Anakapalle District Latest News
-
రేవుపోలవరం తీరంలో యోగాంధ్ర
ఎస్.రాయవరం: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి సమాజ నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర హోంమంత్రి వగలపూడి అనిత అన్నారు. రేవుపోలవరం తీరంలో బుధవారం ఉదయం వెయ్యి మందితో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రితో పాటు కలెక్టర్ విజయ్కృష్ణన్, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు, నర్సీపట్నం ఆర్డీవో వి.వి.వి. రమణ, తహసీల్దార్ రమేష్బాబు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు.ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉంటేనే విజయాలు సాధించవచ్చన్నారు. -
బల్క్డ్రగ్పార్క్ పనులు వేగవంతం
కలెక్టర్ విజయ్కృష్ణన్నక్కపల్లి: మండలంలో రాజయ్యపేట సమీపంలో జరుగుతున్న బల్క్ డ్రగ్ పార్క్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ విజయ్కృష్ణన్ ఆదేశించారు. బుధవారం ఆమె రాజయ్యపేట,చందనాడ, బోయపాడు ,డీఎల్పురం, మూలపర తదితర గ్రామాల పరిధిలో జరుగుతున్న బల్క్ డ్రగ్పార్క్ పనులు పరిశీలించారు. మండలంలో రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో బల్క్డ్రగ్పార్క్ ఏర్పాటుకాబోతున్న విషయం తెలిసిందే. వివిధ రసాయన కంపెనీల యాజమాన్యాలు ఇక్కడ బల్క్డ్రగ్ యూనిట్లు స్థాపించేందుకు ఆసక్తి చూపించాయి. దీంతో ఏపీఐఐసీ ముందుగా డ్రగ్పార్క్ కోసం మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. సుమారు రూ.1100 కోట్ల వ్యయంతో ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, వాడుకనీటి సదుపాయాలు, విద్యుత్ సరఫరా కల్పించాలి, జాతీయరహదారినుంచి కనెక్టవిటీ రోడ్లునిర్మించాలి. ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాలుకల్పించే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. బల్క్డ్రగ్ పార్క్ నిర్మించే ప్రాంతంలో సుమారు 24 కిలోమీటర్ల మేర అంతర్గత రోడ్లు నిర్మిస్తున్నారు. కల్వర్టులు, బ్రిడ్జిలు, తారు రోడ్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు, భూగర్భ డ్రైయినేజీ వ్యవస్థ ఏర్పాటు వంటి పనులు జరుగుతున్నాయి. వీటిని పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్ ఈ గ్రామాల పరిధిలో ఏయే పనులు చేపట్టాలి, ఇంతవరకు ఏయే పనులు ప్రారంభమయ్యాయి. ఎంతవరకు పూర్తయ్యాయి అనే వివరాలను ఏపీఐఐసీ ఆధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలన్నారు. అలాగే సబ్స్టేషన్ పనులు కూడా ప్రారంభించాలని ఆదేశించారు. ఈ ప్రాంతంలోనే ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ ఇండియా లిమిటెడ్ వారు ఏర్పాటు చేసే స్టీల్ప్లాంట్కు కూడా 2,500 ఎకరాలు భూములు కేటాయించినట్టు చెప్పారు. అక్కడ కూడా మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. బల్క్డ్రగ్ పార్క్ విస్తరణ కోసం అదనంగా మరో వెయ్యి ఎకరాలు సేకరించాల్సి ఉందని, ఆప్రక్రియ కూడా పూర్తిచేయాలన్నారు. ఏపీఐఐసీ వారి ఆధ్వర్యంలో చేపట్టిన పనులను జోనల్మేనేజర్ నర్సింగరావు కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో వివిరమణ, తహసీల్దార్ నర్సింహమూర్తి, అధికారులు పాల్గొన్నారు. -
గడ్డి మందు తాగిన వ్యక్తి మృతి
మునగపాక: మండలంలోని ఒంపోలు పేట గ్రామానికి చెందిన వ్యక్తి గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. వివరాలను ఎస్ఐ ప్రసాదరావు విలేకరులకు తెలిపారు. ఒంపోలుపేటకు చెందిన బొడ్డేడ రాజా వెంకట ప్రసాద్ (48) కొంతకాలంగా మానసికంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. రెండు రోజుల క్రితం గడ్డి మందు తాగి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతనిని అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రసాద్ మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
మాగాణి భూమూల్లో ఆయిల్ పామ్ మేలు
మాగాణి భూముల్లో ఆయిల్ పామ్ తోటలు వేసుకోవడం ఎంతో శ్రేయస్కరం. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి. ఆయిల్పామ్ తోటలో అంతర పంటగా కోకో, అరటి కూడా సాగు చేసుకోవచ్చు. రెండేళ్ల వ్యవధిలో పామాయిల్ సాగు విస్తీర్ణం మండలంలో పెరిగింది. ఫ్రూట్ ధర తగ్గినా ఈ పంట పండించాలని రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. –వి.భానుపుష్పలీలావతి, మండల ఉద్యానవన శాఖాధికారి, మాడుగుల మండలం రైతులకు 15 రోజులకొకసారి చెల్లింపులు ఆయిల్పామ్ పండ్లు కొనుగోలు చేసిన కంపెనీలు ప్రతి 15 రోజులకొకసారి చెల్లింపులు జరుపుతున్నాయి. మాడుగుల మండలంలో తాటిపర్తి నుంచి శంకరం మధ్యలో కాటా దగ్గర రైతుల నుంచి ఫ్రూట్ కొనుగోలు చేస్తున్నాం. అనంతరం బంగారమెట్ట వద్ద గల ఆయిల్పామ్ కంపెనీకి తరలిస్తాం. –జి.వి.దుర్గారావు, ఆయిల్ పామ్ ఫీల్డ్ అసిస్టెంట్, మాడుగుల మండలం అంతర పంటలతో అధిక ఆదాయం ఆయిల్పామ్లో అంతర పంటలుగా కోకో, అరటి తోటలు వేసుకోవచ్చు. దీని వల్ల అధిక ఆదాయం పొందవచ్చు. కోకో పంట కూడా నాలుగేళ్ల తర్వాత పక్వానికి వస్తుంది. ప్రభుత్వం కల్పిస్తున్న డ్రిప్ ఇరిగేషన్, ఇతర రాయితీలను సద్వినియోగం చేసుకుంటున్నాం. –బండారు శ్రీరాములు, రైతు, బావన్నపాలెం, మాడుగుల మండలం జిల్లాలో పెరుగుతున్న సాగు ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం జిల్లాలో గణనీయంగా పెరుగుతుంది. గిరిజన, మైదాన గ్రామాల్లో సాగు చేస్తున్నారు. జిల్లాలో 19,500 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగవుతోంది. హెక్టారుకు రూ.5,250 చొప్పున నాలుగు సంవత్సరాల పాటు రాయితీ కల్పిస్తున్నాం. ఈ నగదు ఎరువుల వినియోగం కోసం రైతు ఖాతాకు జమ చేస్తాం. –జి.ప్రభాకర్రావు, ఉద్యానవన శాఖాధికారి, అనకాపల్లి జిల్లా -
ఎస్బీలో వారిదేహవా!
● చక్రం తిప్పుతున్న ఇద్దరు రైటర్లు ● దీర్ఘకాలంగా ఉన్న ఫీల్డ్ అధికారిదే పెత్తనం ● కొత్తగా వచ్చిన వారిని బదిలీ చేయించేందుకు చాడీలు ● అనుకూలమైన వారికి చోటు కల్పించేందుకు యత్నం ఇటీవల స్పెషల్ బ్రాంచ్ విభాగంలో కొంత మేర బదిలీలు జరిగాయి. బదిలీల్లో భాగంగా వివిధ విభాగాల్లో పనిచేసిన ఇతర జిల్లాలకు చెందిన వారు ఇక్కడకు వచ్చారు. విధుల్లో చేరి నెలన్నర పూర్తయినా వారికి పూర్తి బాధ్యతలు అప్పగించలేదు. ఈ విభాగంలో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి పదోన్నతి వచ్చే అవకాశం ఉండడంతో... విభాగంలో జరుగుతున్న విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదే అదునుగా అక్కడ రైటర్లుగా పనిచేస్తున్న వారే చక్రం తిప్పుతున్నారు. దీంతో బదిలీ అయి వేరే విభాగానికి వెళ్లిన వారే ఇంకా ఫీల్డ్ అధికారులుగా పనిచేస్తున్నారు. కొత్తగా వచ్చిన వారిని పూర్తిగా పక్కన పెట్టారు. వారికి ఎలాంటి అధికారాలు అప్పగించలేదు. వీరిపై ఉన్నతాధికారులకు చాడీలు చెప్పి ఇక్కడి నుంచి పంపే ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలిసింది. తమకు అనుకూలంగా ఉన్న వారిని ఈ విభాగానికి రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారని సమాచారం. ఇక్కడ నుంచి బదిలీపై వెళ్లిన కొందరు ఎలాగైనా మళ్లీ అనకాపల్లి రావాలని యత్నిస్తున్నారు.ప్రక్షాళనపై సాక్షాత్తూ డీఐజీ దృష్టి సారించినా ఫలితం శూన్యంసాక్షి, అనకాపల్లి: జిల్లా స్పెషల్ బ్రాంచి విభాగం ప్రక్షాళనపై సాక్షాత్తూ డీఐజీ దృష్టి సారించినా పెద్దగా ఫలితం లేకపోయింది. ఇంకా పాతవారి హవా కొనసాగుతోంది. రెండు నెలల కిందట ఈ విభాగం నుంచి కొంత మందిని బదిలీ చేసినా.. వారు ఇంకా విధుల నుంచి తప్పుకోవడం లేదు. కొత్తవారికి అవకాశం ఇవ్వకుండా చక్రం తిప్పుతున్నారు. కొత్తగా వచ్చిన వారిని ఇక్కడ నుంచి ఎలాగైనా తిరిగి పంపించేయాలని పన్నాగాలు పన్నుతున్నట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ఇద్దరు రైటర్లు, ఒక ఫీల్డ్ అధికారి కీలకంగా వ్యవహరిస్తున్నట్టు భోగట్టా పోలీస్ శాఖలో స్పెషల్ బ్రాంచి విభాగం అతిముఖ్యమైనది. జిల్లాలో ఎక్కడ ఏం జరుగుతోంది?, పోలీసుల పనితీరు ఎలా ఉంది?, ప్రజలు ఏమనుకుంటున్నారు?, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఇతర సంఘాల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి...తదితర వివరాలను స్పెషల్బ్రాంచి ఎప్పటికప్పుడు సేకరించి ఎస్పీకి నివేదిక అందజేస్తుంది. ఇందుకోసం సీఐతో హెడ్కానిస్టేబుల్/కానిస్టేబుళ్లు ఉంటారు. అయితే స్పెషల్ బ్రాంచిలో పనిచేస్తున్న సిబ్బంది చాలా ఏళ్లుగా అక్కడే ఉండిపోవడంతో పాటు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు, కీలకమైన సమాచారాన్ని ఎస్పీకి కంటే ముందుగా ప్రజాప్రతినిధులకు చేరవేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పారదర్శకత పూర్తిగాలోపించింది. ఈ విభాగంలో పేరుకే అధికారులున్నారు తప్ప.. నిర్వహణ, కార్యకలాపాలు ఇద్దరు రైటర్ల కనుసన్నల్లో జరుగుతున్నాయి. ఈ విషయా లన్నీ డీఐజీ దృష్టికి వెళ్లడంతో ప్రక్షాళన చేయాలని ప్రత్యేకంగా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇటీవల బదిలీలు జరిపారు. బదిలీల ప్రక్రియ అపహాస్యం.. డీఐజీ ఆదేశాలు బేఖాతరు.. ఎస్బీలో సిబ్బందిని పూర్తిగా మార్చాలని డీఐజీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా అవి అమలు కాలేదు. కొద్దిపాటి మార్పులు చేసి, ఉన్నతాధికారులకు అసలైన పరిస్థితిని వివరించకుండా తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అనకాపల్లి జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ను పూర్తిగా ప్రక్షాళన చేయడంతో పాటు బదిలీపై వచ్చిన అధికారులకు తక్షణమే పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైటర్ల హవా తగ్గించడంతో పాటు దీర్ఘకాలంగా ఈ విభాగంలో తిష్ట వేసి వ్యవస్థను మేనేజ్ చేస్తున్న వారికి చెక్ పెట్టాలని సిబ్బంది కోరుతున్నారు. -
23న నిరుద్యోగ భృతిపై ధర్నా
అనకాపల్లి: అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని, లేని పక్షంలో నెలకు రూ.3 వేలు భృతి ఇచ్చే విధంగా చర్యలు చేపడతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం ఏడాది పాలనలో నెరవేరలేదని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల కన్నబాబు, వియ్యపు రాజు విమర్శించారు. బుధవారం స్థానిక మెయిన్రోడ్డు కోడుగంటి గోవిందరావు భవనంలో నిరుద్యోగ భృతిపై పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగ భృతిపై ఈ నెల 23న స్థానిక నెహ్రూచౌక్ వద్ద నిరుద్యోగులతో ధర్నా చేస్తామన్నారు. 2024 ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గత ప్రభుత్వం నిరుద్యోగులను పూర్తిగా మోసం చేసిందని 40 ఏళ్ల రాజకీయం అనుభవం ఉన్న తనను గెలిపిస్తే రాష్ట్రంలో సంపద సృష్టించి 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తానని, లేని పక్షంలో ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు భృతి ఇస్తానని హామీ ఇచ్చి ఏడాది పాలన పూర్తయిందన్నారు. నిరుద్యోగులకు ఏడాదిపాటు బకాయి పడిన నిరుద్యోగ భృతి ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. తూతూమంత్రంగా డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో నాలుగు లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే 16 వేల డీఎస్సీ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం ఏమిటని ప్రశ్నించారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించకపోగా, ఉన్న 2 లక్షల 60 వేల వలంటీర్లను తొలగించారని ధ్వజమెత్తారు. ఎండీయూ వాహనదారులను, పశుసంచార వాహనదారులను ఏడాది పాలనలో తొలగించడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు చంటి, కాసిం, అఖిల్, శ్రావణి, అలేఖ్య, తులసి, తదితరులు పాల్గొన్నారు. -
మొక్కలు నాటడం సామాజిక బాధ్యత
గొలుగొండ: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, విద్యార్థులు ఇంటి వద్ద తప్పనిసరిగా మొక్కలు నాటాలని సోషల్ ఫారెస్టు డీఎఫ్వో లక్ష్మణ్ తెలిపారు. ఏఎల్పురంలో బుధవారం వన సంరక్షణ– మన సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏఎల్పురం గ్రామంతో పాటు అల్లూరి పార్కు వద్ద మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ సోషల్ ఫారెస్టు పరిధిలో ఎక్కువ మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటిని ప్రతి పాఠశాల, ఇంటి పరిసరాల వద్ద, ఖాళీగా ఉన్న స్థలాల్లో నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేంజర్ సుబ్బారావు,సెక్షన్ అధికారి రాజు, మాజీ జెడ్పీటీసీ తారకవేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
స్వల్ప వివాదమే కాల్పులకు కారణం
నాటుతుపాకీతో అన్నను చంపిన నిందితుడు అరెస్టు చీడికాడ: స్వల్ప వివాదమే కాల్పులకు కారణమని తురువోలు ఘటనపై కె.కోటపాడు సీఐ పైడపునాయుడు తెలిపారు. ఈ సంఘటనపై బుధవారం ఆయన చీడికాడ పోలీసు స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని తురువోలుకు చెందిన మృతుడు జోగా రాము(48), దేముళ్లు అన్నదమ్ములు కాగా, మంగళవారం సాయంత్రం గ్రామంలో ఒడ్డు పండగ చేసుకుని వీరిద్దరూ కళ్లానికి వెళ్లారు. అక్కడ ఆవు వద్ద పాలు తాగేస్తున్న దూడపెయ్యిను మద్యం మత్తులో ఉన్న తమ్ము డు దేముళ్లు కర్రతో కొట్టాడు. దానికి మృతుడు రాము వారించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య స్వల్ప వివాదం తలె త్తగా, పాకలో ఉన్న నాటు తుపాకీని తెచ్చి అన్నపై కాల్చాడు. దాంతో ఛాతి కింద గాయమై మృతి చెందాడు. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. లైసెన్సు లేని నాటుతుపాలుంటే అప్పగించాలి: సీఐ లైసెన్సు లేకుండా ఎవరి వద్దనైనా నాటుతుపాకీలుంటే వారంలోగా పోలీసు స్టేషన్లకు అప్పగించాలని సీఐ పైడపునాయకుడు తెలిపారు. పది రోజుల తర్వాత గ్రామాల్లో చర్చ జరుగుతుందని, అప్పుడు పట్టుబడితే కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మాడుగుల ఎస్సై నారాయణరావు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు
అనకాపల్లి టౌన్: కిడ్నీ వ్యాధి రోగులు కేజీహెచ్కు వెళ్లనవసరం లేకుండా ఎన్టీఆర్ ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ద్వారా సేవలందిస్తున్నామని ఆస్పత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ డాక్టర్ డీడీ నాయుడు తెలిపారు. పట్టణంలోని ఎన్టీఆర్ ఆస్పత్రిని ఆయన బుధవారం పరిశీలించారు. ఇక్కడ కిడ్నీవ్యాధి రోగులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కిడ్నీ ఫెయిలైన రోగులు ఎక్కువగా వస్తున్నారని, వీటి లక్షణాలు ముందుగా గ్రహించుకొని వైద్యులను సంప్రదించాలన్నారు. నడుము నొప్పి, శరీరంలో వాపు, నీరుడు, గాబరాగా ఉండడం, రక్తహీనత, ఆయాసం, వాంతులు తదితర లక్షణాలు కిడ్నీ ఫెయిల్యూర్కు సంకేతాలన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణారావు, అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు, రామచంద్రరావు, గొర్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ డాక్టర్ డీడీ నాయుడు -
ఓపెన్ టెన్త్, ఇంటర్కు దరఖాస్తులు
అనకాపల్లి టౌన్: వివిధ కారణాలతో విద్యకు దూరమైన వారి కోసం ఓపెన్ స్కూల్ ద్వారా నేరుగా పదో తరగతి, ఇంటర్మీడియట్లో చేరడానికి జూలై 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఏపీ ఆన్లైన్, మీసేవ కేంద్రాల్లోగానీ జిల్లాలో ఓపెన్ స్కూల్ సహాయ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓపెన్ స్కూల్లో పదో తరగతిలో చేరడానికి ఈ ఏడాది ఆగస్ట్ 31వ తేదీకి 14 సంవత్సరాలు వయసు నిండి ఉండాలన్నారు. వారికి చదవడం, రాయడం వచ్చి ఉండాలన్నారు. దరఖాస్తుతోపాటు ఆధార్ కార్డు, ఏదైనా పాఠశాలలో ఒకటో తరగతిలో చదివిన టీసీ, జన్మదిన ధ్రువపత్రం ఉండాలన్నారు. ఇంటర్లో చేరాలనుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణులైన మార్కుల జాబితా, టీసీ, ఆధార్ కార్డు అందజేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు వారి కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలన్నారు. రూ.200 అపరాధ రుసుంతో ఆగస్ట్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. -
క్షమాభిక్షపై ముగ్గురు జీవిత ఖైదీల విడుదల
ఆరిలోవ(విశాఖ): సుప్రీం కోర్టు ఆదేశాలతో క్షమాభిక్షపై విశాఖ కేంద్ర కారాగారం నుంచి ముగ్గురు జీవిత ఖైదీలు బుధవారం విడుదలయ్యారు. హత్య కేసుల్లో జీవిత ఖైదుపై నాలుగు గోడల మధ్య దశాబ్దానికి పైగా గడిపి, ఎట్టకేలకు బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 2009 ఫిబ్రవరి 2 నుంచి ఇక్కడ శిక్ష అనుభవిస్తున్న విజయనగరం జిల్లా వంగర మండలం తలగాం గ్రామానికి చెందిన ఎ.కృపారావు, 2010 ఆగస్టు నుంచి ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన(ప్రస్తుతం విశాఖపట్నం, మధురానగర్) కేవీఎన్వీ ప్రసాద్, 2014 అక్టోబరు 28 నుంచి జీవిత ఖైదులో ఉన్న అనకాపల్లి జిల్లా కె.కోటపాడుకు చెందిన వి.కోటేశ్వరరావులకు సత్ప్రవర్తన కారణంగా క్షమాభిక్ష లభించింది. ఈ సందర్భంగా జైల్ సూపరింటెండెంట్ ఎం.మహేష్బాబు మీడియాతో మాట్లాడుతూ సుప్రీం కోర్టు సూచనలతో రాష్ట్రంలో 17 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష లభించిందన్నారు. అందులో విశాఖ కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న ముగ్గురు అర్హులయ్యారన్నారు. జైళ్ల శాఖ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు, నియమ నిబంధనలు పూర్తిచేసి వారిని విడుదల చేసినట్లు తెలిపారు. ఖైదీలు మీడియాతో మాట్లాడుతూ జైల్లో వివిధ కర్మాగార, వ్యవసాయ పనులు చేసినట్లు పేర్కొన్నారు. క్షమాభిక్షపై విడుదల చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జైల్ సూపరింటెండెంట్తో పాటు డిప్యూటీ సూపరింటెండెంట్లు సాయిప్రవీణ్, సీహెచ్ సూర్యకుమార్ విడుదలైన ఖైదీలకు పలు సూచనలు చేశారు. -
నూతన విద్యా విధానానికి అనుగుణంగా బోధన
కశింకోట: నూతన విద్యా విధానానికి అనుగుణంగా బోధన, పాఠశాలల నిర్వహణ జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యా శాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు ఆదేశించారు. జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో కశింకోటలోని సెయింట్ జాన్స్ స్కూలులో బుధవారం నిర్వహించిన సమావేశంలో పలు సూచనలు చేశారు. ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, దీనిలో భాగంగా ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల నిర్వహణ, బోధన, మూల్యాంకనం, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ తదితర కార్యక్రమాల్లో మార్పులు తీసుకు వచ్చినట్లు చెప్పారు. అకడమిక్ క్యాలెండర్, టీచర్ హ్యాండ్ బుక్ల నిర్వహణ అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులంతా శత శాతం అమలు చేయాల్సిందేనన్నారు. యోగాంధ్ర విజయవంతం చేయాలి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో శత శాతం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఈవో అన్నారు. జిల్లాలో అర్హులందరికీ ఇప్పటికే తల్లికి వందనం నగదు జమ అయినట్టు తెలిపారు. పథకం వర్తించని అర్హులు సంబంధిత సచివాలయాల్లో సంప్రదించి వారి వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య పెరగడానికి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. అవసరం ఉన్న మేరకు పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగాను, మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా స్థాయిని పెంచినట్టు చెప్పారు. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఎదురైతే సర్దుబాటు చేస్తామని తెలిపారు. మారిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని సూచించారు. జిల్లా ఉప విద్యా శాఖ అధికారి పొన్నాడ అప్పారావు, ఏసీ శ్రీధర్రెడ్డి,డీసీసీబీ కార్యదర్శి సత్యనారాయణ, సీసీ వెంకటేశ్వరరావు, ఎంఈవోలు, హెచ్ఎంలు పాల్గొన్నారు. డీఈవో అప్పారావు నాయుడు -
లాభాలు బాగు..ఆయిల్ పామ్ సాగు
● జిల్లాలో 19,500 ఎకరాల్లో పామాయిల్ తోటలు ● చెరకు, ఇతర పంటలకు ప్రత్యామ్నాయంగా సాగు ● ప్రస్తుతం టన్ను పామాయిల్ ధర రూ.18,650 మాడుగుల రూరల్: చెరకు, సరగుడు, వరి, తదితర సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులకు లాభాలు తెచ్చిపెట్టేది ఆయిల్పామ్ సాగు. వాణిజ్య పంటగా విరాజిల్లుతున్న ఆయిల్పామ్ సాగుతో మెట్ట భూముల్లో జిల్లా రైతులు సిరులు పండిస్తున్నారు. జిల్లాలో పామాయిల్ తోటలు విస్తీర్ణం గత రెండు సంవత్సరాలుగా గణనీయంగా పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 19,500 ఎకరాల్లో సాగవుతుంది. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుంటూ గిరిజన గ్రామాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. పామాయిల్ మొక్క ఖరీదు రూ.133 కాగా, 90 శాతం రాయితీతో రైతులకు అందిస్తున్నారు. రాయితీ సొమ్ము రైతు ఖాతాలో జమ చేస్తున్నారు. గతేడాది టన్ను పామాయిల్ ఫ్రూట్ ధర రూ.22 వేలు ఉండగా.. ప్రస్తుతం టన్ను ధర రూ.18,650 ఉంది. గత నెల టన్ను రూ.20 వేలు వరకు ఉండేది. విదేశాల నుంచి ఆయిల్ దిగుమతి వల్ల ఫ్రూట్ ధర తగ్గినట్టు రైతులు చెబుతున్నారు. రావికమతం, చోడవరం, బుచ్చెయ్యపేట మండలాల్లో 120 ఎకరాల్లో ఈ ఏడాది కొత్తగా ఆయిల్ పామ్ సాగు చేపట్టారు. గిరిజన గ్రామాల్లో పెరుగుతున్న విస్తీర్ణం మాడుగుల మండలంలోని గిరిజన గ్రామాల్లో విస్తారంగా సాగు చేస్తున్నారు. తాటిపర్తి, శంకరం, జాలంపల్లి, అవురువాడ, ఎల్.పొన్నవోలు, పొంగలిపాక పంచాయతీల పరిధిలోని శివారు గ్రామాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు. మాడుగుల మండలంలో 913 హెక్టార్లలో సాగవుతోంది. ఒకప్పుడు బీడు భూములుగా ఉన్న ప్రాంతం అంతా నేడు ఆయిల్పామ్ తోటలతో కళకళలాడుతోంది. చెరకు, సరగుడు తోటలు స్థానంలో పామాయిల్ తోటలు వేస్తున్నారు. పామాయిల్ మొక్క వేసిన తర్వాత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలకు కాపునకు వస్తాయి. రాయితీతో ఆసక్తి హెక్టారుకు రూ.5,250 చొప్పున నాలుగు సంవత్సరాల పాటు ఉద్యానవన శాఖ ఎరువుల వినియోగానికి రాయితీ సదుపాయం కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం అందిస్తుంది. జిల్లాలో టెనీరా రకం పామాయిల్ను ఎక్కువగా సాగు చేస్తున్నారు. అనకాపల్లి, మాడుగుల, బుచ్చెయ్యపేట, కశింకోట, కె.కోటపాడు, దేవరాపల్లి, రావికమతం, నక్కపల్లి, పాయకరావుపేట, అచ్యుతాపురం, మునగపాక, యలమంచిలి, చీడికాడ, సబ్బవరం, ఆనందపురం, భీమిలి, పద్మనాభం, కోటవురట్ల, పాయకరావుపేట, నర్సీపట్నం, నాతవరం, మాకవరపాలెం, గొలుగొండ, రాంబిల్లి, రోలుగుంట, తదితర మండలాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. పండిన పామాయిల్ ఫ్రూట్ను కాటాలు వద్ద తూకం వేసిన అనంతరం బంగారుమెట్టతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం, తదితర చోట్ల గల కంపెనీలకు తరలిస్తున్నారు. -
భూతగాదా
ఒకరికి గాయాలు ● వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తల దాడి ● ఎం.అలమండలో ఘటన దేవరాపల్లి: మండలంలోని ఎం.అలమండ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త యర్రా నర్సింహమూర్తిపై టీడీపీకి చెందిన సింగంపల్లి పోలినాయుడు, లక్ష్మి దంపతులు బుధవారం దాడి చేశారు. భూతగాదా విషయంలో కత్తితో దాడి చేయడంతో నర్సింహమూర్తి తీవ్ర గాయాలుపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నర్సింహమూర్తి తన పొలంలో పనులు చేసుకుంటుండగా టీడీపీకి చెందిన సింగంపల్లి పోలినాయుడు, లక్ష్మి దంపతులు దాడి చేశారు. భార్య లక్ష్మి కళ్లల్లో కారం కొట్టగా, భర్త పోలినాయుడు కత్తితో దాడి చేసినట్టు బాధితుడు చెప్పారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు దేవరాపల్లి పీహెచ్సీకి తరలించారు. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం 108 వాహనంలో కె.కోటపాడు కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తనపై దాడి చేసిన భార్యాభర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంతో పాటు వారి నుంచి ప్రాణ రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు నర్సింహమూర్తి తెలిపారు. ఇరువురి మధ్య భూతగాదాలు, కొట్లాట కేసులు కోర్టులో నడుస్తున్నట్లు సమాచారం. -
అస్తవ్యస్తంగా పోలవరం కాలువ పనులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ ఇబ్బందులు పడుతున్న పలు గ్రామాల ప్రజలు
కాలువ తవ్వకాలతో బురదమయంగా తయారైన వల్లకొత్తూరు వెళ్లే రోడ్డు నక్కపల్లి: మండలంలో పోలవరం కాలువ పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. పనులు చేపట్టిన కాంట్రాక్టరు రోడ్లను ఇష్టానుసారం తవ్వేసి, అసంపూర్తిగా వదిలేయడంతో పలు గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందిపడుతున్నారు. వర్షాలు పడితే ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. పోలవరం ఎడమప్రధాన కాలువ 6,7,8 ప్యాకేజీల కింద పనులు పునఃప్రారంభమయ్యాయి.కూటమి ప్రభుత్వ పర్యవేక్షణ లోపంతో పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. జగన్నాథపురం నుంచి దోసలపాడు, చీడిక మీదుగా కొత్తూరు వెళ్లేమార్గంలో పోలవరం కాలువ నిర్మాణం కోసం కాంట్రాక్టర్ రోడ్డును అడ్డంగా తవ్వేశారు. పక్కనుంచి అప్రోచ్ రోడ్డు లేదా రాకపోకలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో చీడిక, కొత్తూరు, సీతానగరం తదితర గ్రామాలకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామాల వారు ఏ అత్యవసరమైనా తుని,పాయయరావుపేట పట్టణాలకు రావాల్సి ఉంటుంది. ద్విచక్రవాహనాలు, ఆటోల్లోనే రాకపోకలు సాగించాలి. పాఠశాలు, కాలేజీలకు విద్యార్థులు కూడా మోటారు సైకిళ్లు, స్కూలు బస్సులు, ఆటోల్లోనే రావాలి. కొద్దిరోజుల కిత్రం కాంట్రాక్టర్ కాలువ నిర్మాణం కోసం ఈ గ్రామాలకు వెళ్లే రోడ్డును మధ్యలో తవ్వేయడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టణ ప్రాంతాలనుంచి విద్యార్థులను తీసుకెళ్లేందుకు వచ్చే బస్సులు కాలువ తవ్వేసిన ప్రాంతం వరకు వచ్చి ఆగిపోతున్నాయి. అవతల గ్రామాలకు రావడానికి బస్సు డ్రైవర్లు నిరాకరిస్తున్నారు. వర్షాలు పడడంతో తవ్విన ప్రాంతమంతా బురదమయంగా మారిందని బస్సులు కూరుకుపోతాయన్న బెంగతో రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ తవ్విన ప్రాంతం వరకు పిల్లలను తీసుకురావాలంటే సుమారు కిలోమీటరు పైనే నడిచి రావాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. చీడిక గ్రామస్తులయితే రెండు కిలోమీటర్ల దూరం నడవాలి. కాలువ వద్ద ఆటోలు కూరుకుపోతున్నాయని, రాత్రిపూట రాకపోకలకు చాలా ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామాలకు వెళ్లే మార్గంలో కాంట్రాక్టరు రోడ్డును ఇష్టానుసారం తవ్వేయడమే కాకుండా వెంటనే నిర్మించడం లేదా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డుపరిస్థితి ఇలా ఉండటం వల్ల ఆటో డ్రైవర్లు కూడా గ్రామాల్లోకి రావడానికి భయపడుతున్నారని చెప్పారు. అత్యవసర వైద్య సహాయం కోసం ఆస్పత్రికి ఆటోల్లోనే రావాల్సి ఉంటుందని, రోడ్డుపరిస్థితి ఇలా ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వర్షాలు పడటం వల్ల రోడ్డు అంతా బురదగా మారిందని, కనీసం కాలినడకన కూడా వెళ్లే పరిస్థితి ఉండటం లేదన్నారు. అధికారులు స్పందించి వెంటనే రోడ్డు పునఃనిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బోదిగల్లంనుంచి పెదదొడ్డిగల్లు, వెదుళ్లపాలెంనుంచి సీతం పాలెం వెళ్లే మార్గాల్లో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయంటూ ఆయా గ్రామాల వారు చెబుతున్నారు. రోడ్లను ఇష్టానుసారం తవ్వేసి, వెంటనే పూడ్చడం లేదని, రోజుల తరబడి వదిలేయడం వల్ల రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామంటూ ఆయా గ్రామాలకు రాకపోకలు సాగించేవారు చెబుతున్నారు. కల్వర్టులు నిర్మించి రోడ్లను పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రోడ్లు తవ్వేసి.. కష్టాలకు వదిలేసి -
బుచ్చెయ్యపేట ఎంపీడీవో మృతి
బుచ్చెయ్యపేట: విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐదు రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఎంపీడీవో వి. విజయలక్ష్మి(61) మృతి చెందారు. ఈ నెల 14న బుచ్చెయ్యపేటలో విధులకు హాజరైన ఆమె అదే రోజు రాత్రి తన ఇంట్లో బాత్రూంలో కాలు జారి పడిపోయి తలకు తీవ్ర గాయమైన విషయం విదితమే. కుటుంబ సభ్యులు వెంటనే విశాఖలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. కోమాలోకి వెళ్లిపోయిన ఆమె చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు. మృతి వార్త తెలుసుకున్న జెడ్పీటీసీ దొండా రాంబాబు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కె. అచ్చింనాయుడు, తహసీల్దార్ లక్ష్మి, ఈవోపీఆర్డీ విజయలక్ష్మి, సర్పంచ్లు, ఎంపీటీసీలు విశాఖ తరలివెళ్లి ఎంపీడీవో మృతదేహం వద్ద నివాళులర్పించారు. బుచ్చెయ్యపేటలో ఆరేళ్లుగా ఆమె ప్రజలకు పలు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేశారు. ఈమె భర్త మల్లికార్జునరావు పార్వతీపురం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తుండగా, పెద్ద కుమారుడు హైదరాబాద్లో, చిన్న కుమారుడు చైనాలో ఉన్నారు. మరో మూడు నెలల్లో పెద్ద కుమారుడికి వివాహం చేయడానికి ఏర్పాట్లు చేస్తుండగా, ఇంతలో ఆమె మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. గురువారం ఉదయం ఇసుకతోటలో ఎంపీడీవో పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
రిక్షా కార్మికుడి మృతదేహం లభ్యం
యలమంచిలి రూరల్ : ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మృత్యువాత పడిన 60 ఏళ్ల రిక్షా కార్మికుడు మృతదేహాన్ని పట్టణ పోలీసులు మంగళవారం రాంనగర్ రైల్వేగేటు సమీపంలో గుర్తించారు. ఇక్కడ పెదపల్లికి వెళ్లే రహదారి పక్కన తుప్పల్లో కుళ్లిపోయిన స్థితిలో వున్న మృతదేహం నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ ఎస్ఐ కె.సావిత్రి సిబ్బందితో అక్కడకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. విచారణ జరపగా మృతుడు మున్సిపాలిటీ పరిధి మంత్రిపాలెం గ్రామానికి చెందిన రిక్షా కార్మికుడు చేపల సన్యాసిరావు(60)గా గుర్తించారు. అతనికి రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నాయని, ఈ నెల 12వ తేదీ నుంచి తన భర్త కనిపించకపోవడంతో అతని కోసం గాలిస్తున్నట్టు భార్య చేపల లక్ష్మి తెలిపింది. వ్యాధుల కారణంగా గుండెపోటు వచ్చి చనిపోయి ఉండొచ్చని పోలీసులకు తెలిపింది. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ విలేకరులకు తెలిపారు. -
బ్లాక్ మార్కెట్లో యూరియా విక్రయాలు అరికట్టాలి
మునగపాక : బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు ఎరువుల విక్రయాలు జరగకుండా చూడాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం వ్యవసాయ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టి ఏఈవో లక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖరీఫ్లో రైతులకు అవసరమయ్యే ఎరువులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. పలు చోట్ల బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారన్నారు. స్థానిక పీఏసీఎస్లో యూరియా బస్తా రూ.272కు విక్రయిస్తున్నారని, బయట కొనుగోలు చేస్తే రూ.330 నుంచి 350 వరకు విక్రయిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించేవారని గుర్తు చేశారు. వాడ్రాపల్లి సర్పంచ్ కాండ్రేగుల నూకరాజు, ఎంపీటీసీ మద్దాల వీరునాయుడు, పార్టీ నేతలు దాసరి అప్పారావు, నరాలశెట్టి సూర్యనారాయణ,పిన్నమరాజు రవీంద్రరాజు,దొడ్డి బుజ్జి, శరగడం గోవింద,మళ్ల జోగారావు,బొడ్డేడ సోమరాజు పాల్గొన్నారు. -
ఆప్కాస్ ఉద్యోగులకు ‘తల్లికి వందనం’ ఇవ్వాలి
అనకాపల్లి: చాలీచాలని వేతనాలతో బతుకులు నెట్టుకొస్తున్న ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్డ్ సర్వీసెస్(ఆప్కాస్) ఉద్యోగులకు తల్లికి వందనంతో పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని జీవీఎంసీ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో మంగళవారం యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ శాఖలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఇంజినీరింగ్ కార్మికులకు వేతనాలు పెంచాలని ఒక వైపు ఆందోళన చేస్తుంటే.. మరోవైపు సంక్షేమ పథకాల కోత వేయడం చూస్తుంటే ప్రభుత్వం చెప్పిన మాటా ఒక్కటి, చేసిన పని ఒక్కటిగా ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు వాయి బోయిన శేఖర్, సోమధుల వెంకట లక్ష్మి, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బంగారు రవి, ఎర్రంశెట్టి అప్పలరాజు, సింగంపల్లి అజయ్, శంకర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
అసంపూర్తిగా
అగ్రి ల్యాబ్రైతుల కష్టాలు తీర్చేందుకు.. జిల్లా స్థాయి అగ్రిల్యాబ్ కోసం సబ్బవరంలోని సర్వే నెం.271లో 5 ఎకరాలు కేటాయించారు. సుమారు రూ.6 కోట్ల నాబార్డ్ నిధులతో చేపట్టే ఈ ల్యాబ్ కోసం రూ.3.5 కోట్లతో 14 గదులతో కూడిన భవన నిర్మాణాలను పోలీస్ హౌసింగ్ బోర్డు చేపట్టింది. మిగిలిన రూ.2.5 కోట్లతో అవసరమైన పరికరాలు, ఇతర మౌలికవసతుల ఏర్పాటుకు నిర్ణయించారు. ల్యాబ్కు కేటాయించిన స్థలంలో కొంతమంది ఆక్రమణదారులు ఉండటంతో కాంట్రక్టర్కు స్థలం అప్పగించడంలో జాప్యం జరిగింది. దీని వల్లే గత ప్రభుత్వంలో సకాలంలో ల్యాబ్ అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. నిర్మాణాల పూర్తికి మరో రూ.40 లక్షలు కావాల్సిన సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పూర్తికావస్తున్నా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. సబ్బవరం: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన సేవలన్నీ అందుబాటులోకి తెచ్చింది. పెట్టుబడి సాయం, రాయితీ ఎరువులు, విత్తనాలు, మద్దతు ధర తదితర అన్ని విధాలా రైతుకు అండగా నిలిచింది. అందులో భాగంగానే రైతన్నలు పంట సాగుకు ముందు భూసార పరీక్షలు, విత్తన, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షలు తదితరాల కోసం సబ్బవరంలో జిల్లా అగ్రిల్యాబ్ ఏర్పాటుకు సంకల్పించింది. 90 శాతం పనులు పూర్తయిన దశలో ప్రభుత్వం మారడంతో అగ్రిల్యాబ్ సేవలు అందుబాటులోకి రాకుండానే అర్ధంతరంగా నిలిచాయి. అందుబాటులోకి వస్తే ఎంతో మేలు ఈ ల్యాబ్ అందుబాటులోకి వస్తే విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, మట్టి నమూనాలను పరీక్షించి, నివేదికలు త్వరితగతిన అందుకునే వీలుండేది. జిల్లా స్థాయి ల్యాబ్లో 12 మంది ఏవోలు, 24 మంది ఏఈవోలకు ఉద్యోగావకాశాలు దక్కేవి. వీరి సాయంతో ఎరువులు, పురుగు మందులు, విత్తనాల నాణ్యతతోపాటు, మట్టి నమూనాలను ఉచితంగానే పరీక్షించి, ఏ భూమి ఏ పంటకు అనుకూలం, విత్తనాలు చల్లక ముందే వాటి నాణ్యత తెలుసుకోవడం ద్వారా నష్ట భయం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ సేవలన్నీ ఉచితం కావడంతో ప్రతి రైతు పంటకు ముందే జాగ్రత్త పడేందుకు వీలుండేది. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల బారిన పడే అగత్యం తప్పుతుంది. ల్యాబ్ అందుబాటులోకి రాకపోవడంతో అంచనా సేద్యంతో రైతులు ఎంతో కొంత నష్టపోతున్నారు. పంటలో సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులతో పాటు భూసార పరీక్షలకు అవసరమైన ల్యాబ్ వసతి గతంలో ఉమ్మడి విశాఖ జిల్లాలోని జేడీ కార్యాలయంలో ఉండేది. భూసార పరీక్షలు నిర్వహించి రైతులు తమ భూములు ఏ పంటలకు అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోవాలంటే విశాఖతోపాటు, నర్సీపట్నంలోని భూసార పరీక్ష కేంద్రాన్ని ఆశ్రయించాల్సి వచ్చేది. సిబ్బంది కొరత, దూరాభారం కారణంగా చాలా మంది రైతులు ఆ దిశగా ప్రయత్నించేవారు కాదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ సేవల్ని చేరువ చేసేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక సమీకృత వ్యవసాయ ప్రయోగశాల ఏర్పాటు దిశగా ప్రతిపాదించారు. జిల్లా మొత్తానికి సబ్బవరంలో ల్యాబ్కు శ్రీకారం చుట్టారు. 5 ఎకరాల్లో.. రూ.6 కోట్లతో.. అందుబాటులోకి రాని జిల్లా స్థాయి అగ్రిల్యాబ్ రూ.6 కోట్ల నాబార్డ్ నిధులతో నిర్మాణం గత ప్రభుత్వంలో 90 శాతంపైగా పనుల పూర్తి కూటమి ప్రభుత్వం వచ్చాక నిలిచిన పనులు అందుబాటులోకి వస్తే మేలు వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలైన బొప్పాయి, కాలీఫ్లవర్, టమాటా, ఉల్లి, ఆరటి వంటివి సుమారు 7 ఎకరాల్లో సాగుచేస్తున్నా. ఇందులో కొంత సొంతం. మిగిలినది కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నా. భూసార పరీక్షలు, కల్తీలేని ఎరువులు, విత్తనాల నిర్ధారణకు ఎవరెవరినో ఆశ్రయించాల్సి వస్తోంది. సబ్బవరం అగ్రిల్యాబ్ అందుబాటులోకి వస్తే మాలాంటి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. – చీపురబల్లి బంగార్రాజు, అమృతపురం గ్రామం నిధులిస్తే అందుబాటులోకి.. జిల్లా స్థాయి అగ్రిల్యాబ్ నిర్మాణ పనులు 90 శాతం వరకూ పూర్తయ్యాయి. మరో రూ.40 లక్షల నిధులు కావాల్సి ఉంది. ఆ నిధులు విడుదల కాకపోవడంతో పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. భవన నిర్మాణం తుది దశకు రావడంతో మౌలిక వసతుల కల్పన, ల్యాబ్కు అవసరమైన పరికరాల విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే అందుబాటులోకి తీసుకొస్తాం. – బి.మోహన్రావు, జిల్లా వ్యవసాయ అధికారి, అనకాపల్లి -
గిరిజన గ్రామాల్లో జ్వరాల విజృంభణ
రావికమతం: మండలంలోని చీమలపాడు పంచాయతీ గిరిజన గ్రామాలైన రాయపాడు, చలిసింగం గ్రామాల్లో జర్వాలతో గిరిజనులు అల్లాడిపోతున్నారు. రాయపాడులో గేమ్మిల గంగ, ీసేదిరి నాయుడు, సేదరి చిలుకమ్మ, పాంగి రామారావు, గేమ్మిల అనిత, చిక్కడు అంజిలితో పాటు, అజయ్పురంలో పాంగి విజయ్కుమార్ సహా మరో ముగ్గురు జ్వరాలతో బాధపడుతున్నారు. వీరందరూ జర్వంతో పాటు నరాల నొప్పులతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం కొత్తకోటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యం కోసం ఒక్కో వ్యక్తి కనీసం రూ.3 వేలు నుంచి రూ.5 వేలు వరకు ఖర్చు చేయాల్చి వస్తోంది. ఇక్కడ గత నెలలో ప్రభుత్వ వైద్యాధికారులు వైద్య శిబిరం నిర్వహించారు. అయినా జ్వరాల తీవ్రత తగ్గలేదు. జీడితోటలో వచ్చిన ఫలసాయం మందులకే ఖర్చు చేయాల్చి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండ శిఖర పీవీటీజీ గ్రామాల్లో ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఇద్దరు, ముగ్గురు జ్వరాలతో బాధ పడుతున్నారు. చలిసింగం కొండ శిఖర గ్రామంలోనూ ఇటీవల వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జ్వరాలు తగ్గుముఖం పట్టినా కీళ్ల నొప్పులు మాత్రం తగ్గడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మరో వైపు రోడ్డు సౌకర్యం లేక వైద్యానికి ఆదివాసీలు నరకం చూస్తున్నారు. గిరిజన గ్రామాల్లో తరచూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, వైద్యులు రాత్రి బస చేసి జ్వరాలు అదుపు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు, సంఘం నాయకులు పాంగి భాస్కరరావు, సీహెచ్.శంకర్రావు ఈ సందర్భంగా కోరారు. -
