హోరెత్తిన ఉద్యమం
గంభీరావుపేట : స్థానిక పెద్దమ్మ స్టేజీ వద్ద సిరిసిల్ల, కామారెడ్డి ప్రధాన రహదారిపై కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్స హన్మండ్లు నేతృత్వంలో కామారెడ్డి, సిరిసిల్ల, గంభీరావుపేట, నాగంపేటవైపు వెళ్లే రోడ్లను దిగ్బంధించారు. రోడ్లపై టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్కు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. నాయకులు ఎగదండి స్వామి, రామచంద్రారెడ్డి, కర్రొల్ల రాజు, మంగళి చంద్రమౌళి, ఆవునూరి బాబయ్య, కొత్తపల్లి శ్రీనివాస్, దోసల చంద్రం, ఖుతుబ్, ఎడబోయిన రాజు, జంగం రాజు, సాయిరెడ్డి, పల్లె శ్రీనివాస్, ప్రవీన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం కూడలిలో అఖిలపక్షం కో ఆర్డినేటర్ మల్లుగారి నర్సాగౌడ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా ప్రకటించాలని మౌన ప్రదర్శన చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా సంతకాలు చేశారు. సిరిసిల్ల జిల్లా కావాలని, కాకపోతే కామారెడ్డిలో కలుపాలని పలువురు సంతకాలు చేశారు. రాజుపేటలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి జిల్లా సాధన ఉద్యమంలో కలిసి రావాలని టీడీపీ నాయకులు రాంచంద్రారెడ్డి, ఇబాదుల్లాఖాన్, రాగిశెట్టి నారాయణ, ప్రభాకర్ తదితరులు డిమాండ్ చేశారు.
రెండో రోజుకు చేరిన రిలే దీక్షలు
ముస్తాబాద్ : సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్తో గూడెంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి. కరెంట్, సాగు, తాగునీటి సమస్యలు తీరాలంటే సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్ము బాలయ్య అన్నారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కాని పక్షంలో గూడెం, ఆవునూర్, కొండాపూర్, తుర్కపల్లి గ్రామాలను ఎల్లారెడ్డిపేట మండలంలో విలీనం చేయాలని కోరారు.
తంగళ్లపల్లి మానేరు వంతెనపై రాస్తారోకో
సిరిసిల్ల రూరల్ : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మానేరు వంతెనపై రాస్తారోకో చేశారు. సిరిసిల్లను జిల్లాగా ప్రకటిస్తేఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పీసీసీ అధికార ప్రతినిధి చీటీ ఉమేశ్రావు అన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాస్తారోకో విరమింపజేశారు. నాయకులు ఓరుగంటి తిరుపతి, కూతురు వెంకట్రెడ్డి, బుర్ర మల్లేశం, ఎడమల భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ, టెస్కాబ్ చైర్మన్ ఫ్లెక్సీలు..
సిరిసిల్ల జిల్లా ఏర్పాటును అడ్డుకుంటున్నారనే ఆరోపణలతో ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ఫొటోలను మార్పింగ్ చేసి సిరిసిల్ల బైపాస్రోడ్డులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఫ్లెక్సీలు తొలగించారు. స్థల యజమాని కొత్తపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
ముసాయిదాతో మురిసిన ముస్తాబాద్
ముస్తాబాద్ :సిద్దిపేట జిల్లాలో ముస్తాబాద్ను చేర్చుతూ రాష్ట్రప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్పై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముస్తాబాద్ మండలాన్ని సిద్దిపేట జిల్లాలో కలపాలనే డిమాండ్తో పదిరోజులుగా వివిధ పార్టీల నాయకులు, పలు వర్గాలు ఆందోళనలు చేసిన విషయం విదితమే. ముస్తాబాద్కు సిద్దిపేట 25 కిలోమిటర్ల దూరంలో ఉండగా.. కరీంనగర్ 70 కిలోమిటర్లు ఉంది. ప్రభత్వం ప్రజల సౌలభ్యం, సుపరిపాలన కొసం ఏర్పాటు చేస్తున్న జిల్లాలతో ముస్తాబాద్ లాంటి మారుమూల మండలానికి న్యాయం జరిగిందని పలువర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముసాయిదా పత్రంలో ముస్తాబాద్తోపాటు కరీంనగర్ జిల్లా నుంచి ఇల్లంతకుంట, హుస్నాబాద్, కోహెడ మండలాలను కలుపుతూ అభ్యంతరాలను స్వీకరించే గడువు ప్రకటించారు.