసేందుకు ఒక గ్యాంగ్తో కుట్ర పన్నాడని ఆరోపించి సుదీర్ఘకాలం పోరాడిన నటి (తెలుగులో కూడా నటించింది) చివరకు డిసెంబర్ 8న జడ్జిమెంట్ వినగలిగింది. మొత్తం 15 మంది నిందితులున్న ఈ కేసులో 1 నుంచి 6 వరకు ఉన్న నిందితులను కోర్టు దోషులుగా ఖరారు చేసి 8వ నిందితుడైన దిలీప్ను నిర్దోషిగా విడుదల చేసింది. దీనిపై వ్యాఖ్యలు వినిపిస్తున్నా కేరళను కంపింప చేసి ఎన్నో సవాళ్లు తట్టుకుని పోరాడిన నటిని ముందు ప్రశంసించాల్సి ఉంది.తాను పని చేసే రంగంలో అత్యంత శక్తిమంతుడైన వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని ఒక బాధితురాలు విశ్వసిస్తే ఆమె చేసే పోరాటానికి ఎన్ని అవరోధాలు ఉంటాయి? మలయాళ సూపర్స్టార్ దిలీప్ పన్నిన కుట్ర వల్లే తన మీద అత్యాచారం జరిగిందని న్యాయపోరాటానికి దిగిన మలయాళ నటి ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని చివరకు ‘తీర్పు’ను సాధించింది. అయితే ఆ తీర్పులో తనకు దక్కిన న్యాయం పాక్షికమా? సంపూర్ణమా అనేది చర్చే అయినా... ఇంతవరకూ ఆమె వెరవక నిలబడటం చాలా గొప్ప సంగతి. స్ఫూర్తిదాయకమైన పోరాటం.→ అసలేం జరిగింది?మలయాళ నటి ‘ఎం’ (కథనం కోసం పెట్టిన పేరు) ఫిబ్రవరి 17, 2017న త్రిషూర్లోని తన ఇంటి నుంచి కొచ్చి వెళుతున్నప్పుడు రాత్రి వేళ ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనంతో ఢీకొట్టిన కొంతమంది ఆమె వాహనంలోకి జొరపడ్డారు. ఆ తర్వాత కొచ్చి అంతా తిప్పుతూ ‘ఎం’ను దుర్బాష లాడారు. వారిలో పల్సన్ సుని అనే పాత నేరస్తుడు ఆమె మీద అత్యాచారం చేయడమే కాదు అదంతా వీడియో తీశాడు. ఆ తర్వాత ఒక దర్శకుడి ఇంటి ముందు ఆమెను పడేసి ఉడాయించాడు. దర్శకుడి సహాయంతో అదే రోజు ‘ఎం’ కేసు నమోదు చేసింది.→ తర్వాత ఏం జరిగింది?మొదట పోలీసులు ఇదో బ్లాక్మెయిల్ దందా చేసే వారి పని అని భావించారు. అయితే అత్యాచార సమయంలో పల్సర్ సుని ‘ఎం’తో ‘నేను కొటేషన్ అందుకోవడం వల్లే ఈ పని చేస్తున్నాను’ అన్నాడు. కొటేషన్ అంటే సుపారీ. అయితే ఈ సుపారీ సంగతి వెంటనే పోలీసుల దృష్టికి రాలేదు. బాధితురాలు ఇది కీలకమైన కామెంట్గా గమనించలేదు.→ అరెస్టులుపోలీసులు వరుసగా అరెస్టులు చేశారు. వీరిలో పల్సర్ సునితో పాటు ‘ఎం’ వాహన డ్రైవర్ ఇంకా ఆరు గురు ఉన్నారు. మే 1, 2017 నాటికి ‘ది విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ పేరుతో మలయాళ నటీమణులు ఒక బృందంగా ఏర్పడి ముఖ్యమంత్రిని కలిసి మలయాళ పరిశ్రమలో సెక్సువల్ హరాస్మెంట్ గురించి చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. జూన్, 2017 నాటికి విష్ణు అనే వ్యక్తి తాను పల్సర్ సునీ జైల్మేట్నని జైలులో అతడు ఈ కేసు వెనుక నటుడు దిలీప్ ఉన్నాడన్న సంగతి చెప్పాడని బయటకు వెల్లడి చేయడంతో గగ్గోలు మొదలైంది. మరోవైపు ‘కొటేషన్ డబ్బు బేలెన్స్ చెల్లించమని’ పల్సర్ సుని రాసినట్టుగా చెప్పే లెటర్ బయటకు ‘లీక్ అయ్యింది’. దాంతో ఈ అత్యాచారం కుట్రలో దిలీప్ ఉన్నాడన్న విషయం బయటకు వచ్చి కేరళలో కంపనలు పుట్టాయి. జనం రెండుగా చీలి వాదులాడుకున్నారు. ‘ఎం’ను దుర్బాషలాడారు. జూన్ 24, 2017న దిలీప్ను పోలీసులు అరెస్టు చేశారు.→ దిలీప్పై ఆరోపణ ఎందుకు?నటుడు దిలీప్, నటి మంజు వారియర్ 2012లో వివాహం చేసుకున్నారు. అయితే దిలీప్కు మరో నటి కావ్య మాధవన్తో సంబంధం ఉన్నట్టు మంజుకు అనుమానం వచ్చింది. కాని ఏ ఆధారం దొరకలేదు. అయితే దిలీప్కు, కావ్యా మాధవన్కు ఉమ్మడి స్నేహితురాలైన ‘ఎం’కు ఈ విషయం తెలిసి ఉండొచ్చనే ఉద్దేశంతో మంజు ‘ఎం’ను నిలదీసింది. ‘ఎం’ ఆ సంబంధాన్ని బయట పెట్టిందని సమాచారం. తనకు స్నేహితురాలిగా ఉంటూ తన పెళ్లిలో చిచ్చు పెట్టిన ‘ఎం’ మీద ఆనాటి నుంచి కోపం పెట్టుకున్న దిలీప్ సమయం కోసం ఎదురు చూశాడని ఆరోపణ. ఈలోపు 2015లో మంజు, దిలీప్లు విడాకులు తీసుకున్నారు. 2016లో దిలీప్, కావ్య వివాహం చేసుకున్నారు. 2017లో ‘ఎం’ మరికొన్ని రోజుల్లో ఎంగేజ్మెంట్ చేసుకోనున్నదనగా ఈ ఘటన జరిగింది. ఈ పూర్వరంగం అంతా ‘ఎం’ను దిలీప్ దీని వెనుక ఉన్నాడని విశ్వసించేలా చేసింది. అయితే దిలీప్ ముందు నుంచీ ఇదంతా తన ప్రతిష్టను తట్టుకోలేని శక్తులు చేసిన కుట్రగా కొట్టేస్తూ వచ్చాడు. 84 రోజులు జైలులో ఉండి బయటకు వచ్చిన దిలీప్ తనే ఈ కేసులో సి.బి.ఐ. విచారణ జరిపించాలని సుప్రీం కోర్టు వరకూ వెళ్లాడు.→ 2018లో విచారణ మొదలుఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో హనీ ఎం.వర్గీస్ అనే మహిళా న్యాయమూర్తి నేతృత్వంలో 2018లో విచారణ మొదలైంది. అయితే ఈ జడ్జి మీద తనకు విశ్వాసం లేదని బాధిత నటి కేరళ హైకోర్టు కూ, సుప్రింకోర్టుకూ వెళ్లి న్యాయమూర్తిని మార్చమని అభ్యర్థించింది. అయితే న్యాయమూర్తి మార్పు జరగలేదు. విచారణలో స్వచ్ఛతపై అసంతృప్తితో 2022 నాటికి ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఒకరి తర్వాత ఒకరుగా కేసు నుంచి తప్పుకున్నారు. చాలా మంది సాక్షులు మొదట బాధితురాలి పక్షాన స్టేట్మెంట్స్ ఇచ్చి కాలక్రమంలో అడ్డం తిరిగారు. సత్వర విచార జరగాల్సిన కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వెళ్లింది. దిలీప్ ఉపయోగించిన ఫోన్లు, ఇతర ఫోన్లు ‘టాంపర్’ అయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి. అత్యాచార దృశ్యాలు చిత్రీకరించిన ఫోను ‘మాయమైంది’. వీటన్నింటి మధ్య కేసు నత్తనడక నడవగా స్వయంగా సుప్రిం కోర్టు రంగంలో దిగి కేసును తొందరగా ముగించమని హెచ్చరించాల్సి వచ్చింది. చివరకు 2022లో ‘ఎం’ తనకు తానే బయటకు వచ్చి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి జరిగిన అన్యాయాన్ని మొరపెట్టుకుంది. కేరళ ప్రభుత్వం విధించిన హేమ కమిటీ మలయాళ పరిశ్రమలో స్త్రీలపై జరుగుతున్న దౌర్జన్యాలను బయటకు వెల్లడి చేయడంతో మరో దుమారం లేచింది. ఇవన్నీ అయ్యాక తుదకు డిసెంబర్ 8, 2025న తీర్పు వెలువడింది. ఇందులో ఆరుగురు నిందితులను దోషులుగా కోర్టు తేల్చింది. 7 నుంచి 15 వరకూ ఉన్న నిందితులను వదిలిపెట్టింది. 8వ నిందితుడైన దిలీప్కు ప్రస్తుతానికి విముక్తి దొరికింది. అయితే దీని మీద విస్తృతంగా వ్యాఖ్యలు, విమర్శలు వినపడుతున్నాయి. కేరళ ప్రభుత్వం ఈ తీర్పును చాలెంజ్ చేస్తామని చెప్పింది. బాధిత ‘ఎం’ కూడా పై కోర్టుకు వెళ్లవచ్చు. తదుపరి పరిణామాలు ఎలా ఉన్నా బలవంతులపై బాధిత మహిళల పోరాటం ఆగవలసిన అవసరం లేదని ‘ఎం’ నిరూపించింది. ఆమె స్థయిర్యం వల్లే ఇంతవరకైనా వచ్చింది. ఇక మీదట ఆమె చేయబోయే పోరాటం మరో తీర్పును ప్రసాదించవచ్చు. వేచి చూద్దాం. -
ఫెడ్పై మార్కెట్ దృష్టి
ప్రధానంగా విదేశీ గణాంకాల ఆధారంగా ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు కదలనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. ఇది సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ 9న పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. 10న చైర్మన్ పావెల్ అధ్యక్షతన ఫెడరల్ ఒపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) మానిటరీ పాలసీ నిర్ణయాలు ప్రకటించనుంది. ఫెడ్ ఫండ్స్(వడ్డీ) రేట్లను 0.25 శాతంమేర తగ్గించవచ్చని అధికశాతంమంది ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గత పాలసీ సమావేశంలోనూ వడ్డీ రేటులో పావు శాతం కోత పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేట్లు 3.75–4 శాతంగా అమలవుతున్నాయి. కాగా.. ముందు రోజు అంటే 9న యూఎస్ ఉపాధి గణాంకాలు విడుదలకానున్నాయి. 11న సెపె్టంబర్ నెలకు వాణిజ్య గణాంకాలు వెల్లడికానున్నాయి. ఆగస్ట్లో వాణిజ్య లోటు 59.6 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. జూలైలో 78 బిలియన్ డాలర్లుగా నమోదైంది. నవంబర్ నెలకు చైనా వాణిజ్య గణాంకాలు విడుదలకానున్నాయి. అక్టోబర్లో చైనా 90 బిలియన్ డాలర్లకుపైగా వాణిజ్య మిగులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 10న గత నెలకు చైనా ద్రవ్యోల్బణ వివరాలు తెలియనున్నాయి. ఆర్బీఐ ఎఫెక్ట్ దేశీయంగా ఆర్బీఐ గత వారం వడ్డీ రేట్లకు కీలకమైన రెపోలో 0.25 శాతం కోత పెట్టింది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగివచ్చింది. అంతేకాకుండా రూ. లక్ష కోట్ల లిక్విడిటీకి సైతం తెరతీయనుంది. ఫలితంగా దేశీ స్టాక్ మార్కెట్లు వారాంతాన ఊపందుకున్నాయి. అయితే డాలరుతో మారకంలో రూపాయి 90కు బలహీనపడటం గమనించదగ్గ అంశం. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీకి దన్నుగా ఆర్బీఐ 5 బిలియన్ డాలర్ల రుపీ డాలర్ స్వాప్నకు తెరతీయనుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ చర్యలు జీఎస్టీ సంస్కరణలకు జత కలసి సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఆరు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో యూఎస్ డాలరు ఇండెక్స్, ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ సైతం మార్కెట్లలో ట్రెండ్ను ప్రభావితం చేసే అవకాశముంది. ఇవి గ్లోబల్ ఇన్వెస్టర్లను రిస్కు పెట్టుబడులైన ఈక్విటీల నుంచి పసిడి తదితర రక్షణాత్మక సాధనాలవైపు మళ్లించవచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. రిటైల్ ధరలు.. నవంబర్ నెలకు వినియోగ ధరల(సీపీఐ) గణాంకాలు శుక్రవారం(12న) విడుదలకానున్నాయి. అక్టోబర్లో సీపీఐ 0.25 శాతానికి నీరసించింది. దీంతో ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు వీలు కలిగిన విషయం విదితమే. కాగా.. వరుసగా 9వ నెలలోనూ ఆర్బీఐ లక్ష్యం 4 శాతానికంటే దిగువనే రిటైల్ ధరలు నమోదవుతుండటం గమనార్హం! ఎఫ్పీఐల అమ్మకాల స్పీడ్ తొలి వారంలో రూ. 11,820 కోట్లు ఔట్ దేశీ స్టాక్స్లో ఇటీవల విక్రయాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఈ నెల మొదటి వారంలోనూ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నగదు విభాగంలో నికరంగా రూ. 11,820 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. దీంతో ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ రూ. 1.55 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లయింది! గత నెలలోనూ రూ. 3,765 కోట్ల విలువైన స్టాక్స్ను నికరంగా విక్రయించిన ఎఫ్పీఐలు అక్టోబర్లో మాత్రం రూ. 14,610 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. అయితే అంతకుముందు సెపె్టంబర్లో రూ. 23,885 కోట్లు, ఆగస్ట్లో రూ. 34,990 కోట్లు, జూలైలో రూ. 17,700 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం గమనార్హం!బుల్లిష్గా..గత వారం ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు దాదాపు ఫ్లాట్గా ముగిశాయి. రూపాయి పతనంతో ఐటీ కౌంటర్లు బలపడ్డాయి. అయితే సాంకేతికంగా చూస్తే ఈ వారం మార్కెట్లు పుంజుకోవడానికే అధిక చాన్స్ ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. → ఎన్ఎస్ఈ నిఫ్టీ 26,300–26,350 పాయింట్లకు పెరిగే వీలుంది. ఈ స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. దీనిని అధిగమిస్తే స్వల్ప కాలంలో 26,850–26,900 వరకూ పురోగమించే అవకాశముంది. ఒకవేళ బలహీనపడితే తొలుత 26,000, తదుపరి 25,850 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించే వీలుంది. ఆపై మరోసారి 25,700 వద్ద మద్దతు కనిపించవచ్చు. ఇంతకంటే దిగువకు చేరితే మరింత నీరసించేందుకు ఆస్కారం ఉంటుంది. → బీఎస్ఈ సెన్సెక్స్ 86,350 వరకూ బలపడవచ్చు. ఈస్థాయిని దాటితే 87,500–88,000 పాయింట్లవరకూ పుంజుకునే అవకాశముంది. ఒకవేళ బలహీనపడితే తొలుత 84,800 వద్ద, తదుపరి 84,450 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించవచ్చు. ఆపై మరింత నీరసిస్తే 83,600–83,300 పాయింట్లవరకూ క్షీణించే వీలుంది. –సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఫోన్.. సమస్యల జోన్
తిండి, బట్ట, నీడ.. వాటి సరసన స్మార్ట్ఫోన్ కూడా వచ్చి చేరింది. ఎంతలా అంటే ఈ ఉపకరణం లేకుంటే జీవితమే లేదన్నంతగా. టీనేజ్కు రాకముందే పిల్లల వద్ద స్మార్ట్ఫోన్లు ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు స్మార్ట్ఫోన్ కలిగి ఉండటం హానికరమని ఒక కొత్త అధ్యయనం తెలిపింది. చంటి పిల్లలు ఏడవకుండా ఉండేందుకు తల్లిదండ్రులు వారి స్మార్ట్ఫోన్లలో వీడియోలను చూపిస్తున్నారు. పిల్లలకు నడక మొదలైన నాటి నుంచే వారికి మొబైల్ ఫోన్లు అలవాటు చేస్తున్నారు. ‘ఫోన్ ఇస్తే చాలు.. స్క్రీన్ స్క్రోల్ చేస్తూ ఓ మూలన కూర్చుంటారు. వాళ్లతో ఎటువంటి ఇబ్బంది ఉండదు’అనే ఆలోచనతో బలంగా అమలు చేస్తున్నారు. చదువు, విజ్ఞానం కోసం పిల్లలు స్మార్ట్ ఫోన్స్తో వెచి్చంచే సమయం పిసరంత అయితే.. వీడియో గేమ్స్, రీల్స్, చాటింగ్కు సమయం కొండంత ఉంటోంది.అయితే పిల్లలకు స్మార్ట్ఫోన్స్ ఇవ్వడం స్వయంగా అనారోగ్యాన్ని తెచ్చిపెట్టినట్టేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పీడియాట్రిక్స్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం 12 ఏళ్లలోపు పిల్లలు స్మార్ట్ఫోన్ కలిగి ఉండటం వల్ల మానసిక అనారోగ్య సమస్యలు, ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. అంతేకాదు.. ఇతరులతో పోలిస్తే స్మార్ట్ఫోన్స్ ఉన్న పిల్లల్లో నిరాశ, నిద్రలేమి వంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని వెల్లడైంది.ఎవరు విశ్లేషించారంటే.. యూఎస్లో 2018 నుంచి 2020 మధ్య కాలంలో అడాల్సెంట్ బ్రెయిన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ (ఏబీసీడీ) అధ్యయనంలో 10,588 మంది కౌమారదశ పిల్లలు పాలుపంచుకున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ నిధులు సమకూర్చిన ఈ అధ్యయనం యూఎస్లో ‘మెదడు అభివృద్ధి, పిల్లల ఆరోగ్యం’పై అతిపెద్ద దీర్ఘకాలిక అధ్యయనంగా నిలిచింది. చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆఫ్ ఫిలడెల్పియా, బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అధ్యయన సమాచారాన్ని విశ్లేషించారు. వారి కంటే మెరుగ్గా..: ఏబీసీడీ అధ్యయనంలో పాల్గొన్న వారిలో 63.6% మందికి స్మార్ట్ఫోన్స్ ఉన్నాయి. సగటున 11 ఏళ్లకే వారు ఈ ఉపకరణాన్ని దక్కించుకున్నారు. ఆ డేటా ఆధారంగా చిన్న పిల్లల వద్ద స్మార్ట్ఫోన్ ఉండటం వల్ల నిద్రలేమి, ఊబకాయం వంటి ప్రమాదాలు పెద్దవారి కంటే ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు నిర్ధారించారు. స్మార్ట్ఫోన్ కలిగి ఉన్నవారిలో తక్కువ వయసున్న పిల్లల్లో ఆరోగ్య ఫలితాలు మరింత దిగజారుతున్నాయని వెల్లడైంది. 12 సంవత్సరాల వయసులోపు స్మార్ట్ఫోన్ పొందిన పిల్లలను, స్మార్ట్ఫోన్ లేని పిల్లలను కూడా ఈ అధ్యయనం పోల్చింది.ఒక సంవత్సరం తరువాత స్మార్ట్ఫోన్లు లేనివారు వాటిని కలిగి ఉన్న వారి కంటే మెరుగైన మానసిక ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నారని పరిశోధకులు కనుగొన్నారు. పిల్లల దగ్గర ట్యాబ్లెట్ పీసీలు లేదా ఐప్యాడ్స్ వంటి ఇతర పరికరాలు ఉండవచ్చని.. వాటి వినియోగం వల్ల కూడా ఫలితాలు ఇలాగే ఉంటాయని తెలిపారు. ఓ కన్నేసి ఉంచండి..: అయితే స్మార్ట్ఫోన్లు కౌమారదశలో ఉన్న అందరి ఆరోగ్యానికి హానికరమని తాము చెప్పడం లేదని పరిశోధకులు స్పష్టం చేశారు. సానుకూల, ప్రతికూల పరిణామాలను సమతౌల్యం చేస్తూ అధిక స్క్రీన్ వినియోగం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలను జాగ్రత్తగా పరిశీలించాలని వారు సూచిస్తున్నారు. పిల్లలకు ఫోన్ ఇచ్చే ముందు ఎంత సమయం వాడాలనే అంశాన్ని స్పష్టంగా వివరించాలన్నారు.బెడ్రూమ్లో, భోజనం, హోంవర్క్ సమయంలో ఎలా వాడాలో తెలియజేయాలని... ప్రైవసీ, కంటెంట్ సెట్టింగ్స్ను మార్చాలని సూచిస్తున్నారు. పిల్లలు వారి ఫోన్లలో ఏమి చేస్తున్నారో పర్యవేక్షించాలని... అనుచితమైన కంటెంట్కు వారు గురికాకుండా, స్మార్ట్ఫోన్లు నిద్రకు అంతరాయం కలిగించకుండా చూసుకోవాలని చెబుతున్నారు.⇒ ప్రపంచవ్యాప్తంగా 12 ఏళ్లలోపు పిల్లల్లో 71%, 10 ఏళ్లలోపు చిన్నారుల్లో 42% మంది వద్ద సొంత స్మార్ట్ఫోన్ ఉంది. ⇒ ప్యూ రీసెర్చ్ ప్రకారం 2024లో 13–17 ఏళ్ల టీన్స్లో 95% మంది స్మార్ట్ఫోన్ కలిగి ఉన్నారు.⇒ 12 ఏళ్లలోపు వారిలో 42% మంది ప్రతిరోజూ సగటున 2–4 గంటలు డిజిటల్ తెరల ముందు గడుపుతున్నారు. -
ఆత్మనిగ్రహం... ఆత్మస్థైర్యం
మనస్సు చంచలమైనది. అది నిరంతరం ఏదో ఒక దానిగురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి మనస్సును స్వేచ్ఛగా వదిలేస్తే ఇంద్రియాలకు అధీనమైపోతుంది. కామక్రోధాదులను బలపరుస్తుంది. అహంకార మమకారాలను వృద్ధి చేస్తుంది. ఈ క్రమంలో ఇంద్రియాలకు లాలసుడైన మనిషి విచక్షణను కోల్పోయి క్షణిక సుఖాలకు దగ్గర అవుతాడు. దీంతో అభివృద్ధి నిలిచిపోయి అథఃపాతాళంలోకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మనస్సును ఎప్పటికప్పుడు నిగ్రహించుకుంటూ ఇంద్రియ వశం కాకుండా మంచి పనులు మాత్రమే చేయాలనే నిబద్ధతతో మనస్సును అధీనంలో ఉంచుకోవడమే ఆత్మ నిగ్రహం.చంచలమైన మనస్సును నిశ్చలంగా చేయడం సాధారణమైన విషయం కాదు. సామాన్యులకే కాదు, అత్యంత శూరుడైన అర్జునికి కూడా మనస్సును నిగ్రహించుకోవడం సాధ్యం కాలేదు. మనసును నిగ్రహించడం వాయువును బంధించడం కన్నా కష్టమైందని అర్జునుడే స్వయంగా అన్నాడు. భారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు తనకు సారధ్యం వహిస్తున్న శ్రీ కృష్ణునితో అర్జునుడు ఈ మాటలు పలికాడు. యుద్ధంలో ప్రతిపక్షం మీద దృష్టి సారించి తన తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, సహాధ్యాయ గురుపుత్రుడు అశ్వత్థామ, అన్నదమ్ములైన కౌరవ సోదరులను చూసి విషాదంలో పడి పోయాడు. వారంతా తన స్వజనం కావడంతో యుద్ధం చేయడానికి అతనికి మనస్కరించలేదు. దాంతో అతని చేతిలో నుంచి ధనస్సును జార విడుస్తూ ‘‘కృష్ణా నాకు విజయం వద్దు... రాజ్య సుఖాలు వద్దు... ఆచార్యుణ్ణి, పితామహుణ్ణి, బంధువులను నేను సంహరించలేను’’ అంటూ మౌనం వహించి విముఖుడై కూర్చుండిపోయాడు. అతని మనస్సు నిగ్రహాన్ని కోల్పోయింది. అందువల్లనే అర్జునికి ఇలాంటి స్థితి ఏర్పడింది. ఇది గమనించిన శ్రీ కృష్ణుడు అర్జునుణ్ణి యుద్ధానికి సన్నద్ధం చేయడానికి ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 అధ్యాయాలుగా ఉండే భగవద్గీతను బోధించాడు. భౌతికమైనవి, తాత్వికమైనవి అనేకానేక విషయాలు తాను గురువుగా మారి అర్జునునికి బోధించాడు. దాంతో అర్జునుడు శత్రువులను సంహరించడానికి అంగీకరించాడు. మనోనిగ్రహం పొందడం చేతనే అర్జునుడు తిరిగి మామూలు స్థితికి వచ్చాడు. తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. దీనినే మనం నిత్య జీవిత పోరాటంలో పాఠంగా మలచుకోవాలి. ఆ పాఠం మనల్ని సత్యసంధులుగా, న్యాయవేత్తలుగా, నీతిపరులుగా తీర్చిదిద్దుతుంది. మనో నిగ్రహం అలవడితే సద్గుణ సంపన్నులు అవుతారు. భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలు కలిగి, సమదృష్టి అలవడుతుంది. అయితే ఆత్మ నిగ్రహానికి, ఆత్మస్థైర్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆత్మ స్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ్రపోది చేసుకున్న వ్యక్తి ఆత్మ స్థైర్యాన్ని సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. స్వార్థరహితమైన మనసు, ప్రవత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు. దైవం పట్ల ప్రత్యేక శ్రద్ధ లేకపోయినప్పటికీ తన పట్ల గురి, నమ్మకం ఉన్న వ్యక్తి ఆత్మస్థైర్య సంభూతుడే అవుతాడు. ఆత్మ స్ధైర్యం మనిషి శక్తి సామర్థ్యాలను ద్విగుణీకృతం చేస్తుంది. పిరికితనాన్ని పారదోలుతుంది. విద్యార్జనకు, ఆరోగ్య సాధనకు తోడ్పడుతుంది. భిన్నత్వం గల సమాజంలో ఏకతాభావన సాధించేందుకు బలం ఇస్తుంది. ఆధ్యాత్మిక అంశంలో సైతం ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది. అందువల్ల జీవితంలో ఉన్నత సోపానాలను అధిరోహించాలనుకునే ప్రతివ్యక్తి ఆత్మస్థైర్యం పెంపొందించుకుంటే ఆత్మనిగ్రహం దానికదే సొంతమవుతుంది. మనోనిగ్రహం ఆధ్యాత్మిక సాధనకు అత్యవసరం. లౌకిక విషయాల సాధనకు కూడా మనో నిగ్రహం అవసరం. అలాంటపుడే మనిషి సజ్జనుడుగా నలుగురిలో కీర్తింపబడతాడు. చంచల చిత్తమైన మనస్సును, విషయలోలత్వం నుంచి మరల్చి ఆత్మయందే స్థాపితం చేసి ఆత్మకు సర్వదా అధీనమై ఉండేటట్లు చేయాలని భగవద్గీత కూడా స్పష్టం చేసింది.– దాసరి దుర్గాప్రసాద్ -
ఉరుము లేని పిడుగు
1941 డిసెంబర్ 7న జపాన్ సైన్యం హవాయిలోని పెర్ల్ హార్బర్లో ఉన్న అమెరికా నౌకా స్థావరం పైన ఆకస్మికంగా దాడి జరిపింది. అసలు ఏ మాత్రం ఊహించని ఆ పరిణామంతో అమెరికా, రెండో ప్రపంచ యుద్ధంలోకి దిగక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. డిసెంబర్ 8న, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్ జపాన్ పై యుద్ధ ప్రకటన కోసం చట్ట సభ ‘కాంగ్రెస్’ ఆమోదం కోరారు. కాంగ్రెస్ వెంటనే సమ్మతించింది. అందుకు ప్రతిచర్యగా డిసెంబర్ 11న, జపాన్ తో పొత్తు ఉన్న జర్మనీ, ఇటలీ అమెరికాపై యుద్ధం ప్రకటించాయి. ఆ విధంగా అమెరికా పూర్తిస్థాయిలో రెండవ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించవలసి వచ్చింది.స్నేహితులు శత్రువులయ్యారు!నిజానికి అమెరికా, జపాన్ ఒక జట్టులో ఉండి మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాయి. పెర్ల్ హార్బర్పై దాడి కారణంగా రెండో ప్రపంచ యుద్ధంలో రెండూ పరస్పరం శత్రు దేశాలు అయ్యాయి. అసలెందుకు జపాన్ పెర్ల్ హార్బర్ నౌకా స్థావరంపై దాడి చేయవలసి వచ్చింది? ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో సైనిక విస్తరణను నిలిపివేయాలని జపాన్ పై అమెరికా ఒత్తిడి తెస్తుండటమే అందుకు కారణం. పుస్తకం ఇచ్చిన ప్రేరణ!పెర్ల్ హార్బర్పై దాడి చేయాలన్న ఆలోచన మొదట వచ్చింది.. జపాన్ అడ్మిరల్ ‘ఇసోరోకు యమమోటో’కు. ఆ దాడికి పథక రచన చేసింది కెప్టెన్ మినోరు గెండా. యమమోటోకు ఆ ఆలోచన రావటానికి రెండు విషయాలు ప్రేరణనిచ్చాయి. ఒకటి : కాలజ్ఞాన గ్రంథం. రెండోది, అప్పటికి ఏడాది క్రితమే జరిగిన ఒక దాడి. యమమోటోకు ప్రేరణ కలిగించిన ఆ గ్రంథం పేరు ‘ది గ్రేట్ పసిఫిక్ వార్’. దానిని 1925లో బ్రిటిష్ నౌకాదళ అధికారి హెక్టర్ బైవాటర్ రాశారు. అందులోని కథాంశం, అమెరికా– జపాన్ల మధ్య ఘర్షణలు జరగడం. జపనీయులు యుఎస్ నౌకాదళాన్ని నాశనం చేయడంతో ఆ గ్రంథం ప్రారంభమై గువామ్ (పశ్చిమ పసిఫిక్ ప్రాంతం), ఫిలిప్పీన్స్ లపై జపాన్ దాడి చేయడం వరకు కొనసాగుతుంది. అలాగే, 1940 నవంబర్ 11న ఇటలీలోని టొరంటో నౌకాశ్రయంలో ఇటాలియన్ నౌకాదళంపై బ్రిటన్ రాయల్ వైమానిక దళం విజయవంతంగా దాడి చేయటం కూడా యమమోటోకు స్ఫూర్తిని ఇచ్చింది. దాడికి ఒక రోజు ముందు1941 డిసెంబర్ 6న పెర్ల్ హార్బర్లో ఓడల కదలికలు, మోహరింపు స్థానాల గురించి జపాన్ వివరాలు రాబడుతున్నట్లు అమెరికాకు సమాచారం అందింది. ఆ సమాచారాన్ని ఒక క్రిప్టాలజిస్ట్ తన ఉన్నతాధికారి అయిన మహిళా ఆఫీసర్కు చేరవేసి, తను డిసెంబర్ 8 సోమవారం వచ్చి కలుస్తానని చెప్పారు. ఆ మర్నాడు డిసెంబర్ 7 ఆదివారం... హవాయిలోని ఓహులో ద్వీపంలో ఒక రాడార్ ఆపరేటర్ తన కంప్యూటర్ స్క్రీన్పై... ద్వీపం మీదుగా వెళుతున్న పెద్ద విమానాల సమూహాన్ని చూశాడు. వెంటనే అతను ఆ విషయాన్ని తన ఉన్నతాధికారికి ఫోన్ చేసి చెప్పారు. అయితే ఆ అధికారి, ఆ విమానాలు ఆరోజు అక్కడికి రావాల్సిన యు.ఎస్. బి–17 బాంబర్ యుద్ధ విమానాలు అయి ఉండవచ్చని, వాటి గురించి ఆందోళ చెందాల్సిన పని లేదనీ చెప్పాడు. గంట 15 నిముషాల్లోనే!ఆ తర్వాత కొద్ది సేపటికే ఉదయం 7:55 గంటలకు పెర్ల్ హార్బర్పై జపాన్ దాడి ప్రారంభమైంది. ఆ మొత్తం దాడి కేవలం ఒక గంట 15 నిముషాల్లోనే పూర్తయింది. దానికి ముందు కెప్టెన్ మిట్సువో ఫుచిడా.. ఓహూలో ద్వీప గగన తలంలోకి రాగానే, ‘అమెరికా దిక్కుతోచని విధంగా మా చేతికి చిక్కింది’ అని చెప్పటానికి ‘టోరా, టోరా, టోరా’ అనే కోడ్ సందేశాన్ని జపాన్ నౌకాదళానికి పంపారు. నిజానికి 1907 నాటి హేగ్ సమావేశంలోని మొదటి నిబంధన ప్రకారం, దాడి ప్రారంభించే ముందు ఏ దేశమైనా ముందుగా యుద్ధ ప్రకటన చేయాలి. అయితే జపాన్ ఆ విషయాన్ని ముందస్తుగా వాషింగ్టన్లోని అమెరికా అధికారులకు తెలియబరచటానికి ముందే దాడి మొదలైపోయింది. దాంతో జపాన్ పెర్ల్ హార్బర్పై దొంగదాడి చేసినట్లయింది. విమానాల నుంచి విధ్వంసంపెర్ల్ హార్బర్పై జపాన్ దాడిలో నాలుగు వాహక నౌకల నుండి పైకి లేచిన 353 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. వాటిలో 40 టార్పెడో విమానాలు, 103 లెవల్ బాంబర్లు, 131 డైవ్–బాంబర్లు, 79 ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఇంకా... రెండు భారీ క్రూజర్లు, 35 జలాంతర్గాములు, రెండు లైట్ క్రూజర్లు, తొమ్మిది ఆయిలర్లు, రెండు యుద్ధనౌకలు, 11 డిస్ట్రాయర్లు ఉన్నాయి. ఆ దాడిలో 68 మంది అమెరికన్ పౌరులు సహా 2,403 మంది అమెరికా సైనికులు మరణించారు. 8 యుద్ధనౌకలు సహా 19 యూఎస్ నేవీ నౌకలు ధ్వంసం అయ్యాయి. యూఎస్ పసిఫిక్ నౌకాదళానికి చెందిన మూడు విమాన వాహక నౌకలు దాడికి ముందే సముద్రంలోకి వెళ్లి ఉండటంతో జపాన్ సైన్యం వాటిని గుర్తించలేకపోయింది. డోరీ మిల్లర్ అసమాన శౌర్యంజపాన్ దాడిలో ‘యు.ఎస్.ఎస్. (యునైటెడ్ స్టేట్స్ షిప్) అరిజోనా యుద్ధనౌక’ సిబ్బంది సహా పాటుగా పసిఫిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. పెర్ల్ హార్బర్ దాడిలో చనిపోయిన వారిలో సగం మంది అరిజోనా షిప్లోని వారే. మునిగిపోయిన యుద్ధనౌక పైన అమెరికా జెండా ఎగురుతూ ఉంది. ఆనాటి దాడిలో మరణించిన అమెరికన్ అమర వీరులకు స్మారక చిహ్నంగా ఆ జెండా నిలిచిపోయింది. యు.ఎస్.ఎస్. వెస్ట్ వర్జీనియా నౌక స్టీవార్డ్ డోరీ మిల్లర్, పెర్ల్ హార్బర్పై జపాన్ దాడి జరుపుతున్న సమయంలో కనబరచిన అసమాన ధైర్య సాహసాలు, విధి నిర్వహణ పట్ల ఆయన అంకిత భావం అమెరికాకు చిరస్మరణీయమైనవి. మొదట అతడు ప్రాణాంతకంగా గాయపడిన కెప్టెన్కు సహాయం అందించాడు. తరువాత మెషిన్గన్ తో రెండు జపాన్ విమానాలను ధ్వంసం చేశాడు. నిజానికి మెషిన్ గన్ని ఆపరేట్ చేయటం డోలీ మిల్లర్కు అదే మొదటిసారి. దాడి సమయంలో అతడు చూపిన తెగువకు, సమయస్ఫూర్తికి, సేవకు గుర్తింపుగా అమెరికా అత్యున్నత పురస్కారం ‘నేవీ క్రాస్’ లభించింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆ నేవీ క్రాస్ను పొందిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్ డోరీ మిల్లర్. జపాన్పై ప్రతీకార దాడులుపెర్ల్ హార్బర్ దాడిలో అమెరికా ప్రతిఘటనతో జపాన్ 29 విమానాలను, 5 చిన్న జలాంతర్గాములను కోల్పోయింది. ఒక జపాన్ సైనికుడు ఖైదీగా పట్టుబడ్డాడు. 129 మంది జపాన్ సైనికులు మరణించారు. పెర్ల్ హార్బర్పై దాడిలో పాల్గొన్న అన్ని జపాన్ నౌకలలో, ఉషియో అనే ఒక్క నౌక మాత్రమే చెక్కు చెదరకుండా బయటపడింది. దీనిని యోకోసుకా నౌకా స్థావరం వద్ద అమెరికా స్వాధీనం చేసుకుంది. కూటమి ధాటికి ఓటమిమొత్తానికి అమెరికా కోలుకుంది. అది కూడా జపాన్ ఊహించిన దాని కంటే త్వరగా! కేవలం ఆరు నెలల తర్వాత, 1942 జూన్ ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలోని మిడ్వే ప్రాంతంలో అమెరికాకు చెందిన విమాన వాహక నౌకాదళం... యమమోటో నావికాదళానికి చెందిన నాలుగు జపాన్ విమాన వాహక నౌకలను ధ్వంసం చేసింది. ఈ మిడ్వే విజయం తర్వాత, 1945 సెప్టెంబరులో మూడో ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి, ఒక నెల ముందు ఆగస్టులో అమెరికా, బ్రిటన్, చైనా, రష్యాల కూటమి ధాటికి జపాన్ సామ్రాజ్యం ఓటమి పాలైంది. సాక్షి, స్పెషల్ డెస్క్ -
లొకేషన్ పట్టేస్తారు..
సాక్షి, స్పెషల్ డెస్క్: అసిస్టెడ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్.. సంక్షిప్తంగా ఏ–జీపీఎస్. ఈ సాంకేతికత అంశం ఇప్పుడు భారత్లో కొత్తగా తెరమీదకు వచ్చింది. మెరుగైన నిఘా కోసం మొబైల్ ఫోన్లలో శాటిలైట్ సిగ్నల్స్, సెల్యులార్ డేటా ఆధారంగా పనిచేసే ఈ లొకేషన్ ట్రాకింగ్ వ్యవస్థను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. సైబర్ నేరాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో జాతీయ భద్రత ముఖ్యమన్న భావనతో ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.⇒ దర్యాప్తులో భాగంగా నేరస్తుల జాడను తెలుసుకోవడంలో మొబైల్ ఫోన్ లొకేషన్ అత్యంత కీలకం. ఈ లొకేషన్ తెలియ జే యాల్సిందిగా టెలికం కంపెనీ లను నిఘా సంస్థలు చట్టపరంగా అభ్యర్థించాల్సి ఉంటుంది. ప్రస్తు తం టెలికం కంపెనీలు సెల్యులార్ టవర్ డేటాను ఉపయో గించడంతో ఒక అంచనాగా మొబైల్ లొకే షన్ను అందిస్తున్నాయి. దీంతో కచ్చితమైన లొకేషన్ను పొందడం లేదని కొన్నేళ్లుగా దర్యాప్తు సంస్థలు అందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టిపరిస్థితుల్లో ఏ–జీపీ ఎస్ టెక్నాలజీని అందు బాటులోకి తేవాలని భావిస్తోంది. ఇది అమలైతే ప్రపంచంలో తొలి దేశంగా భారత్ నిలవనుంది. ఏ–జీపీఎస్ కోసం స్మార్ట్ఫోన్లలో లొకేషన్ సేవలు ఎల్లప్పుడూ యాక్టివేట్ అయి ఉంటాయి. విని యోగదారులు వాటిని నిలిపి వేయడానికి అవకాశం ఉండదు.ఏమిటీ ఏ–జీపీఎస్..ఉపగ్రహ సంకేతాలను, సెల్ టవర్ల నుంచి వచ్చే సమాచారాన్ని రెండింటినీ ఉప యోగించి వేగంగా, మరింత కచ్చి తమైన స్థానాన్ని (లొకేషన్) ఏ–జీపీఎస్ అందిస్తుంది. ఉదాహర ణకు మొబైల్ ఫోన్ వాడుతున్న వ్యక్తిని సెల్ టవర్ ద్వారా ట్రాక్ చేసినప్పుడు.. చాలా సందర్భాల్లో లొకేషన్ చూపిస్తున్న ప్రాంతానికీ, వాస్తవంగా ఫోన్ వాడుతున్న వ్యక్తికి దూరం ఉంటోంది. గతంలో ఈ వ్యత్యాసం 16 కిలోమీటర్ల వరకు ఉండేదని సమాచారం. ఏ–జీపీఎస్ సాంకేతికతతో మొబైల్ యూజర్ను దాదాపు ఒక మీటర్ లోపల ట్రాక్ చేయొచ్చు. అంటే నేరస్తుడు తప్పించుకునే అవకాశమే లేదు. ముఖ్యంగా సిగ్నల్స్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఈ టెక్నాలజీ చక్కని పరిష్కారం. తయారీ కంపెనీలు ఈ సాంకేతికతను మొబైల్ ఫోన్లలో ఇన్–బిల్ట్గా అందించాల్సి ఉంటుంది. పాత ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే సరిపోతుంది.ఇన్–బిల్ట్ చేస్తేనే..జియో, ఎయిర్టెల్ వంటి టెలికం కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) కేంద్ర ప్రభుత్వం ముందు ఓ ప్రతిపాదన ఉంచింది. స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు ఏ–జీపీఎస్ టెక్నాలజీని మొబైల్ ఫోన్లలో ఇన్–బిల్ట్ చేస్తేనే కచ్చితమైన లొకేషన్ అందించేందుకు వీలవుతుందని, తయారీ సంస్థలను ఈమేరకు ఆదేశించాలని కోరింది. ఈ ప్రతిపాదనను కేంద్ర ఐటీ, హోం శాఖలు సమీక్షిస్తున్నాయి. గోప్యత సమస్యలు తలెత్తుతాయంటూ ఈ ప్రతిపాదనకు దిగ్గజ కంపెనీలైన యాపిల్, గూగుల్, శామ్సంగ్ వ్యతిరేకిస్తున్నాయి.సైబర్ నేరాల కట్టడికై..ఇంటర్నెట్ వినియోగం మన దేశంలో అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు సైబర్ నేరాలూ అధికమవుతున్నాయి. వీటి కట్టడిలో భాగంగా నేరస్తులకు చెక్ పెట్టేందుకు ఏ–జీపీఎస్ సరైన పరిష్కారం అని కేంద్రం విశ్వసిస్తోందని టెలికం కంపెనీకి చెందిన ప్రతినిధి ఒకరు ఢిల్లీ నుంచి సాక్షితో మాట్లాడారు. ‘పౌరుల హక్కులను రక్షించడంలో ఇది కీలక అడుగు. ఏ–జీపీఎస్ అమలైతే ఫలితాలు చాలా సానుకూలంగా ఉంటాయి’ అని చెప్పారు.ఆ ఫీచర్ను నిలిపివేయాలి..నేరస్తుల లొకేషన్ ట్రాకింగ్ సమస్యాత్మకంగా మారుతోంది. ‘క్యారియర్ (టెలికం కంపెనీ) మీ స్థానాన్ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తోంది’ అంటూ స్మార్ట్ఫోన్ కంపెనీలు తమ వినియోగదారులకు పాప్–అప్ సందేశాన్ని పంపి వారిని హెచ్చరిస్తున్నాయని టెలికం కంపెనీలు వాదిస్తున్నాయి. ఇలా పాప్–అప్ మెసేజ్ వస్తే భద్రతా సంస్థలు తనను ట్రాక్ చేస్తున్నాయని యూజర్ సులభంగా అర్థం చేసుకుంటారని వెల్లడించాయి. పాప్–అప్ ఫీచర్ను నిలిపివేయాల్సిందిగా ఫోన్ తయారీ కంపెనీలను ఆదేశించాలని టెల్కోలు ప్రభుత్వాన్ని కోరాయి.ఏ దేశంలోనూ లేదు..ప్రతిపాదిత సేవలను తప్పనిసరి చేయకూడదని మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు ప్రభుత్వానికి తెలిపాయి. పరిక రాల స్థాయిలో లొకేషన్ను ట్రాక్ చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసి యేషన్ (ఐసీఈఏ) ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాసింది. పౌరుల గోప్యతకు భంగం కలిగించే ఈ నిర్ణయానికి తాము వ్యతిరేకమని, నియంత్రణ పరంగా వంచన చేయడమేనని లేఖలో స్పష్టం చేసింది. ‘మొబైల్ లొకేషన్ను గుర్తించేందుకు ఇప్పటికే లొకే షన్ బేస్డ్ సర్వీసెస్ను పలు టెలికం కంపెనీలు కొన్ని ప్రాంతాల్లో అందిస్తున్నాయి. దీనికోసం టవర్లో సాంకేతిక మార్పులు చేస్తే చాలు. ప్రత్యేకంగా మొబైల్స్లో ఇన్బిల్ట్ చేయాల్సిన అవసరం లేదు’ అని ఒక సాంకేతిక నిపుణుడు తెలిపారు. -
బుధునికి ఓ ‘తోక’
బుధుడు. సౌర వ్యవస్థలో అత్యంత బుల్లి గ్రహం. అంతేగాక సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే గ్రహం కూడా. అయితే అది క్రమంగా చెదిరిపోతోందా? కొద్దికాలానికి గ్రహ లక్షణాలను కోల్పోయేలా ఉందా? ఆ అవకాశం లేకపోలేదు అన్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే బుధ గ్రహం ఉన్నట్టుండి తోకచుక్క లక్షణాలు ప్రదర్శిస్తోంది. అవును! దానికి ఏకంగా 2.4 కోట్ల కిలోమీటర్ల పొడవున సాగిన తోక ఇప్పుడు సైంటిస్టు లోకాన్ని అబ్బురపరుస్తోంది. సోడియం వాయువులతో కూడిన అది దూరదూరాల దాకా తన వెలుగులను విరజిమ్ముతోంది. అమెరికాలోని వర్జీనియకు చెందిన స్టీవెన్ బెలావియా అనే సైంటిస్టు ఈ తోక తాలూకు ఫోటోను తొలిసారిగా తీసి ప్రపంచానికి చూపాడు. అది జరిగింది కూడా బుధవారమే (డిసెంబర్ 3న) కావడం.మరో విశేషం.సూర్యునితో సాన్నిహిత్యం వల్లే...బుధ గ్రహానికి ఇలా ఒక తోక పుట్టుకు రావచ్చని అప్పుడెప్పుడో 1980లోనే సైంటిస్టులు అత్యంత కచితత్వంతో కూడిన అంచనా వేయడం విశేషం. సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండటమే తోక పుట్టుకకు కారణమని సైంటిస్టులు వివరిస్తున్నారు. బుధుని తాలూకు అత్యంత పలుచనైన వాతావరణంపై సూర్యుని రేడియో ధార్మికత నురగ ప్రభావం చూపుతూ ఉంటుంది. ఫలితంగా బుధాణువులు దాన్నుంచి విడివడుతూ తీవ్ర వేగంతో. అంతరిక్షంకేసి దూసుకు పోతుంటాయి. కొన్నేళ్లుగా ఇవి అతి పొడవున తోక ఆకృతి దాలుస్తున్నాయి. ఈ తోక ఉనికి నిజానికి 2001లోనే నిర్ధారణ అయింది. కాకుంటే దాన్ని చూడటం మాత్రం నేటిదాకా సాధ్యపడలేదు.అత్యంత ప్రకాశవంతంగా...ప్రస్తుతం బుధుడు పరిహేళి క్రమంలో ఉన్నాడు. ఈ దశలో ప్రతి గ్రహమూ తన పరిభ్రమణ క్రమంలో సూర్యునికి అతి సమీపానికి వెళ్తుంది. దాంతో ఈ 2.4 కోట్ల కి.మీ. పొడవైన తోకచుక్క అతి స్పష్టంగా, ప్రకాశవంతంగా కనిపిస్తోందిప్పుడు. దాని ప్రకాశంలో మార్పుచేర్పులను నాసా మెసెంజర్ ఉపగ్రహ కొన్నేళ్లుగా స్పష్టంగా గమనిస్తూ వస్తోంది. అంతేగాక దానికి సంబంధించిన కీలక వివరాలను కూడా అందించింది. డిసెంబర్ 9న ఈ తోక మరింత ప్రకాశవంతంగా కనిపించనుందని సైంటిస్టులు తెలిపారు. ఎంతగా అంటే, ప్రస్తుతం కనిపిస్తున్న దానికంటే ఏకంగా పదింతల వెలుగుతో మెరిసిపోనుందట! సైంటిస్టులు సిద్ధంఆ సమయంలో, అంటే డిసెంబర్ 9న బుధునిపై, దాని తోకపై ఇంకొన్ని పరిశోధనలు చేసి, మరిన్ని కీలక వివరాలు, విశేషాలు వెలుగులోకి తెచ్చేందుకు సైంటిస్టులు ఇప్పటి నుంచే అన్ని పరికరాలతో సిద్ధమవుతున్నారు! ఎందుకంటే గ్రహానికి, తోక చుక్కకు ఉన్న మౌలిక భేదాలనే బుధుని తాలూకు ఈ పొడవాటి తోక సవాలు చేస్తోంది. బహుశా బుధుడు ముక్కలు చుక్కలుగా విడిపోయి ఒక పెద్ద తోక చక్కగా మారే ఆస్కారం కూడా లేకపోలేదన్నది కొందరి సైంటిస్టుల జోస్యం. అదేంతవరకూ ఫలిస్తుందో చూడాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
పెళ్లిళ్లకు వెళ్లలేక!
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని సామెత. ఇండిగో దేశీయ విమాన సర్వీసుల నిలిపివేత తాలూకు సంక్షోభం నిజంగానే ఎన్నెన్నో పెళ్లిళ్లను నిజంగానే చావుదెబ్బ తీస్తోంది. పెళ్లి అంటేనే చెప్పలేనన్ని పనులుంటాయి. నెలల తరబడి ప్లానింగ్ చేసినా అంతా సజావుగా ముగిసేదాకా పెళ్లంటే ఇరు పక్షాలకూ కత్తిమీద సాము తరహా వ్యవహారమే. అలాంటిది, ఇండిగో దేశీయ విమాన సేవల సంక్షోభం కారణంగా నవ దంపతులు ఏకంగా తమ సొంత పెళ్లి విందు వేదికకే చేరుకోలేక చివరికి వర్చ్యువల్గా హాజరు కావాల్సిన విచిత్రమైన పరిస్థితి తలెత్తడం తెలిసిందే. ఈ సీజన్లో, అంటే నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 నడుమ దేశవ్యాప్తంగా ఏకంగా 46 లక్షల పెళ్లిళ్లు జరుగుతున్నట్టు అంచనా. అలాంటి సీజన్ మంచి పీక్లో ఉండగా ఇండిగో విమాన సేవల అంతరాయం పెళ్లిళ్లపై గట్టి ప్రభావమే చూపుతోంది. ఆ దెబ్బకు కొన్ని వందల పెళ్లిళ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బ్యాచిలర్స్ పార్టీ గోవిందా ముంబైకి చెందిన వర్షా అగర్వాల్కు వచ్చే జనవరిలో పెళ్లి జరగనుంది. ఈలోపు తన బెస్ట్ ఫ్రెండ్స్ ఆరుగురికి కోల్కతాలో ఘనంగా బ్యాచిలర్స్ పార్టీ ఇవ్వాల ని అంతా పక్కాగా ప్లాన్ చేసుకుంది. తను ముంబై నుంచి ఎయిరిండియా విమానంలో ముందుగానే కోల్కతా చేరుకుని వారికోసం ఎదురు చూడసాగింది. కానీ ఢిల్లీ, హైదరాబాద్ నుంచి రావాల్సిన తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాస్తా కర్మ కాలి ఇండిగోలో టికె ట్లు బుక్ చేసుకున్నారు. తెలియక వారు చేసిన ఈ ఒక్క పొరపాటు చివరికి బ్యాచిలర్స్ పారీ్టకే పురిట్లోనే సంధి కొట్టింది. ఢిల్లీ నుంచి వరుసగా రెండు రోజుల పాటు కోల్కతాకు ఇండిగో తన విమాన సర్వీసులన్నింటినీ రద్దు చేసేసింది. దాంతో ఒక స్నేహితురాలితో పాటు వర్షా కూడా హతాశురాలైంది. ఇక హైదరాబాద్ నుంచి రావాల్సిన మిత్రురాలిది మరో వ్యథ. ఆమె సకాలానికి విమానాశ్రయానికి చేరుకున్నా డిస్ ప్లే బోర్డుపై ఎంతకూ కోల్కతా విమానం జాడేకన్పించని పరిస్థితి. ఇండిగో సిబ్బంది నుంచి కూడా అరకొ ర సమాచారమే. చివరికి విమానం ఆలస్యమన్నారు. అలా రెండు మూడుసార్లు జరిగి ఐదారు గంటలు గడిచాక, విమానం రద్దయిందంటూ చావు కబురు చల్లగా చెప్పారు. ‘‘చివరికి నా బ్యాచిలర్స్ పార్టీని ఒకే ఒక్క ఫ్రెండ్తో ఏదో అయిందనిపించి ముంబై తిరిగొచ్చా. ఇండిగో నాకు మర్చిపోలేని చేదు అనుభవం మిగిల్చింది’’అంటూ మండిపడుతోంది వర్షా. జనవరిలో పుణేలో జరిగే తన పెళ్లికి ఎట్టి పరిస్థితు ల్లోనూ ఇండిగో సేవలను నమ్ముకునేది లేదని తెగేసి చెబుతోంది. వీలైతే అసలు జీవితంలో ఎన్నడూ ఇండిగో విమానమే ఎక్కబోనని కూడా అంటోంది! రేడియో ఆరెంజ్లో ఆర్జేగా చేసే గౌరిదీ అలాంటి వ్యథే. ఆఫీసు వ్యవహారంతో పాటు సన్నిహితుల్లో ఒకరు పెళ్లికి కూడా వెళ్లొచ్చని ఇండిగో విమానంలో టికెట్ బుక్ చేసుకుందామె. కానీ తీరా చూస్తే అది కాస్తా చివరి నిమిషంలో రద్దయింది. అది కూడా తాను విమానాశ్రయానికి చేరుకున్నాక ఇండిగో సిబ్బంది చాలాసేపటికి తీరిగ్గా వెల్లడించారు. తొలుత విమానం ఆలస్యమైందంటూ రెండుమూడుసార్లు దాటవేస్తూ వచ్చారు. బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి! సిలిగురికి చెందిన వ్యాపారవేత్త అనీశ్ సింఘానియా ది కూడా ఇలాంటి బాధే. ఇండిగో నిర్వాకం వల్ల ఏకంగా తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికే వెళ్లలేకపోయానంటూ వాపోతున్నారాయన. ‘‘డిసెంబర్ 4న ముంబై వెళ్లేందుకు ఇండిగోను నమ్ముకున్నా. తీరా చూస్తే ఆ సంస్థ కాస్తా నన్ను నట్టేట ముంచి చేతులు దులుపుకుంది. పోనీ ఇతర సంస్థల విమానాల్లో వెళ్దామంటే అవి కూ డా ఈ దుస్థితిని వీలైనంతగా సొమ్ము చేసుకుని నా ఆశలపై నీళ్లుజల్లాయి. పదేసి రెట్లు పెరిగిన విమాన ధరలు చెల్లించలేక అసలు ప్రయాణమే మానుకు న్నా. ఇండిగోకు నాలాంటివారి ఉసురు తగిలి తీరుతుంది’’అంటూ శాపనార్థాలు పెడుతున్నారు అనీశ్. దౌత్యాధికారికీ తప్పని తిప్పలు సాధారణ దేశీయ ప్రయాణికులకు మాత్రమే కాదు, భారత్లో సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్కూ ఇలాంటి చేదు అనుభవాన్నే రుచిచూపింది ఇండిగో. తన దౌత్య సిబ్బందిలో ఒకరి పెళ్లి నిమిత్తం ఢిల్లీ నుంచి దేవగఢ్కు ఇండిగోలో టికెట్ బుక్ చేసుకున్నారాయన. ‘‘ఆ పొరపాటు చేసినందుకు ప్రయాణం రద్దై ఏమీ చేయలేక తీరని బాధకు లోనైన వేలాది మంది ఇండిగో ప్రయాణికుల్లో నేనూ ఒకనిగా మిగిలాను. నా కొలీగ్కు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడం మినహా ఇంకేం చేయగలను?’’అంటూ ఎక్స్లో వాపోయారాయన! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇంతకీ ఇండిగో ఓనర్ ఎవరో తెలుసా?
భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ కొత్త సిబ్బంది విధుల నియమాలు (ఎఫ్డీటీఎల్), సాంకేతిక లోపాల కారణంగా ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత కొన్ని రోజులుగా వెయ్యికి పైగా విమానాలు ఆలస్యం ఆలస్యం కావడం లేదా రద్దు చేయడం జరిగింది. తిరిగి సాధారణ పరిస్థితి నెలకొంటుందని ఆశించినప్పటికీ.. ఆ దిశగా సంకేతాలు కనిపించడం లేదు. మరో పది రోజుల్లో.. సాధారణ కార్యకలాపాలు తిరిగి కొనసాగవచ్చని కంపెనీ తెలిపింది. ఇటువంటి తరుణంలో ‘ఇండిగో’ యజమాని ఎవరు? అని నెట్టింట చర్చ జరుగుతోంది.. ఇండిగో ఎయిర్లైన్స్ మాతృ సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ను రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ కలిసి స్థాపించారు. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ 1989లో ఏర్పాటు అయ్యింది. వాయు రవాణా నిర్వహణలో ప్రత్యేకత కలిగిన ఈ సంస్థ మార్కెట్ వాటా పరంగా భారతదేశంలో అతిపెద్ద క్యారియర్గా ఎదిగింది. రాహుల్ భాటియా ఇంటర్గ్లోబ్ ఏవియేషన్కు గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఆయన సంస్థలోని కీలక వాటాదారులలో ఒకరు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన భాటియా నాయకత్వంలో ‘ఇండిగో’ కేవలం విమానయానానికి మాత్రమే పరిమితం కాకుండా వివిధ రంగాలకూ విస్తరించింది.వీటిలో హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్, టెక్నాలజీ, ఎయిర్లైన్ మేనేజ్మెంట్, పైలట్ శిక్షణ, ఎయిర్క్రాఫ్ట్ నిర్వహణ ఇంజనీరింగ్ వంటి ముఖ్య వ్యాపార వెంచర్లు ‘ఇండిగో’లో ఉన్నాయి. ఫోర్బ్స్ తెలిపిన వివరాల ప్రకారం రాహుల్ భాటియా ఆస్తుల నికర విలువ $8.1 బిలియన్లు(సుమారుగా రూ. 67,230 కోట్లు) ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రాహుల్ భాటియా 420వ స్థానంలో ఉన్నారు. అతను ఇంటర్గ్లోబ్ ఏవియేషన్లో ప్రమోటర్గా ఉంటూ, నేరుగా 0.01% వాటా లేదా 40,000 షేర్లను కలిగి ఉన్నారు.మరొక సహ వ్యవస్థాపకుడు అయిన రాకేష్ గంగ్వాల్, ఇండిగోను స్థాపించడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ, 2022లో కంపెనీ డైరెక్టర్ల బోర్డు నుండి వైదొలిగారు. అప్పటి నుండి ఆయన ఎయిర్లైన్లో తన వాటాను విక్రయిస్తున్నారు. ప్రస్తుత బీఎస్ఈ (బీఎస్ఈ) డేటా ప్రకారం రాకేష్ గంగ్వాల్ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్లో సుమారు 4.53% వాటా లేదా 1,75,30,493 షేర్లను కలిగి ఉన్నారు. అంతకుముందు ఆయన దాదాపు 13.5% వాటా కలిగి ఉండేవారు. ఇండిగో ప్రస్తుతం 434 సొంత విమానాలను కలిగివుంది. అలాగే రోజుకు 2,300 విమానాలను నడుపుతూ, దేశీయ విమానయాన రంగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.ఇది కూడా చదవండి: ‘బంగ్లా’ గర్భిణి సునాలి కథ సుఖాంతం -
అదిగదిగో ‘తెలంగాణ ఏనుగు!’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విస్తారంగా ఏనుగులు.. ఈ మాట వినగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. జూపార్కులు, సర్కస్లలో తప్ప తెలంగాణ భూభాగంలో ఏనుగుల సంచారాన్ని చూసిన దాఖలాలు ఉండవు. కానీ గతంలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోకి ఏనుగుల గుంపు వచ్చి హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఇలా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఏనుగుల సంగతి పక్కనపెడితే, ఒకప్పుడు తెలంగాణ భూభాగంలో ఏనుగులు విస్తారంగా తిరుగాడాయన్న మాట చరిత్ర పరిశోధకులు అడపాదడపా చెప్తుంటారు. తాజాగా ఇందుకు సంబంధించిన మరో ఆధారం వెలుగు చూసింది. మానేరు నది ఒడ్డున అడవి సోమనపల్లి శివారు అడవి (మంథని సమీపం)లోని గుట్టగుండుకు ఏనుగు చిత్రం వెలుగు చూసింది. ఇది దాదాపు 13 వేల ఏళ్ల కిందట మధ్యరాతియుగంలో గీసిన చిత్రంగా నిపుణులు తేల్చారు. నాటి మానవులు, తమతో సహజీవనం చేసిన జంతువుల జాడలను ఇలా చిత్రాల రూపంలో నిక్షిప్తం చేశారు. పలు రకాల జంతువులు, మనుషుల బొమ్మల్లో ఏనుగు చిత్రం కనిపించింది. దీంతో అప్పట్లో ఆ ప్రాంతంలో ఏనుగుల సంచారం విస్తృతంగా ఉండేదన్న విషయం రూఢీ అవుతోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. గతంలో హైదరాబాద్ శివారులోని గుండ్లపోచంపల్లి శివారు గుట్ట గుహలో కూడా ఆదిమానవులు గీసిన ఏనుగు చిత్రం గుర్తించారు. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి అలాంటి రాతి చిత్రం వెలుగుచూసింది. ఆసిఫాబాద్ అడవుల్లో రాక్షస బల్లి (డైనోసార్) శిలాజాన్ని జీఎస్ఐ గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్ బిర్లా సైన్స్ సెంటర్లో ఆ శిలాజం ప్రదర్శనాంశంగా ఉంది. దాదాపు 6 కోట్ల సంవత్సరాల కిందటినాటిదని దాని డేటింగ్ను శాస్త్రవేత్తలు తేల్చారు. అప్పటి ప్రకృతి ఉత్పాతం ఫలితంగా డైనోసార్లు అంతరించాయి. అలా ప్రకృతి విపత్తులతో ఎన్నో జీవజాతులు కాలగర్భంలో కలిసిపోగా, కొన్ని ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాయి. అలా ఒకప్పుడు విస్తారంగా తిరుగాడిన ఏనుగులు కూడా వాతావరణ ప్రభావంతో తెలంగాణ భూభాగాన్ని విడిచి వెళ్లాయని నిపుణులు పేర్కొంటున్నారు. మధ్యరాతి యుగం (సాధారణ యుగానికి ముందు 10 వేల ఏళ్ల నుంచి 8 వేల ఏళ్ల మధ్య కాలం), కొత్త రాతియుగం, చారిత్రక యుగం కాలాల్లో ఏనుగులు సంచరించాయని స్పష్టమవుతోంది. తాజాగా అడవి సోమనపల్లి సమీపంలోని మానేరు నది ఒడ్డున ఉన్న గుట్టలో ఆదిమానవుల ఆశ్రయాన్ని స్థానిక యువకులు గుర్తించారు. దీన్ని తాజాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు చొల్లేటి శ్రీనివాస్ పరిశీలించి వాటి చిత్రాలను సేకరించారు. వీటిని ఆదిమానవుల రాతి చిత్రాల నిపుణుడు బండి మురళీధరరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వినర్ హరగోపాల్ పరిశీలించి, ఇందులోని చిత్రాలు పాత, మధ్య, కొత్త, చారిత్రకయుగాల్లో గీసినట్టు గుర్తించామని చెప్పారు. ఆయా కాలాల్లో ఆ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకున్న ఆదిమానవులు ఆ రాతిని కాన్వాస్గా మార్చుకుని చిత్రాలు గీసినట్టు వారు వెల్లడించారు. అంటే చిత్రాలకు, చిత్రాలకు మధ్య వేల ఏళ్ల విరామం ఉందన్నమాట. ఈ చిత్రాల్లో వేటాడుతున్న మనుషులు, చేతి ముద్రలు, డైమండ్ ఆకారపు గీతలు, వివిధ భంగిమల్లో ఉన్న మానవులు, ఎద్దు, జింక, ఏనుగు, తేనెపట్టు, త్రిశూలం, ఆంగ్ల ‘వి’ఆకారపు చిత్రాలతోపాటు ఇతర ఆకృతులున్నాయని, ఈ చిత్రాలు ఎరుపు, తెలుపు, నలుపు, పసుపు రంగుల్లో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ చిత్రాల్లో చాలావరకు వాతావరణ ప్రభావంతో వెలిసిపోయాయని, మిగతా వాటిని కాపాడుకోవాల్సిన అవసరముందని వారు వెల్లడించారు. -
Savitri: వెండి వెన్నెల జాబిలి..
‘వింత కాదు నా చెంతనున్నది వెండి వెన్నెల జాబిలి... నిండు పున్నమి జాబిలి’... నింగిలోని జాబిలి ఒక్కటి అందరికీ. తెలుగు వారికి మాత్రం నింగిలోనా, వెండి తెరన రెండు జాబిలుల నిండు సోయగాలు. సావిత్రి జన్మించి నేటికి 90 ఏళ్లు. ఆమె నటించింది సరిగా 15 ఏళ్లు. చనిపోయింది 46 సంవత్సరాలకు! కాని తెలుగు వారు ఆమెను తమ ఆడపడుచుగా భావిస్తూనే ఉన్నారు. మహానటిగా కొలుచుకుంటూనే ఉన్నారు. పదే పదే తలుచుకుంటూనే ఉన్నారు. మన ‘పార్వతి‘, మన ‘మధురవాణి’, మన ‘మిస్సమ్మ’, మన ‘శశిరేఖ’... దేవుడు ఏమరపాటులో తెలుగువారికి ఇచ్చిన అపురూపవరం సావిత్రి. ఆమెకు నివాళి. డిసెంబర్ ఎంత వరదాయిని. సావిత్రిని ఇచ్చింది. డిసెంబర్ ఎంత దుఃఖదాయిని. సావిత్రిని తీసుకెళ్లింది. మంచివాళ్లు వేసే శిక్షలు ఉడుంపట్టులా ఉంటాయి. వదలవు. గింజుకోవాలి. పెనుగులాడాలి. అయినా సరే... వదలవు. సావిత్రిని నమ్ముకున్న వాళ్లందరూ బాగుపడ్డారు. తిరిగి వారిని నమ్మిన సావిత్రి తప్ప. బదులుగా వారిని కొట్టలేదు ఆమె. తిట్టలేదు. కొరడా పట్టుకు శిక్షించలేదు. మరేం చేసింది? కోమాలోకి వెళ్లిపోయింది. బతికే ఉంది. కాని బతికి లేదు. ఊపిరితోనే ఉంది. కాని జీవంతో లేదు.మన వల్ల మోసపోయినవారు మన ఇంటి ముందు ధర్నాకు కూచుంటే ఎంత ఇబ్బందో కోమాలోకి వెళ్లిన సావిత్రి– ఒకరోజు కాదు రెండ్రోజులు కాదు... నెల కాదు... రెండు నెలలు కాదు... 19 నెలల పాటు అలా నిలదీస్తున్నట్టుగా, పాపాలను లెక్కిస్తున్నట్టుగా మృత్యుశయ్యపై ఉండి తనను వంచించిన వారిని దండించింది. చలన చిత్ర తెర మీద క్షణం విరామం లేకుండా జగజ్జేయమానంగా వెలిగిన తారను నిశ్చలన స్థితికి నెట్టడం తెలుగు వారి చరిత్రలో ఒక ‘ఘనత’. సావిత్రి వీడ్కోలు తీసుకునే నాటికి ఆమె వయసు 46. సాధారణంగా– పుట్టిన పిల్లాపాపలు ఎదిగి వారితో స్త్రీలు ఆనందాలు పంచుకోవడం మొదలయే వయసు అది.‘బాలరాజు’ శతదినోత్సవం బెజవాడలో జరుగుతుంటే చూడటానికి వెళ్లి పొంరపాటున మురుక్కాలవలో జారింది సావిత్రి. విధి ఆమెను సరిగ్గానే హెచ్చరించింది– నువ్వు ఎంచుకోబోయే రంగంలో మురుక్కాలవలూ వుంటాయి... మహా జలపాతాలూ ఉంటాయి... భద్రం అని. చిన్నపిల్ల. గ్రహించలేదు. సినీ పరిశ్రమలో అడుగు పెట్టాక మహా జలపాతం వలే కదిలి, ఉరకలెత్తి, హోరు సృష్టించి, అడ్డులన్నింటినీ కకావికలం చేస్తూ ప్రవహించి... చివరకు కొంత మురుగును ఆమె చూడాల్సే వచ్చింది.చదవడం ఆపండి.. రెండు పాటలు చూడండి..ఒకటి ‘మంచి మనసులు’లో ‘నన్ను వదిలి నీవు పోలేవులే’. ఆ పాట ప్రిలూడ్ మొదలయ్యాక నాగేశ్వరరావు సరాసరి పరిగెత్తుకుంటూ వచ్చి చెట్టు వద్ద నిలుచుంటాడు. వెనుక ఒక సెకన్ తేడాలో సావిత్రి పరిగెత్తుకుంటూ రావాలి. మామూలుగా కాదు. ప్రిలూడ్కు తగినట్టుగా గంతులేస్తూ వచ్చి, సరిగ్గా పల్లవి మొదలయ్యే సమయానికి గంతులు ముగించి, పల్లవి అందుకోవాలి. అంతేనా? అల్లరిగా నవ్వుతూ కొద్దిగా పెదవి కొరకాలి. ఇవన్నీ మూడు నాలుగు సెకన్లలో చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ రీల్స్ చేస్తున్నారు కదా... ఫోనుందని. ట్రై చేయండి. స్టార్ నటీమణులైనా సరే. జస్ట్ ట్రై చేసి చూడాలి.రెండు– ‘ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ’... ఈ పాటలో నాగేశ్వరరావుకే మాటలుంటాయి. సావిత్రికి ఉత్త హమ్మింగ్. నాగేశ్వరరావు పలికే ప్రతి మాటకు సావిత్రి తన హమ్తో జవాబిస్తూ ఉంటే ఆ ఒక్క ముఖంలో ఇన్నేసి భావాలా? ఆ రెండు కళ్లల్లో ఇన్నిన్ని అర్థాలా? ఆమెలా చేయగలరేమో ప్రయత్నించి చూడండి. చేయగలిగినవారు ఉన్నారేమో గాలించండి. నో. సావిత్రిలా చేయగలిగే దమ్ము సావిత్రికి మాత్రమే ఉంది. ఆమె అతి సులువుగా చేసింది అందరికీ అత్యంత కష్టమైనది.సావిత్రి చిన్నప్పటి నుంచి డాన్సింగ్ స్టార్. ఆ డాన్స్ చూసే ఆమెను నాటకాల్లోకి తీసుకున్నారు. అన్నీ డాన్స్ డ్రామాలే. మగ వేషంలో ఉన్న ఆడపిల్లలతో. రాధా–కృష్ణ, మేనక–విశ్వామిత్ర, నారాయణమ్మ–నాయుడుబావ. స్టేజ్ మీదకు లేడిపిల్ల వచ్చిందా? ఎవరా పిల్ల? సావిత్రి అట గదా. అల్లరిగా చేసినా భలే అందంగా చేస్తుందే! అవును. అల్లరిగానే చేస్తోంది. తండ్రి లేని పిల్లలు అల్లరి ఎక్కువ చేస్తారు. ఏమంటే తండ్రి లేడన్న విషయం మర్చిపోవడానికి.సావిత్రి (Savitri) బాగా అల్లరి చేసేది. పైకి నాన్–సీరియస్. లోన అగాథం. పెదనాన్న ఉన్నాడు. ఎంత ఉన్నా పెదనాన్న నాన్న కాడు. రక్షకుడు. సావిత్రికి కావాల్సింది అదిలించేవారు కాదు. లాలించేవారు. మగవాళ్లంటే పెదనాన్నలా ఉంటారని అనుకోవడం తప్ప లాలించే మగవాణ్ణి, అనునయంగా మాట్లాడే పురుషుణ్ణి చూడలేదామె.పద్నాలుగేళ్ల వయసులో, ఈడేరిన ప్రాయంలో అలాంటి పురుషుణ్ణి మొదటిసారి చూసిందామె. జెమినీ గణేశన్. ఎదుటివారి తప్పులు మనకు తోవ ఇస్తే మన తప్పులు మరొకరికి దారి ఇస్తాయి. ఈ వృత్తం సావిత్రి జీవితంలో పర్ఫెక్ట్గా పూర్తయ్యింది. ఎలాగంటే భానుమతి (Bhanumati) చేసిన రెండు తప్పులు సావిత్రికి లాభించాయి. డి.ఎల్.నారాయణ ‘దేవదాసు’ తీయడానికి నిశ్చయించుకుని పార్వతి వేషం వేయమని అడగడానికి వెళితే ‘నా దగ్గర ప్రోడక్షన్ మేనేజర్గా పని చేసి నన్నే హీరోయిన్గా బుక్ చేయడానికి వచ్చావా’ అన్నట్టుగా ఆమె అంగీకరించ లేదు. ఆ వేషం సావిత్రికి వెళ్లింది.. సావిత్రి వెలిగింది..‘మిస్సమ్మ’ షూటింగ్ మొదలయ్యి రెండున్నర రీళ్లు తీశాక, షూటింగ్ రోజు వ్రతం పెట్టుకుని ఆ సంగతి సరిగ్గా సమాచారం ఇవ్వక షూటింగ్కు రాకపోవడంతో చక్రపాణికీ, భానుమతికీ పేచీ వచ్చింది. చక్రపాణి ఆమె ఎదుటనే అందాకా తీసిన రీళ్లను కుప్పబోసి నిప్పంటించాడు. భానుమతి చేయాల్సిన మిస్సమ్మ భానుమతికి కాకుండా పోయింది. ఆ వేషం సావిత్రికి దక్కింది. సావిత్రికి తిరుగు లేకుండా పోయింది.మరి కొన్నేళ్లకు సావిత్రి చేసిన రెండు తప్పులు– అధిక తిండి, మద్యపానం ఆమెనూ ఆమె రూపాన్ని మార్చేశాయి. ‘దేవత’ (1965) తీసే నాటికి లాంగ్షాట్లో చూపించాలంటే కెమెరామెన్లు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఆప్పటికి ఆమె వయసు కేవలం 30. కొత్త హీరోయిన్లు ఆమె అవకాశాలు తన్నుకుపోయారు. విశేషం ఏమంటే ఆమె కంటే ఒక్క సంవత్సరం తర్వాత పుట్టిన జమున 1975 వరకూ హీరోయిన్గా చెలాయించింది.సావిత్రికి ఒక సమస్య ఉంది. ఏదైనా పాత్ర ఇస్తే ఆ పాత్రను అద్భుతంగా అర్థం చేసుకుంటుంది. ఎదురుగా ఉండబోయే పాత్రలు ఇవే అనంటే వాటినీ అంతే బాగా అనలైజ్ చేసుకుంటుంది. కాని ఇంత తెలిసిన నటి ఎందుచేతనో ఎదుట ఉన్న మనిషిని మాత్రం గుర్తించలేదు. వాళ్లు ఎటువంటి వాళ్లో, వాళ్లు ఏ వేషం కట్టి తన వద్దకు వచ్చారో ఎప్పడూ గ్రహించలేకపోయింది. ఆమెకు తెలిసింది ఒక్కటే. నమ్మడం. నమ్మి చెడ్డవాళ్లలో సావిత్రిది ముందు వరుస. ఆమెకు కల్లబొల్లి మాటలు చెప్పి నగలు దోచుకెళ్లిన వాళ్లు... కొంగు ముడిలో ఉన్న డబ్బు కాజేసినవారు.... తీసుకున్న డబ్బు ఎగ్గొట్టిన వారు... చిల్లరకు ఆస్తులు కొని కొట్టేసిన వాళ్లు.... అందరూ అయినవాళ్లే. నమ్మించిన వాళ్లు.మనిషికి చదువు తోడుండాలి. లేదా చదువుకున్న వారి తోడు ఉండాలి. సావిత్రికి రెండూ లేవు. ఇన్కంటాక్స్ను కట్టాలని, సరిగా కట్టాలని తెలియాల్సిన అవసరం ఉంది. తెలియచేయాల్సిన వారి బాధ్యతా ఉంది. 8లక్షల టాక్స్ బకాయిలు 30 లక్షల వరకూ వెళ్లాయి. ఆమెను దర్శకురాలిని చేద్దామని ఉవ్విళ్లూరిన బృందం హామీ సంతకాలు పెట్టించి పక్కకు తప్పుకుంది. ‘హీరోయిన్’గా చేయడానికి వచ్చిన ‘పరిమితి’ దర్శకురాలిగా అస్తిత్వం చూపమని పోరు పెట్టింది. సొంత నిర్మాణ దర్శకత్వంలో ‘మూగమనసులు’ సినిమాను తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా ప్రాప్తం’ గా తీయడం ఒక తొందరపాటైతే, అదే సొంత నిర్మాణ దర్శకత్వంలో చలం హీరోగా ‘వింత సంసారం’ తీయడం గ్రహపాటు. రెండూ ఒకే రోజు 1971 ఏప్రిల్ 14న విడుదలయ్యాయి. ఒక తెలుగు హీరోయిన్ తీసిన రెండు సినిమాలు ఒకేరోజు రెండు భాషల్లో రెండురాష్ట్రాల్లో విడుదల కావడం రికార్డ్. కాని ఆ రికార్డును ఎవరూ గుర్తించలేదు. ఆ సినిమాలు ఫ్లాప్ అవడం వల్ల సావిత్రికి ఎంత పోయిందో, ఆ ఫ్లాప్లు చూపించి ఎంత లాగవచ్చో మాత్రం గుర్తుంచుకున్నారు. డబ్బు పోతే బాధ నిజమే కానీ మనుషులు కొట్టే దెబ్బకు కలిగే బాధ ఇంకా అధికం. నౌకర్లు, చాకర్లు, మంది మార్బలంతో వెలిగిన తార... కారణాలు ఏవైనా ఆమె ఒక్కతి ఒంటరిగా జీవించే స్థితి రారాదు. డయాబెటిస్ పేషంట్ అయినప్పుడు ఆమెకు ఇన్సులిన్, ఆ వెంటనే సరైన ఆహారం ఇచ్చే సిబ్బంది లేని స్థితిలో ఉండటం సరి కాదు. బాధ్యులెవరో తేలాల్సిన దుర్మార్గం అది. ఫలితంగా ఏమైంది? 1980 మే 11న ఔట్డోర్ కోసం బెంగళూరు వెళ్లి ఇన్సులిన్ తీసుకుని, ఆహారం స్వీకరించకుండా నిద్ర పోవడంతో సావిత్రి కోమాలోకి వెళ్లిపోయింది. ఎలాంటి దేహం ఆమెది? పొంలంలో పని చేసి, స్టేజ్ మీద గెంతి, బలమైన ఆహారం తీసుకుని దృఢంగా పెరిగిన దేహం. కాని మనసు తిన్న ఘాతాలతో స్వయంగా తలపెట్టుకున్న అపకారాలతో ఆ దేహం ధ్వంసమైంది.ఆ మహానటి ఒక తల్లి కూడా. ‘బొమ్మలు కొనిపెడతాలే నాన్నా’... అని పక్కనే ఉన్న కుమారుడితో అన్న మాటను నెరవేర్చకుండానే మరో 19 నెలల తర్వాత కన్నుమూసిందా కన్నతల్లి. గొప్ప ప్రతిభ. దానికి అవకాశం దొరకాలి. దొరకబుచ్చుకునేంత వరకు పోరాడాలి. దొరికాక విజృంభించాలి. ఇది... సావిత్రిని చూసి నేర్చుకోవాలి నేటి జెన్ జి తరం.గొప్ప పురోభివృద్ధి... కాని అప్రమత్తంగా ఉండాలి... ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి... ఆరోగ్య క్రమశిక్షణ ఉండాలి... కుటుంబంలో వచ్చే సమస్యలను శ్రద్ధగా పరిష్కరించుకోవాలి... అప్పుడే అది మరింత గొప్ప విజయం... ఇది కూడా సావిత్రిని చూసి నేర్చుకోవాలి.సావిత్రి ఒక స్కూల్.ఆమె నటన, జీవితం రెండూ తెలుగు వారికి శాశ్వత పాఠాలు.మహానటి టాప్ టెన్ 1953 దేవదాసు –వేదాంతం రాఘవయ్య1955 కన్యాశుల్కం – పి పుల్లయ్య1955 మిస్సమ్య– ఎల్వీ ప్రసాద్1957 మాయాబజార్– కెవిరెడ్డి1957 తోడికోడళ్లు – ఆదుర్తి సుబ్బారావు1959 అప్పుచేసి పప్పుకూడు – ఎల్వీ ప్రసాద్1962 గుండమ్మ కథ – కమలాకర కామేశ్వరరావు1963 నర్తనశాల – కమలాకర కామేశ్వరరావు1964 మూగమనుసలు – ఆదుర్తి సుబ్బారావు1965 పాండవ వనవాసం – కమలాకర కామేశ్వరరావుఆమె నోట సన్నాయి పాట‘నీ లీల పాడెద దేవా’.... సన్నాయితో పోటీ పడి ఎస్.జానకి పాడిన ఈ పాట తమిళ డబ్బింగ్ ‘మురిపించే మువ్వలు’లోనిదని అందరికీ తెలుసు. ఈ పాట పాడే సమయానికి ఎస్.జానకికి అంత పేరు లేదు. దాంతో సావిత్రి ఈ పాటను సుశీల వంటి పెద్ద గాయనితో పాడించాలని కోరింది. అయితే సన్నాయితో పోటీ పడే గళం జానకికి తప్ప మరొకరితో లేదని అందరూ తేల్చి చెప్పాక అభినయించడానికి ఒప్పుకుంది. ‘నీ లీల పాడెద దేవా’ పాటను జెమినీ గణేశన్తో అభినయించడం వల్ల ఒక సూపర్హిట్ పాటను ఆ భార్యాభర్తలు అభినయించినవారు అయ్యారు. సావిత్రికి చక్కని గొంతు ఉంది. ఆమె పాటలు కూడా పాడుతుంది. అంతే కాదు షూటింగ్లు లేనప్పుడు తన సినిమాల పాటల రికార్డింగ్ ఏదైనా జరుగుతూ ఉంటే వెళ్లి కూచునేది. ఆమె తొలిసారి దర్శకత్వం వహించిన ‘చిన్నారి పాపలు’ కు సంగీత బాధ్యతలు పి.లీలకు అప్పగించిందామె. ఆమె దర్శకత్వంలోని ‘మాతృదేవత’లో ‘మనసే కోవెలగా మమతలు మల్లెలుగా’ పాట పెద్ద హిట్.మీకు మీరే మాకు మేమే...స్వాభావికంగా మంచితనం ఉన్న ఆర్టిస్టులో గొప్ప ఆర్ట్ ఉంటే ఆ ఆర్టిస్టుకు తిరుగు ఉండదు. సావిత్రిని చూస్తే మంచి అమ్మాయి అని టక్కున తెలిసి పోతుంది. ఆ ముఖంలో అసామాన్యమైన ప్రతిభ కూడా కనిపిస్తుంటే జనం ఊ.. అన్నా బ్రహ్మరథం పడతారు. ఆ.. అన్నా బ్రహ్మరథం పడతారు. 1955లో సావిత్రి సినిమాలు ముఖ్యమైనవి మూడు వచ్చాయి. ‘మిస్సమ్మ’, ‘దొంగరాముడు’, ‘కన్యాశుల్కం’. ఒకదానిలో టీచరమ్మ, మరోదానిలో కూరలమ్మి, ఇంకోదానిలో వేశ్య. ‘మిస్సమ్మ’లో కస్సుబుస్సులాడే సావిత్రిని చూసి ఎమ్టీరావు అనే ఎన్.టి.రామారావు (NT Ramarao) ‘నేను కూడా అంతో ఇంతో మంచివాణ్ణే కదండీ’ అంటాడు బెరుగ్గా. అప్పటికి సావిత్రికి స్టార్ స్టేటస్ రాలేదు. కాని తన నటనతో ఎదురుగా ఉన్నది రామారావు అయినా పాత్రకు తగ్గ పై చేయి సాధించగలిగింది. ‘మీకు మీరే మాకు మేమే’ పాటలో సావిత్రి ఈసునసూయలు ఎంత అందమో అంత చందం.‘దొంగ రాముడు’లో నిజమైన కూరగాయల బుట్టను నెత్తిన పెట్టుకుంటే ‘ఎందుకమ్మా... ఉత్త బుట్ట చాలు’ అని ఎవరో అంటే ‘లేదు సార్.. ఉత్త బుట్ట నడకకీ బరువు బుట్ట నడకకీ తేడా ఉంటుంది’ అని మోసిందామె. ఆమె ఆ బుట్టతో నడుస్తుంటే శరీరం చూసి పురుషులకు చిత్త వికారం కలగదు. సావిత్రి అదే సినిమాలో ఖాళీ బుట్టతో నడక కూడా ఎలా ఉంటుందో చూపుతుంది. రెంటికీ తేడా! ఇక ఆర్.నాగేశ్వర రావుతో సావిత్రి పాడిన ‘రావోయి మా ఇంటికి’ కంటితో వింటూ చెవితో చూడాలి.‘కన్యాశుల్కం’లో మధురవాణిని అర్థం చేసుకుని సాహితీ ప్రమాణాలకు తగినట్టుగా ఆ వయసులో నటించడం సావిత్రి మరో రికార్డు! అందులో ‘లొటిపిట్ట’ జోక్కు మధురవాణి సుదీర్ఘంగా నవ్వే సీన్ ఉంది. అంతసేపు వేరెవరైనా నవ్వితే ప్రేక్షకులు తెర చింపేస్తారు. సావిత్రి కాబట్టి చెల్లింది.సావిత్రి తెలుగులో నటించే వేళకు హిందీలో హీరోయిన్లు స్విమ్సూట్లు వేస్తున్నారు. మోడ్రన్ డ్రస్సులు... హెయిర్ స్టయిల్స్ ఫాలో అవుతున్నారు. వాన పాటల్లో తడుస్తున్నారు. కాని సావిత్రి కేవలం కట్టు, బొట్టులతో తను తనలాగే ఉంటూ ప్రేక్షకులను జయించింది. డాన్స్ బాగా వచ్చినా చాలా కొద్దిగా తప్ప చేయలేదు. క్లోజప్ను కాచుకోగల ఏకైక నటి ఆమె. ఆమె క్లోజప్స్ను ‘మాయాబజార్’లో చూడాలి. తల్లిచాటు శశిరేఖ, ప్రేమిక శశిరేఖ, మాయా శశిరేఖ... ఆ సినిమాలో ఆమె ‘మగాడు’లా నటించింది.‘మూగ మనసులు’ స్క్రిప్ట్ విని ‘నేను గౌరి పాత్ర వేస్తాను’ అన్నదట సావిత్రి. ‘నువ్వు ఆ పాత్ర వేస్తే రాధలా వేసే వారిని ఎక్కణ్ణుంచి తేవాలి’ అన్నారట ఆదుర్తి. అవును... నాగేశ్వరరావును ‘ఒరే’ అనగలిగేది, అంటే ప్రేక్షకులు వినగలిగేది సావిత్రి నుంచే. ‘మంచి మనసులు’లోని సావిత్రి వేసిన పాత్రకు ఎందరో అభిమానులు. ఆమె నాగేశ్వరరావును అల్లరి పెడుతుంటే మురిసిన స్త్రీలు నాగేశ్వరరావు దక్కకపోతే ఆమె కంటే ఎక్కువ దు:ఖపడ్డారు.‘డాక్టర్ చక్రవర్తి’లో ‘నీవు లేక వీణ’ పాట సున్నితమైనది. భర్తను తలుచుకుంటూ విరహంతో శృంగార భావనను చాలా సటిల్గా చూపుతుంది సావిత్రి. ‘పరువము వృధగా బరువుగా సాగే’ లైన్ దగ్గర తన చెంపను తనే నిమురుకుని, రెండు చేతులు దగ్గరకు చేర్చి ఒళ్లు విరుచుకుంటుందామె. అసభ్యత లేని ఆ చేష్ట శృంగారాభినయానికి ఆనవాలు.ఇటువంటి గొప్ప నటి ‘గోరింటా పూసింది కొమ్మా లేకుండా’ అని తెల్ల వెంట్రుకలతో, బక్క చిక్కి పాడితే, ఎలా ఉన్నా ‘సావిత్రి ఉందట’ అంటూ మహిళా ప్రేక్షకులు పోటెత్తారు. సావిత్రి ఘనతలు చెప్పడం చక్కెరలో పలుకులు లెక్కబెట్టడం. నిరూపణ అక్కర్లేని గొప్పతనం, మహా నటనం సావిత్రిది. అందుకే ఆమె మహానటి సావిత్రి. -
స్నేహ‘వృక్షం’
లండన్ నగరంలోని ట్రాఫాల్గర్ స్క్వేర్.. డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు, పండుగ శోభతో నిండిపోతుంది. ఆ స్క్వేర్ మధ్యలో నిటారుగా.. వేలాది కాంతులతో వెలిగిపోయే ఒక అద్భుతమైన క్రిస్మస్ చెట్టు కనువిందు చేస్తుంది. ఇది కేవలం ఒక చెట్టు కాదు.. నార్వేజియన్ ప్రజల హృదయం నుండి వచ్చిన ఒక కృతజ్ఞతా బహుమతి. లండన్, నార్వే రాజధాని ఓస్లో నగరాల మధ్య కొనసాగుతున్న ఈ వార్షిక సంప్రదాయం వెనుక దాగిన కథ, మానవ సంబంధాల గొప్పతనాన్ని, చరిత్రను గుర్తు చేస్తుంది. కష్టకాలంలో పుట్టిన స్నేహం ఈ బంధానికి రెండో ప్రపంచ యుద్ధం కల్లోలంలో పునాదులు ఏర్పడ్డాయి. 1940లో, నాజీ జర్మనీ నార్వేపై దండెత్తినప్పుడు, అప్పటి నార్వే రాజు హాకాన్–7, అతని ప్రభుత్వ ప్రతినిధులు లండన్కు శరణార్థులుగా వచ్చారు. అక్కడే ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బ్రిటన్ గడ్డ నుండే నార్వేజియన్ ప్రతిఘటన ఉద్యమానికి బలం చేకూర్చారు. అంతేకాదు, నాజీలు రేడియోలను నిషేధించినా, బీబీసీ సహకారంతో లండన్ నుండి రహస్యంగా నార్వేజియన్ భాషలో వార్తలను ప్రసారం చేసేవారు. ఆ వార్తలు నార్వే దేశ ప్రజలకు ధైర్యాన్ని, ఆశను నింపిన జీవనాడులు. నిరాశలో ఉన్న వేలాది నార్వేజియన్లకు అక్షరాలా అవి ఓ సాంత్వన! హృదయం నుండి వచ్చిన కానుక యుద్ధం ముగిసిన తర్వాత, నార్వే ప్రజలు తమకు ఆశ్రయం ఇచ్చి, తమ స్వాతంత్య్ర పోరాటానికి సహాయం చేసినందుకు బ్రిటన్పై అపారమైన కృతజ్ఞతను చూపాలనుకున్నారు. ఆ ప్రేమే 1947లో ఓస్లో నగర పాలక సంస్థ ఈ వార్షిక క్రిస్మస్ ట్రీ బహుమతిని ప్రకటించడానికి దారి తీసింది. ఈ బహుమతి కేవలం అలంకరణ వస్తువు కాదు. ‘ఓస్లో ప్రజల స్వేచ్ఛా స్ఫూర్తికి లండన్ ప్రజలు ఇచి్చన అండ’కు ప్రతీక. ‘ఎవర్ ఓస్లో’సాహస యాత్ర ఏటా ఓస్లో అడవుల్లో పెరిగే నార్వేజియన్ స్ప్రూస్ జాతి చెట్టును మాత్రమే ఎంపిక చేస్తారు. కొన్నేళ్ల ముందుగానే నాణ్యమైన చెట్లను గుర్తించి, వాటికి ప్రత్యేక సంరక్షణ అందిస్తారు. ఈ ఏడాది చెట్టుకు ముద్దుగా ‘ఎవర్ ఓస్లో’అని పేరు పెట్టారు. సుమారు 60 ఏళ్ల వయసు, 20 మీటర్ల ఎత్తు ఉన్న ఈ చెట్టు, వేలాది చెట్ల నుండి ఎంపికైంది. నవంబర్ 21న జరిగిన ప్రత్యేక వేడుకలో దీనిని నరికి, ఓ ప్రత్యేక ఉయ్యాలలో ఉంచి, రోడ్డు మార్గంలో ఓడరేవుకు తరలించారు. అక్కడి నుండి మొదలైంది అసలు ప్రయాణం. దాదాపు 26 గంటల పాటు సముద్రంలో ప్రయాణించాక ఆ చెట్టు లండన్కు చేరుకుంది. లండన్ చేరుకున్నాక, దాన్ని ట్రక్కులో ట్రాఫాల్గర్ స్క్వేర్కు తరలించారు. ఈ ప్రయాణమంతా ఆ చెట్టు.. రెండు దేశాల స్నేహ సందేశాన్ని మోసుకొచ్చిన ఒక రాయబారిలా సాగింది. సంప్రదాయ దీపాలంకరణ సోషల్ మీడియాలో ఈ చెట్టును ‘బ్రిటన్ జాతీయ నిధి’గా అభివర్ణిస్తారు. ఏటా డిసెంబర్ మొదటి గురువారం జరిగే దీపాలంకరణ వేడుకతో లండన్లో క్రిస్మస్ కౌంట్డౌన్ మొదలవుతుంది. ఈ చెట్టుకు నార్వేజియన్ సంప్రదాయం ప్రకారం నిలువు వరుసలలో దీపాలను అమరుస్తారు. ఈ కాంతులు.. స్క్వేర్లోని ప్రజలకు ఆశ, శాంతి సందేశాన్ని ఇస్తాయి. ఈ క్రిస్మస్ ట్రీ, జనవరి 5 వరకు ట్రాఫాల్గర్ స్క్వేర్లో ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత దీనిని కంపోస్ట్ తయారీకి వినియోగిస్తారు. ప్రతి క్రిస్మస్కు నార్వే పంపే ఈ ట్రీ బహుమతి, కేవలం పండుగ ఆనందం కోసం కాదు. యుద్ధ గాయాలను, మళ్లీ వెలిగించిన ఆశలను గుర్తుచేసే శాశ్వత చిహ్నం. ట్రాఫాల్గర్ స్క్వేర్లో ఈ దీపాలు వెలిగిన ప్రతిసారీ, అది క్రిస్మస్కు సంకేతం మాత్రమే కాదు.. కష్టకాలంలో ఒక దేశం మరో దేశానికి ఇచ్చిన అండ.. సాటి మనిషిపై చూపిన మానవత్వం.. నేటికీ సజీవంగా ఉన్నాయనడానికి హృదయపూర్వకమైన, శాశ్వతమైన కృతజ్ఞతా వెలుగు!– సాక్షి, నేషనల్ డెస్క్ -
నాసిరకానికి మందు
ఫార్మసీలో అడుగు పెట్టగానే మందులు, న్యూట్రాస్యూటికల్స్, కొన్ని రకాల జనరల్ ఐటమ్స్ దర్శనమిస్తాయి. ఇక నుంచి ఓ క్యూఆర్ కోడ్ కూడా ప్రత్యక్షం కానుంది. క్యూఆర్ కోడే కదా అని తీసిపారేయకండి. భారత ఔషధ భద్రతా వ్యవస్థలో ఇదొక పెద్ద ముందడుగు. ఔషధాల వల్ల ఆరోగ్య సమస్య తలెత్తితే ఫిర్యాదులకు క్యూఆర్ కోడ్ విధానానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఫార్మసీలు, హోల్సేల్ మందుల దుకాణాల్లో అందరికీ కనిపించేలా ఫార్మాకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా క్యూఆర్ కోడ్తోపాటు టోల్ఫ్రీ నంబర్ 1800–180–3024 ప్రదర్శించాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) ఆదేశించింది.ఔషధం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ అయితే.. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి వినియోగదారులు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్య, ఆ మందు తాలూకా బ్యాచ్, కంపెనీ వివరాలు అందిస్తే చాలు. అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ మానిట రింగ్ సిస్టమ్ ఈ ఫిర్యాదులను స్వీకరించి సదరు బ్యాచ్లో తయారైన ఔషధాల నాణ్యతను పరీక్షి స్తుంది. లోపం ఉందని తేలితే నిబంధనల ప్రకా రం చర్యలు తీసుకుంటారు.నేరుగా ప్రజల నుంచే..మధ్యప్రదేశ్లో కోల్డ్రిఫ్ అనే దగ్గు మందు ఇటీవల 23 మంది పిల్లల ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. ఔషధ తయారీలో ఫార్మా –గ్రేడ్కు బదులుగా పారిశ్రామిక అవసరాలకు వాడే ముడిపదార్థాలను ఉపయోగించినట్టు ఈడీ తేల్చింది. ఔషధ రంగ పరిమాణంలో ప్రపంచంలో మూడో అతిపెద్ద మార్కెట్ అయిన భారత్లో నాసిరకమైన మందులు, నకిలీలు పెద్ద ముప్పుగా నిలిచాయి. ఔషధాల వల్ల తలెత్తే ప్రతికూల ఫలితాలపై ఫిర్యాదులను నేషనల్ ఫార్మాకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ కింద 2010 నుంచి కేంద్ర ప్రభుత్వం స్వీకరిస్తోంది.నకిలీలకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే టాప్–300 బ్రాండ్స్ ఔషధాలపై కంపెనీలు క్యూఆర్ కోడ్ ముద్రిస్తున్నాయి. అన్ని టీకాలు, యాంటీమైక్రోబయాల్స్, నార్కోటిక్, సైకోట్రోపిక్ మందులకు దశలవారీగా ఈ విధానం అమలు చేయనున్నారు. అయితే ఈ కోడ్ను స్కాన్ చేస్తే ఉత్పాదన గుర్తింపు సంఖ్య, బ్యాచ్ నంబర్, తయారీ, గడువు తేదీ చూపిస్తుంది. ఈ వివరాలు చూపించలేదంటే నకిలీ అన్నట్టు.ఒక్క ఫిర్యాదు సైతం..ఆరోగ్య రంగంలో ఉన్న నిపుణుల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదు. సీడీఎస్సీఓ తాజా నిర్ణయం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుందని, నేరుగా వారి నుంచే ఫిర్యాదులు అందుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మన దేశంలో ఔషధాల వల్ల తలెత్తే హానికర సంఘటనలను ట్రాక్ చేసే విధానంలో క్యూఆర్ కోడ్ ఒక సంచలనం అని చెప్పవచ్చు.‘వాస్తవానికి ప్రాణాలకు హాని జరిగితే తప్ప ఇటువంటివి బయటి ప్రపంచానికి తెలియవు. చాలా మంది రోగులు మందుల వల్ల దుష్ప్రభావాలు సహజమని లేదా తాత్కాలికమైనవని భావిస్తారు. సంబంధిత అధికారులను ఎప్పుడూ అప్రమత్తం చేయరు. దీంతో నాసిరకమైన మందుల గుర్తింపు జరగడం లేదు. సమస్యను ముందుగానే గుర్తించడంలో, వందలాది మందికి ఎదురయ్యే హానిని నివారించడంలో ఒక్క ఫిర్యాదు సైతం సహాయపడుతుంది’ అని సీడీఎస్సీఓ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.మూడు గంటలకు ఒకటి..దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా 32,000 కంటే ఎక్కువ శాంపిల్స్ నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి. 2,500కుపైగా శాంపిల్స్ నకిలీ, కల్తీ అయ్యాయని నిర్ధారణ అయింది. సగటున ప్రతిరోజూ ఎనిమిది మందులు స్టాండర్డ్ క్వాలిటీ టెస్టుల్లో విఫలమవుతున్నాయి. అంటే దాదాపు ప్రతి మూడు గంటలకు ఒకటి అన్నమాట.ముప్పు ఉందని భావిస్తే..తయారీ సంస్థలపై తనిఖీలు నిరంతరంచేపడుతు న్నాం. ప్రధానంగా దగ్గు మందుల వంటి ముప్పు ఉండే ఔషధ తయారీ యూనిట్లలో నాణ్యతను పరీక్షిస్తూనే ఉన్నాం. ఫార్మసీల్లో క్యూఆర్ కోడ్ అమలైతే తయారీ సంస్థల్లో జవాబుదారీ, నాణ్యత విషయంలో ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా జనవరి నుంచి గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) కొత్త రూల్స్ రానున్నాయి. – పి.రాము, అసిస్టెంట్ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణప్రజలకే ప్రయోజనం..దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల మందుల దుకా ణాలు ఉన్నాయి. క్యూఆర్ కోడ్ విధానం అమలైతే ప్రజలకే ప్రయోజనం కలుగుతుంది. అసోసియే షన్ తరఫున క్యూఆర్ కోడ్స్ ముద్రించి అన్ని దుకా ణాలకు సరఫరా చేస్తున్నాం. నాసిరకం, నకిలీలకు మేం వ్యతిరేకం. ఔషధాన్ని పరీక్షిస్తేనే నాణ్యత ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. మందుల తయారీ విషయంలో పటిష్ట జీఎంపీ, లైసెన్సింగ్ విధానాలు అమలు కావాలి. – డాక్టర్ ఘీసూలాల్ జైన్, ప్రెసిడెంట్, తెలంగాణ చాంబర్ ఆఫ్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ -
రిటైల్ ఇన్వెస్టర్లు స్మార్ట్గురూ!
ఈ కేలండర్ ఏడాది(2025) మార్చి మొదలు రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీ పెట్టుబడులపట్ల కొంతమేర విముఖతను ప్రదర్శిస్తున్నారు. దీంతో అప్పుడప్పుడూ కొనుగోళ్లకు కట్టుబడినప్పటికీ అడపాదడపా విక్రయాలకే అధిక ప్రాధాన్యమిస్తూ వచ్చారు. ఇదే బాటలో గత రెండు నెలల్లో మరింత అధికంగా పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం ద్వారా స్మార్ట్గా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. కొద్ది నెలలుగా ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకుతూ కదులుతున్నాయి. ఇటీవలే ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 86,100 పాయింట్లు, ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 26,300ను అధిగమించాయి. ఈ బాటలో గత రెండు నెలల్లోనూ హెచ్చుతగ్గుల మధ్య లాభాలు ఆర్జించాయి. అక్టోబర్లో ఇండెక్సులు 4.5 శాతం పుంజుకోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్(100) 5.8 శాతం, స్మాల్ క్యాప్(100) 4.7 శాతం చొప్పున ఎగశాయి. ఈ ప్రభావంతో నవంబర్లోనూ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ మరింత బలపడినప్పటికీ స్మాల్ క్యాప్ 3 శాతం క్షీణించింది. సరిగ్గా ఇదే సమయంలో అంటే గత రెండు నెలల్లో రిటైల్ ఇన్వెస్టర్లు ఉమ్మడిగా రూ. 23,405 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! ఈ ట్రెండ్ ఇప్పటివరకూ 2025 పొడవునా కనిపించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. అప్రమత్తతతో.. నిజానికి మార్కెట్లు బలపడుతున్నప్పుడు విక్రయాలకు ప్రాధాన్యమిస్తూ వచి్చన రిటైలర్లు దిద్దుబాటుకు లోనైనప్పుడు కొనుగోళ్లు చేపడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. తద్వారా దేశీ స్టాక్స్పట్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. అయితే మరోపక్క ఇదే సమయంలో దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్) పెట్టుబడులను కొనసాగించడం ప్రస్తావించదగ్గ అంశం! వివిధ పథకాలలో కొంతమంది రిటైలర్లు సిప్ల ద్వారా పెట్టుబడులు కొనసాగించడం మ్యూచువల్ ఫండ్లకు దన్నుగా నిలుస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా స్వల్పకాలిక పెట్టుబడుల విషయంలో రిటైలర్లు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. అధిక విలువల్లో కొనుగోలు చేసిన షేర్ల విషయంలోనూ మార్కెట్ల తీరు ఆధారంగా కొద్దిపాటి నష్టాలకు లేదా లాభాలకు అమ్మకాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. మరోపక్క అంతగా లాభాలకు ఆస్కారం లేదనిపించిన దీర్ఘకాలిక పెట్టుబడులపైనా ఇదే ధోరణి అనుసరిస్తున్నట్లు వివరించారు. ఐపీవోలలోనూ 2025లో ప్రైమరీ మార్కెట్లు సరికొత్త రికార్డులు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 96 ఇష్యూలు రూ. 1.6 లక్షల కోట్లు సమీకరించాయి. అయితే రిటైలర్లు ఐపీవోలో లిస్టింగ్ లాభాలకోసమే ఇన్వెస్ట్ చేస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో లిస్టింగ్ రోజునే అత్యధిక శాతం ఇన్వెస్టర్లు హోల్డింగ్స్ విక్రయించడం ద్వారా పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలియజేశారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
యూట్యూబ్ను షేక్ చేస్తున్న ‘పేరుగల్ల పెద్దిరెడ్డి’ సాంగ్
తెలంగాణ జానపదలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని, నృత్యకారిణి నాగదుర్గ నుంచి తాజాగా విడుదలైన పాట ‘పేరుగల్ల పెద్దిరెడ్డి’ ప్రస్తుతం యూట్యూబ్లో మరియు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. తెలంగాణ ఫోక్ సాంగ్స్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ, ఈ కొత్త పాటతో మరోసారి ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. పేరుగల్ల పెద్దిరెడ్డి అంటూ వచ్చిన ఈ పాట తండ్రి మీద ప్రేమతో కూతురు చెబుతున్న నేపథ్యంలో ఉంది. పల్లెటూరి వాతావరణాన్ని, జానపద లయను ప్రతిబింబిస్తూ ఈ పాట ఆకట్టుకుంటుంది. ఎప్పటిలాగే, నాగదుర్గ ఈ పాటలో తనదైన శైలిలో చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. శుక్రవారం విడుదలైన ఈ పాట కొద్ది గంటల్లోనే యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ను సాధిస్తూ ట్రెండింగ్లో నిలిచింది. పల్లె జానపద పాటల అభిమానుల మధ్య ఈ పాట క్రేజీ హిట్గా మారడంతో నాగదుర్గ ఖాతాలో మరో విజయవంతమైన జానపద పాట చేరింది. ఈ పాటకు బుల్లెట్ బండి లక్ష్మణ్ సాహిత్యం అందించగా.. మమత రమేష్ గానం చేశారు. సంగీతాన్ని మదన్ కే అందించారు. -
మన అంతరిక్ష కేంద్రానికి తుది రూపు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అతి పెద్ద ఘనత సాధించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్)కు తుదిరూపు ఇచ్చింది. దాని ఆకృతీకరణ (కన్ఫిగరేషన్) ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. మానవసహిత అంతరిక్ష యాత్ర దిశగా దీన్ని కీలక మైలురాయిగా శాస్త్ర సాంకేతిక లోకం వేనోళ్ల కీర్తిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన జాతీయ స్థాయి పరిశీలన కమిటీ బీఏఎస్ తుది రూపును పూర్తిస్థాయిలో పరిశీలించడం, ఆమోదముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి. ఈ శుభవార్తను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్ సభలో వెల్లడించారు. ఏమిటీ బీఏఎస్? ఇస్రో పూర్తి దేశీయ పరిజ్ఞానం సాయంతో రూపొందిస్తున్న మన సొంత అంతరిక్ష కేంద్రమిది. ఇందులో మొత్తం ఐదు మాడ్యూళ్లు ఉంటాయి. మరో పదేళ్లలో అంటే 2035 నాటికి దీన్ని ఆరంభించి కార్యకలాపాలు మొదలు పెట్టాలన్నది ఇస్రో లక్ష్యం. బీఏఎస్– 01 పేరిట మన అంతరిక్ష కేంద్రం తొలి మాడ్యూల్ అభివృద్ధికి కేంద్రం 2024లో పచ్చజెండా ఊపింది. ఫౌండేషనల్ మాడ్యూల్ను 2028 కల్లా ప్రయోగాత్మకంగా పూర్తిస్థాయిలో పరీక్షించి చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇస్రో ఏడాదిలోనే బీఏఎస్ నిర్మాణం పూర్తి చేయడం విశేషం. దాని తాలూకు విడి భాగాలు, ఉప వ్యవస్థలు తదితరాలన్నీ చక్కగా పని చేస్తున్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గగన్యాన్ ప్రాజెక్టులో అంతర్గతంగా బీఏఎస్కు నిధులు తదితరాలు సమకూర్చారు. దీనికి కేటాయింపులను ఏకంగా రూ.29,193 కోట్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.ఎన్నెన్నో విశేషాలు... → బీఏఎస్ నిర్మాణాన్ని అంతర్జాతీయ ప్రమాణాలన్నింటికీ అనుగుణంగా ఇస్రో పూర్తి చేసింది. → గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా భూ దిగువ కక్ష్య (ఎల్ఈఓ)లోకి మానవసహిత ఉపగ్రహాన్ని పంపాలన్న తొలి లక్ష్య సాధనలో బీఏఎస్ పాత్ర కీలకం కానుంది. → అంతరిక్షంలో పలు కీలక పరీక్షలు, ప్రయోగాలు కూడా బీఏఎస్ చేపట్టనుంది. → భారత్ సత్యం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవసహిత చంద్రయాన్లో కూడా ఇదే కీలకం కానుంది. → అవసరాన్ని బట్టి అత్యవసర పరిస్థితుల్లో ఇతర అంతరిక్ష కేంద్రాలతో ఎప్పటికప్పుడు అనుసంధానం అయ్యేందుకు దీంట్లో అన్ని ఏర్పాట్లూ ఉన్నాయి. → బీఏఎస్లోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ప్రయోగించిన కొద్ది కాలంలోనే అన్ని అంతరిక్ష కేంద్రాలకూ అది సారథిగా ఎదిగినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. → ఇతర అంతరిక్ష కేంద్రాలతో భాగస్వామ్యం దిశగా ఇస్రో ఇప్పటికే చర్చలు మొదలుపెట్టడం విశేషం – సాక్షి, నేషనల్ డెస్క్ -
జీవుల ఇంటర్నెట్.. వైద్యం సూపర్ 'ఫాస్ట్'!
