cooking sensation
-
ఘుమఘుమల ‘గూగులవ్వ’ ఇకలేరు
సాక్షి, తెనాలి: తన చేతివంటతో పాకశాస్త్ర ప్రపంచంలో సంచలనం రేపిన ‘గూగుల్’ బామ్మ ఇకలేరు. పంటచేల పక్కన సంప్రదాయ కట్టెల పొయ్యిలో గుడ్డు ఆమ్లెట్ నుంచి రొయ్యల వేపుడు వరకు, గుత్తి వంకాయ నుంచి ములక్కాయ పులుసు వరకు తన వంటకాల ఘుమఘుమలతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది వీక్షకుల నోరూరించిన ఆ అవ్వ కర్రె మస్తానమ్మ 107 ఏళ్ల వయసులో అస్వస్థతకు గురై కన్నుమూసిన విషయం ఆలస్యంగా తెలియవచ్చింది. గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండల గ్రామం గుడివాడలోని తన స్వగృహంలో ఆమె ఆదివారం సాయంత్రం మృతిచెందారు. సోమవారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తిచేసినట్టు మనుమడు లక్ష్మణ్ తెలియజేశారు. (సాహోరే గుడివాడ బామ్మ..యూ ట్యూబ్ సెన్సేషన్) మస్తానమ్మ సొంతూరు తెనాలి దగ్గర్లోని కోపల్లె. అత్తిల్లు సమీపగ్రామం గుడివాడ. పెళ్లయిన కొన్నేళ్లకే భర్త నాగభూషణం చనిపోయారు. ఏకైక కుమారుడు ఇంట్లో ఉండే అవకాశమున్నా, అదే ఆవరణలో ఓ పాకలో నివసిస్తూ వచ్చారు. కాలూచేయీ ఆడేంతవరకూ ఒకరిపై ఆధారపడకూడదన్న భావనతో అన్ని పనులు స్వయంగా చేసుకుంటూ వచ్చారు. పొలం పనులు చేసే శక్తి సన్నగిల్లినా, పొలం వెళ్లటం మాత్రం మానలేదు. హైదరాబాద్లో వీడియో ఎడిటరైన ఆమె మనుమడు లక్ష్మణ్, తన స్నేహితుడు శ్రీనాథ్రెడ్డితో కలిసి ఆమె వంటలను యూ ట్యూబ్ ద్వారా అందరికీ నేర్పించాలనుకున్నారు. ‘కంట్రీ ఫుడ్స్’ పేరుతో ఛానల్ను 2016 ఆగస్టులో ప్రారంభించారు. గుడ్డు ఆమ్లెట్ నుంచి మటన్ బిర్యానీ, చేపల పులుసు, పుచ్చకాయ చికెన్, రొయ్యల వేపుడు, పీతల కూర, గోంగూర చికెన్, వంకాయ మసాల, గుత్తివంకాయ వంటి వంటకాలకు సంబంధించిన 40 పైగా వీడియోలను అప్లోడ్ చేశారు. ఈ ఛానల్కు 2.30 లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చేశారు. మొత్తంమీద 43 మిలియన్లకు పైగా మస్తానమ్మ చేతివంటను వీక్షించారు. బీబీసీలోనూ రెండు నిముషాల కథనం ప్రసారమైందని మనుమడు లక్ష్మణ్ చెప్పారు. గూగుల్ సంచలమనయ్యాక 2017 ఏప్రిల్లో మస్తానమ్మ పుట్టినరోజును మనుమడు, బంధువులు ఘనంగా జరిపారు. వివిధ దేశాల సబ్స్కైబర్లు బహుమతులు, డబ్బును పంపారు. -
సాహోరే గుడివాడ బామ్మ..
