environmental day
-
రిజర్వ్ ఫారెస్ట్లో ప్లాస్టిక్ నిషేధం
సాక్షి, మన్ననూర్ (అచ్చంపేట) : అమ్రాబాద్ పులుల రక్షిత ప్రాంతం (కోర్ ఏరియా)లో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధిస్తున్నామని వాటి స్థానంలో పేపర్, బట్ట సంచులను అందుబాటులో ఉంచుతున్నట్లు ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం అటవీశాఖ ఈసీ సెంటర్ వద్ద డబ్లూడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. మానవ మనుగడతో పాటు జీవరాశులకు ముప్పు కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వన్యప్రాణులకు అమ్రాబాద్ అభయారణ్యం దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగి ఉండటం గర్వకారణమని అన్నారు. ఈ క్రమంలో పర్యాటకులు, అటవీ సమీప గ్రామాల ప్రజలు ప్లాస్టిక్ను ఉపయోగించడం, పారబోయడంతో వాటిని తింటున్న వన్యప్రాణులు మృత్యవాతపడుతున్నాయని అన్నారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ డైరెక్టర్ ఫరీదా టంపల్ మాట్లాడుతూ శ్రీశైలం – హైదరాబాద్ ప్రధాన రహదారి వెంట అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించి వన్యప్రాణులను కాపాడాలన్నారు. ఈ ప్రాంతంలో పేవర్ కవర్ల తయారీ కోసం కుటీర పరిశ్రమను మరో నెల రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పేపర్ కవర్ల తయారీ కోసం చెంచు మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. అడవులను, జంతుజాలాన్ని రక్షించుకోవాలని కళాకారుల ఇచ్చిన ప్రదర్శన, ఆట పాటలు ఆకట్టుకున్నాయి. యాత్రికులకు పేపర్ కవర్లు అందజేత అటవీశాఖ చెక్పోస్టు వద్ద డబ్ల్యూడబ్ల్యూఎఫ్, శ్రీనివాస ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీశైలం వెళ్లే యాత్రికులకు పేపర్ కవర్లు అందజేశారు. టోల్గేట్ రూ.20లకు అదనంగా రూ.5 వసూలు చేసి కవర్ అందిస్తున్నారు. దీంతోపాటు మరో రూ.25 అదనంగా వసూలు చేస్తున్నారు. మన్ననూర్ నుంచి దోమలపెంట వరకు ఎలాంటి చెత్త, వ్యర్థాలు ఉన్నా రోడ్డు పక్కన వేయకూడదు. కవర్లో వేసి దోమలపెంట చెక్పోస్టు వద్ద అటవీశాఖ సిబ్బందికి కవర్ అందించాలి. వారు రూ.25 తిరిగి ఇస్తారని అధికారులు తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు పర్యావరణ రోజు సందర్భంగా అమ్రాబాద్, మన్ననూర్ రేంజ్ పరిధిలోని ఆయా పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో శ్రీనివాస ఛారిటబుల్ ట్రస్టు డైరెక్టర్ శ్రీనివాస్, డీఎఫ్ఓ జోజీ,ఎఫ్ఆర్ఓలు ప్రభాకర్, శ్రీదేవి ఎఫ్ఎస్ఓ రామాంజనేయులు సిబ్బంది బాబలి, వెంకటేశ్వర్లు, కనకయ్య, కళాకారులు మాడ్గుల నర్సింహ, లింగస్వామి, బీముడు, ఆయా చెంచుపెంటల మహిళలు పాల్గొన్నారు. -
దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలు
సాక్షి, హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. అన్ని సంపదలతో పోలిస్తే ఆరోగ్యమే ప్రధానమైనదని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సమకూర్చడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు దశల వారీగా ఎలక్ట్రికల్ వాహనాలను ప్రవేశపెట్టబోతున్నట్టు తెలిపారు. సౌర విద్యుత్లో ఇప్పటికే గణనీయమైన ప్రగతి సాధించామన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అటవీ పునరుజ్జీవన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై మంగళవారం అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. జూలైలో నాలుగో విడత హరితహారం ప్రారంభమవుతుందని, ప్రజలంతా అందులో భాగస్వాములైతే కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పారు. ప్రజలంతా హరితహారంలో పాల్గొనాలని.. మొక్కలు నాటడంతోపాటు నాటిన ప్రతీ మొక్కా బతికేలా రక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అప్రమత్తంగా