ఇంటర్నెట్ అంటే తెలుసు. మరి ‘జీవుల ఇంటర్నెట్’ అంటే? ఆరోగ్య సంరక్షణ కోసం మానవ శరీరాలను డిజిటలైజ్ చేయటం. ఇంకా చెప్పాలంటే.. మైక్రోస్కోపిక్ సెన్సర్ల ద్వారా మన శరీరాలతో ఇంటర్నెట్ను నేరుగా కనెక్ట్ చెయ్యటమే. తద్వారా కేన్సర్ వంటి జబ్బుల్ని పుట్టుకలోనే గుర్తించి అప్పటికప్పుడు చికిత్స చెయ్యవచ్చు. వృద్ధాప్యాన్ని సైతం జయించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ అందమైన కల పీడకలగానూ మారే హ్యాకింగ్ ముప్పూ పొంచి ఉందనే అనుమానాలూ లేకపోలేదు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) నుంచే ఇంటర్నెట్ ఆఫ్ బీయింగ్స్ (ఐఓబీ) లేదా జీవుల ఇంటర్నెట్ మాట పుట్టింది. సాంకేతికత ద్వారా గణాంకాల సేకరణ, సత్వర పంపిణీలో మనిషి జోక్యాన్ని సాధ్యమైనంత తగ్గించటమే ఐఓటీతో ఒనగూడే ప్రయోజనం. రోజువారీ పనుల్లో వాడే గృహోపకరణాల దగ్గరి నుంచి ఆధునిక పారిశ్రామిక పరికరాల వరకు సెన్సర్లు, సాఫ్ట్వేర్, ఇతర సాంకేతికతల సహాయంతో నిరంతరం అనుసంధానమై ఉంటూ ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని, గణాంకాలను ఎప్పటి కప్పుడు పరస్పరం పంచుకోవటం ఐఓటీలో జరిగే పని.– సాక్షి, స్పెషల్ డెస్క్ఏంటి ఈ ఐఓబీ?» ఇంటర్నెట్ ఆఫ్ బీయింగ్.. మనుషుల దేహాలను ఇంటర్నెట్కు ఈ సాంకేతికత అనుసంధానిస్తుంది. అతి చిన్న, అత్యంత అధు నాతన సెన్సర్లు మన శరీరాల్లోకి ప్రవేశించటం ఐఓబీ ద్వారా సుసాధ్యమవుతుంది. సెన్సర్లు, సాఫ్ట్వేర్, ఇతర సాంకేతి కతల సహాయంతో మనిషి దేహంలో జరిగే ఆరోగ్యమార్పులను సూక్ష్మ స్థాయిలోనే గుర్తిస్తారు. అంతేకాదు, దేహం లోపలికి సూక్ష్మ రోబోలను పంపి చికిత్స చేయటానికీ ఐఓబీ దోహదం చేస్తుంది.ఇంటర్నెట్ మూడో దశ» డిజిటల్ యుగంలో ఇప్పుడు మూడో దశ నడుస్తోంది. మొదటి దశలో కంప్యూటర్లు వచ్చాయి. రెండో దశలో రోజు వారీ జీవితాన్ని ప్రభావితం చేసే వస్తువులను కంప్యూటర్తో అనుసంధానం జరిగింది. ఇంటర్నెట్ మూడో దశలో ‘జీవుల ఇంటర్నెట్’ వస్తోంది. మైక్రోస్కోపిక్ సెన్సర్ల ద్వారా మన శరీరాలతో ఇంటర్నెట్ను నేరుగా కనెక్ట్ చెయ్యటమే దీని ఉద్దేశ మని ఇటలీ మిలన్ లోని బోకోని విశ్వ విద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కో గ్రిల్లో అన్నారు. ‘జెల్ ఆధారిత ‘బయో రోబోలు’ దేహంలో ఉంటూ మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడమే కాకుండా, రక్తం గడ్డ కడుతున్నప్పుడు గుర్తించి సమాచారం అందిస్తాయి. అవసరమైతే ఆస్పిరిన్ మందును కూడా విడు దల చేస్తాయి. వైరస్లు దాడి చేసినప్పుడు టీకాలను సైతం అప్పటి కప్పుడు యాక్టివేట్ చేస్తాయి’ అని ఆయన అంటున్నారు.వైద్య పరిశోధనలో మేలిమలుపు‘జీవ ఇంటర్నెట్’.. మన అవయవాల నుంచి ఎప్పటికప్పుడు తాజా డేటాను సేకరించటం ద్వారా వైద్య పరిశోధనను సమూలంగా మార్చగలదు. ముఖ్యంగా వృద్ధాప్యాన్ని ఓడించడం.. పేద దేశాల్లోనూ ప్రతి ఒక్కరూ వ్యాధుల్లేకుండా ఎక్కువ కాలం జీవించడంలో సహాయపడటం.. వంటి అద్భుత కలలను జీవుల ఇంటర్నెట్ నెరవేర్చుతుందని ఆశిస్తున్నారు. » నిశ్శబ్ద గుండెపోట్లను సకాలంలో గుర్తిస్తుంది» అవసరమైనప్పుడు మందులను విడుదల చేస్తుంది.» శరీరం లోపల నుంచే చికిత్సలను అందిస్తుంది» తద్వారా ప్రాణాలను కాపాడుతుంది మరణాలు నివారించవచ్చు..ఈ సాంకేతికత కొన్ని కొత్త పరిణామాలకు దారితీస్తుందని ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కో గ్రిల్లో చెబుతు న్నారు. ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడం వల్ల వ్యాధులు అభివృద్ధి చెందకముందే వాటిని గుర్తించడం సులభం అవుతుంది. ఆహారంలో మార్పులు లేదా మరింత వ్యక్తిగతీకరించిన వ్యాయామ దినచర్యలను సూచించవచ్చు. సకాలంలో హెచ్చరికలు పంపడం ద్వారా మరణాలను నివారించవచ్చు. ఒక్క అమెరికాలోనే ప్రతి సంవత్సరం 8,05,000 మంది గుండె పోటుతో మరణి స్తుంటే.. సమస్యను గుర్తించలేక 1,70,000 మంది ‘నిశ్శబ్ద’ గుండెపోట్లతో చనిపోతున్నారు. జీవుల ఇంటర్నెట్ యుగంలో వైద్య పరిశోధన, ఔషధ ఆవిష్కరణ ఇప్పటిలా కాకుండా అత్యంత వేగవంతమవుతుంది. భారీ డేటాబేస్లు సమస్యకు ఏది పనిచేస్తుందో చూపించే నమూనాలను సూచిస్తాయి. ఔషధాలు చాలా త్వరగా, చౌకగానే కాకుండా కచ్చితత్వంతోనూ అభివృద్ధి అవుతాయి.పీడ కల కాకుండా..మన శరీరాలను డిజిటలైజ్ చేసే జీవుల ఇంటర్నెట్ను మనం జాగ్రత్తగా వినియోగించాలని నిపు ణులు సూచిస్తున్నారు. హ్యాకర్లు ‘ఇంటర్నెట్ ఆఫ్ బీయింగ్స్’ ను లక్ష్యంగా చేసుకుంటే ఎదురయ్యే విపరిణామాలు భయంకరంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. -
సాహో... సాగర ధీర
సముద్రాన్ని జీవితంతో పోలుస్తారు తాత్వికులు. సముద్రంలో మౌనం ఉంటుంది. కల్లోలం ఉంటుంది. పడి లేచిన కెరటాలు ఉంటాయి. సవాళ్ల విషయంలో భారత నావికాదళం కూడా సముద్రంలాంటిదే. ఆ సవాళ్లను అధిగమించి భారత నావికా దళంలో వివిధ కీలక విభాగాల్లో తొలి మహిళలుగా చరిత్ర సృష్టించిన రోల్ మోడల్స్ గురించి...భారత నావికా యుద్ధనౌకకు నాయకత్వం వహించిన తొలి మహిళా కమాండర్గా ప్రేరణ దియోస్థలీ చరిత్ర సృష్టించింది. ముంబైకి చెందిన ప్రేరణ ‘జీసస్ అండ్ మేరీ కాన్వెంట్’ స్కూలులో చదువుకుంది. నేవీలో పనిచేయాలనే లక్ష్యానికి స్కూలు రోజుల్లోనే బీజం పడింది. సెయింట్ జేవియర్స్ కాలేజీలో సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ప్రేరణ 2009లో నావికాదళంలో చేరింది. ప్రేరణను స్ఫూర్తిగా తీసుకొని ఆమె తమ్ముడు కూడా నావికా దళంలో పని చేస్తున్నాడు. ఉద్యోగంలో చేరిన కొత్తలో ప్రారంభ సమస్యలు ఎదుర్కొంది ప్రేరణ. గోవాలో తన మొదటి ఎన్సీసీ సెయిలింగ్ క్యాంప్లో సెయిల్ బోట్ మూడుసార్లు బోల్తా పడింది. అయినప్పటికీ ‘ఇక చాలు’ అనుకోలేదు. పట్టుదలతో సెయిలింగ్లో ప్రావీణ్యం సాధించింది. ఒడిశాలోని చిల్కా సరస్సులో జరిగిన సెయిలింగ్ పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. కెరీర్ తొలిరోజుల్లో సముద్ర నిఘా విమానంలో పరిశీలకురాలిగా శిక్షణ పొందింది. 2012లో చైనా వాణిజ్యనౌకపై సోమాలియ దొంగలు దాడికి దిగినప్పుడు, ఆ దాడిని తిప్పి కొడుతూ చేసిన ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిన ప్రేరణ భారత్ నేవీ విదేశ్ సేవాపతకాన్ని అందుకుంది.నేవీలో తొలి మహిళా క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్భారత నావికాదళంలో తొలి మహిళా క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ (క్యూఎఫ్ఐ)గా చరిత్ర సృషించింది కమాండర్ దివ్యశర్మ. డోర్నియర్ పైలట్లుగా పనిచేసిన మొదటి ముగ్గురు మహిళలలో న్యూ దిల్లీకి చెందిన దివ్యశర్మ ఒకరు. ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా అర్హత సాధించడానికి కఠినమైన శిక్షణ తీసుకుంది. ఫ్రంట్లైన్ కార్యకలాపాల కోసం నావికా ఏవియేటర్లకు శిక్షణ ఇవ్వడంలో ఇన్స్ట్రక్టర్లది కీలక పాత్ర.గతంలో ఫిక్స్డ్–వింగ్ విమానాలను నడిపిన దివ్య ఇండియన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్లలో పైలట్లకు శిక్షణ ఇచ్చే సర్టిఫికెట్ అందుకుంది. న్యూ దిల్లీలోని మాల్వియానగర్కు చెందిన దివ్య కెరీర్ తొలి రోజుల్లో నుంచే అద్భుతమైన ప్రతిభ ప్రదర్శిస్తూ వస్తోంది. డోర్నియర్ ఆపరేషనల్ ఫ్లయింగ్ ట్రైనింగ్ (డీవోఎఫ్టీ) కోర్సులో అత్యత్తమ ప్రతిభ చూపింది. కెరీర్ ప్రారంభంలో నైపుణ్యం, అంకితభావానికి గుర్తింపుగా ‘ఫస్ట్ ఇన్ ఫ్లయింగ్’ అవార్డ్ అందుకుంది.నావికా దళంలో నారీశక్తిభారత నావికాదళంలో ఒకప్పుడు మహిళల పాత్ర పరిమితంగా ఉండేది. అయితే కాలక్రమంలో మహిళల శక్తిసామర్థాల్యను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి దారులు తెరిచింది ఇండియన్ నేవీ. ఒకప్పుడు మాండోవి, గోవా బ్రాంచ్లలో ఎడ్యుకేషన్, లాజిస్టిక్స్... మొదలైన వాటిలో పరిమిత పాత్ర పోషించిన మహిళలు కీలకమైన విభాగాల్లోకి వచ్చి సత్తా చాటుతున్నారు. నేవీలో పైలట్, ఫైటర్ పైలట్, క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా... ఎన్నో కీలక విభాగాల్లో పనిచేస్తున్నారు. విమాన వాహక నౌకలు, డిస్ట్రాయర్లు, ప్రిగేట్... మొదలైన ఫ్రంట్లైన్ యుద్ధనౌకలలో మహిళలు విధులు నిర్వహించడం నావికాదళంలో మహిళల పాత్రకు సంబంధించి విప్లవాత్మక అభివృద్ధి. లింగసమానత్వానికి పెద్ద పీట వేయడంలో భారత నావికాదళం ముందు వరుసలో ఉంది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం భారత నావికాదళం మహిళా అధికారులకు (వైద్యేతర శాఖలు) మెరిట్ ఆధారంగా పర్మినెంట్ కమిషన్ మంజూరు చేసింది.తొలి మహిళా ఫైటర్ పైలట్భారత నౌకాదళంలో మొట్ట మొదటి మహిళా ఫైటర్ పైలట్గా చరిత్ర సృష్టించింది ఆస్తా పూనియా. ‘మహిళా ఫైటర్ పైలట్తో భారత నౌకాదళంలో కొత్త శకం మొదలైంది’ అన్నారు అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ రియర్ అడ్మిరల్ జనక్ బెల్వీ. ప్రతిష్ఠాత్మకమైన ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ పురస్కారాన్ని అందుకుంది ఆస్తా పూనియా. నాన్–ఫైటర్ ఆపరేషన్లలో మహిళా అధికారులు ఉన్నప్పటికీ ఫైటర్ స్ట్రీమ్లో అడుగుపెట్టిన తొలి మహిళగా ప్రత్యేకత చాటుకుంది. ఉత్తర్ప్రదేశ్లోని మేరర్కు చెందిన ఆస్తా ఇంజినీరింగ్ చేసింది. ఎన్నో పరిమితుల కారణంగా నేవీ యుద్ధవిమానాన్ని నడపడం ఆషామాషీ విషయం కాదు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ చరిత్ర సృష్టించింది. ఎంతోమంది యువతులకు రోల్మోడల్గా నిలిచింది.తొలి మహిళా పైలట్ఉత్తర్ప్రదేశ్లోని తిల్హార్కు చెందిన శుభాంగి స్వరూప్ భారత నావికాదళంలో తొలి మహిళా పైలట్గా చరిత్ర సృష్టించింది. 2017లో కన్నూర్లోని ‘ఇండియన్ నేవల్ అకాడమీ’ నుంచి పట్టభద్రురాలైన మొదటి బ్యాచ్ మహిళా అధికారులలో శుభాంగి ఒకరు. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బయో టెక్నాలజీలో ఇంజినీరింగ్ చేసింది. హైదరాబాద్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందింది. నావికా దళంలో పనిచేసిన తండ్రి కమాండర్ జ్ఞాన్స్వరూప్ శుభాంగికి స్ఫూర్తి.‘నేవీలో పనిచేయడం అంటే మాటలు కాదు. తట్టుకుంటావా?’ అని తండ్రి అడిగినప్పుడు ‘యస్’ అని చెప్పింది శుభాంగి. ఆమె నేషనల్ తైక్వాండో ఛాంపియన్ కూడా.ఆమె అమరత్వంవృత్తి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన భారత వైమానిక దళంలోని తొలి మహిళా అధికారి కిరణ్ షెఖావత్. అబ్జర్వర్గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ 2015 మార్చి 24న గోవా తీరంలో జరిగిన డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రమాదంలో చనిపోయింది. ముంబైలో పుట్టిన కిరణ్ ఆంధ్రా యూనివర్శిటీలో ఫిజిక్స్లో పట్టా పుచ్చుకుంది. ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏ)లో చేరడానికి ముందు ఒక ప్రైవేట్బ్యాంకులో పనిచేసింది. తన ఐదు సంవత్సరాల కెరీర్లో దేశంలోని వివిధ నౌకాదళ స్టేషన్లలో విధులు నిర్వహించింది. నేవీలోకి రావాలనుకోవడానికి తండ్రి స్ఫూర్తి. ఆయన నేవీ ఆఫీసర్. రచయిత నికోలస్ స్పార్క్కు కిరణ్ పెద్ద అభిమాని. అతడి అన్నిపుస్తకాలు చదివింది. ఆ పుస్తకాల ఆధారంగా వచ్చిన సినిమాలు చూసింది. కుమార్తె చనిపోయిన తరువాత ఆమె పేరు మీద ‘లెఫ్టినెంట్ కిరణ్ షెఖావత్’ ఫౌండేషన్ స్థాపించాడు తండ్రి. హరియాణాలోని కుర్తాలలో కిరణ్ షెఖావత్ గౌరవార్థం రెండు ఎకరాల భూమిని షహీద్ పార్క్గా అభివృద్ధి చేశారు. ఈ పార్క్లో కిరణ్ విగ్రహం ఏర్పాటు చేశారు. -
నాలుగు కాళ్ల దేవతలు!
అది పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లా, నవద్వీప్ పట్టణం. ఎముకలు కొరికే చలి. నిశ్శబ్దపు తెల్లవారుజాము.. ఆ చీకట్లో రైల్వే కార్మికుల కాలనీలోని ఒక బాత్రూమ్ వెలుపల నేలపై నవజాత శిశువు. శరీరంపై ఎలాంటి వస్త్రం లేదు.. పురిటి నెత్తురు మరకలు తొలగలేదు.. ఇంకా ప్రపంచాన్ని పూర్తిగా చూడని ఆ పసికందును ఎవరో కనికరం లేకుండా వదిలివేశారు. ఆ చిన్ని ప్రాణం గడ్డకట్టే చలిలో వణికిపోయింది.. విలవిల్లాడిపోయింది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. వలయం కట్టి.. తెల్లార్లూ కాపలా కాసివీధి కుక్కల గుంపు ఒకటి ఆ శిశువును చుట్టుముట్టింది. అవి అరవలేదు. కదలకుండా, ప్రశాంతంగా.. శిశువు చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పరిచాయి. రాత్రంతా, అవి నిశ్శబ్ద సైనికుల్లా నిలబడ్డాయి. వేకువ వెలుగు వచ్చే వరకు.. ఆ బిడ్డ దగ్గరకు ఎవరినీ రాని వ్వలేదు. పసికందును తాకనివ్వలేదు. ‘ఉదయం లేచాక కనిపించిన ఆ దృశ్యం గుర్తొస్తే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది’.. అని స్థానికుడు సుక్లా మొండల్ ఉద్వేగంగా చెప్పారు. ‘ఆ కుక్కలు మామూలుగా లేవు. అవి అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. ఆ బిడ్డ బతకడానికి పోరాడుతోందని అవి అర్థం చేసుకున్నట్లు అనిపించింది’.. అని వ్యాఖ్యానించారు.పసికందు చుట్టూ సెంట్రీల్లా..తెల్లవారుజామున శిశువు చిన్నగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అప్పటివరకు ఎవరో జబ్బు పడిన బిడ్డ అనుకున్న స్థానికులకు, ఆ దృశ్యం చూసి నోట మాట రాలేదు. ఆ కుక్కలు కంచె వేసినట్లు, సెంట్రీల్లా పసికందు చుట్టూ నిల్చున్నాయి. సుక్లా మొండల్ ధైర్యం చేసి, మెల్లగా ముందుకు వెళ్లగానే.. ఆ కుక్కలు పక్కకు తప్పుకున్నాయి. వెంటనే ఆమె బిడ్డను తన దుపట్టాలో చుట్టి ఆసుపత్రికి పరుగులు తీశారు. పరీక్షించిన వైద్యులు, ఆ బిడ్డకు ఎటువంటి గాయాలు లేవని, కేవలం పుట్టిన కొన్ని నిమిషాలకే ఎవరో వదిలేశారని నిర్ధారించారు. పోలీసులు, శిశు సంక్షేమ అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.మనుషుల్ని మించిన మానవీయత..‘మేము ఎప్పుడూ ఈసడించుకుని.. తిట్టుకునే శునకాలే ఇవి.. కానీ, ఈ బిడ్డను వదిలి వెళ్లిన వారికంటే ఇవే ఎక్కువ మానవత్వాన్ని చూపించాయి’.. అని ఒక రైల్వే కార్మికుడు వ్యాఖ్యానించారు. సాయంత్రం అయ్యేసరికి కాలనీలో దృశ్యం మారిపోయింది. ఆ రాత్రంతా బిడ్డను కాపాడిన కుక్కల దగ్గరికి కాలనీలోని చిన్నారులంతా వెళ్లారు. వాటిని ఆప్యాయంగా నిమిరారు. ప్రేమతో బిస్కెట్లు తినిపించారు. ఆ కుక్కలు కేవలం ఒక శిశువును కాపాడటమే కాదు, ఆ రోజు ఆ కాలనీ ప్రజలందరికీ ఒక సందేశమిచ్చాయి. మానవత్వం అనేది నాలుగు కాళ్లపై కూడా రావచ్చని నిరూపించాయి.ఇలాంటి ఘటనే.. 1996లో కోల్కతా సమీపంలో ఇలాంటి ఓ ఘటనే చోటు చేసుకుంది. ఓ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెత్త గుట్టలో వదిలేశారు. అయితే ఆ బిడ్డకు మూడు వీధి కుక్కలు కాపలాగా ఉన్నాయి. చివరికి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బిడ్డ సంరక్షణా కేంద్రానికి చేరింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గోల్డ్లోన్స్లో దక్షిణాది రాష్ట్రాలే టాప్
సాక్షి, స్పెషల్ డెస్క్: రుణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి కావడం, తక్కువ పత్రాలు, సౌకర్యవంతమైన నిబంధనలు.. అందుకే జనం గోల్డ్లోన్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పైగా ఇటీవలి కాలంలో పుత్తడి ధర భారీగా పెరిగింది. దీంతో తాకట్టు పెట్టిన పసిడిపై అందుకునే రుణ మొత్తమూ అధికమైంది. అయితే ఆసక్తికర విషయం ఏటంటే భారత్లో దక్షిణాది వాసులే అత్యధికంగా బంగారంపై లోన్లు తీసుకుంటున్నారు. ఖరీదైన రుణాలవైపు.. సగటున ఒక్కో వినియోగదారుడు అందుకున్న రుణ మొత్తం 2023 సెప్టెంబర్లో రూ.1.1 లక్షలు ఉంటే.. రెండేళ్లలో రూ.1.64 లక్షలకు చేరింది. రూ.లక్ష లోపు విలువ చేసే రుణ ఖాతాల సంఖ్య తగ్గింది. రూ.లక్షకుపైగా విలువ చేసే రుణ ఖాతాలు దూసుకెళ్లాయి. మొత్తం రుణాల్లో విలువ పరంగా.. రూ.లక్ష లోపు విలువచేసే రుణాల వాటా రెండేళ్లలో 25.9% నుంచి 14.4% పడిపోయింది. అలాగే రూ.5 లక్షలకుపైగా విలువ చేసే రుణాల వాటా దాదాపు రెండింతలైంది. పసిడి విలువ పెరగడమూ ఈ జోరుకు కారణమైంది. దేశవ్యాప్తంగా మొత్తం రిటైల్ రుణాల్లో గోల్డ్లోన్స్ అత్యధికంగా 27 శాతం వాటా కైవసం చేసుకున్నాయి.దేశంలో మొత్తం బంగారు రుణాలు సెపె్టంబర్ నాటికి రూ.14.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా ఏకంగా 76.55% ఉంది. రూ.4.9 లక్షల కోట్లతో తమిళనాడు తొలి స్థానం కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ ఆ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. మొత్తం గోల్డ్ లోన్స్లో టాప్–10 రాష్ట్రాలు రూ.13.2 లక్షల కోట్లు కైవసం చేసుకోగా, మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వాటా కేవలం రూ.1.3 లక్షల కోట్లు మాత్ర మే. అయితే ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ మధ్య 3.69 కోట్ల మంది కస్టమర్లు రూ.6 లక్షల కోట్ల విలువ చేసే పసిడి రుణాలు అందుకున్నారు. గతేడాదితో పోలిస్తే రుణ మొత్తం 53%, వినియోగదారుల సంఖ్య 16% పెరగడం విశేషం. -
అప్పుతో స్మార్ట్ఫోన్
భారత్లో గత ఏడాది 15.1 కోట్ల స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి కొత్తగా వచ్చి పడ్డాయి. ఈ ఏడాది జనవరి–సెపె్టంబర్ మధ్య.. అంటే తొమ్మిది నెలల్లో దాదాపు 12 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇంత భారీస్థాయిలో వీటి విక్రయాలు జరగడానికి ప్రధాన కారణం సులభంగా రుణాలు దొరకడమే. ఈ ఏడాది స్మార్ట్ఫోన్ కోసమే అత్యధికులు లోన్ తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సెప్టెంబర్ నాటికి దేశంలో రిటైల్ లోన్స్ మొత్తం రూ.156.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఏడాదిలో వీటి విలువ ఏకంగా 18% పెరిగిందంటే జనం ఏ స్థాయిలో అప్పులు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 67 కోట్ల యాక్టివ్ రుణ ఖాతాలున్నాయి. ఈ ఖాతాల సంఖ్య సంవత్సరంలో 7.1% దూసుకెళ్లింది. కన్జ్యూమర్ ఫైనాన్స్ కంపెనీ హోమ్ క్రెడిట్ ఇండియా 2025లో భారతీయుల రుణాల తీరుపై ఓ నివేదికను రూపొందించింది. ఈ ఏడాది రుణగ్రహీతల్లో 46% మంది స్మార్ట్ఫోన్ కొనుగోలుకే అప్పు చేశారని వెల్లడించింది. 25% మంది కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి, ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి రుణం అందుకున్నారని తెలిపింది. ఆర్థిక లక్ష్యాల సాధనకు.. అవసరానికి అప్పు తీసుకోవడం గతం. ఇప్పుడు జనం తీరు మారింది. ఆకాంక్షలు, స్వావలంబనకు పెద్దపీట వేస్తున్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు, వ్యాపారంలో పెట్టుబడి, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి రుణాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది వారి వ్యూహాత్మక, భవిష్యత్తుకు బాటలు వేసే మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని అధ్యయనం తెలిపింది. దేశంలో అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి వారి ఆకాంక్షలను, కలలను వాస్తవంగా మార్చడానికి స్మార్ట్ క్రెడిట్ను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారని వివరించింది. హైదరాబాద్సహా దేశవ్యాప్తంగా 17 ప్రధాన నగరాల నుంచి సగటు కుటుంబ ఆదాయం నెలకు రూ.33,923 కలిగిన 18–55 ఏళ్ల వయసున్న వ్యక్తులు సర్వేలో పాలుపంచుకున్నారు. ఆర్థిక లక్ష్యాల సాధనకు.. అవసరానికి అప్పు తీసుకోవడం గతం. ఇప్పుడు జనం తీరు మారింది. ఆకాంక్షలు, స్వావలంబనకు పెద్దపీట వేస్తున్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు, వ్యాపారంలో పెట్టుబడి, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి రుణాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది వారి వ్యూహాత్మక, భవిష్యత్తుకు బాటలు వేసే మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని అధ్యయనం తెలిపింది. దేశంలో అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి వారి ఆకాంక్షలను, కలలను వాస్తవంగా మార్చడానికి స్మార్ట్ క్రెడిట్ను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారని వివరించింది. హైదరాబాద్సహా దేశవ్యాప్తంగా 17 ప్రధాన నగరాల నుంచి సగటు కుటుంబ ఆదాయం నెలకు రూ.33,923 కలిగిన 18–55 ఏళ్ల వయసున్న వ్యక్తులు సర్వేలో పాలుపంచుకున్నారు. తమ కాళ్లమీద తాము.. రుణాల తీరును చూస్తుంటే తమ కాళ్లమీద తాము నిలబడాలన్న ఆలోచన జనంలో పెరిగింది. వ్యాపారం ప్రారంభించేందుకు, ప్రస్తుత బిజినెస్ను విస్తరించేందుకు రుణం అందుకున్నవారు 2022లో 14% మాత్రమే. ఆ తర్వాతి సంవత్సరాల నుంచి ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ 2023లో 19%, గత ఏడాది 21% నమోదైంది. ఈ ఏడాది ఇది 25 శాతానికి పెరిగింది. చిన్న నగరాల్లో జోరుగా.. రుణాలు తీసుకున్నవారిలో 65 శాతం మంది మొబైల్ ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలు, సేవలు అందుకుంటున్నారు. మొబైల్ బ్యాంకింగ్లో మిల్లీనియల్స్ (1981–1996 మధ్య పుట్టినవారు) ముందున్నారు. అలాగే మెట్రో సిటీస్ అత్యధిక విస్తృతి కలిగి ఉన్నాయి. ప్రథమ శ్రేణి నగరాలతో పోలిస్తే ద్వితీయ శ్రేణి నగరాల్లోని రుణగ్రహీతలు అధికంగా మొబైల్ బ్యాంకింగ్కు అలవాటు పడటం గమనార్హం. మొత్తంగా ఆన్లైన్ లెండింగ్ కంపెనీల నుంచి రుణం పొందడానికి 49 శాతం మంది మొగ్గుచూపుతున్నారు. -
అన్నంత పని చేయబోతున్న ట్రంప్?!
ఇల్హాన్ ఒమర్ను అమెరికా నుంచి వెళ్లగొడతారా? ఆమెను పంపించేయాల్సిందేనని అక్కడి ప్రజలు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?. ట్రంప్ చెబుతున్నట్లు ఆమె నిజంగానే ఇమ్మిగ్రేషన్ ఫ్రాడ్కు పాల్పడ్డారా? భారత్పై వ్యతిరేక వ్యాఖ్యలు ఆమె ఎందుకు చేయాల్సి వచ్చింది?.. అసలు ఇంతకీ ఇల్హాన్ ఒమర్ నేపథ్యం ఏంటి?.. అమెరికా చట్ట సభ్యురాలు, మిన్నెసోటా రాష్ట్రానికి చెందిన డెమోక్రాటిక్ ప్రతినిధి ఇల్హాన్ ఒమర్. తాజాగా ఆమె వివాహం,ఇమ్మిగ్రేషన్ విషయంలో మోసానికి పాలపడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా పౌరసత్వం కోసం సొంత సోదరుడినే వివాహం చేసుకున్నారని ప్రధాన ఆరోపణ. దీంతో పాటు ఆమె చేస్తున్న యాంటీ అమెరికా కామెంట్లకు అక్కడి ప్రజలు రగిలిపోతున్నారు. డీనేచురలైజ్ చేసి (పౌరసత్వం రద్దు చేసి) దేశం నుంచి వెల్లగొట్టాలని డిమాండ్ చేస్తున్నారు.ట్రంప్ అలా అనేసరికి.. 2009లో ఒమర్ అహ్మద్ నూర్ సయీద్ ఎల్మీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె అక్రమంగా అమెరికాకు వలస వచ్చారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తిని ఆమె వివాహమాడారని.. కేవలం అమెరికాలో స్థిరపడేందుకు ఆమె మోసం చేశారని ట్రంప్ ఆరోపించారు. ఈ క్రమంలో ఆమెను అమెరికా నుంచి బయటకు పంపించేస్తామని వ్యాఖ్యానించారు. వలసల విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్న ట్రంప్ నోటి నుంచి ఈ వ్యాఖ్యలు రావడంతో సాధారణంగానే చర్చ పెద్దదైంది. ఈ ఆరోపణలను ఒమర్ ఖండించారు. ట్రంప్ వ్యాఖ్యలను ఇస్లామోఫోబిక్, రాజకీయ ప్రేరేపితమైనవిగా అభివర్ణించారామె. రాజకీయంగా తనను బలహీనపర్చేందుకు జరుగుతున్న దాడి అని అన్నారామె. అయితే.. గతంలోనూ..ఇల్హాన్ ఒమర్పై ఈ ఆరోపణలు కొత్తవేం కావు. 2016లో సోమాలి-అమెరికన్ ఫోరమ్ ఒకటి ఈ అభియోగాన్ని తెరపైకి తెచ్చింది. 2018 కాంగ్రెస్ ఎన్నికల సమయంలోనూ ఈ అంశంపై పెద్ద చర్చ నడిచింది. తీవ్ర అభియోగాల నేపథ్యంతో కొన్ని మీడియా సంస్థలు ఇన్వెస్టిగేషన జర్నలిజంతో వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయతనం చేశాయి. 2019-20 మధ్య ఎఫ్బీఐ, హౌజ ఎథిక్స్ కమిటీ ఈ అభియోగాన్ని పరిశీలించి ఏం తేలకపోవడంతో కేసులు మూసివేశాయి కూడా. అయినా కూడా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఈ ఆరోపణలను మళ్లీ ప్రస్తావించారు. దీంతో అమెరికా రాజకీయాల్లో ఇమ్మిగ్రేషన్ & పౌరసత్వంపై పెద్ద చర్చకు దారితీస్తోంది. వెళ్లగొట్టాల్సిందే..! ట్రంప్ వ్యాఖ్యల తర్వాత ఆమెను అమెరికా నుంచి పంపించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. అమెరికా ఫస్ట్ నినాదంతో ఉద్యమిస్తున్న మాగా కార్యకర్తలు, కన్జర్వేటివ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా కోరుతున్నారు. ఈ విషయంలో గట్టిగా పట్టుబడుతున్నారు. ఆమె మ్యారేజ్ సర్టిఫికెట్ను ఎక్స్ ఖాతాలో వైరల్ చేస్తూ.. సాగనంపాల్సిందేనంటూ పోస్టులు పెడుతున్నారు.ఇల్హాన్ ఒమర్(43).. పుట్టింది సోమాలియాలో. ఆ దేశ అంతర్యుద్ధంతో 8 ఏళ్ల వయసులో కెన్యాకు చేరుకుని నాలుగేళ్లపాటు శరణార్థ శిబిరాల్లో గడిపింది. అక్కడి నుంచి అమెరికాకు చేరుకున్న ఆమె.. 2000 సంవత్సరంలో అమెరికా పౌరసత్వం పొందింది. 2018 నుంచి ఇప్పటిదాకా నాలుగుసార్లు ఆమె చట్టసభకు ఎన్నికయ్యారు. అది సాధ్యమేనా?అమెరికా చట్టం ప్రకారం, నేచురలైజ్డ్ సిటిజన్ (పౌరసత్వం పొందిన వ్యక్తి)ను డీనేచురలైజ్ చేయవచ్చు, కానీ అది స్పష్టమైన, బలమైన ఆధారాలతో మాత్రమే సాధ్యం. డీనేచురలైజేషన్ జరిగితే, ఆ వ్యక్తి పర్మనెంట్ రెసిడెంట్ లేదంటే అక్రమ వలసదారుగా మారతారు. తర్వాతే డిపోర్టేషన్ జరుగుతుంది. ఈ మధ్యలో కోర్టు జోక్యాలతో ఏదైనా జరగొచ్చు. అయితే.. అమెరికా చరిత్రలో ఇప్పటిదాకా ఇలాంటి చర్యలు ప్రధానంగా యుద్ధ నేరస్తులు, ఉగ్రవాదులపై మాత్రమే జరిగాయి. ఒమర్పై వినిపిస్తున్న ఈ ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలు(ఫోరెన్సిక్ సహా) లేకపోవడం వల్ల చట్టపరంగా చర్యలు తీసుకోవడం కష్టమే. భారత్కు ఎందుకు అంత కోపంవివాదాలు ఆమెకు కొత్తేం కాదు. ఆమె బహిరంగంగా చేసిన పలు ప్రకటనలు తీవ్ర దుమారం రేపాయి. సోమాలియా నా సొంతం దేశం అంటూ అమెరికాను ఆమె కించపరిచేలా వ్యవహరించారనే విమర్శ ఒకటి బలంగా వినిపిస్తుంటుంది. అంతేకాదు.. గాజా సంక్షోభ సమయంలో ఇజ్రాయెల్, అమెరికాను ఉగ్ర గ్రూపులతో పోల్చారామె. అలాగే.. ఇల్హాన్ ఒమర్ గతంలో భారత వ్యతిరేక వైఖరితో వార్తల్లో నిలిచారు. 2022లో ఆమె పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)ను సందర్శించి, స్థానిక నేతలతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఆమె భారతదేశంపై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు చేశారు. న్యూఢిల్లీ ఈ పర్యటనను తీవ్రంగా ఖండించింది. -
అణుశక్తి బిల్లు.. గేమ్ చేంజర్ అయ్యేనా?
నేటి(సోమవారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజున కేంద్ర ప్రభుత్వం దేశ ఇంధన రంగాన్ని సమూలంగా మార్చగల కీలక చట్టాన్ని ప్రవేశపెట్టనుంది. అదే అణుశక్తి బిల్లు- 2025. ఈ చారిత్రక బిల్లు ముఖ్య ఉద్దేశ్యం అణుశక్తి రంగాన్ని మొదటిసారిగా ప్రైవేట్ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో తెరవడం. తద్వారా దేశంలో క్లీన్ ఎనర్జీ సామర్థ్యం పెంపొందుతుందని, శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.విధానపరమైన అంతరానికి చెక్ఈ బిల్లులోని అత్యంత కీలక అంశం.. అణు విద్యుత్ ప్లాంట్లకు టారిఫ్ల (సుంకాల)పై తగిన నిర్ణయం తీసుకోవడం. ఇప్పటివరకు అణు రంగంలో ప్రైవేట్ పెట్టుబడిని పరిమితం చేసేలా విధానపరమైన అంతరం ఎదురవుతోంది. సరైన టారిఫ్ రెగ్యులేషన్ విధానాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, ప్రభుత్వం దేశీయ ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆకర్షించాలని, వారికి లాభదాయకతను కల్పించాలని చూస్తోంది. అంతేకాకుండా ఈ బిల్లు ఆమోదం పొందితే ఇది విదేశీ టెక్నాలజీ ప్రొవైడర్లకు భారతదేశ అణు ప్రాజెక్టులలో ప్రవేశాన్ని సులభతరం చేస్తుంది. అలాగే ఫ్రాన్స్, రష్యా, అమెరికా తదితర దేశాల సాయంతో భారతదేశ అణు సామర్థ్యం బలోపేతం కానుంది.ఇప్పటివరకు న్యూక్లియస్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ఆధిపత్యంలో ఉన్న అణుశక్తి రంగాన్ని ప్రైవేటీకరించడం ద్వారా భారతదేశ అణు విద్యుత్ సామర్థ్యం మరింతగా పెరగనుంది. బిల్లులో ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ప్రైవేట్ రంగ ప్రవేశం: ఈ బిల్లు దేశంలోని ప్రైవేట్ కంపెనీలు నేరుగా అణు విద్యుత్ ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టడానికి మొదటిసారిగా అనుమతినిస్తుంది.టారిఫ్ రెగ్యులేషన్: అణు విద్యుత్ ప్లాంట్లకు సుంకాల (టారిఫ్) నిర్ణయాన్ని పరిష్కరించడానికి ఈ బిల్లు ఒక విధానాన్ని ప్రవేశపెడుతుంది. ఇది పెట్టుబడిదారుల లాభదాయకతను, వినియోగదారుల స్థోమతను సమతుల్యం చేయడానికి దోహదపడుతుంది.టెక్నాలజీ యాక్సెస్: బిల్లు ఆమోదం పొందిన తర్వాత విదేశీ టెక్నాలజీ ప్రొవైడర్లు భారతదేశ అణు ప్రాజెక్టులలో ప్రవేశించడం మరింత సులభం అవుతుంది.వికసిత భారత్ : భారత ప్రభుత్వం ఈ సంస్కరణను ‘వికసిత భారత్’ దార్శనికతలో భాగంగా చూస్తున్నది. క్లీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని పెంచడం, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ బిల్లు ప్రవేశపెడుతున్నారు.ఎదురయ్యే సవాళ్లుఅయితే ఈ సంస్కరణ పలు సవాళ్లను లేవనెత్తనుంది. విద్యుత్ డిమాండ్ను తీర్చడానికి ఈ బిల్లు దోహదపడనున్నటప్పటికీ భద్రత, ప్రమాద బాధ్యతల ఆందోళనలు కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే అణు కార్యకలాపాలలో కఠిన నియంత్రణ, పర్యవేక్షణ అత్యవసరం. మరోవైపు కొన్ని ప్రాంతాలలో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను ప్రభుత్వం చల్లార్చాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుత శీతాకాల సమావేశాలు డిసెంబర్ ఒకటి నుంచి 19వరకూ జరగనున్నాయి. అణు బిల్లుతో పాటు, చండీగఢ్ కోసం రాజ్యాంగ సవరణ, ఉన్నత విద్యలో సంస్కరణలు సహా 10 ప్రతిపాదిత చట్టాలను ప్రభుత్వం జాబితా చేసింది. అయితే ప్రతిపక్షం ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (సర్), జాతీయ భద్రత, పర్యావరణ ఆందోళనలు తదితర అంశాలపై చర్చను లేవనెత్తాలని భావిస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ అణుశక్తి బిల్లు- 2025 భారతదేశ ఇంధన భవిష్యత్తుకు ఒక చారిత్రక మలుపు కానుంది. ఇది కూడా చదవండి: AIDS Day: హెచ్ఐవీ నయం అవుతుందా? తాజా పరిశోధనల్లో.. -
నిర్భయ!భయం ఆమె ‘మెదడు’లోనే లేదు
పొట్టలో ఏదో సీతాకోక చిలుకలు ఎగురుతున్న ఫీలింగ్ మనందరికీ తరచూ కలిగేదే. కదా! భయం తాలూకు అనేకానేక సంకేతాల్లో అదొకటి. అలాంటి భయమంటే అసలేమిటో, అదెలా ఉంటుందో ఏమాత్రమూ తెలియని మహిళ ఒకరున్నారు. అందుకు కారణం ఫక్తు వైద్యపరమైనది కావడం విశేషం...!చాలాకాలం కింది సంగతి. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై ఆమె అలా నడిచి వెళ్తోంది. ఉన్నట్టుండి ఓ సాయుధుడు అటకాయించి ఏకంగా గొంతుపైనే కత్తి పెట్టాడు. కానీ ఆమె కళ్లలో భయం ఛాయలైనా కన్పించలేదు. ‘ఊ, కానీ. ఆలస్యమెందుకు?’అంటూ గొంతు కోయమని ఆహ్వానించింది! దాంతో దొంగ కాస్తా బిత్తరపోయి ఉన్నపళాన కాలికి బుద్ధి చెప్పాల్సి వచి్చంది. మనమైతే దీన్ని సాహసం అంటాం కదా! కానీ సైంటిస్టులు మాత్రం మరేదో అంటున్నారు. ఆ మహిళ తాలూకు ప్రత్యేకతే అందుకు కారణం. ఏమంటే, ఆమె మెదడులో భయాన్ని ప్రాసెస్ చేసి మనసుకు అర్థమయ్యేలా చేసే అమిగ్డాలా అనే వ్యవస్థే పూర్తిగా లోపించింది. ప్రపంచంలో ఇలాంటి కేసులు ఇప్పటిదాకా కేవలం కొన్ని వందలు మాత్రమే వెలుగు చూశాయి. ప్రస్తతమైతే ఇలాంటి లక్షణాలున్న ఏకైక వ్యక్తి భూ మండలం అంతటా ఆమె మాత్రమే కావడం విశేషం. వారిలోనూ ఇలా అమిగ్డాలా లోపించిన కేసు ఇది రెండోది మాత్రమే. అందుకే ఆమె వ్యక్తిగత వివరాలను సైంటిస్టులు అతి గోప్యంగా ఉంచారు. మనిషి భయం, ఆందోళన, అసంకల్పిత ఆత్మరక్షణ ప్రతిచర్య వంటివాటిని ఎలా అనుభూతి చెందుతాడో తెలుసుకునేందుకు ఆమెపై పలు పరిశోధనలు జరుపుతున్నారు. తనను కేవలం ఎస్ఎంగా వ్యవహరిస్తున్నారు. అరుదైన వ్యాధి ఎస్ఎంకు అర్బాక్ వీత్ అనే అత్యంత అరుదైన వ్యాధి ఉంది. ఇది తన మెదడులోని అమిగ్డాలాను క్రమంగా మటుమాయం చేస్తూ వచ్చింది. ఇదంతా ఓ పాతికేళ్ల కింది సంగతి. దాంతో ‘ఫియర్లెస్ షీ’గా అప్పట్లో ఆమె ప్రపంచమంతటా ఫేమస్ అయిపోయింది. తనకు నిజంగానే వీసమెత్తు కూడా భయం వేయదా అన్నది తేల్చుకునేందుకు ఎందరో ఎన్నెన్నో రకాల పరీక్షలు పెట్టి చూశారు. అన్నింట్లోనూ విజయం ఆమెదే. పరాజయం... భయానిదీ, పరీక్షకులదీ! ఆమెను దెయ్యల కొంపల్లో ఉంచి తాళం వేశారు. హఠాత్తుగా పాములను మెళ్లో వేశారు. భయంకరమైన హారర్ సినిమాలు ఒంటరిగా కూచోబెట్టి మరీ చూపించారు. ఆమె గత జీవితంలోనే అత్యంత భయానకమని చెప్పదగ్గ ఉదంతాలను పదేపదే పనిగట్టుకుని గుర్తు చేశారు. ఎన్ని చేసినా ఆమెకు భయమన్నదే కలగలేదు. సరికదా, అన్ని సందర్భాల్లోనూ ఎస్ఎం అత్యంత ఆసక్తిగా, ఉత్సాహంగా కన్పించి పరీక్షకులకే పరీక్ష పెట్టింది! పుట్టి బుద్ధెరిగిన నాటినుంచీ అసలు భయమంటే ఎలా ఉంటుందో కూడా ఎరగదట తను. 2009–11 మధ్య ఆమెపై పలుమార్లు ప్రాణాంతక దాడులు జరిగాయి. దోపిడీ యత్నాలకూ గురైంది. బెదిరింపులకైతే లెక్కే లేదు! కానీ ఒక్కటంటే ఒక్క ఉదంతంలో కూడా ఆమెలో భయం అణుమాత్రమైనా కన్పించలేదట. ఆమె భయపడ్డ క్షణం... ఇక ఇలా కాదని సైంటిస్టులు ఎస్ఎంను ఓ చిత్రమైన పరీక్షకు గురిచేసి చూశారు. తనతో పాటు తన మాదిరిగానే అమిగ్డాలా కాస్తో కూస్తో పాడైన మరో ఇద్దరిని ప్రయోగశాలలో కూచోబెట్టారు. 35 శాతం కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) పీల్చేలా చేశారు. నియంత్రిత పద్ధతిలో చేయగలిగితే దీనివల్ల అవతలి వ్యక్తి ఊపిరాడని పరిస్థితికి లోనవుతాడు. అలా సీఓటూ పీల్చగానే జరిగింది చూసి సైంటిస్టులే అవాక్కయ్యారు. జీవితంలోనే తొలిసారిగా ఎస్ఎం ‘పానిక్’అయింది. అంటే, భయపడిందన్నమాట! సీఓటూ మాస్క్ను ముఖంపై నుంచి ఒక్కసారిగా పీకిపారేసింది. శ్వాస కోసం పెనుగులాడింది. ఇప్పటికి గుర్తు చేసినా సరే, ‘అదో భయానక అనుభూతి’అంటూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మిగతా ఇద్దరు రోగులు కూడా ఎస్ఎం మాదిరిగానే బెదిరిపోయారు.కీలక స్పష్టత ఎస్ఎం బృందంపై చేసిన పరీక్ష ఫలితాన్ని బట్టి సైంటిస్టులు ఒక కీలక స్పష్టతకు వచ్చారు. బయటి ప్రమాదాలను గుర్తించి శరీరానికి, మనసుకు అర్థమయేలా చేసేందుకు అమిగ్డాలా అవసరం. కానీ శరీరం లోపలి నుంచే పుట్టుకొచ్చే భయం మాత్రం దానితో నిమిత్తం లేకుండానే వణుకు పుట్టించేస్తుంది! అంతేకాదు, ‘‘భయానికి మెదడులో మూలం అమిగ్డాలా ఒక్కటే కాదు. అందుకు పలు దారులున్నాయి. అసలు భయం బలహీనత కానే కాదు. మనుగడకు అవసరమైన అత్యంత కీలకమైన సాధనం. ఎందుకంటే భయం ఏ కోశానా లేకపోబట్టే అర్ధరాత్రి, అపరాత్రి అనే లేకుండా ఎస్ఎం ఎటు పడితే అటు తిరిగి ప్రమాదాలను కొనితెచ్చుకుంది. భయముంటే ఇలాంటి పనులు ఎన్నటికీ చేయరు. అంతేకాదు, భయం లేకపోతే ఒంట్లో రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థే కుప్పకూలిపోతుంది. కొసమెరుపుఅయితే, అమిగ్డాలాతో నిమిత్తం లేకుండా ఒంటికి, మనసుకు భయాన్ని అనుభూతం చేసే అంతర్గత సర్క్యూట్లు ఏమిటి, అవెలా పని చేస్తాయి అన్నది మాత్రం సైంటిస్టులకు ఇంకా అంతు చిక్కాల్సే ఉంది! -
ఈ భూమికి ఏమైంది..? వచ్చే ఏడు మరిన్ని విపత్తులే!
