the distribution of land
-
భూములు కావలెను!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా యంత్రాంగం విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ భూములు తరిగిపోవడంతో.. ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు కొనేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘దళితులకు భూ పంపిణీ’ పథకం అమలుకు భూములు అందుబాటులో లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. నగరానికి ఆనుకొని ఉన్న మన జిల్లాలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో దళితులకు భూపంపిణీ భారం తడిసిమోపెడుకానుంది. జిల్లాలో ఎవరికీ కేటాయించని భూమి కేవలం 4,100 ఎకరాలు మాత్రమే ఉంది. మరోవైపు పంద్రాగస్టున సగటున ప్రతీ దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించారు. వామ్మో..కొనలేం.. రాజధాని పరిసరాల్లోనే జిల్లా ఉండడంతో భూముల ధరలు నింగినంటాయి. జిల్లాలో సాగుకు అనువుగా ఉండే భూమి కనిష్టంగా ఎకరాకు సగటున రూ.4 లక్షల ధర పలుకుతోంది. ఈ క్రమంలో భూములు కొని.. దళితులకు పంచడం అధికారయంత్రాంగానికి కత్తిమీద సాములా పరిణమించింది. ఇప్పటివరకు ఏడు విడతలలో చేపట్టిన భూపంపిణీల్లో సుమారు 7వేల ఎకరాలను దళితులకు కేటాయించారు. ఇద ంతా ప్రభుత్వ భూమే కావడంతో జిల్లా యంత్రాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అయితే, దీంట్లో సేద్యానికి యోగ్యంలేని భూమే ఎక్కువగా ఉంది. రాళ్లు, గుట్టలతో నిండిన భూములే లబ్ధిదారులకు అందాయి. దీంతో ఆయా భూములు ఇప్పటివరకు పడావుగా ఉన్నాయి. ఇదిలావుండగా, ఈ పంద్రాగస్టున మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి దళితులకు భూపంపిణీ చేయాలని రాష్ట్ర సర్కారు ఆదేశించింది. ఈ క్రమంలో నగర శివార్లలోని 17 మండలాలను మినహాయించి, మారుమూల మండలాల్లో మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలని జిల్లా యంత్రాంగం యోచిస్తోంది. సాగుకు అనువైన భూమిని మాత్రమే ఇవ్వాలని, సగటున ప్రతి లబ్ధిదారుకు మూడు ఎకరాల చొప్పున పంపిణీ చేయాలనే నిబంధనలు అధికారులను ఇరకాటంలో పడేశాయి. జిల్లాలో ప్రభుత్వ భూముల కొరత తీవ్రంగా ఉండడంతో ఈ పథకం అమలు వారికి సవాల్గా మారింది. అవసరమైతే ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనయినా పంచాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో భూముల వేటలో పడి ంది. కేవలం వికారాబాద్, పరిగి, తాండూరు, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలని భావిస్తున్న యంత్రాంగం.. ఆయా ప్రాంతాల్లో లభ్యమయ్యే భూముల వివరాలను సేకరిస్తోంది. మండలంలో ఒక గ్రామం.. ఆ గ్రామంలో 30 మంది లబ్ధిదారులకు భూ పంపిణీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిన యంత్రాంగం... జిల్లావ్యాప్తంగా1,800 ఎకరాలను సమీకరించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రభుత్వంపైనే ఆశలు.. ఈ నెల 30లోపు గ్రామాల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్న అధికారులు. ఆలోపు భూముల కొనుగోలుకు అవసరమైన నిధులపై స్పష్టత రాబట్టాలని భావిస్తోంది. జిల్లాలో నెలకొన్న విచిత్ర పరిస్థితి నేపథ్యంలోప్రభుత్వం ఇచ్చే నిధులపైనే ఆశలు పెట్టుకుంది. కేటాయించే నిధుల ఆధారంగానే భూపంపిణీ ల క్ష్యాన్ని నిర్దేశించుకోవాలని యోచిస్తోంది. 1,800 ఎకరాలకు కనిష్టంగా రూ.72 కోట్లు అవసరమమవుతాయని ప్రాథమిక అంచనాలు రూపొందించిన అధికారులు భూముల అన్వేషణలో తలమునకలయ్యారు. మరోవైపు భూ యజమానులు ఎక్కడ భూముల రేట్లు పెంచుతారోననే అనుమానం కూడా రెవెన్యూ అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలు,నిధుల లభ్యత మేరకే గ్రామాలను ఎంపిక చేస్తే బాగుంటుందంటున్నారు. -
నకిలీలలు!