ఆగ్నేసమ్మ ఇకలేరు
కంచరపాలెం: జ్ఞానాపురం సిరిల్ వీధికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయిని శ్రీపాదం ఆగ్నేసమ్మ(88) సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. మంగళవారం సెయింట్ పీటర్స్ కేథడ్రల్ చర్చి సెమెట్రీలో ఆమె భూస్థాపన నిర్వహించారు. విశాఖలోని పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయినిగా పనిచేసిన ఆగ్నేసమ్మ.. వృత్తిలో ఉన్న సమయంలో ఎంతోమంది పేద పిల్లలను చదివించి, వారి అవసరాలు తీర్చి అండగా నిలిచారు. ఆగ్నేసమ్మ పెద్ద కుమారుడు రవి తనయుడు, ప్రముఖ హీరో సందీప్ కిషన్ మద్రాసులో స్థిరపడినప్పటికీ, జ్ఞానాపురంలో తమ బంధువులతో సంబంధాలను కొనసాగిస్తున్నారు. తనకు ఎంతో ఇష్టమైన నానమ్మ(ఆగ్నేసమ్మ) మరణవార్త విని చలించిపోయిన సందీప్ కిషన్..తన మేనమామ, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు, కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఇక్కడకు చేరుకున్నారు. ఆగ్నేసమ్మ భూ స్థాపన కార్యక్రమంలో పాల్గొని ఆమెకు నివాళులర్పించారు. సెయింట్ పీటర్స్ చర్చి పరిసరాల్లో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. హీరో సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత -
స్వయం సహాయక సంఘాలు స్వయంశక్తితో నడవాలి
మాడుగుల రూరల్: స్వయం సహయక సంఘాల సభ్యులు స్వశక్తితో పనిచేసి, బ్యాంకులు అందించే రుణ పరపతిని వినియోగించుకుని అధిక రాబడి సాధించాలని జాతీయ జీవనోపాధి మిషన్(ఎన్.ఆర్.ఎల్.ఎం) టీమ్ సభ్యుడు రాజీవ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. కె.జె.పురం జంక్షన్లో గంగాలమ్మతల్లి స్వయం సహాయక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బిక్యూబ్ గార్మెంట్స్(వస్త్రాలు తయారు చేసే షాపు) ను మంగళవారం పరిశీలించి, గ్రూపు సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ బిక్యూబ్ గార్మెంట్స్కు పి.ఎం.ఇ.జి.పి. ద్వారా ఆదనపు ఆదాయం పెంపొందించడం గురించి రూ.5.50 లక్షలు మంజూరు చేశారు. సంఘంలో గ్రూపుల పుస్తకాలు పరిశీలించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులతో నేరుగా మాట్లాడారు. యూనిట్ను నిర్వహిస్తున్న కాళ్ల రాజేశ్వరిని అభినందించారు. యూనిట్ వల్ల వచ్చే ఆదాయం గురించి అమెతో మాట్లాడారు. సెర్ప్ ఆడిషనల్ డైరక్టర్ కె.సరళతో పాటు డాక్టర్ ఆర్. విజయకుమార్, డీఆర్డీఏ ఏపీడీ శ్రీమతి డైజి, మండల ఏపీఎంవో రమణికుమారి, సర్పంచ్ జామి రమణబాబు తదితరులు పాల్గొన్నారు. -
6 కిలోల గంజాయి పట్టివేత
మాడుగుల: మండలంలో గరికి బంద గ్రామ సమీపంలో మంగళవారం మాడుగుల పోలీసు లు 6 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ నారాయణరావు కథనం ప్రకారం.. ముందస్తు సమాచారం ప్రకారం గరికి బంద వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. పాడేరు నుంచి వస్తున్న స్కార్పియోను ఆపి తనిఖీ చేశారు. నలుగురు నిందితులతో పాటు 6 కిలో ల గంజాయిని పట్టుకున్నారు. వాహనంతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకుని, నంద్యాల జిల్లా బేతంచర్ల ప్రాంతానికి చెందిన నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
ఇజ్రాయిల్ దాడులు అమానవీయం
అనకాపల్లి: పాలస్తీనా భూభాగంలో యూదుల వలసలు పెరగడంతో అరబ్బులతో అంతర్గత వర్గ సంఘర్షణ పెరిగిపోయిందని, దీనిపై అగ్రరాజ్యాలు దృష్టి సారించాలని ఇండియన్ సొసైటీ ఫర్ కల్చరల్ కో–ఆపరేషన్ అండ్ ఫ్రెండ్షిప్(ఇస్కఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.మాధవరావు తెలిపారు. ఇస్కఫ్ ఆధ్వర్యంలో స్థానిక వై.విజయకుమార్ హాల్లో మంగళవారం సమీక్షా సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ 20 నెలలుగా ఇజ్రాయిల్ సైన్యం జరిపిన బాంబు దాడుల్లో 55 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారన్నారు. ఆస్పత్రులు, పాఠశాలలు, శరణార్ధ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని మారణకాండ కొనసాగుతుందని, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయస్థానం సహా అనేక సంస్థలు యుద్ధం విడనాడాలని గళమెత్తుతున్నా, అమెరికా, మిత్ర దేశాల సహకారంతో నెతన్యాహు ప్రభుత్వం అమానవీయంగా దాడులు కొనసాగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇస్కఫ్ జిల్లా నాయకులు మళ్ల చక్రవర్తి ప్రొఫెసర్ డాక్టర్ ఎం. నూకరాజు, సభ్యులు దావూద్ ఆలీ, బుద్ధ వీరునాయుడు, బొడ్డేడ అప్పారావు, బొట్టా చిన్నియాదవ్, శేఖరమంత్రి సాయిలక్ష్మణ్, మల్లికార్జున రావు, రామచంద్రరావు, కోన లక్ష్మణ పాల్గొన్నారు. -
మృత్యువాత
తీరంలో చేపలు సాక్షి, అనకాపల్లి: పారిశ్రామిక ప్రాంతం అచ్యుతాపురం సెజ్ తీరంలో జలచరాలను కాలుష్యం కబళిస్తోంది. ఇక్కడ పూడిమడక ఉప్పుటేరు(మొగ) వద్ద సెజ్లో 200కుపైగా ఫార్మా కంపెనీల నుంచి వెలువడే వ్యర్థ రసాయనాలు నేరుగా సముద్రంలోకి కలవడంతో లక్షలాది చేపలు మృత్యువాత పడుతున్నాయి. పర్యావరణాన్ని కాపాడుతున్న అరుదైన ఆలివ్రిడ్లే తాబేళ్లు నశించిపోతున్నాయి. మంగళవారం ఉదయం ఫార్మా కంపెనీల నుంచి సముద్రంలోకి విడిచిపెట్టిన కలుషితమైన వ్యర్థ రసాయనాల వల్ల లక్షలాది చేపలు మృతి చెంది కుప్పలు తెప్పలుగా తీరంలో తేలాడాయి. ఇది ఈ రోజే కొత్తగా జరగలేదు. ఇలా తరుచూ జరగుతూనే ఉంటోందని స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా, పరిశ్రమ యాజమాన్యాలు పట్టించుకోవడంలేదు. ప్రభుత్వ అధికారుల్లో చలనం లేదు. పర్యవసానంగా 12,844 మత్స్యకార కుటుంబాల జీవనోపాధిపై దెబ్బపడుతోంది. శుద్ధి చేయకుండా సముద్రంలోకి వ్యర్థాలు.. అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీలు రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా ఉప్పుటేరులోకి విడుదల చేస్తున్నాయని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను ద్రవ రసాయన వ్యర్థాలను ఈటీపీ పద్ధతిలో, ఘన వ్యర్థాలను రీసైక్లింగ్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేస్తారు. ఇది ఒక వంతు అయితే .. ఫార్మా కంపెనీలో ప్రమాదకరమైన వ్యర్థాలను వాటి స్వభావం ఆధారంగా విభజించి ఽశుద్ధి చేయాల్సి ఉంటుంది. వీటిపై కంపెనీ యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సురక్షితంగా శుద్ధి చేసి అప్పుడు సముద్రంలోకి వదిలివేయాలి. ఈ విధంగా చేయకపోవడం వల్ల మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీనిపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు, కలెక్టర్కు మత్స్యకారులు ఫిర్యాదులు చేశారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కనుమరుగవుతున్న ఆలివ్ రిడ్లే తాబేళ్లు.. దేశంలోనే అరుదైన ఆలివ్రిడ్లే తాబేళ్లు తూర్పు తీరంలో విశాఖ–అచ్యుతాపురం తీరానికి వస్తుంటాయి. పర్యావరణాన్ని పరిక్షించే ఇవి ఒడిశా నుంచి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ గుడ్లు పెట్టడానికి వస్తుంటాయి. ఏటా డిసెంబర్ నుంచి ఏప్రిల్లో తీరంలో గుడ్లు పెడుతుంటాయి. గతంలో మార్చిలో పూడిమడక తీర ప్రాంతానికి గుడ్లు పెట్టడానికి వచ్చిన ఆలివ్ రిడ్లే తాబేళ్లు వందలాది కలుషిత వ్యర్థ రసాయనాలకు గురై మృత్యువాత పడ్డాయి. పూడిమడక ఉప్పుటేరులో గుట్టలుగా తేలిన వైనం వ్యర్థ రసాయనాల వల్లే మృతి నేరుగా సముద్రంలోకి వదిలేస్తున్న ఫార్మా కంపెనీలు వేలాది మంది మత్స్యకారుల జీవనోపాధిపై దెబ్బ ఫార్మా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ అధికారులకు ఫిర్యాదు చేసినాస్పందనే లేదు.. ఫార్మా కంపెనీల యాజమాన్యాల నిర్లక్ష్యంగా కారణంగా మత్స్యకారులకు జీవనోపాధి కోల్పోతున్నారు. తరుచూ పరిశ్రమల నుంచి కలుషిత, హానికరమైన వ్యర్థ రసాయనాలను నేరుగా సముద్రంలోకి వదలడంతో లక్షలాది చేపలు, చేప పిల్లలు చనిపోతున్నాయి. గతంలో చాలాసార్లు కలెక్టర్కు, మత్స్యకార అధికారులకు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశాం. ఏదో జరిగినప్పుడు తూతూ మంత్రంగా వచ్చి చూసి వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత దాని గురించి పూర్తిగా విస్మరిస్తున్నారు. యాజమాన్యాల శ్రేయస్సు కోసం ఆలోచన చేస్తున్నారే తప్ప.. వేటకు వెళ్లి జీవించే మత్స్యకారుల గురించి ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. న్యాయం చేయకపోతే పోరాడక తప్పదు. – ఉమ్మిడి జగన్, మత్స్యకార నాయకుడు, పూడిమడక గ్రామం -
యోగాంధ్రకు నిధుల కటకట
● గంటల వ్యవధిలోనే ఆవిరైన రూ.20 కోట్లు ● నిర్వహణకు మొత్తం రూ.75 కోట్లు అవసరం ● ఇప్పటికి వరకు సగం కూడా విడుదల చేయని ప్రభుత్వం ● మూడు రోజుల ముందు నిధుల కోసం అగచాట్లు ● 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం మహారాణిపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కేవలం మూడు రోజులే మిగిలి ఉన్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర–2025’కార్యక్రమానికి నిధుల లేమి వెంటాడుతోంది. కార్యక్రమ నిర్వహణకు మొ త్తం రూ.75 కోట్లు అవసరమ ని జిల్లా యంత్రాంగం అంచ నా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపగా.. ఇప్పటివరకు కేవలం రూ.20 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. అదీ మంగళవారం విడుదలైన ఈ అరకొర నిధులు.. కేవలం గంటల వ్యవధిలోనే బిల్లుల చెల్లింపులకు ఆవిరైపోవడంతో ఖజానా మళ్లీ ఖాళీ అయింది. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కార్యక్రమ నిర్వహణకు మొత్తం రూ.75 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే మంగళవారం కేవలం రూ.20 కోట్లు మాత్రమే విడుదల చేసింది ప్రభుత్వం. రూ.20 కోట్లు జిల్లా యంత్రాంగం ఖాతాలో పడిన నాలుగు గంటల్లోనే చెల్లింపులు జరిగాయి. అయితే, పేరుకుపోయిన బిల్లులతో పోలిస్తే ఇది నామమాత్రమే. చెల్లించాల్సిన ప్రతీ వంద రూపాయలకు కేవలం పది రూపాయలు అడ్వాన్స్గా చెల్లించి చేతులు దులుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. స్టేజీల నిర్మాణం, బారికేడ్లు, స్నాక్స్ ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లు వంటి అత్యవసర పనులకు సంబంధించిన కాంట్రాక్టర్లకు ఈ పాక్షిక చెల్లింపులు జరిపారు. మిగిలిన మొత్తం కోసం వారి నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుండటంతో, తక్షణమే మిగతా నిధులు విడుదల చేయాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి మరోసారి లేఖ రాసింది. భారీ ఏర్పాట్లు.. అరకొర నిధులు ఒకవైపు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నా, మరోవైపు కార్యక్రమ ఏర్పాట్లు మాత్రం సాగుతున్నాయి. సుమారు 5 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేసి, 326 ప్రత్యేక కంపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 2 లక్షల మ్యాట్లు, టీ–షర్టులు అందించగా, మరో 3 లక్షల మందికి అవసరమైన వాటిని రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చాల్సి ఉంది. దీనికి తోడు పాల్గొనే 5 లక్షల మందికి ఒక్కొక్కరికి రూ.100 విలువైన స్నాక్స్ ప్యాకెట్ అందించాలన్నా రూ.5 కోట్ల ఖర్చు తప్పదు. ఈ ఖర్చులన్నీ కాకుండా వీఐపీ, వీవీఐపీల బస, రవాణా వంటి అదనపు వ్యయాలు ఉన్నాయి. ఇప్పటికే జీవీఎంసీ, వీఎంఆర్డీఏ వంటి సంస్థలు తమ నిధులతో సుందరీకరణ, నిర్మాణ పనులు చేపడుతూ అదనపు భారం మోస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం అంచనా వ్యయంలో కనీసం సగం కూడా విడుదల చేయకపోవడంతో, ఇంత ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలో తెలియక అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. -
తల్లికి వందనం..తండ్రులకు పాట్లు
మునగపాక: కూటమి ప్రభుత్వం ‘అమ్మ ఒడి’ పథకం స్థానంలో ప్రవేశపెట్టిన ‘తల్లికి వందనం’ అర్హులందరికీ అందడం లేదు. ఏదో ఒక వంక పెట్టి పథకాన్ని నిలిపివేశారు. అందులో ప్రధానమైనది కరెంటు బిల్లు. 300 యూనిట్లు దాటి వాడితే అనర్హులని నిబంధన పెట్టారు. ఈ నిబంధన అమలు మాత్రం చాలా దారుణంగా ఉందన్న ఆవేదన ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. నెలకు 100, 150 యూనిట్లు వాడే వారిపై సైతం అనర్హత వేటు వేశారని ఆగ్రహం చెందుతున్నారు. తమ విద్యుత్ బిల్లులను పట్టుకొని తండ్రులు విద్యుత్ శాఖ కార్యాలయాలకు వస్తున్నారు. 300 యూనిట్లు ఎప్పుడు వాడామో చెప్పండని అధికారులను నిలదీస్తున్నారు. మునగపాకలోని విద్యుత్ శాఖ కార్యాలయానికి బాధితుల తాకిడి ఎక్కువగా ఉంది. కరెంటు ఎంత వాడామో సరైన నివేదిక ఇచ్చి ‘తల్లికి వందనం’ లబ్ధి వచ్చేలా చూడాలని ఏఈ జగదీష్కు వినతి పత్రాలు అందజేస్తున్నారు. ఈ విషయమై ఏఈ వివరణ ఇస్తూ.. ఎన్ని యూనిట్లు దాటితే పథకం వర్తించదో తమకు తెలీదని, ఈ విషయంలో ఎలాంటి సమాచారం లేదన్నారు. ఏడాది మొత్తంలో విద్యుత్ వినియోగాన్ని సరాసరి చేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. తమకు పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ రాలేదన్నారు. -
తమ్ముడి చేతిలో అన్న హతం
చీడికాడ: మద్యం మత్తులో చిన్న విషయం కాస్తా పెద్దపై సొంత అన్నయ్య ప్రాణం తీసే వరకు వెళ్లింది. ఈ దుర్ఘటన మండలంలోని తురువోలులో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తుల సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన జోగా రాము (48), జోగా దేముళ్లు సొంత అన్నదమ్ములు. మంగళవారం సాయంత్రం గ్రామంలో ఒడ్డు పండగ చేసుకొని కళ్లానికి వెళ్లారు. తల్లి వద్ద పాలు తాగేస్తుందని మద్యం మత్తులో ఉన్న దేముళ్లు దూడపెయ్యిని కర్రతో కొట్టాడు. దీనిని మృతుడు రాము వారించాడు. దీంతో ఇరువురి మధ్య స్వల్ప తగాదా జరిగింది. తీవ్రమైన కోపంతో దేముళ్లు పాకలో ఉన్న నాటు తుపాకీ తెచ్చి అన్నపై కాల్పులు జరపగా రాము ఛాతి కింద గాయమైంది. కుటుంబ సభ్యులు ఆటోలో చోడవరం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో రాము మృతి చెందాడు. ఈ సమాచారం పోలీసుల వరకు చేరడంతో కె.కోటపాడు సీఐ పైడిపునాయుడు, మాడుగుల ఎస్ఐ నారాయణరావులు మంగళవారం రాత్రి గ్రామానికి వెళ్లి విచారించారు. అయితే రాము మృతికి కాల్పులు కారణం కాదని కుటుంబ సభ్యులు చెబుతూ ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదని ఎస్ఐ నారాయణరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు చెప్పారు. మద్యం మత్తులో వివాదం నాటుతుపాకీతో కాల్పులు -
ఘనంగా గంగమ్మ తల్లి మారువారం
మహారాణిపేట (విశాఖ): మత్స్య సంపద సమృద్ధిగా లభించాలని, వేటకు వెళ్లిన మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ మత్స్యకార మహిళలు మంగళవారం భక్తి శ్రద్ధలతో గంగమ్మ తల్లి మారువారం నిర్వహించారు. ఫిషింగ్ హర్బర్లోని గంగమ్మ తల్లి ఆలయం వద్ద కనులపండువగా ఈ కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో మహిళలు కలశాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారి ని దర్శించుకుని, పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘గంగమ్మ తల్లి.. కాపాడమ్మా’అంటూ వేడుకున్నారు. మత్స్యకార సంప్రదాయం ప్రకారం పూజలు చేసి, పసుపు, కుంకుమలను సముద్రంలో నిమజ్జనం చేశారు. గత మంగళవారం గంగమ్మ పండగ నిర్వహించిన అనంతరం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి మత్స్యకారులు వేట ప్రారంభించారు. మారువా రం సందర్భంగా సముద్ర దేవతను పసుపు, కుంకుమలతో డ్రై ఫిష్ మహిళా సంఘం సభ్యులు పూజించారు. -
బీచ్రోడ్డు దిగ్బంధం
ఏయూక్యాంపస్: అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్ల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి బీచ్రోడ్డులో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. యోగా కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుండటంతో పనులకు ఆటంకం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్.కె.బీచ్ నుంచి వాల్తేర్ డిపో కూడలి వరకు రహదారిని మూసివేయడంతో.. అటువైపుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఇక యోగా దినోత్సవం కోసం బీచ్ రోడ్డులో పనులు ఊపందుకున్నాయి. రహదారికి ఇరువైపులా ప్రత్యేక కంపార్ట్మెంట్ల నిర్మాణం, వాటిలో గ్రీన్ మ్యాట్లు పరచడం వంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీక్షకుల సౌకర్యార్థం ఎల్ఈడీ తెరలను, వాటికి అవసరమైన ఇంటర్నెట్, విద్యుత్ కనెక్షన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆర్.కె.బీచ్ వద్ద ప్రధాన వేదికతో పాటు, ఇసుక తిన్నెలపై మరో భారీ వేదికను నిర్మిస్తున్నారు. భారీగా హాజరయ్యే ప్రజల కోసం మొబైల్ టాయిలెట్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు ఫుట్పాత్లకు, డివైడర్లకు రంగులు వేస్తూ తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. యోగాంధ్ర ప్రచారంలో భాగంగా నగరంలో హోర్డింగులు, బ్యానర్లు వెలిశాయి. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు నగర పోలీసులతో పాటు ఇతర జిల్లాల నుంచి అదనపు బలగాలు విశాఖకు చేరుకున్నాయి. కేంద్ర భద్రతా దళం(ఎస్పీజీ) అధికారులు సైతం ఏర్పాట్లను నిశితంగా పరిశీలిస్తూ, భద్రతాపరమైన సూచనలు అందిస్తున్నారు. తీరం వెంబడి పూర్తిస్థాయిలో పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. వాహనాల రాకపోకల నిలిపివేత పోలీసుల వలయంలో సాగరతీరం శరవేగంగా యోగా దినోత్సవ ఏర్పాట్లు -
ఏఎంసీకి లక్ష్మీకాంతమ్మ పార్థివదేహం
మహారాణిపేట: సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక ట్రస్టీ, అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం వ్యవస్థాపక సభ్యురాలు పేరిచర్ల లక్ష్మీకాంతమ్మ పార్థివదేహాన్ని మంగళవారం ఆంధ్రా మెడికల్ కాలేజీకి దానం చేశారు. దేహదాన మహోద్యమానికి పునాది వేస్తూ, మొత్తం శరీరాన్ని దానం చేసిన తొలి 35 మందిలో పేరిచర్ల లక్ష్మీకాంతమ్మ ఒకరు. ఈమె ట్రస్ట్ వ్యవస్థాపక కోశాధికారి శ్రీహరి రాజు మాతృమూర్తి, ప్రముఖ సంఘ సంస్కర్త, దివంగత పేరిచర్ల సుబ్బరాజు జీవిత భాగస్వామి. లక్ష్మీకాంతమ్మ తెలుగు పండిట్గా పనిచేశారు. ఈ నెల 16న విజయవాడలో పరీక్షలు చేయిస్తుండగా, ఆకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో కన్నుమూశారు. మంగళవారం లక్ష్మీకాంతమ్మ కళ్లను ఎల్.వి.ప్రసాద్ ఐ ఆసుపత్రికి దానం చేయగా, మధ్యాహ్నం 12 గంటలకు ఆమె పార్థివదేహాన్ని ఆంధ్రా మెడికల్ కాలేజీకి అప్పగించారు. కార్యక్రమంలో ఆమె కుమారులు, బంధుమిత్రులు, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు గూడూరు సీతామహాలక్ష్మి, సభ్యులు జి.కన్యాకుమారి పాల్గొన్నారు. -
అనకాపల్లిలో మంత్రుల సమీక్ష
అనకాపల్లి: విశాఖ నగరంలో ఈ నెల 21న ఉదయం 7 గంటలకు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆ రోజు వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేస్తారన్నారు. జిల్లా నుంచి అన్ని వర్గాల ప్రజలు యోగాలో పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయమై మంగళవారం ఆయన కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
మొబైల్ పోయిందా.. ఈ నంబర్కు మెసేజ్ చేయొద్దు
అనకాపల్లి టౌన్: మీ ఫోన్ పోయిందా.. అయితే ఈ నంబర్కు ఫిర్యాదు చేయండి. మీ ఫోన్ ఐఎంఈఐ నంబర్ను మెసేజ్ చేయండి చాలు.. అంటూ జిల్లా పోలీసులు ఊదరగొట్టారు. వివరాలు 95052 00100 నంబర్కు పంపిస్తే మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి కనిపెడతామన్నారు. చాలా కనిపెట్టారు కూడా.. అయితే మంగళవారం ఫోన్ పోగొట్టుకున్న ఒకరు ఈ నంబర్కు మెసేజి పంపి కంగుతిన్నారు. వివరాలు పంపాక ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆ నంబర్కు కాల్ చేయగా.. రాంగ్ నంబర్ అని పెట్టేశారు. మళ్లీ చేసి ‘ఇది పోలీస్ ఐటీ కోర్ విభాగం నంబరేనా’ అని అడిగితే చిరాకు పడ్డారు. ఈ విషయం ‘సాక్షి’ దృష్టికి రావడంతో కారణమేమిటని ఆరా తీసింది. నంబర్ మారిందని, ఇకపై 93469 12007 నంబర్కు మెసేజి చేయాలని జిల్లా పోలీస్ ఐటీ కోర్ విభాగం పోలీసులు తెలిపారు. ఈ నంబర్ను ఎక్కువగా ప్రచారం చేయకపోవడంతో పాత నంబర్నే చాలామంది వినియోగిస్తున్నారు. కొత్త నంబర్కు ఏదైనా మొబైల్ ఫోన్ నుంచి ‘హాయ్’ అని మెసేజ్ చేస్తే పోలీస్ ఐటీ కోర్ టీం స్పందిస్తుంది. వివరాలు తీసుకొని సరికొత్త టెక్నాలజీతో ఫోన్ ఎక్కడుందో కనిపెడుతుంది. -
అసనగిరి వాసులకు మళ్లీ అస్వస్థత
నాతవరం: కలుషిత ఆహారం ఘటనలో మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. సోమవారం నాతవరం పీహెచ్సీలో వైద్య సేవలు అందించారు. నాతవరం మండలం సుందరకోట పంచాయతీ శివారు అసనగిరి గ్రామానికి చెందిన 12 మంది, కాకినాడ జిల్లా రవతలపూడి మండలం రాఘవట్నం చెందిన 16 మంది కుటుంబ సభ్యులు కలిసి ఈ నెల 14న రాత్రి పాడేరు మోదకొండమ్మ దర్శనానికి వెళ్లారు. అక్కడ పులిహోర తిని మార్గమధ్యంలో పలు చోట్ల మంచినీరు తాగారు. ఈ నెల15న పాడేరులో అస్వస్థతకు గురవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్సా అందించారు. ఆరోగ్యం కుదుటపడటంతో అదే రోజు రాత్రికి స్వగ్రామాలకు వచ్చేశారు. అసనగిరిలో వీరికి మరలా అస్వస్థత కావడంతో సోమవారం మధ్యాహ్నం ఆటోల్లో నాతవరం పీహెచ్సీకి తీసుకొచ్చారు. అక్కడ వైద్యాధికారులు ప్రసన్న, ఎం.రాజేష్నాయుడు వైద్య సేవలందించారు. వీరిలో బూటారి దుర్గా సాయిని మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్కు తీసుకెళ్లారు. మిగతా వారిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా వారు నిరాకరించారు. వైద్యాధికారి వెంటనే తహసీల్దార్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. తహసీల్దార్ ఎ. వేణుగోపాల్, వైద్యాధికారి రాజేష్నాయుడు గిరిజనులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ వారు అంగీకరించలేదు. దాంతో పోలీసులు బందోబస్తుతో రెండు అంబులైన్సులో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఏరియా ఆస్పత్రిలో అసనగిరికి చెందిన పాండవుల గంగాభవాని, వెలగల వరలక్ష్మి, వెంకట్, కాసుబాబు, బూటారి ములసమ్మ, వెలగల వెంకయ్యమ్మ, రాజు, చల్లా లక్ష్మి, చల్లా ప్రసాద్, బూటారి అనిల్, బూటారి లక్ష్మి చికిత్స పొందుతున్నారని వైద్యాధికారులు తెలిపారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరణ నాతవరం పీహెచ్సీ నుంచి పోలీసు బందోబస్తుతో తరలింపు -
కలెక్టరమ్మా.. మా మొర వినండి
తుమ్మపాల: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో పలు సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ గేటు వద్ద పలు ప్రజా సంఘాల నాయకులు, గ్రామాల వారీగా ప్రజలు ఏకమై ఆందోళనలు చేపట్టారు. జిల్లా అధికారులైనా చర్యలు తీసుకోవాలని ప్లకార్డులు పట్టుకుని ఆవేదన వ్యక్తం చేశారు. పదేపదే కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదని, పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు చేస్తే అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వాపోతున్నారు. పీజీఆర్ఎస్పై రోజు రోజుకూ విశ్వాసం తగ్గిపోతున్నా, గత్యంతరం లేక కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. కలెక్టరమ్మ స్పందించి అధికారులకు ఆదేశాలిస్తారనే గంపెడాశలతో సుదూర ప్రాంతాల నుంచి వృద్ధులు, పసిబిడ్డలతో వస్తే గేటు బయట నుంచే అడుగడుగునా ఆంక్షలతో పోలీసులు, సిబ్బంది అడ్డుకుంటున్నారు. సమస్య తీవ్రత ఎంతటిదైనా అర్జీదారుకు మాత్రమే పీజీఆర్ఎస్ వేదిక వద్దకు అనుమతించి మిగిలిన కుటుంబ సభ్యులను బయటకు నెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీజీఆర్ఎస్లో 282 అర్జీలు నమోదు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ విజయ కృష్ణన్, డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఎస్డీసీ సుబ్బలక్ష్మి అర్జీలు స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత జిల్లా అధికారులు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి పునరావృతం కాకుండా చూడాలన్నారు. మొత్తం 282 అర్జీలు నమోదు కాగా, వాటిలో రెవెన్యూ సంబంధిత భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. 86 శాతం అంగవైకల్యం ఉన్నా పింఛన్ ఇవ్వలేదు పక్షవాతంతో కాళ్లు పనిచేయక నడవలేని స్థితిలో ఉన్నాను. 86 శాతం అంగవైకల్యంతో ఏడాది కాలానికి మాత్రమే వైద్యులు 2024లో సదరం ధ్రువీకరణ పత్రం మంజూరు చేశారు. దాన్ని పట్టుకుని సచివాలయానికి వెళ్తే పింఛన్ రాదని అక్కడ సిబ్బంది నమోదు చేయడం లేదు. నా పరిస్థితి చూసి పింఛన్ మంజూరు చేయాలని అనకాపల్లి మండలం కశింకోటకు చెందిన కిల్లంపల్లి సత్తిబాబు తన కుటుంబ సభ్యుల సహాయంతో వీల్ చైర్పై కలెక్టరేట్కు వచ్చి మొరపెట్టుకున్నాడు. కోళ్ల ఫారం పనులపై నిరసనలు నివాసాలకు సమీపంలో ఏర్పాటు చేస్తున్న కోళ్ల ఫారం పనులను తక్షణమే నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ మునగపాక మండలం రాజుపేట అగ్రహారం, పరవాడ మండలం భరణికం పంచాయతీ కట్టవానిపాలెం గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద వేర్వేరుగా నిరసనలు చేపట్టారు. రెండు గ్రామాలకు కేవలం 250 మీటర్ల దూరంలో కోళ్ల ఫారం నిర్మించడం వల్ల ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందని వాపోయారు. యాజమాన్యాన్ని ప్రశ్నించిన వారిపై రాజకీయ పలుకుబడితో పోలీసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, రెండు మండలాల ఎంపీడీవోలకు ఫిర్యాదు చేయగా, విచారించి పనులు నిలిపివేయాలని ఆదేశించారన్నారు. అయినప్పటికీ అధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ చేపడుతున్న పనులను నిలిపివేయాలని కలెక్టర్ను కోరారు. ఇంకెన్నాళ్లూ డోలీ మోత కష్టాలు శాశ్వత రోడ్డు నిర్మించి డోలీ మోతల కష్టాలు లేకుండా చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో వి.మాడుగుల మండలం అవురువాడ పంచాయతీ కొండవీధి, పెదగోరి గెడ్డ గ్రామాల గిరిజనులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. గతంలో రోడ్డు ఏర్పాటు కోసం వాగుపై పిల్లర్లు వేసినప్పటికి మధ్యలోనే పనులు నిలిచిపోయాయి. ఏజెన్సీ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ మేరకు రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. మా పిల్లల కోసమైన రోడ్డు వేసి వారి బతుకుల్లో వెలుగులు నింపేందుకు చర్యలు చేపట్టాలని విన్నవించారు. అనుమతులు లేకున్నా, కొండను తవ్వేస్తున్నారని ఫిర్యాదు ఎటువంటి అనుమతులు లేకుండా దౌర్జన్యంగా తవ్వేస్తున్న కొండను కాపాడాలని, భారీ మైనింగ్ వాహనాల రాకపోకలతో గ్రామంలో రోడ్లన్నీ ధ్వంసమైపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఎస్.రాయవరం మండలం వేమగిరి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. కొందరు నాయకుల అండదండలతో గ్రామంలో కొండను తవ్వేసి అక్రమ రవాణా చేయడంపై ప్రశ్నిస్తే గ్రామస్తులపై దాడులకు దిగుతున్నారని, జిల్లా అధికారులు దృష్టి సారించి మా గ్రామాన్ని కాపాడాలని కోరారు. మా సమస్యలు అధికారులకు పట్టడం లేదు కార్యాలయాల చుట్టూ తిప్పిస్తున్నారు కలెక్టరేట్కు వస్తే గేటు బయటకు నెట్టేస్తున్నారు పీజీఆర్ఎస్లో అర్జీదారుల ఆవేదన -
జానకీరాంపురం పీఏసీఎస్లో రూ.2 కోట్ల అవకతవకలపై విచారణ
రోలుగుంట : మండలంలోని జానకీరాంపురంలోని పీఏసీఎస్లో సుమారు రెండు కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయని అందిన ఫిర్యాదుపై సుమారు ఏడాదిన్నర కాలంగా విచారణ సాగుతూనే ఉన్న విషయం విదితమే. మూడు నెలలకు ఒకసారి ఆ శాఖలో ఒకరిని విచారణాధికారిగా నియమించడం నామమాత్ర విచారణ జరపడం, వెళ్లిపోవడం జరుగుతుందే కానీ స్పష్టమైన చర్యలు తీసుకోలేదు. 51 సెక్షన్ ప్రకారం విచారణ చేసి నిగ్గుతేల్చాలని ఫిర్యాదుదారులు డిమాండు చేస్తున్నారు. దీనిలో బాగంగా ఆ శాఖ ఉన్నతాధికారి , ఫిర్యాదుదారులు కిల్లాడ సాంబమూర్తినాయుడు, గొర్లె రాంబాబు, నారాయణరావు, పెదపాటి శ్రీనివాసరావు గత వారం చేసిన ఫిర్యాదు మేరకు చోడవరం డివిజన్ సీనియర్ ఇన్స్పెక్టర్ వి.వి.ప్రసీద్ కుమార్కు విచారణఽ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆయన సోమవారం పీఏసీఎస్కు వచ్చి ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఫిర్యాదు దారులను విచారణ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఈ విచారణలో పాల్గొన్న కిల్లాడ సాంబమూర్తినాయుడు, నారాయణరావు, గొర్లె రాంబాబు, నారాయణరావు, పెదపాటి శ్రీనివాసరావు నిబంధనలకు విరుద్ధంగా సస్పెండైన బి.వి.వి.ఆర్.జె కృష్ణ భార్య జోగులమ్మ పేరున మంజూరైన రూ.2.50 లక్షలు వెంటనే జమ చేయించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. సుమారు 250 మంది సభ్యులకు చెందిన చార్జి డిక్లరేషన్ రుణాల నిగ్గు తేలాలంటే 51 సెక్షన్ విచారణ అమలు చేయాలని డిమాండు చేశారు. భూమిలేకుండా ఇచ్చిన రుణాల బాధితులు, బినామీలు అధిక సంఖ్యలో పాల్గొని తమకు జరిగిన అన్యాయాన్ని విచారణాధికారికి వివరించారు. ఈ సందర్భంగా విచారణలో ఫిర్యాదుదారుల తెలిపిన వివరాలు నమోదు చేయడం జరిగిందని, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని విచారణ అధికారి తెలిపారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. -
కట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య
మునగపాక: వివాహేతర సంబంధం అంటకట్టడంతోపాటు అదనపు కట్నం వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మునగపాక మండలం గంగాదేవిపేటలో సోమవారం చోటు చేసుకుంది. అత్తింటివారి వేధింపులు వల్లే తన కుమార్తె చనిపోయిందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మునగపాక పోలీసులు సోమవారం రాత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. మునగపాక మండలం గంగాదేవిపేటకు చెందిన బత్తిన పోతురాజు, వరలక్ష్మి దంపతులు కుమారుడు వెంకటేష్కు ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం గ్రామానికి చెందిన కుమారితో ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారి దాంపత్య జీవితంలో భాగంగా కొంతకాలంగా కుమారి అత్త వరలక్ష్మి, మామ పోతురాజు, బావ సంతోషం, తోటికోడలు సాయి తదితరులు తరచూ అదనపు కట్నం కోసం వేధించేవారు. ఈ విషయమై కుమారి తన తల్లికి పలుమార్లు చెబుతూ బాధపడేది. కుమారి భర్త వెంకటేష్ సింగపూర్లో ఉద్యోగరీత్యా ఉంటున్నాడు. వేసవి సెలవులకు ఆమె తన పుట్టింట్లో పిల్లలతో ఉండేది. ఈ క్రమంలో సోమవారం తన పిల్లలను అనకాపల్లిలో స్కూలులో చేర్పించేందుకు అత్తారింటికి వచ్చింది. ఇంతలో ఉరేసుకుని చనిపోయిందంటూ ఆమె మామ ఫోన్లో సమాచారం అందించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్, యలమంచిలి సీఐ ధనుంజయరావు గంగాదేవిపేటలో విచారణ చేపట్టారు. కుమారి మృతదేహాన్ని అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. అత్తింటి కష్టాలే కారణమని మృతురాలి తల్లి ఫిర్యాదు గంగాదేవిపేటలో ఘటన -
ఆదివాసీ గ్రామంలో పోలీసు సేవలు
గొలుగొండ: అల్లూరి పార్కుకు 8 కి.మీ. దూరంలో ఉన్న చుక్కపనుకులు ఆదివాసీ గిరిజన గ్రామాన్ని పోలీసులు సోమవారం కాలినడకన సందర్శించారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, రూరల్ సీఐ రేవతమ్మ, కృష్ణదేవిపేట ఎస్ఐ తారకేశ్వర్రావు తదితరులు కాలినడనక సుమారు 3 గంటలపాటు నడిచి గ్రామానికి చేరుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి డీఎస్పీ వివరాలు తెలుసుకున్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటూ 10 సంవత్సరాల నుంచి 14 కుటుంబాల వారం ఇక్కడ జీవిస్తున్నామని, ఏ కష్టం వచ్చినా కృష్ణదేవిపేట అడవుల గుండా నడిచివెళ్లాల్సిందేనన్నారు. వైఎస్సార్పీపీ ప్రభుత్వ హయాంలో సమకూర్చిన విద్యుత్ సదుపాయం తప్ప ఎటువంటి మౌలిక వసతులు లేవని గిరిజనులు తెలిపారు. సేవా కార్యక్రమాలు కృష్ణదేవిపేట హోమియో వైద్యాధికారి హేమలత గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. గ్రామంలో మహిళలకు రెండు చీరలు, మగవారికి పంచెలు, గొడుగులు అందజేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. ఇక్కడి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని, ఏ కష్టం వచ్చినా కృష్ణదేవిపేట ఎస్ఐకి తెలియపరచాలన్నారు. దట్టమైన అడవిలో నడిచి వెళ్లిన అధికారులు -
మోసం.. అరాచకం
● ఏడాది పాలనలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చింది ఇదే.. ● సూపర్ సిక్స్ పథకాల పేరుతో వెన్నుపోటు ● అమరావతిపై ఉన్న శ్రద్ధ ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎందుకు లేదు ● గోవాడ సుగర్ ఫ్యాక్టరీని మూతపడే స్థాయికి దిగజార్చారు ● మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ధ్వజం ● ‘జగన్ అంటే నమ్మకం–చంద్రబాబు అంటే మోసం’ పుస్తకావిష్కరణ దేవరాపల్లి: చంద్రబాబు ఏడాది పాలనలో మోసాలు, అరాచకాలు, అక్రమ అరెస్టులు తప్ప చేసిందేమి లేదని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ రాజకీయ సలహా మండలి సభ్యుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. తారువలో ‘జగన్ అంటే నమ్మకం–చంద్రబాబు అంటే మోసం’ పేరిట చంద్రబాబు ఏడాది పాలనలో అరాచకాలు, మోసాలను వివరిస్తూ ప్రచురించిన పుస్తకాన్ని ఆయన సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఏడాది పూర్తయినా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. జగన్ పాలనలో ఏడాదిలోనే 90 శాతం హామీలను ఒక్కొక్కటిగా అమలు చేశారని గుర్తు చేశారు. అమరావతిపై ఉన్న శ్రద్ధ వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎందుకు లేదని నిలదీశారు. యువతపై చిన్నచూపు టెన్త్ పరీక్ష ఫలితాల్లో తప్పులు, తడకలతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారని, విద్యాశాఖ మంత్రి వైఫల్యానికి ఇది నిదర్శనమని ముత్యాలనాయుడు విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన అమలు ఎక్కడని ప్రశ్నించారు. ఉద్యోగాలు కల్పించకుంటే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. జగన్ హయాంలో ఆరోగ్యశ్రీలో రూ.25 లక్షల వరకు భరోసా కల్పించగా, ప్రస్తుతం సక్రమంగా అమలు కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు కనీసం మందులు సరఫరా చేయలేని దుస్థితిలో కూటమి ఉందన్నారు. కేంద్రం ఇచ్చే నగదుతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పేరిట ఏటా రైతులకు రూ.20 వేలు ఇస్తామని చెప్పి మాట మార్చడం సరికాదన్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు ఏర్పాటు చేసి ఏరులై పారిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో వారంతా ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీని మూతపడే స్థాయికి దిగజార్చారని, మినీ మహానాడులో ఆ పార్టీ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్వయంగా చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. నిధులు అడిగినా ఇవ్వడం లేదని ఎమ్మెల్యే బాహాటంగా చెప్పారని, ఈ ప్రభుత్వ పాలన తీరుకు అద్దం పడుతుందన్నారు. ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, వైస్ ఎంపీపీ పంచాడ సింహాచలంనాయుడు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబూరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వరదపురెడ్డి లలితానాయుడు, ఆర్టీఐ విభాగం జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణ, మండల యువజన అధ్యక్షుడు కర్రి సూరినాయుడు, ఉపాధ్యక్షుడు బండారు దేముడునాయుడు, ఎంపీటీసీలు కోలా గోపి, పోతల వెంకటరావు, సర్పంచ్లు రొంగలి వెంకటరావు, నాగిరెడ్డి శఠారినాయుడు పాల్గొన్నారు. -
కేసులు.. వేధింపులు
● సమాధానం చెప్పలేక ప్రశ్నించిన వారిపై కక్షసాధింపులు ● ఘనత వహించిన కూటమి సర్కారు పాలన తీరిది.. ● మహిళలపై అఘాయిత్యాలు.. క్షీణించిన శాంతిభద్రతలు ● ఏ ఒక్క హామీనీ చిత్తశుద్ధితో పూర్తి చేయని చంద్రబాబు ● మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజం చోడవరం: ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం తప్ప కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు మేలు చేసిందేమీ లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ‘జగన్ అంటే నమ్మకం..చంద్రబాబు అంటే మోసం’ పేరిట వైఎస్సార్సీపీ రూపొందించిన పుస్తకాన్ని చోడవరం పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన ఆవిష్కరించారు. పుస్తక ప్రతులను పార్టీ శ్రేణులకు పంపిణీ చేసి గ్రామాల్లో ప్రజలకు వాటిని చదివి వినిపించి, కూటమి ప్రభుత్వం ప్రజలను ఎలా మోసం చేసిందే తెలియజేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పోరాట ఫలితంగానే తమ ప్రభుత్వం అమలు చేసిన ‘అమ్మ ఒడి’ పథకం పేరు మార్చి ఇటీవల కొనసాగించారే తప్ప వారు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క పథకాన్ని పూర్తిగా అమలు చేయలేదని అమర్నాథ్ ధ్వజమెత్తారు. ఏడాది పాలనలో పరిపాలనను పక్కన పెట్టి ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, హత్యలు చేయించడం, దాడులు చేయడం తప్ప ప్రజల కోసం ఏమీ పనిచేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన 390మంది నాయకులను కూటమి ప్రభుత్వం హత్య చేసిందన్నారు. అనేక మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగినా పట్టించుకోకుండా రాష్ట్రంలో శాంతిభద్రతలను నిర్వీర్యం చేశారన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసి దౌర్జన్య పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధికి నోచుకోకుండా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఈ పుస్తకంలో తెలియజేశామన్నారు. అన్నీ అబద్ధాలే.. ఏడాది పాలనలో రూ.1.5 లక్షల కోట్లు అప్పు చేయడం తప్ప రాష్ట్ర ప్రజలకు మాత్రం చంద్రబాబునాయుడు ఏమీ చేయలేదన్నారు. హామీలు గురించి అడిగితే అన్నీ చేసేశానంటూ అబద్ధాలు ఆడుతున్నారన్నారు. మహిళలకు ఇస్తామన్న ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, ఉచిత బస్సు పథకాలు ఏవీ అమలు చేయలేదన్నారు. సంక్రాంతి కల్లా రోడ్లన్నీ బాగుచేస్తామని చెప్పినా ఏమాత్రం పురోగతి లేదన్నారు. ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ఎప్పుడూ పోరాటం చేస్తామని, ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం ఎలా మోసం చేస్తుందో గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తామని అమర్నాధ్ అన్నారు. అనంతరం కార్యకర్తలతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమకంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏడువాక సత్యారావు, జెడ్పీటీసీలు దొండా రాంబాబు, తలారి ఆదిమూర్తి, ఎంపీపీలు యర్రంశెట్టి శ్రీనివాసరావు, పైల రాజు, పార్టీ జిల్లా యువజన, రైతు విభాగల అధ్యక్షులు పుల్లేటి వెంకటేష్, బొడ్డేడ సూర్యనారాయణ, పార్టీ మండల అధ్యక్షులు దొడ్డి వెంకట్రావు, ముక్కా మహలక్ష్మి నాయుడు, కొల్లిమల్ల అచ్చెంనాయుడు, జిల్లా ఉపాధ్యక్షురాలు బొగ్గు శ్యామల పాల్గొన్నారు -
విద్యాలయాలా.. వ్యాపార కేంద్రాలా?