వరుస భూకంపాలు. బీభత్సమైన వరదలు. కార్చిచ్చులు. అగ్నిపర్వతాల పేలుళ్లు. ప్రపంచంలో ఏదో ఒక మూల నిత్యం విపత్తులే. పెను ప్రాకృతిక ఉత్పాతాలే. ఈ ప్రమాదకర ధోరణి కొన్నాళ్లుగా మరీ పెరిగిపోతూ వస్తోంది. ముఖ్యంగా మరో నెల రోజుల్లో కాలగర్భంలో కలిసిపోనున్న 2025ను అయితే విపత్తునామ సంవత్సరం అన్నా అతిశయోక్తి కాదేమో! దీనికితోడు, వచ్చే ఏడాది పరిస్థితులు పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా ఉంటాయన్న హెచ్చరికలు మరింత గుబులు రేపుతున్నాయి...12 వేల ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చేంతటి తీవ్రతతో కూడిన భారీ అగ్నిపర్వత పేలుడు ఇండోనేసియాను తాజాగా అతలాకుతలం చేసి వదిలింది. దాని ధాటికి చెలరేగిన బూడిద మేఘాలు భారత్, చైనా దాకా వ్యాపించాయి. వాటి తాలూకు కలకలం, భయాందోళనలు ఇంకా సద్దుమణగనేలేదు! అదే ఇండొనేసియా కేవలం గత 30 రోజుల్లో ఏకంగా 1,400 పై చిలుకు భూకంపాలను చవిచూసింది. ఈ వర్షాకాలంలో బెంబేలెత్తించే స్థాయి వరదలు ఇటు భారత్లోనూ, అటు పాక్లోనూ తీవ్ర విధ్వంసానికి, పంట నష్టం తదితరాలకు దారితీశాయి. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కాలిపోర్నియా తదితర రాష్ట్రాలను పెను కార్చిచ్చులు భస్మీపటలం చేసినంత పని చేశాయి. ఇవి చాలవన్నట్టు గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతటి తీవ్రతతో కూడిన సౌర తుఫాను భూమిని వణికించి వదిలింది. 2025లో ప్రపంచానికి చెమటలు పట్టించిన ప్రాకృతిక విపత్తుల్లో ఇవి కొన్ని మాత్రమే. ఈ ఏడాది కాలగర్భంలో కలిసేందుకు ఇంకా నెల రోజులకు పైగా ఉంది. ఈ 30 రోజుల్లో మరిన్ని విపత్తులు ముంచుకురావడం ఖాయమన్న సైంటిస్టుల హెచ్చరికలు మరింతగా భయపెడుతున్నాయి. వీటి వెనక ప్రాకృతిక నిమిత్తాలు కొన్నున్నా, ప్రధాన కారణం మాత్రమే మనిషి దురాశేనని సైంటిస్టులు మొదలుకుని పర్యావరణవేత్తల దాకా అంతా ముక్త కంఠంతో మొత్తుకుంటున్నారు. వామ్మో భూకంపాలు! 2025ను భూకంపనామ సంవత్సరంగా కూడా చెప్పవచ్చేమో. పసిఫిక్లోని రింగ్ ఆఫ్ ఫైర్, సమీప ప్రాంతాలన్నీ నిత్యం భూకంపాలతో చిగురుటాకుల్లా వణుకుతూ కాలం గడిపాయి. మార్చిలో మయన్మార్లో సంభవించిన 7.7 తీవ్రతతో కూడిన భూకంపం 5,500 మందికి పైగా పొట్టన పెట్టుకుంది. ఆగస్టులో అఫ్గానిస్తాన్లో వచ్చిన భూకంపానికి అధికారిక లెక్కల ప్రకారమే 2,500 మందికి పైగా బలయ్యారు. వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని అక్కడి అధికారులే అంగీకరించారు. ఇవేగాక 7కు మించిన తీవ్రతతోనే 2025లో ప్రపంచవ్యాప్తంగా కనీసం మరో 10 భూకంపాలు సంభవించాయి. అంతకు తక్కువ తీవ్రతతో కూడిన వాటి సంఖ్య అయితే చెప్పనవసరమే లేదు.అక్షరాలా ‘అగ్ని’పర్వతాలే!ఇక అగ్నిపర్వతాల పేలుళ్లు ఈ ఏడాది రికార్డులు బద్దలు కొట్టాయి. గత నెలలో ఇథియోపియాలోని హైలీ గుబ్బీ అగి్నపర్వతం గత 12 వేల ఏళ్లలో తొలిసారిగా బద్దలై ఆశ్చర్యపరిచింది. దాంతో అటు ఎర్రసముద్రం నుంచి ఇటు అరేబియా దాకా విమాన సేవలకు కూడా అంతరాయం కలిగింది. అగి్నపర్వతాల పేలుళ్లకు భూకంపాలతో అతి సన్నిహిత సంబంధముందని రూర్కీ ఐఐటీలో అర్త్ సైన్సెస్ విభాగాధిపతి ప్రొఫెసర్ సందీప్సింగ్ వివరించారు. ‘‘భూకంపం వల్ల భూమి లోపలి భాగం తీవ్ర కుదుపులకు లోనవుతుంది. ఫలితంగా ద్రవ రూపంలో ఉండే మాగ్నా పైకి తన్నుకురావడం మొదలవుతుంది. దాంతో దాని చుట్టూ ఉండే రాళ్లూ తదితరాలు కుదుపులకు లోనవుతాయి. అగ్నిపర్వత ప్రాంతాల్లో ఇది ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. సూర్యుడు కూడా సౌరచక్ర క్రమంలో ప్రస్తుతం ఉత్కృష్ట దశకు చేరుతున్నాడు. దాంతో సౌరతుపాన్లు తరచూ వచ్చి పడుతున్నాయి. ఇవన్నీ కూడా భూమిపై వాతావరణాన్ని బాగా ప్రభావితం చేస్తున్నాయి. అంతేగాక మరిన్ని ప్రాకృతిక విపత్తులకు కారణంగా మారుతున్నాయి. అంతేకాదు, రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థలు, విద్యుత్ గ్రిడ్లు, అంతరిక్షంలోని ఉపగ్రహాల పనితీరు తదితరాలన్నింటినీ ప్రభావితం చేస్తున్నాయి. అలా పలు దేశాలు భారీ ఆర్థిక నష్టాల బారిన పడేందుకు కారణమవుతున్నాయి.బాబోయ్ వరదలు! ఇక వరదలు, కార్చిచ్చులైతే ఈ ఏడాది ప్రపంచమంతటినీ అతలాకుతలం చేసి వదిలాయి. భారత్, పాకిస్తాన్తో పాటు మలేసియా, థాయ్లాండ్ తదితర దేశాలెన్నో వీటి బారిన పడి అల్లాడాయి. అతి కొద్ది సమయంలోనే కుండపోతతో విలయం సృష్టించే క్లౌడ్ బరస్ట్లు రానురానూ ఈ దేశాల్లో పరిపాటిగా మారుతుండటం 2025లో కొట్టొచ్చినట్టుగా కన్పించిన మరో ప్రమాదకర పరిణామం. ఇవన్నీ రానున్న పెను ముప్పులకు హెచ్చరిక సంకేతాలుగానే కనిపిస్తున్నాయి. హిమ ప్రాంతాలన్నింట్లోనూ మంచు శరవేగంగా కరిగిపోతోంది. తాగు, సాగు అవసరాల నిమిత్తం నదీజలాలను రిజర్వాయర్లలో వీలైనంతగా బంధించే ధోరణి ప్రపంచ దేశాలన్నింట్లోనూ నానాటికీ పెరిగిపోతోంది. వీటికి తోడు సగటు భూ ఉష్ణోగ్రతలో కూడా శరవేగంగా వృద్ధి నమోదవుతూ మరింతగా భయపెడుతోంది. పారిశ్రామికీకరణ ముందునాటితో పోలిస్తే అదిప్పటికే ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా పెరిగిపోయి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ‘‘భూమి తాలూకు కీలక వ్యవస్థలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. మనిషి అత్యాశ తమపై మోపుతున్న మోయలేని భారానికి తమ ప్రతిస్పందనను ఇలా పలు ప్రాకృతిక విపత్తుల రూపంలో వ్యక్తం చేస్తున్నాయి. ఈ హెచ్చరిక సంకేతాలను ఇప్పటికైనా అర్థం చేసుకోకుంటే మానవాళి మనుగడకే ప్రమాదం’’అని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. -
ప్రశాంత జీవన రహస్యమే గీతాసారం
యుద్ధభూమిలో శ్రీ కృష్ణ భగవానునికి, అర్జునునికి మధ్య జరిగిన సంభాషణే భగవద్గీత. అయితే, దాని అసలైన సందేశం యుద్ధం గురించే కాదు, ప్రతిరోజూ వివేకవంతంగా ఎలా జీవించాలో తెలియజేయడం. దాని అత్యంత ప్రధానమైన బోధన నిష్కామ కర్మ గురించి. అంటే ఫలితాలపై ధ్యాస ఉంచకుండా, శక్తిమేరకు కృషి చేయడం.గొప్ప భారతీయ ఆధ్యాత్మిక గురువైన పరమహంస యోగానంద కోరికలు లేకుండా కర్మలను నిర్వర్తించడం యోగంలో ఒక ముఖ్యమైన అంశమని చెప్పారు. గాడ్ టాక్స్ విత్ అర్జున: ది భగవద్గీత అనే తన మహత్తర గీతాభాష్యం లో, శ్రీ కృష్ణుని సందేశం గృహస్థునకైనా, ఒక సంస్థకు అధిపతికైనా, లేక ఒక దైవాన్వేషకునికైనా ఒక ఆచరణాత్మకమైన మార్గదర్శి అని ఆయన వివరించారు.భగవద్గీతలోని 2వ అధ్యాయం, 47వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇలా బోధించాడు...‘‘కర్మలు చేయుట యందు మాత్రమే నీకు అధికారముంది, వాటి ఫలితములందు ఎన్నడూ లేదు. నీ కర్మఫలములకు సృష్టికర్తవు నీవని భావించకు; అట్లని నిష్క్రియ పట్ల నీకు అనురక్తి కలగనీయకు.’’దీని అర్థం ఏమిటంటే: అది మీ ఉద్యోగమైనా, మీ కుటుంబాన్ని పోషించడం అయినా, లేదా ఏదైనా బాధ్యత అయినా, మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. కానీ ప్రతిఫలం గురించి, గుర్తింపు గురించి ఆందోళన చెందుతూ ఉండకండి. ‘‘ ఈ పని చేయడం వల్ల నాకేమి లభిస్తుంది’’ అనే ఆందోళన ఒత్తిడిని మాత్రమే తెస్తుంది. మీరు ఫలితంపై కాకుండా, కర్మపైనే దృష్టి సారించినప్పుడు స్వేచ్ఛ లభిస్తుంది. అదే సమయంలో, సోమరిగా లేదా నిష్క్రియగా మారకండి. 48వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇలా సలహా ఇచ్చాడు...‘‘ఓ ధనంజయ, యోగంలో నిమగ్నుడవై, సమస్త కర్మలను ఆచరించు. వాటి ఫలాలపై ఆసక్తిని త్యజించి, జయాపజయములయందు సమభావం గలవాడవై ఉండు. ఈ మానసిక సమత్వమే యోగం.’’జీవితం ప్రశంసలను, నిందలను, విజయాన్ని, అపజయాన్ని తెస్తుంది. ఈ రెండు పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉండాలని శ్రీ కృష్ణుడు మనకు బోధిస్తాడు. ఈ సమభావమే నిజమైన యోగం. అంటే ఆంతరంగిక శాంతిని బాహ్య కర్మాచరణతో అనుసంధానం చేయడం.3వ అధ్యాయం, 30వ శ్లోకంలో, ఈ స్థితిని సాధించడానికి శ్రీ కృష్ణుడు కీలకమైన మార్గాన్ని తెలియజేశాడు. ‘‘సమస్త కర్మలను నాకు అర్పించు! అహంకారం, ఆశలు విడచి, నీ మనస్సును ఆత్మపై కేంద్రీకరించి, ఆందోళన నుండి విముక్తుడవై, కర్మాచరణమనే యుద్ధంలో నిమగ్నమై ఉండు.’’సరళమైన మాటల్లో చెప్పాలంటే, మీరు చేసే ప్రతి పనిని భగవంతునికి అంకితం చేయండి. ఈ విధంగా జీవించడం అంటే ప్రపంచం నుంచి విరమించుకోవడం కాదు... కోరికలు, అహంకారం లేకుండా, అపేక్ష, తీవ్రమైన చింత లేకుండా, ప్రతి కర్మను ఆయనకు ఒక సమర్పణగా నిర్వర్తించడం. ప్రశాంతమైన జీవితానికి ఇదే ఏకైకమార్గం. 5వ అధ్యాయం, 10వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ఒక అందమైన ఉపమానాన్ని అందించాడు:‘‘నీరు స్పృశించలేని తామరాకు వలె, కర్మలను నిర్వర్తించే యోగి, ఆసక్తిని త్యజించి, తన కర్మలను అనంతునికి సమర్పించడం ద్వారా, ఇంద్రియ బంధాలకు లోనుకాకుండా ఉంటాడు.’’బురదలో పెరిగినా దాని మలినం సోకని కమలం వలె, నిష్కామ కర్మను ఆచరిస్తూ, భగవంతునికి శరణాగతి చెందడం ద్వారా ప్రాపంచిక పోరాటాల మధ్య జీవిస్తూ కూడా ప్రశాంతంగా ఉండవచ్చు.ఈ సనాతనమైన బోధనల వ్యాప్తికి యోగానంద పశ్చిమ దేశాలలో సెల్ఫ్–రియలైజేషన్ ఫెలోషిప్ను, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాను భారతదేశంలోను స్థాపించారు. ఆయన ‘ఒక యోగి ఆత్మకథ’ లక్షలాది మందికి యోగాన్ని, ధ్యానాన్ని– ముఖ్యంగా భగవద్గీత కూడా ప్రస్తావించిన క్రియాయోగమనే సనాతన ప్రక్రియను– దైవానుభవం కలిగించే ఒక తిన్నని రాజమార్గంగా పరిచయం చేసింది.నిష్కామ కర్మ అంటే బాధ్యతల నుంచి పలాయనం కాదు, అది హృదయపూర్వకంగా– కార్యాలయాలలోను, మానవ సంబంధాలలోను, వ్యక్తిగత లక్ష్యాలలోను పనిచేయడం, కానీ ఫలితాల కోసం పాకులాడకుండా ఉండటం.యుద్ధభూమి ప్రతీకాత్మకమే కావచ్చు, కానీ పోరాటం నిజమైనది–వ్యామోహానికీ స్వేచ్ఛకూ మధ్య, అహంకారానికీ శరణాగతికీ మధ్య, నిష్కామకర్మలోనే విజయం ఉందని గీత మనకు చూపిస్తుంది. ఎందుకంటే అది మాత్రమే శాశ్వత ఆనందాన్ని ఇవ్వగలదు. – సత్యశ్రీ -
అంతిమ గౌరవం
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం యావత్ భారత్ను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదంలో తెలంగాణ, కర్ణాటకకు చెందిన 45 మంది మరణించారు. రక్త సంబం«దీకులు, స్నేహితుల కడచూపునకు నోచుకోనంతగా శరీరాలు అగి్నకి ఆహుతి కావడంతో అంత్యక్రియలు అక్కడే నిర్వహిస్తున్నారు. పరాయి దేశంలో మరణిస్తే చివరిచూపు ఎలా అన్న సందేహం సామాన్యులకు తలెత్తడం సహజం. 2015 నుంచి 2025 అక్టోబర్ మధ్య వివిధ దేశాల్లో చనిపోయిన 57,975 మంది భారతీయుల మృతదేహాలు కేంద్ర ప్రభుత్వ చొరవతో స్వదేశానికి చేరాయి.స్వదేశానికి భారత పౌరుల మృతదేహాల తరలింపు, ఆయా దేశాల్లో అంతిమ సంస్కారాలను గౌరవంగా పూర్తి చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) వెల్లడించింది. ఇందుకు సంబంధించిన సహాయం, ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి భారత రాయబార కార్యాలయాలు, హై కమిషన్లు, కాన్సులేట్లు నిరంతరం శ్రమిస్తున్నాయని వివరించింది. సమాచారం రాగానే.. మరణం గురించి సమాచారం అందిన వెంటనే.. వారి బంధువులను, ఆయా దేశాల అధికారులను సంప్రదించి మరణానికి గల కారణాలను తెలుసుకొని, అవసరమైన లాంఛనాలను పూర్తి చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. స్వదేశానికి మృతదేహాల రవాణా, లేదా కుటుంబ సభ్యుల సమ్మతి మేరకు ఆయా దేశాల్లోనే అంతిమ సంస్కారాలను పూర్తి చేస్తున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ఏడాది మార్చి నెలలో లోక్సభకు వెల్లడించింది. బాధిత కుటుంబానికి బీమా, నష్ట పరిహారం త్వరితగతిన అందేలా తోడ్పడుతున్నట్టు తెలిపింది. సహజ మరణాల కేసుల్లో మృతదేహాలు భారత్కు రావడానికి దేశాన్ని బట్టి 3 నుంచి 14 రోజుల సమయం పడుతుంది. అసహజ, ప్రమాదవశాత్తు మరణించిన సందర్భాల్లో పోలీసు విచారణ పూర్తయిన తర్వాతే మృతదేహం స్వదేశానికి చేరుతుంది. వెల్ఫేర్ ఫండ్ ద్వారా.. వివిధ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, హై కమిషన్లు, కాన్సులేట్లు ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ను (ఐసీడబ్ల్యూఎఫ్) నిర్వహిస్తున్నాయి. ఎన్నారైలకు కష్ట సమయాల్లో, అత్యవసర సమయాల్లో అత్యంత అర్హత కలిగిన కేసుల్లో, అర్హత కలిగిన సందర్భాల్లో అవసరమైన లాంఛనాలను పూర్తి చేసేందుకు కావాల్సిన ఆర్థిక సహాయం కోసం ఈ ఫండ్ను వినియోగిస్తారు. మృతదేహాల రవాణాకు ఈ ఫండ్ నుంచే ఖర్చు చేస్తారు. -
పల్లె పోరులో ఏఐ.. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లకు గాలం
టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పంచాయతీ ఎన్నికల్లోనూ హల్చల్ చేస్తోంది. పల్లె పోరులో తలపడుతున్న అ భ్యర్థులు ఈ సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రచార పర్వంలో సరికొత్త పంథా తో దూసుకెళుతున్నారు. ఓటరు నాడి పట్టే వీడియోలు.. ప్రత్యర్థిపై విరుచుకుపడే సెటై ర్లు.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే మీమ్స్.. పల్లె జనం మనసును హత్తుకునే అభివాద సందేశాలు.. ఓటర్ల సెల్ ఫోన్లలో చక్కర్లు కొడుతున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్.. అన్ని సామాజిక మాధ్యమాలను ఏఐ జనరేటెడ్ వీడియోలతో మోత మోగిస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు అన్నీ కృత్రిమ మేధ ఆధారంగా సృష్టించిన వీడియోల్లో ఉంటున్నాయి. సాక్షి, హైదరాబాద్: టింగ్ మంటూ వాట్సాప్ గంట మోగిందంటే చాలు అది ఓటు గురించి అభ్యర్థి అభ్యర్థన వీడియోనే. సెల్కు వచ్చే మెసేజ్ను క్లిక్ చేస్తే యూట్యూబ్కో, ఇన్స్టాకో కనెక్టయ్యే లింకులే. గెలిస్తే ఊరునే అద్భుతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చే ఏఐ ఆధారిత వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి. ఊరు ఊరంతా తనకే మద్దతునిచి్చనట్టు తెలిపే జనరేటెడ్ వీడియో, ఆడియోల సాంకేతికత పంచాయతీ పోరులో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఫొటో దొరికితే చాలు ఏఐ టెక్నాలజీతో రాజకీయ మైండ్గేమ్ మొదలవుతోంది. ప్రత్యర్థి అనుయాయులు వచి్చనట్టు, తనకు మద్దతు ఇచ్చినట్టు, కండువా కప్పినట్టు.. ఇలా రకరకాల వీడియోలను ఏఐతో సృష్టిస్తున్నారు. కొన్ని వర్గాలను కలిసినట్టు, మాటామంతీ చేసినట్టు, వారు తమవైపు తిరిగినట్టుగా.. పాత పోటోలను సరికొత్త టెక్నాలజీ సాయంతో మార్చేస్తున్నారు. చాలామంది అభ్యర్థులు వార్డుకో వ్యక్తిని సోషల్ మీడియా ఏజెంట్లుగా పెట్టుకుంటున్నారు. ఏఐ ఆధారంగా అభ్యరి్థకి అనుకూలమైన ట్రెండ్ ఉందని వీడియోలు క్రియేట్ చేయడం, ఆ వీడియోలకు లైక్లు వచ్చేలా చేయడం వీళ్ళ బాధ్యత. ఇతర పక్షాలను దెబ్బతీసే వీడియోలు, ఫోటోల సృష్టిలోనూ ఏఐ పాత్ర కీలకంగా మారింది. ఐదేళ్ళుగా సర్పంచ్గా ఉన్నా రోడ్లు, నీళ్ళు, విద్యుత్ పరిస్థితి దయనీయంగా ఉందనే సాధారణ ప్రచారానికి బదులు ఏఐ వీడియో సృష్టితో విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. మరోవైపు తమ పరపతి పెరుగుతుందనే భావనతో మంత్రులను కలిసినట్టు, స్థానిక ఎమ్మెలేతో పాటు రాజకీయ ప్రముఖులతో ముచ్చటిస్తున్నట్టుగా ఉన్న ఏఐ జనరేటెడ్ వీడియోలు రూపొందించి ప్రచారంలో పెడుతున్నారు. పెరుగుతున్న యాప్ల వాడకం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్లే స్టోర్లో ఏఐ యాప్లు డౌన్లోడ్, సబ్ప్క్రైబ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల రోజుల్లోనే ఫిల్మోరా, ఏఐ జనరేటెడ్ చాట్ జీపీటీ, యానిమేటర్స్ వంటి ఏఐ యాప్ల వాడకం పెరిగిందని డిజిటల్ స్టూడియో నిర్వాహకుడు నందగోపాల్ వర్మ తెలిపారు. ఏఐ జనరేటెడ్ వీడియో కోసం పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారు అనేక రకాల ఆప్షన్లు ఇస్తున్నారని చెప్పాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు కూడా ఏఐ జనరేటెడ్ వీడియోల సృష్టిలో కీలక భూమిక పోషిస్తున్నారు. సొంత ఊళ్ళో తమ అభ్యర్థి తరపున డిజిటల్ ప్రచారం చేసేందుకు, తమ విద్యను స్థానికుల ముందు ఆవిష్కరించేందుకు ఒక అవకాశంగా దీన్ని ఎంచుకుంటున్నారు. మరోవైపు సంపాదనకు సైతం ఇది ఉపకరిస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. బరిలో ఉండే అభ్యర్థి ప్రసంగాలను అందంగా గ్రామస్తుల ముందుకు తీసుకెళ్ళే వాయిస్, లిప్ సింక్ వంటి అప్లికేషన్లను వెతికి మరీ పట్టుకుంటున్నారు. కొన్ని యాప్లు ఇండియాలో పనిచేయవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వీపీఎన్ కనెక్షన్కు లింక్ అవుతున్నారు. పార్లమెంట్ దాకా ఇదే ట్రెండ్! ఇక మీదట పల్లె నుంచి పార్లమెంట్ దాకా ఎన్నికల ప్రచారంలో ఏఐదే హవా అని తాజాగా చేసిన పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 2022 వరకూ ఏఐ ఆధారిత జరేటెడ్ అప్లికేషన్లు 56,682 రూపొందాయని, మరో పదేళ్ళల్లో వీటి సంఖ్య లక్ష దాటుతుందని ఇంపీరియల్ ఏఐ స్టడీ సంస్థ స్పష్టం చేసింది. ప్రజలను డిజిటల్ ఏఐ వీడియోలు మరింత ప్రభావితం చేస్తాయని, ఎన్నికల ప్రచార బడ్జెట్ను ఇది భారీగా పెంచుతుందని ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ఏఐ ఆధారిత ప్రచారం కోసం అభ్యర్థులు ప్రత్యేక ఆర్థిక వనరులు సమకూర్చుకునే వీలుందని వెంచర్ క్యాపిటల్ ఏఐ రిపోర్టు పేర్కొంది. ఏఐ విస్తృత వినియోగం నేపథ్యంలో డీప్ఫేక్, సమాచార భద్రత తదిర అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఏఐ సెక్యూరిటీ రీసెర్చ్ సెంటర్ పరిశీలనలో తెలిపింది. ఇదో రకమైన ఇంటర్న్షిప్హైదరాబాద్లో ఏఐ ఎంఎల్ కోర్సు చేస్తున్నా. మరోపక్క మా గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం కోసం పనిచేస్తున్నా. పుస్తకాల్లో చదవిన కోర్సు, ప్రాక్టికల్గా నేర్చుకున్నది కలిసి ప్రచార వీడియోలు రూపొందించి ఇస్తున్నాం. దీన్ని ఓ రకమైన ఇంటర్న్షిప్గా మారుస్తున్నాం. ఓటర్లను మా వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. – మద్దిని తేజాకుమార్ (ఏఐఎంఎల్ విద్యార్థి) కొత్తదనం కోసం కొత్త అప్లికేషన్లు ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ప్రతీ రోజు కొత్తదనం కోరుకుంటున్నారు. కాన్సెప్ట్ చెబుతున్నారు. వారికి నచ్చేలా వాటిని అందించేందుకు కొత్త ఏఐ అప్లికేషన్లను నిత్యం వెతుకుతున్నాం. అవసరమైతే రూ.వేలు ఖర్చు చేసైనా వాటిని కొంటున్నాం. జనం ఆసక్తిగా చూసేలా ఈ అప్లికేషన్లు ఉపయోగపడుతున్నాయి. – విష్ణువర్థన్ రెడ్డి (వరంగల్ డిజిటల్ స్టూడియో) -
ఆత్మస్తుతి... పరనింద
మానవ సంబంధాలలో ఉన్నతమైన విలువలకు, మన ఆత్మగౌరవానికి మూలస్తంభాలుగా నిలిచేవి – నమ్మకం, వినయం, బాధ్యత. అయితే, ఈ ఉన్నత లక్షణాలను ఒక్క దెబ్బతో నేలకూల్చే ఒక అంతర్గత శక్తి ఉంది: అదే అహంకారం. జీవితంలో మనం నిత్యం కోల్పోతున్న ఆంతరంగిక ప్రశాంతతకు, సామాజిక మన్ననకు – ఈ ఆత్మస్తుతి, పరనింద అనేవే ప్రధాన కారణాలు.మన అంతరంగంలో, ‘నేనే గొప్ప’, ‘నా నిర్ణయమే శిరోధార్యం’ అని నిశ్శబ్దంగా వినిపించే ఒక బలమైన, ప్రమాదకరమైన స్వరం ఉంటుంది. ఇదే అహంకారం. ఇది ఒక మానసిక విషం లాగా, మనల్ని ఇతరుల నుండి దూరం చేస్తుంది. నిజానికి, ఈ రెండూ మన లోపల ఉన్న అభద్రతా భావాన్ని, వైఫల్య భీతిని కప్పిపుచ్చే దుర్భేద్యమైన ముసుగులు. ఇవి మన నిజమైన ఎదుగుదలకు, ఇతరులతో ఆరోగ్యకరమైన అనుబంధాన్ని పెంచుకోవడానికి అడ్డుగోడలుగా నిలుస్తాయి.అహంకారం రెండు ముఖాలు – స్పష్టమైన అనుభవం. ఈ రెండు లక్షణాలు రోజువారీ జీవితంలో మన నమ్మకమైన బంధాలను ఎలా ఛిద్రం చేస్తాయో గమనిద్దాం.ఆత్మస్తుతి: (అతిశయోక్తి) మీరు ఒక గొప్ప విజయాన్ని సాధించినా, ప్రతి సంభాషణను మీ గొప్పల చుట్టే తిప్పి, ‘ఇదంతా నా తెలివి తేటలే‘ అని పదే పదే ప్రకటిస్తే – వినేవారికి అది సంతోషాన్ని పంచదు, తీవ్రమైన విసుగును, దూరాన్ని పెంచుతుంది. మిమ్మల్ని మీరే పొగుడు కుంటే, ఇతరులు మీకు నిజమైన గౌరవం ఇవ్వడం మానేస్తారు. గొప్ప జ్ఞాని అయిన యాజ్ఞవల్క్యుడు సైతం, తన జ్ఞానాన్ని తానే అతిగా చెప్పుకున్నప్పుడు, పండితుల విమర్శలను ఎదుర్కొన్నారు. పరనింద (పలాయనవాదం): నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయడం... వ్యా పారంలో ఎదురుదెబ్బ తగిలితే, పోటీదారులు కారణం, పరిస్థితులే కారణం‘ అని నిందించడం; క్రీడలలో ఓటమి ఎదురైతే ‘అంపైర్ పొర పాటు, రూల్స్ తప్పు‘ అని వాదించడం. ఈ విధంగా తప్పును మరొకరిపై నెట్టడం తాత్కాలికంగా మన అహం కా పాడుకున్నట్టు అనిపించినా, అది మన నైతిక శక్తిని నాశనం చేస్తుంది. మీ వైఫల్యాలకు మీరు బాధ్యత తీసుకోనప్పుడు, ఇతరులు మిమ్మల్ని విశ్వసించడం పూర్తిగా మానేస్తారు. మహాభారతంలో దుర్యోధనుడు తన పతనానికి తన అహంకారాన్ని కాక, ఎప్పుడూ శ్రీ కృష్ణుడిని లేదా పాండవుల అదృష్టాన్ని నిందించేవాడే తప్ప, ఆత్మపరిశీలన చేసుకోలేకపోయాడు. విజయం సాధించినప్పుడు, ‘నా ప్రయత్నం’ అని కాకుండా, ‘మా బృందం/కుటుంబ సహకారం వల్ల సాధ్యమైంది’ అని చెప్పండి. మీ గొప్పతనాన్ని మీరే చెప్పుకోకుండా, మీ పనిని మీకోసం మాట్లాడనివ్వండి.తప్పు జరిగినప్పుడు, వెంటనే ‘దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. బాధ్యతను ధైర్యంగా అంగీకరించండి. ఈ ఒక్క చర్య మిమ్మల్ని ఇతరుల దృష్టిలో నిజమైన నాయకుడిగా, విశ్వసనీయుడిగా నిలబెడుతుంది.ఆత్మస్తుతి అనేది వృథా అయిన శక్తి, పరనింద అనేది మీ ఎదుగుదలను అడ్డుకునే మానసిక చెరసాల. ఈ అహంకారం అనే సంకెళ్లను తెంచే సాహసం చేసినప్పుడే, మీరు ఆ నిజమైన ఆనందాన్ని, ప్రశాంతతను సొంతం చేసుకుంటారు. ఇతరులపై నిందలు వేయడం ఆపి, మీ బాధ్యతను ప్రేమతో స్వీకరించండి. ఈ వినయం, బాధ్యత అనే రెండు అసాధారణ లక్షణాలతో, మీరు ప్రపంచం నుండి గౌరవంతో పాటు నమ్మకాన్ని, ప్రేరణను కూడా అందుకుంటారు. ఇదే మీ ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం.– కె. భాస్కర్ గుప్తా వ్యక్తిత్వ వికాస నిపుణులు -
‘రక్త’ సిందూరం!
కులం సాకుతో కూతురి ప్రేమను కాదన్నారు. ఖాతరు చేయలేదన్న కసితో కన్నతండ్రి, తోబుట్టువులే ఆమె ప్రేమికుడి పాలిట కాలయముళ్లయ్యారు. నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు. మనసారా ప్రేమించినవాడు నడిరోడ్డుపై రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంటే.. ఆమె గుండె పగిలింది. నిప్పుల కొలిమి అయ్యింది. చట్టాన్ని ధిక్కరించిన పగలకు, కులాన్ని అడ్డుపెట్టిన క్రూరత్వానికి బదులివ్వడానికి ఆమె అప్పటికప్పుడే ఎంచుకున్న మార్గం... చరిత్రలో విలక్షణ అధ్యాయమై నిలిచింది. మట్టిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రియుడి దేహాన్నే వివాహం చేసుకుంది. అమరం.. అఖిలం మా ప్రేమ.. అంటూ యావత్ ప్రపంచానికి చాటిచెప్పింది. ఆమె ధిక్కార ప్రకటన.. మహారాష్ట్రలోని నాందేడ్లో కన్నీటి కెరటమై ఎగసిపడింది.మూడేళ్ల ప్రేమకు నూరేళ్లు ఆంచల్ మమిద్వార్ (21), సక్షం టేట్ (20)లది మూడేళ్ల గాఢమైన ప్రేమ బంధం. వాస్తవానికి ఆంచల్ సోదరుల ద్వారానే ఆమె కుటుంబానికి సక్షం పరిచయమయ్యాడు. తరచూ వారింటికి సక్షం రావడంతో.. వీరిద్దరి ప్రేమ బంధం బలపడింది. అయితే, వారిద్దరి కులాలు వేరు కావడంతో.. ఆంచల్ కుటుంబం ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్ని బెదిరింపులు వచ్చినా ఆంచల్, సక్షం తమ ప్రేమ బంధాన్ని వదులుకోలేదు. సక్షం, ఆంచల్ పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం ఆంచల్ తండ్రి గజానన్ మమిద్వార్ (45)కు, సోదరులు హేమేశ్, సాహిల్ (25)లకు తెలిసిపోయింది. అంతే.. పరువు హత్యకు పథకం సిద్ధమైపోయింది.తుపాకీతో కాల్చి.. రాయితో కొట్టి.. గురువారం సాయంత్రం, నాందేడ్లోని పాతగంజ్ ప్రాంతంలో సక్షం తన స్నేహితులతో నిలబడి ఉండగా.. ఆంచల్ సోదరుడు హేమేశ్ మామిద్వార్ అక్కడికి చేరాడు. అతనికి.. సక్షం మధ్య గొడవ మొదలైంది. కోపంతో ఊగిపోయిన హేమేశ్, సక్షంపైకి తుపాకితో కాల్పులు జరిపాడు. ఆ గుండు సక్షం పక్కటెముకల్లోకి దూసుకుపోయింది. అంతటితో ఆగకుండా, హేమేశ్ ఒక రాతి పెంకుతో సక్షం తలపై బలంగా కొట్టాడు. దీంతో సక్షం అక్కడికక్కడే మరణించాడు. మా ప్రేమకు చావు లేదు.. సక్షం హత్య తర్వాత రోజు, శుక్రవారం సాయంత్రం.. అతని అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పుడే అక్కడికి ఆంచల్ చేరుకుంది. సక్షం నిర్జీవ దేహం పక్కన మోకరిల్లింది. కళ్ల నుండి దుఃఖం ధారాపాతమై ప్రవహిస్తుండగా.. ఆమె సక్షం శరీరానికి పసుపు పూసింది. తన నుదుట సిందూరం ధరించింది. ప్రియుడి భౌతిక కాయంతోనే పెళ్లి చేసుకుంది. తమ ప్రేమకు అమరత్వం కలి్పంచడానికి ఈ పని చేస్తున్నానని ఆంచల్ చెబుతుంటే.. అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు. ఈ హృదయవిదారక దృశ్యం వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.వారిని ఉరి తీయండి.. ప్రియుడి శవంతో వివాహం అనంతరం ఆంచల్ విలేకరులతో మాట్లాడుతూ.. కన్నతండ్రి, సోదరులు చేసిన ఈ ఘాతుకానికి వారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. ‘కులం సాకుతో నా తండ్రి మా ప్రేమను వ్యతిరేకించాడు. నా కుటుంబం చాలాసార్లు సక్షంను చంపుతామని బెదిరించింది. ఇప్పుడదే చేసింది. నాకు న్యాయం కావాలి. ఈ ముగ్గురిని ఉరి తీయాలి’.. అని కోరింది. అంతేకాకుండా, ఆమె ఆ క్షణం నుంచే సక్షం ఇంట్లోనే కోడలిగా మిగిలిన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంది. ‘సక్షం మరణంలోనూ మా ప్రేమ గెలిచింది, నా తండ్రి, సోదరులు ఓడిపోయారు’.. అని ఆమె ప్రకటించింది. ఈ హత్యలో ఆంచల్ తండ్రి గజానన్, సోదరులు హేమేశ్, సాహిల్ పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించి, వెంటనే వారిని అరెస్టు చేశారు. మొత్తం ఆరుగురిపై భారతీయ న్యాయ సంహిత, ఎస్సీ/ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం, ఆయుధ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులకు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించారు. ఆంచల్ ధైర్యం, ఆవేదనతో కూడిన ప్రేమకథ.. కులాల మధ్య ప్రేమ మనుగడ సాగించాలంటే ఎంతటి తీవ్ర పోరాటం చేయాలో, ఎన్ని ప్రాణాలు బలివ్వాలో మరోసారి రుజువు చేసింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పేరులో ఏముంది? విడాకుల వరకూ తీసుకెళ్లింది
కసి ఉండటానికి కారణాలు అవసరం లేదు కానీ, విడిపోవడానికి చాలా వెతుక్కోవచ్చు. తమ పిల్లాడికి పేరు పెట్టే విషయంలో ఏకాభిప్రాయం లేక చైనాలో ఓ జంట విడాకుల కోసం కోర్టుకెక్కింది. షాంఘైలోని పుడాంగ్ న్యూ ఏరియాలో ఓ జంటకు 2023లో వివాహమైంది. మరుసటి ఏడాది బాబుకు జన్మనిచ్చారు. అయితే, ఆ పిల్లాడి నామకరణం పెద్ద రణంగా మారింది. నేను చెప్పిన పేరే పెట్టాలని ఇరువురూ పట్టుబట్టారు. చివరకు కలిసి ఉండలేం అని కోర్టుకెక్కారు. కేసు పూర్వాపరాలు చూసిన న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. బాబుకు ఏడాది వయసు దాటినా ఇంకా జనన ధ్రువీకరణ పత్రం లేకపోవడం, పేరు పెట్టకపోవడం వల్ల టీకాలు వేయడానికీ కుదరకపోవడం మైనర్ హక్కుల ఉల్లంఘనే అని హెచ్చరించారు. భావోద్వేగ సంఘర్షణలలో పిల్లలను బేరసారాలుగా ఉపయోగించకూడదని మందలించారు. నిర్దిష్ట కాలవ్యవధిలోగా పేరు పెట్టే విషయంలో ఏకాభిప్రాయానికి రావాల్సిందేనని చెకప్పారు. ఈ కేసు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పేరులో ఏముంది అని అంటారు.. కానీ ఎంత ఉందో చూశారా? -
పేరు మారిస్తే.. ఫేట్ మారుద్ది!
ఇది కూడా పేరు తెచ్చిన ప్రాబ్లమే. అక్కడ పిల్లాడి పేరు అయితే, ఇక్కడ భార్య పేరు.. అంతే తేడా. ఓ వ్యక్తి తన భార్య పేరును ఫోన్ కాంటాక్ట్ లిస్ట్లో ‘చబ్బీ’అని సేవ్ చేసినందుకు ఆమె విడాకులు తీసుకుంది. తుర్కియేలోని ఉసక్ నగరానికి చెందిన భార్యాభర్తల మధ్య ఈ పేరు పంచాయితీ వచ్చింది. భర్త ఆమె పేరును తన ఫోన్లో ‘టొంబెక్’అని సేవ్ చేసుకున్నాడు. అంటే చబ్బీ(బొద్దుగా) అని అర్థం. ఇది చూసిన ఆమె భర్తపై తీవ్రంగా మండిపడి విడాకుల కోసం కోర్టుకెళ్లింది. తన పేరు అలా పెట్టుకోవడం తీవ్ర అవమానకరమని, ఇక అతడితో కలిసి ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. వాదనలు విన్న న్యాయమూర్తి.. వారికి విడాకులు ఇవ్వడంతోపాటు ఆమె మానసిక క్షోభకు పరిహారం చెల్లించాలని అతడిని ఆదేశిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు ఈ నిర్ణయాన్ని సమర్థంచగా.. మరికొందరు చబ్బీ అని ముద్దుగా పెట్టుకున్నాడేమో అని జాలిపడ్డారు. చూశారా.. పేరులో ఎంతుందో? భర్తలూ.. జర భద్రం మరి..! -
శబరిమల యాత్రలో ఆ రెండుచోట్ల గుండెపోటు ముప్పు!
శబరిమల యాత్రికులకు రెండుచోట్ల గుండెపోటు ముప్పు పొంచి ఉంది! సముద్రమట్టానికి ఎత్తయిన ప్రాంతంలోకి వెళ్తుండడం.. ఉపవాసాలు, డీహైడ్రేషన్, ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉండడం వంటి కారణాలతో ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. స్వయానా కేరళ వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్న విషయమిది. పంపా బేస్ నుంచి శబరిమలకు వెళ్లే చిన్నపాదం మార్గంలో అత్యంత కఠినమైనదిగా పిలిచే నీలిమలతోపాటు.. కొండ శిఖరాగ్రంలో ఉండే అప్పాచిమేడు వద్ద భక్తులకు గుండెపోట్లు ఎక్కువగా సంభవిస్తున్నట్లు ఆరోగ్యశాఖ జారీ చేసిన హెచ్చరికల్లో స్పష్టమవుతోంది. ప్రతిఏటా పెరుగుతున్న మరణాల సంఖ్య ప్రతిఏటా నీలిమల, అప్పాచిమేడు ప్రాంతాల్లో గుండెపోటుతో భక్తులు కుప్పకూలిపోతున్న ఉదంతాలు.. మరణాలు నమోదవుతున్నట్లు ట్రావెన్కోర్ దేవోస్వం బోర్డు(టీడీబీ), కేరళ వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు క్రైం డేటా రికార్డ్ బ్యూరో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన ఏడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. 2017–18 సీజన్లో 281 మంది గుండెపోటు బారినపడగా, వారిలో 36 మంది మృతి చెందారు. 2018–19లో 173 గుండెపోటు కేసులు నమోదుకాగా, 24 మంది మరణించారు, 2019–20లో 19, 2022–23లో 24, 2023–24లో మరో 24, 2024–25లో 40 గుండెపోటు మరణాలు నమోదయ్యాయి. 2025–26 సీజన్ ప్రస్తుతం కొనసాగుతుండగా.. ఇప్పటివరకు ఓ మహిళ గుండెపోటు కారణంగా మృతిచెందినట్లు పోలీసు రికార్డులు చెబుతుండగా, 8 మరణాలు నమోదైనట్లు నాలుగు రోజుల క్రితం ఓ జాతీయ ఆంగ్ల పత్రికలో కథనం ప్రచురితమైంది. 2020–22లో మాత్రం కొవిడ్ ఆంక్షల కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు. ఆ సీజన్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. అక్కడే ఎందుకు? సముద్ర మట్టానికి ఎత్తులో ఉండడం, ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండడం వంటి కారణాలతో నీలిమల, అప్పాచిమేడు ప్రాంతాల్లో గుండెపోట్లు అధికంగా సంభవిస్తున్నాయి. నీలిమల కొండ నిటారుగా, చాలా ఎత్తుగా ఉంటుంది. శబరియాత్రలో పెద్దపాదంలో ముక్కు కొండగా పిలిచే కరిమల కొండ తర్వాత.. చిన్నపాదంలో దాదాపు అదే స్థాయిలోనే నీలిమల ఉంటుంది. నీలిమలను అధిరోహించేందుకు ట్రావెన్కోర్ దేవోస్వం బోర్డు ఏర్పాటు చేసిన మెట్లు ఉన్నప్పటికీ భక్తులు ఈ ఒక్క కొండను అధిరోహిస్తే ఇబ్బందులు దూరమవుతాయనే ఉద్దేశంతో నడకలో వేగాన్ని పెంచుతారు. లేదంటే.. ముందు నడిచివెళ్లే తమ బృందంలోని సభ్యులను అందుకోవాలనే ఉద్దేశంతో వడివడిగా నడుస్తారు. దాంతో హార్ట్ బీట్లో మార్పులు చోటుచేసుకుంటాయి. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండడంతో ఆక్సిజన్ తగ్గుతుంది. డిమాండ్ పెరగడం.. అందుకు అనుగుణంగా ప్రాణవాయువు అందకపోవడంతో శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలు క్రమంగా పడిపోతాయి. హార్ట్బీట్లో హెచ్చుతగ్గులకు తోడు.. ఆక్సిజన్ స్థాయిలు తగ్గడంతో గుండెకు రక్త సరఫరా నెమ్మదిస్తుంది. ఈ కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదాలుంటాయని వైద్య నిపుణులు విశ్లేíÙస్తున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి రుగ్మతలు, కొలె్రస్టాల్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి నీలిమల అధిరోహించేప్పుడు వేగాన్ని పెంచడం ప్రమాదకరమని చెబుతున్నారు. ఇక అప్పాచిమేడు ప్రాంతంలో కొండ ఎత్తుగా లేకున్నా.. అది శిఖరాగ్రం కావడంతో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయని వివరిస్తున్నారు. అందుకే కేరళ వైద్య ఆరోగ్య శాఖ ఈ ప్రాంతాల్లో ఆక్సిజన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ మరణాలు ప్రతిఏటా పెరుగుతూనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన కారణాలివే.. → దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిలో గుండెపోటు సమస్యలను పక్కనపెడితే.. ఆరోగ్యకరంగా ఉన్నవారు కూడా బాధితులుగా మారుతున్నట్లు కేరళ వైద్య ఆ రోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దీనికి కూడా కారణాలున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. → శబరియాత్ర కోసం భక్తులు రేయింబవళ్లు ప్రయాణంలోనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో రాత్రంతా ప్రయాణాలు చేస్తుంటారు. భోజనం కూడా సమయానికి తీసుకోరు. సామూహికంగా వంట చేసుకున్నప్పుడో.. శాకాహార హోటళ్లు అందుబాటులో ఉన్నప్పుడో ఆహారం తీసుకుంటారు. కంటినిండా నిద్ర, కడుపునిండా భోజనం లేకపోవడంతో శరీరం అలసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. → ఇలాంటి వారిలో డీహైడ్రేషన్ పెరుగుతుంది. గ్లూకోజ్ స్థాయులు, ఎలక్ట్రోలైట్లు తగ్గిపోతా యి. ఫలితంగా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. → ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్ లభ్యత తగ్గితే.. గుండెపోట్లు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. → చాలామంది భక్తులు పంపా బేస్లోని హోటళ్లలో భోజనం చేయగానే.. కొండను అధిరోహించడం చేస్తుంటారని, ఇది కూడా ప్రమాదకరమని నిపుణులు వివరిస్తున్నారు. భోజనం తర్వాత రక్తప్రసరణ ఎక్కువగా జీర్ణాశయం వైపు వెళ్తుందని, ఫలితంగా గుండెపై రెట్టింపు ఒత్తిడి ఉంటుందని పేర్కొంటున్నారు. కడుపు నిండుగా ఉన్నప్పుడు గుండెపోటు సంభవిస్తే.. రిస్క్ ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. → ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రెకింగ్ చేసేప్పుడు డీహైడ్రేషన్ సంభవించడం చాలా ప్రమాదకరమని పేర్కొంటున్నారు. – సాక్షి డిజిటల్ డెస్క్ -
పరిశోధకులకూ ఏఐ
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం క్రమంగా పెరుగుతోంది. విద్యార్థుల దైనందిన అభ్యాసంలో ఈ నూతన సాంకేతికత ఒక భాగమైంది. పరిశోధకులకూ కృత్రిమ మేధ ఆయుధం కావడం విభిన్న రంగాల్లో వేగవంతమైన పురోగతికి జీవం పోసినట్టయింది. వేగంగా పరుగుతీస్తున్న ప్రస్తుత యుగంలో పరిశోధకులు, సంస్థలు కృత్రిమ మేధను ఎంత సమర్థవంతంగా స్వీకరిస్తాయి, సహకారాన్ని పెంపొందించుకుంటాయి, స్థితిస్థాపకతను ఎలా నిర్మిస్తాయి అనే అంశాలపై విజయం ఆధారపడి ఉంటుందని ఇన్ఫర్మేషన్, అనలిటిక్స్ కంపెనీ ఎల్సవీయర్ చెబుతోంది.నెదర్లాండ్స్కు చెందిన ఈ సంస్థ రీసర్చర్ ఆఫ్ ద ఫ్యూచర్ పేరుతో 113 దేశాల్లో సర్వే చేపట్టింది. 3,234 మంది రీసర్చర్స్ ఇందులో పాలుపంచుకున్నారు. ఈ సాంకేతికత సామర్థ్యంపై సానుకూల ధోరణి, పెరుగుతున్న వినియోగంతో పరిశోధనా వ్యవస్థను ఏఐ పునర్నిర్మిస్తోందని నివేదిక తెలిపింది. ‘పరిశోధకులు ఏఐని ఒక పరివర్తన సాధనంగా గుర్తించారు. ఇది వారి సామర్థ్యాన్ని, సృజనాత్మకతను పెంచుతోంది. డేటా విశ్లేషణకు సాయపడుతోంది. కృత్రిమ మేధ ప్రయోజనాలను ఇప్పటికే వీరు అందుకున్నారు’ అని వివరించింది.సగం కంటే ఎక్కువగా..పనులను ఆటోమేట్ చేయడానికి ఒక సాధనంగా మాత్రమే కాకుండా.. మానవ మేధస్సును పెంపొందించడానికి, అపూర్వమైన వేగంతో వాస్తవ జ్ఞానాన్ని సృష్టించడానికి వీలు కల్పించే సృజనాత్మక భాగస్వామిగా కూడా కృత్రిమ మేధ మారుతోందని నివేదిక వివరించింది. పరిశోధనలో ఏఐ స్వీకరణ పెరిగింది. సర్వేలో పాలుపంచుకున్న పరిశోధకుల్లో 58% మంది రీసర్చ్కు సంబంధించిన పనుల్లో ఏఐ సాధనాలను ఉపయోగించారు. 2024లో ఈ సంఖ్య 37% మాత్రమే. ఈ ఏఐ యూజర్లలో 61% మంది తాజా పరిశోధనలను కనుగొని, సంగ్రహించడానికి, 51% మంది సాహిత్య సమీక్షల కోసం నూతన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. పారదర్శకత, వేగం.. ఈ రెండు ప్రత్యేకతలు ఏఐ పట్ల విశ్వాసాన్ని పెంచుతాయని పరిశోధకులు సూచిస్తున్నారు. ఏఐ ఆటోమేటిక్గా సూచనలను ఉదహరిస్తున్నప్పుడు పారదర్శకత ఉండాలని 59%, ఎప్పటికప్పుడు కొత్త సమాచారం అందించాలని 55% పరిశోధకులు అభిప్రాయపడ్డారు.సానుకూల ఫలితాలుసామర్థ్యాన్ని పెంచగలిగే శక్తి ఏఐకి ఉందన్న అంశంపై పరిశోధకుల్లో అత్యధికులు సానుకూలంగా ఉన్నారు. కృత్రిమ మేధ ఇప్పటికే తమ సమయాన్ని ఆదా చేస్తోందని 58% మంది తెలిపారు. రాబోయే 2–3 సంవత్సరాలలో తమ సమయాన్ని ఆదా చేస్తుందని మూడింట రెండువంతులకుపైగా రీసర్చర్స్ ఆశిస్తున్నారు. రాబోయే 2–3 ఏళ్లలో నూతన జ్ఞానాన్ని నడిపించే సృజనాత్మక శక్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందని 61% పరిశోధకులు నమ్ముతున్నారు. కృత్రిమ మేధను అందిపుచ్చుకోవడంలో తగినంత సిద్ధంగా లేమని అత్యధికులు భావిస్తున్నారు. ఏఐలో తక్కువ శిక్షణ పొందామని 45% రీసర్చర్స్ భావిస్తున్నారు. మూడింట ఒక వంతు పరిశోధకులు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, సిబ్బందికి శిక్షణలో తమ కంపెనీ విధానం బాగుందని అంగీకరిస్తున్నారు.ఏఐ సాధనాలను అస్సలు ⇒ ఉపయోగించని పరిశోధకుల్లో అమెరికా నుంచి 25%, భారత్ నుంచి 26%, చైనా నుంచి 4% ఉన్నారు. ⇒ ఏడేళ్లలోపు అనుభవం ఉన్న రీసర్చర్స్లో 83%, 20 ఏళ్లకుపైగా సీనియారిటీ ఉన్న వారిలో 65% ఏఐ టూల్స్ వాడుతున్నారు.⇒ సర్వేఈ–మెయిల్ ఇన్విటేషన్ ద్వారా ఆన్లైన్లో..⇒ చేపట్టింది ఇన్ఫర్మేషన్, అనలిటిక్స్ కంపెనీ ఎల్సవీయర్⇒ టైటిల్ రీసర్చర్ ఆఫ్ ధ ఫ్యూచర్⇒ ఎప్పుడు: 2025 ఆగస్ట్–సెప్టెంబర్ మధ్య ఎంత మంది: 113 దేశాల నుంచి 3,234 మంది పాల్గొన్నవారు: పరిశోధకులు, విద్యా, పరిశోధన సంస్థల ముఖ్యులుఏఐ టూల్స్ వినియోగం ఇలా..⇒ రీసెర్చ్ పనుల్లో భాగంగా.. 58%⇒ ఇతర అవసరాలకు 26%⇒ అసలు వినియోగించలేదు 16% -
61 శాతం భారత్ భూకంప జోన్లోకి..