-
సాహోరే గుడివాడ బామ్మ..యూ ట్యూబ్ సెన్సేషన్
సాంప్రదాయ రుచికరమైన వంటల తయారీలో గుడివాడ మస్తానమ్మ స్టయిలే వేరు. సెంచరీ దాటేసిన ఈ గ్రానీ ప్రస్థానం తెలిస్తే అంతా ఔరా అనుకోవాల్సిందే. అవును 106 ఏళ్ళ వయసులో చలాకీగా, తన పనులు తను చేసుకుంటూ నోరూరించే వంటకాలతో, టాలెంట్ ప్రదర్శిస్తూ యూ ట్యూబ్ సంచలనంగా మారిపోయింది. 'కంట్రీ ఫుడ్స్' పేరుతో సొంత ఛానెల్ను నడుపుతున్న ఈ బామ్మ లక్షల ఫాలోయర్స్తో దుమ్మురేపుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా గుడివాడకు చెందిన మస్తానమ్మ యూట్యూబ్ స్టార్.. యూ ట్యూబ్ సెన్సేషన్. తన వంట ట్యుటోరియల్స్ తో యూట్యూబ్ లో సునామీ సృష్టిస్తోంది. కంట్రీ ఫుడ్స్ ఛానల్ లో రకరకాల వంటల నైపుణ్యంతో గుడివాడ బామ్మ సూపర్ పాపులర్. ఆమె చేతి వంటకాల లిస్ట్ ఒకటా రెండా.. చాలా పెద్దదే. ఎగ్ దోశ, ఫిష్ ఫ్రై , పాయా, అరటి ఆకులతో చేసే స్పెషల్ ఫిష్ ఫ్రై, బ్యాంబూ చికెన్ బిర్యానీ లాంటి ఇతర వంటకాలను సులభంగా వండేస్తోంది. ముఖ్యంగా ఈమె వంటకాల్లో వాటర్ మిలన్ చికెన్ ప్రత్యేకమైందనే చెప్పాలి. ఈ ఒక్క వీడియేకే 66లక్షల వ్యూస్ వచ్చాయంటేనే ఇది ఎంత పాపులరో అర్థం చేసుకోవచ్చు. ఈ వెరైటీ వంటకాలతో అమెరికా, బ్రిటన్, దుబాయ్లలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అక్కడున్న బంధువులు ఫోన్ చేసి మరీ మస్తానమ్మ వంటకాలపై ప్రశంసలు కురిపించారట. ఒక ఆకలితో ఉన్న రాత్రి తాను, తన ఫ్రెండ్స్ కొంత ఆహారాన్ని సిద్ధం చేసుకున్న సందర్భంలో తాము కూడా యూ ట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనే ఆలోచన వచ్చిందట మస్తానమ్మ మనువడు లక్ష్మణ్ కి. ఇలా మొదలు పెట్టిన ఫస్ట్ వీడియోనే వైరల్గా మారడంతో మరింత ఊత్సాహంగా దీన్ని ముందుకు నడిపించారు. ఇతనికి అమ్మమ్మ వెరైటీ రెసిపీలు మరింత సహాయం చేశాయి. ఇక అంతే అప్పటినుంచి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అయితే మొదట్లో ఆమె వీడియోలను షూట్ చేస్తోంటే తనకు ఏమీ అర్థంకాలేదని, కానీ అసలు విషయం తెలిసిన తరువాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యిందని లక్ష్మణ్ వివరించారు. అంతేకాదు.. ఇటీవల 106 వ పుట్టినరోజు సందర్భంగా చీరలు, గ్రీటింగ్ కార్డులు లాంటి బోలెడన్ని బహుమతులు అందుకుందట గ్రాండ్మా. ముఖ్యంగా పాకిస్తాన్ ఇస్లామాబాద్కు చెందిన ఓ ఫ్యాన్ చీరను పంపించారంటూ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. ఇంతకీ ఈ బామ్మకు యూ ట్యూబ్ ఫాలోయర్ల సంఖ్య ఎంతో తెలుసా. సుమారు 2 లక్షల 48వేలమంది సబ్ స్కైబర్లు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. లేటు వయసులో లేటెస్ట్ సంచలనంగా మారిన మస్తానమ్మకు మనం కూడా సాహో అనాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం వాటర్ మిలన్ చికెన్ వీడియోపై ఒక లుక్కేసుకుంటే పోలా..