గుర్తింపు రద్దు చేయాలి నిబంధనలు పాటించని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలపై అధికారులు చర్యలు తీసుకోవాలి. పాఠశాలల్లోనే అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫాం విక్రయిస్తున్న విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి. పుస్తక వ్యాపారాన్ని విద్యాశాఖ అధికారులు ఎందుకు కట్టడి చేయడం లేదో వారికే తెలియాలి. ప్రైవేటు విద్యా సంస్థల్లో పుస్తకాలు, అధిక ఫీజుల వసూళ్లపై చర్యలు తీసుకోవాలని డీఈవోకు ఫిర్యాదు చేశాం. అయినప్పటికీ స్పందన లేదు. –మైలపల్లి బాలాజీ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చర్యలు తీసుకోవాలి జిల్లాలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల నిర్వాహకులు పలు రకాల ఫీజులతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారు. ప్రతి ఏటా ఫీజులు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించడంలేదు. ఫీజుల వివరాలను నోటీసు బోర్డుల్లో డిస్ ప్లే చేయడం లేదు. సామగ్రి కొనక తప్పని పరిస్థితిని సృష్టిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే తనిఖీలు చేసి నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి. –బి.బాబ్జీ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ● ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో అంతులేని దోపిడీ ● అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫాం, సామగ్రి విక్రయాలు ● తడిసి మోపెడవుతున్న ఖర్చులు ● చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులుయలమంచిలి రూరల్: జిల్లాలో 500కు పైగా ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు, కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న చిన్న చిన్న బడ్జెట్ స్కూళ్లు మినహాయిస్తే మిగతా అన్ని విద్యా సంస్థల్లో విద్యా వ్యాపారం మూడు పూవులు, ఆరు కాయలుగా సాగుతోంది. ఒకవైపు అధిక ఫీజులతో సతమతమవుతున్న మధ్యతరగతి వర్గాల వారు ఈ ఏడాది భారీగా పెంచిన పుస్తకాల ధరలతో షాకవుతున్నారు. కొన్ని కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు సొంత సిలబస్ పేరుతో పుస్తకాలు ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నాయి. ప్రభుత్వం ముద్రించిన పుస్తకాల ధరలు వందల్లో ఉంటే, ప్రైవేటు విద్యాసంస్థలు ముద్రించిన పుస్తకాల ధరలు వేలల్లో ఉంటున్నాయి. జిల్లాలో అనకాపల్లి, యలమంచిలి, చోడవరం, అచ్యుతాపురం, పాయకరావుపేట, నర్సీపట్నం సహా మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో నిర్వహిస్తున్న పలు ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, ఇతర సామగ్రి అమ్ముతున్న నిర్వాహకులు 1 నుంచి 5 తరగతి వరకు పుస్తకాలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. 6 నుంచి 10 తరగతులకు రూ.7,500 నుంచి రూ.10,500 వరకు వసూలు చేస్తున్నారు. ఇక ఇంటర్మీడియట్కైతే ఈ దోపిడీ మ రింత ఎక్కువగా ఉంటోంది. నీట్, ఐఐటీ, ఐఏఎస్, ఒలింపియాడ్, సీ బ్యాచ్, ఎం బ్యాచ్, టెక్నో వంటి పేర్లతో అదనంగా వసూలు చేస్తున్నారు. బడి బస్సు ల ధరలనూ అడ్డగోలుగా పెంచేస్తున్నారని.. మరో గ త్యంతరం లేక వారు అడిగినంత చెల్లించాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూపర్ మార్కెట్ తరహాలో.. జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభం అయిన నేపథ్యంలో పేరొందిన ఐదు యాజమాన్యాలకు చెందిన కార్పొరేట్ విద్యాసంస్థల బ్రాంచీలన్నీ సూపర్ మార్కెట్లను తలపిస్తున్నాయి. విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు, యూనిఫాం, ఇతర సామగ్రితో స్టోర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సంబంధించిన అన్ని వస్తువులూ తమ వద్దే కొనుగోలు చేయాలని హుకుం జారీ చేయడంతో గత్యంతరం లేక తల్లిదండ్రులు వారికి వేలాది రూపాయలు కుమ్మరిస్తున్నారు. ఇదంతా విద్యాశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రెండ్రోజుల క్రితం భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) నాయకులు యలమంచిలి కోర్టు పేటలో ఉన్న ఒక కార్పొరేట్ విద్యాసంస్థలోకి వెళ్లి అక్కడ బుక్ స్టోర్ను పరిశీలించారు. ఇది స్కూలా.. పుస్తకాల దుకాణమా అని నిలదీయడంతో అక్కడ మహిళా సిబ్బంది సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. అనకాపల్లి రెవెన్యూ కార్యాలయం ఎదురు వీధిలో ఉన్న ఒక కార్పొరేట్ కాలేజీ ఎదుట శనివారం ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళనకు దిగారు. పుస్తకాలు విక్రయాలను అడ్డుకోవాలని, విద్యాసంస్థ దోపిడీని అరికట్టాలని నినాదాలు చేస్తూ విద్యాసంస్థ నేమ్ బోర్డులను ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. -
రిజిస్ట్రేషన్లకూ కరెంట్ కష్టాలు
● సోమవారం మధ్యాహ్నంలోపే నాలుగైదు సార్లు కోత ● నక్కపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తరచూ విద్యుత్ అంతరాయం ● స్లాబ్ విధానంలో నష్టపోతున్న కక్షిదారులు ● లావాదేవీల్లో తీవ్ర ఇబ్బందులు దూర ప్రాంతాల వారికి మరీ ఇబ్బంది సబ్రిజిస్టార్ కార్యాలయంలో కరెంటు పోతే లావాదేవీలు నిలిచిపోతున్నాయి. స్లాబ్ గడువులోగా రిజిస్ట్రేషన్ జరగకపోతే తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. మరుసటి రోజుకు స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తోంది. స్థానికులకు పర్వాలేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు మరీ ఇబ్బంది పడుతున్నారు. నిత్యం ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగే ఈ కార్యాలయానికి యూపీఎస్లు లేకపోవడం దారుణం. – కోసూరు శ్రీను, కక్షిదారుడు, నక్కపల్లి కరెంటు లేకపోతే మేమేం చేస్తాం కరెంటు లేకపోతే మేమేం చేస్తాం. ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్లు చేస్తాం. కక్షిదారులు ఇబ్బంది పడితే మాకు సంబంధం ఎంటి. మేమేం చేయలేం. యూపీఎస్లు, ఇన్వర్టర్ కొనుగోలు చేయడానికి బడ్టెట్ లేదు. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు దృష్టికి తీసుకెళ్లాం. – సిహెచ్.నర్సింహమూర్తి, సబ్ రిజిస్టార్, నక్కపల్లి నక్కపల్లి: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే కక్షిదారులకు సీఎం చంద్రబాబు సర్కార్ కరెంట్ షాక్ ఇస్తోంది. పౌరసేవలు సులభతరం, పాలన వేగవంతంపై ఈ – గవర్నెస్, వాట్సాప్ గవర్నెస్ వంటి సర్వీసులు గురించి పదేపదే ప్రస్తావిస్తున్న ఆయన క్షేత్రస్థాయిలో కరెంటు కష్టాలు తీర్చడం లేదు. పర్యవసానంగా ఎడాపెడా విద్యుత్ కోతలతో భూక్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి. నక్కపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం లోపే నాలుగైదు సార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ఇక్కడ పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది. ఆ సమయంలో గడువులోగా రిజిస్ట్రేషన్ జరగపోతే స్లాట్ రద్దవుతుంది. మళ్లీ బుకింగ్ చేసుకోవడం కక్షిదారులకు ఆర్థిక భారమవుతుంది. దూరాభారం నుంచి వచ్చిన వారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు రోజంతా పడిగాపులు పడాల్సి వస్తుంది. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్. రాయవరం మండలాలకు సంబంధించి నక్కపల్లిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. ఇక్కడ భూముల క్రయ విక్రయాలు, బ్యాంకు రుణాలకు సంబంధించిన మార్ట్గేజ్, తనఖా రిజిస్ట్రేషన్లు, జీపీఏ, వివిధ రకాల ఆస్తులకు సంబంధించిన క్రయవిక్రయాలు, వివాహ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతోంది. నిత్యం ఇక్కడ రిజిస్ట్రార్ కార్యాలయంలో 60 నుంచి 70 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. రోజుకు ప్రభుత్వానికి స్టాంప్డ్యూటీ రూపంలో రూ.2 కోట్లపైనే ఆదాయం లభిస్తుంది. మూడు మండలాలకు చెందిన వారే కాకుండా ఏనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి లావాదేవీలు నిర్వహించుకుంటారు. గ్రామీణ జిల్లాలో ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో నక్కపల్లి ఒకటి. ఇంతటి డిమాండ్ ఉన్న ఈ కార్యాలయంలో ఇటీవల కాలంలో కరెంటు కోతలు కక్షిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సోమవారం ప్రతి అరగంటకొకసారి కరెంటు కోత రోజుకు కోట్ల ఆదాయం లభిస్తున్న కార్యాలయంలో కనీసం ఇన్వర్టర్, యూపీఎస్గాని, జనరేటర్ సదుపాయంగాని లేదు. విద్యుత్ సరఫరా ఉంటేనే లావాదేవీలు జరుగుతాయి. పొరపాటున కరెంటు పోతే అంతే సంగతులు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు నాలుగైదు సార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రతి అరగంటకొకసారి కరెంటు పోయింది. దీంతో కక్షిదారులు ఇబ్బంది పడ్డారు. రిజిస్ట్రేషన్ నిలిచిపోతే వర్గ సమీకరణకు ఆపసోపాలు ఒకొక్కక్క లావాదేవీలకు సంబంధించి చాలా మంది కుటుంబ సభ్యులు, దాయాదులు, వారసులు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇటువంటి ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగే సమయంలో కరెంటు పోతే వారి కష్టాలు వర్ణణాతీతం. అదే రోజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోతే మరుసటి రోజు వీరందరిని సమీకరించడం తలకు మించిన భారంగా మారుతోందని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నక్కపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కేవలం కరెంటు లేకపోవడం వల్లే రిజిస్ట్రేషన్లలో జాప్యం జరుగుతోందని కక్షిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందలాది రిజిస్ట్రేషన్లతో కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చి పెడుతున్న కార్యాలయానికి ఇన్వెర్టర్, జనరేటర్ సదుపాయం లేకపోవడం దారుణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్లాబ్ విధానం కక్షిదారులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సుమారు రెండు నెలల నుంచి నక్కపల్లిలో ఎడాపెడా విద్యుత్ కోతల వల్ల రిజిస్ట్రార్ కార్యాలయంలో లావాదేవీలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ విషయం స్థానిక సిబ్బంది, జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుక్ చేసుకున్న స్లాబ్ గడువులో రిజిస్ట్రేషన్ పూర్తికాకపోతే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా తీవ్ర ఇబ్బందులతోపాటు ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్క నక్కపల్లిలోనే కాదు, జిల్లాలో పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఇదే సమస్య ఉన్నట్లు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కక్షిదారులు చెబుతుండటం గమనార్హం. కరెంటు పోతే మళ్లీ స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సిందే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ లావాదేవీల కోసం స్లాట్ బుకింగ్ను ప్రవేశ పెట్టింది. ఆన్లైన్లో రూ.200 చెల్లించి స్లాట్బుక్ చేసుకుంటే కక్షిదారులకు 20 నిమిషాలు సమయం కేటాయిస్తారు. రోజు మొత్తంలో 39 స్లాట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. స్లాట్ గడువులోగానే తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఈ స్లాట్కు కేటాయించిన సమయంలో కరెంటు పోయినా ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినా అంతే సంగతులు. మరో 20 నిమిషాలు అవకాశం ఇస్తారు. ఈ మొత్తం 40 నిమిషాల్లోగా మొదటి స్లాట్ బుక్ చేసుకున్న వారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాకపోతే ఆరోజు వారి లావాదేవీలు నిలిచిపోయినట్లే. తర్వాత స్లాట్ బుక్ చేసుకున్నవారికి అవకాశం ఇస్తారు. మొదటి స్లాట్వారు రోజంతా రిజిస్టార్ కార్యాలయం వద్ద పడిగాపులు పడాలి. లేదా మరుసటి రోజుకు మరో రూ.200 చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు దూర ప్రాంతాల నుంచి లావాదేవీల కోసం వచ్చిన కక్షిదారులకు తమ ప్రాంతాలకు వెళ్లలేక ఇక్కడ ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు. -
యోగాంధ్రకు సర్వం సన్నద్ధం
విశాఖ సిటీ: యోగాంధ్రకు నగరం ముస్తాబవుతోంది. ఐదు లక్షల మంది యోగాసనాలకు విశాఖ వేదిక అవుతోంది. గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కేందుకు సమాయత్తమవుతోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఈ నెల 21వ తేదీన విశాఖ అతిథ్యమిస్తోంది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, అనేక మంది ప్రముఖులు ఈ వేడుకకు తరలిరానున్నారు. కాళీమాత ఆలయం నుంచి పార్కు హోటల్ వరకు ప్రధాన వేదిక కానుంది. ఇక్కడే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు, నేవీ అధికారులు, అధికారులు యోగాసనాలు చేయనున్నారు. ఈ రెండు కిలోమీటర్లు మేర ప్రధాన వేదికలో 12 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కంపార్ట్మెంట్లో వెయ్యి మంది ఉంటారు. ప్రధాన వేదిక తర్వాత సీ1 కంపార్ట్మెంట్ ఉంటుంది. పార్కు హోటల్ వరకు మొత్తం 12 కంపార్ట్మెంట్లు ఉంటాయి. సీ6 వరకు 9 వేల మంది ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డు సిబ్బందితో పాటు, ఇంటర్నేషనల్ యోగా స్టూడెంట్స్, యోగా అసోసియేషన్ సభ్యులు, వివిధ స్థాయిల్లో యోగా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు పాల్గొంటారు. అలాగే సీ7 నుంచి సీ12 వరకు గల కంపార్ట్మెంట్లలో సమీపంలోని నివాసితులు భాగస్వామ్యమవుతారు. ఈ ప్రధాన వేదిక వద్ద పాల్గొనే వారి అవసరాలకు అనుగుణంగా 1400 టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రధాన వేదిక ప్రాంతంలో అదనపు కంపార్ట్మెంట్లతో కలిపి మొత్తం 15 వేల మంది పాల్గొననున్నారు. ఒక వేళ వర్షం పడితే ఈ ప్రధాన వేదికను ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలోకి మార్చనున్నారు. ● ఆర్కే బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకు ఏకకాలంలో 5 లక్షల మంది యోగాసనాలు చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ● మొత్తంగా 326 కంపార్టుమెంట్లు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదిక మినహా మిగిలిన కాంపార్ట్మెంట్లలో 3.5 లక్షల మందికి చోటు కల్పిస్తున్నారు. ● ప్రజలు కంపార్ట్మెంట్లలోకి చేరుకున్న తర్వాత టీషర్టు, క్యూఆర్ కోడ్ అందజేస్తారు. ● తాగునీరు, పారిశుధ్యం, ఆహారం, వైద్య సిబ్బందితో పాటు పోలీసులతో పాటు 10 మంది వలంటీర్లు ఒక్కో కంపార్ట్మెంట్లో అందుబాటులో ఉంటారు. ● ప్రతి రెండు లేదా మూడు కంపార్ట్మెంట్లకు అనుబంధంగా 20 బెడ్లతో కూడిన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ● విశాఖ నుంచే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనసమీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. ● ప్రజలను తరలించేందుకు మొత్తంగా 10,235 ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలను వినియోగించనున్నారు. ● అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కేందుకు యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏకంగా 22 రికార్డులు దక్కించుకునేందుకు కసరత్తు చేస్తోంది. విశాఖ సముద్ర తీరంలో 11 నావికాదళ నౌకలపై నేవీ అధికారులు, సిబ్బంది యోగాసనాలు వేయనున్నారు. ఇది కూడా రికార్డు క్రియేట్ చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అల్లూరి జిల్లాకు చెందిన 25 వేల మంది గిరిజన విద్యార్థులు ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో యోగా చేయనున్నారు. ఇది కూడా రికార్డు నెలకొల్పే అవకాశముంది. 21న విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పాల్గొననున్న ప్రధాని మోదీ 5 లక్షల మందితో యోగాసనాలు గిన్నిస్ రికార్డు కోసం ప్రణాళికలు మెగా ఈవెంట్కు సిద్ధమవుతున్న విశాఖ సాగర తీరం -
వివాదాస్పదమైన 334 ఎకరాల రిజిస్ట్రీ రద్దు చేయాలని ఫిర్యాదు
తుమ్మపాల: నక్కపల్లి మండలం పెద్దదొడ్డిగుళ్లలో రైతులకు చెందిన 334 ఎకరాల వివాదాస్పద భూమిని రాజకీయ నాయకుడు సుబ్బరాజు తప్పుడు మార్గంలో చేయించుకున్న (ఇర్రివోకబుల్) జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ దస్తావేజును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్ బొర్ల విజయలక్ష్మితో కలిసి గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు సీరం నర్సింమూర్తి ఆధ్వర్యంలో కలెక్టర్ విజయ కృష్ణన్కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో సర్వే నంబరు1లో రైతులు సాగు చేసుకుంటున్న 334 ఎకరాలను 2019 నుంచి వివాదంలో ఉందని స్థానిక రెవెన్యూ అధికారులు ధ్రువీకరించినప్పటికీ సుబ్బరాజు లాంటి నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సదరు వ్యక్తి విజయవాడలో తప్పుడు జీపీఏలు రిజిస్ట్రీ చేసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. సదరు భూమికి సమీపంలో ఫారెస్టు అధికారుల లేఖలపైనా సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. రైతుల హక్కులకు ఎటువంటి ఆటంకం కలగకుండా న్యాయం చేయాలని కోరారు. -
హైస్కూల్ చెంతనే మద్యం షాపు
● విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన ● వేరే చోటకు మార్చాలని చౌడువాడ గ్రామస్తుల డిమాండ్ కె.కోటపాడు: పాఠశాలకు ఫర్లాంగు దూరంలోనే మద్యం షాపు ఉండటం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని మరో చోటకు తరలించాలని పలుమార్లు ఎకై ్సజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మండలంలోని చౌడువాడలో జెడ్పీ హైస్కూల్ పశ్చిమ వైపున 40 మీటర్లు దూరంలోనే మద్యం షాపు ఉంది. ఇక్కడ మద్యం కొనుగోలుదారులుతో ఉదయం, మధ్యాహ్నం తీవ్ర రద్దీగా ఉంటోంది. మద్యం షాపు ఉన్న మార్గంలోనే చౌడువాడ, బంటువారి కళ్లాలు, పాచిలవానిపాలెం, పైడంపేట గ్రామాల నుంచి రోజూ విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ఆ సమయంలో మందుబాబులు అనుచితంగా ప్రవర్తించడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఈ నెల 11న కె.కోటపాడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ దాడి ఎరుకునాయుడు, వైస్ ఎంపీపీ రొంగలి సూర్యనారాయణ, ఎంపీటీసీ ఏటుకూరి రాజేష్ ఎకై ్సజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మద్యం షాపును మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు. గతంలోనూ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు గళమెత్తారు. వీటితోపాటు పాఠశాల పేరెంట్స్ కమిటీ సమావేశంలోనూ మద్యం షాపు వేరే చోటకు మార్పు చేయాలని అప్పటి హెచ్ఎం అప్పారావు తీర్మానం చేశారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. వాస్తవానికి తూర్పు వైపు హైస్కూల్ గేటును ప్రామాణికంగా తీసుకుని ఎకై ్సజ్ అధికారులు ఇప్పుడు ఉన్న స్థానంలో మద్యం షాపు ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. పాఠశాల పశ్చిమ వైపు తరగతి గదుల్లోనే విద్యార్థులకు బోధిస్తున్నారు. దాంతో విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా మద్యం షాపును వేరే చోటకు మార్పు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. పొలాల్లో మద్యం సీసాలతో ప్రమాదాలు మద్యం షాపు నుంచి పైడంపేట, పాచిలవానిపాలెం వెళ్లే మార్గాల్లో రాత్రిళ్లు యువకులు, ఇతరులు మందు పార్టీలు చేసుకుంటున్నారు. మద్యం సేవించిన తర్వాత ఈ గ్రామాల వైపు వెళ్లే పొలాల్లో ఖాళీ సీసాలను పారేస్తున్నారు. వాటి పెంకులు గుచ్చుకుని రైతులకు గాయాలవుతున్నాయి. దాంతో ఖాళీ సీసాలు, పెంకులు ఏరివేతకు కూలీలకు ఖర్చు పెట్టాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. షాపును వేరే ప్రాంతానికి తరలించాలి రోడ్డుకు సమీపంలో మద్యం షాపు ఉంది. ఈ మార్గంలో పలు గ్రామాల విద్యార్థులు హైస్కూల్కు వెళ్తారు. ఈ మార్గంలో మహిళలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో వారు పడుతున్న ఇబ్బందులపై మండల పరిషత్ సమావేశం దృష్టికి తీసుకెళ్లాను. ఎకై ్సజ్ అధికారులు వేరే ప్రాంతంలో షాపును ఏర్పాటు చేయాలి. –రొంగలి సూర్యనారాయణ, వైస్ ఎంపీపీ, పాచిలవానిపాలెం -
తండ్రి మందలించాడని బాలిక ఆత్మహత్య
అనకాపల్లిటౌన్: తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ బాలిక ఆదివారం ఆత్మహత్య చేస్తుంది. పట్టణ ఎస్ఐ డి.ఈశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో మళ్లవీధికి చెందిన జంప మహిమ చంద్(17) అనే బాలిక ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మూడు సబెక్టులు తప్పంది. అయితే రోజూ ఉదయం లేటుగా నిద్ర నుంచి లేస్తుండడంతో తండ్రి మందలించాడు. దీంతో ఇంటిలో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ప్రేమ్చంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్ఐ ఈశ్వరరావు తెలిపారు. -
తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ క్రీడాకారులకు అభినందనలు
చోడవరం: ఆత్మరక్షణకు ప్రతి ఒక్కరూ తైక్వాండో క్రీడలో ప్రావీణ్యం సంపాదించాలని తైక్వాండో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లం మురళి అన్నారు. ఇటీవల తైక్వాండో క్రీడలో బ్లాక్ బెల్ట్ సాధించిన క్రీడాకారులను చోడవరంలో ఆదివారం ఆయన అభినందించారు. ఇటీవల తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లాక్ బెల్ట్ టెస్టు పరీక్షల్లో చోడవరం పరిసర ప్రాంత క్రీడాకారులు పలువురు ఎంపికయ్యారు. ఈ పరీక్షల్లో సిహెచ్ వెంకటేష్, సంతోషికుమారి, ఎస్.శారద, గండి రిషిత, రాఘవ, డి.జాన్మార్క్ సాగర్, ఎం.హేమశ్రీ, జి.వి.శశివర్థన్ కుమార్, వి.జెస్సిక రోజా, జయంత్లు ఎంపికయ్యారు. వీరిని అసోసియేషన్ తరపున అభినందించారు. కార్యక్రమంలో కోచ్లు గండి శేఖర్బాబు, కె.ప్రదీప్కుమార్ శేఖర్, సింహాచలం పాల్గొన్నారు. -
ఊపిరి
అరుదైన ప్రాణులకుఅంతరించిపోతున్న జాతుల విశేషాలివి.. ఈ జూలో పునరుత్పత్తి అవుతున్న కొన్ని ముఖ్యమైన అంతరించిపోతున్న జాతులు, వాటి ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం.. ● అడవి కుక్కలు(ఆసియాటిక్ వైల్డ్ డాగ్స్): ఇవి వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని షెడ్యూల్–1 కిందకు వస్తాయి. ఇందిరా గాంధీ జూ పార్కులో వీటి పునరుత్పత్తి కేంద్రం ఉంది. వీటి ఎత్తు సుమారు 50 సెం.మీ., శరీరం పొడవు 90 సెం.మీ., తోక పొడవు 40–45 సెం.మీ. ఉంటుంది. ● కృష్ణ జింక(బ్లాక్బక్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా గుర్తింపు పొందిన ఈ జింకలు, తమ మెలితిరిగిన కొమ్ములతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కృష్ణ జింక షెడ్యూల్–1 జాబితాలో ఉంది ● మూషిక జింక(మౌస్ డీర్): షెడ్యూల్–1 జాబితాలోని ఈ జింక శరీరం పొడవు 50–60 సెం.మీ., బరువు 3–4 కిలోలు ఉంటుంది. ప్రపంచంలోని అతి చిన్న జింక జాతులలో ఇది ఒకటి. చూడటానికి చిన్నగా, సున్నితంగా ఉండే ఈ జీవి కూడా షెడ్యూల్–1 జాబితాలో ఉంది. ● కనుజు : ఇది కూడా షెడ్యూల్–1 జాబితాలో ఉంది. మగ కనుజులకు చెట్ల కొమ్మల మాదిరిగా ఉండే కొమ్ములు 3.5 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. ● నీలి ఎద్దు( నీల్గై): ఆసియా జింక జాతులలో అతి పెద్దదైన నీల్గై షెడ్యూల్–2 జాబితాలో ఉంది. దీని గొంతు భాగం తెల్లగా ఉంటుంది. మగ నీల్గైకి 13 సెం.మీ. జుట్టు ఉంటుంది. ఆడవి 200 కిలోలు, మగవి 250 కిలోల వరకు బరువు వరకు పెరుగుతాయి. ● రెడ్–నెక్డ్ వాలబీ: ఈ జాతి జీవుల పునరుత్పత్తి ఎంతో ఆసక్తికరం. రెడ్నెక్డ్ వాలబీ గర్భం దాల్చిన 30 రోజుల్లో పిల్లకు జన్మిస్తుంది. తర్వాత ఆ పిల్ల తల్లి పొట్ట కింద సంచిలో సుమారు 7 నెలల పాటు పెరిగి, తల్లి పాలు తాగుతుంది. 12 నెలల తర్వాత స్వతంత్రంగా జీవించడం మొదలుపెడుతుంది. ఆరిలోవ: వాతావరణ కాలుష్యం, వేటగాళ్ల ఉచ్చులు, క్రూర మృగాల దాడి, మారుతున్న పర్యావరణ పరిస్థితుల కారణంగా ఎన్నో వన్యప్రాణి జాతులు అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి. ఒకప్పుడు సజీవంగా ఉన్న జాతులు నేటి తరానికి టీవీల్లో, పుస్తకాల్లో మాత్రమే కనిపించే పరిస్థితి నెలకొంది. వాటి ఉనికే ప్రశ్నార్థకమవుతున్న ఈ తరుణంలో నగరంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్కు ఒక ఆశాకిరణంగా నిలుస్తోంది. అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణులకు పునరుత్పత్తి కేంద్రంగా మారి, వాటి వంశాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడి సంరక్షకుల కృషితో గత ఎనిమిది నెలల్లోనే 12 అంతరించిపోతున్న జాతులకు చెందిన 46 పిల్లలు జన్మించి.. వన్యప్రాణి సంరక్షణలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయి. 8 నెలలు.. 46 బుల్లి ప్రాణులు గడిచిన ఎనిమిది నెలలకాలంలో ఇందిరా గాంధీ జూ పార్కులో 12 రకాల వన్యప్రాణులకు చెందిన 46 పిల్లలు పుట్టాయి. ఇందులో అడవి కుక్కలు–14, కృష్ణ జింక (రాష్ట్ర జంతువు) –9, చుక్కల జింక–7, కనుజు–5, నీల్ గై–3, బార్కింగ్ డీర్–2, మౌస్ డీర్–1, బెంగాల్ ఫాక్స్–1, ఇండియన్ గ్రే వోల్ఫ్–1, అడవి దున్న (బైసన్)–1, రెడ్–నెక్డ్ వాలబీ–1, రింగ్–టెయిల్డ్ లెమూర్–1 ఉన్నాయి. అరుదైన జీవులకు అభయం విశాఖ జూ పార్కు ఇప్పుడు కేవలం జంతు ప్రదర్శనశాల మాత్రమే కాదు.. అంతరించిపోతున్న జీవజాతులకు ఒక సురక్షితమైన ఆవాసం, పునరుత్పత్తి కేంద్రం. వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం షెడ్యూల్–1 జాబితాలోని అనేక జీవులు ఇక్కడ విజయవంతంగా తమ సంతతిని పెంచుకుంటున్నాయి. జింక పిల్లలు, అడవి దున్నలు, అడవి కుక్కల పిల్లలు, నీల్గై, రెడ్నెక్డ్ వాలబీ, బెంగాల్ ఫాక్స్, ఇండియన్ గ్రే వోల్ఫ్, రింగ్టైల్డ్ లెమూర్స్ వంటి జాతులకు చెందిన చిట్టి ప్రాణులు తమ ఎన్క్లోజర్లలో తల్లుల వెంట ఉత్సాహంగా తిరుగుతూ సందర్శకులను అలరిస్తున్నాయి. ఈ అద్భుతమైన దృశ్యాలు జూకి వచ్చే వారికి కనువిందు చేయడమే కాకుండా, అంతరించిపోతున్న జాతులను పరిరక్షించడం ఎంత అవసరమో తెలియజేస్తున్నాయి. వెటర్నరీ వైద్యులు, యానిమల్ కీపర్ల నిరంతర పర్యవేక్షణలో ఈ అద్భుతం సాధ్యమైంది. వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు జూ పార్కులో వన్య ప్రాణుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. ఇటీవల పునరుత్పత్తి అయిన పలు రకాల జాతుల పిల్లలను ఇక్కడ సంరక్షకులు, జూ వెటర్నరీ వైద్యులు, సిబ్బంది, యానిమల్ కీపర్లు ప్రత్యేక శ్రద్ధతో సంరక్షిస్తున్నారు. జూలో అంతరించిపోతున్న జాతుల సంతతి గణనీయంగా పెరుగుతోంది. ఈ జంతువులన్నీ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం వీటికి ఎలాంటి హాని కలిగించినా చట్టరీత్యా నేరమవుతుంది. – జి.మంగమ్మ, జూ క్యూరేటర్ ● -
ప్రశ్నిస్తేనే అవినీతి తగ్గుముఖం
అనకాపల్లి: బాధ్యత, విషయ పరిజ్ఞానంతో సరైన ప్రశ్నలు సంధిస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, అధికార దుర్వినియోగం తగ్గుతుందని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి రాష్ట్ర సలహా కమిటీ సభ్యుడు, ఆర్టీఐ జిల్లా కమిటీ సభ్యుడు కాండ్రేగుల వెంకటరమణ తెలిపారు. గ్రీన్ క్లబ్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక గవరపాలెం గౌరీ గ్రంథాలయంలో ‘సామాజిక సమస్యలు – పరిష్కార మార్గాలు – ఆన్లైన్ వేదికలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సేవల్లో తీవ్ర జాప్యం, అవినీతి, అధికార దుర్వినియోగం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని వాపోయారు. ప్రభుత్వ శాఖల సేవలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉండాలని కోరారు. పౌరుల హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వ సిటిజన్ చార్టర్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రతి శాఖ నిర్దేశిత గడువులో సమస్యలను పరిష్కరించాలన్నారు. అధికార దుర్వినియోగం సామాజిక న్యాయానికి అడ్డుగోడగా నిలుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రజలు డిజిటల్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. న్యాయపరమైన చర్యలు కంటే ముందు సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల కోసం సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవాలన్నారు. గ్రీన్ క్లబ్ వ్యవస్థాపకుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొగ్రాం కో–ఆర్డినేటర్ కాండ్రేగుల సత్యనారాయణ, క్లబ్ ప్రతినిధులు పెంటకోట ఉమా మహేశ్వరరావు, బీరా వినోద్కుమార్, రావూరి అనిత, నైశెట్టి సత్తిబాబు, యల్లపు సూరిఅప్పారావు, మాణిక్యం ఆనంద్, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి రాష్ట్ర సలహా కమిటీ సభ్యుడు వెంకటరమణ -
బుచ్చెయ్యపేట ఎంపీడీవో ఆరోగ్యం విషమం
బుచ్చెయ్యపేట: ఎంపీడీవో వి. విజయలక్ష్మి ఆరోగ్యం విషమంగానే ఉంది. శనివారం ఆమె బుచ్చెయ్యపేటలో విధులకు హాజరై సాయంత్రం ఇంటికెళ్లారు. రాత్రి తన ఇంట్లో బాత్రూమ్లో కాలు జారి కింద పడిపోయారు. తలకు గాయమవడంతో కోమాలోకి వెళ్లిపోయారు. విశాఖలో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఇంకా ఆమె కోమాలో నుంచి బయట పడలేదు. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. మరో ఆరు నెలల్లో పదవీ విరమణ చేయనున్న ఆమె అకస్మాత్తుగా ఆస్పత్రి పాలవడంతో పంచాయతీ సెక్రటరీలు, మండల పరిషత్ సిబ్బంది విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఎంపీడీవో కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విజయలక్ష్మి భర్త మల్లికార్జునరావు పార్వతీపురం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నారు. -
ఏడాదిలోనే రూ.1.5 లక్షల కోట్ల అప్పు
