The bus trip
-
హోదా కోసం సమర శంఖం
విశాఖ చేరుకున్న సీసీఐ బస్సు యాత్ర నేతలకు ఘన స్వాగతం బహిరంగ సభలో {పభుత్వాల తీరుపై నిప్పులు చెరిగిన నాయకులు విశాఖపట్నం : రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్రం నుంచి తీసుకురావాలనే ప్రధాన లక్ష్యంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీన శ్రీకాకుళంలో మొదలైన బస్సుయాత్ర ఆదివారం విశాఖకు చేరుకుంది. ప్రత్యేక హోదాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, విశాఖను విద్య, పారిశ్రామికపరంగా అభివృద్ధి చేయడం వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు సీపీఐ నేతలు ఉంచారు. విశాఖ చేరుకున్న నేతలకు పార్టీ నగర కార్యదర్శి డి.మార్కండేయులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. పలు సంఘాలు నేతలను సన్మానాలతో ముంచెత్తారు. పది రూపాయల నోట్లతో చేసిన దండలు వేశారు. ఈ సందర్భంగా జీవిఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీపీఐ జిల్లా కార్యదర్శి ఎజె స్టాలిన్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభ జరిగింది. ఈ సభలో నాయకులు ఆవేశపూరితంగా ప్రసంగించారు. ప్రత్యేక హోదా తీసుకురాకపోతే 11వ తేదీన జగిగే బంద్లో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరించారు. రూ.23వేల కోట్లు ప్యాకేజీ అడిగితే జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున ఇచ్చి చేతులు దులుపుకుంటే మన ఎంపీలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారని నిలదీశారు. విశాఖ ఎంపీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.హరిబాబు చెబుతున్న మాటలకు, కేంద్ర మంత్రులు చెబుతున్న వాటికి పొంతన ఉండటం లేదని, వాస్తవాలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్చేశారు. హోదా కోసం ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్క తాటిపైకి రావాలన్నారు. రాజధానిలో ప్రభుత్వ భవనాలు కేంద్రమే నిర్మించాల్సి ఉండగా సింగపూర్ దగ్గర దేవులాడటం ఎందుకని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్యాకేజీ బదులు ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్ ఇవ్వాలన్నారు. చంద్రబాబు రైతు సమస్యలు పట్టించుకోకుండా విదేశీ పర్యటనల్లో బిజీగా ఉంటున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు, రాష్ట్ర విద్యార్ధి జేఏసీ చైర్మన్ లగుడు గోవిందరావు, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంధ్రనాధ్, బెటర్ విశాఖ ఫోరం అధ్యక్షుడు సీఎస్రావు, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు రామచంద్రయ్య, టీచర్స్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి జోసఫ్ సుధీర్బాబు, రాష్ర్ట మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జయలక్ష్మి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కరిముల్ల, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్, ఏఐవైఎఫ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఎన్.సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ మత్సకార కార్మిక సంఘం నాయకుడు వై. నందన్న, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
11 నెలల్లో రూ.100 కోట్ల పనులేనా! : వైఎస్ జగన్
పోలవరం :‘టీడీపీ అధికారంలోకి వచ్చి 11 నెలలైంది. అన్ని నెలల చంద్రబాబు పాలనలో జరిగింది రూ.100 కోట్ల పనులేనా. ఇలా అయితే ప్రాజెక్ట్ ఎన్నేళ్లకు పూర్తవుతుంది’ అని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. బుధవారం నిర్వహించిన బస్సు యాత్రలో భాగంగా ఆయనపోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్కు చేరుకుని ప్రాజెక్టు మ్యాప్ను పరిశీలించారు. అనంతరం మీడియాతో జగన్మోహన్రెడ్డి మాట్లాడారు. ఏడాదికి రూ.4 వేల కోట్ల విలువైన పనులు జరగాల్సి ఉండగా, కేవలం రూ.100 కోట్ల మేర మాత్రమే పనులు జరగడం ఏమిటన్నారు. రూ.180 కోట్లను మొబలైజేషన్ అడ్వాన్స్ తీసుకుని రూ.100 కోట్లు ఖర్చు చేశారన్నారు. చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తానని ప్రకటించారని గుర్తు చేశారు. నష్టపరిహారం పెంచండి పోలవరం ప్రాజెక్ట్ పనులు ఎందుకు జరగడం లేదని ఇంజినీరింగ్ అధికారులను వైఎస్ జగన్ ప్రశ్నించగా, సమస్యలున్నాయని చెప్పారు. ఆ సమస్యలేమిటని అడిగితే 1,200 ఎకరాల భూసేకరణ సమస్య ఉందన్నారు. రైతులకిచ్చే నష్టపరిహారం పెంచడం ద్వారా వారిని సంతోషపరిస్తే ఆ సమస్యను పరిష్కరించవచ్చని జగన్ సూచించారు. ప్రాజెక్టును పూర్తిచేసేం దుకు రూ.16 వేల కోట్లు అవసరం కాగా, వైఎస్సార్ హయాంలో రూ.4 వేల కోట్లు ఖర్చుచేశారన్నారు. మూడు సంవత్సరాల్లో పూర్తిచేయాలంటే ఏడాదికి రూ.4వేల కోట్లు ఖర్చుచేయాల్సి ఉందన్నారు. రూ.4వేల కోట్లపై రూ.400 కోట్లు వడ్డీ వస్తుందని, ఆ సొమ్ముతో నిర్వాసితులకు నష్టపరిహారం పెంచవచ్చని స్పష్టం చేశారు. ఆర్ అండ్ ఆర్ ఎందుకు అమలు చేయలేకపోతున్నారని అధికారులను ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల 194 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చని చెప్పారు. ఈ ఏడాది డెల్టా ప్రాంతానికి 10 వేల క్యూసెక్కుల నీరు అవసరం కాగా, కేవలం 7.4 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే సరఫరా చేశారని, దీనివల్ల రెండో పంట పండే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోల వరం పనులు జరుగుతున్నాయని ఇంజినీరింగ్ అధికారులు చెప్పగా.. ‘ఏవి.. ఏం పనులు కనబడటం లేదు. సున్నా పనులే కనపడుతున్నాయి’ అని జగన్ అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కుడి కాలువ నిర్మాణానికి సంబంధించి 70శాతం పనులు పూర్తికాగా, 11 నెలల చంద్రబాబు పాలనలో మిగి లిన 30 శాతం పనుల్లో ఒక్క అంగుళం కూడా జరగలేదన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం కోసం రైతులకు ఎకరానికి రూ.19.50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చి రెండు రోజుల్లో భూసేకరణ చేశారన్నారు. పోలవరం నిర్వాసితులకు ఎకరానికి రూ.1.50 లక్షలు, రూ.1.80 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారన్నారు. పోలవరం నిర్వాసితులను పిలిచి ఎంత కావాలి, సమస్య ఏమిటని తెలుసుకుని పట్టిసీమ పథకం లాగే నష్టపరిహారం ఇచ్చి ఉంటే సమస్య పరిష్కారం అయ్యేదన్నారు. ఇందుకోసం కేవలం రూ.300 కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయన్నారు.