మంచాల, న్యూస్లైన్: పేద రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించిన భూ పంపిణీ అక్రమాలకు నిలయంగా మారింది. భూ పంపిణీ ముసుగులో క్షేత్రస్థాయి అధికారులు స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు. అవకతవకలకు, నకిలీ పాస్ పుస్తకాలకు మంచాల మండలం అడ్డాగా మారింది. ప్రభుత్వ భూముల్లో కబ్జాలో లేని వారికి, స్థానికేతరులకు ఎడాపెడా పట్టా పాస్ పుస్తకాలు జారీ చేసేశారు. గతంలో ఇక్కడ పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన తహసీల్దార్ల పేరిట నకిలీ ప్రొసీడింగ్లు తయారుచేసి వాటి ఆధారంగా పట్టా పుస్తకాలు ఇస్తున్నారు. రెవెన్యూ చట్టంలోని లొసుగులను ఆధారం చేసుకొని అందినకాడికి దండుకుంటున్నారు. ఎవరు రూ.10వేలు ఇస్తే వారికి 5ఎకరాల పట్టా పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నారు. వాటిని బ్యాంకులో తాకట్టు పెడితే రుణాలు పొందే అవకాశం ఉండటంతో అధికారుల చేతులు తడుపుతూ పలువురు పోటీపడి అక్రమ పట్టాలు చేయించుకుంటున్నారు. ఇలా భూమి లేకుండానే ఆరుట్ల, లోయపల్లి, దాద్పల్లి, చిత్తాపూర్ గ్రామాల్లో వందలాది మంది నకిలీ పట్టా పుస్తకాలు పొందారు.. మిగులు భూమి అక్రమార్కుల పరం... ఆరుట్ల గ్రామం సర్వే నంబర్ 1363లో ప్రభుత్వానికి చెందిన 1527ఎకరాల 36గుంటల భూమిలో 387మంది లభ్ధిదారులకు 741.28 ఎకరాలు పంచారు. మిగతా భూమిలో 523 ఎకరాలు అక్రమార్కుల పరమైంది. స్థానికులతో పాటు ఇతర మండలాలకు చెందిన వారు రెవెన్యూ అధికారుల ప్రాపకం తో ఇక్కడ పట్టాలు పొందారు. అదే విధంగా దాద్పల్లి గ్రామంలోని 1వ సర్వే నంబర్లో 44.17ఎక రాల ప్రభుత్వ భూమిలో వాస్తవంగా 13మందికి పట్టాలు ఇచ్చారు. కానీ ప్రస్తుతం దాదాపు 40మంది దాకా ఈ భూమికి సంబంధించి అక్రమ పట్టాలు పొందారు. వీరిలో ఒకరు పట్టా పాస్ పుస్తకం బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆరుట్ల గ్రామానికి చెందిన ఓ ఆర్ఎంపీ ఐదేళ్ల క్రితం దాద్పల్లి గ్రామానికి వచ్చారు. ఆయన భార్య పేరిట 5ఎకరాల భూమిని బి/2702/1992 నంబర్తో నకిలీ ప్రొసీడింగ్ అధారంగా పట్టా పుస్తకం జారీ అయ్యింది. దీన్ని తాకట్టు పెట్టి బోడకొండ దక్కన్ గ్రామీణ బ్యాంకు నుంచి పంట రుణం తీసుకున్నారు. విషయం బయటికి పొక్కడంతో రెవెన్యూ అధికారులు ఆ పాస్ పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు. పుట్టగొడుగుల్లా నకిలీ పాస్ పుస్తకాలు... ఇక లోయపల్లి రెవెన్యూ పరిధిలోని 334 సర్వే నంబర్లో 220.14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా 127 ఎకరాలు పంచారు. కానీ ఈ సర్వే నంబర్లో 78మందికి 242.14 ఎకరాలకు సంబంధించి పాస్పుస్తకాలు ఉన్నాయి. భూమి ఉన్న దానికంటే 22.14 ఎకరాలు ఎక్కువగా కేటాయించినట్టు ఉండటం గమనార్హం. చిత్తాపూర్ గ్రామంలోని 92 సర్వే నంబర్లో 86.16 ఎకరాల ప్రభుత్వ భూమిలో 32మందికి 56 ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. మిగిలిన భూమిలో 25 ఎకరాల వరకూ 12మంది రైతులు కబ్జాలో ఉన్నారు. వాస్తవంగా మిగిలింది కేవలం 5.6 ఎకరాలు కాగా, మరో 22మంది ఎకరంన్నర చొప్పున 33 ఎకరాలు అక్రమ పట్టాలు చేసుకున్నారు. ఇలా భూమిలేకున్నా పట్టా పాసుపుస్తకాలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. ప్రభుత్వ భూముల విషయమై తహసీల్దార్ వెంకటేశ్వర్లును వివరాల కోసం సంప్రదించగా... రికార్డులను ఉన్నతాధికారులు తీసుకెళ్లారని చెప్పారు. ఇదిలా ఉంటే నకిలీ పాస్ పుస్తకాలను తాకట్టు పెట్టి ఆరుట్ల ఎస్బీహెచ్, బోడకొండ దక్కన్ గ్రామీణ బ్యాంకుల నుంచి పలువురు రుణాలు పొందారు. ఈ విషయమై ఆరుట్ల ఎస్బీహెచ్ మేనేజర్ విజయలలితను వివరణ కోరగా... స్థానిక రెవెన్యూ అధికారులు పట్టాలు నిజమైనవేనని ధ్రువీకరిస్తుండటంతో రుణాలు ఇవ్వాల్సి వస్తోందని చెప్పారు.