● సూపర్ సిక్స్ అమలులో కూటమి ప్రభుత్వం విఫలం ● అక్రమ కేసులతో అరాచకం ● మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పాలనలో రూ.1.5లక్షల కోట్లు అప్పు చేసిందని, సూపర్ సిక్స్ పథకాలు అమలుచేయడంలో, పాలనలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి , వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.కూటమి ఏడాదిపాలనలో రాష్ట్రంలో చేసిన అరాచకాలపై ముద్రించిన జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని స్థానిక రింగ్రోడ్డు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏడాది పాలనలో 766 మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేశారని, వీరిలో 390 మంది హత్యకు గురయ్యారని చెప్పారు. 203 మంది మహిళలు, చిన్నారులు దాడులు, హత్యాచారాలకు గురయ్యారని, 2,466 మందిపై అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. 729 మంది సోషల్ మీడియో యాక్టివిస్టులపై, 63 మంది పాత్రికేయులపై, 73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. 11 మంది పాత్రికేయులపై దాడులు చేశారని చెప్పారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని ప్రజలు పక్షాన వైఎస్సార్సీపీ పోరాటాలు చేస్తుందని ఆయన తెలిపారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మన రాష్ట్రంలో అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చిన ప్రతి వ్యక్తిపై కూటమి నాయకులు కక్షసాధింపు చర్యలకు పాల్పడం అన్యాయమని, ప్రజలు త్వరలో వారికి బుద్ధి చెబుతారన్నారు. వైఎస్సార్సీపీ నాయకుడు పల్నాడు జిల్లాలో పార్టీకి సేవ చేసినందుకు టీడీపీ నాయకులు ఆ వ్యక్తిని నడిరోడ్డుపై హత్యచేసినప్పటికీ అక్కడ పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు. హత్యకు గురైన వ్యక్తి కుటుంబాన్ని మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పరామర్శించి, అండగానిలబడినట్టు చెప్పారు. రాష్ట్రంలో పూర్తిగా శాంతిభద్రతలు గాడి తప్పాయన్నారు. 40 శాతం మందికే తల్లికి వందనం వైఎస్సార్సీపీ హయాంలో ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకానికి తల్లికి వందనంగా పేరు మార్పు చేసి, రూ.13వేలు ఇచ్చి మిగిలిన రూ.2వేలు టీడీపీ నాయకులు దోచుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో 82లక్షల మంది విద్యార్థులుండగా, 62 లక్షల మంది మాత్రమే ఉన్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారని, వారిలో కూడా 40శాతం మందికి మాత్రమే పథకం వర్తింపజేయడం అన్యాయమన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ నిధులను సీఎం చంద్రబాబు మళ్లించారని చెప్పారు. నిరుద్యోగ భృతి, ప్రతి మహిళలకు నెలకు రూ.1500, మహిళలకు ఉచిత ప్రయాణం పథకాలు ఎప్పడు అమలు చేస్తారో దేవుడికే తెలియాలన్నారు. జిల్లాలో కొండలను పిండి చేస్తూ ఓ ఎంపీ దోచుకుంటున్నారని ఆరోపించారు. లారీలు అధిక లోడుతో ప్రయాణించడం వల్ల జిల్లాలో ప్రమాదాలు జరిగి, ప్రజలు మరణిస్తున్నారని చెప్పారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలని ఆయన కోరారు. 2019–2020 ఏడాది వైఎస్సార్సీపీ పాలనలో 89శాతం బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసినట్టు చెప్పారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలపై వైఎస్సార్సీపీ పోరాటాలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికై నా కక్షపూరిత రాజకీయలు మానుకుని సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యలమంచిలి, నర్సీపట్నం, పాయకరావుపేట, పెందుర్తి నియోజకవర్గాల సమన్వయకర్తలు ఉప్పలపాటి రమణమూర్తిరాజు (కన్నబాబు), పెట్ల ఉమాశంకర్ గణేష్, కంబాల జోగులు, అన్నంరెడ్డి అదీప్రాజు, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి విశాఖ జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఈర్లె అనురాధ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్, జెడ్పీ వైస్చైర్మన్ బి.వి.సత్యవతి, జెడ్పీ కోఆప్షన్సభ్యుడు పెతకంశెట్టి జోసెఫ్, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలిశెట్టి సురేష్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మలసాల కుమార్ రాజా, ఎంపీపీ గొర్లి సూరిబా బు, ఇన్ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ రాష్ట్ర మాజీ చైర్మన్ దంతులూరి దిలీప్కుమార్, పార్టీ జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షుడు పల్లెల సాయికిరణ్, నియోజకవర్గ యువజ విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, 80,84 వార్డుల ఇన్చార్జ్లు కె.ఎం.నాయుడు, కోరుకొండ రాఘవ, అనకాపల్లి, కశింకోట మండలాల అధ్యక్షులు పెదిశెట్టి గోవింద్, మలసాల కిషోర్, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కె.పద్మకుమారి, జిల్లా ఎస్సీ ఎస్టీసెల్ అధ్యక్షుడు సోలం రమేష్, కశింకోట జెడ్పీటీసీ దంతులూరి శ్రీధర్రాజు, కశింకోట ఎంపీపీ కలగగున్నయ్య నాయుడు, పార్టీ నాయకులు పి.డి.గాంధీ, ఉగ్గిన అప్పారావు, కొణతాల మురళీకృష్ణ, దాడి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారుల ఆశలు.. అడియాసలు
అర్ధంతరంగా ఆగిపోయిన జెట్టీ నిర్మాణ పనులు నిత్యం గండాలు.. మత్స్యకారులు నడి సముద్రంలోకి వెళ్లాక ఎప్పుడైనా ప్రమాదవశాత్తూ తుపానులో చిక్కుకుంటే పడవలో ఎవరైనా సాంకేతికత పరంగా అవగాహన ఉన్న వారు ఉంటే ఒకింత ఫరవాలేదు. కానీ, సాంకేతికతపై అవగాహన లేని వారు వేటకు వెళ్లినట్టయితే తీరం వైపు కాకుండా పొరపాటున తీరానికి వ్యతిరేక దిశగా వెళ్తే వారు ఇక సముద్రంలో గల్లంతైనట్టే. దూరం వెళ్లే కొద్దీ బోట్లలో ఆయిల్ అయిపోతుంది, వారు తినడానికి తీసుకువెళ్లిన ఆహారం నిండుకుంటుంది. అదృష్టవశాత్తూ ఏదైనా పెద్ద బోట్లు తారసిల్లితే తప్ప వారు బతికి బయటపడే అవకాశం చాలా తక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో మత్స్యకారులు తమ ప్రాణాలు పణంగా పెట్టి వేట కొనసాగిస్తుంటారు. జెట్టీ నిర్మాణ పనులు పూర్తవుతాయి.. తమ జీవితాలు బాగుపడతాయి అనుకున్న పూడిమడక మత్స్యకారుల ఆశలు అడియా సలయ్యాయి. కూటమి ప్రభుత్వం రావ డంతో జెట్టీ నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. మొదలు పెట్టిన ఒకటిన్నర సంవత్సరంలో పూర్తి కావాల్సిన జెట్టీ నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వ రావడంతో నిలిచి పోయాయి. మత్స్యకారులు ఆర్థ్ధికంగా ఎదగా లనే సదుద్దేశంతో మాజీ సీఎం వై.ఎస్.జగన్ మోహన్రెడ్డి 2023లో పూడిమడకలో జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, పనులు చేప ట్టారు. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో మొదలుపెట్టిన జెట్టీ నిర్మాణ పనులు ఏడాది పాటు చురుగ్గా సాగి ప్రభుత్వం మారగానే నిలిచిపోయాయి. దీంతో మత్స్యకారుల ఆశలపై నీళ్లు జల్లినట్టయింది. అచ్యుతాపురం రూరల్: అనకాపల్లి జిల్లాలో పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎస్.రాయవరం మండలాల్లో సుమారు 50 నుంచి 60 వేల మత్స్యకార కుటుంబాలు కేవలం మత్స్య సంపదపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. తీర ప్రాంతాలైన తిక్కవానిపాలెం, ముత్యాలమ్మపాలెం, వాడచీపురుపల్లి, తంతడి, పూడిమడక, లోవపాలెం, వెంకయ్యపాలెం, రాంబిల్లి, వాడ నర్సాపురం, కొత్తపట్నం, బంగారమ్మపాలెం, రేవుపోలవరం, రాజయ్యపేట, తీనార్లు, దొండాక, బోగుపాడు వంటి మరెన్నో మత్స్యకార గ్రామాల ప్రజలు మత్స్య సంపదపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరంతా పూడిమడక కేంద్రంగా జెట్టీ ఏర్పడుతుంది.. ఇకనైనా తమ జీవితాలు బాగుపడతాయనుకున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు తిరిగి ఇంటికి చేరుకునే వరకూ సముద్రంతో యుద్ధం చేస్తూనే ఉంటారు. రోజుల తరబడి సముద్రంపైనే ఉంటూ క్షణం ఒక గండంగా ఆటుపోట్ల మధ్య తీవ్ర క్లిష్ట పరిస్థితిలో వేట సాగిస్తారు. జెట్టీ ఉన్నట్టయితే పెద్ద బోట్ల సాయంతో నెలల తరబడి సముద్రంలో వేట సాగించి, తీరంలో సులభంగా నిలకడ చేసుకునేందుకు వీలు కుదురుతుంది. తద్వారా అధికంగా చేపలవేట జరపడానికి అనుకూలంగా ఉంటుందన్న మత్స్య కారులు ఆశలు కూటమి ప్రభుత్వంలో అడియాసలయ్యాయి. ఆర్థ్ధికంగా స్థిరపడే అవకాశాలు కోల్పోవడం మత్స్యకారులను మానసికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఆర్థికాభివృద్ధికి దోహదం జెట్టీ నిర్మాణం జరిగితే మత్స్యకారులు ఆర్థికంగా స్థిరపడతారు. మత్స్య సరఫరా కూడా పెరుగుతుంది. దానికి అనుబంధంగా ఐస్ ఫ్యాక్టరీలు, థర్మాకోల్ బాక్స్ పరిశ్రమలు ఇలా పలు రకాల కుటీర పరిశ్రమలు ఎన్నో స్థాపితమవుతాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కేవలం పూడిమడక గ్రామమే కాకుండా చుట్టు పక్కల ఎన్నో గ్రామాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు వంటివి ఏర్పాటవుతాయి. వాణిజ్య సముదాయాలు మెరుగుపడతాయి. పూర్తిగా మత్స్యకారుల జీవన విధానం మారుతుంది. ఈ నేపథ్యంలో నిలిపివేసిన జెట్టీ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు.అర్ధంతరంగా ఆగిపోయిన జెట్టీ నిర్మాణ పనులు పైప్లైన్ల కారణంగా క్షీణిస్తున్న మత్స్య సంపద మరోవైపు ఉపాధి అవకాశాలు శూన్యం ఆర్థికాభివృద్ధికి నోచుకోని జిల్లా మత్స్యకారులు పైప్లైన్ల కారణంగా మత్స్య సంపదకు విఘాతం బ్రాండిక్స్, ఏపీఐఐసీ పైప్లైన్ వేయడంతో సము ద్ర తీరం నుంచి కిలోమీటర్ల మేర జలాలు వ్యర్ధ రసాయనాల కారణంగా కలుషితమైపోవడంతో మత్స్య సంపద తగ్గిపో తోంది. మత్స్యకారులు వందల మైళ్ల దూరం వేటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లి వేట సాగించవలసి వస్తుంది.మత్స్యకారులకు ప్రభుత్వాలు రాయితీలు కల్పించడమే కాకుండా జెట్టీ నిర్మిస్తే కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. –చోడిపల్లి అప్పారావు, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడుజెట్టీ నిర్మిస్తే మా బతుకుల్లో వెలుగు గత 6 నెలలుగా సబ్సిడీ డీజిల్ ఆయిల్ బంక్ మూత పడడంతో మత్స్యకారులకు బోట్లలో ఉపయోగించే డీజిల్ ఆయిల్పై కూడా అధిక భారం పడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మారినప్పటి నుంచి జెట్టీ నిర్మాణ పనులు చేపట్టలేదు. దెబ్బ మీద దెబ్బ పడతుండడంతో ఆర్థికంగా ఎదగలేని పరిస్థితి పూడిమడక మత్స్యకారుల్లో నెలకొంది. జెట్టీ నిర్మాణం పూర్తి అయితే పూడిమడకలో వ్యాపారాలు పెరిగి గ్రామస్తులందరూ ఆర్థ్ధికంగా స్థిరపడే అవకాశం ఉండేది. ఇప్పటికై నా అధికారులు, నాయకులు స్పందించి మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడేందుకు జెట్టీ నిర్మాణ పనులు చేపట్టాలని కోరుకుంటున్నాను. –ఉమ్మిడి అప్పారావు, పూడిమడక మత్స్యకార నాయకుడు -
యోగాంధ్రలో అందరూ భాగస్వాములు కావాలి
తుమ్మపాల: రోజూ యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చని జిల్లా సమాచార పౌర సంబంధాలశాఖ అధికారి ఎస్.వి.రమణ అన్నారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సెలబ్రిటీ యోగా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా గురువు మంగయ్య, యోగా శిక్షకులు జ్యోతి, లక్ష్మి అందరితో యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా డీఐపీఆర్వో రమణ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈకార్యక్రమంలో ఏషియన్ బ్రాంజ్ మెడలిస్ట్ బాక్సర్ కుసుమ, సహాయ సమాచార ఇంజినీర్ బాలాజీ, జూనియర్ సహాయకులు పి.డి.ఎస్.ఎన్. మూర్తిపాల్గొన్నారు. -
కలుషిత ఆహారం తిని భక్తులకు తీవ్ర అస్వస్థత
● పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలింపు ● ఆరోగ్యం మెరుగుపడటంతో డిశ్చార్జ్ పాడేరు : కలుషిత ఆహారం తిన్న 14 మంది భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం అల్లూరి జిల్లా పాడేరు ఘాట్లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నాతవరం ప్రాంతానికి చెందిన 20 మంది భక్తులు ఆదివారం పాడేరు ఘాట్లోని మోదకొండమ్మ అమ్మవారి పాదాలను దర్శించుకునేందుకు వచ్చారు. ఇంటివద్ద తయారుచేసి తీసుకువచ్చిన పులిహోర తినడంతో 14 మంది అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్న వారిని హుటాహుటిన స్థానిక సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. వెంటనే వారికి వైద్యసేవలు కల్పించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో 14 మందిని డిశ్చార్జ్ చేసినట్టు డీఎంహెచ్వో డాక్టర్ జమాల్బాషా తెలిపారు. -
నీట్లో మామిడిపల్లి విద్యార్థి ప్రతిభ
దేవరాపల్లి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్లో మండలంలో మామిడిపల్లి గ్రామానికి చెందిన పోతల భానుచందు ప్రతిభ చూపాడు. శనివారం విడుదలైన ఫలితాల్లో 528 మార్కులు సాధించి, 25,241 ర్యాంక్ పొందాడు. తల్లిదండ్రులు ఈశ్వరావు, చెల్లయ్యమ్మ వ్యవసాయ కూలి పనులు చేస్తూ కుమారుడుతో పాటు కుమారైను చదివిస్తున్నారు. భానుచందు ఇంటర్లో 980 మార్కులు సాధించాడు. ఈ సందర్భంగా భానుచందు మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా బాగా చదివి మంచి వైద్యుడుగా పేరు సంపాదించుకుంటానని తెలిపారు. -
యోగా దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
● భారీగా జనం తరలింపునకు చర్యలు ● ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లోనే బీచ్రోడ్డుకు రావాలి ● విశాఖ కలెక్టర్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట(విశాఖ): బీచ్రోడ్డులో ఈ నెల 21న జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సూచించారు. బీచ్రోడ్డులో యోగా దినోత్సవం ఏర్పాట్లపై నగర ప్రజాప్రతినిధులతో ఆదివారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ వివరాలు వెల్లడించారు. ప్రజలు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేసిన బస్సులు, ఆటోలు, టాటా మ్యాజిక్ వంటి వాహనాల్లో మాత్రమే ప్రయాణించి బీచ్రోడ్డులోని తమకు కేటాయించిన ప్రాంతానికి చేరుకోవాలని, ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ప్రజల తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన, గుర్తించిన ప్రాంతాలకు ప్రజలను సకాలంలో తరలించడం ముఖ్యమని కలెక్టర్ తెలిపారు. ఆయా నియోజకవర్గాల నుంచి ఉదయాన్నే బస్సులు బయలుదేరేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ప్రతి వార్డు సచివాలయానికి కేటాయించిన ప్రాంతం గురించి ఇప్పటికే సమాచారం అందించామని, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుని ప్రజలు తెల్లవారుజామున ఆ ప్రాంతానికి చేరుకునేలా చూడాలని కోరారు. బస్సులకు వార్డు సచివాలయం కార్యదర్శులను ఇన్చార్జిలుగా నియమిస్తున్నామని, పికప్, డ్రాపింగ్ పాయింట్ల వివరాలతో కూడిన బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 2,185 బస్సులు సిద్ధం ప్రజలను తరలించేందుకు జిల్లాలో మొత్తం 2,185 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇందులో 1,300 ఆర్టీసీ బస్సులు (పట్టణ ప్రాంతాలకు 800, గ్రామీణ ప్రాంతాలకు 500), 885 ప్రైవేట్ బస్సులు ఉంటాయని తెలిపారు. వీటికి అదనంగా ఆటోలు, టాటా ఏస్, మ్యాజిక్ వంటి వాహనాల్లో కూడా తరలింపు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ బస్సులన్నీ జూన్ 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకే ఆయా నియోజకవర్గాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉచితంగా టీ షర్ట్లు, మ్యాట్లు, స్నాక్స్ యోగా కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ ఉచితంగా టీ షర్ట్లు, మ్యాట్లు అందజేస్తామని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరిగి వెళ్లేటప్పుడు అందరికీ స్నాక్స్ ప్యాకెట్లు అందిస్తామన్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే వారికి ఆయా జిల్లాల యంత్రాంగం అల్పా హారం అందించే ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. పార్కింగ్ కేటాయింపులు విశాలాక్షినగర్ వరకు ఉన్న బీచ్రోడ్డును నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు కేటాయించారు. పెందుర్తి, అనకాపల్లి ప్రాంతాల వారికి లా కాలేజ్ రోడ్డు, విజయనగరం జిల్లా వారికి మధురవాడ ఐటీ సెజ్ ప్రాంతం, శ్రీకాకుళం వారికి తిమ్మాపురం నుంచి భీమిలి వరకు మార్కింగ్ చేశారు. ఒక్కో కంపార్ట్మెంట్లో 600 మంది పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రధాని ఈ నెల 21న ఉదయం 6.30 గంటలకే బీచ్రోడ్డులోని వేదిక వద్దకు చేరుకుని కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముందురోజు నగరానికి చేరుకుంటారని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పి.విష్ణుకుమార్ రాజు, పి.గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, మేయర్ పీలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలకు 32 మంది
తుమ్మపాల: యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి 32 మంది సభ్యుల బృందం హాజరు కానున్నట్టు జిల్లా క్రీడల శాఖ అధికారి ఎల్.వెంకటరమణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఈ నెల 16 నుంచి జూనియర్స్, యంగ్, సీనియర్స్ విభాగాల్లో సోలో యోగా, గ్రూప్ యోగా, చిత్ర లేఖనం, పాటలు, పోస్టర్ డిజైన్, వ్యాసరచన తదితర పోటీలు జరుగుతాయని చెప్పారు. జిల్లా నుంచి ఐదుగురు బాలురు, 23 మంది మహిళలు, నలుగురు అఫీషియల్ సభ్యులు హాజరవుతున్నట్టు తెలిపారు. వీరు మంచి ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. పోటీల్లో గెలుపొందిన వారు ఈ నెల 20న విశాఖపట్నంలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుందన్నారు. -
టీఎంసీకి ఐసీఐసీఐ రూ.550 కోట్లు విరాళం
ఈ భారీ క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి ఐసీఐసీఐ బ్యాంక్ భారీ విరాళాన్ని టాటా మెమోరియల్ సెంటర్(టీఎంసీ)కు ప్రకటించింది. బ్యాంకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) నిధులు రూ.550 కోట్లతో ఈ అడ్వాన్స్డ్ క్యాన్సర్ కేర్ని నిర్మిస్తోంది. దేశంలో క్యాన్సర్ కేర్కు సంబంధించి విశాఖ, నవీ ముంబై, న్యూ చండీగఢ్లో కొత్తగా మూడు టీఎంసీ కేంద్రాల ఏర్పాటుకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.1,800 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో రూ.550 కోట్లతో విశాఖలో శిశు, రక్త క్యాన్సర్ చికిత్సకు తూర్పు దేశంలోనే అతిపెద్ద అత్యుత్తమ మెడికల్ టెక్నాలజీతో అధునాతన ఆస్పత్రి నిర్మాణానికి పూనుకున్నారు. -
పద్మశాలీ గ్లోబల్ మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్ నేడు
అచ్యుతాపురం రూరల్ : విశాఖ సిటీలోని శంకరమఠం ఎదురుగా పద్మ శాలీ భవనంలో పద్మ శాలీ గ్లోబల్ ట్రస్ట్ మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి పద్మశాలీలు హాజరు కావాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పప్పు రాజారావు పిలుపునిచ్చారు. శనివారం అచ్యు తాపురం చేనేత కార్యాలయం వద్ద జిల్లా పద్మశాలీ సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లా డుతూ విశాఖలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి జరగబోయే కుల, జనగణన కార్యక్రమంలో హాజరై ప్రభుత్వానికి పద్మశాలీల సంఖ్యా బలం తెలియజేయాలన్నారు. దుప్పితూరు భద్రావతీ చేనేత సహకార సంఘం అనకాపల్లి జిల్లా చేనేత అధ్యక్షుడు మాడెం సూరి అప్పారావు, మేనేజర్ మాడెం అప్పారావు, ఉమ్మడి విశాఖ జిల్లా చేనేత నాయకులు ఋషిబాబు, జగ్గారావు, రమణమ్మ, రాజు, అప్పలరాజు, ఈశ్వర్రావు, గుద్దటి రాజు, నానాజీ, పప్పు సరోజని పాల్గొన్నారు. -
25న ఏపీ ప్రజా నాట్యమండలి ప్రథమ మహాసభ
కె.కోటపాడు : ఈ నెల 25న అనకాపల్లిలో ఏపీ ప్రజా నాట్యమండలి ప్రథమ మహాసభను నిర్వహిస్తున్నట్లు సీపీఐ మండల కార్యదర్శి గొర్లె దేముడుబాబు, పొంతపల్లి రామారావు తెలిపారు. కె.కోటపాడులో శనివారం మహాసభకు సంబంధించిన కరపత్రాలను వీరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేముడుబాబు, రామారావు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్కృతికి ప్రత్యామ్నాయంగా ప్రజా కళలను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని వీరు తెలిపారు. కళాకారులు పెద్ద సంఖ్యలో అనకాపల్లిలో కాపుగంటి గోవిందరావు భవన్లో నిర్వహించే మహసభలలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకుడు రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు. -
క్యాన్సర్కు కళ్లెం
విశాఖలో అడ్వాన్స్డ్ క్యాన్సర్ కేర్ యూనిట్ విశాఖ సిటీ: క్యాన్సర్ కర్కశమైనది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ కబళిస్తోంది. అటువంటి మహమ్మారి పీచమనచడానికి విశాఖ లో అడ్వాన్స్డ్ క్యాన్సర్ కేర్ బ్లాక్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల క్యాన్సర్ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న అగనంపూడి ప్రాంతంలో ఉన్న హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్(హెచ్బీసీహెచ్ఆర్సీ)లో నూతన భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తూర్పు భారత దేశంలోనే అత్యుత్తమ స్పెషలైజ్డ్ క్యాన్సర్ చికిత్సా కేంద్రాల్లో ఒకటిగా నిలిచేలా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రధానంగా పీడియాట్రిక్, హెమటోలింఫాయిడ్(శిశు, రక్త) క్యాన్సర్ల చికిత్స, పరిశోధనలకు సంబంధించి అతి పెద్ద కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. క్యాన్సర్ రోగులకు అనేక సేవలు ఈ కొత్త బ్లాక్ ద్వారా క్యాన్సర్ రోగులకు అనేక వైద్య సేవలు అందనున్నాయి. ఇందులో ఇంటెన్సివ్ కీమోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, అధునాతన రేడియేషన్ థెరపీ, కార్ టీ–సెల్ థెరపీ లాంటి అధునాతన ఇమ్యునోథెరపీలు, మూడు లీనియర్ యాక్సిలరేటర్లు, ఎంఆర్ఐ, సీవీటీ అండ్ పెట్ స్కాన్లతో పాటు అత్యంత ఆధునిక మెడికల్ ఇమేజింగ్, డయాగ్నోస్టిక్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఇందులో 14 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ గదులు, 14 ఐసీయూలు, 5 ఆపరేటింగ్ థియేటర్లు, పరిశోధనల కోసం ప్రయోగశాలలు, చికిత్స ప్లానింగ్, శిక్షణ కోసం జాయింట్ డిస్కషన్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. పీడియాట్రిక్, హెమటోలింఫాయిడ్ క్యాన్సర్లకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స, బ్లడ్ సెంటర్, పౌష్టికాహారం, పునరావాసం లాంటి సేవలు అందనున్నాయి. -
‘మాన్యువల్ కౌన్సెలింగ్తో ఎస్జీటీలకు అన్యాయం’
నాతవరం : ప్రభుత్వం మాన్యువల్ పద్ధతిలో ఎస్జీటీ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ చేయడం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందని విశ్రాంత ఎంఈవో తాడి అమృత్కుమార్ అన్నారు. ఆయన శనివారం నాతవరంలో విలేకరులతో మాట్లాడారు. హెచ్ఎంలు, ఎస్ఏ ఉపాధ్యాయులకు వెబ్ కౌన్సెలింగ్ చేయడం ద్వారా సమాన న్యాయం జరిగిందన్నారు. యూనియన్ నాయకులు కూటమి నాయకులు నుంచి ఎలాంటి ప్రలోభాలు లేకుండా సక్రమంగా చేసారన్నారు. వెబ్ కౌన్సెలింగ్ వల్ల ఆన్లైన్ ద్వారా హెచ్ఎంలు, ఎస్ఏలకు ఆర్డరు కాపీలు వచ్చాయన్నారు. ప్రస్తుతం ఎస్జీటీలను వెబ్ కాకుండా మాన్యువల్ కౌన్సెలింగ్ వల్ల సీనియర్ మారుమూల ప్రాంతాల్లో పని చేసే ఉపాధ్యాయులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుందన్నారు. కూటమి నేతలు, యూనియన్ నాయకులు అనుచరులకు కావసిన పాఠశాలను దక్కించుకునేలా ప్రక్రియ చోటు చేసుకోవచ్చన్నారు. రోడ్డు పాయింట్ ఉన్న ఖాళీ బయటకు వెల్లడి చేయకుండా చేసేందుకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా వీలుంటుందన్నారు. వారి ఒత్తిళ్లు నడుమ మాన్యువల్ కౌన్సెలింగ్ జరిగే అవకాశం ఉండొచ్చునని అధిక శాతం ఉపాధ్యాయులు వాపోతున్నారన్నారు. వెబ్ కౌన్సెలింగ్ చేయడం వల్ల రోజులు, గంటల తరబడి నిరీక్షణ చేసే ఇబ్బంది ఉండదన్నారు. సీనియారిటీ ప్రకారం వారు కోరుకున్న పాఠశాల కేటాయింపు ఉంటుందన్నారు. వారు అర్డర్ సైతం ఆన్లైన్లో పొందవచ్చునన్నారు. మొదట్లో ప్రభుత్వం హెచ్ఎం, ఎస్ఏలకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి కూటమి పెద్దలు, యూనియన్ నాయకులు ఒత్తిళ్లకు తలొగ్గి ఈ విధంగా చేయడంతో అధిక శాతం ఎస్జీటీ టీచర్లలో వ్యతిరేకత కన్పిస్తుందన్నారు. -
కార్పొరేట్ పాఠశాలల దోపిడీపై చర్యలు తీసుకోవాలి
ఏఐఎస్ఎఫ్ ఆందోళన అనకాపల్లి టౌన్ : చదువు పేరుతో వేల రూపాయలు దోచుకుంటున్న కార్పొరేట్, ప్రెవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి జి ఫణీంద్రకుమార్ కోరారు. స్ధానిక నరిసింగరావు పేట నారాయణ కళాశాల ఎదుట శనివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రెండవ శనివారం అయినా క్లాసులు నిర్వహిస్తుండపై ఏఐఎస్ఎఫ్ నాయకులు అభ్యతరం వ్యక్తం చేశారు. తక్షణమే విద్యార్థులను బయటకు పంపాలని నినాదాలు చేశారు. సుమారు 15 నిమిషాలు అనంతరం యాజమాన్యం స్పందించి విద్యార్థులను బయటకు పంపించివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, స్టేషనరీ ఐటమ్స్ అమ్ముతున్న విద్యాసంస్థలపైన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ పేరుతో వారి కళాశాల పాఠశాల పేర్లు ముద్రించి అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా విద్యాశాఖాధికారులు స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రెవేట్ విద్యాసంస్థలపై ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి సింహాద్రి, జిల్లా నాయకులు దేవి ప్రసాద్, సాయితేజ, నాయుడు, శివాజీ పాల్గొన్నారు. -
10 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు
అనకాపల్లి టౌన్ : పట్టణంలోని గూడ్స్ షెడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తుల నుంచి 10 కిలోల గంజాయి, రెండు సెల్ఫోన్లు, రూ.2,250 నగదు స్వాధీనం చేసుకున్నట్టు పట్టణ సీఐ విజయ్కుమార్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న పట్టణ ఎస్ఐ ఈశ్వరావు ఆధ్వర్యంలో గస్తీ తిరుగుతున్న పోలీసులకు రైల్వేస్టేషన్ గూడ్స్షెడ్ వద్ద సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్పై గంజాయి తీసుకువస్తూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారని తెలిపారు. వారిని వెంబడించి పట్టుకున్నామన్నారు. వీరిలో జి.మాడుగుల మండలం కోడాపల్లి గ్రామానికి చెందిన రామన్ ప్రభాకర్ ఏజెన్సీ ప్రాంతంలో 10 కేజీల గంజాయిని రూ.20 వేలకు కొని తన స్నేహితుడైన తమిళనాడులోని మధురై మండలం ఉసిలంపట్టి గ్రామానికి చెందిన జయవీరన్ కారుతి వీర దేవరతో కలిసి అనకాపల్లి రైల్వే స్టేషన్లో గంజాయిని దించడానికి ఒప్పందం చేసుకున్నాడని తెలిపారు. రామన్ ప్రభాకర్పై అరకు పోలీస్స్టేషన్లో కేసులు ఉండగా, రెండో నిందితుడు వీర దేవర్కు తమిళనాడులో గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నాడన్నారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్టు సీఐ తెలిపారు. -
ఏటా 3 వేల మందికి చికిత్స అందించేలా..
ఐసీఐసీఐ ఫౌండేషన్ బ్లాక్ ఫర్ చైల్డ్ అండ్ బ్లడ్ క్యాన్సర్ భవనాన్ని 8 అంతస్తుల్లో సుమారు 3.9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ కొత్త భవనంలో 555 పకడలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అగనంపూడిలో ఉన్న హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో గత మూడేళ్లుగా రోజూ కొత్తగా సుమారు 200 మంది పీడియాట్రిక్ క్యాన్సర్ రోగులు, 350–400 మంది హెమటోలింఫాయిడ్ క్యాన్సర్ పేషంట్లు వైద్య సేవలు పొందుతున్నారు. కొత్త బ్లాక్ అందుబాటులోకి వచ్చిన తర్వాత బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్తో పాటు ప్రస్తుత వైద్య సేవలను గణనీయంగా విస్తరించేందుకు, అలాగే ఇమ్యునోథెరపీకి వెసులుబాటు కలగనుంది. మరో 3 వేల మంది క్యాన్సర్ రోగులకు చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ఈ కొత్త బ్లాక్ల్లో అధునాతన వైద్య సదుపాయాలు, పరిశోధన విభాగాలు ఉండనున్నాయి. పెరుగుతున్న క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 2027 నాటికి ఈ కొత్త బ్లాక్ను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్నారు. -
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న హెచ్సీకి ఆర్థిక సాయం
అనకాపల్లి: అల్లూరు సీతా రామరాజు జిల్లా చింతపల్లి పోలీస్స్టేషన్లో హెచ్సీ గా విధులు నిర్వహిస్తున్న ఓ. గణేశ్వరరావు అనారోగ్యం కారణంగా విశాఖ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శక్తి వెల్ఫేర్ అసోసియేషన్ 1990 బ్యాచ్ నుంచి అసోసియే షన్ అధ్యక్షుడు కె.అనిల్, ప్రధాన కార్యదర్శి ముబారక్లు ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న గణేశ్వరరావుకు శనివారం రూ.20వేలు చెక్కును అందజేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1990 బ్యాచ్కు చెందిన సహా ఉద్యోగులు ఏ రకమై న కష్టాల్లో ఉన్నా ఆదుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పూర్ణ, వెంకటేశ్వర్లు, రామారావు, మూర్తి, శ్రీను పాల్గొన్నారు. -
పేకాట శిబిరంపై పోలీసుల దాడి
కశింకోట : తీడ గ్రామ శివారు కచ్చళ్లపాలెంలో పేకాట స్థావరంపై పోలీసులు శనివారం దాడి చేసి భారీగా రూ.1,02,348 నగదు పట్టుకున్నారు. 13 మందిని అరెస్టు చేసి 4 మోటారు వాహనాలు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాలు ప్రకారం...ముందుగా అందిన సమాచారం మేరకు గుట్టు చప్పుడు కాకుండా కచ్చళ్లపాలెంలో పేకాట శిబిరంపై సీఐ ఆధ్వర్యంలో ఎస్ఐ కె.లక్ష్మణరావు, పి.మనోజ్కుమార్,పోలీసు సిబ్బంది దాడి చేశారు. నిందితులను పట్టుకోవడంతో పాటు మోటారు వాహనాలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితిలోను సహించేది లేదని సీఐ స్వామినాయుడు హెచ్చరించారు. -
‘నీట్’గా రాణించారు..
పాయకరావుపేట: వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు (నీట్)లో జిల్లా విద్యార్థులు రాణించారు. పాయకరావుపేటకు సమీపంలోని బెండపూడికి చెందిన డి.సూర్యచరణ్ జాతీయ స్థాయిలో 59వ ర్యాంకు సాధించాడు. ఆయన 10వ తరగతి శ్రీప్రకాష్లో, ఇంటర్మీడియట్ విశాఖపట్నం నారాయణ కాలేజీలో చదివాడు. న్యూరాలజిస్ట్ కావాలన్నది తన కోరికని తెలిపాడు. మంచి ర్యాంకు రావడంతో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపాడు. తల్లిదండ్రులు ప్రసాద్, రాణి ఒడిశాలో స్థిరపడ్డారు. తండ్రి వ్యవసాయం చేస్తారు. కార్డియాలజిస్టును అవుతా.. నర్సీపట్నం: నీట్ ఫలితాల్లో కోటవురట్ల మండలం కె.వెంకటాపురానికి చెందిన గొల్లు లహరి 558 మార్కులు సాధించింది. ఆమెకు ఆల్ ఇండియా స్థాయిలో 8878వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 3661 ర్యాంకు వచ్చింది. ఏపీఈఏపీసెట్లో 155వ ర్యాంకు సాధించింది. తండ్రి వెంకట నాగేశ్వరరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తల్లి ఉమారత్నం గృహిణి. లహరి పదో తరగతి వరకు నర్సీపట్నంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో, ఇంటర్ విజయవాడలోని ప్రైవేటు కళాశాలలో చదువు పూర్తి చేసింది. నీట్లో మంచి ర్యాంకు రావడం సంతోషంగా ఉందని, ఎంబీబీఎస్ పూర్తి చేసి కార్డియాలజిస్ట్ అవుతానని పేర్కొంది. మనీషా సాయికుమారికి 3554వ ర్యాంకు కె.కోటపాడు: నీట్లో చౌడువాడ గ్రామానికి చెందిన రాజి మనీషా సాయికుమారి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఆల్ ఇండియా స్థాయిలో 3554 ర్యాంకు సాధించింది. ఇటీవల వెలువడిన ఏపీఈఏపీ సెట్లో కూడా సాయికుమారి 144వ ర్యాంకు తెచ్చుకుంది. ఆమె పదో తరగతి వరకు కొమ్మాదిలోని జవహర్ నవోదయ స్కూల్లో చదువుకొని 500 మార్కులకు 495 సాధించింది. ఇంటర్లో 986 మార్కులు వచ్చాయి. తల్లిదండ్రులు సత్యనారాయణ, సోనియా వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు. -
అర్హత ఉన్నా రాలేదు..