ప్రపంచంలో పలు దేశాలను అల్లాడించిన భూకంపాలు త్వరలో భారత్పైకీ విరుచుకుపడే ప్రమాదం హెచ్చుగానే కనిపిస్తోంది. దేశంలో ఏకంగా 61 శాతం ప్రాంతం సాధారణం నుంచి ప్రమాదకర భూకంప రిస్కు పరిధిలోకి చేరడమే ఇందుకు కారణం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (బీఐఎస్) కొత్తగా సవరించిన భూకంప డిజైన్ కోడ్ ఈ ప్రమాదకర విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు, పొంచి ఉన్న భూకంప ప్రమాద తీవ్రతను తెలియజెప్పేందుకు కొత్తగా ‘అత్యంత ఎక్కువ రిస్కు’జోన్ కేటగిరీని కూడా చేర్చింది. మొత్తం హిమాలయ ప్రాంతమంతటినీ జోన్–6గా పేర్కొన్న ఈ కేటగిరీలోకే చేర్చడం మరింత ఆందోళన పడాల్సిన అంశం! ఇప్పడేం మారింది? హిమాలయాలు గతంలో 4, 5 జోన్ల పరిధిలో ఉండేవి. ఆ ప్రాంతమంతా నిజానికి ఒకే టెక్టానిక్ పలకపై ఉన్నా భూకంప రిస్కు తీవ్రతలో తేడా ఆధారంగా అప్పట్లో అలా విభజన చేశారు. అయితే ఆ క్రమంలో భూ లోతుల్లోని పొడవాటి అగాధపు ప్రాంతాలతో పొంచి ఉన్న ముప్పును సరిగా మదింపు చేయడంలో విఫలమైనట్టు సైంటిస్టులే అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా మధ్య హిమాలయ ప్రాంతాల్లో పలు అత్యధిక భూకంప రిసు్కన్న పలు భూభాగాలు ఈ తప్పిదం వల్ల సాధారణ రిసు్కన్నవిగా పరిగణన పొందుతూ వచ్చాయి. దాన్నిప్పుడు సరిచేసినట్టు బీఐఎస్ వెల్లడించింది. నిజానికి మధ్య హిమాలయ ప్రాంతాల్లో గత రెండు దశాబ్దాల్లో భూకంపం జాడలు కూడా కని్పంచలేదు. అంత మాత్రాన అక్కడ అంతా సజావుగా ఉన్నట్టు అసలే కాదని బీఐఎస్ పేర్కొంది. ఎందుకిలా డేంజర్ జోన్లోకి? హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత చురుగ్గా ఢీకొట్టే టెక్టానిక్ పలకల సరిహద్దులపై ఉన్నాయి. మరోలా చెప్పాలంటే ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశమున్న మందుపాతరపై ఉన్నాయన్నమాట. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ నిరంతరం యురేíÙయన్ ప్లేట్లోకి చొచ్చుకుపోతూ వస్తోంది. ఫలితంగా ఏటా కనీసం 5 సెంటీమీటర్ల మేరకు అందులోకి చొరబడుతూ వెళ్తోంది. రెండు ప్లేట్లు ఢీకొంటున్న కారణంగానే అక్కడ భూ ఉపరితలం పైపైకి పెరుగుతూ వస్తోంది. హిమాలయాల ఆవిర్భావానికి మూలకారణం కూడా ఇదే. ఎవరెస్టుతో పాటు ప్రపంచంలోకెల్లా పలు పర్వత శిఖరాలు హిమాలయాల్లోనే ఉండేందుకూ ఇదే కారణం. కనుక అవి చల్లగా కని్పంచేది కేవలం పైకి మాత్రమే. ఈ టెక్టానిక్ ఒత్తిడి మూలంగా హిమాలయ గర్భమంతా నిత్యం అలజడిమయంగానే ఉంటూ ఉంటుంది. టెక్టానిక్ పలకల పరస్పర తాకిడి భూ కేంద్రంపైనా విపరీతమైన ఒత్తిడికి కారణమవుతోంది.ఆ ఒత్తిడి ఎప్పుడో ఓసారి హఠాత్తుగా విడుదలవుతుంటుంది. అది కాస్తా అత్యంత శక్తిమంతమైన భూకంపాల రూపంలో పైకి ఎగదన్నుకొస్తుంది. ఇది చాలదన్నట్టు భూమ్మీద అత్యంత అస్థిరమైన పర్వత ప్రాంతం హిమాలయాలే. వయసుపరంగా అన్ని పర్వతాల కంటే చిన్నవి కూడా. దాంతో హిమాలయాల్లోని రాళ్లు తదితరాలు నిత్యం అటూఇటూ మంద్రస్థాయిలో కదలాడుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడ గనక భూకంపం సంభవిస్తే అతి అత్యంత ప్రాణాంతకమే అవుతుంది. అంతా అక్కడే! మెయిన్ బౌండరీ, మెయిన్ సెంట్రల్, మెయిన్ ఫ్రంటల్... ఇలా భూ కేంద్రంలోని ప్రధాన ఫాల్ట్ సిస్టమ్స్ (భారీ రంధ్రాలని చెప్పుకోవచ్చు)లో అతి పెద్దవన్నీ హిమాలయాల కిందే కేంద్రీకృతమై ఉన్నాయి. అంతేగాక పలు భూకంప విరామ ప్రాంతాలు (కొన్ని శతాబ్దాలుగా అసలు భూకంపమే రానివి) కూడా హిమాలయాల్లోనే ఎక్కువగా ఉన్నట్టు సైంటిస్టులు తేల్చారు. అలాంటి ప్రాంతాల్లో భారీ భూకంపానికి ఎప్పుడైనా ఆస్కారం పుష్కలంగా ఉంటుందట. కర్ణుని చావుకు మాదిరిగా ఇన్ని కారణాలు కలగలిసి హిమాలయాలను ప్రపంచంలోకెల్లా భూకంప రిస్కు అత్యంత ఎక్కువగా ఉన్న ప్రాంతాల జాబితాలోకి చేర్చేశాయి. హిమాలయాల్లోని డెహ్రాడూన్, మొహంద్తో పాటు మొత్తం ఉత్తరాఖండ్ అంతా తాజాగా భూకంప డేంజర్ జోన్లోకి వచి్చంది. అక్కడ జనాభా నానాటికీ ఊహాతీతంగా పెరిగిపోతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రేపు వరల్డ్ ఎయిడ్స్ డే.. కొత్త తరానికి చెప్పాలి..
మొదట్లో అభివృద్ధి చెందిన సంపన్న దేశాల్లో మాత్రమే విస్తరించిన ఎయిడ్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తమయ్యింది. ఆ సంపన్న దేశాల్లోని మత్తు ఇంజెక్షన్ల సంస్కృతి, హోమో సెక్సువల్ ధోరణులతో ఇలా జరిగింది. ఇవేవీ లేని మనలాంటి దేశాల్లో దీని విస్తృతి మొదట్లో దాదాపుగా లేనేలేదు. కానీ తర్వాత్తర్వాత ఇది మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు... పేద దేశాల్లో కూడా విపరీతంగా వ్యాపించిందని తేలింది. ఈ వ్యాధిపై మొదట్లో ఉన్నంత బజ్ ఇప్పుడు లేకపోవడంతో చాపకింది నీరులా ఇది వ్యాపిస్తోంది. అందుకే మరోసారి ఈ వ్యాధి గురించి మాట్లాడాల్సిన సమయం ఇది. ఈ సందర్భంగా ఎయిడ్స్వ్యాధి విషయంలో సమాజంలో చైతన్యం తేవడం కోసం ఏం చేయాలో, అలాగే అనుసరించాల్సిన మార్గాలేమిటన్నది నిపుణులైన డాక్టర్లు సూచిస్తున్న అంశాలివి.ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడానికి వేర్వేరు దేశాల్లో వేర్వేరు అంశాలు అడ్డంకులుగా నిలుస్తున్నాయి. హోమో సెక్సువాలిటీకి సామాజిక ఆమోదం లేనిచోట్ల, ఇంజెక్షన్ డ్రగ్స్ వాడకం నేరంగా ఉన్న దేశాల్లో వారు తీవ్రమైన వివక్షకు లోనవుతుండటంతో తమ గుర్తింపులను దాచుకోడానికి చేసే ప్రయత్నంలో వారికి చికిత్స అందడం లేదు. దాంతో ఈ తాజా ధోరణులతో హెచ్.ఐ.వి. వ్యాప్తి తీరు మారుతున్నది. సెక్స్ వర్కర్స్, హోమోసెక్సువల్స్, డ్రగ్స్ ఇంజెక్షన్లు తీసుకునేవారూ, ట్రాన్స్జెండర్ వ్యక్తులు, ఖైదీల వంటి సమూహాలలో ఈ వైరస్ తీవ్రమైన వేగంతో వ్యాపిస్తోంది. ఇక ఆఫ్రికాలాంటి వెనకబడిన దేశాల్లో అవగాహన లేమితో ఈ వ్యాధి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. ప్రస్తుతం కొత్తగా సోకుతున్న హెచ్.ఐ.వి. ఇన్ఫెక్షన్లలో ఆఫ్రికాలో 25 శాతం, మిగతా ప్రపంచంలో 80 శాతం ప్రజల్లో ఎయిడ్స్ అన్నది పైన పేర్కొన్న హోమో సెక్సువల్, ట్రాన్స్జెండర్, డ్రగ్స్ బాధితులు, ఖైదీల వంటి రిస్క్ గ్రూపులలోనే ఎక్కువ. భారతదేశంలోనూ మిగతా జనాభాతో పోలిస్తే ఇలాంటి సమూహాల్లోనే హెచ్.ఐ.వి. వ్యాప్తి సాధారణ జనాభా కంటే 15–17 రెట్లు ఎక్కువ.భారతదేశం, తెలుగు రాష్ట్రాల పరిస్థితి జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ 2023 అంచనాల ప్రకారం, భారతదేశంలో 25 లక్షల 44 వేల మంది హెచ్ఐవితో జీవిస్తున్నారు. 15–49 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారిలో ప్రతి వెయ్యి మందిలో ఇద్దరిలో (0.20%) హెచ్.ఐ.వి. వ్యాపించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 3.90 లక్షల మంది హెచ్ఐవి తో జీవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 3 లక్షల 14 వేల మంది. తెలంగాణలో 1 లక్షా 58 వేల మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 15–49 ఏళ్ల మధ్య వయసు వారిలో హెచ్ఐవి సోకినవారు జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ ఉన్నారు. అంటే ప్రతి వెయ్యిలో ఆరుగురు పైగా (0.62%); తెలంగాణలో ప్రతి వెయ్యికి దాదాపు ఐదుగురు (0.47%) ఉన్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అత్యధిక ఎయిడ్స్ మరణాలు నమోదయ్యాయి. అంటే ఇక్కడ 11,430 మంది చనిపోయారు. 2010తో పోల్చినప్పుడు 2023లో కొత్త ఇన్ఫెక్షన్లలో అత్యధిక తగ్గుదల ఆంధ్రప్రదేశ్లోనే కావడం (తగ్గుదల శాతం 76.19%) కొంత ఊరట.2025లో హెచ్.ఐ.వి. మళ్లీ పెచ్చరిల్లడానికి ఇవీ కారణాలు... ఈ ఏడాది 2025లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన అనేక చారిత్రక పరిణామాల వల్ల హెచ్.ఐ.వి. కార్యక్రమాలకు నిధుల సంక్షోభం ఎదురైంది. ఈ ఏడాది అమెరికా ప్రభుత్వం 430 కోట్ల డాలర్ల నిధుల కేటాయింపును ఆకస్మికంగా, ఏకపక్షంగా నిలిపివేయడం వల్ల... దిగువ ఆదాయ, అలాగే మధ్యస్థ ఆదాయ దేశాల్లో హెచ్ఐవి / ఎయిడ్స్ సేవలకు తీవ్రమైన అంతరాయం కలిగింది. అంతర్జాతీయ సంస్థ యుఎన్ ఎయిడ్స్ అంచనా ప్రకారం ఈ నిధులు శాశ్వతంగా నిలిచిపోతే 2029 నాటికి అదనంగా మరో 60 లక్షల కొత్త హెచ్ఐవి కొత్తకేసులు వచ్చే అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మంది ఎయిడ్స్ సంబంధిత జబ్బులతో మరణించే ప్రమాదం ఉంది. అంతేకాదు... హెచ్.ఐ.వి. రిస్క్ ఉన్న ప్రత్యేక సమూహాలకు చికిత్స అందిస్తూ ఎయిడ్స్ పై పోరాడే వారిని నేరస్తులుగా చూసే దేశాల సంఖ్య పెరిగింది. పురుష స్వలింగ సంబంధాలు, ట్రాన్స్ జెండర్లకు సామాజిక ఆమోదం లేకపోవడం, డ్రగ్స్ వాడకాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ కొన్ని దేశాల్లో కొత్తగా చేసిన కఠిన చట్టాల కారణంగా వారు తమ వ్యాధిని దాచుకోవడం, చికిత్స కోసం ముందుకు రాకపోవడంతో ఎయిడ్స్ సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉంది. దీనివల్ల ఈ వ్యాధి పీడితులకు ఆరోగ్య, వైద్య సేవలు అందించడమూ కష్టసాధ్యమవుతుంది. ఇదీ ఈ ఏడాది (2025) ప్రపంచ ఎయిడ్స్ డే నినాదం ‘సంక్షోభాన్ని అధిగమిస్తూ... కొత్త మార్గంలో పయనిస్తూ’ అన్నది (ఓవర్కమింగ్ డిజ్రప్షన్ – ట్రాన్స్ఫార్మింగ్ ద ఎయిడ్స్ రెస్పాన్స్) ఈ ఏడాది నినాదం. అంతర్జాతీయ వితరణ సంస్థలు తగినన్ని నిధులను ఇవ్వడం, ఈ వ్యాధి నివారణ కోసం కృషి చేస్తున్న కమ్యూనిటీలు కలిసి పనిచేయడం, మానవ సహజమైన లైంగిక ప్రవృత్తులను సానుభూతితో అర్థం చేసుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మానవులందరి హక్కులను పరిరక్షించడం, దేశాల నాయకత్వాలు నిబద్ధతతో వ్యవహరించడం, ఈ వ్యాధి తాలూకు మందులను అందరికీ అందుబాటులోకి తేవడం వంటి చర్యలతో ఈ వ్యాధిని వీలైనంతగా నివారించవచ్చు. అలాగే యౌవన ప్రాంగణంలోకి ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్న కొత్త తరాల వారికి ఈ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ... అందుబాటులో ఉన్న అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా సురక్షిత శృంగారం, కండోమ్ వాడకం గురించి విస్తృత ప్రచారం చేస్తే ఈ వ్యాధిని దాదాపుగా పూర్తిగా తుదముట్టించినంతగా నివారించవచ్చునన్నది ప్రముఖమైన వైద్య నిపుణులందరి మాట.కొత్త ఆవిష్కరణలతో పరిస్థితి కొంత ఆశాజనకంలెనాకపావిర్, కాబోటెగ్రావిర్ వంటి దీర్ఘకాలం పనిచేసే కొత్త ఇంజెక్షన్ మందులతో హెచ్.ఐ.వి. నివారణలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావచ్చు. ఏడాదిలో కేవలం రెండు సార్లు ఇంజెక్షన్లు తీసుకోవడంతోనే హెచ్ఐవి నివారణ సాధ్యమవుతుంది. దీంతో ప్రస్తుతం అత్యధిక కొత్త ఇన్ఫెక్షన్స్ వెలుగు చూస్తున్న రిస్క్ గ్రూపుల్లో నివారణ సులభతరమవుతుంది. అయితే వాటి ధరలు ప్రస్తుతం కాస్త ఎక్కువగా ఉన్నందున ఆ ధరలు తగ్గించి ప్రతి దేశంలోని ఆ సమూహాలకు ఈ ఇంజెక్షన్లను అందుబాటులోకి తేవడం అత్యవసరం.డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండి, ఎయిడ్స్ వ్యాధి నిపుణులు, కాకినాడ -
రూపాయి చాలు!
వరకట్నం మహమ్మారి కోరల్లో చిక్కుకుని అనేక కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి, అత్తింటి వేధింపులకు వధువుల బతుకులు బలవుతున్నాయి. సరిగ్గా అలాంటి పరిస్థితులలో.. అత్తింటివారు ఇచ్చిన రూ.31 లక్షల కట్నాన్ని ఒక వరుడు పెళ్లి వేదికపైనే తిరస్కరించడం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఆ గొప్ప మనసున్న వరుడే అవధేశ్ రానా. శభాష్ అవధేశ్ రానా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నగ్వా గ్రామానికి చెందిన అవధేశ్ రానా, షాహబుద్దీన్పూర్ గ్రామానికి చెందిన అదితి సింగ్ల వివాహం నవంబర్ 22న ముజఫర్నగర్లో జరిగింది. వివాహంలో ముఖ్య ఘట్టమైన గోరా తిలక్ (బహుమతులు ఇచ్చే వేడుక) సందర్భంగా వధువు అదితి కుటుంబ సభ్యులు వరుడికి రూ.31 లక్షల భారీ మొత్తాన్ని కట్నంగా సమరి్పంచడానికి సిద్ధమయ్యారు. నా మనస్సాక్షికి విరుద్ధం.. సరిగ్గా అప్పుడే.. అక్కడే అవధేశ్ ప్రకటించిన నిర్ణయం అతిథుల్ని నిశ్చేష్టుల్ని చేసింది. ‘క్షమించండి, ఈ డబ్బును నేను స్వీకరించలేను. కట్నం తీసుకోవడం మా సిద్ధాంతాలకు, నా మనస్సాక్షికి విరుద్ధం’.. అని అవదేశ్ స్పష్టం చేశాడు. వేలాది మంది అతిథులు హాజరైన ఆ శుభకార్యంలో, అవధేశ్ చేతులు జోడిస్తూ.. కట్నం మొత్తాన్ని వధువు కుటుంబానికి తిరిగి ఇచ్చేశాడు. ఈ అపూర్వ ఘట్టంతో పెళ్లి పందిరి మొత్తం ఒక్కసారిగా చప్పట్లతో మార్మోగిపోయింది.మా బంధం రూపాయితో మొదలైంది.. తన నిర్ణయం గురించి అవధేశ్ మాట్లాడుతూ.. ‘నేను కట్నాన్ని బలంగా వ్యతిరేకిస్తాను. ఇది పూర్తిగా తప్పు. ఈ దురాచారం సమాజం నుంచి పూర్తిగా అంతమవ్వాలి. ఒక తండ్రి తన కూతురి పెళ్లి కోసం జీవితాంతం కష్టపడటం లేదా అప్పులు చేయవలసిన అవసరం లేదు’.. అన్నాడు. ‘మా సంబంధం కేవలం రూపాయి విలువతో మొదలైంది. దానికి మించి నేను ఎలా తీసుకోగలను? రూపాయితో మొదలైంది, రూపాయి దగ్గరే ముగుస్తుంది’.. అని వ్యాఖ్యానించాడు. అవధేశ్ చర్య.. కేవలం నిరసన కాదు, అది దురాచారానికి వ్యతిరేకంగా వినిపించిన ధైర్యగీతం. ఈ తరం యువతరం ఆలోచనా విధానాన్ని మార్చేందుకు ఆయన తీసుకున్న ఆదర్శ నిర్ణయం పెళ్లి బంధానికి సరైన నిర్వచనం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ వెదురులో మంచుయుగపు గుట్టు
వెదురులో మురళి దాగుంటుందన్నది తెలిసిందే. అయితే మణిపూర్లోని అతి పురాతన వెదురు శిలాజాల్లో మాత్రం మన దేశపు మంచు యుగానికి సంబంధించిన పలు రహస్యాలే దాగున్నాయి! అంతేనా? భారత్తో పాటు ఆసియా ఖండపు వృక్షశాస్త్ర చరిత్ర గతినే అవి సమూలంగా మార్చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు...!అది అలాంటిలాంటి శిలాజం కాదు. ఏకంగా 37,000 ఏళ్లనాటి వెదురు తాలూకు అత్యంత అరుదైన శిలాజం. ఎందుకంత అరుదైనదీ అంటే వెదురు శిలాజ రూపు దాల్చడం కనాకష్టం. దాని లోపలంతా బోలుగా ఉండటమే అందుకు కారణం. దాంతో అతి త్వరగా కుళ్లి మట్టిలో కలిసిపోతుంది. అలాంటి వెదురు తాలూకు అతి పురాతన శిలాజాన్ని మణిపూర్లోని ఇంఫాల్ లోయ ప్రాంతంలో సైంటిస్టులు తాజాగా కనుగొన్నారు. అది ఇప్పటిదాకా వెల్లడించిన, ఇకపై జరిపే పరిశోధనల్లో బయటపెట్టబోయే రహస్యాలు భారత్తో పాటు ఆసియా వృక్షశాస్త్ర చరిత్రనే తిరగ రాయగలవని భావిస్తున్నారు. ఇంఫాల్ లోయ ప్రాంతంలో చిరాంగ్ నదీ తీరాన ఇసుక మేటలు అధికంగా ఉండే చోట ఈ వెదురు శిలాజాలు వెలుగు చూశాయి. ఆసియా ప్రాంతంలో మంచుయుగపు అత్యంత ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని వెదురు తన ఉనికిని కాపాడుకుందనేందుకు ఈ శిలాజాలు తిరుగులేని నిదర్శనమని సైంటిస్టులు చెబుతున్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ బృందంతో కలిసి బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్ (బీఎస్ఐపీ) సైంటిస్టులు ఈ శిలాజాలపై ముమ్మరంగా పలు పరిశోధనలు జరుపుతున్నారు. వాటి తాలూకు పలు భాగాలను ఒక్కొక్కటిగా దుర్భిణి వేసి మరీ పరిశీలిస్తున్నారు. నాటి ప్రతికూల పరిస్థితుల్లో ఉనికిని కాపాడుకునేందుకు అవి ఎలాంటి పద్ధతులను అవలంబించిందీ క్రమంగా వెలుగులోకి వస్తోందని వారు చెబుతున్నారు. శిలాజ రూపు దాల్చిన వెదురు జాతిని జెనస్ చిమొనోబాంబూసాగా గుర్తించారు. సహచరులు మాయమైనా... మంచుయుగం తాలూకు అతి ప్రతికూల పరిస్థితులకు తట్టుకోలేక ప్రపంచవ్యాప్తంగా చాలారకాల వెదురు జాతులు అంతర్ధానమైపోయాయి. యూరప్ మొదలుకుని అమెరికా ఖండాల దాకా ఇదే పరిస్థితి. అయినా మణిపూర్లోని ఈ జెనస్ జాతి తట్టుకుని నిలవడానికి కారణాలన్నింటినీ కనిపెట్టేందుకు సైంటిస్టుల బృందం అన్నిరకాలుగానూ ప్రయతి్నస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో శిలాజాల తాలూకు విడిభాగాలను ఒక్కొక్కటిగా మథిస్తోంది. ‘‘ఈశాన్య భారతంలోని అపార జీవవైవిధ్యం కారణంగా మంచుయుగపు ప్రభావం ఇక్కడ మరీ ఎక్కువగా పడి ఉండకపోవచ్చు. ఈ వెదురు జాతులు ఆ కష్టకాలాన్ని గట్టెక్కి మనుగడ సాగించేందుకు అదే కారణం కావచ్చు’’అన్న వాదనల్లోని నిజానిజాలను కూడా నిగ్గుదేల్చేందుకు వారు ప్రయతి్నస్తున్నారు. ఈ పరిశోధన వివరాలను పాలయోబోటనీ, పాలియాలజీ జర్నల్ రివ్యూలో ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్నాన యంత్రం
అధునాతన సాంకేతికత, ఆవిష్కరణలకు నిలయమైన జపాన్లో మరో వినూత్న సాధనం రూపుదిద్దుకుని విశ్వవిపణిలోకి అడుగుపెట్టింది. హాయిగా నచ్చిన సంగీతం వింటూ, సినిమా చూస్తూ కేవలం 15 నిమిషాల్లో అత్యంత శుభ్రంగా స్నానం పూర్తిచేయాలనుకునే వారి కోసం ‘ ఏ సైన్స్ కో’ సంస్థ ప్రపంచంలోనే తొలిసారిగా మానవ వాషింగ్ మెషీన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇటీవల ఒసాకా నగరంలో ‘ఎక్స్పో–2025’లోనూ దీని నమూనాను ప్రదర్శించగా ఇప్పుడిది మార్కెట్లోకి వచ్చింది. దీని ధర మూడు కోట్ల రూపాయలు.కష్టపడకుండా చక్కటి స్నానంఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా స్నానంకానిచ్చేలా ఈ వాషింగ్ మెషీన్ను డిజైన్చేశారు. చూడ్డానికి యుద్ధవిమాన కాక్పిట్లాగా తోచినా ఇది వాస్తవానికి పారదర్శక పదార్థంతో చేసిన ఒక పాడ్. 2.3 మీటర్ల పొడవైన ఈ పాడ్లో తల కాస్తంత ఎత్తులో ఉండేట్లు పడుకున్నాక పైన మూత మూసుకుంటుంది. సగం వరకు గోరువెచ్చని స్వచ్ఛమైన నీరు నిండాక అత్యంత వేగంతో నీరు శరీరమంతా చిమ్ముతుంది. వేగం ధాటికి చర్మం మీది మట్టి, మృతకణాలు చెల్లాచెదురవుతాయి. ఈ నీటికి బ్యాక్టీరియావంటి హానికారక సూక్ష్మజీవులను చంపేసే ఔషధ గుణముంది. అసౌకర్యంగా అనిపిస్తే మనసును ఆహ్లాదపరచడానికి ఎదురుగా ఎల్ఈడీ తెరలు సిద్ధంగా ఉంటాయి. నచ్చిన పాట, సినిమా, సంగీతం వెనువెంటనే వినే ఏర్పాట్లు ఉన్నాయి. శరీర ఉష్ణోగ్రతకు తగ్గట్లు నీటి వేడిశాతం మారుతుంది. తుంపర్లు సైతం తమ వంతు కృషిచేస్తూ స్నానంచేసే వ్యక్తి బడలికను పోగొడతాయి. అత్యంత సూక్ష్మ బుడగలు చర్మం మీది మృతకణాలు, చెడు రసాయనాలు, జిడ్డును మటుమాయం చేస్తాయి. ఈ మొత్తం స్నానపర్వం 15 నిమిషాల్లోనే ముగుస్తుంది. శరీరంలో ఏ భాగంలో ఇంకా మురికి ఉండిపోయిందో అప్పటికప్పుడు తనిఖీచేసే బయోమెట్రిక్ స్కానర్లను సైతం ఈ వాషింగ్ మెషీన్లో అమర్చారు. దీంతో అసమగ్రంగా స్నానం కానిచ్చేశామన్న భావన అస్సలు కలగదు. మూడింటి కలబోతస్నానం, స్పా, ఆరోగ్య స్కానింగ్.. ఇలా మూడింటి కలబోతగా తయారైన ఈ వాషింగ్ మెషీన్కు మిరాయ్ నింజెన్ సెంటకుకీ అని పేరు పెట్టారు. జపనీస్ భాషలో మిరాయ్ అంటే భవిష్యత్తు, నింజెన్ అంటే మనిషి, సెంటకుకీ అంటే శుభ్రపరచడం. పూర్తిస్థాయిలో ఆటోమేటిక్గా పనిచేసే వ్యక్తిగత స్నానగదిలా ఇప్పుడిది ఇంటర్నెట్లోనూ హల్చల్ చేస్తోంది. 3 కోట్లరూపాయలు పెట్టి కొనే వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా పెద్దసంఖ్యలో ఉన్నారని కంపెనీ అధికారప్రతినిధి సచికో మయీకురా చెప్పారు. విలాసవంత రిసార్ట్లు, లగ్జరీ హోటళ్లు, రెస్టారెంట్లు, వెల్నెస్ సెంటర్లు, సంపన్నులు దీనిని కొనేందుకు అమితాసక్తి కనబరుస్తున్నారని ఆమె వెల్లడించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అత్యవసరంగా ఏఐ స్కిల్స్
సాక్షి, స్పెషల్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న కొత్త టెక్నాలజీ. కంపెనీలూ ఈ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయి. జాబ్ మార్కెట్లో ఉద్యోగులు నిలదొక్కుకోవాలంటే కృత్రిమ మేధ నైపుణ్యాలను అందిపుచ్చుకోవాల్సిందే. అది కూడా ఇప్పటికిప్పుడే. ప్రధానంగా టెక్ రంగంలోని సిబ్బందికి ఈ ఆవశ్యకత ఏర్పడింది. ఏఐ స్కిల్స్ ఉన్నఫళంగా నేర్చుకోవాల్సిందేనా? జీసీసీ సొల్యూషన్స్ కంపెనీ ‘ఆన్సర్’.. తన గ్లోబల్ టాలెంట్ ప్లాట్ఫామ్ ‘టాలెంట్500’తో కలిసి రూపొందించిన ‘ఏఐ అడ్వాంటేజ్ సర్వే రిపోర్ట్–2025’ అవుననే చెబుతోంది.కృత్రిమ మేధ నైపుణ్యాలు తమ భవిష్యత్తుకు అనివార్యమైనవిగా టెక్ నిపుణులు భావిస్తున్నారని నివేదిక తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 70% కంటే ఎక్కువ మంది నిపుణులు రాబోయే మూడు నెలల్లో ఏఐ స్కిల్స్ను అభివృద్ధి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వేగంగా నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతోందని నివేదిక వివరించింది. సొంతంగా చొరవ.. పనిచేస్తున్న సంస్థలు అధికారికంగా ఇచ్చే శిక్షణ కోసం ఉద్యోగులు వేచిచూడటం లేదని నివేదిక తెలిపింది. చాలామంది టెకీలు యూట్యూబ్, సొంతంగా అభ్యాసం, ఆన్లైన్ కోర్సుల ద్వారా నైపుణ్యం పెంచుకుంటున్నారు. 53.7% మంది సొంత డబ్బు వెచి్చంచి నేర్చుకుంటున్నారు. అయితే, నాలుగింట ఒకవంతు మంది రూ.10 వేల కంటే ఎక్కువగా ఖర్చు చేస్తుండడం విశేషం. ‘ఏఐ నైపుణ్యాలు కెరీర్ను రూపొందిస్తాయని ఉద్యోగులకు తెలుసు. కాబట్టే వేగంగా ఈ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సొంతంగా చొరవ తీసుకుంటున్నారు. ప్రధానంగా జీసీసీలకు ఈ ఆవశ్యకత అసలైన ప్రయోజనం చేకూర్చనుంది. నేర్చుకోవడానికి ఆసక్తిగా, సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తి ఏఐ సామర్థ్యాలను ఉన్నతంగా నిర్మించడానికి సరైన పునాదిని సృష్టిస్తుంది. ఈ శక్తికి వెన్నంటి నిలిచినప్పుడు అది సంస్థకు నిజమైన బలంగా మారుతుంది’.. అని నివేదిక స్పష్టం చేసింది.ఎవరెవరు ఉన్నారంటే..భారత్లోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్లో (జీసీసీ) ఇంజనీరింగ్, ప్రోడక్ట్, క్యూఏ, డేటా, ఆపరేషన్స్, సపోర్ట్ వంటి విభాగాల్లో పనిచేస్తున్న 3,000 మందికి పైగా వృత్తి నిపుణులు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. వీరిలో బెంగళూరు నుంచి 48.5%, హైదరాబాద్ 22.2%, ఢిల్లీ ఎన్సీఆర్ నుంచి 14.3% మంది ఉన్నారు. మిగిలినవారు పుణే, ముంబై, చెన్నైకి చెందినవారు. సర్వేలో పాల్గొన్న వారిలో 35 ఏళ్లలోపు వారు 71% మంది ఉన్నారు. అయితే కోడింగ్, రీసెర్చ్, డేటా అనాలిసిస్ రంగాల్లో ఏఐ ప్రభావం అధికంగా ఉంది. 1–2 ఏళ్లలో తమ ఉద్యోగాల్లో ఏఐ చాలా మార్పులు తెస్తుందని అత్యధికుల భావన. -
అంగారకునిపై నేటికీ జీవం?
అంగారకుడు. పూర్తిగా రాళ్లమయం. ఎటు చూసినా పర్వతాలే. అయితే ఆ గ్రహంపైనా ఒకప్పుడు జీవం ఉండేదని సైంటిస్టులు గతంలోనే నిర్ధారించారు. అయితే వందల కోట్ల ఏళ్ల క్రితమే అది నామరూపాల్లేకుండా పోయిందన్నది వాళ్లు ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన మాట. అది నిజం కాదని, ఆ తర్వాత కూడా అంగారకునిపై జీవజాలం మనుగడ చాలాకాలం పాటు కొనసాగిందని తాజా పరిశోధన ఒకటి బల్లగుద్ది మరీ చెబుతోంది. ఇంకా చెప్పాల్సి వస్తే, అంగారకుని లోలోపలి పొరల్లో బహుశా ఇప్పుడు కూడా సూక్ష్మజీవజాలం ఉనికి బయటపడ్డా ఆశ్చర్యం లేదన్నది దాని సారాంశం!దిబ్బలే రాళ్లయిన వేళ...అత్యంత ఆసక్తికరంగా ఉన్న ఈ పరిశోధనకు న్యూయార్క్ యూనివర్సిటీ అబుదాబీ (ఎన్వైయూఏడీ) సైంటిస్టుల బృందం సారథ్యం వహించింది. ఈ అధ్యయన వివరాలను జియోఫిజికల్ జర్నల్లో ప్రచురించారు. పరిశోధనలో భాగంగా అంగారకునిపై నాసా తాలూకు క్యూరియాసిటీ రోవర్ పరిశోధనలు చేస్తున్న గాలే బిల ప్రాంతంలోని అతి ప్రాచీన ఇసుక దిబ్బలపై ప్రధానంగా దృష్టి సారించారు. లోపలి పొరల్లోని నీటి కారణంగా ఈ ప్రాంతమంతా కొన్ని వందల కోట్ల ఏళ్ల క్రితమే రాళ్లూ గుట్టలమయంగా మారిపోయింది. అంగారకుని మీది ఆ రాళ్ల స్వరూప స్వభావాలను యూఏఈ ఎడారుల్లో అటూ ఇటుగా అలాంటి పరిస్థితుల్లోనే ఏర్పడ్డ అటువంటివే అయిన రాళ్లతో పోల్చి చూశారు. గాలే బిలం సమీపంలోని పర్వత ప్రాంతం నుంచి భారీ నీటి ప్రవాహం ఇసుక దిబ్బల దిగువ పొరలకు ఇంకినట్టు ఈ పరిశోధనకు రీసెర్చ్ అసిస్టెంట్గా వ్యవహరించిన భారతీయ శాస్త్రవేత్త విఘ్నేశ్ కృష్ణమూర్తి వివరించారు. ‘‘ఆ జలం కొన్ని కోట్ల ఏళ్లపాటు వాటిని కిందినుంచి తడుపుతూ వచ్చింది. ఫలితంగా జిప్సం వంటి ఖనిజాలు పురుడు పోసుకున్నాయి. భూమిపై కూడా ఎడారి ప్రాంతాల్లో అత్యంత సహజంగా కనిపించే ఖనిజాల్లో జిప్సం ఒకటన్నది తెలిసిందే. మా పరిశోధనలో అంతిమంగా తేలింది ఒక్కటే. అంగారకుని తడి నేలలు ఉన్నపళంగా పొడిబారిపోలేదు. అక్కడి ఉపరితలం మీది నదీనదాలు, సరస్సుల వంటివన్నీ పూర్తిగా ఇంకిపోయిన తర్వాత కూడా ఎంతోకొంత జలధార అట్టడుగు పొరల్లో ఉంటూనే వచ్చింది. కనుక మా అంచనా ప్రకారం ఆ ప్రాంతాల్లో సూక్ష్మజీవజాలం నేటికీ ఉనికిలోనే ఉన్నా ఆశ్చర్యమేమీ లేదు’’ అని ఆయన చెప్పుకొచ్చారు. అదే గనక జరిగితే జిప్సం తదితర ఖనిజాలతో కూడిన గాలే బిలం వంటి ప్రాంతాలే ఆ జీవానికి ఆటపట్టులని తెలిపారు. కనుక భావి అంగారక యాత్రలన్నింటికీ సహజంగానే అలాంటి ప్రదేశాలే లక్ష్యాలుగా మారతాయని కృష్ణమూర్తి వివరించారు. పరిశోధనకు ఎన్వైయూఏడీ తాలూకు స్పేస్ ఎక్స్ప్లరేషన్ లేబొరేటరీ చీఫ్ దిమిత్రా అట్రీ సారథ్యం వహించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డైనోసార్ల నాటి చేప!
అవడానికి అది చేప మాత్రమే. కానీ దాని ఘనత అంతా ఇంతా కాదు. ఎందుకంటే పూర్వ చారిత్రక యుగం నుంచీ ఉనికిని కాపాడు కుంటూ వస్తున్న అత్యంత మొండి ఘటంగా తిరుగులేని రికార్డు దాని సొంతం. మరోలా చెప్పాలంటే అది డైనోసార్లతో రాసుకుపూసుకు తిరిగిన బాపతు. అంటే కనీసం కోటిన్నర ఏళ్ల నాటిదన్నమాట. అత్యంత కఠినమైన కాలపరీక్షకు కూడా తట్టుకుని నిలిచిన అంతటి మొండి జీవి ఉనికి కాస్తా ఇప్పుడు ప్రమాదంలో పడింది. కారణం? మనిషే. అతని పేరాశ పుణ్యమా అని అంతరించిపోయే జాబితాలో చేరిన ఆ చేప జాతిని ఎలాగైనా కాపాడేందుకు క్యూబా సైంటిస్టులు కాలంతో పోటీ పడి మరీ శ్రమిస్తు న్నారు...! అది క్యూబా తీరం వెంబడి పొడవుగా సాగిన ఉప్పునీటి కయ్యలోని జెప్టా చిత్తడి నేలల ప్రాంతం. ప్రాణాంతకమైన వ్యాధులను మోసుకు తిరిగే భయానకమైన దోమలకు పెట్టింది పేరు. అలాంటి ప్రాంతానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. డైనోసార్ల కాలంనుంచీ నేటిదా కా మనుగడలో ఉన్న ఒకే ఒక్క చేప జాతి అయిన మంజువారీలకు ప్రపంచంలోకెల్లా ఏకైక ఆవాసమది. పొ డవుగా, సన్నగా, నాజూకుగా, పదునైన పళ్లతో ఉండే ఈ చేప అంతరించే జాబితాలోని జీవజాలంలో ముందువరుసలో ఉంది. దాంతో పాతికేళ్ల క్రితమే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) తాలూకు అంతరించను న్న జీవుల జాబితాలోకి ఎక్కింది. శతాబ్దాల తరబడి మనిషి సాగించిన విచ్చలవిడి వేటే ఇందుకు ప్రధాన కారణం. దాంతో ఈ సహస్రాబ్దం తొలినాళ్లకల్ల మంజువారీ దాదాపుగా అంతరించిపోయినంత పనైంది! దాంతో ఒక దశలో దానిపై అంతా ఆశలు వదలుకున్నారు! కానీ ఉన్నట్టుండి మూడేళ్లకు అంటే 2003 ప్రాంతంలో జెప్టా చిత్తడినేలల్లో ఈ చేప జాతి మళ్లీ కనిపించింది. దాంతో క్యూబా సర్కారు కళ్లు తెరిచింది. దాన్ని ఎలాగైనా కాపాడేందుకు నడుం బిగించింది. ఈ గురుతర బా ధ్యతను అక్కడి ప్రఖ్యాత జీవ శాస్త్రవేత్త ఆంద్రెస్ హర్టాడో బృందానికి అప్పగించింది. ఆయన వెంటనే రంగంలోకి దిగారు. మంజువారీ చేపలను విడిగా పెంచేందుకు చిత్తడి నేలల సమీ పంలోనే యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రత్యేక హాచరీని ఏర్పాటు చేశారు. వాటి సంఖ్య హాచరీలో పట్టనంతగా పెరిగిన కొద్దీ పెద్ద వయసు చేపలను చిత్తడి కయ్యల్లోకి వదులుతూ వస్తున్నా రు. ఇప్పుడు స్థానిక మత్స్యకారులు తమకు మంజువారీలు తరచూ కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే, ‘‘అప్పుడే ఆనందించడానికి లేదు. మంజువారీలకు అవసరమైన ఆహారాన్ని బయటి పరిస్థితుల్లో అందుబాటులో ఉంచడం చాలా కష్టమైన పని. ఆ సవాలును పూర్తిగా అధిగమించినప్పుడే నిజమైన ఆశ ఉన్నట్టు. వీటిని అంతరించే జీవుల జాబితా నుంచి కొన్నాళ్ల తర్వాతైనా బయట పడేయడం సాధ్యమని చెప్ప గలమన్నట్టు’’అని వివరించారాయన. క్యూబాలోని చేపల న్నింట్లోకెల్లా మంజువారీ రత్నం వంటిదని గర్వంగా చెబు తారు ఆంద్రెస్. అందుకే ఈ చేపను స్థానికులు క్యూబన్ గార్ అని కూడా మురిపెంగా పిలుచుకుంటారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏఐ వెలిగించిన కిరణం!
అనగనగా ఓ చిన్నారి.. ఐస్క్రీమ్ కొనుక్కోవడానికి ఇంటి గడప దాటింది. అంతే.. తప్పిపోయింది. ఇంటి చిరునామా మరిచిపోయింది. దశాబ్దంన్నరకు పైగా సాగిన ఆ కన్నీటి కథకు, ఆధునిక సాంకేతికత అనూహ్యమైన ముగింపు పలికింది. దశాబ్దం క్రితం నమోదైన ఓ ‘మిస్సింగ్ గర్ల్’ ఫిర్యాదు, అత్యాధునిక ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికత... వెరసి ఓ పాకిస్తానీ యువతిని 17 ఏళ్ల తర్వాత తన కుటుంబంతో తిరిగి కలిపాయి. 2008లో ఇస్లామాబాద్లో తప్పిపోయిన కిరణ్ అనే బాలిక.. ఇప్పుడు 27 ఏళ్ల యువతిగా ఎదిగి కన్నవారి ఒడికి చేరుకుంది.‘నేను ఏడుస్తూ ఒంటరిగా ఉన్నాను. అప్పు డు ఎవరో ఒక దయామయి నన్ను ఇస్లామాబాద్లోని ఎధీ సెంటర్కు తీసుకెళ్లినట్టు గుర్తు. అప్పట్లో నాకు ఏమీ గుర్తు లేదు’.. అని కిరణ్ గుర్తు చేసుకుంది. కొద్ది రోజుల్లోనే, మానవతామూర్తి దివంగత అబ్దుల్ సత్తార్ ఎధీ భార్య బిల్కిస్ ఎధీ.. కిరణ్ను కరాచీకి తీసుకెళ్లారు. అప్పటి నుండి, ఎధీ ఆశ్రయంలో.. బిల్కిస్ సంరక్షణలో కిరణ్ పెరిగింది. కిరణ్ తల్లిదండ్రుల ఆచూకీ కోసం ఇస్లామాబాద్కు పలుమార్లు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఎథీ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.పట్టు వదలని ‘ఎధీ’ ప్రయత్నంఎధీ ఫౌండేషన్ ప్రస్తుత చైర్పర్సన్ ఫైసల్ ఎధీ భార్య సభా ఫైసల్ ఎధీ మాట్లాడుతూ.. కిరణ్ తల్లిదండ్రులను గుర్తించడానికి ఇస్లామాబాద్కు ఎన్నిసార్లు వెళ్లినా ఫలితం దక్కలేదన్నారు. ఆశలు సన్నగిల్లిన సమయంలో, ఫౌండేషన్ ఈ ఏడాది మొదట్లో పంజాబ్లో ’సేఫ్ సిటీ ప్రాజెక్ట్’లో పనిచేస్తున్న సైబర్ సెక్యూరిటీ నిపుణుడు నబీల్ అహ్మద్ను సంప్రదించింది. ‘మేము అతనికి కిరణ్ ప్రస్తుత ఫొటోలు, ఆమె బాల్యం గురించి తెలిసిన స్వల్ప సమాచారాన్ని అందజేశాం’.. అని సభా వివరించారు. కేసును సవాలుగా తీసుకున్న నబీల్, ఇస్లామాబాద్ పోలీస్ స్టేషన్లో దశాబ్దం క్రితం నమోదైన ‘మిస్సింగ్ గర్ల్’ రిపోర్ట్ను గుర్తించారు. ఆ రిపోర్ట్లోని పాత ఫొటోలు, కిరణ్ ప్రస్తుత ఫొటోలను, అత్యాధునిక ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్, ట్రాకింగ్ సాఫ్ట్వేర్ల సహాయంతో విశ్లేషించారు. పాత రూపానికి, ప్రస్తుత రూపానికి పోలికలను ఏఐ అత్యంత కచి్చతత్వంతో అందించడంతో, కిరణ్ కుటుంబాన్ని గుర్తించడం సాధ్యమైంది. నా కూతుర్ని చూస్తాననుకోలేదు టైలర్గా పనిచేసే అబ్దుల్ మజీద్, తానే కిరణ్ తండ్రినని ధ్రువీకరిస్తూ కరాచీకి చేరుకున్నారు. ‘కిరణ్ ఫొటోలను పత్రికల్లో వేయించినా ప్రయోజనం లేకుండా పోయింది. నా కూతురిని చూస్తానని ఆశ వదులుకున్నాను’.. అని మజీద్ భావోద్వేగానికి లోనయ్యారు. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అధికారులు తనను సంప్ర దించినప్పుడు ఆ ఆనందాన్ని వరి్ణంచలేనని తెలిపారు. ‘ఇక్కడి నా కుటుంబ సభ్యులను (ఎధీ ఆశ్రయం) వదిలి వెళ్లడం బాధగా ఉన్నా, బిల్కిస్ ఆపాకు నేను ఎప్పటికీ కృతజు్ఞరాలిని’.. అని కిరణ్ సంతోషంగా వీడ్కోలు పలికింది. ఏఐ సాంకేతికత సాయంతో ఎధీ ఆశ్రయం నుండి.. తన కుటుంబానికి చేరిన అయిదో యువతి కిరణ్ కావడం విశేషం. కాలం చెరిపేసిన గతాన్ని, ఏఐ సాంకేతికత చెక్కు చెదరకుండా తిరిగి లిఖించింది... ఇది సైన్స్, సెంటిమెంట్ మేళవించిన అద్భుతం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విపత్తుల 'వైపరీత్యం'..
కరువు, వరదలు, తుపాన్లు, తెగుళ్లు, వాతావరణ మార్పులు వంటి విపత్తులు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఒక్క భారత్కే కాదు ప్రపంచవ్యాప్తంగా రైతన్నలపాలిట ఇవి శాపంగా మారాయి. గడిచిన 33 ఏళ్లలో అంతర్జాతీయంగా ఈ విపత్తులు రూ.2,88,99,900 కోట్ల మేర వ్యవసాయ నష్టాలను కలిగించాయని అంచనా. అంటే ఏటా రూ.8,75,754 కోట్లు. ఇది ప్రపంచ వ్యవసాయ జీడీపీలో దాదాపు 4 శాతం అన్నమాట. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) వ్యవసాయం, ఆహార భద్రతపై విపత్తుల ప్రభావం–2025 పేరుతో రూపొందించిన కొత్త నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 1991–2023 మధ్య విపత్తుల కారణంగా జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఈ కాలంలో ఊహలకు అందనంతగా 460 కోట్ల టన్నుల తృణధాన్యాలు, 280 కోట్ల టన్నుల పండ్లు, కూరగాయలు, 90 కోట్ల టన్నుల మాంసం, పాల ఉత్పత్తులు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ నష్టాలు రోజువారీ తలసరి 320 కిలో కేలరీల తగ్గింపునకు దారితీశాయి. అంటే సగటు శక్తి అవసరాల్లో 13–16 శాతం అన్నమాట. ప్రపంచ నష్టాల్లో ఆసియా అత్యధికంగా 47 శాతం వాటాతో ముందు వరుసలో ఉంది. మొత్తం రూ.1,35,82,953 కోట్ల నష్టం మూటగట్టుకుంది. ఉపాధి, ఆదాయంలో వ్యవసాయం గణనీయమైన వాటాను కలిగి ఉన్న ఆర్థిక వ్యవస్థల్లో ఈ నష్టాలు ఆహార భద్రత, గ్రామీణ స్థిరత్వానికి తీవ్ర పరిణామాలను కలిగిస్తాయి. మత్స్య సంపద సైతం..యూఎస్ఏ 22 శాతం లేదా రూ.63.5 లక్షల కోట్ల నష్టాలతో రెండవ స్థానంలో ఉంది. తరచూ వచ్చే కరువులు, తుపాన్లు, అలాగే తీవ్ర ఉష్ణోగ్రతలు ఇందుకు కారణం. రూ.54 లక్షల కోట్ల నష్టంతో ఆఫ్రికా టాప్–3లో చోటు సంపాదించింది. విపత్తుల కారణంగా వ్యవసాయ జీడీపీలో 7.4 శాతం ఆఫ్రికా కోల్పోతోంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే అతిపెద్ద భారం ఆఫ్రికాకే. ఫిజీ, మాల్దీవులు, జమైకా, క్యూబా వంటి స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ (ఎస్ఐడీఎస్) తుపాన్లు, వరదలు, సముద్ర మట్టం పెరుగుదల వంటి విపత్తులకు ప్రపంచంలోనే అత్యంత ప్రభావితమయ్యే దేశాల్లో ఒకటిగా ఉన్నాయి. 1985–2022 మధ్య సముద్ర వేడి గాలులు రూ.58,509 కోట్ల నష్టాలను కలిగించాయి. ఇది ప్రపంచ మత్స్య సంపదలో 15 శాతం ప్రభావితం చేసింది. మత్స్య, ఆక్వాకల్చర్ రంగం 50 కోట్ల మంది ప్రజల జీవనోపాధికి మద్దతు ఇస్తోంది. విప్లవాత్మక మార్పులు.. కరువులు, వరదలు మొదలుకుని తెగుళ్లు, వేడి గాలుల వరకు.. ఈ ప్రకృతి విపత్తులు ఆహార ఉత్పత్తి, జీవనోపాధి, పోషకాహారాన్ని దెబ్బతీస్తున్నాయి. విపత్తుల వల్ల తలెత్తే సంక్షోభం నుంచి వ్యవసాయ ఆహార వ్యవస్థలను గట్టెక్కించడానికి మాత్రమే డిజిటల్ ఆవిష్కరణలు పరిమితం కాలేదు.ముందస్తు చర్యలతో డేటా ఆధారిత స్థితిస్థాపకత నిర్మాణానికి మారడంలో సాయపడుతున్నాయి. ప్రమాదాలను పర్యవేక్షించడం, ముందస్తు హెచ్చరికలను అందించడం, రైతులు వేగంగా నిర్ణయం తీసుకోవడంలో డిజిటల్ టెక్నాలజీలు ఇప్పటికే విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయని నివేదిక వివరించింది. గేమ్ చేంజర్గా.. వ్యవసాయ విపత్తు ప్రమాదాలను తగ్గించే విషయంలో డిజిటల్ వినియోగం గేమ్ చేంజర్గా నిలిచిందని ఎఫ్ఏఓ నివేదిక కితాబిచి్చంది. కృత్రిమ మేధస్సు (ఏఐ), రిమోట్ సెన్సింగ్, మొబైల్ కనెక్టివిటీ, డ్రోన్స్, సెన్సార్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాధనాలు ఇప్పుడు రైతులకు కావాల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వేగంగా అందిస్తున్నాయని తెలిపింది. ఇవి ముందస్తు హెచ్చరిక, సలహా సేవలు, బీమా, ముందస్తు చర్యలను మెరుగుపరుస్తున్నాయని వెల్లడించింది. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (జీఐఈడబ్ల్యూఎస్) వంటి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు పెట్టుబడి పెట్టిన ప్రతి డాలర్కు ఏడు డాలర్ల వరకు రాబడిని ఇవ్వగలవని నివేదిక తెలిపింది. -
కొల్లేరుకు అతిథులొచ్చారు!
