andamaina maya
-
అమ్మాయి మాయ!
ఆ కుర్రాడిని ఓ అమ్మాయి మాయ చేసింది. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘అందమైన మాయ’. కార్తీక్, భవశ్రీ జంటగా నాగరాజు కొట్టే నిర్మించిన ఈ చిత్రానికి మణీంద్రన్ దర్శకుడు. ఈ సినిమా పోస్టర్ను తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ‘మా’ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. ఈ చిత్రం విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నోముల నర్శింహయ్య, చిన శ్రీశైలం యాదవ్, కొట్టే బాలయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
భయంకరమైన అడవుల్లో షూటింగ్
హారర్ నేపథ్యంలో విశ్వశ్రీ ఆర్ట్స్ పతాకంపై దినకరన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘అందమైన మాయ’. చిరుసాయి, హేమంత్, కార్తీక్, కావ్యశ్రీ, శ్రుతి, ఝాన్సీ ముఖ్య తారలు. మణీంద్రన్ దర్శకత్వ పర్యవేక్షణలో నాగరాజు నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సత్య సోమేష్ పాటలు స్వరపరిచారు. హైదరాబాద్లో జరిగిన ఆడియో వేడుకలో మాజీ మంత్రి నోముల నరసింహయ్య సీడీని ఆవిష్కరించి సినీ నిర్మాత టి. ప్రసన్నకుమార్కు ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాణ నిర్వాహకుడు నాగరాజు కొట్టి మాట్లాడుతూ -‘‘ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే సినిమా ఇది. ఇందులో ఉన్న పాటలన్నీ బాగుంటాయి. ముఖ్యంగా ఇందులోని ప్రత్యేక నృత్య గీతం ‘కెవ్వు కేక...’ పాట స్థాయిలో ప్రేక్షకాదరణ పొందే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఇప్పటివరకు వచ్చిన హారర్ చిత్రాలకన్నా ఈ సినిమా భిన్నంగా ఉంటుందని, హారర్ సన్నివేశాలు 20 రోజుల పాటు భయంకరమైన అడవుల్లో చిత్రీకరించామని దర్శకుడు తెలిపారు. ఈ వేడుకలో అతిథులుగా పాల్గొన్న కొడాలి వెంకటేశ్వరరావు, అశోక్కుమార్, ప్రభు, సురేశ్ కొండేటి తదితరులు సినిమా విజయం సాధించాలన్న ఆకాంక్ష వెలిబుచ్చారు. ఇంకా ఈ సినిమా విజయం పట్ల చిత్రబృందం తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. -
భయపెట్టే మాయ
చిరుసాయి, హేమంత్, శ్రుతి, ఝాన్సీ ముఖ్య తారలుగా దినకరన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అందమైన మాయ’. పాటల చిత్రీకరణ మినహా సినిమా పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిర్మాణ నిర్వాహకుడు నాగరాజు కొట్టి మాట్లాడుతూ -‘‘హారర్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. కథానుసారం దట్టమైన అడవుల్లో షూటింగ్ చేశాం. మరో పది రోజులు జరిపే షూటింగ్తో పాటల చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ నెల చివరి వారంలో పాటలు విడుదల చేయనున్నాం. ఈ పాటల్లో ఉన్న ఓ ఐటమ్ సాంగ్ ‘కెవ్వు కేక...’ స్థాయిలో హిట్టవుతుంది’’ అని చెప్పారు. ‘‘దాదాపు ఏడు నెలలు కథాంశాన్ని డెవలప్ చేసి, ఆ తర్వాత షూటింగ్కి వెళ్లాం’’ అని దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న మణీంద్రన్ తెలిపారు.