అవి తెగ లాగించేస్తున్నారా...అయితే జాగ్రత్త!
ఆరోగ్యంగా ఉండాలని ఎక్కువ పళ్లు తీసుకోవడం మనకందరికీ తెలిసిందే.. బాడీలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికంటూ ఎక్కువగా, పండ్లు, పళ్లరసాల పైనే ఆధారపడే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అయితే పండ్లను, జ్యూస్ లను, కార్న్ సిరప్, దీనితోపాటు ఎక్కువ తేనెను సేవించడం వల్ల బరువు తగ్గడం మాట అటుంచి బరువు ఇంకా బాగా పెరుగుతారని ఓ ఆశ్చర్యకరమైన పరిశీలనలో తేలింది. అంతేకాదు నరాల వ్యాధికి గురికాడం, లివర్ పాడైపోవడం లాంటి ప్రమాదమూ సంభవించే అవకాశాలున్నాయని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.
శరీర మెటబాలిజం, నరాల పనితీరుపై రెండురకాల సుగర్ ప్రభావాలపై ఆడ ఎలుకమీద అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం కోసం, ఆడ ఎలుకలలో గ్లూకోజ్ (శరీరంలో కార్బొహైడ్రేట్స్ విచ్ఛిత్తి తర్వాత సహజంగా కనిపించే చక్కెర రూపం) ఫ్రక్టోజ్ (పండ్లు మరియు పండ్ల రసాల్లోఉండే చక్కెర ) సాధారణ ఆహారానికి బదులుగా ద్రవరూపంలో ఎనిమిది వారాల పాటు అందించారు.
గ్లూకోజ్ తినిపించిన ఎలుకల్లో కంటే ఫ్రక్టోజ్ ఇచ్చిన ఎలుకల్లో మొత్తం కేలరీల శాతం ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. వీటిలో అధిక ట్రైగ్లిజరైడ్స్, కారణంగా కాలేయం బరువు పెరగడంతో , కాలేయంలో కొవ్వును కరిగించే శక్తి క్షీణించడం, రక్తపోటును ప్రభావితం చేసే బృహద్ధమని పనితీరు మందగించడాన్ని గుర్తించినట్టు తెలిపారు. ఫలితంగా అధిక బరువుతోపాటు, గుండె వ్యాధి, మధుమేహం లాంటి ఇతర ప్రమాదకారక దీర్ఘ వ్యాధుల్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు తేల్చారు.
గ్లూకోజ్, ఫ్రక్టోజ్ కారణంగా శరీర బరువులో మార్పులు ఉన్నప్పటికీ కేవలం ఫ్రక్టోజ్ గ్రూపు లో మాత్రమే ఎక్కువ బరువు పెరిగిందని తెలిపారు. హార్ట్ అండ్ సర్క్యులేటరీ ఫిజియాలజీ సమర్పించిన ఈ పరిశోధనా పేపర్ ను అమెరికన్ జర్నల్ ప్రచురించింది. అయితే దీర్ఘకాల ఆరోగ్యంపై ప్రభావం చూపేవాటిల్లో తీపి పదార్థాల మూలంగా శరీరంలో చేరే కాలరీస్ మాత్రమే కాదని గుర్తించాలన్నారు.