ఉండాలి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంలో వస్తున్న మార్పుల ప్రభావం మనపై కూడా ఉంటుందని.. ఈ విషయంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. వీలైనంత వరకు కాలుష్య కారకాలను వాడకుండా ఉండాలని చెప్పారు. ప్లాస్టిక్ విచ్చలవిడి వినియోగంతో ముప్పు పొంచి ఉందని.. నిత్య జీవితంలో ప్లాస్టిక్ అవసరమున్నా, దానితో తలెత్తే దుష్పరిణామాలపై ఏమరుపాటు వద్దని పేర్కొన్నారు. హరితహారం ఫలితాలు కనిపిస్తున్నాయి రాష్ట్రాన్ని ఆకుపచ్చగా మార్చాలన్న లక్ష్యంతోనే ‘తెలంగాణకు హరితహారం’కార్యక్రమం ప్రారంభమైందని.. గత మూడేళ్లుగా చేపట్టిన చర్యల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. మొక్కలు నాటడంతోపాటు వాటి పెంపకం, రక్షణకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఫలితాలు మరింత ఆశాజనకంగా ఉంటాయన్నారు. వచ్చే నెలలో నాలుగో విడత హరితహారం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 38 కోట్ల మొక్కలు నాటనున్నామని పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా అర్బన్ ఫారెస్ట్ పార్కులు, రహదారి వనాలు (ఎవెన్యూ ప్లాంటేషన్) ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. నాటడం కాదు.. పెంచేలా.. ఇప్పటివరకు మూడు విడతలుగా జరిగిన హరితహారంలో రాష్ట్రవ్యాప్తంగా 82 కోట్ల మొక్కలు నాటారు. తాజాగా నాలుగో విడతలో ప్రధానంగా టేకు, వెదురు, పూలు, పళ్ల మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈసారి స్కూళ్లు, కాలేజీల ఆవరణలో మొక్కలు ఎక్కువగా నాటాలని.. విద్యార్థులను ఎక్కువగా భాగస్వాములను చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక మొక్కలు నాటే సమయంలో హడావుడి చేస్తున్న ప్రభుత్వ విభాగాలు తర్వాత వాటి రక్షణను గాలికి వదిలేస్తున్నాయనే విమర్శల నేపథ్యంలో.. ఈసారి మొక్కలు నాటడంతో పాటు రక్షణ విషయంలో జవాబుదారీగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నేరుగా సీఎంవో పర్యవేక్షణ నాటిన మొక్కలు, వాటిలో బతికి ఉన్నవెన్ని, రక్షణకు తీసుకున్న చర్యలేమిటనే అంశాలపై అటవీ శాఖ ఈసారి కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. ప్రతినెలా మొక్కల ఫొటోలను అటవీ శాఖకు చెందిన వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించింది. ఈ వెబ్సైట్తోపాటు మొక్కల వివరాలను జియో ట్యాగింగ్ ద్వారా సీఎం క్యాంపు కార్యాలయంలోని డ్యాష్ బోర్డుకు అనుసంధానం చేస్తున్నారు. దాంతో ముఖ్యమంత్రే స్వయంగా ఏయే ప్రాంతాల్లో మొక్కలు ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏమిటన్నది పర్యవేక్షించే వీలుంటుందని చెబుతున్నారు. -
పర్యావరణాన్ని కాపాడండి: కోహ్లి
న్యూఢిల్లీ: పర్యావరణాన్ని కాపాడేందుకు భారత ప్రజలు ముఖ్యంగా యువత ముందుకు రావాలని టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి పిలుపునిచ్చాడు. అందుకోసం ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలు నాటి పతిజ్ఞ చేయాలన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం దేశ రాజధానిలో పర్యావరణ మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రెజ్లర్ సుశీల్ కుమార్తో కలసి కోహ్లి పాల్గొన్నాడు. మంత్రి ప్రకాశ్ జవదేకర్, కోహ్లి, సుశీల్లు ఇందిర పర్యావరణ్ భవన్ వద్ద మొక్కలు నాటి ‘‘సేవ్ ఎన్విరాన్మెంట్ (పర్యావరణాన్ని కాపాడండి)’’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక మంచి కార్యక్రమాన్ని తమతో ప్రారంభించినందుకు కోహ్లి, సుశీల్లు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, యువ ఆటగాడు అజింక్య రహానేలు ముంబయిలో, ఇర్ఫాన్, యూసుఫ్ పఠాన్లు వడోదరలో మొక్కలు నాటి కార్యక్రమానికి తమ మద్దతు తెలిపారు.