కైకలూరు: శీతాకాలపు విడిది పక్షుల కిలకిలారావాలతో కొల్లేరు కళకళలాడుతోంది. లక్షల కిలోమీటర్ల దూరం నుంచి తన రెక్కల చప్పుళ్లతో కొల్లేరుకు విదేశీ అతిథి పక్షులు వచ్చేశాయ్. ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కొల్లేరు పక్షుల వీక్షణకు అనువైన కాలం. ఈ ఏడాది ఎక్కువ మంది పర్యాటకులు కొల్లేరుకు విచ్చేస్తారని అటవీ శాఖ అంచనా వేస్తోంది. సర్వేల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 482 పక్షి జాతులు ఉన్నాయి. సింహభాగం 210 పక్షి జాతులు కొల్లేరులో సంచరిస్తాయి. కొల్లేరు ప్రాంతానికి రష్యా, బ్రిటన్, సైబీరియా, బంగ్లాదేశ్, నైజీరియా, ఆ్రస్టేలియా, శ్రీలంక తదితర 29 దేశాల నుంచి 71 జాతులకు చెందిన వలస జాతి పక్షులు 1.20 లక్షలు వస్తాయని అంచనా. ప్రపంచంలో పక్షి జాతులు 11,145 ఉండగా, భారతదేశంలో 1,378 ఉన్నాయి. భారతదేశ పక్షి జాతుల వాటా 12.3 శాతంగా ఉంది. కొల్లేరులో స్వదేశీ, విదేశీ అన్ని పక్షులూ కలిపి 4 లక్షల వరకు శీతాకాలంలో విహరిస్తాయి. పక్షుల అత్తారిల్లు కొల్లేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో రామ్సార్ సదస్సు గుర్తించిన ఏకైక చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు. దీని విస్తీర్ణం 2,22,300 ఎకరాలు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించింది. కొల్లేరు 5వ కాంటూరు వరకు 77,135 ఎకరాలను కొల్లేరు అభయారణ్యంగా గుర్తించారు. ఇరు జిల్లాల్లో ఆటపాక, మాధవాపురం పక్షుల విహార కేంద్రాలు ప్రసిద్ధమైనవి. ఏటా శీతాకాలంలో విదేశీ పక్షులు ఇక్కడ గూళ్లు కట్టుకుని సంతానోత్పత్తితో మార్చి మొదటి వారంలో పుట్టింటికి వెళతాయి. కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రంలో పెలికాన్ పక్షులు అధికంగా రావడంతో దీనికి పెలికాన్ ప్యారడైజ్గా నామకరణ చేశారు. బార్ టెయిల్డ్ గాడ్విట్ నిరి్వరామంగా అత్యధిక దూరం ప్రయాణించే పక్షి బార్ టెయిల్డ్ గాడ్విట్. ఈ పక్షి ఎక్కడా ఆగకుండా 11 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇవి కొల్లేరు అభయారణ్య ప్రాంతానికి ఏటా వస్తాయి.ఆర్కిటిక్ టర్న్ అత్యధిక దూరం వలస పోయే పక్షి ఆర్కిటిక్ టర్న్. ఏకంగా 12,200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఎనిమిదిన్నర రోజుల్లోనే చేరుకుంటుంది. అలస్కా నుంచి న్యూజిలాండ్కు వలస వెళ్తుంది.బార్ హెడెడ్ గీస్ ఎక్కువ ఎత్తున ఎగిరే వలస పక్షి బాతు జాతికి చెందిన బార్ హెడెడ్ గీస్. ఇది సముద్రమట్టానికి దాదాపు 8.8 కిలోమీటర్ల ఎత్తున ఎగురుతుంది. ఈ జాతికి చెందిన పక్షులు హిమాలయాల నుంచి ప్రయాణించి, భారత భూభాగంలోని చిలుకా, పులికాట్ తదితర సరస్సులకు వస్తాయి. గ్రేట్ స్నైప్ అత్యధిక వేగంతో ప్రయాణించే వలస పక్షి గ్రేట్ స్నైప్, ఈ పక్షి గంటకు 96.5 కిలోమీటర్ల వేగంతో దాదాపు 6,500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీనిని పరికరాలతో వీక్షించడం కూడా కష్టం.కొల్లేరుకు ప్రతి ఏటా వచ్చే విదేశీ వలస పక్షులు.. నార్తరన్ పిన్టైల్ (సూది తోక బాతు), రెడ్ క్రిస్టడ్ పోచర్ట్ (ఎర్రతల చిలువ), కామన్ శాండ్ పైపర్ (ఉల్లంకి పిట్ట), పసిఫిక్ గోల్డెన్ స్లోవర్ (బంగారు ఉల్లంకి), కామన్ రెడ్ షాంక్ (ఎర్రకాళ్ల ఉల్లంక్), బ్రాహ్మణి షెల్ డక్(బాపన బాతు), గ్రేట్ వైట్ పెలికాన్ (తెల్ల చిలుక బాతు), బ్లాక్ క్యాప్డ్ కింగ్ఫిషర్(నల్ల తల బుచ్చిగాడు), గుల్ బిల్డ్ టర్న్(గౌరి కాకి ముక్కు రేవుపిట్ట), కాస్పియన్ టర్న్(సముద్రపు కాకి), గ్రేటర్ శాండ్ ప్లోవర్(పెద్ద ఇసుక ఉల్లంకి), రూఫ్ (ఈల వేసే పెద్ద చిలువ), మార్స్ శాండ్పైపర్ (చిత్తడి ఉల్లంకి) వంటివి దాదాపు 71 జాతులు ఉన్నట్టు గుర్తించారు. పక్షులకు ఎల్లలుండవు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పిట్టలకు ఎల్లలుండవు. శీతాకాలంలో హిమాలయాలకు దూరంగా నార్తరన్ దేశాలు మంచుతో ఉంటా యి. దీంతో ఆహారం కోసం పక్షులు వలస వస్తాయి. చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరు వీటికి అనువైన ప్రాంతం. ఈ ప్రాంతంలో కాలుష్యం కారణంగా వలస పక్షులు తగ్గుతున్నాయి. చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యతగా ఉండాలి. – శ్రీరామ్రెడ్డి, తెలుగు రాష్ట్రాల ఈ–బర్డ్ సమీక్షకుడు, హైదరాబాదు పక్షులను ప్రేమించాలి పక్షులను నేస్తాలుగా భావించి ఆదరించాలి. కొల్లేరు వాతావరణం అనుకూలంగా ఉండటంతో పక్షులు వలస వస్తున్నాయి. అటవీ శాఖ పక్షుల రక్షణకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్ చివరన ఏషియన్ వాటర్ బర్డ్స్ సెన్సస్(ఏడబ్ల్యూసీ) చేయాలని భావిస్తున్నాం. ఏలూరు జిల్లాలో ఆటపాక, మాధవాపురంలో పక్షుల విహార కేంద్రాలను అభివృద్ధి చేశాం. కొల్లేరు పక్షుల వీక్షణకు ఇదే అనువైన సమయం. – బి.విజయ, జిల్లా అటవీశాఖ అధికారి, ఏలూరు -
స్క్రీన్పై 'బ్యాన్'
ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించారు. వచ్చే డిసెంబర్ 10 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తోంది. వీరు కొత్తగా సామాజిక మాధ్యమాల ఖాతాలు తెరవడానికి వీల్లేదు. ఇప్పటికే ఉంటే అవి రద్దు అవుతాయి. ఈ బిల్లుకు 2024 నవంబర్ 28న పార్లమెంట్ ఆమోదం తెలిపింది. తద్వారా 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ప్రపంచంలో నిషేధాన్ని ప్రకటించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా అవతరించింది. ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చింది. – సాక్షి, స్పెషల్ డెస్క్సామాజిక మాధ్యమాలతో పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. వీటిలో ఉండే కంటెంట్ పిల్లల ఆరోగ్యం, శ్రేయస్సుకు హాని కలిగిస్తోంది. పిల్లలు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా నిషేధానికి శ్రీకారం చుట్టినట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం చెబుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం చేపట్టిన ఒక అధ్యయనంలో 10–15 సంవత్సరాల వయసున్న పిల్లల్లో 96% మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. వీరిలో 10 మందిలో ఏడుగురు హానికరమైన కంటెంట్, వేధింపులకు గురయ్యారని తేలింది.నిషేధం బాటలో మరిన్ని..ఇప్పటికే చాలా దేశాలు పాఠశాలల్లో స్మార్ట్ఫోన్ల వినియోగాన్ని నిషేధించాయి. తాజాగా సోషల్ మీడియా బ్యాన్ విషయంలో ఆస్ట్రేలియా బాటలో మరిన్ని దేశాలు ఉన్నాయి. పదిహేనేళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించనున్నట్టు డెన్మార్క్ ప్రకటించింది. అయితే 13, ఆపై వయసున్న పిల్లలు వీటిని వినియోగించాలంటే తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి.పిల్లల దైనందిన జీవితం, బాల్యాన్ని రూపొందించడంలో హానికరమైన కంటెంట్, వాణిజ్య ఆసక్తులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న డిజిటల్ ప్రపంచంలో వారిని ఒంటరిగా వదిలివేయకూడదని ప్రభుత్వం వ్యాఖ్యానించింది. పదహారేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియా వాడకుండా వచ్చే ఏడాది నుంచి అడ్డుకట్ట వేయనున్నట్టు మలేషియా వెల్లడించింది. హానికారక కంటెంట్ 18 ఏళ్లలోపు పిల్లలకు చేరకుండా బ్రిటిష్ ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్ను యూకే అమలు చేస్తోంది. పదిహేనేళ్లలోపు పిల్లలను సామాజిక మాధ్యమాల నుంచి దూరం చేసేందుకు నార్వే ఓ చట్టాన్ని తీసుకొస్తోంది. న్యూజిలాండ్, ఫ్రాన్స్, పాకిస్తాన్ సైతం ఈ బాటలో ఉంది. ‘15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు తమ పిల్లల రోజువారీ స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయాలి’.. అని నెదర్లాండ్స్ ప్రభుత్వం సూచించింది.కోట్లలో యూజర్లు..ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, యూట్యూబ్, స్నాప్చాట్.. వేదిక ఏదైనా ఈ సామాజిక మాధ్యమాలను వినియోగించేవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 566 కోట్లు ఉన్నట్టు అంచనా. స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను ఉపయోగిస్తున్నారు. బడికి వెళ్లే పిల్లలూ ఇందుకు మినహాయింపు కాదు. ఒక్కొక్క దేశాన్నిబట్టి 13–17 ఏళ్ల వయసున్న పిల్లల్లో 95% వరకు, 8–12 ఏళ్లవారిలో 40% మందికి సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు.అత్యధికుల మాట అదే..ఫ్రాన్స్కు చెందిన మార్కెట్ రిసర్చ్ కంపెనీ ఇప్సాస్ ఈ ఏడాది జూన్–జూలైలో 30 దేశాల్లో సర్వే చేపట్టింది. 18–75 ఏళ్ల వయసున్న 23,700 మంది ఇందులో పాలుపంచుకున్నారు. ఇప్సాస్ ఎడ్యుకేషన్ మానిటర్–2025 ప్రకారం.. 14 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలంటూ 71% మంది తమ గళం వినిపించారు. గత ఏడాది సర్వేలో 65% మంది ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇండోనేషియాలో 87% మంది, ఫ్రాన్స్ 85, ఆస్ట్రేలియాలో 79% మంది బ్యాన్వైపు మొగ్గు చూపారు. అయితే భారత్లో గత ఏడాది 73% మంది ఈ అంశాన్ని ఏకీభవిస్తే.. 2025లో ఈ సంఖ్య 68%కి వచ్చి చేరింది. -
శని వలయాలు ‘కనిపించుట’ లేదు!
శని. అందమైన వలయాలతో సౌరకుటుంబం మొత్తంలోనూ అత్యంత ప్రత్యేకంగా కన్పించే గ్రహం. అది కాస్తా తాజాగా భారీ మార్పుచేర్పులకు లోనవుతోంది. అంటే మరేమీ లేదు. శని గ్రహం చుట్టూ అందంగా చుట్టుకుని కన్పించే వలయాలు దాదాపుగా ‘మటుమాయం’అయిపోతున్నాయి! ఆదివారం రాత్రి వినువీధిలోకి విహంగవీక్షణం చేసిన ఔత్సాహికులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామం కొట్టొచ్చినట్టుగా కన్పించి ఆశ్చర్యపరిచింది. అయితే అంతమాత్రాన శని గ్రహానికి నిజంగానే ఏదో ‘శని’దాపురించిందని మనమెవరమూ ఆందోళన పడాల్సిన పనేమీ లేదట! ఎందుకంటే దాని వలయాలు నిజానికి ఎటూ మాయం కాలేదని ఖగోళ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ‘‘అది కేవలం మన దృక్ భ్రాంతి మాత్రమే. ఎందుకంటే ప్రస్తుతం శని భూమికి ఏటవాలు కోణంలో ఉంది. దాంతో దాని తాలూకు వలయాలు భూమి నుంచి కన్పించడం తాత్కాలికంగా దాదాపు అసాధ్యంగా మారింది. మరీ ముఖ్యంగా ఔత్సాహికులు ఉపయోగించే చిన్నాచితకా టెలిస్కోపుల సాయంతో వాటిని చూడటం కనాకష్టం’’అని వారు వివరించారు. ‘రింగ్’క్రాసింగ్! ప్రస్తుతం భూమి నుంచి చూస్తే శని వలయాలు మాయమైనట్టు కన్పించేందుకు రింగ్ ప్లేన్ క్రాసింగ్గా పేర్కొనే అరుదైన దృగ్విషయమే కారణమట. ఈ సమయంలో భూమి సరిగ్గా శని గ్రహం తాలూకు వలయాల తలానికి సమాంతరంగా పయనిస్తుందని సైంటిస్టులు చెప్పుకొచ్చారు. దాంతో ఈ సమయంలో భూమి నుంచి చూస్తే ఆ వలయాలు పైనుంచో, కిందినుంచో కాకుండా సరిగ్గా ఒక పక్కనుంచి మాత్రమే కన్పిస్తాయి. దాంతో అవక్కడ లేవనే అనిపిస్తుంది. అదీ సంగతి! ఎంత రింగ్ క్రాసింగ్ ప్రభావమైనా సరే, అంత పెద్ద శని గ్రహాన్ని పాముల మాదిరిగా చుట్ట చుట్టుకుని ఉండే అందాల వలయాలు కన్పించకుండా పోవడం ఏమిటని అనిపించడం సహజమే. కాకపోతే అందుకు సహేతుకమైన కారణం కూడా లేకపోలేదని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘శని వలయాలు ఏకంగా 2.8 లక్షల కిలోమీటర్ల వ్యాసంతో కూడుకుని ఉంటాయి. కానీ అంతా చేస్తే వాటి మందం మాత్రం కేవలం కొన్ని పదుల మీటర్లే! పైగా ఈ దశలో వాటినుంచి భూమికేసి వెలువడే సూర్యరశ్మి కూడా అత్యంత స్వల్పం. వెరసి సుదూరంలో ఉన్న మన భూ గ్రహం నుంచి వాటిని సమాంతరంగా, అంటే ఒక పక్కగా చూసినప్పుడు దాదాపుగా కన్పించవు. దాంతో అవసలు లేవనే అన్పిస్తుంది’’అని వివరించారు. సమాన వంపు కోణం! శని అక్షం కూడా భూ అక్షం మాదిరిగానే సరిగ్గా 26.7 డిగ్రీల కోణంలో వంపు తిరిగి ఉంటుంది. దీనికి తోడు సూర్యుని చుట్టూ పరిభ్రమించేందుకు శనికి ఏకంగా 29.4 ఏళ్లు పడుతుంది. దాంతో రెండు గ్రహాల పరిభ్రమణ క్రమంలో భూమి నుంచి మనం శని వలయాలను చూసే కోణం విపరీతంగా మారుతూ ఉంటుంది. ఆ క్రమంలో కొన్నేళ్ల పాటు అవి సాధారణ టెలిస్కోపుల నుంచి కూడా మనకు కొట్టొచ్చినట్టుగా కనువిందు చేస్తాయి. కాకపోతే ప్రతి 13 నుంచి 15 ఏళ్లకోసారి మాత్రం కొంతకాలం పాటు ఇలా అసలు కన్పించకుండా పోతాయి. అసలున్నాయా, లేవా అనిపిస్తాయి. ఈ ఏడాది మార్చి 23న తొలిసారి రింగ్ప్లేన్ క్రాసింగ్ జరిగింది. కానీ అది ఉదయం పూట కావడంతో భూమి నుంచి దాదాపుగా కన్పించకుండాపోయింది. తాజాగా ఆదివారం మాత్రం ఈ పరిణామం సాయం సమయంలో జరగడంతో అందరికీ కనువిందు చేసిందన్నమాట. మరో ఐదేళ్లకల్లా, అంటే 2030 నాటికి శని వలయాలు భూమి నుంచి ఎప్పట్లా మళ్లీ పూర్తిస్థాయిలో కనువిందు చేయనున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాలీవుడ్ హీ మేన్
‘ధరమ్ జీ’ ‘ధరమ్ పాజీ’ ‘వీరూ’ ‘ధరమ్ వీర్’... అంటూ ఇండస్ట్రీ, ప్రేక్షకులూ యాభై ఏళ్లుగా ప్రేమగా పిలుచుకున్న బాలీవుడ్ హీమేన్ ధర్మేంద్ర కన్నుమూశారు. రొమాంటిక్ సినిమాలతో మొదలు యాక్షన్ సినిమాల వరకు అన్నీ చేసి ‘సకల నటనా వల్లభుడు’ అనిపించుకున్న ధర్మేంద్ర మృతితో ఒక శకం ముగిసింది.ధర్మేంద్ర గారూ... దేశానికి అమితాబ్ మంచి హెయిర్ స్టయిల్ ఇచ్చాడు. రాజేష్ ఖన్నా ఫ్యాషనబుల్ కుర్తా ఇచ్చాడు. మిథున్ డిస్కో డాన్స్ ఇచ్చాడు. మీరేం ఇచ్చారు?’ ధర్మేంద్ర ఒక నిమిషం పాటు మౌనంగా ఉండి సమాధానం ఇచ్చారు. ‘ఆరోగ్యం ఇచ్చాను. నన్ను చూసి దేశంలో ఎందరో యువకులు జిమ్ వైపు నడిచారు. నేను దేశానికి కండ ఇచ్చాను. అంతకు మించింది ఏముంది?’13 ఏళ్ల పిల్లవాడుగా ధర్మేంద్ర ఉన్నప్పుడు లూథియానా మినర్వా థియేటర్లో ‘షహీద్’ అనే సినిమా చూశాడు. అందులో ఒకతను ‘వతన్ కే రాహ్ మే వతన్ కే నౌజవాన్ షహీద్ హో’... అని చేతిలో జెండా పట్టుకుని పాడుతున్నాడు. అతణ్ణి హీరో అంటారని, అతని పేరు దిలీప్ కుమార్ అని ధర్మేంద్రకు తెలియదు. కాని థియేటర్ నుంచి బయటకు వచ్చే సమయానికి ఒకటే నిశ్చయించుకున్నాడు– ‘నేను అతనిలాగే మా ఊరి థియేటర్లో తెర మీద కనిపిస్తా’.అది ఏ సమయమో. ఆ మాటను ఏ నక్షత్రాలు విన్నాయో.ధర్మేంద్ర తండ్రి స్కూల్ టీచర్. పెద్ద కొడుకు ధర్మేంద్ర తన మార్గంలో నడిచి ప్రొఫెసర్ కావాలని ఆయనకు ఉండేది. ధర్మేంద్రకు చదువు వంటబట్టలేదు. పైగా సినిమా పురుగు కుట్టింది. దాంతో క్లాసులో ఏమీ వినలేక, చెప్పలేక తండ్రి చేతిలో రోజూ తిట్లే. ఇంటికి వచ్చి తల్లితో ‘నన్ను స్కూల్కు పంపకు. నాన్న నన్ను మిగిలిన పిల్లల కంటే ఎక్కువ తిడుతున్నాడు’ అని ఫిర్యాదు చేసేవాడు. మొత్తానికి మెట్రిక్తో చదువు ఆగి, రైల్వే శాఖలో క్లర్క్ ఉద్యోగం దొరికి, 19 ఏళ్లకు పెళ్లి కూడా అయిపోయింది. కాని అతణ్ణి వెండితెర పిలుస్తూ ఉంది. రోజూ అతడి బాధ చూసిన తల్లి ‘నీకు అంతగా నటించాలని ఉంటే ఒక అర్జీ పడేయొచ్చు కదరా’ అంది అమాయకంగా. ఉద్యోగానికి అర్జీగానీ హీరో కావడానికి అర్జీ ఉంటుందా? ఏమో... అర్జీ పెట్టాలేమో అనుకుంటున్న ధర్మేంద్రకు అప్పుడే ‘ఫిల్మ్ఫేర్ టాలెంట్ హంట్’ ప్రకటన పేపర్లో కనిపించింది.బిమల్ రాయ్, గురుదత్ల పర్యవేక్షణలో కొత్త నటీనటుల అన్వేషణ. అమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చి అప్పటికప్పుడు ‘మలేర్కోట్లా’ అనే టౌన్కు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాడు. కారణం ఫొటో స్టూడియో అక్కడే ఉంది. అక్కడ జాన్ మహమ్మద్ అనే ఫొటోగ్రాఫర్తో ‘నన్ను దిలీప్కుమార్లా ఫొటో తియ్యి’ అనంటే అతను అంతకన్నా అందంగా ఫొటో తీశాడు. వెంటనే బొంబాయి నుంచి పిలుపు వచ్చింది. మహా దర్శకులైన బిమల్రాయ్, గురుదత్ స్క్రీన్ టెస్ట్ చేశారు. గురుదత్ ఏ సినిమా ఆఫర్ చేయలేదుగానీ బిమల్రాయ్ ‘నీకు వేషం ఇస్తున్నా’ అన్నాడు. సినిమా పేరు ‘బందినీ’.సినిమా రంగంలో ఇదిగో అంటే ఆర్నెల్లు. ‘బందినీ’ నిర్మాణం లేటయ్యింది. ఈలోపు ధర్మేంద్రకు పస్తులు మొదలయ్యాయి. బిమల్రాయ్ బుక్ చేసిన నటుడు కాబట్టి ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ (1960) అనే సినిమాలో హీరోగా 51 రూపాయల అడ్వాన్సుతో పని దొరికింది. మొదటి సినిమాగా అదే రిలీజైంది. కాని ఫ్లాప్. ఆ కష్టకాలంలో తనలాగే వేషాల కోసం ప్రయత్నిస్తున్న మనోజ్ కుమార్ ఫ్రెండ్ అయ్యాడు. రోజుల తరబడి స్టూడియోల చుట్టూ తిరగడం, భార్యనూ... ఉద్యోగాన్నీ వదిలేసి బొంబాయిలో ఏం చేస్తున్నావ్ అని తండ్రి అక్షింతలతో ఉత్తరాలు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం వేల వేదనలు అనుభవించాడు. అప్పుడు ‘బందినీ’ (1963) విడుదలైంది. కొద్దిగా గుర్తింపు. ‘ఆయి మిలన్ కీ బేలా’ (1963) నెగెటివ్ రోల్. రాజేంద్ర కుమార్ హీరో. కాస్త హిట్ అయ్యింది. ఈ సమయంలోనే అతను మన మహానటి సావిత్రి (Savitri) పక్కన హీరోగా ‘గంగాకీ లహరే’ (1964)లో నటించాడు. ఆ సంగతి సావిత్రికి, ధర్మేంద్రకు తప్ప ప్రేక్షకులకు తెలియదు. అంత ఫ్లాప్ ఆ సినిమా. ధర్మేంద్ర స్ట్రగుల్ కొనసాగింది.సినిమా పరిశ్రమలో ‘గాడ్ఫాదర్’ ఉండాలని అంటూ ఉంటారు. ధర్మేంద్రకు ‘గాడ్మదర్’ దొరికింది. ఆమె పేరు మీనా కుమారి. మన ‘నాదీ ఆడజన్మే’ సినిమాను హిందీలో ‘మై భీ లడ్కీ హూ’ (1964)గా రీమేక్ చేస్తుంటే మొదటిసారి మీనాకుమారితో నటించాడు ధర్మేంద్ర. మీనాకుమారి అప్పటికే తన వివాహ బంధం నుంచి బయటపడింది. ఆమె మనసు ఒక మంచి మిత్రుడి కోసం చూస్తోంది. ఆ సమయంలో సిగ్గరిగా, స్నేహంగా ఉన్న ధర్మేంద్ర ఆమెకు ఆప్తుడుగా అనిపించాడు. మీనాకుమారి పేరు మీద ఇంకా సినిమాలు ఆడుతున్న రోజులు అవి. అందువల్ల మీనాకుమారి ధర్మేంద్రను చాలా ప్రమోట్ చేసింది. వారిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. పూర్ణిమ (1965), కాజల్ (1965), ఫూల్ ఔర్ పత్థర్ (1966), చందన్ కా పల్నా (1967), ‘బహారోంకి మంజిల్’ (1968)... వీటిలో ఫూల్ ఔర్ పత్థర్ సూపర్హిట్. ఆ తర్వాత ధర్మేంద్ర ఆగలేదు. అతణ్ణి పెద్ద హీరో చేసిన మీనాకుమారి అతని జ్ఞాపకాల్లో మిగిలిపోయింది.ఆశాఫరేఖ్, ధర్మేంద్ర జోడి ప్రేక్షకులకు నచ్చింది. ‘ఆయా సావన్ ఝూమ్ కే’... పాట రేడియోలో పెద్ద హిట్. సినిమా కూడా సూపర్హిట్. ‘ఆయా సావన్ ఝూమ్ కే’ సినిమాతో ధర్మేంద్ర కెరీర్ పూర్తిగా సెటిల్ అయ్యింది. ఇతను యాక్షన్, సెంటిమెంట్, రొమాంటిక్ సినిమాలు చేయగలడు అని ఇండస్ట్రీకి తెలిసిపోయింది. హీరోయిన్లు మాలాసిన్హా, సైరాబాను, వహీదా రెహమాన్, షర్మిలా టాగోర్ అందరూ ధర్మేంద్ర పక్కన నటించడానికి పోటీలు పడ్డారు. అయితే అతను నటించడానికి పోటీ పడిన హీరోయిన్ ఆ తర్వాతి రోజుల్లో వచ్చింది. హేమమాలిని!ధర్మేంద్రలో ఒక మంచి, సెన్సిబుల్ నటుడు ఉన్నాడు. ఆ సంగతిని హృషికేష్ ముఖర్జీ పసిగట్టాడు. ‘అనుపమ’ (1966), ‘సత్యకామ్’ (1968), ‘చుప్కే చుప్కే’ (1975)... ఇవన్నీ ధర్మేంద్రతో తీశాడు. ధర్మేంద్ర మొత్తం కెరీర్లో అత్యుత్తమ నటన ప్రదర్శించిన సినిమాగా ‘సత్యకామ్’ను విమర్శకులు గుర్తిస్తారు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యి ఆ తర్వాత కల్ట్ క్లాసిక్గా నిలిచింది. ‘చుప్కే చుప్కే’లో ధర్మేంద్ర వేసిన ‘ప్యారేమోహన్’ అనే పాత్రకు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ధర్మేంద్ర కామెడీని ప్రేక్షకులు ఈ సినిమాలో ఎంతో ఎంజాయ్ చేశారు. విశేషం ఏమంటే ఇందులో ధర్మేంద్ర బోటనీ ప్రొఫెసర్. సినిమా రిలీజయ్యాక తండ్రికి చూపించి ‘నువ్వు కోరినట్టుగా నేను బోటనీ ప్రొఫెసర్ అయ్యాను చూడు’ అనంటే ఆయన ఎప్పటిలానే ‘ఏడ్చావులే బడుద్దాయి’ అని అని అక్షింతలు వేశాడు.ధర్మేంద్ర హీరో. అతను హీరోగా ఉంటే పక్క పాత్ర ఉంటుంది తప్ప వేరెవరో హీరోగా ఉంటే అతను పక్కపాత్ర కాదు. ‘షోలే’లో హీరో ధర్మేంద్ర. సినిమాలో ప్రాణాలతో మిగిలేది కూడా అతడే. కాని అమితాబ్ కూడా అసాధ్యుడిగా నటించాడు. ధర్మేంద్రకు రాజకీయాలు చేయడం తెలియదు. కొత్త తరం వస్తే అసూయ లేదు. ఒడ్డూ పొడవూ ఉన్న అమితాబ్ తనను దాటేస్తాడనే భయం లేకుండా ‘జయ్’ పాత్రకు అమితాబ్ను తీసుకోండని తనే ఒక మాట వేశాడు దర్శకుడికి. ‘షోలే’ (1975) విడుదలయ్యి మరికొన్ని రోజుల్లో 4కెలో రీరిలీజ్ అవనుంది. యాభై ఏళ్లుగా షోలే ఖ్యాతి ధర్మేంద్రను భారత ప్రేక్షకులకు చేరువ చేస్తూనే ఉంది. ప్రతి కొత్తతరం ఈ సినిమా చూసి ధర్మేంద్రకు ఫ్యాన్స్ అయ్యారు. ‘కుత్తే మై తేరా ఖూన్ పీజావూంగా’ డైలాగ్ ధర్మేంద్ర ఒక్కసారి చెప్తే ఆ తర్వాతి తరాలు వందసార్లు చెప్తూనే ఉన్నాయి.1980ల తర్వాత ధర్మేంద్ర మల్టీస్టారర్ సినిమాల్లో హీరోగా క్షణం తీరిక లేకుండా గడిపాడు. అదే సమయంలో తన కుమారుడు సన్ని డియోల్ను ‘బేతాబ్’ (1983)లో లాంచ్ చేసి హీరోగా నిలబెట్టాడు. కొడుకుతో ధర్మేంద్ర తీసిన ‘ఘాయల్’ కూడా సూపర్డూపర్ హిట్ అయ్యింది. ఈ కాలంలో హీరోగా ధర్మేంద్ర కొన్ని సినిమాలు చేస్తుంటే హీరోగా సన్నిడియోల్ సినిమాలు చేస్తూ వచ్చాడు. డింపుల్ కపాడియా (Dimple Kapadia) వంటి హీరోయిన్లు ఇద్దరి సరసనా నటించారు. ఆ తర్వాత చిన్న కొడుకు బాబీ డియోల్ను ‘బర్సాత్’తో లాంచ్ చేశాడు ధర్మేంద్ర.ధర్మేంద్ర ఎప్పుడూ తన పని గురించి తప్ప ఎత్తులు పైఎత్తులు వేస్తూ కూచోలేదు. పంచాయతీలకు దిగలేదు. అనవసరంగా మీడియా ముందుకు రాలేదు. ఇన్నేళ్లలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా తక్కువ. అవార్డు ఫంక్షన్లకు హాజరవడం, పార్టీలు ఇవన్నీ చాలా పరిమితంగా చేసేవాడు. ధర్మేంద్రకు రైతుగా ఉండడటం ఇష్టం. అందుకే కుమారులిద్దరూ కలిసి లోనావాలా దగ్గర 100 ఎకరాల ఫామ్హౌస్ ఏర్పాటు చేశాడు. సినిమాలను పూర్తిగా తగ్గించుకున్నా ఆ ఫామ్హౌస్లోనే ఎక్కువగా గడిపాడు ధర్మేంద్ర, ‘మీ వయసు ఎంత?’ అని ధర్మేంద్రను అడిగితే ‘అది కెమెరా చెప్తుంది’ అనేవాడు. కెమెరా తన కంటితో ఆయనను ఎప్పుడూ యంగ్గా, ఆరోగ్యవంతుడిగా, ధీరుడిగా, హీమాన్గానే చూపిస్తూ వచ్చింది. ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ ఆయన ఆ రూపంతోనే మిగిలిపోతాడు. ధర్మేంద్ర నటించిన ‘గాడీ బులా రహీహై’ పాటలో ‘గాడీ’ అంటే మృత్యువుకు సంకేతం. ఇన్నాళ్లకు మబ్బుల సెట్టింగ్, మెరుపుల ఆర్క్ లైట్లు ఉన్న చోటుకు తీసుకెళ్లే గాడీ ఎక్కి తరలిపోయాడు ధర్మేంద్ర. గాడీ బులా రహీహై... సీటీ బజా రహీహై.హేమమాలినితో ప్రేమకథహిందీ సినిమాల్లో హేమమాలిని (Hema Malini) రాకను బాంబేలో పెద్ద దుమారంగా మార్చిన వ్యక్తి రాజ్కపూర్. హేమమాలిని హిందీలో హీరోయిన్గా నటించిన మొదటి సినిమా ‘సప్నోంకా సౌదాగర్’ (1968)లో రాజ్కపూర్ హీరో. ఆ సినిమా పబ్లిసిటీ కోసం ‘డ్రీమ్ గర్ల్ హేమమాలిని’ అంటూ బాంబే అంతా హోర్డింగ్స్ పెట్టించాడు. అలా ఆమె బాలీవుడ్ హీరోల దృష్టిలో పడింది. ఆ వెంటనే ధర్మేంద్రతో ‘తుమ్ హసీ మై జవాన్’ (1969)లో నటించింది. ధర్మేంద్ర అప్పటికే వివాహితుడైనా, నలుగురు పిల్లల తండ్రయినా హేమమాలిని ఆకర్షణలో పడ్డాడు. సౌత్ హీరోయిన్లు హిందీలో ఎప్పుడూ టాప్స్టార్స్గానే ఉన్నారు. వహీదా రహెమాన్, వైజయంతీమాల, రేఖ... ఇప్పుడు హేమమాలిని. ఆమె స్నేహం కోసం అందరూ ఎదురు చూసిన వారే. వీరిలో మనోజ్ కుమార్, జితేంద్ర, సంజీవ్ కుమార్, ధర్మేంద్ర ఉన్నారు. ‘షోలే’ (1975) చేసే సమయానికి ధర్మేంద్ర ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందుకే ఆమెకు దగ్గరవడానికి ఆమెతో నటించే సీన్లలో రీటేక్ల కోసం లైట్బాయ్స్ను ఏదో ఒక తప్పు చేయమని తప్పుకు వంద రూపాయలు ఇచ్చేవాడు– ఆ రోజుల్లో. దాంతో హేమమాలినికి ధర్మేంద్ర అవస్థ తెలిసి వచ్చింది. అయినప్పటికీ ఇంట్లో అనంగీకారం, ధర్మేంద్ర మొదటి పెళ్లి కారణంగా హేమ మనసు ద్వైదీభావంతో ఉండేది. ఆ సమయంలోనే జితేంద్రతో దాదాపుగా ఆమె వివాహం వరకూ వెళ్లడం, మద్రాసుకు అందుకై వాళ్లు చేరుకోగా ధర్మేంద్ర మరో ఫ్లయిట్లో అక్కడకు వెళ్లి ఆమెను ఒప్పించి పెళ్లి కేన్సిల్ చేయడం ఆ రోజుల్లో వార్తగా వచ్చింది. చివరకు ధర్మేంద్ర, హేమమాలిని 1980లో వివాహం చేసుకున్నారు. ఇది పెద్ద వార్త. అయితే ధర్మేంద్ర తన కుటుంబాన్ని హేమమాలిని జీవితంలో జోక్యం చేసుకోకుండా, హేమమాలిని తాను అతని కుటుంబంలో జోక్యానికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకున్నారు. అలాగే ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ (Prakash Kaur) ఎప్పుడూ ఈ విషయమై ఒక్క మాట బయటకు వచ్చి మాట్లాడలేదు. వారి ఇద్దరు కుమార్తెల్లో ఇషా డియోల్ సినిమాల్లో రావడం ధర్మేంద్రకు అంగీకారంగా లేకపోయినా తర్వాత ఆమెతో పాటు కలిసి నటించాడు కూడా. ‘నేను నా కుమార్తెను నటించ వద్దు అన్నాను నిజమే. నన్ను నా తండ్రి నటించ వద్దు అన్నాడు కదా. సినిమా రంగంలో కెరీర్ ఎంపికపై తల్లిదండ్రుల అభిప్రాయం ఉండటం తప్పు కాదు’ అంటాడు ధర్మేంద్ర. అయితే ధర్మేంద్ర కుమారులు సన్ని డియోల్, బాబీ డియోల్ (Bobby Deol) తమ సవతి తల్లి కుమార్తెలతో అంత మంచి అనుబంధంలో ఉన్నట్టుగా ఎప్పుడూ కనిపించలేదు. వారు నలుగురూ కలిసిన సందర్భాలు దాదాపుగా లేనట్టే.నేను వెళ్లే గుడి పేరు ‘జిమ్’ధర్మేంద్ర (Dharmendra) మద్యపాన ప్రియుడు అనేది జగద్విదితం. సాయంత్రం ఏడు తర్వాత హరిహరాదులు ఏకమైనా ఆయన పెగ్ చేతిలోకి తీసుకోకుండా ఉండడు. రాత్రిళ్లు ఎంతసేపు ఎన్ని పెగ్గులు పుచ్చుకున్నా ఉదయం ఐదు గంటలకంతా జిమ్లో ఉండటం ఆయనకు అలవాటు. తుఫాను వచ్చినా కూడా ఈ అలవాటు చివరి వరకూ మానలేదు. ‘నేను, నా ఇద్దరు కుమారులు, ఇంటి స్త్రీలు కూడా జిమ్కు రోజూ వెళతారు. మా ఇంట్లో ఉండే జిమ్ మాకు గుడితో సమానం’ అంటారు ధర్మేంద్ర. ఆయనకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ జాస్తి. లోనావాలాలో ఫామ్హౌస్ పెట్టాక అక్కడి నుంచి రోజూ 15 లీటర్ల పాలు రైల్లో ముంబైకి చేరేది ధర్మేంద్ర పరివారం అవసరాలకు. ముంబైలో దొరికే పాలు కల్తీ అవుతాయనే కారణాన. ధర్మేంద్ర టాప్ 10 పాటలు1. యా దిల్ కి సునో దునియా వాలో ∙అనుపమ2. ఆప్ కే హసీన్ రుఖ్మె ఆజ్ నయా నూర్ హై ∙బహారె ఫిర్ భి ఆయేగీ3. బహారోంనె మేరా చమన్ లూట్ కర్ ∙దేవర్4. సాథియా నహీ జానా కె జీనా లగే ∙ఆయా సావన్ ఝూమ్ కే5. ఆజ్ మౌసమ్ బడా బే ఇమాన్ హై ∙లోఫర్6. పల్ పల్ పల్ దిల్ కే పాస్ ∙బ్లాక్ మెయిల్7. కోయి హసీనా జబ్ రూఠ్ జాతీ హై తో ∙షోలే8. ఓ మెరి మెహబూబా ∙ధరమ్ వీర్9. హమ్ బేవఫా హర్గిజ్ న థే ∙షాలిమార్10. జిల్మిల్ సితారోంకా ఆంగన్ హోగా ∙జీవన్ మృత్యుమాఫియాకి ధర్మేంద్ర హడల్1980లలో ప్రతి చిన్నా చితకా హీరోలకు మాఫియా నుంచి కాల్స్ వచ్చేవి. ‘భాయ్ మాట్లాడతాడట’ అనంటే అందరూ ఒణికిపోయేవారు. డబ్బులు కొందరు ఇచ్చేవారు. ఇలాగే ఒకసారి ధర్మేంద్రకు కూడా ఫోన్ వచ్చింంది. ధర్మేంద్ర ఫోన్ అందుకుని ‘మీరు ఎంత మంది ఉంటారు. ఒక పది మంది ఉంటారా? మీకు నేనొక్కణ్ణే చాలు. కాదు కూడదన్నారో ఒక ఫోన్ కొడితే మా పంజాబ్ నుంచి లారీలకు లారీలు కత్తులతో దిగుతారు. రండి చూసుకుందాం’ అన్నాడు. అంతే! మళ్లీ మాఫియా నుంచి ధర్మేంద్రకు ఫోన్ లేదు.నేను వెళ్లే గుడి పేరు ‘జిమ్’ధర్మేంద్ర మద్యపాన ప్రియుడు అనేది జగద్విదితం. సాయంత్రం ఏడు తర్వాత హరిహరాదులు ఏకమైనా ఆయన పెగ్ చేతిలోకి తీసుకోకుండా ఉండడు. రాత్రిళ్లు ఎంతసేపు ఎన్ని పెగ్గులు పుచ్చుకున్నా ఉదయం ఐదు గంటలకంతా జిమ్లో ఉండటం ఆయనకు అలవాటు. తుఫాను వచ్చినా కూడా ఈ అలవాటు చివరి వరకూ మానలేదు. ‘నేను, నా ఇద్దరు కుమారులు, ఇంటి స్త్రీలు కూడా జిమ్కు రోజూ వెళతారు. మా ఇంట్లో ఉండే జిమ్ మాకు గుడితో సమానం’ అంటారు ధర్మేంద్ర. ఆయనకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ జాస్తి. లోనావాలాలో ఫామ్హౌస్ పెట్టాక అక్కడి నుంచి రోజూ 15 లీటర్ల పాలు రైల్లో ముంబైకి చేరేది ధర్మేంద్ర పరివారం అవసరాలకు. ముంబైలో దొరికే పాలు కల్తీ అవుతాయనే కారణాన. -
చంద్రుని పుట్టుక కోసం..
భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో అంటూ అత్యంత కవితాత్మకంగా పలవరించాడు దాశరథి. చంద్రుని పుట్టుక కోసం నిజంగానే ఓ భారీ సురగోళం రాలి కనుమరుగైందట! అవున్నిజమే. భూమికి ఏకైక ఉపగ్రహమైన చందమామ ఆవిర్భావానికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని తాజా అధ్యయనం ఒకటి వెలుగులోకి తెచి్చంది. చాలాకాలం క్రితం, అంటే ఏకంగా 450 కోట్ల ఏళ్ల నాడు మన సౌరకుటుంబంలో అటూఇటుగా అంగారకుని సైజుతో కూడిన థెయా అనే భారీ గ్రహం కూడా ఉండేదట. ఆ లెక్కన పరిమాణంలో దాన్ని భూమికి అక్క వంటిదన్నమాట! అది కాస్తా (తొలి)నాటి భూమితో ఢీకొట్టి ముక్కలు చెక్కలైందట. వాటిలో చిన్నాచితకా ముక్కలన్నీ నామరూపాల్లేకుండా పోగా, మిగిలిపోయిన అతి పెద్ద భాగమే మన చందమామగా రూపుదిద్దుకుంది! అంటే చంద్రునికి జన్మనిచ్చే క్రమంలో దాని తల్లి ఏకంగా ప్రాణత్యాగమే చేసిందన్నమాట. అంతేకాదు, థెయా ఢీకొన్న ఫలితంగా భూ అక్షం కూడా భారీ మార్పుచేర్పులకు లోనై ఇప్పుడున్న క్రమంలోకి మారింది. దాంతో జీవకోటి ప్రాదుర్భావానికి, అందుకు అనువైన వాతావరణం అమరేందుకు భూమి మరింత వీలుగా మారిందట. అలా థెయా తాను కనుమరుగైపోతూ కూడా ఇటు భూమికి ఎనలేని సాయం చేయడమే గాక, అటు చంద్రునికి ఏకంగా ఉనికినే ఏర్పరచింది. గుట్టు విప్పిన ఐసోటోపులు థెయా ఉనికిని ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలం క్రితమే దాదాపుగా నిర్ధారించారు. అయితే అది ఎంత పరిమాణంలో ఉండేది, దాని మూలాలేమిటి, కూర్పు ఎలాంటిది వంటి ప్రశ్నలకు ఇంకా జవాబులు లభించాల్సే ఉంది. వీటికి సమాధానాలు కనిపెట్టేందుకు జర్మనీలోని మాక్స్ ప్లాంట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోలార్ రీసెర్చ్, యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఒక భారీ ప్రయోగానికి తెరతీశారు. అందులో భాగంగా ఇనుము, రాళ్లు తదితరాలతో పాటు అపోలో అంతరిక్ష యాత్రలో భాగంగా చంద్రుని పై నుంచి, పలు సమీప ఉల్కల నుంచి వ్యోమగాములు తెచి్చన ఆరు నమూనాల ఐసోటోపులను పరీక్షించారు. ముఖ్యంగా భూమి, చంద్రుడు, ఉల్కల తాలూకు ఐసోటోపుల పరస్పర నిష్పత్తిని రివర్స్ ఇంజనీరింగ్గా పేర్కొనే ప్రక్రియ ద్వారా పోల్చి చూశారు. థెయా మన సౌరకుటుంబ లోపలి భాగంలోనే ఏర్పడిందని, అందులోనూ భూమి కంటే సూర్యునికి దగ్గరగా ఉండేదని తేల్చారు. అంతేగాక సౌరమండలంలో భూ గ్రహం ఉన్న అకర్బన మండల పరిధిలోనే థెయా కూడా ఉండేదని అధ్యయన సారథి తిమో హాప్ వివరించారు. ‘‘భూమి కంటే కూడా సూర్యునికి థెయా దగ్గరగా ఉండేది గనుక మరింత వేడిగా, వాయుమయంగా ఉండేదన్నది వాస్తవం. భూమితో పోలిస్తే చంద్రుడు చాలా పొడిగా ఉండేందుకు ఇది కూడా ముఖ్య కారణమే’’ అని ఆయన వివరించారు. బుధ, శుక్ర గ్రహాల నుంచి కూడా నమూనాలను సేకరించగలిగిన నాడు థెయాకు సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన అంశాలు కచి్చతంగా వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ వివరాలను సైన్స్ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మానసిక రుగ్మతలతో బేజార్
మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఏయేటికాయేడు పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉన్నప్పటికీ, అది భారత్లో ఒకింత ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లోనే మానసిక రుగ్మతల బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. అలాగే, పురుషుల్లో కంటే మహిళల్లో ఈ రుగ్మతలు రెట్టింపు ఉన్నట్లు తేలింది. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే–2015–16, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్)– 2019, లాన్సెట్ అధ్యయనం–2020 , మెంటల్ హెల్త్ అట్లాస్–2024, డబ్ల్యూహెచ్ఓ–2025 అధ్యయనాల ప్రకారం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న మానసిక రుగ్మతల తీరుతెన్నులు ఆందోళన కలిగిస్తున్నాయి.దేశంలో ప్రతి 100 మందిలో 11 మందికి.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక రుగ్మతతో జీవిస్తుండగా.. భారత్లో ప్రతీ 100 మందిలో 11 మందికి ఈ సమస్యలు ఉన్నట్లు నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే స్పష్టం చేసింది. అలాగే ప్రతీ 100 మందిలో 14 మంది తమ జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి మానసిక సమస్యను ఎదుర్కొన్నట్లు తేలి్చంది. గ్రామాల్లో 6.9% మంది బాధితులు ఉండగా, పట్టణాల్లో ఈ సంఖ్య 13.5 శాతంగా ఉంది. అలాగే, మానసిక రుగ్మతలు పురుషుల (10%) కంటే మహిళల్లో (20%) అధికంగా ఉన్నట్లు స్పష్టమైంది. మహిళల్లో నిరాశ, ఆందోళన వంటి సమస్యల కారణంగా మానసిక రుగ్మతలు పెరుగుతున్నట్లు తేలింది. ప్రత్యేకంగా 15–29 ఏళ్ల మధ్య ఉన్న వారిలో నిరాశ, ఆందోళన లాంటి మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ నివేదిక తెలిపింది. మానసిక సమస్యల్లో నిరాశ 6.2%, ఆందోళన 4.7% ప్రధానమైనవిగా మెంటల్ హెల్త్ అట్లాస్ పేర్కొంది. ఆర్థిక భారంఅవగాహనలోపం, సామాజిక వివక్ష, నిపుణుల కొరత వల్ల 70% నుంచి 92% మంది సరైన మానసిక చికిత్స అందుకోవడం లేదని ఓ అధ్యయనంలో తేలింది. ప్రతీ లక్ష మంది జనాభాకు ముగ్గురు మానసిక వైద్యులు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేయగా, భారత్లో మాత్రం 0.75 మంది మానసిక వైద్యులే ఉన్నారు. మానసిక సమస్యలు మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని, ఆయుర్దాయం తగ్గడానికి కారణమవుతాయని తేలింది. మానసిక రుగ్మతల వల్ల ఉత్పాదకత తగ్గడం, వైద్యం వంటి పరోక్ష ఖర్చులు పెరగడం వల్ల ఆర్థికంగా నష్టం జరుగుతుందని డబ్ల్యూహెచ్ఓ నివేదిక పేర్కొంది. 2030 నాటికి మానసిక రుగ్మతల కారణంగా వైద్య ఖర్చులు, పరోక్ష ఖర్చులతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థపై భారం 16 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని జర్నల్ ఆఫ్ మెంటల్ హెల్త్ స్పష్టం చేసింది. అవీ ఇవీ..⇒ మానసిక రుగ్మతల్లో మూడింట ఒక వంతు 14 ఏళ్ల వయస్సుకే మొదలవుతుండగా, సగం రుగ్మతలు 18వ ఏటి కల్లా, మూడింట రెండొంతులు 25 ఏళ్ల వయస్సు కల్లా మొదలవుతున్నాయి.⇒ ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్యంపై కోవిడ్–19 మహమ్మారి ప్రభావం అధికంగా పడింది. ఆ సమయంలో బాధితుల సంఖ్య 25% పెరిగింది. ఉద్యోగాల కోతలు, ఆర్థిక అభద్రత వల్ల ఒత్తిడి స్థాయిలు, మానసిక సమస్యలు పెరిగాయి.⇒ కేంద్ర ప్రభుత్వ మెంటల్ ఆస్పత్రులు బెంగళూరు (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్)లో, తేజ్పూర్ (ఎల్జీబీఆర్ఐఎంహెచ్)లో, రాంచీ (సీఐపీ)లో ఉన్నాయి. అన్ని ఎయిమ్స్లలో మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయి. మానసిక వైద్య సేవల కోసం టోల్ ఫ్రీ నంబర్లు: 14416, 1800–891–4416⇒ 2023లో భారత్లో మానసిక రుగ్మతలతో ఆత్మహత్యలు చేసుకున్నవారు 1,71,418 ⇒ వీరిలో 72.8% పురుషులు, 27.2% మహిళలు ⇒ ఈ సమస్యతో ఏటా ప్రపంచంలో జరిగే ఆత్మహత్యలు: 7,27,000 ⇒ సాధారణ ప్రజలతో పోలిస్తే మానసిక రుగ్మతలున్న వారు ఆత్మహత్యలు చేసుకునే ముప్పు: 16 రెట్లు ఎక్కువ ⇒ నిరాశ వల్ల గుండె జబ్బుల వంటి సమస్యల ముప్పు: 72 శాతం అధికం -
కొనకుండానే.. షి‘ కారు’!
ఇపుడు కారు లగ్జరీ కాదు. అవసరం. సిటీ ట్రాఫిక్లో కష్టమైనా సరే... కారుంటే కాస్త బెటర్. మరి కారు కొనాలంటే...? బీమా, ట్యాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు అన్నీ కలిస్తే రోడ్డుమీదికొచ్చేసరికి తడిసి మోపెడు. ఈఎంఐతో పాటు డౌన్పేమెంటూ కావాలి. అందుకేనేమో..! యువతరం కారు కొనడానికన్నా లీజుకు తీసుకోవటానికే మొగ్గు చూపుతోంది. రోజూ కాస్త ఎక్కువ దూరమే ప్రయాణిస్తాం కనక తమకు ఇదే బెటర్ అంటోంది. నిజమేనా? కారు కొనటం మంచిదా లేక లీజుకు తీసుకోవటం మేలా? ఏది బెటర్? లీజులో ఉండే రిస్కులేంటి? అసలు మన తెలుగు రాష్ట్రాల్లో వాహనాలు లీజుకు ఇస్తున్న కంపెనీలేంటి? లీజుకు తీసుకునేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఒకసారి తెలుసుకుందాం... – సాక్షి, వెల్త్ డెస్క్ లీజుపై ఆసక్తి ఎందుకంటే...→ కార్ల ధరలు ప్రియమయ్యాయి. దాదాపు రూ.13 లక్షల విలువైన ఎస్యూవీ... రోడ్డుమీదికి వచ్చేసరికి రూ.18–19 లక్షలవుతోంది. కొనాలంటే రూ.3–4 లక్షల డౌన్ పేమెంటూ కావాలి. → లీజుకు తీసుకుంటే డౌన్పేమెంట్ అక్కర్లేదు. → అవసరమైనపుడు బీమా కంపెనీలతో పేచీలు అక్కర్లేదు. → పదేపదే సర్వీసు సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు. → కారు మార్చాలనుకున్నపుడు విక్రయించే బాధ కూడా లేదు. లీజింగ్ అనుకూలమేనా? అనుకూలమనే చెప్పాలి. ప్రతి రెండు మూడేళ్లకు కార్లను మార్చేవారికి... బీమా చెల్లింపులు, సర్వీసింగ్, టైర్లు– బ్యాటరీలు మార్చటం వంటి బాదరబందీలు వద్దనుకునే వారికి... తరచూ ఉద్యోగరీత్యా ప్రాంతాలు మారేవారికి ఇది అనుకూలమే.వీరికి కొనుక్కుంటేనే బెటర్...కారును కనీసం 8 నుంచి పదేళ్లు మార్చకుండా ఉంచుకునే వారికి... ఏడాదికి 20వేల కి.మీ. కన్నా ఎక్కువ తిరిగే వారికి.. కారును నచి్చనట్లు మార్చుకోవాలనుకునే వారికి కొనుక్కోవటమే నయమని చెప్పాలి. అసలు ఏంటీ లీజింగ్?→ లీజింగ్ కంపెనీయే కారు కొని రిజి్రస్టేషన్ చేయిస్తుంది. బీమా చేయించటంతో పాటు నిర్వహణ కూడా చూసుకుంటుంది. నెలనెలా అద్దె చెల్లించి దాన్ని లీజుకు తీసుకోవచ్చు. లీజు పీరియడ్ అయిపోయాక కారు ఇచ్చేయొచ్చు. ఇపుడిపుడే ఇండియాలో విస్తరిస్తున్న ఈ విధానం యూరప్, అమెరికాల్లో చాలా కాలంగాఉన్నదే.లీజు కంపెనీల్లో తేడాలేంటి?→ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఒరిక్స్, మైల్స్, రెవ్ వంటి సంస్థలు ఈ లీజు సేవలు అందిస్తున్నాయి. → ఒరిక్స్కు తయారీదార్లతో ఒప్పందాలున్నాయి. పూర్తి స్థాయి కార్పొరేట్ లీజింగ్ సేవలందిస్తోంది. లాకిన్ పీరియడ్ ఏడాది నుంచి ఐదేళ్ల వరకూ ఉంటుంది. ముందే గనక ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే కొంత ఫీజుంటుంది. → మైల్స్ లాకిన్ పీరియడ్ మూడు నెలలతో మొదలవుతుంది. కొత్త కార్లతో పాటు వాడేసిన సర్టిపైడ్ కార్లనూ అందించటం దీని ప్రత్యేకత. దీర్ఘకాలం లాకిన్ వద్దనుకునే వారికిది అనుకూలం. → రెవ్ సంస్థ నెలరోజుల సబ్స్క్రిప్షన్ను అందిస్తోంది. ఇక 1–4 ఏళ్ల లాకిన్తో ఈఎంఐ లీజింగ్నూ అందిస్తోంది. హ్యుందాయ్ కార్లలో చాలా వాటిని లీజుపై ఇస్తున్నది ఈ కంపెనీయే.→ కారు లీజింగ్ → కారు కొనడంఏకమొత్తం చెల్లింపు→ తొలినెల అద్దె+ సెక్యూరిటీ డిపాజిట్ → 15–20 శాతం డౌన్పేమెంట్తో పాటు బీమా, ఆన్రోడ్ చార్జీలు.నెలవారీ ఎంత?→ స్థిరమైన అద్దె (బీమా, నిర్వహణ ఛార్జీలు కలిసే ఉంటాయి) → ఈఎంఐతో పాటు బీమా, నిర్వహణ చార్జీలూ ఉంటాయి.ఓనర్షిప్→ గడువు ముగిశాక వాహనం తిరిగి ఇచ్చేయాలి. → రుణం తీరాక వాహనం సొంతమవుతుంది. రీసేల్ చేయొచ్చు.పన్ను ప్రయోజనాలు→ ఉద్యోగస్తులకు వారి కంపెనీ పాలసీ ప్రకారం ప్రయోజనాలు ఉంటాయి. అద్దె మినహాయింపు ఉంటుంది కనుక వ్యాపారాలకూ అనుకూలమే. → నేరుగా ఎలాంటి పన్ను ప్రయోజనాలూ ఉండవు.హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి లీజు విధానాలు అందుబాటులో ఉన్నాయంటే.. → కార్పొరేట్ లీజింగ్→ కనీస లీజు కాలం 2 నుంచి ఐదేళ్లుంటుంది. బీమా, నిర్వహణ, రోడ్ ట్యాక్స్, బ్రేక్డౌన్ సపోర్ట్ అన్నీ లీజింగ్ కంపెనీయే చూసుకుంటుంది. → ఎవరికి అనుకూలం?: కంపెనీలకు, ఎక్కువ ట్రావెల్ చేసే ప్రొఫెషనల్స్కు → సానుకూలాంశాలు: డౌన్పేమెంట్ అవసరం లేదు. నిర్వహణ తలనొప్పులేవీ ఉండవు. → ప్రతికూలాంశాలు: దీర్ఘకాలం లాకిన్ పీరియడ్. ఈఎంఐతో పోలిస్తే నెలవారీ అద్దె కాస్త ఎక్కువ చెల్లించాల్సి రావటం.→ లీజ్ టు ఓన్ → లీజు కాలం ముగిసిన తరువాత వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. నిర్వహణ వ్యయాలను లీజింగ్ కంపెనీ, లీజుదారుడు తలాకొంత భరించాల్సి ఉంటుంది. → ఎవరికి అనుకూలం?: చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి, స్వయం ఉపాధి వారికి ఇది అనుకూలమనే చెప్పాలి. ఎందుకంటే నెలవారీ చెల్లింపులు ఈఎంఐకి అటూఇటుగా ఉంటాయి. → కార్ సబ్స్క్రిప్షన్ → దీన్లోనూ డౌన్పేమెంట్ ఉండదు. బీమా, సర్వీసు చార్జీలను కంపెనీయే చూసుకుంటుంది. దాదాపుగా నెల నుంచి రెండేళ్లవరకు పీరియడ్తో మైల్స్, రెవ్, క్విక్లిజ్ వంటి కంపెనీలు దీన్ని ఆఫర్ చేస్తున్నాయి. → ఈ విధానంలో క్రెటా వంటి మిడ్సైజ్ ఎస్యూవీలకు నెలకు రూ.30 వేల నుంచి 50 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. → నెలవారీ రెంటల్స్... → తాత్కాలికంగా కారు కావాలనుకునేవారికి, ప్రాజెక్టు పనులపై వచి్చనవారికి, ట్రావెలర్స్కి కనుక తామే డ్రైవ్ చేసుకునేలా కార్లు కావాలంటే జూమ్కార్, రెవ్, మైల్స్ వంటి కంపెనీలు దీన్ని ఆఫర్ చేస్తున్నాయి. → ఎన్నాళ్లు కావాలంటే అన్నాళ్లే తీసుకోవచ్చు. లాకిన్ పీరియడ్ ఉండదు. కాకుంటే నెలవారీ చెల్లింపు కాస్త ఎక్కువ ఉంటుంది.→ కార్ల కంపెనీల సబ్స్క్రిప్షన్... → మారుతి, హ్యుందాయ్ వంటి సంస్థలు ఒరిక్స్, రెవ్, మైల్స్ వంటి కంపెనీల ద్వారా ఈ విధానంలో వాహనాలను అందిస్తున్నాయి. ఈ విధానంలో కొత్త కారును నేరుగా తయారీ కంపెనీ నుంచే తీసుకోవచ్చు. → స్విఫ్ట్ వంటి కార్లు నెలకు రూ.18,350 నుంచి లభిస్తున్నాయి. బ్రాండ్ సపోర్ట్తో పాటు నెలవారీ ఎంత చెల్లించాలో ముందే తెలుస్తుంది.డబ్బులిచ్చే స్వతంత్రమే వెల్త్దశాబ్దాలుగా మన ఆర్థిక ఆలోచనలు యాజమాన్యం చుట్టూనే తిరుగుతున్నాయి. ఇల్లు, భూమి, కారు, బంగారం ఏదైనా కొనటమే. కానీ ఇప్పటి మధ్య తరగతి ఈ నియమాల్ని తిరగరాస్తున్నారు. నేటి యువతరం ‘దీన్నెలా కొనాలి?’ అని కాకుండా ‘దీన్నెలా సొంతం చేసుకోవాలి?’ అని ఆలోచిస్తున్నారు. కార్లను లీజుకు తీసుకుంటున్నారు. ల్యాప్టాప్లకు అద్దె చెల్లిస్తున్నారు. సబ్ర్స్కిప్షన్ ఫోన్లు, కో–లివింగ్ ఇళ్లు ఇవన్నీ దీన్లో భాగమే. సొంతం చేసుకోవటం కన్నా దాన్ని ఉపయోగించుకోవటం మీదే ఫోకస్ పెడుతున్నారు. లగ్జరీకి బదులు తమకొచ్చే ఆదాయాన్నే దృష్టిలో ఉంచుకుంటున్నారు.డౌన్పేమెంట్లు, రుణాల్లో మునిగిపోయే బదులు చేతిలో నగదు, ట్రావెలింగ్, ఇన్వెస్ట్మెంట్లు, కొత్త అనుభవాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ధోరణి ఆర్థికంగా మంచిదే. గాడ్జెట్లు అద్దెకు తీసుకోవటం వల్ల టెక్నాలజీ మార్పుల్ని ఎదుర్కోవచ్చు. కో–లివింగ్తో దీర్ఘకాల కమిట్మెంట్లు ఉండవు. సబ్స్క్రిప్షన్లతో మిగిలే మొత్తాన్ని సిప్లు, బాండ్ల వంటి పెట్టుబడుల్లోకి మళ్లించవచ్చు. అలాగని ‘సొంతం’ సంస్కృతి పోయేదేమీ కాదు. ఇది కాస్త స్మార్ట్గా సొంతం చేసుకోవటమంతే!. సంపదకు నేటి మధ్య తరగతి కొలమానం తమ దగ్గరుండే వస్తువులు కాదు. చేతిలోని డబ్బులిచ్చే స్వతంత్రమే. ఈ విధానాలపై సరైన సమాచారాన్నిస్తూ పాఠకుల కరదీపిక కావటానికే ఈ సాక్షి వెల్త్. – ఎడిటర్ -
అడుగడుగునా ఉచ్చులు.. ఉసురు తీసే ప్రమాదాలు!