మాది నిరుపేద కుటుంబం. పొట్టకూటి కోసం కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాను. నాకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు చదువుకోలేదు. చిన్న కుమారుడు దుర్గాప్రసాద్ 9వ తరగతి పూర్తి చేసుకుని పదో తరగతిలోకి వచ్చాడు. ప్రతి రోజూ స్కూల్ వెళ్లేవాడు. హాజరు శాతం ఎక్కువగానే ఉంటుంది. మాకు కారు లేదు. కరెంట్ బిల్లు 200 మించిరాదు. కానీ తల్లికి వందనం ఇప్పటివరకు పడలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లపాటు అమ్మ ఒడి అందుకున్నాను. పేపర్లో వార్త చదివి బ్యాంకుకు వెళ్లి అడిగితే ఇంకా పడలేదు అన్నారు. – కోరుకొండ నూకరత్నం, పూసర్ల వీధి, కశింకోట మండలం -
‘తల్లికి వందనం చిరుద్యోగులకు అందించాలి’
అనకాపల్లి: తల్లికి వందనం పథకాన్ని అత్యంత తక్కువ జీతాలతో పనిచేస్తున్న అంగన్వాడీ, ఆశ, వెలుగు తదితర స్కీం కార్మికులతోపాటు విద్యా, వైద్య ఆరోగ్యశాఖలు, వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింపచేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.శంకరావు అన్నారు. స్థానిక సిటు కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చిరుద్యోగులందరికీ సంక్షే మ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి తల్లికి వందనాన్ని చిరు ఉద్యోగులకు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, స్కీం వర్కర్లకు అమలు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. వీరికి తల్లికి వందనాన్ని అందకుండా చేయడం అన్యాయమన్నారు. -
ఖరీఫ్ సాగుకు సన్నద్ధం
చోడవరం: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ పనులు ముందుగానే ప్రారంభమయ్యాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులంతా నారుమడులు సిద్ధం చేసే పనిలో బిజీ అయ్యారు. గ్రామాలన్నీ వ్యవసాయ పనులతో సందడిగా మారాయి. రైతులు విత్తనాల కోసం వ్యవసాయ కార్యాలయాల వద్ద పడిగాపులు పడే పరిస్థితి లేకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లోనే (ఆర్బీకేలు) ఆన్లైన్లో తమ ఆర్డర్ నమోదు చేసే అవకాశం కల్పించింది. ఈ ఏడాది కూడా ఇప్పటికే రైతులంతా తమకు కావలసిన విత్తనాలను సమకూర్చుకున్నారు. వ్యవసాయ బోర్లు, జలాశయాలు, ఆయకట్టు భూముల్లో రైతులు కొందరు తమ వద్ద ఉన్న సొంత విత్తనాలను ఇప్పటికే నారుమడుల్లో జల్లుతున్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సుమారు 2 లక్షల 20 వేల ఎకరాల్లో వరి సాగు జరుగుతుందని అంచనా వేయగా అదనంగా మరో 3 వేల ఎకరాల వరకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రతి ఆర్బీకేలోనూ రైతులు అదనుకు విత్తనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. బీపీటీ రకాల వైపు రైతుల మొగ్గు ఈ ఏడాది సాధారణ రకాల వైపు వెళ్లకుండా బీపీటీ రకాలైన సోనామసూరి, ఆర్జీఎల్ రకాలకే రైతులు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. రైతులు దిగుబడిలో తమకు కావలసింది ఉంచుకోగా మిగతా ధాన్యాన్ని అమ్ముకోవడానికి సిద్ధం చేసుకున్నప్పుడు ఆర్బీకేలు, పీఏసీఎస్ల ద్వారా మిల్లర్లను గ్రామాలకు రప్పించి కొనుగోలు చేసే విధానాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో నేటికీ ఆ పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు జరుగుతోంది. వాతావరణం కూడా సకాలంలో అనుకూలించడం, ఆశించిన వర్షాలు కురవడంతో జలాశయాల ఆయకట్టు భూములకు ముందుగానే నారుమడులు వేసుకునేందుకు నీరు విడుదలకు సిద్ధం చేశారు. జిల్లాలో పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతాలైన చోడవరం, మాడుగుల నియోజకవర్గాలతోపాటు పాయకరావుపేట, నర్సీపట్నం, అనకాపల్లి, యలమంచిలి నియోజకవర్గాల పరిధిలో చెరకు, సరుగుడు సాగు చేసే భూముల్లో సైతం ఈ ఏడాది వరి సాగు చేసేందుకు రైతులు సమాయత్తమయ్యారు. జిల్లాలో అన్ని సుగర్ ఫ్యాక్టరీలు మూసివేయడం, గోవాడ ఫ్యాక్టరీలో సైతం అనిశ్చిత పరిస్థితి నెలకొనడంతో రైతులంతా వరి సాగుపైనే దృష్టి సారించారు. వర్షాలతో ప్రారంభమైన నారుమడి పనులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు వరి సాగు పెరిగే అవకాశం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో వరి సాగు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. చాలామంది రైతులు సొంత విత్తనాలు సిద్ధం చేసుకోగా, కొత్తగా వరి వేసే రైతులు కూడా ఈ ఏడాది ఆర్బీకేల్లో విత్తనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా 23 వేల 300 మెట్రిక్ టన్నుల వరి విత్తనాలకు ప్రతిపాదన పెట్టాం. ఇప్పటికే చాలా వరకు ఆర్బీకేలకు విత్తనాలు సరఫరా చేశాం. చెరకు, సరుగుడుకి ప్రత్యామ్నాయంగా వరిపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. వర్షాలు కురుస్తుండటంతో నారుమడులు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. – బి.మోహనరావు, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి -
మోకాళ్లపై నిరసన
రావికమతం: ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు అన్నారు.ి శనివారం సీపీఎం ఆధ్వర్యంలో కొత్తకోట బీఎన్ రోడ్డుపై మోకాళ్లపై వినూత్నంగా నిరసన తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్డు పనులు పూర్తి చేస్తామని చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తెలిపారని, ఇప్పటికీ నెరవేర్చలేదని గోవిందరావు అన్నారు. వడ్డాది, విజయరామరాజుపేట బ్రిడ్జిలు, నర్సీపట్నం నుంచి చోడవరం వరకు రోడ్డు పనులు తక్షణమే చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోడ్లపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు తరుచూ ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రోడ్డు పనులు, వడ్డాది, విజయరామరాజుపేట బ్రిడ్జి పనులు పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు గేమిల వాసు, సింగారపు వలసయ్య, పి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. బీఎన్ రోడ్డు పూర్తి చేయలేదని ఎద్దేవా -
యూపీఎస్సీకి ఎంపికై న దీపక్
నర్సీపట్నం : కేంద్ర సాయుధ బలగాల్లో ఉన్నతాధికారుల నియామకం కోసం నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో కోటవురట్ల మండలం, వేములపూడికి చెందిన దేవాడ దీపక్ విజయం సాధించారు. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ వంటి సాయుధ దళాల్లో అధికారుల నియామకం కోసం ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పరీక్షలు నిర్వహిస్తుంది. 2024 సంవత్సరానికి నిర్వహించిన పరీక్షల్లో రాత, మౌఖిక, శారీరక దృఢ పరీక్షల్లో దీప క్ జాతీయస్థాయిలో 105వ ర్యాంకు సాధించారు. ఈ ర్యాంకుతో దీపక్ ఏదో ఒక సాయుధ దళంలో అసిస్టెంట్ కమాండెంట్ హోదాలో నియమితులు కానున్నారు. దీపిక్ తండ్రి శ్రీనివాసరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా, తల్లి చంద్రావతి గృహిణి. దీపక్ పదో తరగతి విశాఖపట్నంలో శ్రీచైతన్య, ఇంటర్ విజయవాడ శ్రీచైతన్యలో చదివారు. అగర్తల ఎన్ఐ టీలో 2019లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో బీ టెక్ పూర్తి చేశాడు. అనంతరం తండ్రి ప్రోత్సాహంతో సివిల్స్ సాధనపై దృష్టి సారించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి సాయుధ బలగాలకు ఎంపికయ్యారు. సాయుధ బలగాలకు ఎంపిక కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూనే సివిల్స్ సాధనకు ప్రయత్నిస్తానని దీపక్ చెప్పాడు. కేంద్ర బలగాలలో సీఐఎస్ఎఫ్లో అవకాశం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీపక్ అసిస్టెంట్ కమాండెంట్గా ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
108లో ప్రసవం
● తల్లీ బిడ్డ క్షేమం చీడికాడ: గిరిజన పంచాయతీ గోప్పూరుకు చెందిన విజయ 108 వాహనంలో శుక్రవారం రాత్రి పండంటి బిడ్డను ప్రసవించింది. నెలలు నిండి పురిటి నొప్పులు పడుతున్న ఆమెను చీడికాడ పీహెచ్సీకి 108లో తరలిస్తుండగా.. వాహనం ఖండివరం సమీపానికి చేరుకునే సమయానికి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో 108 వాహన డ్రైవర్ లెక్కల ముత్యాలనాయుడు వాహనాన్ని ఆపడంతో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కమలాదేవి వాహనంలోనే ఆమెకు సుఖ ప్రసవం జరిపారు. విజయ పాపకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది తల్లీ బిడ్డలను చీడికాడ పీహెచ్సీలో చేర్పించారు. ఇద్దరూ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు ఈఎంటీ కమలాదేవి తెలిపారు. -
రూ.300 బిల్లును 300 యూనిట్లుగా రాశారు
మా పాప ప్రణతి ప్రభుత్వ పాఠశాలలోను, మా అబ్బాయి కోట యశ్వంత్ ప్రైవేటు పాఠశాలలోను చదువుతున్నారు. గత ప్రభుత్వంలో ప్రతి ఏటా అమ్మ ఒడి పడింది. తల్లికి వందనం పథకం ద్వారా ఇద్దరు పిల్లలకు నగదు వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న మాకు చేదు వార్త ఎదురైంది. ఉపాధి కూలీగా నేను, పాన్ షాప్ పెట్టుకుని నా భర్త పిల్లలను పోషించుకుంటున్నాం. మా ఇంటిలో కేవలం ఒక ఫ్యాన్, టీవీ, మూడు లైట్లు మాత్రమే ఉన్నాయి. నెలకు 60 నుంచి 100 యూనిట్ల వరకు మాత్రమే విద్యుత్ వాడుతున్నాం. రూ.300 బిల్లు చెల్లిస్తే..300 యూనిట్లుగా తప్పుగా రాసుకుని తల్లికి వందనం పథకానికి అనర్హురాలిని చేశారు. – కోట సంధ్య, రేబాక గ్రామం, అనకాపల్లి మండలం -
వందనం కాదు.. వంచన
తల్లికి పంగనామం..! ● నిబంధనల పేరుతో తల్లికి వందనం లబ్ధిదారుల సంఖ్య కుదింపు ● 2022–23లో ఇంటికొకరు చొప్పున 1,52,870 విద్యార్థులకు పంపిణీ ● ఇపుడు ఎంత మంది పిల్లలున్నా అందరికీ ఇస్తామని కూటమి హామీ ● కానీ జిల్లాలో 1,79,272 మందినే అర్హులుగా తేల్చిన ప్రభుత్వం ● జిల్లాలో ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు 2.2 లక్షల మంది విద్యార్థులు ● దరఖాస్తులు స్వీకరించకుండానే లబ్ధిదారుల ఎంపికపై అనుమానాలు ● 12 వేలు కంటే ఎక్కువ జీతం వస్తే తల్లికి వందనం కట్ ● ఎటువంటి ఆస్తులు లేకున్నా ఉన్నట్లు చూపిస్తూ అనర్హులుగా ప్రకటన ఒక్కరికే వచ్చింది.. తల్లికి వంద నం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. కానీ నాలుగో తరగతి చదువుతున్న మా పాపకు రాలేదు. 9వ తరగతి చదువుతున్న మా కుమారుడికి రూ.13 వేలు వచ్చాయి. తల్లికి వందనం రాలేదని సచివాలయ సిబ్బందిని, పాఠశాల సిబ్బందిని అడిగితే తెలీదని చెబుతున్నారు. ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటే బాగుంటుంది. – మడగల యమున, కొరుప్రోలు, ఎస్.రాయవరం మండలంసాక్షి, అనకాపల్లి: ‘తల్లికి వందనం’ అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు తల్లులకు పంగనామాలు పెడుతోందనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బడికి వెళ్లే ప్రతి విద్యా ర్థికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి, తాజాగా నిబంధనల పేరుతో లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత విధించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నెల 12వ తేదీ నుంచే డబ్బులు జమ అవుతాయని పత్రికా ప్రకటనలు రావడంతో బ్యాంకుల వద్ద పడిగాపులు కాసిన అనేకమంది తల్లులు.. డబ్బులు జమ కాకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. హామీల ఉల్లంఘన, నిబంధనల వల ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం, ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. అయితే, ‘ఫస్ట్ క్లాస్లో చేరిన వారికి వచ్చే ఏడాది నుంచి మాత్రమే ఇస్తాం’ అంటూ ప్రభుత్వం మాట మార్చిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల కంటే ఎక్కువ జీతం వచ్చిన వారిని అనర్హులుగా గుర్తించి జాబితా నుంచి తొలగించారు. ఎటువంటి ఆస్తులు లేకపోయినా, ఉన్నట్లుగా చూపిస్తూ మరికొంతమందిని పథకం నుంచి తప్పించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దరఖాస్తులు స్వీకరించకుండానే.. ఏ పథకానికై నా దరఖాస్తులు స్వీకరించి, పరిశీలించి లబ్ధిదారులను గుర్తించడం తప్పనిసరి. కానీ ఈ ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించకుండానే లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించారు. గత విద్యా సంవత్సరం డేటా ఆధారంగా జాబితాను సిద్ధం చేయడం వల్ల, ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులకు పథకం వర్తించదని తల్లిదండ్రులకు సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. ఆస్తుల లింకుతో ఇక్కట్లు గతంలో ‘అమ్మ ఒడి’ తీసుకున్న లబ్ధిదారులు సైతం ఈ జాబితాలో అనర్హులుగా తేలడం గమనార్హం. దీనిపై సచివాలయంలో ఆరా తీయగా, వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ ఆస్తి ఉన్నట్లు లేదా రూ.12 వేలు కంటే ఎక్కువ ఆదాయం ఉన్నట్లు చూపుతూ అనర్హులుగా తేల్చినట్లు చెబుతున్నారు. వాస్తవానికి, అనర్హుల్లో అత్యధిక శాతం మందికి ఆస్తులు లేనప్పటికీ, ఉన్నట్లు చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఆస్తులు లేవని, అద్దె ఇంట్లో ఉన్నామని చెబుతున్నప్పటికీ, సచివాలయం సిబ్బంది తమకు సంబంధం లేదని జీవీఎంసీ కార్యాలయానికి వెళ్లాలంటూ తిప్పుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సచివాలయ సిబ్బంది ఇంటింటి సర్వే, మ్యాపింగ్ చేపట్టినప్పుడు, అద్దెకున్న వారి ఆధార్ కార్డును ఇంటి ఆస్తి పన్నుతో లింక్ చేయడం వల్లే ఈ సమస్య తలెత్తిందని తెలుస్తోంది. దీంతో లబ్ధిదారుల ఆధార్ నెంబర్ పరిశీలిస్తే, ఆస్తి ఉన్నట్లు చూపిస్తోంది. ఈ లింకును తొలగించడానికి సచివాలయం సిబ్బంది నిరాకరించడం, ఉన్నతాధికారులు సైతం దీనిపై దృష్టి పెట్టకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లబ్ధిదారుల సంఖ్యలో భారీ కోత ఎన్నికలకు ముందు ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ‘తల్లికి వందనం’ కింద రూ.15 వేలు ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది తర్వాత పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు హడావుడి చేశారు. దీని ప్రకారం జిల్లాలో 2,22,797 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేశారు. కానీ కేవలం 1,19,357 మంది తల్లులకు గాను 1,79,272 మంది పిల్లలకు మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటించారు. 2022–23లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ‘అమ్మ ఒడి’ పథకాన్ని 1,52,870 మందికి అమలు చేసింది. ఈసారి పిల్లలందరికీ ఇస్తామన్నారు కాబట్టి మరో 70 వేలమందికి అందించాల్సి ఉండగా కేవలం 26,402మందికి మాత్రమే అదనంగా వచ్చింది. 43,525 మంది విద్యార్థులను అనర్హత వేటు వేశారు. -
రక్తదాత.. సుఖీభవ.!
అనకాపల్లి టౌన్: రక్తదానం...ప్రాణదానంతో సమానం. ఏమీ ఆశించకుండా చేసే ఈ చిన్న దానమే ఏటా లక్షల మందిని కాపాడుతుంది. వైద్య రంగంలో పరిశోధనల మూలంగా ఎన్నో అధునాతన మార్పులు వచ్చినప్పటికీ రక్తానికి ప్రత్యామ్నాయం ఇంకా కనుగొనలేదు. రక్తం ఒక అరుదైన వనరు. ఇది కృతిమంగా తయారు చేయలేని పదార్థం. కాబట్టి ప్రాణాప్రాయ స్ధితిలో ఉన్న వారిని కాపాడడానికి ఉన్న ఏకై క మార్గం రక్తదానం ఒక్కటే. రక్తదానం ఎవరు చేయవచ్చు... కనీస వయసు 18 నుంచి 65 సంవత్సరాల వరకు రక్తదానం చేయవచ్చు. బరువు కనీసం 45 నుంచి 55 కిలోలు ఉండాలి. ఒక మనిషి ఒకసారి 350 మిల్లీలీటర్ల రక్తం ఇవ్వవచ్చు. 50 కిలోల బరువు పైబడి ఉన్నవారు 450 మి.లీ రక్తం ఇవ్వవచ్చు. శరీర ఉష్ణోగ్రత 37 నుంచి 98 డిగ్రీల కంటే ఎక్కువ ఉండకూడదు. హృదయ స్పందన 60 నుంచి 100 ఉండాలి. రక్తపోటు 100 నుంచి 140, డయాస్టోల్ 60 నుంచి 90 ఉండాలి. తీవ్రమైన శ్వాసకోస వ్యాధులు ఉండకూడదు. హిమోగ్లోబిన్ కనీసం 12.5 నుంచి 38 వరకు ఉండాలి. చర్మవాధులు లేని ప్రదేశంలో మాత్రమే రక్త తీయాలి. గుండె, ఊపిరితిత్తులు, పొత్తి కడుపు సర్వసాధారణంగా ఉండాలి. ఓ నెగిటివ్ గ్రూప్కు డిమాండ్ ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బీ పాజిటివ్, బీ నెగిటివ్, ఏబీ పాజిటివ్, ఏబీ నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ ఇలా ఎనిమిది రక్త గ్రూపులు ఉన్నా.. ఓ నెగిటివ్ చాలా అరుదుగా లభిస్తుంది. సుమారుగా ప్రతి 10 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. రక్తం నిల్వ చేసే ఫ్రీజర్ రక్తదానం..ప్రాణదానంతో సమానం రక్తానికి ప్రత్యామ్నాయం లేదు.. దానమే మార్గం నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం మనిషికి శ్వాసించడం ఎంత అవసరమో రక్తం కూడా అంతే ముఖ్యం. శ్వాస ద్వారా మనం పీల్చుకున్న ఆక్సిజన్ను.. గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీలతోపాటు అన్ని అవయవాలకు చేరవేసేది రక్తమే. ప్రమాదాల్లో గాయాల కారణంగా, రక్తహీనత ఏర్పడినప్పుడు, మహిళల్లో కాన్పు సమయాల్లో రక్తం ఎక్కించాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. ఇలాంటప్పుడే రక్తదాతల అవసరం ఏర్పడుతుంది. ఒకరి రక్తదానం నుంచి మరో ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు. అందుకే రక్తదానం మహాదానంగా పరిగణిస్తున్నారు. రక్తదాతా సుఖీభవ అంటున్నారు. శనివారం(జూన్ 14) ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. -
కూటమి పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యం
సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు ధ్వజం అనకాపల్లి: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యమని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు ధ్వజమెత్తారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక, వ్యవసాయ, నీటిపారుదల రంగం, ఉపాధి కల్పన, విద్య, వైద్య రంగం, మౌలిక సదుపాయాల కల్పనలో సాధించిన అభివృద్దిని నియోజకవర్గాల వారీగా శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు తెలియజేయాలన్నారు. భారీ పెట్టుబడులు, లక్షలాది మందికి ఉపాధి కల్పనపై ప్రకటనలు తప్ప ఏడాది పాలనలో జిల్లాకు కొత్తగా వచ్చిన పరిశ్రమలు కంటికి ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఉన్న విశాఖ స్టీల్ప్లాంట్ను దెబ్బతీసి నక్కపల్లి ప్రాంతంలో ప్రైవేట్ మిట్టల్ స్టీల్ను ప్రోత్సహించాలన్న కుట్ర తప్ప ప్రజలకు ఎక్కడా మేలు కనిపించడం లేదన్నారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలన్న జీవో బుట్టదాఖలైందన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తుమ్మపాల, ఏటికొప్పాక, తాండవ సహకార సుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని ఇచ్చిన మాట ఏడాది అవుతున్నా నిలబెట్టుకోలేదని విమర్శించారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో వచ్చే సీజన్ నాటికి క్రషింగ్ నిలిపివేసే కుట్రలో ప్రభుత్వం ఉందన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం ఎడమ కాలువ పనులు ఎప్పటిలోగా పూర్తిచేసి అనకాపల్లి ప్రజలకు సాగునీటి సౌకర్యం కల్పిస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తాండవ, పెద్దేరు, కోనాం, రైవాడ జలాశయాల ఆయకట్టును స్థిరీకరించేందుకు నిధులు విడుదల చేయకుండా, రైవాడ జలాశయం ఎగువ భాగాన పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి అదానీకి కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చి ఆయకట్టును దెబ్బతీసే చర్యలకు శ్రీకారం చుట్టిందన్నారు. మైదాన ప్రాంత గిరిజనులకు నర్సీపట్నం కేంద్రంగా ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు చేయాలన్నారు. నక్కపల్లి సీహెచ్సీలో ట్రామా కేర్ సెంటర్, ఎన్టీఆర్ ప్రభుత్వాస్పత్రిలో సూపర్ స్పెషాల్టీ విభాగాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో మెరుగైన వైద్యం సకాలంలో అందించేలా ఎన్టీఆర్ ఆస్పత్రిని తీర్చిదిద్దాలన్నారు. తీర ప్రాంత మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకుండా కాలుష్య పరిశ్రమల వ్యర్థాలను శుద్ధి చేసే వ్యవస్థను పటిష్టం చేయాలని కోరారు. వ్యర్థాలను శుద్ధి చేయకుండా సముద్రంలోకి నేరుగా విడిచిపెడుతున్న పరిశ్రమలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ప్రతిపాదిత పూడిమడక ఫిషింగ్ హార్బర్, నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద ఫిష్ ల్యాండ్ సెంటర్ నిర్మాణం పనులను తక్షణమే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీ సీఎం రమేష్ ఏడాది పాలనలో జిల్లా అభివృద్ధికి చేసిన కృషి ఏమీలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.శంకరరావు, గనిశెట్టి సత్యనారాయణ, గంటా శ్రీరామ్ పాల్గొన్నారు. -
16న అంగన్వాడీ కార్యకర్తల ధర్నా
అనకాపల్లి టౌన్: అంగన్వాడీ వర్కర్ల పిల్లలకు తల్లికి వందనంతో పాటు పలు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ఈ నెల 16న కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగశేషు, జిల్లా అధ్యక్షురాలు ఎం.దుర్గారాణి కోరారు. స్థానికంగా ప్రైవేట్ హాల్లో శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో అంగన్వాడీలందరూ పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి వేతనాలు పెంచాలన్నారు. స్కీం వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడు కోత పెట్టడం దారుణమన్నారు. నెలకు రూ.12 వేలు ఆదానం ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న ప్రభుత్వం.. రూ.11.500 తీసుకుంటున్న అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదన్నారు. ధర్నాకు పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. -
మత్స్య వేటకు సై!
రెండు మాసాల మత్స్య వేట నిషేధ గడువు ముగింపునకు చేరుకుంది. నేటి అర్ధరాత్రి నుంచి చేపల వేట ప్రారంభం కానుంది. ఇప్పటికే బోట్లు, వలలకు మరమ్మతులు చేపట్టి, లంగరెత్తేందుకు గంగపుత్రులు సిద్ధమయ్యారు. ఈ రోజు రాత్రి నుంచే వేటకు వెళ్లనుండటంతో ఫిషింగ్ హార్బర్లో సందడి నెలకొంది. తమకు కావాల్సిన సామగ్రిని సిద్ధం చేసుకుంటూ మత్స్యకారులు హడావుడిగా ఉన్నారు. బాక్స్ల నిండుగా ఐస్ లోడ్ చేశారు. పక్షం నుంచి నెల రోజులకు సరిపడా వంట సామగ్రి బోటులో చేర్చారు. చిన్నచిన్న లోపాలు కూడా లేకుండా అంతా మరోసారి చెక్ చేసుకున్నారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
35 రోజుల పాటే రక్తం నిల్వ
రక్తదానంపై అపోహలకు పోవద్దు. రక్తదాతలకు ప్రాథమికంగా పరీక్షలు చేసిన తర్వాతే రక్తం తీసుకుంటాం. మగవారు ప్రతి 3 నెలలకు ఒకసారి, ఆడవారు 4 నెలలకు ఒకసారి రక్తం దానం చేయవచ్చు. ఒక వ్యక్తి దానం చేసిన రక్తం 35 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. అందువల్ల రక్తదానం నిరంతర ప్రక్రియగా సాగాలి. స్వచ్ఛందంగా రక్తదానం చేసేవారు తక్కువగా ఉంటున్నారు. అందుకే విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. – ఎస్.కనకదుర్గ, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్, ఎన్టీఆర్ ఆస్పత్రి, అనకాపల్లి -
ట్రాన్స్ఫార్మర్ల చోరీ కేసుల్లో ముగ్గురి అరెస్టు
సబ్బవరం: ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు మండలాలలో గత రెండేళ్లుగా ఏపీఈపీడీసీఎల్కు చెందిన 42 ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేసిన కేసుల్లో ముగ్గురు నిందితులను సబ్బవరం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సబ్బవరం పోలీస్ స్టేషన్లో పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశాఖపట్నంలోని మర్రిపాలెంకు చెందిన గరికిపాటి సాయికిరణ్,పట్నాల రాజేశ్వరరావు,మహారాణిపేటకు చెందిన నెల్ల సాయిప్రసాద్ అనే ముగ్గురు యువకులతో పాటు మరో ఇద్దరు కలిసి 2023 నవంబర్ నుంచి 2025 జూన్ వరకూ ఉమ్మడి విశాఖ జిల్లాలోని సబ్బవరం, ఆనందపురం, పెందుర్తి, అచ్యుతాపురం, చోడవరం, కశింకోట, యలమంచిలి, భీమిలి మండలాల్లోని ఏపీఈపీడీసీఎల్కు చెందిన ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేశారు. ఎనిమిది మండలాల్లో 42 ట్రాన్స్ఫార్మర్లు చోరీ చేయగా, అత్యధికంగా సబ్బవరం మండలంలో 15 ట్రాన్స్ఫార్మర్లు అపహరించినట్టు డీఎస్పీ తెలిపారు. చోరీ చేసిన ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైర్ను తొలగించి, అమ్మేసేవారని తెలిపారు.ఈ విధంగా వారు విక్రయించిన 190 కిలోల కాపర్ వైర్ను రికవరీ చేసినట్టు చెప్పారు. చోరీ చేసిన ట్రాన్స్ఫార్మర్ల విలువ రూ.54 లక్షల వరకూ ఉంటుందన్నారు.ఈ కేసుల్లో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ జి.రామచంద్రరావు,ఎస్ఐలు సింహాచలం, దివ్యలతో పాటు మిగిలిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 190 కిలోల కాపర్ వైర్ స్వాధీనం డీఎస్పీ విష్ణు స్వరూప్ -
స్ఫూర్తి ప్రదాత.. గణేష్
మునగపాక: మండలంలోని టి.సిరసపల్లికి చెందిన కొమ్మోజు గణేష్ రక్తదానాలతో ప్రాణదాతగా గుర్తింపు పొందారు. గణేష్ నిరంతర సేవా ఫౌండేషన్ స్థాపించి రక్తదాతలు, వలంటీర్ల సహకారంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఎంతో మందికి ప్రాణదాతగా నిలుస్తున్నారు. అంతేకాకుండా 20 సార్లు రక్తదానం చేసి ఎంతో మందిలో స్ఫూర్తి నింపారు. సొంతంగా వైద్య శిబిరాలు కూడా తరచూ నిర్వహిస్తున్నారు. కోవిడ్ విలయ తాండవంలో సైతం కోవిడ్ విలయ తాండవంలో సైతం గణేష్ రోగుల అవసరాన్ని బట్టి స్నేహితుల సహకారంతో రక్తం, ప్లాస్మా దానం చేపట్టారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 7 వేల మంది వలంటీర్ల సహకారంతో 40 వరకు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలతో పాటు ఉచిత వైద్య శిబిరాలు, క్యాన్సర్ పరీక్ష శిబిరాలు సొంతంగా ఏర్పాటు చేశారు. ఈ సేవలకు గాను ప్రాణదాత సేవా పురస్కారాన్ని తెలంగాణా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేతుల మీదుగా గణేష్ అందుకున్నారు. అలాగే యంగ్ ఇండియన్ జాతీయ స్థాయి సేవా పురష్కారం కూడా దక్కించుకున్నారు. -
జాతీయ రహదారిపై కారు దగ్ధం
గాజువాక: షీలానగర్ జాతీయ రహదారిపై ఓ కారులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కారు ఇంజిన్లో నుంచి పొగ వచ్చి ఒక్కసారిగా దట్టమైన మంటలు వ్యాపించాయి. కారులో ప్రయాణిస్తున్న తండ్రి, కుమార్తె ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు అందించిన వివరాలివీ.. అనకాపల్లి జిల్లా ఉమ్మలాడకు చెందిన ఎల్.ఎన్.వి.ప్రభాకర్ శనివారం తిరుపతి దర్శనం కోసం బయల్దేరాల్సి ఉంది. ఎన్ఏడీ కొత్తరోడ్లోని తమ బంధువుల ఇంట్లో ఉన్న కుమార్తెను తీసుకొని వెళ్లడం కోసం వచ్చిన ఆయన కుమార్తెతో కలిసి కారులో ఉమ్మలాడకు బయల్దేరారు. షీలానగర్ జంక్షన్కు వచ్చేసరికి కారు ఇంజిన్లో నుంచి పొగ రావడం గమనించారు. అప్రమత్తమైన ఆయన తనతోపాటు కుమార్తెను కారులో నుంచి దించేశారు. క్షణాల్లోనే దట్టమైన మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఆటోనగర్ నుంచి అగ్నిమాపక సిబ్బంది శకటంతో వచ్చి మంటలను ఆర్పివేశారు. -
రంగురాళ్ల తవ్వకాలకు భారీ స్కెచ్
సాక్షి, అనకాపల్లి: నర్సీపట్నం రేంజ్ పరిధిలో గల గొలుగొండ కరక క్వారీలో లభ్యమయ్యే రంగురాళ్ల అక్రమ తవ్వకాలకు భారీ స్కెచ్ వేశారు. ఈ రంగురాళ్లకు దేశంలోనే అత్యంత గిరాకీ ఉంటుంది. కరక క్వారీలో అలెక్స్ (సిసలైన పచ్చ వైఢూర్యం) లభ్యమవుతుంది. రంగురాళ్ల తవ్వకాలు చేపట్టేందుకు ఎన్నో ఏళ్లుగా అక్రమార్కుల ముఠా ఎదురుచూస్తోంది. టీడీపీ ప్రభుత్వం వస్తేనే వీరికి అనుకూలంగా ఉంటుంది. ఈ పరిసర ప్రాంతంలోకి ఎవరైనా అక్రమార్కులు ప్రవేశించాలంటే అటవీ శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. అందుకే గార్డు స్థాయి నుంచి ఫారెస్ట్ రేంజ్ అధికారి వరకూ ఇటీవల బదిలీలలో మార్పు చేసుకున్నారు. ఇప్పుడు డీఎఫ్వోగా తమకు అనుకూలమైన వ్యక్తిని రప్పించేందుకు కూటమి ఎమ్మెల్యే కుమారుడి సిఫార్సు లేఖతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అతని సిఫార్సుతోనే ఫారెస్ట్ రేంజ్ అధికారిని తెచ్చుకున్నారు. ఇప్పుడు జిల్లా ఫారెస్ట్ అధికారిని కూడా మార్చేందుకు తీవ్ర ప్రయత్నం జరుగుతోంది. అవినీతి అధికారికి అందలం! ప్రస్తుతం అనకాపల్లి జిల్లా డీఎఫ్వోగా పనిచేస్తున్న శామ్యూల్ను మార్పు చేసి కూటమి ఎమ్మెల్యే కుమారుడి సిఫార్స్ లేఖతో తనకు అనుకూలంగా పనిచేసే అధికారిని తెచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అవినీతికి మారుపేరు అయిన ఒక అధికారిని తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సదరు అధికారి గతంలో విజయనగరంలో రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ ట్రాప్లో చిక్కారు. గతంలో శ్రీకాకుళంలో కూడా ఇతని మీద ఒక ఏసీబీ కేసు ఉంది. రంగురాళ్ల తవ్వకాలకు అడ్డు లేకుండా అలాంటి వ్యక్తిని నర్సీపట్నం తీసుకొస్తున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఆయన వీఎంఆర్డీ డీఎఫ్వోగా రావటానికి భారీ ముడుపులు ఇచ్చి ప్రయత్నం చేసినప్పటికీ.. ఏసీబీ కేసు ఉండటం వలన సంస్థ తీసుకోవటానికి ఇష్టపడలేదు. సదరు అధికారి ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తున్నారు. బదిలీ జీవో నేడో, రేపో రానున్నట్లు సమాచారం. అనుకూలస్తులనే తెచ్చుకున్నారు..! ఈ నెల 9వ తేదీన కరక క్వారీ ప్రాంత గార్డు అయిన నవీన్, ఫారెస్ట్ రేంజ్ అధికారి లక్ష్మీనరసింహలకు ఐదేళ్ల కాలపరిమితి ముగియకపోయినా బదిలీ చేయించి, తమకు అనుకూలంగా ఉండే వారిని తెచ్చుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడకు గార్డుగా వచ్చిన వ్యక్తి స్థానిక కూటమి నేతలకు బాగా పరిచయస్తుడు. ఇక్కడకు కొత్తగా వచ్చిన ఫారెస్ట్ రేంజ్ అధికారి కూడా ఈ ప్రాంత కూటమి నాయకులకు సుపరిచితుడు. ఏడాది క్రితం కేడీ పేటలో డీఆర్వోగా పనిచేసి ప్రమోషన్పై పాడేరు డివిజన్లో ఫారెస్ట్ రేంజ్ అధికారిగా పదోన్నతిపై వెళ్లారు. మళ్లీ నర్సీపట్నం ఫారెస్ట్ రేంజ్ అధికారిగా బదిలీపై వచ్చేశారు. కూటమి పాలనలో అక్రమార్కుల ఆటలు తారస్థాయికి చేరాయి. ఏడాది కాలంలో ఇసుక, గ్రావెల్, లేటరైట్, మైనింగ్ వంటి ప్రభుత్వ సంపదను దోచుకోవడమే కాక.. ఇప్పుడు ఏకంగా రంగురాళ్లపైనే కన్నేశారు. ఇందుకోసం అటవీ శాఖలో కింది నుంచి పై వరకు తమకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకుంటున్నారు. నేడో రేపో డీఎఫ్వోగా అస్మదీయుడినే నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గొలుగొండ కరక క్వారీ దోచుకునేందుకు పన్నాగం అడ్డుకుంటారన్న అనుమానంతో అటవీ అధికారుల మార్పు డీఎఫ్వోను మార్చేందుకు కూటమి ఎమ్మెల్యే కుమారుడి సిఫార్సు లేఖ ఏసీబీ ట్రాప్లో చిక్కిన అధికారిని తెచ్చుకునేందుకు యత్నాలు -
భూగర్భ శివాలయ దర్శనం అద్భుతం
● సినీ రచయిత, దర్శకుడు జె.కె.భారవి నాతవరం: భూగర్భ శివాలయాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలుగు సినీ రచయిత, దర్శకుడు జె.కె.భారవి అన్నారు. గుమ్మడిగొండ పంచాయతీ శివారు చిక్కుడుపాలెం గ్రామంలో వెలసిన శివశక్తి క్షేత్రాన్ని శుక్రవారం ఆయన దర్శించుకున్నారు. ఇక్కడ ప్రతిష్టించిన శివలింగాలు, వాటి ప్రాముఖ్యత గురించి ఆలయ ధర్మకర్త కె.ఎస్.ఎస్.శర్మ ఆయనకు వివరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత భారవి విలేకరులతో మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో చూడచక్కని విధంగా శివశక్తి క్షేత్రంలో అనేక రకాల శివలింగాలు ప్రతిిష్టించడం చాలా ఆనందాయకమన్నారు. ఇక్కడ ప్రతిష్టించిన శివలింగాలు ఎంతో అద్భుతంగా దర్శనమిస్తున్నాయన్నారు. ఈ ఆలయ విశిష్టత గురించి ప్రచార మాధ్యమాల్లో చూసి ఇక్కడకు వచ్చానన్నారు. దూరప్రాంతమైనా ఇక్కడకు వచ్చిన తర్వాత, శివశక్తి క్షేత్రంలో ప్రతిష్టించిన పలు రకాల శివలింగాలను దర్శించుకున్న అనంతరం ఎంతో చక్కని అనుభూతి కలిగిందన్నారు. దైవ సంకల్పంతో కూడిన ఏదో తెలియని మహా శక్తి ఉంటే తప్ప ఇక్కడ భూగర్భ శివాలయ నిర్మాణం జరగదన్నారు. -
భర్త కిరాతకం
దేవరాపల్లి: భార్యపై భర్త అతి కిరాతకంగా హత్యాయత్నం చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. స్థానిక రామాలయం వీధిలో శుక్రవారం వేకువజామున జరిగిన ఈ ఘటనతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎస్ఐ టి.మల్లేశ్వరరావు కథనం ప్రకారం.. దేవరాపల్లికి చెందిన కోన రాము తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అతనికి 16 ఏళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన దేవితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు కుటుంబ పెద్దలు జోక్యం చేసుకొని సర్దిచెప్పారు. వీరిద్దరి మధ్య గురువారం రాత్రి మళ్లీ ఘర్షణ జరిగింది. భార్య గదిలో నిద్రపోగా భర్త ఇంటి వరండాలో పడుకున్నాడు. భార్యపై కక్ష పెంచుకున్న రాము శుక్రవారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న భార్య దేవిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఉలిక్కిపడి మేల్కొన్న దేవి తన భర్త దాడి నుంచి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో ఎడమ చేతి వేళ్లు కొన్ని తెగి పడిపోగా మెడ, కాళ్లు, పొట్ట తదితర శరీర భాగాలపై కత్తి గాట్లు ఉన్నాయి. భర్త కత్తితో దాడి చేసిన విషయాన్ని సోదరుడు కృష్ణకు ఫోన్ ద్వారా దేవి చెప్పడంతో వెంటనే వారి నివాసానికి వెళ్లాడు. రక్తపు మడుగులో ఉన్న అక్క దేవిని 108 వాహనంలో కె.కోటపాడు కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం, కేజీహెచ్కు తీసుకువెళ్లారు. ప్రస్తుతం దేవి కేజీహెచ్లో చికిత్స పొందుతోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కోన దేవి నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. ఆమె సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మల్లేశ్వరరావు తెలిపారు. భర్త రాము పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. భార్యపై కత్తితో హత్యాయత్నం తెగిపడిన చేతి వేళ్లు.. శరీరంపై తీవ్ర గాయాలు ప్రాణాపాయ స్థితిలో కేజీహెచ్లో చికిత్స పొందుతున్న మహిళ పరారీలో భర్త రాము.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు -
ఆన్!
ఆఫ్..ఇంజిన్ మీటర్● బండి షెడ్డులో ఉన్నా బిల్లు తీసేసుకుంటున్నారు ● మెకానికల్ విభాగంలో ఆయిల్ మాయ ● ప్రతీ నెలా రూ.లక్షన్నర మేర పక్కదారి ● అర్హత లేకపోయినా ఏఈ స్థాయిలో జీపు వినియోగం ● ఏడాది కాలంగా అడ్డగోలు వ్యవహారంసూత్రధారులు ఓ ఏఈ... మలేరియా అధికారి....! జీవీఎంసీలో జరుగుతున్న భారీ ఆయిల్ కుంభకోణంలో మరిన్ని షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆయిల్ మాయాజాలంలో ప్రధానంగా ఒక అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) తో పాటు ప్రజారోగ్య విభాగంలోని ఒక అధికారి, మలేరియా విభాగంలోని ఒక అధికారికి కీలక పాత్ర ఉందని విమర్శలున్నాయి. తిరగని వాహనాలకు సైతం ఆయిల్ బిల్లులు దోచేస్తున్న జీవీఎంసీ మెకానికల్ విభాగం అధికారులు, కార్డుల ద్వారా మాత్రమే ఆయిల్ జారీ చేయాలనే నిబంధనను ఉల్లంఘిస్తున్నారని తెలుస్తోంది. అయితే హైడ్రాలిక్ ఆయిల్ కోసం మాత్రం 20 లీటర్ల కూపన్లను అదనంగా ఇస్తున్నట్లు సమాచారం. ఇది కేవలం కాగితాలపై మాత్రమే జరుగుతున్న వ్యవహారం అని, నిజానికి ఆయిల్ దారి మళ్లుతోందని ఆరోపణలున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మెకానికల్ విభాగంలో భారీ ఎత్తున ఆర్థిక అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కనీసం రోడ్లపై తిరగని వాహనం పేరుతో కూడా ప్రతీ నెలా ఆయిల్ బిల్లు డ్రా అవుతోంది. ఏఈ స్థాయి అధికారి ఏకంగా రెండు జీపుల్లో తిరుగుతున్నట్టు లెక్కలు చూపి ప్రతీ నెలా రూ. లక్ష మేర ఆయిల్ బిల్లును నొక్కేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన గత ఏడాది కాలంగా ఈ వ్యవహారం సాగుతోంది. ఇక జీవీఎంసీ నుంచి ఎస్ఈ స్థాయి అధికారి బదిలీపై వెళ్లి.. తిరిగి ఇక్కడకు వచ్చే వరకూ ఆయనే వాహనాన్ని నడుపుతున్నట్టు మరీ దోపిడికి తెగబడుతున్నారు. ఇక ఫాగింగ్ మిషన్ల ఆయిల్ బిల్లు ఏకంగా ప్రతీ నెలా రూ. 30 లక్షల మేర అదనంగా పెంచేశారు. మొత్తంగా జీవీఎంసీ మెకానికల్ విభాగంలో మాత్రం వాహనంలో ముల్లు కదలకపోయినా ఆయిల్ బిల్లు మాత్రం లక్షలకు చేరుతోంది. ఏడాది కాలంగా...! జీవీఎంసీ మెకానికల్ విభాగంలో జరుగుతున్న ఈ అక్రమాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. తిరుగుతున్న వాహనాలకు మాత్రమే కాకుండా, షెడ్డులో మూలకు చేరిన వాహనాలు నడు స్తున్నట్లు లెక్కలు చూపిస్తూ ఆయిల్ బిల్లులు కాజేస్తున్నారు. ఉదాహరణకు, పెద్దగా వాడకంలో లేని రెండు జీపులతో పాటు, అసలు పనిచేయకుండా నిలిచిపోయిన ఒక టాటా సఫారీ వాహనం పేరుతో ప్రతినెలా రూ. 1.5 లక్షల ఆయిల్ బిల్లులు డ్రా అవుతున్నాయి. ఈ విధంగా గత ఏడాది కాలంగా ఆయిల్ దోపిడీ జరుగుతోందని సమాచారం. అంటే, వాహనం ఆన్లో లేకపోయినా, జీవీఎంసీ మెకానికల్ విభాగంలోని కొందరు అధికారులు డీజిల్ బిల్లు మీటర్ను మాత్రం ఆన్లోనే ఉంచుతున్నారన్నమాట. నిబంధనలకు విరుద్ధంగా.. నిబంధనల ప్రకారం జీవీఎంసీలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) స్థాయి అధికారికి ఎటువంటి వాహనం కేటాయించరు. కేవలం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈ) స్థాయి అధికారి నుంచే వాహనాలను కేటాయిస్తారు. అయినప్పటికీ ఏడాది కాలంగా మెకానికల్ విభాగంలోని ఒక ఏఈ ఏకంగా రెండు వాహనాలను ఉపయోగిస్తూ, ప్రతినెలా ఆయిల్ బిల్లుల రూపంలో లక్ష రూపాయల వరకూ కాజేస్తున్నారని విమర్శలున్నాయి. హైడ్రాలిక్ ఆయిల్, ఫాగింగ్ మిషన్ల పేరుతోనూ అక్రమాలు హైడ్రాలిక్ ఆయిల్ కూపన్ల విధానాన్ని రద్దు చేసినప్పటికీ, ఒక్కో వాహనానికి 20 లీటర్ల చొప్పున కూపన్లను రోజువారీగా అదనంగా జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. హైడ్రాలిక్ ఆయిల్ లీటరు ధర రూ. 350 పైచిలుకు పలుకుతుంది. ఇక, ఫాగింగ్ మిషన్లు, స్ప్రింక్లర్లకు ఆయిల్ బిల్లులను అమాంతంగా రెట్టింపు చేయడంతో నెలకు రూ. 30 లక్షల మేర ప్రజాధనం పక్కదారి పడుతోంది. మొత్తంగా చూస్తే, జీవీఎంసీ మెకానికల్ విభాగంలో అవకాశం దొరికిన ప్రతిచోటా ఆయిల్ దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శలున్నాయి. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఫాగింగ్ మిషన్ల పేరుతో నెలకు రూ. 30 లక్షల అదనపు దోపిడీ ఇక ఫాగింగ్ మిషన్ల పేరుతో నెలకు అదనంగా రూ. 30 లక్షల మేర ప్రజాధనం కాజేస్తున్నట్లు విమర్శలున్నాయి. జీవీఎంసీలో 8 పెద్ద ఫాగింగ్ మిషన్లు, 80 మీడియం సైజు ఫాగింగ్ మిషన్లు, 25 స్ప్రింక్లర్లు ఉన్నాయి. వీటికి గతంలో ప్రతినెలా రూ.38 లక్షల మేర ఆయిల్ బిల్లులు చెల్లించేవారు. అయితే, డిప్యూటేషన్పై వచ్చిన ఇద్దరు అధికారులు మెకానికల్ విభాగంతో కుదుర్చుకున్న ‘మామూళ్ల ఒప్పందంలో’ భాగంగా ఈ బిల్లును ఏకంగా రూ. 68 లక్షలకు పెంచేశారు. ఈ అక్రమ ఒప్పందానికి ప్రతిఫలంగా, ప్రజారోగ్య విభాగంలోని ఒక అధికారికి, మలేరియా విభాగానికి చెందిన మరో అధికారికి చెరో రూ. 2 లక్షల చొప్పున ప్రతి నెలా ముట్టచెప్పే విధంగా ఒప్పందం కుదిరిందని ఆరోపణలున్నాయి. ప్రతినెలా ఈ ‘మామూళ్ల పంపకంలో’ మలేరియా విభాగంలోని ఒక అధికారిదే కీలక పాత్ర అని తెలుస్తోంది. పూర్తిస్థాయి విచారణ ఈ ఆరోపణలపై మెకానికల్ విభాగం ఈఈ రత్నాకర్ రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా గత 10 రోజులుగా జీపులకు ఆయిల్ బిల్లులను నిలిపివేశామని తెలిపారు. అయితే ఈ ఆయిల్ కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారం జీవీఎంసీ పరిపాలనలో పారదర్శకత లేకపోవడాన్ని, అవినీతి ఏ స్థాయిలో పాతుకుపోయిందో స్పష్టం చేస్తోంది. బదిలీ అయిన తరువాత కూడా.. ఇంకో విచిత్రమైన సంఘటన ఏమిటంటే, ఒక ఎస్ఈ స్థాయి అధికారి జీవీఎంసీలో పనిచేసి కాకినాడకు బదిలీపై వెళ్లిన తర్వాత ఆరు నెలల పాటు తిరిగి జీవీఎంసీకి వచ్చే వరకు ఆయన పేరు మీద ఉన్న వాహనాన్ని మాత్రం వెనక్కి తీసుకోలేదు. అంటే, ఆరు నెలల పాటు అక్కడ విధులు నిర్వర్తించని అధికారి పేరుతో వాహనాన్ని నడుపుతున్నారన్నమాట. మరో టాటా సఫారీ వాహనాన్ని కూడా ఇంకో అధికారి వినియోగిస్తున్నారని, గత రెండు నెలలుగా ఆయిల్ బిల్లులను భారీగా డ్రా చేస్తున్నారని ఆరోపణలున్నాయి. -
● దారి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు నకిలీ పోలీసుల అరెస్ట్ ● అడవివరం–శొంఠ్యాం రోడ్డులో కాపుకాసి బలవంతంగా వసూళ్లు ● బాధితుడి ఫిర్యాదుతో చాకచక్యంగా పట్టుకున్న పెందుర్తి పోలీసులు ● నిందితుల్లో ఒకరు తొలగించిన పోలీస్ కానిస్టేబుల్
పెందుర్తి: అడవివరం–శొంఠ్యాం రోడ్డులో ప్రేమ జంటలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు నకిలీ పోలీసులను పెందుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను పెందుర్తి పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ కె.వి.సతీష్కుమార్ వెల్లడించారు. విజయనగరం జిల్లా ధర్మవరం మండలం మామిడిపాలేనికి చెందిన ఏతలపాక శివప్రసాద్, నగరంలోని రైల్వే న్యూకాలనీలో నివాసం ఉంటున్న కదరాపు గోపీతో కలిసి దారి దోపిడిలు చేయడం వృత్తిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీస్ కానిస్టేబుల్ యూనిఫాంలు ధరించి అడవివరం–శొంఠ్యాం రోడ్డులో ఈ నెల 3 నుంచి 6 వరకు మాటు వేశారు. రోజూ పొద్దుపోయాక అటుగా వెళ్తున్న ప్రేమ జంటలను గమనించేవారు. వారు ఎక్కడైనా బైక్లు నిలిపి మాట్లాడుకోవడం, లేదా అనుమానం కలిగేలా ప్రవర్తించడం చూసి వారి వద్దకు వెళ్లి, బెదిరింపులకు దిగేవారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న కోరాడ జయరాం అనే వ్యక్తి గాజువాక నుంచి బైక్పై తనకు కాబోయే భార్యతో కలిసి విజయనగరం వెళ్తున్నాడు. సరిగ్గా అడవివరం భైరవకోన దాటాక వారిని అడ్డగించిన శివప్రసాద్, గోపి తాము పోలీసులమని చెప్పి బెదిరింపులకు దిగారు. నగదు ఇస్తే వదిలేస్తామని, లేదంటే కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తామని భయపెట్టారు. అయితే నగదు లేదని, ఫోన్పే ద్వారా ఇస్తానని చెప్పడంతో నిందితుడు శివప్రసాద్ తన వద్ద ఉన్న ఫోన్పే క్యూఆర్ కోడ్ ద్వారా రూ.5 వేలు నగదు బదిలీ చేయించుకున్నాడు. వీరి తీరుపై అనుమానం వచ్చిన జయరాం అదే రోజు రాత్రి విశాఖ సీపీకి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశాడు. పది జంటల నుంచి వసూళ్లు ఈ నెల 3 నుంచి 6 వరకు దాదాపు పది జంటల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రూ.2 వేలు నగదు, స్కూటీ, రెండు సెల్ఫోన్లతో పాటు రెండు పోలీస్ యూనిఫాంలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు శివప్రసాద్ గతంలో ఏపీఎస్పీ 5వ బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేసేవాడని, అతడి అనుచిత ప్రవర్తన కారణంగా 2019లో ఉద్యోగం నుంచి తొలగించినట్లు సీఐ తెలిపారు. శివప్రసాద్పై దోపిడి, దొంగతనం కేసులు 15 ఉండగా, అందులో 9 దోపిడీ కేసులు పెందుర్తి పోలీస్ స్టేషన్లోనే ఉన్నాయన్నారు. నిందితులిద్దరిని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ సతీష్కుమార్, ఎస్ఐ సీహెచ్ స్వామినాయుడు, హెచ్సీ గెదెల అప్పారావు, పీసీలు రొంగలి సంతోష్కుమార్, ప్రగడ గణేశ్వరరావు, గాదె శంకర్రావులను ఉన్నతాధికారులు అభినందించారు. -
చిన్నారులకు ఆటపాటలతో బోధన అవసరం
అనకాపల్లి: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో బోధన అవసరమని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. స్థానిక వేల్పులవీధి అంగన్వాడీ కేంద్రంలో గురువారం మన అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 52 మంది చిన్నారులకు సాముహిక అక్షరాభాస్యాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రులు ఆస్తిపాస్తులే కాకుండా మంచి విద్యను అందించడానికి కృషి చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ బాల్య ఆరంభ దశలో పిల్లలను తీర్చి దిద్దడంలో అంగన్వాడీ కార్యకర్త పాత్ర ఎంతో కీలకమైందన్నారు. సీ్త్ర శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎన్.సూర్యలక్ష్మి మాట్లాడుతూ ప్రీస్కూల్ కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీ వరకూ జిల్లాలో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. అనంతరం ప్రాథమిక విద్యను పూర్తి చేసిన 5 సంతవ్సరాల చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి, పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో పి.ప్రభావతి, ప్రాజెక్టు సూపర్వైజర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో సుపరిపాలన అనకాపల్లి టౌన్: బీజేపీ 11 సంవత్సరాల సుపరిపాలనలో ప్రధాని మోదీ సారథ్యంలో భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిందని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. స్థానిక ఎంపీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశం అంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ద్వారపూడి పరమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఉక్కు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని వినతి
తుమ్మపాల: తొలగించిన స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజాన దొరబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని డీఆర్వో వై.సత్యనారాయణరావుకు వినతిపత్రం అందించి కార్మికుల సమస్యలను వివరించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ చర్చల్లో ఎట్టి పరిస్థితిలోని కాంట్రాక్ట్ కార్మికులను తొలగించమని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా తొలగించడం బాధాకరమన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ సమ్మె చేస్తే యాజమాన్యం వేధిస్తుందని ఆరోపించారు. కార్మికులను తొలగించడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు కె.త్రినాథ్, కోరిబిల్లి శంకరరావు, సిహెచ్.రమణ, ఫణీంద్ర, సత్యనారాయణ పాల్గొన్నారు. -
బాల కార్మికుల వ్యవస్థపై అవగాహన ర్యాలీ
అనకాపల్లి: ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని అనకాపల్లిలో గురువారం ఘనంగా నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంఘం ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం, న్యాయ శాస్త్ర విజ్ఞానంపై అవగాహన కలిగిస్తూ ర్యాలీ జరిపారు. ప్రిన్సిపాల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జి.ధర్మారావు మాట్లాడుతూ 18 ఏళ్లలోపు బాల కార్మికులు పాఠశాలలో చేరి చదువుకుని విద్యావంతులు కావాలని కోరారు. ఈ సందర్భంగా న్యాయ శాస్త్ర విజ్ఞానంపై అవగాహన కల్పించారు. జిల్లా కార్మిక శాఖ అధికారి నరేంద్ర, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నిరుద్యోగ భృతి ఎక్కడ..?
● విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ ఎప్పుడు? ● కూటమి పాలనలో పెరిగిపోయిన నిరుద్యోగం ● వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేతల ధ్వజం అనకాపల్లి: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజల నడ్డి విరిచిందని, తల్లికి వందనం పథకం రెండో ఏడాది కూడా అమలు చేసే పరిస్థితి కనబడడం లేదని, నిరుద్యోగు భృతి ఎప్పుడు ఇస్తారో సీఎం చంద్రబాబుకే అర్థం కావడం లేదని వైఎస్సార్సీపీ జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్ అన్నారు. స్థానిక రింగ్రోడ్డు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ క్యాంపు కార్యాలయంలో గురువారం పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఏడాది అవుతున్నప్పటికీ సీఎం చంద్రబాబు ముఖం చాటేస్తున్నారని అన్నారు. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తామని ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. మంత్రి నారా లోకేష్ ఎన్నికల సమయంలో ప్రతి ఏడాది జనవరి 1వ తేదీన నిరుద్యోగులకు జాబ్ క్యాలండర్ ఇస్తామన్న హామీ బుట్టదాఖలైందన్నారు. యువగళం పేరుతో రాష్ట్రంలో ఉన్న యువతను మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వ వచ్చాక జనసేన అధినేత పవన్ కల్యాణ్కు డిప్యూటీ సీఎం, నారా లోకేష్కు మంత్రి పదవులు వచ్చాయి తప్ప రాష్ట్రంలో నిరుద్యోగులకు దక్కింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో అనేక స్కీమ్లు అమలు చేస్తే కూటమి ప్రభుత్వంలో స్కామ్ల పాలన సాగుతుందన్నారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలిశెట్టి సురేష్ మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనలో ఉన్న ఉద్యోగాలను తీసివేయడం జరిగిందని, దీంతో నిరుద్యోగ సమస్య మరింత పెరిగిపోయిందన్నారు. ఉద్యోగులకు ఇవ్వవలసిన బకాయిలు కూడా నేటికీ చెల్లించకపోవడం అన్యాయమన్నారు. నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్ మాట్లాడుతూ ఏడాది చంద్రబాబు పాలన కంటే మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డికే ఎక్కువగా జనం మద్దతు పలుకుతున్నారని, ఇటీవల పొదిలిలో జరిగిన సభలో ప్రజాస్పందన చూస్తే అర్థమవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మలసాల కుమార్రాజా, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్, మండల యువజ విభాగం అధ్యక్షుడు బాదపు హరికృష్ణ, కశింకోట మండలపార్టీ అధ్యక్షుడు నీటిపల్లి దివాకర్, పార్టీ సీనియర్ నాయకులు మరిపల్లి శోభ, కోన ఉమా, శ్రీకాంత్, డానీ, దాడి నారాయణరావు, కొంకి శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు. -
వేతనాల కోసం విమ్స్ వైద్యుల ధర్నా
ఆరిలోవ: విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్యులు గురువారం ధర్నా చేపట్టారు. తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు కాంట్రాక్ట్ వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి విమ్స్ ఆవరణలోని అవుట్ పేషెంట్ విభాగం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అప్పలనాయుడు, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ హారిక తదితర వైద్యులు మాట్లాడారు. తాము రూ. 92,000 జీతంతో కాంట్రాక్ట్ పద్ధతిలో విమ్స్లో చేరి మూడేళ్లు పూర్తయిందని, కానీ ఇప్పటివరకు తమ వేతనాలు పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విభాగాల్లో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం గతంలో వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు స్పందించలేదని వైద్యులు ఆరోపించారు. తమ వేతనాలను రూ.1.60 లక్షలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. వైద్యులు ధర్నా చేసిన రెండు గంటల పాటు రోగులకు వైద్య సేవలు అందక ఇబ్బందులు పడ్డారు. -
మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారమివ్వాలి
మహారాణిపేట: పరవాడలోని జేఎన్ ఫార్మాసిటీలో ఉన్న ఎస్ఎస్ ఫార్మా గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన పరిమి చంద్రశేఖర్(తెలంగాణ), శరగడం కుమార్(మునగపాక) కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. కేజీహెచ్ మార్చురీ వద్ద మృతుల కుటుంబాలను గురువారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ విశాఖ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఎసెన్షియా ఫార్మా తదితర కంపెనీల్లో జరిగిన ప్రమాదాల్లో చాలా మంది మరణించారని పేర్కొన్నారు. కంపెనీల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎప్పటికప్పుడు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని తెలిపా రు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఏడాది కాలంలో ఇన్ని ప్రమాదాలు ఎప్పుడూ జరగలేదన్నారు. గతంలో జరిగిన ప్రమాదంలో ఎలా నష్ట పరిహారం ఇచ్చారో అలాగే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అనకాపల్లి అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ -
కార్పొరేట్ స్కూళ్ల దోపిడీని అరికట్టండి
డీఈవో కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ నేతల ఫిర్యాదుయలమంచిలి రూరల్/అనకాపల్లి: జిల్లాలో వివిధ కార్పొరేట్ స్కూళ్ల దోపిడీని అరికట్టాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా అధ్యక్షుడు మైలపల్లి బాలాజీ డిమాండ్ చేశారు. గురువారం యలమంచిలి కోర్టుపేటలోని కార్పొరేట్ పాఠశాలలో ప్రత్యేక కౌంటర్ ద్వారా చేపడుతున్న పుస్తకాల విక్రయాన్ని ఎస్ఎఫ్ఐ నేతలు పరిశీలించి, నిర్వాహకులను ప్రశ్నించారు. అధిక ధరలకు పుస్తకాలను విక్రయిస్తూ, విద్యా సంస్థ పేరును పుస్తకాలు, క్యారీ బ్యాగులపై ముద్రించారని, అన్ని నిబంధనలు అతిక్రమిస్తున్నా జిల్లా విద్య, వాణిజ్య పన్నుల శాఖాధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వారు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అధిక ఫీజులను వసూలు చేయడంతోపాటు, పుస్తకాలు, యూనిఫాం, ఇతర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తూ తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్న ఆయా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డీఈవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మణికంఠ, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
కొత్తగా కళ్లు తెరిచెనే.!
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో రెండు జంతువుల పిల్లలు సందడి చేస్తున్నాయి. ఇటీవల గర్భం దాల్చిన రెడ్–నెక్డ్ వాలబీ, మౌస్ డీర్ ఒక్కో పిల్లకు జన్మనిచ్చాయి. ప్రస్తుతం తల్లీపిల్లలు రెండూ ఆరోగ్యంగా ఉన్నాయి. మౌస్ డీర్ పిల్ల తన తల్లితో కలిసి ఎన్క్లోజర్లో చురుకుగా తిరుగుతూ సందర్శకులకు కనువిందు చేస్తోంది. మరోవైపు రెడ్–నెక్డ్ వాలబీ పిల్ల ఇంకా తన తల్లి పొట్టభాగంలోని సంచిలోనే సురక్షితంగా ఉంది. సాధారణంగా రెడ్–నెక్డ్ వాలబీ గర్భం దాల్చిన 30 రోజుల్లోనే పిల్లకు జన్మనిస్తుంది. పుట్టినప్పటి నుంచి ఆ పిల్ల సుమారు ఏడు నెలల పాటు తల్లి సంచిలోనే ఉండి పాలు తాగుతూ పెరుగుతుంది. దాదాపు 12 నెలల వయసు వచ్చాక పూర్తిగా బయటకు వచ్చి స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తుంది. ఈ రెండు పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని జూ క్యూరేటర్ మంగమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. జూలో జంతువుల పునరుత్పత్తి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, కొన్ని నెలల కిందట కూడా పలు జంతువులు పిల్లలకు జన్మనిచ్చాయని ఆమె పేర్కొన్నారు. జూ సంరక్షకులు వాటికి నిరంతరం ప్రత్యేక సేవలు అందిస్తున్నారని వివరించారు. -
రైల్వే ఆస్పత్రిలో ఆధునిక పరికరాల ప్రారంభం
తాటిచెట్లపాలెం: ఈస్ట్కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్, డివిజనల్ రైల్వే ఆస్పత్రిలో రైల్వే ఉద్యోగులు, సిబ్బంది సౌకర్యార్థం అధునాతన పరికరాలను డీఆర్ఎం లలిత్ బోరా గురువారం ప్రారంభించారు. ఫిజియోథెరపీ యూనిట్లో ఇథైలిన్ ఆకై ్సడ్ స్టెరిలైజర్, అడ్వాన్స్డ్ లేజర్ మెషీన్లను ఆయనతోపాటు, ఈకార్వో ప్రెసిడెంట్ జ్యోత్స్న బోరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అధునాతన పరికరాల సాయంతో రైల్వే ఉద్యోగులకు మరింత సుఖవంతమైన, శ్రేయస్కరమైన వైద్యసదుపాయాలను అందించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ డి.శరత్బాబు, ఏడీఆర్ఎం(ఇన్ఫ్రా) ఇ.శాంతారాం, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అనకాపల్లి ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్గా గౌరీ
గోవాడ సుగర్స్ ఎండీగా వెంకటేశ్వరరావు చోడవరం: గోవాడ సహకార చక్కెర కర్మాగారం మేనేజింగ్ డైరెక్టర్గా వెంకటేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఏటి కొప్పాక ఎండీగా పనిచేస్తున్న ఆయనను తాజాగా ప్రభుత్వం గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి బదిలీ చేసింది. ఇక్కడ ఎండీగా పని చేసిన వి.వి. సన్యాసిరావును భీమసింగి సుగర్ ఫ్యాక్టరీకి బదిలీ చేశారు. అనకాపల్లి: ప్రజా రవాణాశాఖ జిల్లా అధికారి కె.పద్మావతి సాధారణ బదిలీల్లో భాగంగా విశాఖ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్గా వెళ్లడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఈ పోస్టు ఖాళీగా ఉంది. ప్రజా రవాణాశాఖ(ఆర్టీసీ) అనకాపల్లి డిపోలో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న రవిచంద్ర విజయవాడ ప్రజా రవాణాశాఖ ప్రధాన కార్యాలయానికి (అపరేషన్ విభాగంలో) బదిలీపై వెళ్లారు. ఇక్కడకు విశాఖ వాల్తేరు డిపోలో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న గౌరి ఈనెల 16న బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు ఆమె చెప్పారు. -
ఉలికిపాటు
● ఎస్ఎస్ ఫార్మా గ్యాస్ లీక్ ఘటనతో కలకలం ● గత ప్రమాదాల నుంచి నేర్చుకోని యాజమాన్యం ● ప్రభుత్వ ఉదాసీనతే కారణమన్న ఆరోపణలుపరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో జరుగుతున్న వరుస ప్రమాదాలతో ఫార్మా ఉద్యోగులు, కార్మికులు ఉలికి పడుతున్నారు. తరచూ ఫార్మా పరిశ్రమల్లో చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు, గ్యాస్ లీక్ ఘటనలతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎస్ఎస్ ఫార్మా పరిశ్రమలో సాల్వెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లో గురువారం తెల్లవారు జామున జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో పరిశ్రమలో సేఫ్టీ మేనేజర్గా పనిచేస్తున్న హైదరాబాద్కు చెందిన పరిమి చంద్రశేఖర్(32), షిప్ట్ సేఫ్టీ ఆఫీసర్గా పనిచేస్తున్న అనకాపల్లి జిల్లా మునగపాకకు చెందిన శరగడం కుమార్(25) మృత్యువాత పడ్డారు. హెల్పర్గా పనిచేస్తున్న ఒడిశాకు చెందిన బైడు బైసాల్(37) ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వరుస ప్రమాదాలతో భయాందోళన ● గతంలో సినర్జీన్ యాక్టివ్ పరిశ్రమలో జరిగిన బాయిలర్ పేలుడు ఘటనలో జార్ఖండ్కు చెందిన ముగ్గురు, ఒడిశాకు చెందిన ఒకరు, విజయనగరానికి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ● రక్షిత్ డ్రగ్స్ ఫార్మాలో గత డిసెంబర్లో ప్రొడక్షన్ బ్లాక్లో హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ లీకై న ఘటనలో కాంట్రాక్టు కార్మికులు దేవిబాగ్, ఉగ్రేసర్గౌడ్లు అస్వస్థతకు గురయ్యారు. ● గత ఏప్రిల్లో అపిటోరియా పరిశ్రమ యూనిట్–6లో నైట్రోజన్ గ్యాస్ పీల్చడంతో విజయనగరం జిల్లా గంట్యాడ మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఆళ్ల గోవింద్ మృతి చెందాడు. ● ఆల్కలీ మెటల్ ఫార్మా పరిశ్రమలో ఏప్రిల్లో జరిగిన మరో ఘటనలో మిథైల్ నైట్రేట్ గ్యాస్ లీకై విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గొల్లపేటకు చెందిన సీహెచ్ రమణ(32) మృతి చెందాడు. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ● అదే నెలలో ఠాగూర్ లేబొరేటరీస్ పరిశ్రమలో రియాక్టర్ను శుభ్రం చేస్తున్న క్రమంలో రియాక్టర్ వాల్వ్ నుంచి విడుదలైన విషవాయువును పీల్చడం వల్ల కె.సింహచలం అనే కాంట్రాక్టు కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ● మెట్రెకమ్ పరిశ్రమలో ఖాళీ రసాయన డబ్బాలు, వ్యర్థాల వల్ల ప్రమాదం నెలకొంది. యాజమాన్యం వెంటనే స్పందించడంతో కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. -
వేటకు వేళాయె
● రేపు అర్ధరాత్రి నుంచి సముద్రంలో చేపల వేట ● బోట్లను సిద్ధం చేస్తున్న మత్స్యకారులు మహారాణిపేట: మత్స్యకారులు వేటకు సిద్ధమవుతున్నారు. హార్బర్ మళ్లీ కళకళలాడనుంది. రాష్ట్ర ప్రభుత్వం విధించిన వేట నిషేధం గడువు శనివారంతో ముగియనుంది. శనివారం అర్ధరాత్రి నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ బోసిపోయిన విశాఖ ఫిషింగ్ హార్బర్ మళ్లీ సందడిగా మారనుంది. ఏప్రిల్ 15న వేట నిషేధం అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విరామ సమయంలో మత్స్యకారులు తమ పడవలకు, వలలకు మరమ్మతులు పూర్తి చేశారు. ఇంజిన్లు, గేర్ బాక్సులు, పంఖాలు వంటి కీలక భాగాలను బాగు చేయించుకుని బోట్లను వేటకు సిద్ధం చేశారు. గంగమ్మ తల్లికి పూజలు ప్రతి ఏటా వేట ప్రారంభానికి ముందు గంగమ్మ తల్లిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా వేటలో ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా, గంగమ్మ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ నెల 10న హార్బర్లో అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. అమ్మవారికి పసుపు, కుంకుమలతో మొక్కులు చెల్లించుకున్నట్లు రాష్ట్ర మరపడవల సంఘం మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు వాసుపల్లి జానకీరామ్ తెలిపారు. కాగా.. ఈ నెల 15 నుంచి మత్స్యకారులు తిరిగి వేట ప్రారంభించవచ్చని మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి.లక్ష్మణరావు తెలిపారు. అయితే వేటకు వెళ్లేటప్పుడు భద్రతా ప్రమాణాలను విధిగా పాటించాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని, తగిన జాగ్రత్తలతో వేట సాగించాలని కోరారు. వేటపైనే జీవనాధారం జిల్లాలో 65 కిలోమీటర్ల తీరప్రాంతంలో ఉన్న 32 మత్స్యకార గ్రామాల్లో సుమారు 1.15 లక్షల కుటుంబాలు మత్స్యకార వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,547 మర, మోటారు, సంప్రదాయ పడవలు ఉన్నాయి. ఒక్క విశాఖ ఫిషింగ్ హార్బర్పైనే ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ 61 రోజుల విరామం వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు వేట తిరిగి ప్రారంభం కానుండటంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. -
మునగపాకలో తీరని విషాదం
మునగపాక: కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తాడనుకున్న కుమారుడు ఫార్మా ప్రమాదంలో మృతి చెందడంతో మునగపాకలో విషాదం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మునగపాక మధ్య వీధిలో నివాసం ఉంటున్న శరగడం కుమార్(25)కు గత సంవత్సర క్రితం వివాహం జరిగింది. కుమార్ 8 నెలల క్రితం పరవాడలోని ఎస్ఎస్ ఫార్మాలో సేప్టీ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ వచ్చాడు. ఈ నెల 11న రాత్రి విధి నిర్వహణలో ఉండగా వెలువడిన విష వాయువులను పీల్చడంతో కుమార్ అస్వస్థతకు గురవడంతో వెంటనే అతనిని విశాఖ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కుమార్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మునగపాక గ్రామంలో విషాదం నెలకొంది. కుమార్ తండ్రి రామకృష్ణ గత 7 సంవత్సరాల క్రితం మృతి చెందగా తల్లి లక్ష్మి నాలుగు నెలల క్రితం చనిపోయింది. కుమార్ తమ్ముడు సౌత్ ఆఫ్రికాలో ఉద్యోగం చేస్తున్నాడు. భర్త కుమార్ మృతి చెందాడన్న విషయం తెలియడంతో భార్య మాధురి కన్నీటిపర్యంతమైంది. ఎంతో భవిష్యత్ ఉన్న కుమార్ ఫార్మా ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబానికి పెద్ద దిక్కు ఎవరంటూ ఆవేదన చెందుతున్నారు. అందరితో సఖ్యతగా ఉండే కుమార్ ఫార్మా ప్రమాదంలో మృతి చెందడాన్ని స్థానికులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా మృతుడు కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని కంపెనీ యాజమాన్యంతో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్, కర్రి సాయికృష్ణ, పెంటకోట విజయ్ తదితరులు చర్చలు జరిపారు. కుమార్ అంత్యక్రియలు శనివారం మునగపాకలో నిర్వహించనున్నారు. -
సమస్యల గంట
బడిలోతెరుచుకున్న పాఠశాలలు..అసౌకర్యాలతో స్వాగతం ● పాఠ్య పుస్తకాలతో సరి ● అరకొరగా స్టూడెంట్ కిట్ల పంపిణీ ● తొలి రోజు మూడొంతులు తగ్గిన విద్యార్థుల హాజరు శాతం ● విద్యార్థుల కోసం తల్లికి వందనం పేరిట హడావుడి అనకాపల్లి టౌన్ గర్ల్స్ హైస్కూల్ ఆవరణలో నిలిచిపోయిన వర్షపు నీరు అసంపూర్తిగా తరగతులు, టాయిలెట్ల నిర్మాణాలు కొన్ని స్కూళ్లలో తరగతి భవనాలు, టాయిలెట్ల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచి దర్శనమిచ్చాయి. మరికొన్ని చోట్ల స్కూళ్ల ఆవరణలో ఆటస్థలాల్లో తుప్పలు, చెత్త చెదారం పేరుకుపోయాయి. జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారి ఎస్జీటీ కౌన్సెలింగ్లో మూడు రోజులుగా బిజిబిజీగా ఉన్నారు. జిల్లా ఉన్నతాధికారుల నుంచి ప్రజా ప్రతినిధులు వరకూ యోగా వేడుకల్లో ఉండడంతో తొలిరోజు స్కూళ్లు మొక్కుబడిగా నడిచాయి. మాడుగుల మండలంలో ఎం.కోడూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఒకే ఒక్క విద్యార్థి కొత్తగా చేరారు. సాక్షి, అనకాపల్లి: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ గురువారం తెరుచుకొన్నాయి. ప్రారంభం రోజునే వి ద్యార్థులకు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అసౌకర్యా లు స్వాగతం పలికాయి. విద్యార్థుల నమోదు శాతం గణనీయంగా తగ్గింది. మూడొంతుల హాజరు శాతం తగ్గుముఖం పట్టింది. కొత్త విద్యార్థుల చేరిక అరకొరగానే జరిగింది. ‘తల్లికి వందనం’ ఇచ్చేస్తున్నామని కూటమి ప్రభుత్వం హడావుడి చేసి విద్యార్థులను పాఠశాలలకు రప్పించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం ఇవ్వలేదు. పాఠశాలల ప్రారంభమైన తొలి రోజు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వి ద్యార్థుల హాజరు గణనీయంగా తగ్గిపోవడంతో వి ద్యార్థులు మళ్లీ ప్రైవేట్ స్కూళ్ల వైపు మరలుతున్న ఛా యలు కనిపిస్తున్నాయి. అసౌకర్యాలు నిండిన ప్రభు త్వ పాఠశాలల్లో రెక్కలు విరిగిపోయిన ఫ్యాన్లు, పాఠశాల ఆవరణలో బురద, నిల్వ ఉన్న వర్షం నీరుతో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికాయి. అరకొరగా స్టూడెంట్ కిట్లు... జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో తొలి రోజు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. గాజువాకలో గల బుక్ డిపో నుంచి అనకాపల్లి జిల్లాలోగల వివిధ ప్రభుత్వ పాఠశాలలకు తరలించారు. జిల్లాలో మొత్తం 5,13,887 పుస్తకాలు అవసరం ఉంది. వంద శాతం 5,13,887 పాఠ్యపుస్తకాలు సరఫరా చేశారు. అయితే స్టూడెంట్ కిట్లో యూనిఫాం, బ్యాగ్లు సగం మాత్రమే వచ్చాయి. వచ్చిన సగం కూడా ఎవరికీ ఇవ్వలేదు. టై, బెల్టు, షూ రానేలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాలలు తెరిచిన రోజునే జగనన్న విద్యాకానుక (స్టూడెంట్ కిట్) ద్వారా విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, టై, బెల్టు, షూ తదితర సామగ్రి అందజేస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత నుంచి గతేడాది అరకొరగానే కిట్లు పంపిణీ చేసినా..ఈ ఏడాదైనా పూర్తిస్థాయిలో ఇస్తారేమో అని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశ నిరాశగానే మిగిలిపోయింది.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా ఒక్కో విద్యార్థికి అమ్మ ఒడి పధకం కింద రూ, 15 వేలు నగదు అందేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత తల్లికి వందనం ఎంత మంది విద్యార్థులుంటే అంత మందికి ఏడాదికి రూ. 15 వేలు అందిస్తామన్నా గత ఏడాది ఒక్కరికీ ఇవ్వలేదు. తొలి రోజు 39 శాతం హాజరు.. పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి మండలంలో 7,584 మంది విద్యార్థులకు గానూ 1936 మంది హాజరయ్యారు. ఎస్.రాయవరం మండలంలో 7704 మంది విద్యార్థులకు 2767 మంది విద్యార్థులు హాజరయ్యారు. పాయకరావుపేట మండలంలో 4562 మంది విద్యార్థులకు 1070 మంది హాజరయ్యారు. చోడవరం నియోజకవర్గం బుచ్చెయ్యపేట మండలంలో 3,714 మంది విద్యార్థులకు 1308 మంది, రోలుగుంట మండల పరిధిలో 2387 మంది విద్యార్థులకు 1910 మంది, అలాగే చోడవరం మండల పరిధిలో 4542 మంది విద్యార్థులు, రావికమతం మండల పరిధిలో 5230 మంది విద్యార్థులు హాజరయ్యారు. యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండల పరిధిలో గల ప్రభుత్వ స్కూళ్లలో 5184 మంది విద్యార్థులకు 4092 మంది హాజరయ్యారు యలమంచిలి మండల పరిధిలో 3,916 మందికి 2,867 మంది, రాంబిల్లి మండల పరిఽధిలో సుమారుగా 2,300 మంది, అచ్యుతాపురం మండల పరిధిలో 4,000 మంది హాజరయ్యారు. నర్సీపట్నం నియోజకవర్గంలో మాకవరపాలెం మండలంలో 2904 మంది విద్యార్థులకు 2576 మంది, నర్సీపట్నం మండల రూరల్, టౌన్ పరిధిలో 19 వేల మందికి 1700 మంది, గొలుగొండ మండల పరిధిలో 4024 మందికి 1100 మంది విద్యార్థులు, నాతవరం 4,900 మంది విద్యార్థులకు 2,500 మంది వరకూ హాజరయ్యారు. అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి మండల రూరల్, టౌన్ పరిధిలో 9 వేల మంది విద్యార్థులకు 5 వేల మంది, కశింకోట మండల పరిధిలో 3800 మందికి 1400 మంది హాజరయ్యారు. మాడుగుల నియోజకవర్గం మాడుగుల మండల పరిధిలో 5,212 మందికి 4,800 మంది, దేవరాపల్లి మండలం 4,308మందికి 3,366, కె.కోటపాడు మండల పరిధిలో 2343 మందికి 1205 మంది విద్యార్థులు హాజరవగా, చీడికాడ మండల పరిధిలో 1525 మంది విద్యార్థులు హాజరయ్యారు. సబ్బవరం మండలంలో 2,556 మందికి, 1989, పరవాడ మండలంలో 3,466 మందికి 1075 మంది హాజరయ్యారు. -
ఇది హృదయ విదారక ఘటన
విమాన ప్రమాద మృతులకు మాజీ మంత్రి అమర్నాథ్ సంతాపంసాక్షి, విశాఖపట్నం: అహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని.. ఇది తమను ఎంతో బాధించిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ నేతలు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబీకుల దుఃఖాన్ని ఊహించడం కష్టమని.. అందరికీ తట్టుకునే బలాన్ని, ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, ముఖ్య నేతలు పేర్ల విజయచందర్, రవిరెడ్డి, బోని శివరామకృష్ణ, అల్లంపల్లి రాజబాబు, పీతల గోవింద్ తదితరులు సంతాపం తెలిపారు. -
సీఆర్ఎంటీలకు కలవరం
● వీరిని బోధన నుంచి దూరం చేస్తున్న విద్యాశాఖ ● 2012 నుంచి సేవలందిస్తున్న రిజర్వ్ మొబైల్ టీచర్లు ● క్లస్టర్ లెవెల్ అకడమిక్ టీచర్స్ విధానాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నర్సీపట్నం: రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లకు (సీఆర్ఎంటీలు) శాపంగా మారాయి. బదిలీలు, ప్రమోషన్లు చేయగా మిగిలిన ఉపాధ్యాయులను క్లస్టర్ లెవెల్ అకడమిక్ టీచర్లుగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుండడంతో సీఆర్ఎంటీలు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం సీఆర్ఎంటీల సేవలకు పెద్దపీట వేసింది. 2012 నుంచి విధులు నిర్వర్తిస్తున్న వీరి సేవలను బోధనకు ఉపయోగించుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీవో నెంబరు 65 ద్వారా క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ వ్యవస్థను తీసుకువచ్చింది. ఈ జీవో ప్రకారం సీఆర్పీ విధానం రద్దయి సీఆర్ఎంటీ విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. అలా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న 260మంది సీఆర్ఎంటీలు టీచర్లు సెలవు పెడితే విద్యార్థులకు పాఠాలు బోధించేవారు. వీరు విద్యాశాఖలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. కూటమి ప్రభుత్వ సీఆర్ఎంటీలను ఇంటికి సాగనంపేందుకు పూనుకుందని, అందుకే బదిలీలు జరగగా మిగిలిన ఉపాధ్యాయులను తమ స్థానంలో నియమించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోందని సీఆర్ఎంటీలు ఆందోళన చెందుతున్నారు. తమ సేవలను మరింత వినియోగించుకోవాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి.. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. మా సేవలను మరింత వినియోగించుకోవాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వ తీసుకొచ్చిన క్లస్టర్ లెవెల్ అకడమిక్ టీచర్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని, రాష్ట్రంలో పనిచేస్తున్న 3,300 మంది సీఆర్ఎంటీలకు తగు న్యాయం చేయాలి –పూడి వెంకట్రావు, ఏపీ సీఆర్ఎంటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
విధులకు వెళ్తుండగా విధి చిన్నచూపు
● స్కూటీని ఢీకొన్న కంటైనర్ ● చెల్లెలు మృతి, అన్నయ్యకు తీవ్రగాయాలుకూర్మన్నపాలెం : ఆ కుటుంబంపై విధి కన్నెర్రజేసింది. గురువారం ఉదయం అన్నాచెల్లెళ్లు విధులకు స్కూటీపై వెళ్తుండగా తుంగ్లాం రైల్వే గేటుకు సమీపంలో కంటైనర్ ఢీకొంది. ప్రమాదంలో చెల్లెలు ఘటన స్థలంలో మృతి చెందగా అన్నయ్య తీవ్రగాయాలపాలయ్యాడు. దువ్వాడ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదవ జగ్గరాజుపేటలో నివాసం ఉంటున్న గొంప శ్రీను, మణి దంపతులకు సతీష్(29), గీత(24) అనే పిల్లలు ఉన్నారు. తండ్రి శ్రీనివాస్ ఒక ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. అన్నాచెల్లెళ్లు కూడా ఆటోనగర్లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. గురువారం ఉదయం అన్నాచెల్లెళ్లు విధులకు స్కూటీపై వెళ్తుండగా తుంగ్గాం రైల్వేగేటు సమీపంలో కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీకొంది. గీత లారీ వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పక్కకు పడిపోయిన సతీష్కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. సతీష్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అందివచ్చిన కుమార్తె మృతి చెందడం, కుమారుడు తీవ్రగాయాలపాలవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ఏసీబీ ప్రక్షాళన
● ఆరోపణలున్న సిబ్బందిపై బదిలీ వేటు? ● ఐదేళ్లు పూర్తయిన మరికొందరికి స్థానచలనం ● సాక్షి కథనాలకు స్పందన విశాఖ సిటీ: అవినీతి నిరోధక శాఖలో ప్రక్షాళన షురూ అయింది. అవినీతి ఆరోపణలు ఉన్న సిబ్బందిపై ఎట్టకేలకు బదిలీ వేటు పడింది. దీర్ఘకాలంగా ఏసీబీలో తిష్టవేసుకుని కూర్చున్న వారికి స్థానచలనం కలిగింది. ఏసీబీలో అవినీతి సిబ్బందిపై ‘సాక్షి’ వరుస కథనాలతో ఉన్నతాధికారులు దృష్టి సారించారు. వీరితో పాటు ఐదేళ్లు నిబంధన ప్రకారం పలువురికి బదిలీ చేస్తూ ఏసీబీ డీజీ అతుల్ సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ ఏసీబీలో పలువురి వ్యవహార శైలిపై మొదట్నుంచి ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఉన్నతాధికారుల పేరు చెప్పి పలు ప్రభుత్వ శాఖల్లో భారీగా వసూళ్లకు తెరలేపారన్న వార్తలు వినిపించాయి. ప్రధానంగా రిజిస్ట్రేషన్, రెవెన్యూ, రవాణా శాఖల నుంచి నెలసరి మామూళ్లకు అలవాటు పడ్డారన్న గుసగుసలు ఉన్నాయి. ఏసీబీలోనే దండిగా ఆదాయం వస్తుండడం కొంత మంది సిబ్బంది రాజకీయ నేతల ఆశీస్సులతో ఇక్కడి నుంచి వెళ్లకుండా తిష్టవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఒక ఎస్ఐ, ఒక హెచ్సీ ఏసీబీలో చక్రం తిప్పినట్లు ఆఫీస్లోనే చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారుల పేరుతో వీరు చేస్తున్న దందాపై ‘సాక్షి’ వరుస కథనాలతో అధికారులు ఉలిక్కిపడ్డారు. దీనిపై అంతర్గత విచారణ చేపట్టి అవినీతి ఆరోపణలు ఉన్న వారితో పటు ఐదేళ్ల నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టారు. వీరిలో ఎస్ఐలు బి.సురేష్, కె.శ్రీనివాసరావులను విశాఖ రేంజ్ డీఐజీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే హెచ్సీలు టి.కొండలరావు, ఎం.సత్యనారాయణ, ఆర్.చంద్రశేఖర్నాయుడు, కానిస్టేబుల్ ఎస్.రమేష్లను విశాఖ సీపీకి కేటాయించారు. అదే విధంగా హెచ్సీ జి.రాంబాబు, కానిస్టేబుళ్లు కె.రామకిరణ్, టి.శ్రీనివాసరావులను అనకాపల్లి ఎస్పీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు. -
‘సాక్షి’ విలేకరి హఠాన్మరణం
గాజువాక: ‘సాక్షి’అక్కిరెడ్డిపాలెం విలేకరి బి.రామకృష్ణ హఠాన్మరణం చెందారు. దీంతో ‘సాక్షి’సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. గురువారం విధులను ముగించుకుని కంచరపాలెంలోని తన సోదరి ఇంటికి వెళ్లిన రామకృష్ణ గుండెపోటుకు గురయ్యారని సమీప బంధువులు తెలిపారు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ‘సాక్షి’దినపత్రికలో అక్కిరెడ్డిపాలెం విలేకరిగా రామకృష్ణ పదేళ్లుగా పని చేస్తున్నారు. నిరంతరం ఆయన ప్రజా సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చే కథనాలను అందించారు. ఆయన మృతికి ‘సాక్షి’సిబ్బంది, సహచర విలేకరులు సంతాపం ప్రకటించారు. -
క్రమం తప్పకుండా యోగా చేయాలి
● హోం మంత్రి అనిత పిలుపు ● ఏపీఐఐసీ కార్యాలయం ఆవరణలో యోగాంధ్ర అచ్యుతాపురం రూరల్: ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా చేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత సూచించారు. గురువారం అచ్యుతాపురం సెజ్ ముఖ ద్వారం వద్దనున్న ఏపీఐఐసీ కార్యాలయం ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయ్కుమార్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన దేశ యోగులు, రుషులు కనుగొన్న గొప్ప వ్యాయామమే యోగా అని అన్నారు. భారతదేశం ప్రపంచానికి యోగా అనే మహోన్నత వ్యాయామం బహుమతిగా ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సెజ్లోని పరిశ్రమల యాజమాన్యాలు, కార్మికులు, యోగా ప్రేమికులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. -
సన్నబియ్యంతో ‘మధ్యాహ్న భోజనం’
కలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గురువారం నుంచి ప్రారంభమైందని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. సన్నబియ్యంతో మరింత నాణ్యంగా భోజనం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో అన్ని పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లకు అవసరమైన సన్న బియ్యాన్ని పౌర సరఫరాల సంస్థ మండల స్థాయి గోదాముల నుండి పంపిణీ చేసినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,418 ప్రభుత్వ పాఠశాలలు, 136 ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లకు కలిపి 16,898 నాణ్యమైన సన్నబియ్యం సంచులను (25 కేజీల) చొప్పున పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఎటువంటి అక్రమాలు జరగకుండా ప్రతి బస్తాకు క్యూ ఆర్ కోడ్ ముద్రించడం జరిగిందని తెలిపారు. -
మోగనుంది సమస్యల గంట
● నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం ● పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు ● అసంపూర్తిగా తరగతి, టాయిలెట్స్ నిర్మాణాలు ● పూర్తిస్థాయిలో రాని స్టూడెంట్ కిట్లు ● అసంపూర్తిగా నాడు–నేడు పనులు ● చాలా పాఠశాలల్లో పనిచేయని ఆర్వో ప్లాంట్లు స్టూడెంట్స్ కిట్స్ కొరత జిల్లాలోని వివిధ మండలాల పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రక్రియకు విద్యాశాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాలో మొత్తం 5,13,887 పుస్తకాల అవసరం ఉంది. ఇప్పటికే గాజువాకలో గల బుక్ డిపో నుంచి అనకాపల్లి జిల్లాలో గల వివిధ ప్రభుత్వ పాఠశాలలకు తరలించారు. విద్యార్థి మిత్ర కిట్లలో పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్తో పాటు బ్యాగ్, బూట్లు, సాక్సులు, యూనిఫాం, బెల్ట్ ఉండాలి. వాటిలో చాలాచోట్ల టై, బెల్ట్, బ్యాగ్ మాత్రమే వచ్చాయి. యూనిఫాంలు, బూట్లు, సాక్సులు రావాల్సి ఉంది. కొన్నిచోట్ల బ్యాగులు కూడా పూర్తి స్థాయిలో ఇంకా చేరలేదు. సాక్షి, అనకాపల్లి: వేసవి సెలవులు పూర్తయ్యాయి. గురువారం నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు సకల సౌకర్యాలతో విద్యార్థుల తల్లిదండ్రులను రా రమ్మని స్వాగతం పలుకుతుండగా.. సర్కారు బడులు సౌకర్యాల లేమితోనే విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. జిల్లాలో కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. పలుపాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదు. దీంతో విద్యార్థులకు తాగునీటి సమస్య తలెత్తనుంది. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. విద్యార్థులకు పాఠశాలలు తెరిచే నాటికే పంపిణి చేయాల్సిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లలో (స్టూడెంట్ కిట్స్) ఇంకా చాలా వస్తువులు రాలేదు. సాధారణంగా పాఠశాలలు పునఃప్రారంభం నాటికే విద్యా శాఖ అధికారులు అన్ని సిద్ధంచేయాలి. కానీ ఈ వి ద్యా సంవత్సరం అసౌకర్యాలతోఆరంభం కానుంది. పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ పాఠశాలలు పునఃప్రారంభానికే ఉపాధ్యాయుల బదిలీలు ప్రక్రియ పూర్తిచేస్తామని విద్యాశాఖాధికారులు ముందుగానే ప్రకటించారు. కానీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గురువారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అయినా ఉపాధ్యాయులు బది లీ ప్రక్రియ సగభాగం కూడా పూర్తికాలేదు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి మరికొన్ని రోజులు పడుతుందని ఉపాధ్యాయులే భావిస్తున్నారు. తక్కువ సంఖ్యలో ఉన్న స్కూల్ అసిస్టెంట్లు బదిలీ ప్రక్రియ పూర్తయినప్పటికీ.. అత్యధిక సంఖ్యలో ఉన్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ మాత్రం ఇంతవరకు ఓకొలిక్కి రాలేదు. బుధవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు 300 మందికి మాత్రమే మాన్యువల్ కౌన్సెలింగ్ జరిగింది. పాఠశాలలు తెరిచిన రోజైన గురువారం మరో 500 మందికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. వారంతా పాఠశాలలకు వెళ్లకుండా కౌన్సెలింగ్కు హాజరుకావాల్సిందే. దీంతో పాఠశాలలు మొదటి రోజు అరకొర ఉపాధ్యాయులతో ప్రారంభం కాబోతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో 2,782 మంది ఎస్జీటీలు కౌన్సెలింగ్కు దరఖాస్తు చేసుకొన్నారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉంటే వారందరికీ కౌన్సెలింగ్ పూర్తయ్యేసరికి మరో వారం పడుతుందని అధికారులు అంటున్నారు. పాఠశాలల కుదింపు.. ఉపాధ్యాయుల కొరత విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరలేదని ఎంపీయూపీ స్కూల్స్ను ఎంపీపీ స్కూల్స్గా కొన్నిచోట్ల కుదించారు. దేవరాపల్లి మండలంలో వాకపల్లి, నాగయ్యపేట, రైవాడలో ఉన్న ఎంపీయూపీ స్కూల్స్ను ఎంపీపీ స్కూల్స్గా కుదించారు. కె.కోటపాడు మండలంలో కె.కోటపాడు, చౌడువాడ, పిండ్రంగి, దాలివలస ఎంపీయూపీ స్కూల్స్ను ప్రైమరీ మోడ ల్స్ స్కూల్స్గా మార్చారు. కోటవురట్ల మండలంలో ఎండపల్లి, చౌడువాడ, పందూరులో ఉన్న ఎంపీయూపీ స్కూల్స్ను ఎంపీపీ స్కూల్స్గా కుదించారు. స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న చాలామంది ఉపాధ్యాయులు ప్రభుత్వం నుంచి వచ్చే ఒత్తిడి తట్టుకోలేక ఇటీవల జరిగిన బదిలీల్లో ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా బదిలీపై వెళ్లిపోయారు. వీరి స్థానంలో వచ్చేందుకు ఇతర ప్రాంతాల ఉపాధ్యాయులు ఆసక్తి చూపిండచం లేదు. దీంతో జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయులు, భాషా ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. ఎక్కడి పనులు అక్కడే.. వైఎస్సార్సీపీ హయాంలో ‘నాడు–నేడు’లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పన చేపట్టారు. మొదటి విడతలో రూ.156.44 కోట్లతో 598 పాఠశాలల్లో, రెండో విడతలో రూ.112.54 కోట్లతో 616 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టి, గత ప్రభుత్వ హయాంలోనే 70 శాతం వరకు పూర్తి చేశారు. బెంచీలు, ఐఎఫ్బీ ప్యానెళ్లు, ఆధునిక వసతులతో కూడిన మరుగుదొడ్లు, డైనింగ్ హాళ్లు, తాగునీరు, వాడుకనీటి సదుపాయాలు కల్పించారు. కూటమి ప్రభుత్వం రావడం పాఠశాలల పాలిట శాపంగా మారింది. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. పాయకరావుపేట నియోజకవర్గంలో దేవవరం, చినదొడ్డిగల్లు, రాజయ్యపేట, రమణయ్యపేట, బోయపాడు, డీఎల్పురం, ముకుందరాజుపేట, అయ్యన్నపాలెం, నక్కపల్లి పాఠశాలల్లో భవనాలు అసంపూర్తిగానే ఉన్నాయి. పెదబోదిగల్లం పాఠశాల భవనాలు పూర్తిగా శిథిలమయ్యాయి. అలాగే ఎస్.రాయవరం మండలం, కశింకోట మండలం, అనకాపల్లి మండలంలోని అనేక పాఠశాలల్లో భవన నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. జిల్లాలో పాఠశాలల వివరాలు ప్రాథమిక – 1,152 ప్రాథమికోన్నత – 341 ఉన్నత – 431 మొత్తం పాఠశాలలు – 1,924 విద్యార్థుల సంఖ్య – 2,21,788 మొత్తం ఉపాధ్యాయులు – 10,412 -
పంగనామాలు
అందరికీకూటమి ఏడాది పాలన అంతా మోసం, దగా సూపర్ సిక్స్ హామీలకు మంగళం స్టీల్ప్లాంట్ కార్మికుల గోడుపట్టదా? ఉక్కు పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం నెమ్మదిగా ఉద్యోగులను వీఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపిస్తోంది. కాంట్రాక్టు కార్మికులపై వేటు వేసింది. దీంతో వేలాది మంది కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గత ఏడాది కాలంగా కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు చేస్తున్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్గానీ వారి గోడును పట్టించుకున్న దాఖలాలు లేవు. తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు నిరసనలు చేపడుతుంటే.. వారి ఆందోళనలను అణిచివేయడానికి పోలీసులను ప్రయోగిస్తుండడం గమనార్హం. -
రోడ్డున పడ్డ ఉద్యోగులు
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో వలంటీర్లు, 108 ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ టీచర్లు, ఆశా కార్యకర్తల ధర్నాలు, నిరసనలతో విశాఖ హోరెత్తిపోతోంది. ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని 108 ఉద్యోగులు.. విధుల్లోకి తీసుకొని రూ.10 వేలు వేతనం ఇవ్వాలని వలంటీర్లు.. సమస్యలు పరిష్కరించాలంటూ ఆశ వర్కర్ల నిరసనలు.. ఆకలి కేకలతో అలమటిస్తూ పెండింగ్ జీతాల కోసం ఆయాల పొలికేకలు.. ఎండీయూ వాహనాలు రద్దు చేయడంతో రోడ్డున పడ్డ 702 మంది ఆపరేటర్లు, హెల్పర్ల ఆర్తనాదాలు.. ఇలా చంద్రబాబు ఏడాది పాలనలోనే అన్ని వర్గాల నుంచి అసహనం కట్టలు తెంచుకుంటోంది. -
హామీలన్ని గాలికి..
