ఆడపిల్లల జోలికి వెళ్లాలంటే భయపడాలి
అనూహ్య హత్యకేసులో దోషిగా తేలిన చంద్రభాన్కు ఉరిశిక్ష విధించడంపై అనూహ్య తండ్రి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఇక మీదట ఎవరైనా ఆడపిల్లల జోలికి వెళ్లాలంటే భయపడాలని, అలాగే ఈ తీర్పు ఉందని ఆయన అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని తమ ఇంట్లో ఆయన శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
ఈ నిర్ణయం నేరస్థులకు గుణపాఠంగా ఉంటుందని నమ్మకం కలిగిస్తోంది
ఈ కేసు విషయంలో మాకు అండగా ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు
తొలిసారి నన్ను చూసినప్పుడు నేను అనూహ్య తండ్రినని అతడికి తెలియదు
నాకెందుకో అతడి మీద కోపం రాలేదు గానీ, నేరం చేశానన్న ఆలోచన గానీ, భయం గానీ కనపడలేదు
అతడిని నేను చూడటం అదే మొదటిసారి, చివరిసారి
మొదట్లో ఈ కేసు విచారణలో నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి
అనూహ్య బైకు ఎందుకు ఎక్కుతుంది, అంత దూరం వెందుకు వెళ్తుందని అనిపించింది
ఆమె రెండో ప్లాట్ఫారం మీద దిగి, నాలుగో ప్లాట్ ఫారం మీదకు వచ్చింది
ముందు తనకు కారు ఉందని చెప్పాడు, తర్వాత బైకు మీద తీసుకెళ్లాడు
బహుశా తన సామాన్లు పోతాయనే భయంతో ఆమె వెళ్లి ఉంటుందేమో
తను చాలా సెన్సెటివ్గా ఉండేది.. ఎవరైనా గట్టిగా మాట్లాడినా ఏడ్చేసేది
కోర్టు ఇచ్చిన తీర్పు సరిగ్గా ఉంది
ఉరిశిక్ష వేయకూడదనే మానవతావాదులు, మానవహక్కుల వాళ్లు ఉన్నారు
కానీ ఇలాంటి క్రూర మనస్తత్వం ఉన్నవాళ్లకు కూడా ఇలాంటి శిక్షలు వేయకపోతే ఏముంది, నాలుగు రోజులు జైల్లో ఉంటే సరిపోతుందేమో అనుకుంటారు
ఇలాంటి వాళ్లకు ఉరిశిక్ష వేస్తేనే సరైనదని నేను ముందునుంచి భావించాను
ఈ శిక్ష చూసిన తర్వాత ఆడపిల్ల జోలికి వెళ్లాలంటే భయపడాలి.. ఈవ్ టీజింగ్ చేసేవాళ్లు కూడా భయపడాలి
టీజింగ్ గురించి సినిమాల్లో కూడా పాజిటివ్గా చూపిస్తున్నారు
అక్కడంతా బాగానే ఉంటుంది కాబట్టి పర్వాలేదు గానీ, బయట సమాజంలో అలా లేదు
సమాజంలో తెలివిగా ఉండాలని తెలియజేయాలి
చంద్రభాన్ ఇక హైకోర్టుకు వెళ్లినా కూడా.. పోలీసుల వద్ద నూటికి నూరుశాతం ఆధారాలు ఉండటంతో అక్కడ కూడా మరణశిక్షను తప్పించుకునే అవకాశం లేదని అనుకుంటున్నాను
అతడి కుటుంబ సభ్యులు కూడా సాక్ష్యం చెప్పారు
కేసు జరుగుతున్నప్పుడు కూడా ముంబై పోలీసులు పిలిచి, నన్ను తీసుకెళ్లి తాము సేకరించిన సాక్ష్యాల గురించి వివరించారు. దాంతో నాకు నమ్మకం కలిగింది.