నల్లమల అటవీ ప్రాంతంలో పులలకు రక్షణ కరువైంది. ఒక వైపు వేటగాళ్ల ఉచ్చులు.. మరో వైపు ఆహారం, నీటి కోసం జనారణ్యం వైపు వస్తూ పులులు ప్రమాదాలకు గురువుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అవి మృత్యువాత పడుతున్నాయి. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నామన్నా నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. నల్లమలలో పులి గాండ్రిపులు వినిపించాలంటే వాటి సంరక్షణను అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. అవి ఎక్కువగా సంచరించే రహదారుల సమీపంలో అండర్, అప్పర్పాస్లు ఏర్పాటు చేయాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పెద్దదోర్నాల: నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వుడు నల్లమల ప్రాజెక్టులో మొత్తం 87 పెద్ద పులులున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. చిరుత పులులు మరో 200 నుంచి 205 వరకు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. నల్లమల పరిధిలోని మార్కాపురం, నెక్కంటి, గంజివారిపల్లి, కొర్రపోలు, దోర్నాల, విజయపురిసౌత్, యర్రగొండపాలెం అటవీ రేంజీ పరిధిలో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి. అయితే వేటగాళ్ల ఉచ్చులు, రోడ్డు ప్రమాదాలతో పాటు అనారోగ్య సమస్యలతో నల్లమలలోని కొన్ని వన్యప్రాణుల మునుగడ ప్రమాదంలో పడుతోంది. ఇప్పటికే కొన్ని రకాల చిరుతలు అంతరించి పోగా, నమీబియా లాంటి దేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నల్లమలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన జీవుల్లో రెండో స్థానం చిరుత పులులది. వీటి జీవిత కాలం 12 నుంచి 15 ఏళ్లు మాత్రమే. పెద్దపులులు, చిరుతపులులు ఆహారం, నీళ్ల కోసం రోడ్లపైకి వచ్చి ప్రమాదాల బారినపడి మృత్యువాత పడుతున్నాయి. అటవీశాఖాధికారులు వన్యప్రాణుల సంరక్షణకు అన్నీరకాల చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.పెద్దపులులు, చిరుతలకు అడవిలోనే నీటి సమస్య లేకుండా సోలార్ సాసర్పిట్లు ఏర్పాటు చేసి నీటి సమస్య తీర్చారు. ఆహారం కోసం అవి సమీప గిరిజన ప్రాంతాల వైపు వస్తూనే ఉన్నాయి. బేస్ క్యాంపుల ఏర్పాటు.. నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు తెలుసుకునేందుకు బేస్ క్యాంప్లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా పులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. వాటి కదలికల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గంజివారిపల్లె సమీపంలోని పెద్దన్న బేస్ క్యాంప్, ఇష్టకామేశ్వరి ఆలయం, దొరబైలు, నారుతడికల, పాలుట్ల, కొలుకుల, తుమ్మలబైలు, వెదురుపడియ, కొర్రపోలు, చినమంతనాల, రోళ్లపెంట తదితర ప్రాంతాల్లో బేస్ క్యాంప్లు ఉన్నాయి. ఇందులో ఐదుగురు అటవీ అధికారులు ఉంటారు. అడవిలోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు కొర్రపోలు, శిరిగిరిపాడు, దోర్నాల గణపతి గుడి వద్ద ఫారెస్ట్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. మొత్తం మీద 120 మంది ప్రొటెక్షన్ వాచర్లు పులుల సంరక్షణలో ఉన్నారు. అభయారణ్యాలలో అండర్, ఓవర్ పాసులు ఏర్పాటు చేయాలి.. శ్రీశైలం వెళ్లే భక్తులు, నల్లమల అటవీ అందాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటక ప్రేమికులు సౌకర్యవంతమైన ప్రయాణాలతో పాటు, నల్లమల అభయారణ్యంలో వణ్యప్రాణులు సురక్షితంగా సంచరించేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. వేగంగా ప్రయాణించే వాహనాలతో అవి ప్రమాదాలకు గురి కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. రోడ్డుకు ఓ వైపు నుంచి మరో వైపుకు వెళ్లే విధంగా అండర్ పాస్లు, ఓవర్ పాస్లు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రహదారికి పై భాగంలో ఏర్పాటు చేసే వంతెన( ఓవర్ పాస్)లు, మరికొన్ని ప్రాంతాల్లో రోడ్డుకు కింది భాగాన ఏర్పాటు చేసే బ్రిడ్జి (అండర్పాస్)ల ద్వారా వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించే వీలుంటుందని వారు సూచిస్తున్నారు. వీటి ఏర్పాటుపై అటవీశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. చనిపోతున్న పులులు, చిరుతలు» జనారణ్యంలోకి వస్తున్న పులులు, చిరుతలు మృత్యువాత పడుతున్నాయి. » 2024లో అర్ధవీడు మండలం వెలగలపాయ సమీపంలో విద్యుత్ కంచె తగిలి చిరుత మృతి చెందింది. » 2023 నవంబర్ 10న శ్రీశైలం ఘాట్లో గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది. » 2023 సంవత్సరం నవంబర్ 6వ తేదీన మండల పరిధిలోని రోళ్లపెంట వద్ద కోతిని వేటాడబోయిన చిరుతపులి కోతితో సహా నీళ్లలో పడి మృత్యవాత పడింది. » 2022 జనవరి 22వ తేదీన ఆర్ చెలమ బావి వద్ద కోతులను వేటాడుతూ రోడ్డును దాటుతున్న ఓ చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే చిరుత మృతి చెందింది. » 2022 జనవరి 13వ తేదీన శ్రీశైలం రహదారిలోని జంగిల్ సఫారీ వద్ద రోడ్డును దాటుతున్న చిరుతపిల్లను గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో చిరుత మృత్యువాత పడింది. » 2021 నవంబర్ 12న గిద్దలూరు–నంద్యాల మధ్య చలమ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వేట్రాక్ దాటుతూ ప్రమాదవశాత్తు రైలుకిందపడి పెద్దపులి మృతి చెందింది. » 2020 ఏప్రిల్లో యర్రగొండపాలెం సమీపంలోని గాలికొండ అటవీ ప్రాంతంలో వృద్ధాప్యంతో తీవ్రమైన ఎండ వేడిమి తట్టుకోలేక పెద్దపులి మృతి చెందింది. వీటితో పాటు మండల పరిధిలోని చెంచుకుంట వద్ద రైతులు పెట్టిన విషాహారం తిని చిరుతపిల్ల మృత్యువాత పడింది. దేవలూడు ప్రాంతంలో చిరుతను చంపి గుర్తులు లేకుండా కొందరు దుండగులు తగలబెట్టారు. దీంతో పాటు గతంలో తుమ్మల బైలు, శ్రీశైలం ముఖద్వారం వద్ద చిరుత పులులు రోడ్డును దాటే క్రమంలో గుర్తుతెలియని వాహనాలు ఢీకొని మృత్యువాత పడిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. -
తిండికి తక్కువే..!
మూడు పూటలా భోజనం. మధ్యమధ్యలో టీ. సాయంత్రం అయ్యిందంటే బజ్జీలు, చాట్ ఏదైనా కడుపులో పడాల్సిందే. అంతేనా? పండ్లు, బిస్కెట్లు వంటివి కూడా ఉంటాయిగా. దాదాపు ప్రతి ఇంటా కథ ఇలాగే ఉంటుంది. ఈ లెక్కన ఓ నలుగురు ఉన్న కుటుంబంలో తిండికి తడిసిమోపెడు అవుతుంది అనుకుంటే పొరపాటే. తిండికంటే ఎక్కువగా వినియోగ వస్తువులు–సేవలు, మన్నికైన వస్తువులపై భారతీయులు అధికంగా వెచి్చస్తున్నట్లు ఓ అధ్యయనం తేల్చింది. మన దేశంలో తలసరి ఆదాయాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మెరుగైన జీవన ప్రమాణాలపై ఆశలు, ఆకాంక్షలు.. వెరసి కుటుంబాలు ప్రతినెలా చేస్తున్న వినియోగ వ్యయాల తీరు మారుతోంది. ఆహారం కంటే అధికంగా వినియోగ వస్తువులు, మన్నిక కలిగిన వాటి కోసం (కన్జ్యూమబుల్స్, డ్యూరబుల్స్) ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. భారత్లో కొనుగోళ్ల తీరుతెన్నులను వివరిస్తూ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) తాజాగా ఓ సర్వే చేసింది. 2011–12లో చేపట్టిన నేషనల్ శాంపిల్ సర్వేతో పోలుస్తూ 2023–24 నాటికి వచి్చన మార్పులతో ఈ గృహ వినియోగ వ్యయ సర్వేకు రూపకల్పన చేసింది. దేశవ్యాప్తంగా 2,61,953 కుటుంబాలు సర్వేలో పాలుపంచుకున్నాయి. ఈఏసీ–పీఎం ప్రతినిధులు షమికా రవి, సింధుజ పెనుమర్తి రూపొందించిన ఈ నివేదికను ఈఏసీ–పీఎం ఇటీవల విడుదల చేసింది.పల్లెలకూ పాకిన సంస్కృతి.. దేశంలో 12 ఏళ్లలో మారిన వ్యయాల తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. పల్లెల్లోనూ ఆహారం కోసం చేస్తున్న వ్యయాలు 52.9% నుంచి 47 శాతానికి తగ్గాయి. గృహ వ్యయంలో ఆహారేతర వస్తువుల వాటా మొత్తం ఏకంగా 53% ఎగబాకింది. పట్టణవాసుల తొలి ప్రాధాన్యత డ్యూరబుల్స్, కన్జ్యూమబుల్స్దే. వీటి వాటా 57.4% నుంచి 60.3 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఆహారానికి చేస్తున్న ఖర్చు 42.6% నుంచి 39.7 శాతానికి పడిపోయింది. దుస్తులు, పాదరక్షలు వంటి ప్రాథమిక అవసరాల నుంచి వ్యక్తిగత వస్తువులు, కిచెన్ ఉపకరణాలు, గృహోపకరణాలు, వాహనాలపై.. అంటే ఆస్తి నిర్మాణం వైపు వ్యయాలు మారుతున్నాయి. జీవన ప్రమాణాలపై.. ప్రజల్లో అవగాహన, రుణ లభ్యత పెరగడం, మెరుగైన ఆర్థిక వ్యవస్థ.. వ్యక్తిగత ఉత్పాదకత, జీవన ప్రమాణాలపై సానుకూల ప్రభావం చూపుతోంది. మోటారు వాహనాలు, టీవీలు, మొబైల్ హ్యాండ్సెట్స్, రిఫ్రిజిరేటర్లు సొంతం చేసుకునేందుకు జనం మొగ్గుచూపుతున్నారు. అయితే టీవీల కొనుగోలు పట్టణ ప్రాంతాలలో కొంతతగ్గింది. మొబైల్ ఫోన్లను టీవీలకు ప్రత్యామ్నాయంగా భావించడమే ఇందుకు కారణంగా తెలుస్తోందని నివేదిక వివరించింది. గృహోపకరణాల్లో రిఫ్రిజిరేటర్లదే పైచేయి. పట్టణ ప్రాంతాల్లో వీటి కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. మన్నికైన వస్తువులు (డ్యూరబుల్స్): టీవీ, ల్యాప్టాప్/పీసీ, మొబైల్ ఫోన్, టూవీలర్, కారు, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ఏసీ/కూలర్.వినియోగ వస్తువులు (కన్జ్యూమబుల్స్), సేవలు: సబ్బులు, సౌందర్య సాధనాలు, స్టేషనరీ, మందులు, పెట్రోల్/డీజిల్, విద్య, వైద్యం. -
టెంపుల్ టౌన్ జాబితాలో మరో ఆలయం
మంథని: ప్రాచీన చరిత్రకు నిలువుటద్దంగా నిలిచిన మంత్రపురి వేదాలకు పుట్టినిల్లు. వేయి సంవత్సరాలకు పైగా మహోన్నత చరిత్ర కలిగిన మంత్రపురి దేవాలయాలకు నిలయమై టెంపుల్ టౌన్గా కూడా ప్రసిద్ధికెక్కింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా అష్టభుజ వినాయకుని గుడి, దక్షిణ భారతదేశంలో ఏకైక పశ్చిమముఖ శివలింగం పెద్దపల్లి జిల్లా మంథనిలోనే దర్శనమిస్తాయి. మంథనిలో ఒక్క వేంకటేశ్వర స్వామి ఆలయం మినహా అన్నిదేవతల ఆలయాలను పురాణకాలంలోనే నిర్మించారు. ఇటీవల మరిన్ని దేవాలయాలు వెలిశాయి. తాజాగా గురువారం తెలంగాణలో కొత్తగా మూడు దేవాలయాలు నిర్మించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ప్రకటించారు. ఇందులో కరీంనగర్, దుబ్బాక, మంథనికి చోటు కల్పించారు. కాగా మంథని మండలం కన్నాల గ్రామంలో సెంటిమెంట్ టెంపుల్గా పేరున్న శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. కానీ, టీటీడీ (TTD) దేవాలయ నిర్మాణంలో మంథనిలో అన్ని దేవాలయాలకు ప్రసిద్ధిగా పరిఢవిల్లనుంది. అన్ని దేవతామూర్తుల ఆలయాలు ప్రసిద్ధి గాంచిన మహాలక్ష్మీ అమ్మవారి దేవాలయంతోపాటు కన్యకా పరమేశ్వరి, లలితాదేవి, సరస్వతీ అమ్మవారి దేవాలయాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. అలాగే 11 పురాతన హనుమాన్ దేవాలయాలతో పాటు నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయం.. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా పశ్చిమ ద్వారం, పశ్చిమ ముఖం కలిగిన శివలింగం మంథనిలో మాత్రమే ఉంది. మరో ఐదు శివాలయాలు ఉన్నాయి. మంథని పట్టణానికి ఉత్తర ముఖంలో వెలసిన మహాగణపతి ఆలయం భక్తులకు అభయమిస్తూ పూజలు అందుకుంటోంది. పూజల్లో మొదటి ఆదిదేవుడైన గణపతినే కొలుస్తారు. ఇక్కడ గణపతికి ప్రత్యేకంగా దేవాలయం ఉంది. గౌతమేశ్వరుడు మంథని (Manthani) పట్టణ సమీపంలో ప్రవహిస్తున్న గోదావరి నది పక్కన ఎత్తయిన ప్రదేశంలో ప్రాచీన కళ ఉట్టిపడుతుండేదే గౌతమేశ్వరాలయం. శతాబ్ద కాలం క్రితం ఈ దేవాలయాన్ని వొజ్జల కిష్టయ్య అనే వ్యక్తి పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయం (Temple) ఎన్నోసార్లు గోదావరి నది ఆటుపోట్లకు గురైనా చెక్కు చెదరకుండా ఉంది. దేవాలయ ప్రాంగణంలోని పురాతన ఆలయాలు కొంత మేరకు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంగణంలో శివపంచాయనం, రామాలయం, సరస్వతి, లక్ష్మీదేవిల ఆలయాలు ఉన్నాయి. దత్తాత్రేయ ఆలయం మంథని పట్టణ సరిహద్దులో నిర్మించిన దత్తాత్రేయ ఆలయం ఈ ప్రాంత భక్తులకు కొంగుబంగారమైంది. అరవై ఏళ్ల క్రితం మంథనికి చెందిన దోమల రాధమ్మ శిష్యుడైన అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రి మహారాజాకిషన్ ప్రసాద్ సహాయంతో ఈ దేవాలయం రూపుదిద్దుకున్నట్లు చరిత్ర చెబుతోంది. ఏటా ఈ ఆలయంలో దత్తాత్రేయ జయంతి వేడుకలను, నవరాత్రులను అంగరంగ వైభవంగా జరిపిస్తారు. శీలేశ్వర – సిద్ధేశ్వర ఆలయం పట్టణ నడిబొడ్డున వెలసిన శీలేశ్వర–సిద్ధేశ్వరాలయం మంథని చరిత్రకు ప్రత్యక్షసాక్ష్యంగా నిలుస్తోంది. కాకతీయ సైన్యా«దీశుడు శీలప్పనాయుడు, సిద్ధప్పనాయుడుల జ్ఞాపకార్థం ఈ దేవాలయాన్ని ప్రోలరాజు నిర్మించినట్లు తెలుస్తోంది. మంథనికి చెందిన లోకె రామన్న రామానాంద్ర సరస్వతీ స్వామిగా సన్యాసం స్వీకరించి 1942లో ఆలయాన్ని పునరుద్ధరించారు. సుందరమైన శిల్పసంపదతో నిర్మించిన ఈ ఆలయంలో రెండు దేవాలయాలు ఉన్నాయి. దేవాలయంలో గర్భగుళ్లకు ఇరువైపులా నల్లరాతితో చెక్కిన నందీశ్వరులను, నాట్య మయూరిల విగ్రహాలను ఏర్పాటు చేశారు. చింతపండు స్వామి వీణవంక నుంచి చింతపండు బండ్లపై వచి్చన లక్ష్మీనారాయణ స్వామి విగ్రహాన్ని వరదరాజ స్వామి ఆలయంలో ప్రతిíÙ్ఠంచారు. ఈ దేవాలయానికి మంథని చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. దేవాలయ ప్రాంగణంలో ఆంజనేయ, గరుడ విగ్రహాలు ఉన్నాయి. ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఆండాళ్ అమ్మవారు, గోదాదేవి, శ్రీకృష్ణార్జునుల విగ్రహాలు దర్శనమిస్తాయి.పశ్చిమ ముఖ శివలింగం దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా పశి్చమ ద్వారం, పశి్చమ ముఖం కలిగిన శివలింగం మంథనిలో మాత్రమే ఉంది. భిక్షేశ్వరాలయంగా పిలిచే ఈ ఆలయంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీలేశ్వర– సిద్ధేశ్వర దేవాలయం, సురాబాండేశ్వరుడు, గౌతమేశ్వరుడు, ఓంకారేశ్వరుడు కొలువై ఉన్నారు. వీరబ్రహ్మంగారి దేవాలయం, షిరిడీసాయి ఆలయం, అయ్యప్ప దేవాలయం, రేణుకా ఎల్లమ్మ దేవాలయం, బలవీర హనుమాన్ ఆలయం, నాగదేవత ఆలయం, కాళీకాదేవి, గంగాదేవి, బద్దిపోచమ్మ ఆలయాలు ఉన్నాయి. ప్రాచీన చరిత్ర కలిగిన మంథనిలో ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారని అనడానికి మంత్రపురిలోని ఆలయాలే ప్రత్యక్ష సాక్ష్యాలు.. -
నాటి రిఖీ.. నేటి రవి చౌదరి!
అదొక అద్భుతం. బాలీవుడ్ సినిమాకు తీసిపోని వాస్తవం. పదహారేళ్ల వయసులో తలకు బలమైన గాయమై.. గతాన్ని పూర్తిగా మరిచిపోయి అదృశ్యమయ్యాడొక వ్యక్తి. చిత్రంగా అదే వ్యక్తి సరిగ్గా 45 ఏళ్ల తర్వాత.. మరో గాయంతో పాత జ్ఞాపకాలన్నీ ముసురుకుని కుటుంబాన్ని చేరుకున్నాడు. ఆయనే నాటి రిఖీ.. నేటి రవి చౌదరి.భారమైన బతుకుల్లో ఆనందభాష్పాలు హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లా, నది గ్రామంలో ఇటీవల ఈ అపూర్వ కలయిక జరిగింది. కొడుకు చనిపోయాడని ఇన్నాళ్లు భారంగా బతికిన తల్లిదండ్రులు, తోబుట్టువులు.. తమ ప్రియమైన రిఖీని అతడి భార్యాబిడ్డలతో సహా చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆరోజు.. ఆ గ్రామంలో సంగీతం, పూల వర్షం, ఆనందభాష్పాలు తప్ప మరేమీ కనిపించలేదు.గాయంతో పునర్జన్మ..రిఖీ అనే యువకుడు 1980లో హరియాణాలోని యమునా నగర్లో ఒక హోటల్లో పనిచేసేవాడు. అంబాలా వెళ్లే మార్గంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అతని తలకు బలమైన గాయం తగిలింది. ఆ గాయం అతని మెదడులోని ప్రతి జ్ఞాపకాన్ని తుడిచి పెట్టేసింది. పేరు, ఊరు, కుటుంబం.. అన్నీ మరిచిపోయి జీవచ్ఛవంలా మిగిలాడు. కొత్త స్నేహితులు అతనికి రవి చౌదరి అని పేరు పెట్టారు. గతం తెలియని రవి, ముంబైకి చేరుకుని చిన్న చిన్న పనులు చేస్తూ బతికాడు. తరువాత మహారాష్ట్రలోని నాందేడ్కు వెళ్లి, అక్కడి ఒక కాలేజీలో పనిచేస్తూ స్థిరపడ్డాడు. అక్కడే సంతోషి అనే అమ్మాయిని వివాహం చేసుకుని, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకుతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.మలుపు తిప్పిన మరో గాయంకొన్ని నెలల క్రితం, అతడి జీవితాన్ని మళ్లీ మార్చే మరో సంఘటన జరిగింది. అతని తలకు మరో చిన్న గాయమైంది. అంతే.. రవికి నిద్రలో అస్పష్టమైన దృశ్యాలు కనిపించడం మొదలయ్యాయి. తన గ్రామం నదిలోని మామిడి చెట్టు, సన్నని దారులు, సటౌన్ అనే చోట ఉన్న ఇంటి పెరడు.. ఇవే రవికి పదే పదే కలలో కనిపించాయి. అవి కలలు కావు.. ఒకప్పటి జ్ఞాపకాలని తెలుసుకోవడానికి అతనికి ఎంతో సమయం పట్టలేదు. వెంటనే, అతను ఒక కాలేజీ విద్యార్థి సహాయంతో సటౌన్ వివరాల కోసం వెతకడం మొదలుపెట్టాడు. గూగుల్లో నది గ్రామం గురించి వెతుకుతున్నప్పుడు, వారికి ఒక కేఫ్కు సంబంధించిన ఫోన్ నంబర్ దొరికింది. రిఖీ ఆ నంబర్కు ఫోన్ చేసి, గ్రామ పెద్ద రుద్ర ప్రకాశ్తో మాట్లాడాడు. మాటామంతీ తర్వాత.. రిఖీ బంధువులలో ఒకరైన ఎం.కె.చౌబేకు పాత విషయాలు గుర్తుకొచ్చాయి. ఈ వివరాలన్నీ సరిపోలడంతో, చివరకు నవంబర్ 15న రిఖీ.. 45 ఏళ్ల నిరీక్షణకు తెరదించి కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు.శాస్త్రానికి అందని అద్భుతం ‘గాయం కారణంగా కోల్పోయిన జ్ఞాపకాలు తిరిగి రావడం అనేది అత్యంత అరుదుగా, అద్భుతాలలో మాత్రమే జరుగుతుంది. వైద్య పరీక్షలు, బ్రెయిన్ స్కానింగ్ల తర్వాతే దీనికి కచి్చతమైన కారణం తెలుస్తుంది’.. అని మానసిక ఆరోగ్య నిపుణుడు డాక్టర్ ఆదిత్య శర్మ పేర్కొన్నారు. 45 ఏళ్ల నిశ్శబ్దం, తరాల అంతరం.. వీటన్నింటినీ ఒకే ఒక్క జ్ఞాపకం ఛేదించింది. కుటుంబ బంధాన్ని తిరిగి కలిపింది. కాలం చేసిన గాయానికి వైద్యం చేసే శక్తి ప్రేమకు మాత్రమే ఉందని ఈ సంఘటన రుజువు చేసింది. రిఖీ, రవి చౌదరిగా.. ఇప్పుడు రెండు జీవితాల సారాన్ని తనలో నింపుకొన్నాడు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
గర్భధారణకు కారణమయ్యే... జెనెటిక్ స్విచ్
మహిళల్లో గర్భధారణకు అంకురార్పణ చేసే అత్యంత మౌలికమైన జెనెటిక్ స్విచ్ (జన్యు మీట)ను మన సైంటిస్టులు కనిపెట్టారు! పిండం గర్భాశయ ద్వారంలోకి సజావుగా చేరేందుకు వీలు కల్పించేది ఇదేనట! కనుక ఏ కోణంలో చూసినా దీన్ని జన్యు శాస్త్రంలోనే గాక ప్రసూతి వైద్యంలోనూ అతి పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు. జన్యు శాస్త్ర ప్రస్థానాన్నే పునర్ నిర్వచించగలదని భావిస్తున్న ఈ కీలక పరిశోధనకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), జాతీయ ప్రత్యుత్పత్తి, శిశు వైద్య పరిశోధన సంస్థ (ఎన్ఐఆర్ఆర్ సీహెచ్), ఇండియన్ ఇన్సి్టట్యూట్ ఆఫ్ సైన్స్, బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలు సారథ్యం వహించడం విశేషం. పిండాన్ని తనలోకి స్వీకరించేందుకు గర్భాశయం సన్నద్ధం కావడం వెనక ఇమిడి ఉండే కీలకమైన కణజాల పనితీరును మన సైంటిస్టులు ఈ పరిశోధన ద్వారా వెలుగులోకి తెచ్చారు. గర్భధారణ జరగాలంటే బుల్లి పిండం గర్భ సంచి మార్గంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. వైద్య పరిభాషలో దీన్ని ఇంప్లాంటేషన్ గా పిలుస్తారు. గర్భధారణ దిశగా ఇది తొలి అడుగు మాత్రమే కాదు, ఒకరకంగా పునరుత్పత్తి ప్రక్రియ అంతటిలోనూ ఇదే అత్యంత కీలకం. గర్భ విచ్ఛిత్తికే గాక, చివరికి వంధ్యత్వానికి కూడా ఇంప్లాంటేషన్ లో వైఫల్యమే మూల కారణం!ఇలా చేశారు...హోక్సా10, ట్విస్ట్2 అనే రెండు కీలక జన్యువులను సైంటిస్టులు తమ పరిశోధన క్రమంలో గుర్తించారు. గర్భధారణ విషయంలో ఇవి రెండూ పరస్పర విరుద్ధ శక్తులుగా పని చేస్తూనే, అంతిమంగా అందుకు వీలు కల్పించడం విశేషం! ఎందుకంటే హోక్సా10 సాధారణంగా గర్భాశయ ద్వారాన్ని రక్షణాత్మక కణజాలాల సాయంతో నిత్యం మూసి ఉంచి కాపాడుతూ ఉంటుంది. ఇందుకోసం అది అనునిత్యం ఏకంగా 1,200 కణాలను నియంత్రిస్తూ ఉంటుంది. కానీ, సరిగ్గా పిండం ఆ ద్వారం వైపు వచ్చే వేళకు హోక్సా10 తాత్కాలికంగా స్విచ్ ఆఫ్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. మరోలా చెప్పాలంటే దాని పనితీరు స్తంభిస్తుందన్నమాట. మరుక్షణమే ట్విస్ట్2 ఒళ్లు విరుచుకుని క్రియాశీలకం అవుతుంది. గర్భాశయ కణజాలాన్ని మృదువుగా మార్చి పిండం దాని ద్వారం గుండా సజావుగా లోనికి సాగేలా చేస్తుంది. హోక్సా10, ట్విస్ట్2 నడుమ సంబంధం వల్ల గర్భాశయ ద్వారం గట్టిదనం నుంచి మృదుత్వాన్ని, అవసరం తీరగానే తిరిగి యథాస్థితికి మారుతున్నట్టు ఇండియన్ ఇన్సి్టట్యూట్ ఆఫ్ సైన్స్ బృందం రూపొందించిన మ్యాథమాటికల్ రీ మోడలింగ్ లో తేలింది. అనంతరం ఎలుకల్లో ప్రయోగాత్మకంగా ట్విస్ట్2 కార్యకలాపాన్ని నిరోధించి చూడగా గర్భధారణ ప్రక్రియే నిలిచిపోవడాన్ని సైంటిస్టులు గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు కాల్ డెత్ డిస్కవరీ జర్నల్ లో తాజాగా ప్రచురితమయ్యాయి.ప్రయోజనాలు ఎన్నెన్నో!ఈ జెనెటిక్ స్విచ్ ఉనికి వెలుగులోకి రావడానికి ఎంతో ప్రాధాన్యం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. ‘ జన్యువులు, వాటి స్వరూప స్వభావాలు, పనితీరు తదితరాల గురించి మనకు ఇప్పటిదాకా తెలిసింది గోరంత అయితే తెలియాల్సిందేమో కొండంత. కీలకమైన జన్యు నెట్ వర్క్ తదితరాలపై మరింత అవగాహనకు జెనెటిక్ స్విచ్ వీలు కల్పించగలదు. తద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మెరుగైన చికిత్సతో పాటు తీవ్ర గాయాలను త్వరితంగా నయం చేయడం వంటివీ వీలు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి‘ అని వారు వివరించారు. ‘కొన్నిసార్లు ఆరోగ్యకరమైన పిండం కూడా ఫలదీకరణ చెందడంలో విఫలమవుతుంటుంది. అందుకు కారణాలను అన్వేషించడంలో జెనెటిక్ స్విచ్ వ్యవస్థ ఉనికి ఎంతగానో తోడ్పడుతుంది. ఐవీఎఫ్ వంటి కృత్రిమ గర్భధారణ చికిత్స ప్రక్రియలు మరింతగా విజయవంతం అయ్యేలా చేయగలదు‘ అని చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పదిలో 'ఒకరే'..
అన్నింటా మేము అన్నట్టు వ్యాపారాల్లోనూ మహిళామణులు రాణిస్తున్నారు. పెట్టుబడి స్థాయి ఎంతదైనా తాము ప్రారంభించిన వ్యాపారాన్ని నిలబెట్టడమే కాదు.. ఆవిష్కరణల్లోనూ తీసిపోమని నిరూపిస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. చిన్న దుకాణమైనా, స్టార్టప్ అయినా.. కుటుంబ బాధ్యతలు, పెట్టుబడి కొరత రూపంలో నిరంతర అడ్డంకులను మహిళా వ్యాపారులు ఎదుర్కొంటున్నారు. ఏ ఒక్క దేశానికో ఈ సవాళ్లు పరిమితం కాలేదు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్51 దేశాల్లో సర్వేబాబ్సన్ కాలేజ్, లండన్ బిజినెస్ స్కూల్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాల తీరుతెన్నులను అంచనా వేసేందుకు నిర్వహిస్తున్న పరిశోధన ప్రాజెక్టు అయిన ‘గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్షిప్ మానిటర్ (జీఈఎం)’తాజాగా 2024/2025 ఉమెన్స్ ఆంట్రప్రెన్యూర్షిప్ రిపోర్ట్ను విడుదల చేసింది. సర్వేలో భారత్, చైనా, యూఎస్, యూకే, జర్మనీ సహా 51 దేశాలకు చెందిన లక్షలాది మంది పాలుపంచుకున్నారు. మహిళలు వ్యాపారం ప్రారంభించడంలో, కొనసాగించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్న తీరును ఇందులో సమగ్రంగా వివరించింది. ప్రపంచ దేశాల జాతీయ ఆర్థిక విధానాలను ప్రభావితం చేయడానికి జీఈఎం డేటా ఉపయోగకరమైన సాధనంగా స్థానం సంపాదించింది. ఐక్యరాజ్యసమితి, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్, ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు విశ్వసించే వనరుగా నిలిచింది. ఉద్యోగ ప్రత్యామ్నాయంగా.. అనేక మంది మహిళా వ్యవస్థాపకులకు వ్యాపారం ఒక ఉద్యోగ ప్రత్యామ్నాయం. ఒకే వ్యక్తి నిర్వహించేలా వారు చిన్న వ్యాపారాలను ఏర్పాటు చేస్తున్నారు. మహిళలను వ్యాపారం వైపు నడిపించడానికి గల కారణాల్లో.. ఉద్యోగ కొరత 71.1%, సంపదను పెంచుకోవడం 57.3%, ప్రత్యేకత చూపించుకోవడానికి 49.8%, వారసత్వ వ్యాపారం 31.5% కారణాలుగా చెప్పారు. వృద్ధి అవకాశాలు అధికంగా ఉన్న వ్యాపారాలను నడుపుతున్న చాలా మంది మహిళలు అధిక ఆదాయ దేశా లకు చెందినవారని నివేదిక తెలిపింది. వారు డిగ్రీలను కలిగి ఉండటంతోపాటు అధిక ఆదాయ కుటుంబాల నుంచి వచ్చారు. డిజిటల్ మాధ్యమాలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. స్థిరత్వ లక్ష్యాలను చేరుకుంటారని నివేదిక వివరించింది. కుటుంబానికే ప్రాధాన్యత..2024లో ప్రపంచవ్యాప్తంగా 3.4% మంది మహిళలు వ్యాపారాన్ని మూసివేశారు. పురుషుల విషయంలో ఈ సంఖ్య 3.8% ఉంది. కుటుంబ, వ్యక్తిగత కారణాల వల్ల వ్యాపారాన్ని మూసివేసినట్టు 21% మహిళలు, 14.3% మంది పురుషులు వెల్లడించారు. అంటే కుటుంబ, వ్యక్తిగత కారణాల వల్ల వ్యాపారానికి దూరం అవుతున్న మహిళల సంఖ్య పురుషుల కంటే 47% ఎక్కువ. వ్యాపారాన్ని కాపాడుకోవడం ఒకవైపు, గృహ బాధ్యతలు మరోవైపు.. ఈ రెండింటినీ సమతుల్యం చేయడంలో చాలా మంది మహిళలు సమస్యలను ఎదుర్కొంటున్నారని నివేదిక వెల్లడించింది. వ్యాపార రంగంలో మహిళల పురోగతి మందగించడానికి ప్రధాన అడ్డంకి ఏమిటంటే.. చాలా మంది మహిళలు స్టార్టప్లను ప్రారంభించి అభివృద్ధి చేస్తున్నప్పుడు ఇంటి పనులు కూడా వారి భుజాలపై పడటమే. 23వ స్థానంలో మనం.. ఒక ఆర్థిక వ్యవస్థలో 18–64 సంవత్సరాల వయసు గల జనాభాలో.. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నవారు లేదా కొత్తగా బిజినెస్ మొదలుపెట్టిన వారి (42 నెలలలోపు) సంఖ్య ఆధారంగా టోటల్ ఎర్లీ స్టేజ్ ఆంట్రప్రెన్యూరియల్ యాక్టివిటీ (టీఈఏ) రేట్ను ఇస్తారు. 10% టీఈఏ రేటుతో భారత్ 23వ స్థానంలో ఉంది. మన దేశంలో టీఈఏ రేట్ మహిళల్లో 10.3%, పురుషుల్లో 14% ఉంది. ఇక 32% రేటుతో తొలి స్థానంలో ఈక్వెడార్ నిలిచింది.» పురుషులతో పోలిస్తే మహిళా పెట్టుబడిదారులు 2.5 రెట్లు ఎక్కువగా స్త్రీలు నిర్వహిస్తున్న వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. » అనధికారిక పెట్టుబడులలో మూడింట రెండు వంతులు పురుష వ్యాపారులకే వెళ్లాయి. » పెట్టుబడిదారులు, పెట్టుబడి గ్రహీతలు.. ఈ రెండు విభాగాల్లోనూ మహిళల సంఖ్య తక్కువ. » 2024లో ఎనిమిది మంది పురుషులలో ఒకరు, పది మంది స్త్రీలలో ఒకరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. » నూతన ఆవిష్కరణలను తెచ్చే స్టార్టప్స్లో 18 దేశాలలో మహిళా వ్యాపారులు పురుష వ్యాపారులతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నారు.» 19 దేశాలలో మహిళల స్టార్టప్ రేట్లు పెరిగాయి. జోర్డాన్, మొరాకోలో రేట్లు రెట్టింపు అయ్యాయి. -
ఉమెన్ పవర్ ఏ.ఐ కెరీర్
ఏ.ఐ. (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంటేనే పవర్. ఆ పవర్కు ఉమెన్ పవర్ తోడైతే ఎలా ఉంటుంది? సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతుంది. ఏ.ఐలో సరికొత్త కోణాలు ఆవిష్కారం అవుతాయి. ఇందుకు సాక్ష్యం... రిత్విక చౌదురి (అన్స్క్రిప్ట్), నిధి (నెమ ఏఐ), అశ్వినీ అశోకన్ (మ్యాడ్ స్ట్రీట్ డెన్), గీతా మంజునాథ్ (నిరామై హెల్త్ అనాలటిక్స్).... కాలేజీ రోజుల నుంచే ఏఐ పరిశోధనల్లో ఇష్టంగా తలమునకలయ్యేది రిత్విక చౌదురి. ఐఐటీ–ఖరగ్పూర్ స్టూడెంట్ అయిన రిత్వికాకు ఎంటర్ప్రెన్యూర్ కావాలనేది కల. కాలేజీ రోజుల్లో ఏ.ఐ.కి సంబంధించి రిసెర్చ్ వర్క్ చేస్తున్నప్పుడు వీడియో క్రియేషన్కు సంబంధించి ఇ–కామర్స్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను గ్రహించింది. ఇన్ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలతో హైక్వాలిటీ వీడియోలను క్రియేట్ చేయడం ఖరీదైన ప్రక్రియ. అలాగే బాగా సమయం తీసుకునే వ్యవహారం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘అన్స్క్రిప్ట్’ అనే ఏఐ స్టార్టప్కు స్వీకారం చుట్టింది రిత్విక.వ్యక్తిగతీకరించిన (పర్సనలైజ్డ్) సింథటిక్ వీడియోలను ఉపయోగించి తమ కస్టమర్లతో ఎంగేజ్ కావడానికి ఇ–కామర్స్ బ్రాండ్లకు ‘అన్స్క్రిప్ట్’ ఉపయోగపడుతుంది. బ్రాండ్స్కు డబ్బు, సమయం ఆదా అవుతుంది.సెలబ్రిటీల నేతృత్వంలోని మార్కెటింగ్ వీడియోలను రూపొందించడానికి పేటెంట్తో కూడిన ఏఐ మోడల్స్ను నిర్మించింది అన్స్క్రిప్ట్ కంపెనీ ప్రారంభం నుంచి ఫండింగ్. ర్ట్నర్షిప్స్, టెక్, ప్రాడక్ట్స్... ఇలా రకరకాల విభాగాల బాధ్యతలను చూస్తోంది రిత్విక.‘నేను ఆలోచిస్తున్నదే కరెక్ట్ అని ఎప్పుడూ అనుకోకూడదు. మన నిర్ణయాలకు సంబంధించి ఇతరుల అభి్రయాలు తెలుసుకోవాలి. సరైన మార్గంలో నెట్వర్క్ చేయడం నేర్చుకోవాలి. ఎంటర్ప్రెన్యూర్గా నా ప్రయాణంలో నా ఆలోచనలు, నిర్ణయాలకు సంబంధించి స్నేహితులు, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్నాను’ అంటుంది రిత్విక చౌదురి.సాంకేతిక కళ!చెన్నైలోని విద్యావంతుల కుటుంబంలో పుట్టిన అశ్వినీ అశోకన్ డ్యాన్సర్ కావాలనుకునేది. అయితే ఆ కల ఫలించలేదు. విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేసిన అశ్వినీకి సాంకేతిక ప్రపంచంలో కళ, సృజనాత్మక దారులను వెదుక్కునే అవకాశం వచ్చింది. కళతో సాంకేతికతను జోడీ కట్టించిన వినూత్న విధానం ఆమె భవిష్యత్ కెరీర్కు గట్టి పునాది వేసింది. అమెరికాలో ఇంటరాక్షన్ డిజైన్లో మాస్టర్స్ చేసిన అశ్విని ప్రాడక్ట్ డిజైన్, ప్రాడక్ట్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అవగాహన సాధించింది. దిగ్గజ సంస్థ ‘ఇంటెల్’ లో ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన అశ్విని కొత్తగా ఏదైనా చేయాలనుకొని ఇండియాకు వచ్చేసింది. ‘మ్యాడ్ స్ట్రీట్ డెన్’ను లాంచ్ చేసింది. క్లయింట్స్కు ఆర్టిషియల్–డ్రివెన్ సొల్యూషన్స్ అందించే రిటైల్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్... మ్యాడ్ స్ట్రీట్ డెన్.‘రాబోయే కాలమంతా ఏ.ఐ. దే. ప్రజలు ఏదో ఒక రకంగా ఏ.ఐ.తో టచ్లో ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ.ఐ. ప్లాట్ఫామ్ను నిర్మించాలనే ఆలోచనతో మ్యాడ్ స్ట్రీట్ డెన్ ప్రారంభించాం’ అంటుంది అశ్విని.కట్టింగ్–ఎడ్జ్ ఏఐ టెక్ ప్రాడక్ట్ల రూపకల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది మ్యాడ్ స్ట్రీట్ డెన్. వ్యూ.ఏఐ అనే వర్చువల్ ఏఐ–ఆధారిత ప్లాట్ఫామ్ను తొలిసారిగా ప్రారంభించింది.‘మ్యాడ్ స్ట్రీట్ డెన్’లో సగం మంది ఉద్యోగులు మహిళలే.సామాజిక శ్రేయస్సుకోసం ఏ.ఐ.సామాజిక శ్రేయస్సు కోసం కృత్రిమ మేధను ఉపయోగించుకోవాలనే లక్ష్యాన్ని తన స్టార్టప్ ‘నెమ ఏఐ’తో నెరవేర్చుకుంది నిధి. న్యూరోడైవర్జెంట్ (మెదడు పనితీరు ఇతరుల కంటే భిన్నంగా ఉండడం) గుర్తించడానికి, దాని గురించి అవగాహన కలిగించడానికి, మార్గనిర్దేశం చేయడానికి ‘నెమ ఏఐ’ సాంకేతికత తోడ్పడుతుంది.‘నెమ ఏఐ’ ద్వారా న్యూరోడైవర్జెంట్ వెనుక ఉన్న శాస్త్రాన్ని లోతుగా పరిశోధించడంలోని ప్రాముఖ్యతను వెలుగులోకి తెచ్చింది నిధి.‘విద్యార్థుల మెదడు నమూనాలను అర్థం చేసుకోవడం, వారికి సమర్థవంతమైన అభ్యాస మార్గాలను అందించడంపై పనిచేస్తున్నాం. ప్రతి విద్యార్థికి ప్రత్యేక విద్య అవసరాలను తీర్చడంపై దృషి పెట్టాం. బోధనకు సంబంధించి మా ప్లాట్ఫామ్ ఉధ్యాయులకు ప్రత్యేక సూచనలు ఇస్తుంది. మాన్యువల్ వర్క్ను తగ్గిస్తుంది. వారు మరింత సమర్థంగా పనిచేసేలా ఉపకరిస్తుంది’ అంటుంది దిల్లీకి చెందిన నిధి.గత సంవత్సరం ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ టెలివిజన్ షోలో ల్గొంది. షార్క్స్(ఇన్వెస్టర్లు) నుంచి ఆమె స్టార్టప్కు మంచి స్పందన వచ్చింది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎస్డీ), డిస్లెక్సియా, అటెన్షన్–డెఫిసిట్/హైపర్ యాక్టివ్ డిజార్డర్ లాంటి వైకల్యాల గురించి తన స్టార్టప్ ద్వారా అవగాహన పెంచాలనేది నిధి లక్ష్యం.ఖర్చు తక్కువ...ఫలితం ఎక్కువ...డీప్–టెక్ స్టార్టప్ ‘నిరామై హెల్త్ అనాలటిక్స్’తో విజయపథంలో దూసుకుపోతోంది బెంగళూరుకు చెందిన గీత మంజునాథ్. వైద్య సాంకేతిక రంగంలో ‘నిరామై’ ప్రత్యేక గుర్తింపు సాధించింది. బయటి మార్కెట్తో పోల్చితే సగం కంటే తక్కువ ఖర్చుతో క్సాన్సర్ను గుర్తించడంలో సహాయపడే కొత్త క్యాన్సర్ స్క్రీనింగ్ సాఫ్ట్వేర్ థర్మాలిటిక్స్ రూపొందించింది.‘మా ఫలితాలు మామోగ్రఫీ కంటే 25 శాతం ఎక్కువ ప్రభావవంతంగా ఉన్నాయని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి’ అంటుంది గీత. తమ క్లౌడ్బేస్డ్ టెక్నాలజీని ఇతర వ్యాధులను గుర్తించడంలో కూడా ఉపయోగించవచ్చు. కొన్నిరకాల క్యాన్సర్లను గుర్తించడానికి ట్రయల్స్ మొదలయ్యాయి. గతంలో కోవిడ్–19 స్క్రీనింగ్ అప్లికేషన్ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. ఆసియాతో టు యూరప్ దేశాల్లో తమ ప్రాడక్ట్ను విక్రయించడానికి కంపెనీకి అనుమతి లభించింది -
ప్రకటనలు గుర్తుండట్లేదు..!
యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్.. వేదిక ఏదైనా ఈ సామాజిక మాధ్యమాల్లో విహరిస్తున్నవారే ఎక్కువ. స్మార్ట్ఫోన్ యూజర్లు గంటల తరబడి వీడియోలను వీక్షిస్తున్నారు. దీంతో డిజిటల్ వీడియోలు భారత్లో అత్యంత ప్రధాన వినోద మాధ్యమంగా మారాయి. అయినప్పటికీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను ముంచెత్తుతున్న ప్రకటనలు వీక్షకుల మదిలో నమోదు కాకపోవడం ఆసక్తికరం. ఆర్కే స్వామి సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ ఇండియన్ మార్కెట్స్ (సీఎస్ఐఎం), హన్స రీసెర్చ్ గ్రూప్ సంయుక్తంగా చేపట్టిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. పది ప్రధాన నగరాల్లో ముఖాముఖి ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో 3,000 మందికి పైగా ఆన్లైన్ కస్టమర్లు పాలుపంచుకున్నారు. వీరంతా కలిసి 600 పైచిలుకు బ్రాండ్ల పేర్లను వెల్లడించారు.సగటున ఒక్కో యూజర్ 1.5 బ్రాండ్స్ను మాత్రమే గుర్తు పెట్టుకున్నారు. పదకొండు బ్రాండ్స్ మాత్రమే 3 శాతం మందికి పైగా గుర్తున్నాయి. జెప్టో, జొమాటో, మీషో, నెస్కఫే, ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ, బ్లింకిట్, కంట్రీ డిలైట్, రమ్మీ సర్కిల్, డ్రీమ్11 వీటిలో ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే ప్రధానంగా ఆన్లైన్ బ్రాండ్స్, గేమింగ్ ప్లాట్ఫామ్స్కు మాత్రమే బ్రాండ్స్ రీకాల్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. నాలుగింట మూడొంతులు..వాట్సాప్లో వచ్చిన నాలుగు వీడియోలలో మూడింటిని యూజర్లు వీక్షించడమే కాదు వాటిని ఇతరులకు ఫార్వార్డ్ చేస్తున్నారు. సామాజిక భాగస్వామ్యం ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉందనడానికి ఇది సూచిక అని నివేదిక తెలిపింది. వీక్షకులు ఎక్కువగా ఉండే ప్లాట్ఫామ్లలో కూడా వీడియో యాడ్స్ను మ్యూట్ చేయడం, దాటవేయడం (స్కిప్) వల్ల ప్రకటనల ప్రభావాన్ని గణనీయంగా దెబ్బ తీస్తున్నాయని వివరించింది. భారత్లో ఎక్కువగా ఉపయోగించే వీడియో ప్లాట్ఫామ్ అయిన యూట్యూబ్లో యూజర్లు అధిక సమయం గడిపినప్పటికీ ఈ వేదికపైనా బ్రాండ్ రీకాల్ (గుర్తు పెట్టుకోవడం) పేలవంగా ఉందని తెలిపింది. ⇒ 600 బాండ్స్లో ప్రతీ బ్రాండ్ రీకాల్ మార్క్ 1 శాతం లోపే ఉంది. ⇒ యూజర్లు రోజూ సగటున 2.17 గంటలపాటు వీడియోలను చూస్తున్నారు. ⇒ 93% మంది మొబైల్ ఫోన్లోనే వీడియో కంటెంట్ను వీక్షిస్తున్నారు.⇒ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రధాన ప్లాట్ఫామ్స్. ⇒ తమ మొబైల్ తెరపై వచ్చిన ప్రకటనలు స్కిప్ చేస్తున్నట్టు 78% మంది తెలిపారు. ⇒ యాడ్స్ అసంబద్ధంగా ఉంటున్నాయని 57% మంది వెల్లడించారు. ⇒ తప్పనిసరిగా చూడాల్సిన పరిస్థితి ఉంటే ప్రకటనలను మ్యూట్ చేస్తామని 50% మంది చెప్పారు.⇒ ప్రకటనలను చూడటానికి అభ్యంతరం లేదని, రెండుసార్లు వీక్షించాల్సి వస్తే ఇష్టపడడం లేదని 8% మంది వెల్లడించారు.పేర్లు చెప్పాలేక.. డిజిటల్ ప్రకటనల కోసం భారత్లో కంపెనీలు ఏటా రూ.22,000 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఇంత భారీ స్థాయిలో వెచ్చిస్తున్నప్పటికీ బ్రాండ్స్ పేర్లు జనం మదిలో పెద్దగా లేకపోవడమేకాదు.. వాటితో తక్కువ మమేకం కావడం ప్రకటనదారులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ కారణంతో వీక్షకులు నిర్దిష్ట బ్రాండ్స్ పేర్లను చెప్పలేకపోయారు. బ్రాండ్ పేరుకు బదులుగా ‘మొబైల్ ప్రకటన’, ‘దుస్తుల ప్రకటన’అని వర్ణించారని నివేదిక తెలిపింది. యూజర్లు చెప్పిన చాలా బ్రాండ్స్ ఫుడ్ డెలివరీ, ఈృకామర్స్, కాఫీ, కిరాణా సామగ్రి వంటి విభాగాలకు చెందినవి. ప్రకటనల ప్రభావం కంటే రోజువారీ వినియోగం ఈ బ్రాండ్లకు గుర్తింపు తెచ్చిపెడుతున్నాయి. బ్రాండ్ రీకాల్: ఉత్పత్తులు, సేవల గురించి ఆలోచించేటప్పుడు ఎటువంటి క్లూ లేకుండా ఒక బ్రాండ్ను వెంటనే గుర్తు చేసుకోవడం, లేదా గుర్తించగల సామర్థ్యమే బ్రాండ్ రీకాల్. వినియోగదారు మదిలో ఒక బ్రాండ్ ఎంత బాగా పాతుకుపోయింది, కొనుగోలు నిర్ణయాలను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తోంది, ఏ మేరకు కస్టమర్ విశ్వాసాన్ని చూరగొన్నదీ తెలిపే కొలమానం ఇది. ఉదాహరణకు సాఫ్ట్ డ్రింక్ అనగానే కోకాృకోలా, పెప్సీ గుర్తుకొస్తాయి. అధిక బ్రాండ్ రీకాల్ కలిగి ఉండడమే ఇందుకు కారణం. -
‘బ్రేకింగ్ న్యూస్’తో వణికిపోయిన పిఠాపురం!
40 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున పిఠాపురం అనే గ్రామం. ఆ ఊరిలోని సర్పంచ్ ఇంటి వరండాలో ఏర్పాటు చేసిన ఏకైక టీవీని చూసి ఊరి ప్రజలంతా హడలిపోతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఏ చిత్రలహరి పాటనో.. సినిమానో.. వార్తలో కాకుండా ఆ ఊరి ప్రజల గుట్టునే ‘‘బ్రేకింగ్ న్యూస్’’గా ప్రసారం చేయడం మొదలుపెట్టింది ఆ టీవీ. “బ్రేకింగ్ న్యూస్! రామయ్య పొలంలో పని చేయకుండా చెరువుకట్టపై నిద్రపోతున్నాడు!”.. టీవీలో చుక్కలు వస్తూనే బ్యాక్గ్రౌండ్లో ఓ పురుషుడి గొంతుతో గట్టిగా చెప్పింది. అది విని అక్కడున్నవాళ్లంతా పగలబడి నవ్వుల్లో మునిగిపోయారు. ఆ వెంటనే ‘‘కిష్టయ్య భార్య అతనికి తెలియకుండా టౌన్కు వెళ్లి సినిమా చూస్తోంది’’ అనడంతో ఆ నవ్వులు మరింత పెరిగాయి. సీతమ్మ పొరుగింటి వంటకాలు రుచి చూసి.. తనింట్లో వండినవాటిని చెత్తబుట్టలో పడేస్తోంది అనగానే.. సీతమ్మ ముఖం వాడిపోగా జనం అంతా కేరింతలు కొట్టారు. అయితే..ఆ టీవీ ప్రవర్తిస్తున్న తీరుతో నవ్వులు.. ఆశ్చర్యంలో మునిగిపోయిన ప్రజలు.. నెమ్మదిగా అది చెబుతున్న బ్రేకింగ్ న్యూస్ వింటూ ఆందోళనకు గురయ్యారు. అందుకు కారణం.. అది బయటపెడుతున్న రహస్యాలే!. దాని వల్ల ఊళ్లో వాళ్ల చిచ్చు రాజుకుంటోంది. కుటుంబాల్లో కలహాలు మొదలయ్యాయి. చివరాఖరికి.. కాపురాలు కూలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే.. ఆ టీవీని కట్టేశారు. దానికి ఉన్న డిష్ యాంటేనాను పీకేయించాడు సర్పంచ్. అయినా అది ‘బ్రేకింగ్ న్యూస్’ చెప్పడం ఆపలేదు. దీంతో ఊరి పెద్ద తలపట్టుకున్నాడు. చివరకు రచ్చబండ దగ్గరకు ప్రజలను ఆహ్వానించాడు. ఇకపై మనం నిజాయితీగా ఉందాం. అప్పుడు టీవీ మనల్ని బ్రేకింగ్ న్యూస్గా చూపించే అవకాశం ఉండదు అన్నాడు. దానికి అంతా సరే అన్నారు. ఆ రోజు నుంచి గ్రామంలో అబద్ధమనేది వినిపించలేదు. మోసాలు తగ్గాయి. ఎవరి ఇళ్లలో వాళ్లు కాపురాలు చేసుకుంటూ హాయిగా గడిపారు. ఆ టీవీ నేర్పిన గుణపాఠంతో నిజాయితీగా జీవిస్తూ వచ్చారు. అప్పటి నుంచి ఆ టీవీ.. ఎప్పుడు ఏం బ్రేకింగ్ న్యూస్ దొరుకుతుందా? అని ఎదురు చూస్తూ అలాగే ఉండిపోయింది.ఇవాళ(నవంబర్ 21..) ప్రపంచ టెలివిజన్ దినోత్సవం సందర్భంగా ఓ చిన్ని కల్పితకథ -
కుట్లకు బదులు ‘ఫెవిక్విక్’!
పసిబిడ్డ తలకు గాయమై రక్తమోడుతుంటే, తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. బిడ్డను కాపాడుకునేందుకు ఆసుపత్రికి పరుగులు తీశారు. కానీ, అక్కడి వైద్యుని నిర్వాకం మానవత్వాన్ని, వృత్తి ధర్మాన్ని ప్రశ్నార్థకం చేసింది. కుట్లు వేయాల్సిన చోట, రూ.5 విలువైన ’ఫెవిక్విక్’ (సూపర్ గ్లూ) పూశాడు. చికిత్స పేరుతో ఆ పసిబిడ్డపై దారుణ ప్రయోగం చేశాడు. రాత్రంతా నొప్పి తాళలేని బిడ్డ రోదన, తల్లిదండ్రులకు పీడకలగా మిగిల్చింది. ఫెవిక్విక్తో వైద్యం! ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరం జాగృతి విహార్కు చెందిన సర్దార్ జస్పిందర్ సింగ్ ఇంట్లో ఆడుకుంటున్న పసివాడి తల అనుకోకుండా టేబుల్ అంచుకు బలంగా తగిలింది. అంతే, రక్తం ధారగా కారిపోయింది. ఉలిక్కిపడ్డ తల్లిదండ్రులు, ఆలస్యం చేయకుండా బిడ్డను వెంటనే సమీపంలోని భాగ్యశ్రీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాధారణంగా తలకు గాయమై రక్తం వస్తుంటే, దాన్ని శుభ్రం చేసి కుట్లు వేయడం వైద్యుని విధి. కానీ, ఆ డాక్టర్.. రూ.5 విలువైన ఫెవిక్విక్ ట్యూబ్ కొనుక్కు రమ్మని చిన్నారి తల్లిదండ్రులను పురమాయించాడు. అదివిన్న తల్లిదండ్రులు షాకైనా, బిడ్డ గాయం తీవ్రత వల్ల ఏమీ మాట్లాడలేకపోయారు. వారు తెచి్చన గ్లూను డాక్టర్.. ఆ పసిబిడ్డ తలపై రక్తమోడుతున్న గాయంపై పూశాడు. గ్లూ అంటించడంతో.. నొప్పి తట్టుకోలేక చిన్నారి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వైద్యుడిని ప్రశి్నస్తే, ‘కాసేపట్లో నొప్పి తగ్గిపోతుంది’.. అని తేలిగ్గా కొట్టిపారేశాడట. కంగుతిన్న వైద్యులు ఆ రాత్రి ఆ బిడ్డ తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేదు. ఆ పసిబిడ్డ ఏడుపు, నొప్పి ఏమాత్రం తగ్గలేదు. దీంతో, తెల్లవారగానే బిడ్డను తీసుకొని లోకప్రియ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు గాయాన్ని పరిశీలించి కంగుతిన్నారు. తలమీద గట్టిగా అతుక్కుపోయిన ఆ జిగురును చూసి షాకయ్యారు. ఆ గట్టిపడిన అడ్హెసివ్ను (ఫెవిక్విక్ను) తొలగించడానికి మూడు గంటల సమయం పట్టింది. మొత్తానికి జిగురును తొలగించి, గాయాన్ని పూర్తిగా శుభ్రం చేసి, నాలుగు కుట్లు వేశారు. తల్లిదండ్రులు ఆ డాక్టర్ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒకవేళ ఫెవిక్విక్ గాయం నుంచి కారిపోయి కంట్లోకి పోయి ఉంటే, ఎంత ఘోరం జరిగేది? మా బిడ్డకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహించేవారు?’అని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశం.. ఈ దారుణ సంఘటనపై బాధిత చిన్నారి కుటుంబం నేరుగా.. మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కటారియా దృష్టికి తీసుకెళ్లింది. ‘చిన్నారి కుటుంబం ఫిర్యాదుపై ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక ఆధారంగా ఆ వైద్యునిపై తగిన చర్యలు తీసుకుంటాం’.. అని డాక్టర్ అశోక్ కటారియా తెలిపారు. బాధిత కుటుంబం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాల యం దృష్టికి కూడా తీసుకెళ్లింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
World Television Day: చిత్రలహరి వస్తుంది పద...
కొద్దిగా ఉన్నప్పుడే బాగుండేది. టీవీ ఉన్న ఇంటికి టీవీ లేని వాళ్లంతా వచ్చి కూచునేవారు. ఆదివారం రామాయణం కోసం ప్రతి ఇల్లూ ఆతిథ్యం ఇచ్చేది. చిత్రలహరికి గడప బయట నిలబడి తొంగి చూసే పిల్లల్ని అదిలించేవారు కాదు. ఇంటి పైన యాంటెనా, ఇంట్లో డయనారా అదీ హోదా అంటే. టెలివిజన్ జీవితంలో భాగం అయిన రోజులు బాగుండేవి. ఇవాళ జీవితమంతా టీవీగా మారి ఊపిరి సలపడం లేదు. టీవీ వచ్చిన రోజులకూ ఇప్పటికీ ఎంత తేడా!సినిమా తెర మీద కాకుండా మరో తెర మీద, అదీ ఇంట్లో ఉండే తెర మీద బొమ్మ పడుతుందని ఊహించని రోజుల్లో టెలివిజన్ వచ్చి చేసిన సందడి అంతా ఇంతా కాదు. నాటి హైద్రాబాద్, లేదా మద్రాస్ (చెన్నై), లేదా కొండపల్లి నుంచి సిగ్నల్స్ సరిగా ఆ రోజుకి అందాయో ఇక పండగే పండగ. ఎందుకు పండగ? సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది వరకు ఆ తెలుపు నలుపు టీవీలో ఏదో ఒకటి ఉచితంగా ప్రసారం అవుతూ ఉంటుంది. చూడొచ్చు. అందుకని.సమయం ఉన్న రోజులుమన దేశంలో 1959లో టెలివిజన్ మొదలైనా సరైన ప్రసారాలు రూపుదిద్దుకోవడానికి 1976కి కాని సాధ్యపడలేదు. నగరాలను దాటి ఊళ్లకు సిగ్నల్ అందే వ్యవస్థ ఏర్పడటానికి మరో పదేళ్లు పట్టింది. కలర్ ప్రసారాలు 1982లో మొదలైనా 1990లకు గాని కలర్ టీవీలు కొనే శక్తి ఊళ్లల్లో ఏ కొద్దిమందికో తప్ప అందరికీ రాలేదు. ఏతా వాతా 1985 నుంచి తెలుపు, నలుపు టీవీ ప్రసారాలు తెలుగు ప్రేక్షకులకు తెలుస్తూ వచ్చాయి. ఆ రోజుల్లో మనుషులందరి దగ్గరా ఎక్కడ లేని తీరిక, సమయం. కాబట్టి టీవీ ఆన్ చేసి అర్థమైనా కాకపోయినా చూస్తూ ఉండటం అలవాటుగా మారింది. ఇక అందులో ఆసక్తికరమైన కార్యక్రమాలు మొదలయ్యాక అతుక్కుపోయారు. టెలివిజన్ చేసిన మొదటి పని ఏమిటంటే– దేశ వాసులందరికీ ఒకే టీవీ ఒకే వినోదం అనే భావన కలిగించడం. ప్రాంతీయ ప్రసారాలు ఉన్నా ముఖ్యమైన మీట ఢిల్లీలో ఉంటుందని అందరికీ తెలియచేయడం. కేంద్ర శక్తిని స్థాపించడంలో టెలివిజన్ ముఖ్య పాత్ర పోషించింది.రామాయణం సంచలనం1987 నుంచి మొదలైన ‘రామాయణం’ సీరియల్ టెలివిజన్ పవర్ ఏంటో దేశానికి చాటింది. వ్యాపార ప్రకటనలు ఎలక్ట్రానిక్ మీడియాలో వెల్లువెత్తడం కూడా మొదలయ్యాయి. అంతవరకూ టికెట్ ఇచ్చి సినిమా హాల్లో రామాయణం చూసిన జనం ఈ ఉచిత రామాయణాన్ని తండోపతండాలుగా చూశారు. ఆ తర్వాత ‘మహాభారత్’, ‘హమ్లోగ్’, ‘నుక్కడ్’, ‘ఉడాన్’, ‘మాల్గుడీ డేస్’... ప్రేక్షకులకు అందమైన డేస్ మిగిల్చాయి.చిత్రహార్–చిత్రలహరిప్రతి బుధవారం వచ్చే హిందీ పాటల ‘చిత్రహార్’, శుక్రవారం వచ్చే ‘చిత్రలహరి’ సూపర్హిట్ ఆదరణ పొందాయి. జనం తెలుగు పాటల కోసం టీవీల ముందు కొలువు తీరేవారు. ఆ రోజుల్లో ప్రతివారం ‘ఒక బృందావనం సోయగం’ (ఘర్షణ 1988) పాట తప్పనిసరిగా ఉండేది. పండగల ముందు ఆయా పండగలకు తగ్గట్టుగా పాటలు ఉండేవి. అదే సమయంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ‘ఆనందో బ్రహ్మ’ సూపర్హిట్ అయ్యింది. ఆదివారం రోజు అతి పాత తెలుగు చిత్రం వచ్చినా జనం విరగబడి చూసేవారు.అపురూప క్షణాలుఇంటి పైనా యాంటెనా, ఇంట్లో టీవీ ఉండటం ఎంతో గొప్పయిన రోజులు అవి. ఇక కలర్ టీవీ ఉన్న ఇంటికి డిమాండ్ జాస్తిగా ఉండేది. వాన వచ్చినా, గాలి వీచినా నిలువని బొమ్మతో వేగినా అదే పెద్ద సంబరం. ఇన్స్టాల్మెంట్లో కొని ఇంటికి టీవీ తెచ్చిన రోజు పండగ ఉండేది. మధ్యతరగతి జీవులకు తగినట్టుగా ‘మినీ టీవీ’లు కంపెనీలు తెచ్చాక వాటితోనే సర్దుబాటు చేసుకున్న సన్నజీవులెందరో. దూరదర్శన్ సిగ్నేచర్ ట్యూన్తో సహా దూరదర్శన్ అందరికీ అభిమాన పాత్రమైంది. ఆదివారం మధ్యాహ్నం ప్రాంతీయ భాషా చిత్రాలు కూడా సబ్టైటిల్స్తో చూసేవారు. అలా ఎన్నో ఉత్తర కన్నడ, తమిళ, మలయాళ సినిమాలు చూశారు. టీవీ ప్రసారాల వల్ల ఇరుగిల్లు పొరుగిల్లు ఒకే ఇల్లయినట్టుగా అందరూ కలిసి మెలిసి ఉండేవారు. టీవీలో క్రికెట్ లైవ్ చూడటానికి ఎంతో మంచిగా వ్యవహరించాల్సి వచ్చేది. స్నేహాలు చేయాల్సి వచ్చేది.ఇప్పుడు చేతిలో ఫోన్. అనుక్షణం రీల్స్. చేతిలోనే కదిలే బొమ్మ. దేనికీ విలువ లేదు. ఓటీటీల్లో వందల సినిమాలు ఉన్నా దేనిని ఎంపిక చేసుకోవాలో తెలియని పరిస్థితి. ఏదీ నచ్చదు. కానీ ఆ రోజుల్లో వచ్చిందే నచ్చేది. అతిగా లభ్యమైనది ఏదైనా విలువ కోల్పోతుంది. ఇవాళ విజువల్ ఎంటర్టైన్మెంట్ వేయి రూ పాలు సంతరించుకున్నా, ఇరవై నాలుగ్గంటల న్యూస్ చానల్స్ ఉన్నా అవన్నీ జల్లెడలో జారే ఊకలానే ఉంటున్నాయి. టెలివిజన్ ప్రసారాల ప్రొఫెషనలిజమ్, హుందాతనం, ఆ న్యూస్రీడర్లు, ఆ యాంకర్లు... ఆ మాట... ఉచ్చారణ... పలుకు... ఇప్పుడెక్కడ. పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయింది. -
టైగర్ జిందా హై!
ఔను. పులి నవ్వింది. నిత్యం సింహగర్జనలే వింటూ వచ్చిన గుజరాతీలకు శ్రవణానందం కలిగేలా గొంతెత్తి మరీ గాండ్రించింది. మూడు దశాబ్దాల పై చిలుకు సుదీర్ఘ విరామం అనంతరం గుజరాత్ లో దర్జాగా పాదం, కాదు కాదు, పంజా మోపింది. దాంతో, పులుల కోసం తమ 32 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఎట్టకేలకు తెర పడి గుజరాతీలు తెగ సంబరపడి పోతున్నారు. గుజరాత్. మన దేశంలో సింహాలకు ఆలవాలమైన ఏకైక రాష్ట్రం. అయితే అంత పెద్ద రాష్ట్రంలో పెద్ద పులి తిరగాడి మూడు దశాబ్దాలు దాటింది. ఆ లోటును తీరుస్తూ ఏకంగా రాయల్ బెంగాల్ టైగర్ ఒకటి ఇప్పుడు రాష్ట్రంలో కాలు మోపింది. పొరుగునున్న మధ్యప్రదేశ్ నుంచి వచ్చి, దొహాడ్ జిల్లాలోని రతన్ మహ ల్ అభయారణ్యంలో 9 నెలలుగా స్వేచ్ఛా విహారం చేస్తోంది. కొన్నేళ్లుగా పులులు అడపదడపా పక్క రాష్ట్రాల నుంచి రావడం పరిపాటే అయినా, ఏదో చట్టం చూపుగా ఇలా వచ్చి అలా వెళ్లినవే తప్ప ఇలా నెలల పాటు తిష్ఠ వేసుకున్న దాఖలా మాత్రం ఇదేనని గుజరాత్ అటవీ అధికారులు చెబుతున్నారు. ఇంత కాలం ఉండటమంటే ఇక ఇక్కడే ఉండిపోవడమేనని వారు వివరించారు. దీన్ని తమకు గర్వకారణంగా, గుజరాత్ పర్యావరణ, జీవ వైవిధ్య చరిత్రలోనే సువర్ణాక్షరాలతో రాయదగ్గ ఉదంతంగా అభివరి్ణంచారు రాష్ట్ర అటవీ మంత్రి అర్జున్ మోద్వాడియా. అటవీ శాఖ అధికారులు కూడా, ‘ఇన్నేళ్లుగా పులులకు మొహం వాచి ఉన్నాం. రాక రాక వచ్చిన ఈ అవకాశాన్ని జారవిడుచుకునేది లేదు. గుజరాత్ లో పులుల సంఖ్యను ఇతోధికంగా పెంచడమే ఇప్పుడు మా ఏకైక లక్ష్యం‘ అంటున్నారు. వచ్చిన రాయల్ బెంగాల్ టైగర్ ఐదేళ్ల కోడె ప్రాయంలో ఉన్న మగ పులి. దాంతో దానికి ఈడూ జోడూ అయిన ఒక చూడ చక్కని ఆడ పులిని సెట్ చేసే ప్రయత్నంలో పడింది గుజరాత్ అటవీ శాఖ. మధ్యప్రదేశ్లోని జబువా, కథియవాడా ప్రాంత అడవుల్లో కొన్నేళ్లుగా పులుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దాంతో వాటికి అవసరమైన వేట దొరక్క వలస బాట పడుతున్నాయి. గుజరాత్ లోకి ప్రవేశించిన రాయల్ బెంగాల్ టైగర్ ఆ బాపతేనని అటవీ అధికారులు చెబుతున్నారు. గుజరాత్ నేలపై పులులు అరుదుగా అప్పుడెప్పుడో 1980ల్లో ఒకసారి, మళ్లీ 2002 ప్రాంతంలో ఇంకోసారి చట్టం చూపుగా అడుగు పెట్టాయని వారు వివరించారు. ‘గుజరాత్ లో సౌరాష్ట్ర ప్రాంతం సింహాలకు పెట్టింది పేరు. ఇక సెంట్రల్ గుజరాత్ చిరుతలకు ఆలవాలం. ఇప్పుడు పులి రాకతో మా రాష్ట్రానికి నిండుడ వచ్చింది‘ అన్నది వారి మాట. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘స్పాట్’ పెట్టిందో సఫా..!
దాని పేరు స్పాట్.. బరువు దాదాపు ఒక జర్మన్ షెపర్డ్ కుక్కతో సమానం. అయితే ఇది కేవలం డాన్స్ వీడియోలతో వైరలైన రోబో శునకం కాదుసుమా.. ప్రస్తుతం ఇది అమెరికా, కెనడాలోని 60కి పైగా పోలీసు విభాగాలలో, అత్యంత ప్రమాదకరమైన మిషన్లలోకి దూసుకుపోతోంది. దీనిధర వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి: ప్రాథమిక యూనిట్ ధర దాదాపు రూ.90 లక్షలు (100,000 డాలర్లు). అధునాతన అదనపు పరికరాలతో కలిపి ఇది రూ.2.2 కోట్లు (250,000 డాలర్లు) దాటిపోతుంది.ప్రాణాపాయ మిషన్లలోకి ప్రవేశం అయిదేళ్ల క్రితం ఆవిష్కరించిన ఈ నాలుగు కాళ్ల రోబో, ఇప్పుడు పోలీసుల అత్యవసర ఆపరేషన్లలో కీలకంగా మారింది. మానవ ప్రాణాలను పణంగా పెట్టాల్సిన చోట, స్పాట్ ముందుంటుంది. ప్రమాదకరమైన వస్తువులను తనిఖీ చేయడానికి, సాయుధ గ్యాంగ్స్టర్ల మధ్య చిక్కుకున్న బందీల రక్షణలో, రసాయనాలు చిందటం లేదా ప్రమాదకరమైన ప్రదేశాల సర్వేల్లో దీని సేవలు అపారం. ఒక హోస్టేజ్ రెస్క్యూ మిషన్ గురించి మసాచుసెట్స్ స్టేట్ పోలీస్కు చెందిన ట్రూపర్ జాన్ రగోసా చెబుతూ, ‘స్పాట్ ఒక ఆ దుండగుడిని ఎదుర్కొన్నప్పుడు, ’ఏంటీ కుక్క?’ అంటూ అవాక్కయ్యాడు’.. అని తెలిపారు.‘స్పాట్’ ఏం చేయగలదంటే.. ‘స్పాట్’ను ఒక టాబ్లెట్ కన్సోల్ ద్వారా నియంత్రించవచ్చు. ఈ రోబో సామర్థ్యాలు సంప్రదాయ చక్రాల రోబోల కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయి. ఎగిరి దూకడం, మెట్లు ఎక్కడం, జారే ఉపరితలాలపై నడవడం. మలి్టపుల్ కెమెరాల నుండి లైవ్ వీడియో స్ట్రీమ్ పంపడం, ఆటోమేటిక్గా అడ్డంకులను గుర్తించి, దారి మళ్లడం లాంటి సవాళ్లను అవలీలగా ఎదుర్కొంటుంది. తాళం వేసిన తలుపులను కూడా తెరవగలుగుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,000 స్పాట్ రోబోలు పనిచేస్తుండగా, భద్రతా ఏజెన్సీల నుండి డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని బోస్టన్ డైనమిక్స్ వైస్ ప్రెసిడెంట్ బ్రెండన్ షుల్మాన్ తెలిపారు.పోలీసు ప్రపంచానికి పెద్ద అండ చివరికి, డ్యాన్స్ వీడియోలతో ప్రపంచాన్ని నవ్వించిన ఈ రోబో, ఇప్పుడు ఆధునిక పోలీసు వ్యవస్థ సంక్లిష్ట ప్రపంచంలోకి దూసుకుపోతూ, ఆవి ష్కరణకు, వివాదా నికి మధ్య నిలుస్తోంది. రూ.90 లక్షల ఈ ’రోబో డాగ్’ భవి ష్యత్తు పోలీసు ప్రపంచాన్ని పూర్తిగా మార్చబోతోందనేది మాత్రం నిస్సందేహం.అంతులేని ప్రశ్నలు.. ఆందోళనలు స్పాట్ ప్రవేశంతో సాంకేతికత ఎంత ఆశ కలిగిస్తోందో, అంతకు మించిన ప్రశ్నలు, భయాలు రేకెత్తుతున్నాయి. ఇది కేవలం సాంకేతిక ఆవిష్కరణ మాత్రమే కాదు, పోలీసు వ్యవస్థలో ఒక కొత్త శకానికి సంకేతం. న్యూయార్క్ పోలీసులు 2021లో స్పాట్ను ఉపయోగించడంపై నిరసనలు వెల్లువెత్తాయి. దాని అధిక ధర, నిఘా పాత్రపై ప్రజలు ఆందోళన చెందారు. నిరసనల కారణంగా తాత్కాలికంగా ఆపినా, తర్వాత కొత్తగా రెండు యూనిట్లు కొనుగోలు చేశారు. టెక్సాస్ ఏ అండ్ ఎం ప్రొఫెసర్ రాబిన్ మర్ఫీ మాట్లాడుతూ.. స్పాట్ చురుకుదనం గొప్పదే అయినా, రోబోటిక్ సాధనాల వాడకం పెరిగితే పోలీసులు ప్రజల నుండి మరింత దూరం అవుతారన్నారు. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ ర్యాన్ కాలో మాట్లాడుతూ.. ‘అధికారులు ప్రాణాలను పణంగా పెట్టకూడదు, కానీ మనం రోబోటిక్ పోలీసు రాజ్యంగా మారకూడదు’.. అని హెచ్చరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చలికాలం మూడ్ భద్రం
చలికాలం పని చేయబుద్ధి కాదు. హుషారుగా అనిపించదు. అదో వెలితిగా అనిపించే భావన. నిరాశ. ఆకలి లేకపోవడం. ఎండ, వెలుతురు లేక చిరాకు. ఇదంతా ఏదో మామూలు విషయం కాదని ‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్’ (శాడ్) అనే ఒక విధమైన డిప్రెషన్ అని మనస్తత్వ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలం వస్తే మూడ్ను చెక్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోడవం చాలా అవసరం అంటున్నారు. అసలు ఈ ‘శాడ్’ ఏమిటి?ఉదయాన్నే సూర్యుడి ముఖం చూసి పనిలో పడితే అదోతృప్తి. సూర్యకిరణాలు ఒంటిని తాకితే లోలోపల ఉత్తేజం. కాసింత ఎండ పొడ తగిలితే మనసంతా ఉత్సాహం. కాని చలికాలంలో వణికించే చలి ఆ అవకాశాన్ని అరుదుగా ఇస్తుంది. పొద్దున లేవగానే మంచు స్వాగతం పలుకుతుంది. రోజంతా పలుచటి వెలుతురు తప్ప సూర్యుడు అందించే ఉత్తేజం మనకు చేరదు. దాంతో ఒళ్లంతా బద్దకంగా, మనసంతా గజిబిజిగా అనిపిస్తుంది. ఇలాంటి స్థితిని ‘వింటర్ బ్లూస్’ అంటుంటారు. ఇంత వరకూ మామూలే. కాని కొందరికి ఈ సమయం చాలా నిరాశ, నిర్లిప్తతలు ఆవరిస్తాయి. ఏదో కోల్పోయినట్టు, అంతా ముగిసిపోయినట్టు అనిపిస్తుంది. కొందరికి ఆకలి మందగిస్తుంది. తెలియని డిప్రెషన్ కి కొందరు లోనవుతారు. దీన్నే ‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్’ (శాడ్) అంటున్నారు వైద్యులు. ఇలాంటి పరిస్థితిని గమనించుకుంటూ ఉండాలని హెచ్చరిస్తున్నారు.ఎండకు– మెదడుకు...చలికాలం తొందరగా నిద్ర లేవాలనిపించదు. చలిలో లేచి ఏదైనా చేయాలనిపించదు. ఎనిమిది గంటలు దాటితే తప్ప సూర్యుడు తేటగా కనిపించడు. కాసింత వేడి ఒంటికి తగిలాక కొంచెం ఉత్సాహం వచ్చి పనులు మొదలుపెడతారు చాలామంది. ఇదంతా ఎందుకు? వాతావరణానికీ, మన మనసుకు మధ్య ఉండే సంబంధమే ఇందుకు కారణం అంటున్నారు మానసిక శాస్త్ర నిపుణులు. ‘సూర్యుడి వెలుగు కారణంగా మెదడులో కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. అవి మనలో ఉత్సాహాన్ని నింపుతాయి. చలికాలంలో ఆ చర్యలు జరగకపోవడం వల్ల నిస్సారంగా, బద్దకంగా అనిపిస్తుంది’ అని వివరిస్తున్నారు.చలికాలమే మేలు అనుకుంటారా?ఎండాకాలం తట్టుకోలేనంత వేడి ఉంటుంది. చలికాలం వస్తే బాగుండని ఆ వేడి తట్టుకోలేక కొందరు అనుకుంటారు. కానీ కొందరికి మాత్రం చలికాలం నచ్చదు. రోజంతా ఉత్సాహం లేని పనులు చేస్తూ, గంటల కొద్దీ ఒకేచోట గడుపుతూ ఉంటారు. ఈ సమయంలో ఒంట్లో సెరటోనిన్, మెలటోనిన్ రసాయనాలు విడుదల కాకపోవడమే ఇందుకు కారణమంటున్నారు వైద్యులు. సూర్యరశ్మి తక్కువగా ఉండటం కూడా దీనికి తోడై డిప్రెషన్ లోకి నెట్టేస్తుందని అంటున్నారు. అందుకే చలికాలం అనగానే కొందరిలో ఆనందం మాయమైపోతుంది. సంతోషం దూరమవుతుంది. ఏ పనీ చేసేందుకు ఆసక్తి రాక మిన్నకుండిపోతుంటారు.దీన్ని గుర్తించేదెలా?‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్’ అందరిలో ఉంటుందని చెప్పలేం. ఒకవేళ ఉన్నా, దాన్ని గుర్తించడం కష్టం. అత్యల్ప ఉష్ణోగ్రతలు కలిగిన దేశాల్లో చాలామంది దీని బారిన పడుతున్నారు. ఇటువంటి వారు తొందరగా డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు. తమకున్నది ‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్’ అన్న విషయం కూడా వారికి తెలియడం లేదు. కొందరు ఈ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు అధికంగా తినడం, దురలవాట్లకు లోనవడం వంటివి చేస్తున్నారు. దీంతో ఆ ప్రభావం అంతా వారి ఆరోగ్యం మీద పడి తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.శాడ్ లక్షణాలు...→ రోజువారి పనుల్లో ఆసక్తి కోల్పోవడం → నిరాశ ∙ఏకాగ్రత కోల్పోవడం→ ఒంటరితనం, ఏకాంతం ఇష్టపడటం→ నిద్రలేమి, అలసట (లేదా) అధిక నిద్ర, అధిక తిండి → నలుగురిలో కలవకపోవడంఏమిటి పరిష్కారం?→ చలికాలంలో రోజూ పొద్దున్నే లేచి వ్యాయామం, యోగా చేయడం ఉత్తమమైన మార్గం. దీని వల్ల శరీరానికి ఉల్లాసంగా అనిపించడంతోపాటు మానసికంగా ఏదో ఒక పని చేయాలన్న సంసిద్ధత ఏర్పడుతుంది.→ ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని పనిచేయకుండా రకరకాల పనులపై దృష్టి నిలపడం మరో పరిష్కారం. → డిప్రెషన్ భావన వచ్చినప్పుడు ఆత్మీయులతో మాట్లాడటం, సంగీతం వినడం, డ్యాన్స్ చేయడం వంటివి మనసును తేలికపరుస్తాయని అంటున్నారు. → చలికాలాన్ని ప్రకృతి సహజమైన విషయంగా భావించి, మనసు దృఢ పరుచుకుంటే మానసికంగా బలవంతులు అవుతారని వైద్యులు సూచిస్తున్నారు. -
చలపతితో మొదలు నంబాల, హిడ్మాతో ముగింపు!
మావోయిస్టు పార్టీని, ఆ ఉద్యమాన్ని పూర్తిగా అణచివేసేందుకు ఆపరేషన్ కగార్(Operation Kagaar) చేపట్టింది అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర హోం శాఖ. ఇందుకోసం 2026 మార్చిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే.. ఈ ఏడాది కాలంగా జరిగిన ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు.. ఇతరత్రా పరిణామాలు ఆ లక్ష్యానికి భద్రతా బలగాలను చేరువే చేశాయి. కేంద్ర హోం శాఖ గణాంకాలు పరిశీలిస్తే.. గత పదేళ్లలో మావోయిస్టు ఉద్యమం తీవ్రంగా క్షీణించింది కూడా. ఈ ఏడాది జనవరిలో ఛత్తీస్గఢ్-ఒడిశా-తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ మొదలయ్యాక.. ఆ పార్టీకి వరుస గట్టి దెబ్బలు తగలడం మొదలైంది. మావోయిస్టు ఒడిశా రాష్ట్ర కమిటీ చీఫ్ చలపతి (రామచంద్ర రెడ్డి అలియాస్ ప్రతాప్)తోసహా 13 మంది మావోయిస్టులు 2025 జనవరి 21న ఛత్తీస్గఢ్–ఒడిశా సరిహద్దులోని జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్తో ఒడిషాలో మావోయిస్టు ఉద్యమం శకం ముగిసింది. అయితే.. ఈ ఎన్కౌంటరే కగార్కు ప్రారంభ సంకేతంగా మారింది. ఇక్కడి నుంచే.. కేంద్రం చేపట్టిన విస్తృత వ్యూహాత్మక చర్యలు మావోయిస్టు ఉద్యమాన్ని తీవ్రంగా దెబ్బతీస్తూ వచ్చాయి.ఆపరేషన్ కగార్ (Operation Kagaar)లో భాగంగా.. 1 లక్షకు పైగా భద్రతా సిబ్బంది, డ్రోన్లు, AI ఆధారిత నిఘా పరికరాలను దట్టమైన అడవుల్లో వినియోగించాయి భద్రతా బలగాలు. ఈ వ్యూహాత్మక చర్యలు వల్ల మావోయిస్టులు చెల్లాచెదురయ్యారు. ఈ క్రమంలో భారీ ఎన్కౌంటర్లు, సామూహిక లొంగుబాట్లు.. ఇంకోవైపు మావోయిస్టు పార్టీలో నాయకత్వ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈలోపు..అబూజ్మడ్ అడవుల్లో మే 21వ తేదీన నంబాల కేశవరావు (బస్వరాజ్) ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. నంబాలతో పాటు ఆ ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులతో పాటు హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి వ్యూహాత్మకంగా పెద్ద దెబ్బ అయ్యింది. ఇక్కడి నుంచి మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టసాగాయి. ఆ వెంటనే మల్లోజుల వెంకటరావు (సోను), ఆశన్న వంటి కీలక నేతలు సరెండర్ కావడం.. ఇంటెలిజెన్స్ ఆధారంగా కూంబింగ్ ఆపరేషన్లు పెరగడం వల్ల ఉద్యమం లోపల భయాందోళనలు పెరిగాయి. సెంట్రల్పై కమిటీ లొంగిపోయిన సభ్యుల ఆరోపణలు.. వాళ్లను ఉద్యమ ద్రోహులుగా సెంట్రల్ కమిటీ ప్రకటించడం.. ఇలా మావోయిస్టు ఉద్యమం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. గత రెండేళ్లలో వివిధ ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల సంఖ్య 430 మంది. లొంగిపోయిన వాళ్లు 1,500 మంది. ఈ మధ్యకాలంలో కేంద్ర కమిటీ సభ్యులే లొంగిపోతుండగా.. చేసేదేం లేక కింది స్థాయిలో కేడర్ కూడా పార్టీని వీడుతూ వచ్చింది. ప్రస్తుతం పార్టీలో కేవలం 12మంది కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది. ఇందులో ఓ విశేషం ఉంది. ఆ పన్నెండు మందిలో.. 8 మంది రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలే ఉన్నారు. హనుమంతు, గణపతి, తిరుపతి, చంద్రన్న, సంగం వీళ్లంతా ఇక్కడి వాళ్లే. ఇక కీలకంగా ఉన్న ఒకే ఒక్కడు మడావి హిడ్మా. ఆయన కోసం స్పెషల్ ఆపరేషన్ ఏడాది కాలంగా ఉదృతంగా సాగింది. ఆయన ‘లెక్క తేలిస్తే’.. మావోయిస్టు పార్టీ అధ్యాయం ముగిసినట్లేనని కేంద్ర హోం శాఖ బలంగా భావించింది కూడా. ఇప్పుడు అది కూడా జరగడంతో ఆపరేషన్ కగార్ దాదాపుగా ముగిసినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. -
భారత ఉన్నత విద్యకు స్వర్ణయుగం
పరిశోధక విద్య విషయంలో దేశం గణనీయమైన పురోగతి సాధిస్తోంది. ఆరేళ్లలో విశ్వవిద్యాలయాల పీహెచ్డీ ప్రవేశాల్లో ఏకంగా 21శాతం వృద్ధి కనిపిస్తోంది. అంటే 2019లో 97,947 ప్రవేశాల నుంచి 2025లో 1,18,556కి చేరుకుంది. ఇక పీహెచ్డీల సమర్పణ, అవార్డుల స్వీకరణ 49 శాతం పెరిగి 24,481కి ఎగబాకింది. వీటి ఫలితంగా పరిశోధన ప్రచురణలు మూడు రెట్లు వేగాన్ని సాధించి పేటెంట్ల సంఖ్య పెరుగుదలలో తోడ్పాటును అందిస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) పదేళ్ల డేటా ఆధారంగా ప్రముఖ సర్వీస్ నెట్వర్క్ సంస్థ– కేపీఎంజీ చేసిన అధ్యయనంలో వెల్లడైన పలు ఆసక్తికరమైన అంశాలు ఇవీ... – సాక్షి, అమరావతిప్రపంచ వాటా పెరుగుదలపరిశోధన కోసం దశాబ్ద కాలంగా సాగిస్తున్న కృషి పేటెంట్ల సంఖ్య పెరుగుదలతో స్పష్టంగా కనిపిస్తోంది. 2018–25 మధ్య విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ సంస్థల ప్రచురణ వాల్యూమ్స్ 150 శాతం, ఫార్మసీ, మేనేజ్మెంట్లో 300 శాతం వృద్ధి చెందాయి. ఈ కాలంలోనే ప్రపంచ పరిశోధన ప్రచురణలలో భారతదేశ వాటా 3.5 శాతం నుంచి 5.2 శాతానికి దూసుకెళ్లింది. ఉన్నత విద్యా సంస్థల్లో పీహెచ్డీ అర్హత కలిగిన అధ్యాపకుల నేతృత్వంలో బోధన శాతం గణనీయంగా పెరిగింది. దీనితో దేశీయంగా పీహెచ్డీ ప్రవేశాలు, అవార్డుల స్వీకరణ గణాంకాలు గణనీయంగా పెరిగాయి.విద్యా నైపుణ్యం, బోధన నాణ్యతకు ప్రాధాన్యం..దేశంలోని అగ్రశ్రేణి సంస్థల్లో దాదాపు 60% పీహెచ్డీ అర్హత కలిగిన అధ్యాపకులు బోధన సాగిస్తున్నారు. తద్వారా పరిశోధన, విద్యా నైపుణ్యం, బోధనా నాణ్యతకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఇక్కడ దేశంలోని టాప్ 100 ఉన్నత విద్యా సంస్థలలో పీహెచ్డీ అర్హత కలిగిన అధ్యాపకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మేనేజ్మెంట్ సంస్థలలో 90 శాతానికి పైగా, ఇంజనీరింగ్ కళాశాలల్లో 80 శాతానికి పైగా పీహెచ్డీ అర్హత కలిగిన వారితో విద్యా బోధన కొనసాగుతోంది. కొన్ని అగ్రశ్రేణి సంస్థల్లోని వివిధ విభాగాల్లో 73 శాతానికి పైగా పీహెచ్డీ–అర్హత కలిగిన అధ్యాపకుల నియామకం కనిపిస్తోంది.ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ నిలువుటద్దం..⇒ దేశంలో ఏటా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో దరఖాస్తు చేసుకునే విద్యాసంస్థల సంఖ్య పెరుగుతుండడం విశ్వవిద్యాలయం, ఉన్నత విద్యా సంస్థల బోధన నాణ్యత, వాటి సామర్థ్యానికి నిలువుటద్దం.⇒ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో దరఖాస్తు చేసుకునే విద్యాసంస్థల సంఖ్య 2016లో 2,426 కాగా, 2025 నాటికి 217 శాతం పెరిగి 7,692కి చేరింది.⇒ ఇక కళాశాలల విభాగంలో 401 శాతం అంటే 803 నుంచి 4,030వరకు సంస్థలు ర్యాంకుల కోసం పోటీపడే పరిస్థితి వచ్చింది.⇒ ర్యాంకింగ్స్ విషయంలో ఐఐఎస్సీ బెంగళూరు, జేఎన్యూ, ఐఐటీ మద్రాస్ వంటి ప్రభుత్వ సంస్థల ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఇక ఈ విషయంలో ప్రైవేటు వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల గట్టి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది.⇒ విద్యా సంస్థల్లో నాణ్యత ప్రమాణాలకు సంబంధించి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులతో పాటు క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ కీలకం. ఈ విషయంలో తాజాగా భారత్ 54 సంస్థలతో నాల్గవ అత్యధిక ప్రాతినిధ్యం కలిగిన దేశంగా అవతరించింది. -
నెరుస్తోంది ఇండియా
మన దేశంలో వృద్ధుల జనాభా 2036 నాటికి 23 కోట్లకు చేరుకోనుంది. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం అప్పుడున్న వృద్ధులకు ఇది రెండింతలకు పైగానే అని ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. భారత జనాభాలో వృద్ధుల వాటా 2011లో ఉన్న 8.6 శాతం నుంచి 2050 నాటికి 19.5 శాతానికి చేరనుంది. అంటే సుమారు 31.9 కోట్లకు పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.ఐదింట ఒకరికే బీమా.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ‘లాసి’(లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఇన్ ఇండియా) నివేదిక ప్రకారం.. భారత్లో 60 ఏళ్ల వయసు దాటిన వృద్ధులు 15 కోట్ల మంది ఉన్నారు. వీరిలో ఐదింట ఒకరు మాత్రమే ఆరోగ్య బీమా పరిధిలోకి వస్తున్నారని నివేదిక పేర్కొంది.పింఛను పైనే ప్రాణాలన్నీ..45 ఏళ్లు..అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెద్దలను కూడా వృద్ధుల్లో చేరిస్తే 2050 నాటికి జనాభాలో దాదాపు 40 శాతం మంది.. అంటే 65.5 కోట్ల మంది వృద్ధులు ఉంటారని నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం దాదాపు 70 శాతం మంది వృద్ధులు తమ రోజువారీ అవసరాలకు కుటుంబ సభ్యులపైన, సాధారణ పెన్షన్లపైన ఆధారపడి ఉన్నవారేనని నివేదిక తెలిపింది. చేయూతగా ప్రభుత్వ పథకాలు..వృద్ధుల కోసం ప్రభుత్వం కనీసం రూ.1,000 నుంచి రూ.5,000 వరకు నెలవారీ పెన్ష¯ŒŒ కు హామీ ఇచ్చే ‘అటల్ పెన్షన్ యోజన’, వృద్ధుల సాధికారత కోసం ‘అటల్ వయో అభ్యుదయ యోజన’, గ్రాంట్–ఇన్–ఎయిడ్ పథకం, సీనియర్ సిటిజన్స్ కోసం ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ను అమలు చేస్తోంది.వేల కోట్ల సిల్వర్ ఎకానమీ..వృద్ధులు వినియోగించే వస్తువులు, పొందే సేవల విలువ ఏడాదికి రూ.73,000 కోట్లుగా ఉన్నట్టు నీతి ఆయోగ్ గత ఏడాది విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. రాబోయే సంవత్సరాల్లో ఈ మొత్తం మరెన్నో రెట్లు పెరుగుతుందని అంచనా వేసింది. ఆర్థిక పరిభాషలో దీనిని ‘సిల్వర్ ఎకానమీ’అంటున్నారు.మరిన్ని పథకాలు అవసరం..60 ఏళ్ల వయసులో ఆదాయం ఆగిపోతుంది. చాలామంది నిరాడంబరమైన జీవనశైలికి మారటానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలా కాకుండా ఉండాలంటే 50 ఏళ్ల వయసు నుంచే ఆర్థికంగా జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలూ వృద్ధుల ఆరోగ్యం, సంక్షేమానికి మరిన్ని పథకాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని స్వచ్ఛంద సేవా సంస్థలు కోరుతున్నాయి.అనారోగ్యాలతో సహజీవనందాదాపు 75 శాతం మంది వృద్ధులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక అనారోగ్యాలతో జీవిస్తున్నారు. 40 శాతం మంది కనీసం ఒక వైకల్యంతో బాధపడుతున్నారు. పట్టణాల్లోని వృద్ధుల్లో మధుమేహం అత్యంత సాధారణ దీర్ఘకాలిక సమస్యగా ఉంది. దాదాపు 20 శాతం మంది నిరాశ, నిస్పృహ, డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వృద్ధుల కోసం వినూత్నంగా..ఇండియాలో పెరుగుతున్న వృద్ధుల జనాభా అవసరాలకు అనుగుణంగా కొన్ని కంపెనీలు వినూత్నమైన ఉత్పత్తులు, సేవలను ప్రవేశపెడుతున్నాయి. ఐటీసీ స్నాక్ ఫుడ్స్ ‘కంట్రోల్ + ఆల్ట్ + డిలీట్’అనే క్రియేటివ్ ఫార్ములాతో వృద్ధుల కోసం ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. కొవ్వులు, సోడియం వంటి మూలకాలను ‘కంట్రోల్’చేసి, చక్కెరకు బదులుగా బెల్లం వాడటం వంటి ఆల్టర్నేటివ్లను (ఆల్ట్) ఉపయోగించి, కృత్రిమ రంగులను, రుచులనీ ‘డిలీట్’చేయటమే ఈ ఫార్ములా. -
జీవిత రథ సారథి
ప్రతి మనిషి జీవిత ప్రయాణంలో ఎదురయ్యే అతిపెద్ద సవాలు బయట ప్రపంచంతో కాదు, తన అంతరంగంలోనే ఉంది. మనం అనుక్షణం తీసుకునే వేలకొలది నిర్ణయాలు, మన స్పందనల పరంపర... ఇవన్నీ మన భావోద్వేగాల ప్రవాహంలోనే జన్మిస్తాయి. జీవితమనే రథానికి మనసు రథసారథి. ఆ రథం ఎటు వెళ్ళాలో మనసు నిర్ణయిస్తుంది. అయితే, ఆ మనసును నడిపించాల్సిన పరమసారథ్యం కేవలం మన స్వీయ నియంత్రణలోనే ఉంది. భావోద్వేగాలనే గుర్రాలను అదుపులో ఉంచుకుంటేనే మన జీవిత ప్రయాణం సవ్యంగా, నిర్దేశిత గమ్యం వైపు సాగుతుంది. ఒకవేళ ఈ పగ్గాలు వదిలేస్తే, అవి మనల్ని అదుపుతప్పి, పదేపదే నిరాశ, దుఃఖం అనే లోయల్లో పడేస్తాయి. మనసు మన అధీనంలో లేకపోతే, జీవితం ఒక నిరంతర పోరాటంలా మారి, శాశ్వత ఆనందాన్ని దూరం చేస్తుంది. మన అంతర్గత ప్రశాంతతకు ఇదే పునాది.సాధారణంగా మన భావోద్వేగాలు సముద్రంలో ఉప్పొంగే శక్తిమంతమైన అలల మాదిరిగా ఉంటాయి. కోపం, దుఃఖం, భయం, అసూయ వంటివి మనల్ని క్షణాల్లో ఉక్కిరిబిక్కిరి చేసి, అనాలోచిత నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. కానీ, సనాతన ధర్మం బోధించినట్టుగా, మనం కేవలం మన భావోద్వేగాలకు బానిసలం కాదు; వాటిని శాసించగలిగే అపారమైన శక్తి కేంద్రం మనలోనే దాగి ఉంది. మనసును నిగ్రహించుకోవడానికి కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలు అత్యంత సులువైన, అద్భుతమైన మార్గాలుగా పనిచేస్తాయి.కర్మ మార్గం–ఫలితాల ఆశ లేకుండా, కేవలం ఉన్నత లక్ష్యాల కోసం నిస్వార్థ నిబద్ధతతో మన కర్తవ్యాన్ని నిర్వహించాలని నిర్దేశిస్తుంది. చివరగా, భక్తి మార్గం–జీవితానికి అంతిమ లక్ష్యం ఆత్మ సాక్షాత్కారమే అని నిశ్చయంగా నమ్మి, విశ్వశక్తిలో లీనమవడమే. ఈ త్రికరణ శుద్ధి కలయిక మనసుకు తిరుగులేని స్థైర్యాన్ని, అఖండమైన అంతర్గత బలాన్ని ప్రసాదిస్తుంది.నిజమైన ఆత్మనిగ్రహం ద్వారానే మనం అంతరంగ శాంతికి శాశ్వత వారధిని నిర్మించగలం. ఈ వారధిని నిర్మించిన మహనీయుల జీవితాలు మనకు శాశ్వత ప్రేరణ. ఉదాహరణకు, సింహాసనం కళ్లముందే కరిగిపోయినప్పుడు, శ్రీరాముడు ఉవ్వెత్తున ఎగిసిన కోపాగ్నిని కేవలం అణచివేయలేదు. ఆయన వ్యక్తిగత ఆశను, ఆవేశాన్ని త్యజించి, ధర్మానికి శిరసు వంచారు. ఇది కేవలం తండ్రి మాటకు గౌరవం కాదు, బాహ్య పరిస్థితులకు అతీతంగా తన అంతర్గత ప్రశాంతతను తానే నిర్ణయించుకునే అత్యున్నత వివేకం. అలాగే, మహాభారతంలో ధర్మరాజు, అపారమైన దుఃఖం, రాజ్య నష్టం మధ్య కూడా, తన స్థైర్యాన్ని పోగొట్టుకోకుండా, క్షమతో... వివేకంతో వ్యవహరించారు. ఈ ఉదాహరణలు కేవలం కథలు కావు; భావోద్వేగాలపై పట్టు సాధిస్తే, విధి రాతను సైతం తన జీవితపు ఉన్నత గమ్యానికి అనుగుణంగా మలచుకోవచ్చని నిరూపించాయి.గుర్తుంచుకోండి: మన జీవితమనే ఈ అద్భుతమైన ప్రయాణంలో, మన గమ్యాన్ని నిర్దేశించే తిరుగులేని సారథులం మనమే. ఇక ఆలస్యం చేయక, ప్రతి క్షణాన్ని వివేకంతో, ప్రేమతో నింపి, మన హృదయం కోరుకునే ప్రశాంతమైన, అద్భుతమైన భవిష్యత్తును మన చేతులతో నిర్మించుకుందాం.మన అంతర్గత ప్రపంచంలో కలిగే ప్రతి ఆలోచనా అలజడి, ప్రతి ప్రతిస్పందన ఒక కర్మగానే పరిగణించబడుతుంది. ఈ కర్మల ప్రభావాన్ని తగ్గించడానికి, జ్ఞానయోగం మనకు నిష్పాక్షిక పరిశీలన అనే వివేకాన్ని అందిస్తుంది. అంటే, కళ్ళ ముందు జరిగే నాటకాన్ని చూస్తున్నట్లుగా, మన ఆలోచనలను, భావోద్వేగాలను తటస్థంగా, నిశితంగా గమనించడం. ఈ దృష్టి వివేకానికి పదునైన కత్తిలా పనిచేసి, ప్రతిచర్యలకు బదులుగా, ప్రశాంతమైన, సరైన ఎంపికను ఎంచుకునే స్వేచ్ఛనిస్తుంది.భావోద్వేగాలను నియంత్రించగలగడమే నిజమైన, నిస్సందేహమైన శక్తి. ఎందుకంటే, అది మనల్ని బాహ్య పరిస్థితుల బందీగా కాకుండా, మన స్వీయ మనసుకి నిజమైన అధిపతిగా నిలబెడుతుంది. అశాంతి, ఆందోళనల నుంచి సంపూర్ణ విముక్తి ΄÷ందడానికి, మనసును మనకు అత్యంత విశ్వసనీయ స్నేహితుడిగా మలచుకోవాలి. యోగా, ధ్యానం, ఆత్మపరిశీలన వంటి సాధనల ద్వారా మనం ఈ లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలం.– కె. భాస్కర్ గుప్తా (వ్యక్తిత్వ వికాస నిపుణులు)