సూపర్ సిక్స్ పేరుతో బూటకపు హామీలు గుప్పించి ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చడానికి ఖజానా ఖాళీ అయిపోయిందని కుంటి సాకులు చెబుతున్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానని, ఉచిత బస్సు ప్రయాణమని మాయమాటలు చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పి అన్నదాతకు వెన్నుపోటు పొడిచారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ, పెండింగ్ డీఏలు అన్నీ ఇస్తామని చెప్పి బుట్టలో వేసుకుని ఇప్పుడు నిలువునా ముంచారు. ఇలా విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు అందరికీ పంగనామాలు పెట్టారు. -
అప్పుల పాలయ్యాం.. మధ్యాహ్న భోజనం పెట్టలేం
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ... ● రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి...తండ్రికి సీరియస్ ● ఆర్.శివరాంపురంలో విషాదఛాయలు–8లో చోడవరం: మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు రావలసిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర అధ్యక్షురా లు గూనూరు వరలక్ష్మి డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల సంఘం ముఖ్యనాయకుల సమావేశం చోడవరంలో బుధవారం జరిగింది. డిసెంబరు నెల నుంచి నేటి వరకూ మధ్యాహ్న భోజన పథకం బిల్లులు మంజూరు కాలేదని, అప్పులు చేసి విద్యార్థులకు భోజనం పెడుతున్నామని చెప్పారు. వడ్డీ లు కట్టుకోలేక చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామ న్నారు. ఐదు నెలలుగా బిల్లులు రాలేదని, పాఠశాలలు తెరిస్తే విద్యార్థులకు ఎలా భోజనం పెట్టగలమని ఆమె ప్రశ్నించారు.గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా 15వ తేదీకి బిల్లులు వచ్చేవని, కూటమి ప్రభుత్వం వచ్చాక సకాలంలో ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేతనాలు కూడా సరిగా ఇవ్వడం లేదన్నారు. ఇదే ఉపాధిగా జీవిస్తున్న తాము జీతాలు రాక, బిల్లులు చెల్లించక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని, అప్పులు తెచ్చి భోజనం పెట్టలేమని ఆమె చెప్పారు. వెంటనే ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని వరలక్ష్మి హెచ్చరించారు. ఆందోళనలో సంఘ ప్రతినిధులు ఎస్.అమ్మాజీ, బి.ఉమ, కె.నాగమణి, ఒ.దేముడమ్మ, ఆర్.బుచ్చిరాజమ్మ, ఎం.దేవి, వరలక్ష్మి, రాజులమ్మ, సత్యవతి పాల్గొన్నారు. బకాయి పడ్డ బిల్లులు, జీతాలు వెంటనే విడుదల చేయాలి మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల డిమాండ్ -
ఉపాధ్యాయుల సహనానికి పరీక్ష
రెండో రోజూ బదిలీల కౌన్సెలింగ్లో గందరగోళం ఆరిలోవ(విశాఖ): ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్జీటీ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్లో రెండో రోజూ గందరగోళం నెలకొంది. సాంకేతిక లోపాలు, అధికారుల జాప్యంతో బుధవారం కూడా ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎస్జీటీ ఉపాధ్యాయల బదిలీ కోసం మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మాన్యువల్ కౌన్సెలింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి రోజు సాంకేతిక సమస్యలతో అంతా గందరగోళంగా మారింది. దీంతో మొదటి రోజు కౌన్సెలింగ్ పూర్తిగా రద్దు కాగా, రెండో రోజు ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాయడంతో వారి సహనం నశించి అధికారులను నిలదీశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం 1 నుంచి 300 వరకు కౌన్సెలింగ్ జరగాల్సి ఉండగా ఉపాధ్యాయులు ఉదయం 10 గంటలకే చేరుకున్నారు. కానీ కౌన్సెలింగ్ ఆలస్యంగా మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమైంది. ప్రక్రియ నత్తనడకన సాగడంతో మధ్యాహ్నం 2.40 గంటలకు కేవలం 20 మందికి, మధ్యాహ్నం 3.30 గంటలకు 50 మందికి, సాయంత్రం 7.45 గంటలకు 210 మందికి మాత్రమే పూర్తయింది. మిగిలిన 90 మంది కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో.. అప్పటి వరకు నిరీక్షించిన ఉపాధ్యాయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారు ఉమ్మడి జిల్లాల డీఈవోల వద్దకు వెళ్లి, అధికారులు కావాలనే తమను ఇబ్బంది పెడుతున్నారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు మరోసారి సాంకేతిక సమస్యనే కారణంగా చెప్పినా వారు శాంతించలేదు. చివరకు మిగిలిన వారికి కౌన్సెలింగ్ పూర్తయ్యే సరికి రాత్రి 11 గంటలు దాటింది. పాఠశాలల తొలిరోజే టీచర్ల గైర్హాజరు! మరోవైపు గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. నేడు మరో 500 మందికి కౌన్సెలింగ్ నిర్వహిస్తుండటంతో, వారంతా తొలిరోజు పాఠశాలలకు గైర్హాజరు కావడం ఖాయంగా కనిపిస్తోంది. మొదటి రోజు సాంకేతిక లోపంతో కౌన్సెలింగ్ రద్దు కావడం, రెండో రోజు ఈ జాప్యం జరగడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గురువారం 301 నుంచి 800 వరకు ఎస్జీటీ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని విశాఖ డీఈవో ఎన్. ప్రేమకుమార్ తెలిపారు. ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్కు హాజరుకావాలని ఆయన సూచించారు. -
కె.జె.పురం జంక్షన్లో ఆక్రమణల తొలగింపు
మాడుగుల రూరల్ : మండలంలో కె.జె.పురం జంక్షన్లో ఆక్రమణల తొలగింపునకు రంగం సిద్ధం చేశారు. రహదారి కిరువైపులా గల ఆక్రమణలు తొలగించి, డ్రైనేజిలను నిర్మించాలని కోరుతూ విశ్రాంత ఉపాధ్యాయుడు, స్థానిక కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్ రాపేట రామకొండలరావు, స్థానికులు తాకాశి శ్రీను తదితరులు ఈ ఏడాది మార్చి 10 న అనకాపల్లి జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మార్చి 19న ఆర్అండ్బీ, స్థానిక పంచాయతీ అధికారులు సర్వే చేసి ఆక్రమణల తొలగింపునకు మార్కింగ్ చేశారు. తర్వాత పొక్లెయిన్తో ఆక్రమణల తొలగించే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ బుధవారం మాడుగుల ఆర్అండ్బీ జేఈ సాయి శ్రీనివాస్, వారి సిబ్బందితో పాటు పంచాయతీ కార్యదర్శి నవీన్దొర, సిబ్బంది, ఎస్ఐ నారాయణరావు, హెడ్ కానిస్టేబుల్ పెద్దయ్య, తదితర పోలీసు సిబ్బంది పర్యవేక్షణలో రోడ్డు మధ్య భాగం నుంచి 11 మీటర్లు అటు, ఇటు వైపునా ఆక్రమణలు తొలగించారు. జంక్షన్లో నిర్మించిన 33 మీటర్ల వరకు ఉన్న ఈ ఆక్రమణలను తొలగించారు. దీనిలో భాగంగా సంతోషిమాత ఆలయం అన్నదాన సత్రం ముందు భాగంలో గల అరుగును, బాత్రూమ్, వంటశాల, సంతోషిమాత ముందు భాగంలో తొలగించారు. ఈ ఆక్రమణలు తొలగింపు విషయంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా ఎస్ఐ జి. నారాయణరావు, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. వీఆర్వో నాగప్పారావు, సర్వేయరు రాజేష్ పాల్గొన్నారు. అన్నదాన సత్రం కూల్చివేతకు కుట్ర : ఆలయ కమిటీ చైర్మన్ ధ్వజం అన్నదాన సత్రం కూల్చివేయడానికి కొంత మంది వ్యక్తులు కుట్ర చేసి సత్రం ముందు భాగం కూల్చివేశారని, ఇది అన్యాయమని సంతోషిమాత ఆలయ కమిటీ చైర్మన్ కాళ్ల అమ్మతల్లినాయుడు ఆరోపించారు. ఎంతో మందికి మధ్యాహ్నం సమయంలో అన్నదానం చేస్తున్న సత్రంను ఎంతో మంది దాతల సహకారంతో నిర్మించామని తెలిపారు. ఆలయం ముందు భాగంలో విగ్రహాలను కూడా తొలగించారని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని అమ్మతల్లినాయుడు పేర్కొన్నారు. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ..
జగదాంబ/బుచ్చెయ్యపేట: భార్య వైద్య పరీక్షల కోసం కేజీహెచ్కు బయలుదేరిన ఆ కుటుంబం.. గమ్యం చేరకముందే ప్రమాదం బారిన పడింది. ఇసుకకొండ సత్యనారాయణ స్వామి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడటంతో.. భార్య అక్కడికక్కడే కన్నుమూయగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. కన్నవారి కోసం ఆ పసిపిల్లల ఎదురుచూపులు, వా రి ఆలనా పాలనా చూడాల్సిన నాన్నమ్మ గుండెలవిసేలా రోదించడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. ఈ ఘట నతో బుచ్చెయ్యపేట మండలం ఆర్.శివరాంపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దేవర చిలుకనాయుడు దివ్యాంగుడు. కాళ్లు చచ్చుబడ్డా.. ఆత్మవిశ్వాసాన్ని చంపుకోలేదు. ఎనిమిదేళ్ల కిందట దిబ్బిపాలేనికి చెందిన కృష్ణకుమారి (33)ని వివాహం చేసుకున్నాడు. గ్రామంలో చిన్న పాన్షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్న చిలుకనాయుడికి భార్యే చేదోడు వాదోడుగా ఉండేది. వారికి ఇద్దరు కుమార్తెలు యువశ్రీ(4), హాత్విక(8 నెలలు) ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణకుమారిని ప్రతి నెలా కేజీహెచ్కు తీసుకొస్తున్నాడు చిలుకనాయుడు. బుధవారం ఉదయం కూడా తన మూడు చక్రాల స్కూటీపై భార్య, చిన్న కూతురు హాత్వికతో కలిసి శివరాంపురం నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో వీరు సత్యనారా యణ స్వామి దర్శనానికి ఘాట్ రోడ్డులో వెళ్లి తిరిగి వస్తున్నారు. పూర్ణామార్కెట్ సమీపంలో మొదటి మలుపు వద్ద స్కూటీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. అదుపుతప్పిన వాహనం వేగంగా గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణకుమారి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. చిలుకనాయుడు తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్కూటీలో ముందు కూర్చున్న 8 నెలల హాత్విక పక్కనే ఉన్న ఇసుక దిబ్బపై పడటంతో ప్రాణాలతో బయటపడింది.ఆ పసిపాప ఏడుపు విని చలించిపోయిన ఓ మహిళా వ్యాపారి, చిన్నారిని దగ్గరకు తీసుకుని సపర్యలు చేసింది. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించింది. ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న చిలుకనాయుడు పరిస్థితి విషమంగా ఉందని, 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. గుండెలు పగిలేలా రోదన చిలుకునాయుడు తండ్రి చిన్నోడు గతంలోనే మరణించారు. కొడుకు చిలుకనాయుడే తల్లి రాజులమ్మకు ఆధారం. ఇప్పుడు కోడలు మరణించి, కొడుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండటంతో ఆ తల్లి గుండె పగిలింది. ‘నా కొడుకు బతకాలి.. ఈ పసిపిల్లల్ని ఎలా సాకాలి? రేపటి నుంచి మా బతుకులేంటి?’ అంటూ ఆమె నేలపై పడి రోదించిన తీరు అక్కడి వారందరినీ కదిలించింది. తల్లి చనిపోయిందని, తండ్రి ఆసుపత్రిలో ఉన్నాడని తెలియని ఆ ఇద్దరు పసిపిల్లలు బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తుండటం చూపరులను కలిచివేసింది. చితికిపోయిన ఈ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. స్కూటీ బ్రేకులు ఫెయిల్.. తల్లి మృతి.. తండ్రికి సీరియస్ అనాథలైన పసిపాపలు పూర్ణామార్కెట్ సమీపంలోని ఘాట్ రోడ్డులో ఘటన -
‘మోదీ మెప్పు కోసమే యోగాంధ్ర ప్రచార ఆర్భాటం’
దేవరాపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ మెప్పు కోసమే రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర పేరిట ప్రచార ఆర్భాటం చేస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న విమర్శించారు. ఈ మేరకు దేవరాపల్లిలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. యోగాతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి అధికార యంత్రాంగాన్ని యోగా కోసం వినియోగించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నెల 21న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే మోదీ సభకు లక్షల మందిని విశాఖకు తరలించడం ప్రజాధనం వృథా తప్పా, రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. రైతులు, శ్రామికులు, ఉపాధి కూలీలలతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, నిరుద్యోగులు సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని వెంకన్న ప్రభుత్వాన్ని కోరారు. -
జాతీయ స్థాయి యోగా పోటీల్లో ప్రతిభ
అనకాపల్లి టౌన్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శారదా యోగా శిక్షాలయ సారథ్యంలో ఆల్ ఇండియా యోగా కల్చర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల 35వ నేషనల్ ట్రెడిషనల్ యోగాసన చాంపియన్ షిప్–2025 పోటీలు జరిగాయి. జాతీయ స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో 12 రాష్ట్రాల నుంచి 680 మంది తలపడ్డారు. తుమ్మపాల గ్రామం శ్రీకృష్ణ యోగా సెంటర్ గురువు బుదిరెడ్డి నరసింగరావు 55–65 సంవత్సరాల కేటగిరీలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించారు. 66–75 సంవత్సరాల కేటగిరీలో బుదిరెడ్డి నాగమణి ఐదో స్థానంలో నిలిచి సత్తా చాటారు. -
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
మునగపాక: రబీ సీజన్లో సాగైన వరిని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రబీలో వరి పంట సాగు చేసి గింజలను సేకరించే క్రమంలో ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మండలంలోని వాడ్రాపల్లిలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయలేదన్న సమాచారం మేరకు ఆయన బుధవారం ధాన్యం బస్తాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించలేదన్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి సకాలంలో మెరుగైన ధరలు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. కల్లాల్లో ధాన్యం పాడైపోయి రైతులు అల్లాడిపోతున్నా పాలకులు, అధికారులకు పట్టకపోవడం విచారకరమన్నారు. రంగు మారిన ధాన్యానికి కూడా మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి సరైన ధర అందించారన్నారు. అన్ని విధాలా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు కాండ్రేగుల నూకరాజు, భీశెట్టి గంగప్పలనాయుడు, తిమ్మరాజుపేట ఉప సర్పంచ్ కాండ్రేగుల జగన్, రైతులు బొడ్డేడ సత్యనారాయణ, మళ్ల జోగినాయుడు, కాండ్రేగుల లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు. రబీ వరికి గిట్టుబాటు ధర లేక ఆర్థిక ఇబ్బందులు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ -
గోవాడ సుగర్ ఫ్యాక్టరీ సమస్యలపై పోరాడదాం..
చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీ సమస్యలపై సభ్య రైతులతో కలిసి పోరాటం చేద్దామని వైఎస్సార్సీపీ చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఇటీవల అనారోగ్యానికి గురైన వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావును స్వగ్రామమైన గోవాడలో బుధవారం అమర్నాథ్ పరామర్శించారు. సత్యారావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం మండలంలోని ముఖ్య నాయకులతో అమర్నాథ్ సమీక్షించారు. ఇటీవల అమెరికా పర్యటన తర్వాత మొదటి సారిగా నియోజకవర్గానికి రావడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి ఆయనతో మాట్లాడారు. గ్రామాల్లో, పార్టీలో నెలకొన్న తాజా పరిస్థితులపై గ్రామస్థాయి నాయకులు వివరించారు. అలాగే గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి రోజురోజుకీ దయనీయంగా తయారవుతోందని, రైతులకు చెరకు బకాయిలు కూడా ఇచ్చే పరిస్థితిలో ఫ్యాక్టరీ లేదని పలువురు నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు అమర్నాథ్ స్పందిస్తూ ఈ విషయమై ఫ్యాక్టరీ, చెరకు రైతుల పరిస్థితిని ప్రభుత్వానికి తెలిసేలా పోరాటం చేయాలన్నారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలతో మండల స్థాయి, గ్రామ స్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ముందుగా మండలాల వారీగా నాలుగు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. చోడవరం మండల సమావేశం ఈ నెలలో నిర్వహించేందుకు నిర్ణయించామని, త్వరలో సమావేశం తేదీని తెలియజేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను ప్రజలకు తెలియజేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, ఎంపీపీ గాడి కాసు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పల్లా నర్సింగరావు, వైస్ ఎంపీపీలు బైన ఈశ్వరరావు, శరగడం నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీల ఫ్లోర్ లీడర్ పల్లా రమణ, పట్టణ అధ్యక్షుడు దేవరపల్లి సత్య, ప్రధాన కార్యదర్శి పందిరి శ్రీనివాసరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఓరుగంటి నెహ్రూ, జిల్లా కార్యదర్శి పోతల శ్రీనివాసరావు, డీఆర్యూసీ సభ్యుడు బొడ్డు శ్రీరామమూర్తి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ మరింత బలోపేతం దిశగా విస్తృత సమావేశాలు పార్టీ చోడవరం సమన్వయకర్త, మాజీ మంత్రి అమర్నాథ్ -
దాత సాయం.. గోతుల రోడ్డుకు మోక్షం
బుచ్చెయ్యపేట : మండలంలో గల రాజాం, తట్టబంద (ఆర్టీ) రోడ్డులో గోతులకు మోక్షం కలిగింది. రాజాం నుండి తురకలపూడి వరకు పెద్దపెద్ద గోతులు పడి రాకపోకలకు ప్రయాణికులు తీవ్ర అవస్ధలు పడుతున్నారు. గోతులను పూడ్చాలని పలువురు కోరినా అధికారులు, పాలకులు పట్టించికోలేదు. ఈ రహదారిలో రాకపోకలు సాగించే రావికమతం, బుచ్చెయ్యపేట మండలాలకు చెందిన 25 గ్రామాల ప్రజలు తీవ్ర అవస్ధలు పడుతున్నారు. రోడ్డు గోతుల వల్ల అనకాపల్లి ఆర్టీసీ అధికార్లు బస్సులు నడపడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోతుల్లో పడి పలువురు వాహనదారులు తీవ్ర గాయాలపాలవుతున్నారు. రావికమతం మండలం జీడిపిక్కల ఫ్యాక్టరీ యజమాని ప్రభు ప్రయాణికులు కష్టాలను చూసి ముందుకొచ్చారు. సుమారు రూ.2 లక్షలతో ఐదు కిలోమీటర్లు పొడవున ఉన్న గోతులను కప్పించారు. గోతులను పొక్లెయిన్తో లెవిలింగ్ చేసి గ్రావెల్తో గోతులను పూడ్చారు. సజావుగా వాహనాలు రాకపోకలు సాగేలా చేశారు. -
ఏయూలో కొలువుదీరిన కొత్త నాయకత్వం
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం విభాగాలకు నూతన నాయకత్వం పదవీ బాధ్యతలు చేపట్టింది. ఏయూ అకడమిక్ సెనేట్ మందిరంలో ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనంజయరావు చేతుల మీదుగా డీన్, డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్లకు బుధవారం నియామక ఉత్తర్వులను అందించారు. మొత్తం 43 మందికి వివిధ పదవీ బాధ్యతలను కేటాయించారు. అనంతరం వీసీ రాజశేఖర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించామని, త్వరలో నూతన కార్యక్రమాలను చేపట్టేలా ప్రతి విభాగం పనిచేయాలన్నారు. విద్యార్థులతో, సిబ్బందితో గౌరవప్రదంగా నడుచుకోవాలన్నారు. యువతకు ప్రాధాన్యత : నూతనంగా నియామకం చేసిన డీన్, డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్లలో అత్యధికంగా యువతకు అవకాశం కల్పించారు. ప్రతి విభాగంలో ఉన్న యువ ఆచార్యులను ఎంపిక చేసి ఈ బాధ్యతలు కేటాయించారు. భవిష్యత్ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ వర్సిటీని ముందుకు నడిపించే దిశగా యువ ఆచార్యులను ప్రోత్సహించేందకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. -
ఫార్మా కంపెనీ బస్సుకు మంటలు
● ఇంజిన్ ఆయిల్ లీకేజీయే కారణం అనకాపల్లి టౌన్: పరవాడ లారస్ కంపెనీకి చెందిన బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. చోడవరంలో నివాసముంటున్న కంపెనీ ఉద్యోగులను తీసుకురావడానికి లంకెలపాలెం నుంచి బుధవారం ఉదయం 11 గంటల సమయంలో బస్సు బయలుదేరింది. తుమ్మపాల దర్జీనగర్కు చేరుకొనే సమయంలో వెనక నుంచి వచ్చిన ద్విచక్రవాహనదారులు బస్సు వెనక మంటలు వస్తున్నాయని చెప్పడంతో డ్రైవర్ బస్సును నిలిపివేశారు. ఈ సమయంలో బస్సులో మరెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. వెంటనే స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం తెలపడంతో హుటాహుటిన సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదం ఇంజిన్లో ఆయిల్ లీకేజీ వలన జరిగిందని రూరల్ ఎస్ఐ రవికుమార్ తెలిపారు. బస్సు ముందు భాగం, లోపల సీట్లు పూర్తిగా కాలిపోయాయి. -
అంతర్ రాష్ట్ర మహిళల బ్లైండ్ క్రికెట్ విజేత ఒడిశా
రన్నరప్గా ఆంధ్రప్రదేశ్ జట్టు ఉక్కునగరం: ఉక్కు స్టేడియంలో జరిగిన అంతర్ రాష్ట్ర మహిళల బ్లైండ్ క్రికెట్ చాంపియన్షిప్ను ఒడిశా జట్టు కై వసం చేసుకుంది. ఎన్టీపీసీ సింహాద్రి సహకారంతో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ (సీఏబీఏపీ), క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ కేరళ (సీఏబీకే) సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన టోర్నమెంట్లో ఢిల్లీ, ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్ జట్లు పాల్గొన్నాయి. బుధవారం జరిగిన ఫైనల్స్లో ఒడిశా జట్టు మొదట బ్యాటింగ్కు దిగింది. 15 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ జట్టు 15 ఓవర్లలో 80 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఒడిశా జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్కు డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి హాజరై క్రీడాకారులను అభినందించారు. ముగింపు కార్యక్రమంలో ఎన్టీపీసీ ఈడీ సమీశ్ శర్మ, హెచ్ఆర్ బి.బి.శర్మ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. ఇండియన్ బ్లైండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజయ్కుమార్ రెడ్డి, కో–ఆర్డినేటర్లు అమ్మి నాయుడు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళల కన్నెర్ర
● హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ ● అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నేతల వినతి పత్రం అనకాపల్లి టౌన్: అత్యాచారాలపై మహిళలు కన్నెర్ర చేశారు.. అరాచకాలు నశించాలని నినదించారు.. దిగజారిన శాంతిభద్రతలు కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం అనకాపల్లిలో నిరసన ప్రదర్శన జరిగింది. రింగ్రోడ్లోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా రైల్వేస్టేషన్ జంక్షన్ వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, వినతిపత్రం అందజేశారు. పార్టీ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకురాలు శోభ హైమావతి, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పార్టీ జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత తదితర మహిళా నేతలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. కూటమి పాలనలో మహిళలపై అత్యారారాలు పెరిగిపోయాయని, మూడు సంవత్సరాల పిల్లల నుంచి, ముసలివాళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నా రు. ప్రశాంతమైన రాష్ట్రం అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మారిందన్నారు. రాష్ట్రంలో మహిళా హోం మంత్రి ఉన్నా అతివలపై దాడులను అరికట్టలేకపోతున్నారని విమర్శించారు. మహిళల రక్షణ కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టాన్ని అమలు చేస్తే.. దాని పేరు మార్చి మహిళలకు రక్షణ లేకుండా చేశారని విమర్శించారు. జెడ్పీ వైస్ చైర్పర్సన్ భీశెట్టి వెంకట సత్యవతి, పార్టీ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు కాండ్రేగుల హైమావతి, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పంచారీ పద్మ, అనకాపల్లి మండల మహిళా అధ్యక్షురాలు కోట్నాల పద్మకుమారి, పెందుర్తి మహి ళా విభాగం అధ్యక్షురాలు ఎస్.నదియా, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
కారును ఢీకొన్న టిప్పర్ లారీ
కశింకోట: మండలంలోని తాళ్లపాలెం కూడలిలో మంగళవారం పెద్ద ప్రమాదం తప్పింది. రోడ్డు ప్రమాదం నుంచి ముగ్గురు వ్యక్తులు ప్రాణహాని నుంచి అదృష్టవశాత్తూ సురక్షితంగా బయట పడ్డారు. అయితే కారు మాత్రం దెబ్బతింది. అనకాపల్లి నుంచి యలమంచిలి వైపు వెళుతున్న కారును, అదే మార్గంలో వస్తున్న పెద్ద టిప్పర్ లారీ ఢీకొని సుమారు వంద మీటర్ల దూరం వరకు కారును ఈడ్చుకుంటూ ముందుకు వెళ్లిపోసాగింది. దాన్ని డ్రైవర్ గమనించలేదు. స్థానికులు గమనించి పరుగున వెళ్లి లారీ ఆపడంతో ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ కారు ఢీకొన్న తర్వాత బోల్తా పడకుండా సాధారణ స్థితిలో ముందుకు ఈడ్చుకు వెళ్లింది. దీంతోపాటు స్థానికులు గమనించి లారీ ఆపడంతో నిలిపారు. దీంతో ప్రమాదం తప్పింది. కారులో డ్రైవర్ సహా ముగ్గురు ప్రయాణిస్తున్నారు. కాకినాడ వద్ద ఉప్పాడకు చెందిన ప్రైవేటు వైద్యుడు హరనాథరాజు, భార్య మేరీమణి, బంధువు అయిన డైవర్ యు. ప్రకాష్ ఉన్నారు. వీరు విశాఖ నుంచి ప్రస్తుతం నివాసం ఉంటున్న కాకినాడకు సొంత కారులో వెళుతుండగా ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో హమ్మయ్య..అంటూ ఊపిరి పీల్చుకున్నారు. మేరీమణి మాత్రం కొంత సేపు షాక్కు గురై అనంతరం తేరుకున్నారు. ప్రమాదంలో కారు కుడి పక్క భాగం దెబ్బతింది. ప్రమాదం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా పోలీసులు రోడ్డుకు అడ్డంగా తొలగించారు. ప్రమాద వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. -
ముంచేసిన అధిక వడ్డీ ఆశ
బుచ్చెయ్యపేట: అధిక వడ్డీ ఆశతో బుచ్చెయ్యపేట మండల యువకులు నిలువునా మోసపోయారు. తెలంగాణకు చెందిన కార్లను తెచ్చి తాకట్టు పెట్టి యువకుల వద్ద కోటి రూపాయలకు పైగా దోచుకున్నారు. ఈ మోసంలో బుచ్చెయ్యపేట మండలం దిబ్బిడికి చెందిన ఓ రాజకీయ కుటుంబం సుమారు రూ.80 లక్షక్షలు, నేతవానిపాలేనికి చెందిన ఒక యువకుడు రూ.20 లక్షలకు పైగా కోల్పోయినట్టు తెలుస్తోంది. మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన వ్యక్తి తెలంగాణ నుంచి కార్లను తీసుకొచ్చి వీరి వద్ద తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్లేవాడు. ఒక్కో కారు కుదువ పెట్టి మూడు, నాలుగు లక్షలు తీసుకునేవాడు. ఈ సొమ్ముపై లక్షకు నెలకు రూ.15 వేల వడ్డీ ఇచ్చేవాడు. అధిక వడ్డీకి ఆశపడిన వీరిద్దరూ తమ డబ్బులతోపాటు తమకు తెలిసిన వారి వద్ద నాలుగైదు రూపాయల వడ్డీకి డబ్బులు తెచ్చి మరీ కార్లు తాకట్టు పెట్టుకొని సొమ్ము ఇచ్చేవారు. అప్పు తిరిగి చెల్లించకపోయినా కార్లు తమ వద్దే ఉంటాయన్న ధీమాతో వారంతా కోటి రూపాయలకు పైగా ఇచ్చేశారు. నాలుగైదు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి, కార్లు తాకట్టు పెట్టుకొని 15 రూపాయల వడ్డీకి అప్పు ఇచ్చేవారు. నెలకు లక్ష వద్ద రూ.10 వేలు వడ్డీ మిగలడంతో వీరు లక్షలకు లక్షలు వెచ్చించారు. కొసమెరుపు : పది రోజుల క్రితం తెలంగాణ పోలీసులు దిబ్బిడి వచ్చి యువకుల వద్ద తాకట్టు పెట్టిన కార్లను పట్టుకుపోయారు. వాటిని పార్వతీపురానికి చెందిన వ్యక్తి తమకు తాకట్టు పెట్టినట్టు వారు చెప్పినా పోలీసులు వినలేదు. తమ కార్లను లీజుకు తీసుకొని అప్పజెప్పలేదని తెలంగాణకు చెందిన కారు ఓనర్లు ఫిర్యాదు చేయడంతో, జీపీఎస్ ద్వారా ఇక్కడ కార్లు ఉన్నట్లు గుర్తించామని తెలంగాణ పోలీసులు వీరికి తెలిపారు. దొంగ కార్లను కొన్నందుకు మీపైనే కేసులు పెడతామని బెదిరించి 30 కార్లను పట్టుకుపోయారు. కార్లు తాకట్టు పెట్టిన పార్వతీపురానికి చెందిన వ్యక్తికి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని వారికి అర్థమయింది. వారిద్దరికీ అప్పులిచ్చిన యువకులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా అనకాపల్లి మండలంలోని తుమ్మపాల గ్రామంలో కార్ల తాకట్టు పేరిట మోసం జరిగింది. బుచ్చెయ్యపేట మండలంలోని రాజాం, సీతయ్యపేట, చిట్టియ్యపాలెం తదితర గ్రామాల్లో కూడా ఇలాంటి మోసాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రూ.కోటికి పైగా కుచ్చు టోపీ కార్లు తాకట్టు పెట్టి రూ.15ల వడ్డీకి అప్పు తీసుకున్న మోసగాడు రూ.కోటికి పైగా వెచ్చించిన బుచ్చెయ్యపేట యువకులు తెలంగాణ పోలీసులు రావడంతో మోసం బట్టబయలు అద్దెకు తీసుకున్న కార్లను తాకట్టుపెట్టినట్టు తెలుసుకొని లబోదిబో 30 కార్లను తీసుకుపోయిన తెలంగాణ పోలీసులు -
సాక్షి పత్రిక కార్యాలయాల మీద దాడులు తగవు
మాడుగుల రూరల్ : రాష్టంలో వివిధ ప్రాంతాల్లో సాక్షి పత్రికా కార్యాలయాలపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులు చెయ్యడం అన్యాయమని జిల్లా వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, చోడవరం సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ఖండించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కక్ష సాధింపులు, రెడ్బుక్ పాలన, ఆక్రమ కేసులు బనాయించి గిట్టనివాళ్లను జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న నేపథ్యంలో హామీల అమలు, వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ఇలాంటి దుష్ట సంప్రదాయానికి తెర దించిందన్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమన్నారు. జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడం పత్రికా కార్యాలయాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో హేయమైన చర్యని ఆయన తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు, జర్నలిస్టులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు మీద దాడులు చేయడం ప్రభుత్వానికి పరిపాటి అయిందన్నారు. ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. అధికార పార్టీ ఆగడాలకు పరాకాష్ట సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్టు అన్యాయం వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర శ్రీనివాసరావు ఖండన -
ఇసుక ట్రాక్టర్ల యజమానులపై బైండోవర్ కేసులు
దేవరాపల్లి: తిమిరాంలో భారీ గోతులు తీసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్టు సాక్షి పత్రికలో ఈ నెల 9న ‘ఇసుక తోడేళ్లు’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. శారదానదిలో నిబంధనలకు విరుద్ధంగా గోతులు తీసి ఇసుక తరలిస్తున్న ముగ్గురు ట్రాక్టర్ యజమానులు సబ్బవరపు రామకృష్ణ, సీముసిరి గంగునాయుడు, గుంపాన గంగునాయుడులపై స్థానిక తహసీల్దార్ బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఉచిత ఇసుక పేరిట నిబంధనలను అతిక్రమించి ఇసుక తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పి.లక్ష్మీదేవి హెచ్చరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల బదిలీ విశాఖ లీగల్ : నగరంలోని పలువురు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ బి.రామకోటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం మొబైల్ కోర్టు ఏపీపీ పి.శాంతి గౌతమి భీమిలి 16వ ప్రధాన శ్రేణి న్యాయస్థానం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. పాడేరు మెజిస్ట్రేట్ కోర్టు ఏపీపీ వీ. రమేష్, భీమిలి 14వ ప్రధమ శ్రేణి మేజిస్ట్రేట్ కోర్ట్ ఏపీపీగా వస్తున్నారు. నగరంలోని ఒకటవ ప్రధాన మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఏపీపీ ఎం షణ్ముఖ ఎకై ్సజ్ కోర్టు ప్రత్యేక ఏపీపీగా నియమితులయ్యారు. ఎక్సైజ్ కోర్టు ఏపీపీ కె విమల్ రాథోడ్, ఫస్ట్ ఏసీ ఎం కోర్టు ఏపీపీగా వస్తున్నారు. -
లక్ష్మీపురంలో దాహం కేకలు..
