ఆ మ్యాచ్ గుర్తుకొచ్చిందా!
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పరాజయం భారత వన్డే చరిత్రలో మరో పెద్ద ఓటమిని గుర్తుకు తెచ్చింది. ఆ మ్యాచ్ 2003 వరల్డ్ కప్ ఫైనల్. ఇలాంటి పెద్ద మ్యాచ్లో లక్ష్యాన్ని ఛేదించడంలో సహజంగానే చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ దానిని కాదని నాటి కెప్టెన్ గంగూలీ టాస్ గెలిచి కూడా ఫీల్డింగ్ తీసుకున్నాడు. పాంటింగ్ భారీ సెంచరీ, మరో రెండు అర్ధ సెంచరీలతో ఆసీస్ స్కోరు 359/2. తొలి ఓవర్లోనే సచిన్ అవుట్తో భారత్ ఆశలకు కళ్లెం. అనంతరం పోరాడినా చివరకు 125 పరుగులతో పరాజయం.
నాడు కూడా దూకుడుగా ఆడి 82 పరుగులు చేసిన సెహ్వాగ్ రనౌట్. అన్నట్లు మన ప్రధాన బౌలర్ జహీర్ ఖాన్ 2 నోబాల్స్, 6 వైడ్లు వేస్తే ఈసారి బుమ్రా 3 నోబాల్స్, 5 వైడ్లతో సమంగా నిలిచాడు. ఛేదనల్లో 250 పరుగులు చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న పాక్ బలహీనతను గుర్తించకుండా కోహ్లి తమ బలం ఛేజింగ్లోనే ఉందని నమ్మాడు. టాస్ గెలిచి తాను ఫీల్డింగ్ చేయాలనుకున్న నిర్ణయం అతడిని బహుశా చాలా కాలం వెంటాడవచ్చు!