చోడవరం : విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఆ గ్రామానికి మంచినీళ్లు లేకుండా చేసింది. మంచినీళ్ల కోసం లక్ష్మీపురం గ్రామ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. 10 రోజులుగా ఈ గ్రామంలో కుళాయిల నుంచి మంచినీళ్లు రాక బిందెడు నీళ్ల కోసం బోర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ గ్రామంలో ప్రజలకు మంచినీళ్లు సమస్య ఉత్పన్నమైంది. చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామంలో సుమారు 5వేల మంది జనాభా ఉన్నారు. కొద్ది నెలలుగా ఈ గ్రామంలో తీవ్ర లోఓల్టేజీ సమస్యతో నాలుగు ట్రాన్స్ఫార్మర్లు ఒక్కొక్కటిగా కాలిపోతూ వచ్చాయి. గ్రామ పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి అనేకసార్లు చోడవరం విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోలేదు. తాజాగా మరో ట్రాన్స్ఫార్మర్ కూడా లో ఓల్టేజీ సమస్యతో కాలిపోయింది. ట్రాన్స్ఫార్మర్లు అన్నీ కాలిపోవడంతో విద్యుత్ సరఫరా లేక గ్రామంలో ఇంటింటి కుళాయిలకు మంచినీరు సరఫరా చేసే ట్యాంక్లకు బోర్ వెల్స్ నుంచి నీరు పంపింగ్ జరగలేదు. మంచినీటి ఓవర్ హెట్ ట్యాంక్లకు నీరు పంపింగ్ జరగకపోవడంతో గ్రామంలోకి కుళాయిల ద్వారా మంచినీరు సరఫరా నిలిచిపోయింది. బోల్వెల్స్ మోటార్లు కూడా కాలిపోవడంతో పంచాయతీ నుంచి వాటికి మరమ్మతులు చేయించారు. అయినా లోఓల్టేజీ కారణంగా పూర్తిగా ట్రాన్స్ఫార్మరే కాలిపోవడంతో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనిపై విద్యుత్ శాఖ అధికారులు కనీసం పట్టించుకోలేదు. ఎక్కువ ఖర్చుతో కూడిన పని అని ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రావాలంటూ జాప్యం చేసుకుంటూ వస్తున్నారే తప్ప ట్రాన్స్ఫార్మర్లు బాగుచేయించి లోఓల్టేజీ సమస్య నివారించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించే చర్యలు మాత్రం విద్యుత్ శాఖ అధికారులు చేపట్టడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంతో సరఫరా లేక నీరు ఇవ్వలేదు. దీంతో మంచినీటి సమస్యతో లక్ష్మీపురం ప్రజలు అల్లాడుతున్నారు. బిందెడు నీళ్ల కోసం చేతిబోర్లు, వ్యవసాయ పంపుసెట్ల వద్దకు వెళ్లి నానా అవస్థలు పడుతున్నారు. వేలాది మంది ప్రజలు మంచినీటి కోసం కష్టాలు పడుతున్నా అధికారులు మాత్రం కనీసం స్పందించకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. 5వేల మంది గ్రామస్తుల మంచినీటి సమస్యను పట్టించుకోని అధికారులు లో ఓల్టేజీ సమస్యతో కాలిపోయిన 4 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కరెంటు లేక వారం రోజులుగా నిలిచిన మంచినీటి సరఫరా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ అధికారులు మంచినీటి కోసం గగ్గోలు పెడుతున్న జనం అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు లో ఓల్టేజీ సమస్యతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని పదినెలులుగా విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. మంచినీటి ట్యాంక్కు నీరు పంపింగ్ చేసే ప్రదేశంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కూడా కాలిపోవడంతో కుళాయిల ద్వారా నీరు సరఫరా చేయలేదు. ఎంపీడీవోకి, విద్యుత్శాఖ ఏడీఈకి ఫిర్యాదు చేశాను. అయినా వారు చర్యలు తీసుకోలేదు. పంచాయతీ నుంచి ఏమీ చేయలేని పరిస్థితి. జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – శిరుచోళ్ల గంగాభవానీ గణపతినాయుడు, సర్పంచ్, లక్ష్మీపురం, చోడవరం మండలం -
ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం
నాతవరం : కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్సిక్స్ హామీలను యుద్ధ ప్రతిపాదికన అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలేపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా ఆందోళన చేపట్టారు. మొయిన్రోడ్డుపై ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికలు ముందు ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఏళ్ల తరబడి గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. అర్హత కలిగిన రైతులందరికీ రైతు భరోసా అందించాలన్నారు. తల్లికి వందనం, 50 ఏళ్లు దాటిన అందరికీ పింఛన్ల సదుపాయం కల్పించాలని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ఇతర సదుపాయాలు అమలు చేయాలన్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజనులపై అటవీశాఖ అధికారులు కేసులు పెట్టడం అపాలన్నారు. రెడ్బుక్ రాజ్యాంగంపై కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రం తహసీల్దార్ ఎ,వేణుగోపాల్కు ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకుడు గురుబాబు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాభవాని, మండల శాఖ అధ్యక్షుడు చిన్నంనాయుడు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు సూపర్ సిక్స్ వెంటనే అమలు చేయాలి నాతవరంలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన -
నెట్ సెంటరే సచివాలయం?
ఎస్.రాయవరం : తల్లికి వందనం పథకానికి లబ్ధిదారులను నమోదు చేస్తామని రేవుపోలవరం గ్రామంలో ఓ ఇంటర్నెట్ దుకాణం వద్ద రూ.30 చొప్పున వసూలు చేసి వేలిముద్రలు వేయించుకుంటున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.బాలాజీ మంగళవారం తెలిపారు. సచివాలయం లాగిన్ ఇంటర్నెట్ సెంటర్లో ఓపెన్ చేసి గ్రామస్తులందరినీ పిలిపించి రూ.30 చొప్పున తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సచివాలయం సిబ్బంది, సచివాలయాల్లో చేయాల్సిన పనులు ఇంటర్నెట్ సెంటర్లో చేయడం, పైగా నగదు వసూళ్లు చేయడం ఏమిటని ధ్వజమెత్తారు. స్థానిక కూటమి నేతలు ఈ రకమైన పనులను ప్రోత్సహించడం వల్ల సచివాలయ సిబ్బంది విధులకు సక్రమంగా హాజరుకాకపోవడమే కాకుండా పనులు పక్కదారి పడుతున్నాయన్నారు. ఈ సమస్యను మండల అధికారులు దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు. దీనిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పారు. తల్లికి వందనం వేలిముద్రకు రూ.30 చొప్పున వసూళ్లు అక్రమాలను ప్రోత్సహిస్తున్న కూటమి నేతలు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బాలాజీ ధ్వజం -
విద్వేషం.. విధ్వంసం
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుక్షణం నుంచే కూటమి నేతలు, కార్యకర్తలు దాడులు, హత్యలు, దౌర్జన్యాలతో చెలరేగిపోతున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణు లు, సానుభూతిపరులే లక్ష్యంగా తీవ్ర స్థాయిలో వేధింపులకు పాల్పడుతున్నా రు. రెడ్బుక్ పేరుతో టీడీపీ నేతలు, కార్యకర్తల దౌర్జనకాండకు హద్దుల్లేకుండా పోయింది. భౌతికదాడులు, ఆస్తుల విధ్వంసం విచ్చలవిడిగా కొనసాగుతోంది. ప్రశాంతతకు మారుపేరైన ఉమ్మడి విశాఖ జిల్లాలోని పల్లెల్లో వ్యక్తిగత విద్వేషాలు, దాడులు, అడ్డగోలు కేసులు, అరెస్టులు పెచ్చుమీరిపోయాయి. సాక్షి, అనకాపల్లి: హామీలు గాలికొదిలేశారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల వేధింపులే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. ఆస్తులు విధ్వంసమైనా, ప్రాణాల మీదకు వచ్చినా.. ప్రతిపక్షం నుంచి వచ్చిన ఫిర్యాదు అంటే పోలీసులు పట్టించుకోవడం మానేశారు. ఏడాది కూటమి పాలనలో ఉమ్మడి విశాఖ జిల్లాలో 100 మందిపై కేసులు నమోదు చేశారు. ఇద్దరిపై హత్యాయత్నం చేశారు. 11 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై 44 అక్రమ కేసులు పెట్టారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల పంటలు, ఇళ్లు ధ్వంసం చేశారు. స్పీకర్ ఇలాకాలో దాడులు, దౌర్జన్యాలు.. సాక్షాత్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడి నియోజకవర్గమైన నర్సీపట్నంలో దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు ఎక్కువగా జరిగాయి. ఇసుక దోపిడీని అ డ్డుకున్నందుకుగానూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్తోపాటు 44 మందిపై అక్రమ కేసులు బనాయించారు. కొద్ది రోజుల క్రితం వైఎస్సార్సీపీ యూత్ లీడర్ అల్లంపల్లి ఈశ్వర్రావుపై రౌడీలతో హత్యకు యత్నించారు. ఆయన అతి కష్టం మీద ప్రాణాలు దక్కించుకున్నారు. చిటెకెల కన్నపై కేసు నమోదు చేసి ఆయన ఇళ్లను కూల్చేశారు. వైబీ పట్నానికి చెందిన చుక్కా రాంబాబుపై దాడి చేశా రు. చీడిగొమ్మల గ్రామంలో టీడీపీ నేతలు దాడి చే యగా, 12 మంది వైఎస్సార్సీపీ యువతపై కేసులు నమోదు చేశారు. జూలై 9వ తేదీన మాకవరపాలెం మండలం రాశిపల్లి శివారు ఎరకన్నపాలెం గ్రామాని కి చెందిన వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ కొల్లి అప్పలనాయుడుపై 50 మందికి పైగా టీడీపీ గూండాలు కర్రలతో దాడి చేశారు. 2019లో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాకవరపాలెంలోని టీడీపీ కార్యకర్త లక్ష్మణ్ను వైఎస్సార్సీపీ నేతలు మందలించారు. ఈ వీడియోను ఇటీవల ఒక టీడీపీ నేత ట్విట్టర్లో పెట్టి వైఎస్సార్సీపీ నేతలు రుత్తల సత్యనారాయణ, బండారు గాంధీ సర్పంచ్లు బొడ్డు గోవిందరావు, మాకిరెడ్డి అయ్య ప్పలపై అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి పోలీస్స్టేషన్కు తరలించారు. దీనిపై న్యాయస్థానం మొట్టికాయలు పెట్టడంతో తోక ముడిచారు. హోంమంత్రి నియోజకవర్గంలో.. పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల గ్రామం శివారు మర్రిచెట్టు ప్రాంతంలో మాడెం వరలక్ష్మి ఇంటి ముందు స్థలాన్ని ఆక్రమించేందుకు టీడీపీకి చెందిన జవ్వాది ఈశ్వరరావు, జవ్వాది రమేష్, బత్తుల అప్పారావు, బత్తుల నరసింహమూర్తి, పబ్బు తుర్రయ్య దాడి చేశారు. మహిళల దుస్తులు చింపి అసభ్యకరంగా దూషించారు. దాడి చేయడమే కాకుండా బాధిత మహిళలపై టీడీపీ వారు కేసులు కూడా పెట్టారు. కూటమి ఏడాది పాలనలో వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు, దౌర్జన్యాలు ఉమ్మడి విశాఖ జిల్లాలో 100 మందిపై కేసులు, ఇద్దరిపై హత్యాయత్నం 11 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై 44 అక్రమ కేసులు వైఎస్సార్సీపీ సానుభూతిపరుల పంట నాశనం.. ఇళ్లు ధ్వంసం ఇసుక దోపిడీని అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్తోపాటు 44 మందిపై కేసులు నాతవరం మండలం డి.ఎర్రవరంలో ధ్వంసమైన పంట సోషల్మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు విశాఖ తూర్పు నియోజకవర్గం మద్దిలపాలేనికి చెందిన వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ బోస రమణారెడ్డిపై వివిధ జిల్లాల్లోని పొదిలి, దర్శి, ఇచ్ఛాపురం, నీలకంఠాపురం, పార్వతీపురం పోలీస్స్టేషన్లలో ఆరు కేసులు నమోదు చేశారు. ఒక స్టేషన్ తర్వాత మరో స్టేషన్కు తిప్పి తీవ్రంగా వేధించారు. ఆయన డిసెంబర్ నెలలో విడుదలయ్యారు. విశాఖ జిల్లా గాజువాక మండలం గొల్లజగ్గరాజుపేటలో నివాసముంటున్న బోడి వెంకటేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనన్ కల్యాణ్, మంత్రి లోకేష్లపై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ మొత్తం 17 కేసులు నమోదు చేశారు. ఆయనను తొలుత 2024 నవంబర్ 3న అరెస్టు చేశారు. మొత్తం 115 రోజులపాటు రిమాండ్లో ఉన్నారు. బాపట్ల జిల్లా మార్టూరు స్టేషన్లో సీఐ సీహెచ్ శేషగిరిరావు 15 నిమిషాల్లో 4 వేల గుంజీలు తీయమని ఇబ్బంది పెట్టారు. రాజాం, చినమేరంగి (కురుపాం), విశాఖలో దువ్వాడ, టూటౌన్, పరవాడ, సబ్బవరం, మహారాణిపేట, రేపల్లె, పెదకూరపాడు, పాతగుంటూరు, కృష్ణపట్నం, చీరాల, మార్టూరు, గుంటూరు, బాపట్ల, లావేరు, కర్నూల్, కడప, విజయవాడ, మైలవరం, మంచిలీపట్నంలలో కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లిలో కండిషన్ బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో మరో ముగ్గురు సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై కేసులు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. విశాఖకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్పై విశాఖలోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మొత్తం 21 కేసులు నమోదు చేశారు. కేసులు, విచారణ అంటూ రెండు నెలలు పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. మొదట 2024 ఆగస్టు 31న పోలీసులు అరెస్టు చేశారు. అతని కుటుంబ సభ్యులు హైకోర్టుకు వెళ్లడంతో బెయిల్ లభించింది. మళ్లీ 2024 నవంబర్లో కొత్త కేసులు పెట్టి అరెస్టు చేశారు. విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న సమయంలో బాపట్లలో కూడా మరో కేసు నమోదు చేశారు. దీంతో జైలు నుంచి నేరుగా బాపట్లకు తీసుకువెళ్లి విచారించారు. ఇలా అతడిపై రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారు. ప్రస్తుతం బెయిల్ మంజూరు చేశారు. -
సొంత గనులు కేటాయించాలి
స్టిల్ ప్లాంట్ 100 వ్యూహాత్మక ఆమ్మకానికి వ్యతిరేకంగా కేంద్ర నిర్ణయాన్ని ఉపసంహరించుకోలేదు. ఆ ప్రక్రియలు మరింత వేగవంత చేస్తోంది. ఇది స్టీల్ ప్లాంట్కు నష్టం కనుక ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. స్టీల్ప్లాంట్కు సొంత గనులు కేటాయించటం ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గి సరసమైన ధరలకు స్టీల్ ప్రజలకు అందుతుంది. ప్రధానంగా యాజమాన్యం వైఖరి మార్చుకొని కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలి. –జె.అయోధ్యరామ్,స్టీల్సీఐటీయు గౌరవ అధ్యక్షులు -
మళ్లీ.. మళ్లీ కలెక్టరేట్కే..
తుమ్మపాల: పొంతన లేని సమాధానాలతో పీజీఆర్ఎస్ అర్జీదారులను అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం కాళ్లరిగేలా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదంటూ అర్జీదారులు వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యానికి గురై ఏర్పడిన సమస్యలపై కలెక్టరేట్లో మొరపెట్టుకుంటే జిల్లా అధికారులు సైతం అదే ధోరణి చూపిస్తున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థపై క్రమేపి ప్రజల్లో నిరాశ వ్యక్తమవుతోంది. పీజీఆర్ఎస్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నట్లు అధికారులు ఎండార్స్మెంట్లు ఇస్తూ వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. దీంతో రెవెన్యూ సంబంధిత భూ సమస్యలు తప్ప ఇతర సంక్షేమ పథకాలు, వ్యక్తిగత అవసరాలకు సంబంధించి వాటిపై విన్నవించేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరి సంఖ్య క్రమేపి తగ్గుతూ వస్తోంది. ఈ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 122 అర్జీలు రెవెన్యూ సంబంధిత అంశాలివే వచ్చాయి. పంచాయతీ రాజ్ – 32, సర్వే శాఖ –18, పోలీస్ –17, మరో 17 శాఖల్లో ఒకటి, రెండేసి అర్జీలు మాత్రమే నమోదయ్యాయి. మొత్తం 240 అర్జీలు రాగా, అధిక సంఖ్యలో ఫిర్యాదులు పునరావృతమైనవే ఉన్నాయి. ● కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అర్జీదారుల వద్ద కలెక్టర్ విజయకృష్ణన్తోపాటు డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఎస్డీసీలు సుబ్బలక్ష్మి, మనోరమ అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారం కాక.. వస్తున్న అర్జీదారులు మండల అధికారుల నిర్లక్ష్య ధోరణిపై ఆవేదన కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో 240 అర్జీల నమోదుపాసుపుస్తకాలు మంజూరు చేయలేదు డీ–పట్టా భూమిని ఆన్లైన్ చేసి పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని కోరుతూ పాయకరావుపేట మండలం కుమారపురం గ్రామానికి చెందిన గురుబిల్లి రాంబాబు అర్జీ చేసుకున్నాడు. తన అత్తగారైన కర్రి లక్ష్మి ద్వారా సంక్రమించిన డీపట్టా భూమి నేటికీ ఆన్లైన్ కాకపోవడంతో ప్రభుత్వ పథకాలు, సహాయం పొందలేక పోతున్నానని మొరపెట్టుకున్నాడు. వృద్ధాప్యంతో ఉన్న తనకు పాసుపుస్తకాలు మంజూరు చేసి న్యాయం చేయాలని కోరాడు. మెట్టింట్లో కూతురు ఉద్యోగం చేస్తే పింఛన్ రాదంట! వృద్ధాప్యంతో ఒంటరిగా జీవిస్తున్న తనకు ప్రభుత్వ పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ పట్టణంలోని గవరపాలెం అంబేడ్కర్ నగర్కు చెందిన జల్లూరి గొంతమ్మ పీజీఆర్ఎస్లో అర్జీ పెట్టుకుంది. పట్టణంలో 23వ గ్రామ సచివాలయానికి పలుమార్లు తిరిగినా ప్రయోజనం లేకుండా పొయిందని వాపోయింది. పింఛన్ ఇస్తామంటూ ఇన్నాళ్లు తిప్పించుకుని, వివాహమైన కూతురు పేరు రేషన్ కార్డులో ఉందని, ఆమె ఉద్యోగం చేస్తున్నందున పింఛన్ రాదని ఇప్పుడు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఒంటరిగా జీవిస్తున్న తనకు వివాహమై వెళ్లిపోయిన కూతురు వివరాలు జోడించి అన్యాయం చేయొద్దని, కలెక్టరమ్మ స్పందించి పింఛన్ మంజూరు చేయాలని ఆమె వేడుకుంది. -
ఉక్కు ఉద్యమంపై కుట్ర
● పోలీసుల ద్వారా కూటమి ప్రభుత్వం వేధింపులు ● దీక్షా శిబిరాన్ని ఆక్రమించిన పోలీసులు ● నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేసిన ఆందోళనకారులు ● పోలీసుల తీరుపై ఉక్కు కార్మికుల ఆగ్రహం కూర్మన్నపాలెం: విశాఖ ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కూర్మన్నపాలెం వద్ద కొనసాగుతున్న దీక్షా శిబిరం వద్ద సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమాలను పోలీసుల ద్వారా అణచివేయాలని ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. 1,579 రోజులుగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో దీక్ష కొనసాగుతుండగా సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా దీక్షా శిబిరంలోకి పోలీసులు చొరబడి కుర్చీలలో ఆసీనులవడంతో ఆగ్రహించిన కార్మికులు నేలపై కూర్చుని నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా పోలీసులు దౌర్జన్యం ఆపాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశత్వం విడనాడాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్మిక సంఘాల నేతల ధ్వజం అఖిల పక్ష కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రభుత్వాలు అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తు న్నాయని దుయ్యబట్టారు. శాంతియుతంగా జరుగుతున్న దీక్షలను పోలీసుల ద్వారా అణచివేయాల ని చూడటం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉందని కారణం చూపి తొలగించడాన్ని యాజమాన్యం అక్షేపించడాన్ని తప్పుబట్టారు. కర్మాగారం స్థాపించినప్పటి నుంచి అనేక పోరాటాలు చేశామని, ఇంత దారుణంగా ఎవరూ ఎప్పుడూ వ్యవహరించలేదని పోరాట కమిటీ చైర్మన్ డి. ఆదినారాయణ ఆరోపించారు. మునుపెన్నడూ లేని విధంగా దీక్షా శిబిరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం ఇదే ప్రథమమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి విధానాలు విడనాడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. సిట్ గౌరవ అధ్యక్షులు జె. అయోధ్యరామ్ మాట్లాడుతూ, కార్మికులను అణచివేసి కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని మండిపడ్డారు. ఇది పాలకులకు క్షేమకరం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 78వ వార్డు కార్పొరేటర్ బి. గంగారావు మాట్లాడుతూ, కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలన్న కుట్ర ప్రభుత్వ విధానాల్లో భాగమేనని, కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ లో భాగంగానే కార్మికుల ఉద్యమాలను అణచివేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి నిర్ణయాలు ఉపసంహరించుకొని తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని గంగారావు హెచ్చరించారు. భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు నమ్మి రమణ, కేఎం.శ్రీనివాస్, రామచంద్రరావు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ సందర్శించిన నలుగురు విద్యార్థులు
మాడుగుల రూరల్: సృజనవాణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండలంలో వీరవల్లి అగ్రహారం విద్యార్థులు ఢిల్లీ సందర్శించారు. అక్కడ సమీపంలో రిషిహుడ్ విశ్వవిద్యాలయంలో పర్సనాలిటీ డెవలప్మెంటుపై శిక్షణ తీసుకున్నారు. ఫ్లై ఇన్ ది స్కై సూపర్ 60 రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులు కె. కల్పన(చోడవరం), ఎం. రోహిత్కుమార్ (వీరనారాయణం), కె.మోహిత, ఎం. గౌతమి( కె.జె.పురం) ఎంపిక చేశారు. ఈ నెల ఒకటో తేదీన ఇక్కడ నుంచి ఢిల్లీకి రైల్లో వెళ్లారు. ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపుదల వంటి అంశాల్లో శిక్షణ పొందారు. ఇందులో భాగంగా అక్షరధామ, లోటస్పాండ్, ఢిల్లీ గేట్, పార్లమెంటు భవనంతో పాటు పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. అక్కడ నుంచి నేరుగా విమానంలో విశాఖకు సోమవారం తిరిగి వచ్చారు. వీరి వెంట సృజనవాణి స్వచ్ఛంద సంస్థ కార్యనిర్వాహక సభ్యుడు పి. మహేశ్ వెళ్లారని సంస్థ సమన్వయకర్త జానీ సోమవారం తెలిపారు. రిషిహుడ్ విశ్వవిద్యాలయంలో పర్సనాలిటీ డెవలప్మెంటుపై శిక్షణ -
వాటర్ ప్లాంట్ నిర్వహణలో కక్షసాధింపు
● వైఎస్సార్సీపీ నాయకుడు బుజ్జి తొలగింపు నర్సీపట్నం: ఎన్టీఆర్ సుజల స్రవంతి నిర్వహణ నుంచి వైఎస్సార్సీపీ నాయకుడు దాడి బుజ్జిని రాజకీయ కక్షసాధింపుతో తప్పించడం సరికాదని మున్సిపల్ వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, కౌన్సిలర్లు సిరసపల్లి నాని, మాకిరెడ్డి బుల్లిదొర, కోఆప్షన్ సభ్యుడు ఎండీ బాషా, పార్టీ నాయకులు చీటిల రాము, యాదగిరి శేషు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సురేంద్రకు సోమవారం వారు వినతిపత్రం అందజేశారు. 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కాపు వీధిలో ప్రారంభించిన ఈ ప్లాంట్ను నాటి నుంచి నేటి వరకు బుజ్జి తన సొంత నిధులతో నిర్వహిస్తూ ప్రజలకు సజావుగా నీటిని సరఫరా చేస్తున్నారన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదు లేకపోయినా టీడీపీ నాయకులు ఒత్తిడి మేరకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ప్లాంట్ నిర్వహణ బాధ్యతల నుంచి తొలగించటం సమంజసం కాదన్నారు. ప్లాంట్ నిర్వహణకు అవసరమైన ఎక్యూప్మెంట్కు రూ.2 లక్షలకు పైగా వెచ్చించారన్నారు. కనీసం ఆ నిధులైన ఇవ్వాలని వినతిపత్రంలో డిమాండ్ చేశారు. -
కేజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ వాణి బాధ్యతల స్వీకరణ
మహారాణిపేట: కేజీహెచ్ సూపరింటెండెంట్గా ప్రసూతి, సీ్త్ర వ్యాధుల విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఐ.వాణి సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సూపరింటెండెంట్ పోస్టు అదనపు డీఎంఈ కేడర్లో ఉండటంతో.. అదే కేడర్కు చెందిన డాక్టర్ వాణిని నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న డాక్టర్ పి.శివానంద్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. సీఎస్ఆర్ఎంవో డాక్టర్ యు.శ్రీహరి, అడ్మినిస్ట్రేటర్ బి.వి.రమణ, డిప్యూటీ సీఎస్ఆర్ఎంవో డాక్టర్ జి.మెహర్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ డి.రాధాకృష్ణన్, డాక్టర్ వి.రవి, డాక్టర్ ఎల్.లోకనాథ్ రావు, డాక్టర్ జి.వాసవి లత, అసిస్టెంట్ డైరెక్టర్ బి.ఎస్.సుమతితో పాటు ఇతర వైద్యులు, పరిపాలన సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డాక్టర్ వాణి మాట్లాడుతూ రోగులకు మెరుగైన సంరక్షణ, ఉన్నతమైన చికిత్స ప్రమాణాలు అందించడమే తన ప్రథమ లక్ష్యమని తెలిపారు. కేజీహెచ్ ప్రతిష్టను ఇనుమడింపజేసేందుకు, అవసరమైన సంస్కరణలు చేపట్టేందుకు ప్రతి ఒక్కరి సహకారం తీసుకుంటానన్నారు. -
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు
తుమ్మపాల: ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు వినియోగించడం ఎంతో ఆరోగ్యకరమని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ను ఆమె సోమవారం ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, ఆ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కె.శచీదేవి, ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రాజకీయ సిఫార్సులకే పెద్దపీట?
● ఉమ్మడి విశాఖలో బదిలీల దుమారం ● ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నో బదిలీ ● పెందుర్తిలో బాబ్జీకి భంగపాటు? మహారాణిపేట: ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జరిగిన రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల ఉద్యోగుల బదిలీలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోయిన, ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు తహసీల్దార్లకు స్థానచలనం కల్పించకపోవడం, అదే సమయంలో కీలకమైన పోస్టులను భర్తీ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ బదిలీల ప్రక్రియలో కూటమి ఎమ్మెల్యేల సిఫార్సులకే పెద్దపీట వేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా రెవెన్యూ శాఖలో జరిగిన తహసీల్దార్ల బదిలీలలో రాజకీయ జోక్యం స్పష్టంగా కనిపిస్తోంది. పెందుర్తి తహసీల్దార్ బదిలీ విషయంలో అక్కడి ఎమ్మెల్యే పంతం నెగ్గించుకున్నారు. ఈ విషయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ సిఫార్సులను పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. భీమిలి ఎమ్మెల్యే సిఫార్సు మేరకే ఆనందపురం తహసీల్దార్ను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ సంవత్సరాలు పనిచేసిన కారణంగా గాజువాక తహసీల్దార్ బదిలీ జరిగింది. అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారులను కదపకపోవడం గమనార్హం. వీరితో పాటు డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందితో కలిపి రెవెన్యూ శాఖలో మొత్తం 62 మందిని బదిలీ చేశారు. పంచాయతీరాజ్లో 75 మందికి స్థానచలనం జిల్లా పరిషత్లో కూడా భారీగా బదిలీలు జరిగాయి. జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి మొత్తం 75 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఐదుగురు ఎంపీడీవోలు, ఐదుగురు పరిపాలనాధికారులు, 4 సీనియర్ అసిస్టెంట్లు, 11 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు టైపిస్టులు, 12 మంది రికార్డు అసిస్టెంట్లు, 30 మంది ఆఫీస్ సబార్డినేట్లు, ఆరుగురు నైట్ వాచ్మెన్ ఉన్నారు. జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర పాల్గొన్నారు.బదిలీ అయిన రెవెన్యూ అధికారులు వీరే.. మండలం/స్థానం తహసీల్దార్/ కేటాయించిన స్థానం సూపరింటెండెంట్ పేరు పెందుర్తి ఎం.ఆనందకుమార్ అనకాపల్లి జిల్లా ములగాడ ఎం.భుజంగరావు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్(అల్లూరి) బి.నాగరాజు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్(అల్లూరి) ిసీహెచ్ తిరుమలరావు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్(అల్లూరి) ఎం.భాస్కరఅప్పారావు అనకాపల్లి జిల్లా అల్లూరి జిల్లా టి.రామకృష్ణ పెందుర్తి మండలం అల్లూరి జిల్లా ఎంవీవీపసాద్ ల్యాండ్ ప్రొటెక్షన్(విశాఖ) కలెక్టరేట్(అనకాపల్లి) బీవీ రాణి మెజిస్టీరియల్ సెక్షన్(విశాఖ) అచ్యుతాపురం జి.జనార్ధన్ అల్లూరి జిల్లా ఆనందపురం పి.శ్యాంప్రసాద్ కోఆర్డినేషన్ సెక్షన్(విశాఖ) (ఆనందపురం హెచ్డీటీ ఎల్.చేతన్ కుమార్ ఇన్చార్జి తహసీల్దార్గా నియామకం) గాజువాక టి.శ్రీ వల్లి వీఎంఆర్డీఏ (గాజువాక హెచ్డీటీ బి.శ్రీనివాసరావు ఇన్చార్జి తహసీల్దార్గా నియామకం) సీతమ్మధార ఎం.రమేష్ను ములగాడ (సీతమ్మధార హెచ్డీటీ ఎస్.ఎ.త్రినాథరావు ఇన్చార్జి తహసీల్దార్గా నియామకం) -
సాక్షి కార్యాలయాలపై దాడులు సరికాదు
సాక్షి, అనకాపల్లి: రాష్ట్రవ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై టీడీపీ దాడులకు పాల్పడడం సరికాదని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. సాక్షి కార్యాలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా వ్యాప్తంగా పాత్రికేయులు ఆయా పోలీసు స్టేషన్లలో సోమవారం ఫిర్యాదులు చేశారు. అనకాపల్లిలో సీఐ విజయకుమార్కు, పాయకరావుపేట పోలీసు స్టేషన్లో ఎస్ఐ పురుషోత్తంకు స్థానిక పాత్రికేయులు సహా సాక్షి విలేకరులు ఫిర్యాదులు అందజేశారు. కోటవురట్ల పోలీసు స్టేషన్లో ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు ఎం.రాజు, డి.అప్పారావు ఫిర్యాదు చేశారు. యలమంచిలి, దేవరాపల్లి, గొలుగొండ, కె.కోటపాడు, నక్కపల్లి, మునగపాక, రోలుగుంట, రావికమతం, అచ్యుతాపురం స్టేషన్లలో కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు అందజేశారు. కొందరు వ్యక్తులు చేపట్టిన రాజకీయ ప్రేరేపిత దాడులు, ఇతర నేర చర్యలపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సాక్షి మీడియా విశాఖ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ వర్రి చంద్రారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కార్యాలయం ఎదుట అనుమతి లేకుండా గుంపులుగా చేరి దాడులకు పాల్పడ్డారని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆదివాసీల ధర్నా
మాడుగుల రూరల్ : శంకరం పంచాయతీ శివారు కృష్ణంపాలెం గ్రామానికి సంబంధించి ప్రభుత్వ బంజరు భూములను స్థానిక ఆదివాసీలకు కేటాయించాలని కోరుతూ సోమవారం ర్యాలీ నిర్వహించారు. మాడుగుల గాంధీ పార్కు నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీల సమస్యలు గురించి నినాదాలు చేశారు. తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం తహసీల్దారు రమాదేవిని కలిసి వినతిపత్రం అందజేశారు. శంకరం పంచాయతీ శివారు కృష్ణంపాలెం గ్రామంలో గల సర్వే నెంబరు 188–3 లో గల భూమిని ఆదివాసీలకు కేటాయించాల ని, సివిల్ కేసులలో ఆదివాసీలను ప్రతిసారి పోలీసుస్టేషన్కు పిలిపించి పోలీసులు తమని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తహసీల్దా రుకు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. త హసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ ఎస్ఐ, ఇతర సిబ్బందితో మాట్లాడుతానని వారికి హామీ ఇచ్చారు. అలాగే కృష్ణంపాలెం గ్రామానికి చెందిన 46 మంది వ్యక్తిగతంగా దరఖాస్తులు అందజేశారు. సీపీఐ ఎంఎల్ లిబిరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్.గణేష్ పాల్గొన్నారు. గ్రామీణ మెరుపులు -
అయోమ‘యోగాంధ్ర’
యలమంచిలి రూరల్: యోగాంధ్ర పేరిట ప్రభుత్వం చేస్తున్న హంగామా అధికారులు, ఉద్యోగులను అయోమయానికి, తీవ్ర అవస్థలకు గురిచేస్తోంది. రాష్ట్రంలో యోగాంధ్ర కార్యక్రమం అమలవుతున్న తీరు సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చిందన్నట్టుంది. నెల రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రజలను భాగస్వాములను చేయాలని సచివాలయ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో పురపాలక సంఘాలు, నగర పంచాయతీలతోపాటు సచివాలయాల పరిధిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఏ ఒక్కర్నీ వదలడం లేదు. కొద్ది రోజులుగా మిగతా విషయాలు పక్కన పెట్టి కేవలం యోగా మంత్రం జపిస్తున్నారు. దీంతో అధికారులు తీవ్రంగా నలిగిపోతున్నారు. యోగాంధ్ర యాప్ రిజిస్ట్రేషన్ల నుంచి గ్రామ, మండల స్థాయి పోటీల నిర్వహణ వరకూ ఎంపీడీవో, తహసీల్దార్ స్థాయి అధికారులకు టార్గెట్లు నిర్ణయించారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఈ లక్ష్యాలను ఎలా చేరుకోగలమంటూ అధికారులు మధనపడిపోతున్నారు. గ్రామ సెక్రటరీలు, అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు, యోగాంధ్ర మాస్టర్ ట్రైనీలు ఇలా అందరిపైనా తీవ్ర పనిభారం, ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటి వరకూ రిజిస్ట్రేషన్లు, యోగా ప్రొటోకాల్ ఆసనాల శిక్షణను అధికారులు నయానో, భయానో పూర్తి చేశారు. ఇవేం పోటీలు జిల్లా స్థాయిలో యోగా పోటీలకు సంబంధించి 10 నుంచి 18 సంవత్సరాలు, 19 నుంచి 35 సంవత్సరాలు, 35 ఏళ్లు పైబడి అంటూ మూడు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి 50 ఏళ్లు పైబడిన కేటగిరీ ఇవ్వకపోవడంతో, యోగాలో అనుభవం, ఆసక్తి ఉన్న ఆ వయస్సు గ్రూపునకు చెందిన కొందరు 35 ఏళ్ల వయస్సున్న వారితో పోటీ పడే పరిస్థితి ఏర్పడిందని వారంతా పోటీల్లో పాల్గొనడానికి ఆసక్తి కనబర్చడం లేదు. నిరంతరం సాధన చేసే వారు, యోగా శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందే వారు మాత్రమే వేయగల ఆసనాలను మాత్రమే పోటీల జాబితాలో పొందుపర్చడంతో ఆ జాబితాను చూసిన వారందరూ విస్మయం చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నవారిని సైతం పోటీల్లో అభ్యర్థులుగా చేర్చడంతో.. క్లిష్టతరమైన ఆసనాలు వేయలేమని, తమ పేర్లను తొలగించాలని వారు కోరుతున్నారు. కానీ పోటీలో ఎక్కువమంది పాల్గొన్నట్టు చూపించేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు. చిన్న పిల్లలకు ఆకర్ణ ధనురాసనం, బకాసనం, 19 నుంచి 35 సంవత్సరాల విభాగంలో మత్స్యేంద్రాసనం, జిల్లా స్థాయిలో విభక్త పశ్చిమోత్తాసనం వంటి ఆసనాలు వేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో పూర్ణ మత్స్యేంద్రాసనం, ఓంకారాసనం, కర్ణ పీడాసనం ఇచ్చారు. సచివాలయ ఉద్యోగులతోపాటు యోగా మాస్టర్ ట్రైనీలు, ఎంపీడీవోలు గ్రామాల్లోకి వెళ్లి పోటీల్లో పాల్గొనాల్సిందిగా అందరినీ ప్రాధేయపడవలసి వస్తోంది. మండల స్థాయి పోటీలను ఏదోలా మమ అన్పించినప్పటికీ జిల్లా స్థాయి పోటీలకు వెళ్లేవారిని పంపించడం కష్టతరమేనని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. యోగా మానసిక, శారీరక ఆరోగ్యానికి దివ్య ఔషధం... ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది... కానీ అధికారులు, ఉద్యోగులు మాత్రం గత పక్షం రోజులుగా ‘యోగాంధ్ర’ ఒత్తిడితో నలిగిపోతున్నారు. ఒక పక్క శిక్షణ కార్యక్రమాలు... మరో పక్క ఫొటోలను అప్లోడ్ చేయడం...ఇంకో పక్క అభ్యర్థులను ఒప్పించే, టార్గెట్లను పూర్తిచేసే పనులు, సర్వేలు, టెలీకాన్ఫరెన్స్లు ఇలా తలకు మించిన పనులతో సతమతమవుతున్నారు. కింది స్థాయి నుంచి ఒకటే హైరానా పడుతున్నారు.... సాధ్యం కాని ఆసనాలతో పోటీలకు ఎలా సిద్ధం చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. సాధ్యం కాని ఆసనాలతో పోటీలు ఎలా ? యోగాంధ్ర కార్యక్రమానికి మే 21 నుంచి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ కేంద్రంగా ఐదు లక్షల మందితో నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ కూడా హాజరవుతుండడంతో ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో అధికారులు, ఉద్యోగులకు క్షణం తీరిక లేకుండా చేస్తోంది. యోగాంధ్ర ఎన్రోల్మెంట్, మాస్టర్ ట్రైనీల రిజిస్ట్రేషన్, యోగా ప్రొటోకాల్ ఆసనాలను పూర్తి చేసినప్పటికీ, జిల్లా స్థాయి యోగాసనాల పోటీల నిర్వహణ మాత్రం మా వల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. ఎందుకంటే సాధ్యం కాని, అలవాటు లేని ఆసనాలతో పోటీలు నిర్వహించాలని అధికారులు మార్గదర్శకాల్లో పేర్కొనడంతో, కొత్తగా యోగా నేర్చుకున్న తాము ఈ ఆసనాలను ఎలా వేయగలమంటూ పోటీల్లో పాల్గొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. తీవ్ర స్థాయిలో ఉద్యోగులపై పని ఒత్తిడి యోగాంధ్ర సర్వే, లక్ష్యాలు, టెలీకాన్ఫరెన్సులతో తిప్పలు సాధ్యం కాని ఆసనాలతో పోటీ ఎలా అంటున్న ప్రజలు వెబ్తోనే టైం సరి యోగాంధ్ర కార్యక్రమం కోసం ప్రతి రోజూ కలెక్టర్ నుంచి ఆయుష్ విభాగం అధికారులు, పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు గూగుల్ మీట్, వెబెక్స్ నిర్వహిస్తుండడంతో గంటల కొద్దీ సమయం వృథా అవుతోందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కిందిస్థాయి ఉద్యోగులను గ్రామాల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై దృష్టి పెట్టాలంటున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మూడు రోజులపాటు ఎటువంటి శ్రమ లేకుండా చేపట్టామని అధికారులు చెబుతుండడం గమనార్హం. అప్పటి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. కానీ ఇపుడు యోగాంధ్ర కార్యక్రమం కోసం నెల రోజులపాటు నరకయాతన పడుతున్నామని అధికారులు తమ అంతర్గత సంభాషణల్లో తలలు పట్టుకుంటున్నారు. యోగాసనాలు నేలపై వేయకూడదు. మ్యాట్లు, లేదా కార్పెట్లు వంటివి ఉండాలి. కానీ యోగాంధ్ర కోసం అధికారుల మాట కాదనలేక కటిక నేలపై కూడా ఆసనాలు చేస్తున్న ఫొటోలు అప్లోడ్ చేస్తున్నారు. యోగాంధ్ర కార్యాచరణతో చాలా పని ఒత్తిడితో సచివాలయం నుంచి మండల స్థాయి ఉద్యోగులంతా నరకం చూస్తున్నారు. చివరకు రోజూ కార్యాలయంలో రాత్రి 10 గంటల వరకూ కూడా పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అధికారులు తీవ్రంగా మధనపడుతున్నారు. -
విద్యార్థులే దేశానికి పట్టుకొమ్మలు
అనకాపల్లి టౌన్: విద్యార్థులే దేశానికి పట్టుకొమ్మలని, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ప్రోత్స హించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ ఏడాది పది, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులకు అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సోమ వారం షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేశారు. 10వ తరగతిలో 153 మంది, ఇంటర్లో 32 మంది అవార్డులు అందుకున్నారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులకు ఒక్కొక్కొరికి రూ.20 వేలు చెక్, ప్రోత్సాహక సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నామన్నారు. కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ ఈ షైనింగ్ స్టార్స్ ఇక్కడితో ఆగకుండా రాబోయే రోజుల్లో మంచి విద్యను అభ్యసించి సమాజానికి సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర 185 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం -
సింహాచలం దేవస్థానం ఈవో బదిలీ
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఈవో వి. త్రినాథరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ని దేవదాయశాఖ రాజమహేంద్ర వరం మల్టీ జోన్–1 రీజనల్ జాయింట్ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి వి. వినయ్చంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సింహాచలం దేవస్థానానికి కొత్త ఈవో నియమితులయ్యే వరకు త్రినాథరావే ఇన్చార్జి ఈవోగా కొనసాగాలని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. త్రినాథరావు 2024 సెప్టెంబర్ 22 నుంచి సింహాచలం దేవస్థానం ఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి మే 31 వరకు వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉన్న ఆయన, గత నెల 26వ తేదీనే తిరిగి విధుల్లో చేరారు. కాగా, తనను సింహాచలం దేవస్థానం నుంచి బదిలీ చేయాలని త్రినాథరావే దేవదాయశాఖకు దరఖాస్తు చేసుకున్నందువల్లే ఈ బదిలీ జరిగిందని ప్రచారం జరుగుతోంది. -
సంఘాల నిర్మాణంతో పాటు ఉద్యమాన్ని విస్తరించాలి
డాబాగార్డెన్స్: డాబాగార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యల రెండు సంస్థల విలీన సభ సందర్భంగా సాహిత్య సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ, గత 50 ఏళ్లుగా విప్లవ సాంస్కృతికోద్యమ నిర్మాణంలో భాగమైన రెండు సంఘాల విలీనం అవసరమన్నారు. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం భావాలున్న వారు ఐక్యమవ్వాల్సిన అవసరం ఉందని, రాజకీయ కార్యాచరణ ద్వారానే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో కార్పొరేట్ మనువాదం, సామ్రాజ్యవాదం పెరిగిపోతున్నాయని, మోదీ ప్రభుత్వం ప్రశ్నించే వారిని అణచివేస్తోందని ప్రొఫెసర్ కాశీం విమర్శించారు. ఇటువంటి తరుణంలో కళాకారులు ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఉందని, ఆ దిశగా అరుణోదయ కళాకారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైటర్స్ అకాడమీ చైర్మన్ వీవీ రమణమూర్తి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, మందసలో ఎయిర్పోర్టు రాకుండా రైతుల భూములను రక్షించాలని కోరారు. తెలంగాణ అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి మోదీ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. సభాధ్యక్షుడు నాగరాజు అమర కళావీరులను స్మరిస్తూ తీర్మానం చేశారు. ముందుగా సరస్వతి పార్క్ నుంచి సభావేదిక వరకు అరుణోదయ కళాకారుల కళా ప్రదర్శన ఆటపాటలతో సాగింది. కార్యక్రమంలో తెలంగాణ అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సున్నశెట్టి రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి అంజయ్య, కె నిర్మల, ఎస్.జయలక్ష్మీ, పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు ఎం.లక్ష్మీ, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకుడు వేంకటేశ్వర్లు, న్యాయవాది చలం అధిక సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు.