కళ్లలో ఇసుక!
కళ్లు మూసి జెల్ల కొట్టడమంటే ఇదే! పోలీసులను ఏమార్చుతున్న ఇసుక స్మగ్లర్ల తెలివితేటలు చూస్తే ఔరా అనని వారు అరుదే! అయితే అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పోలీసులు మాత్రం కళ్లు మూసుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. కఠినంగా వ్యవహరించి నేరగాళ్లను నిరోధించాల్సిన వారు ఎందుకిలా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న సందేహం కలుగుతోంది. జవాబు చెప్పేదెవరో మరి..
యలమంచిలి/ఎస్.రాయవరం, న్యూస్లైన్: ఆమధ్య ఓ సిన్మాలో ఓ హాస్యపాత్ర అతి తెలివితో పోలీసులకు టోపీ వేయడం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.. రోజూ ఇసు క తరలిస్తూ, పోలీసులకు పట్టుబడకుండా ఆడిన నాటకం భలేగా రక్తి కడుతుంది.. అసలు తరలిస్తున్నది దొంగిలించిన ద్విచక్రవాహనాలన్నది ఆఖరుకు పోలీసులకు అర్ధమవుతుం ది! జిల్లాలో ఇసుక స్మగ్లర్ల తీరు చూస్తే ఆ ప్రహసనమే గుర్తు కు వస్తుంది. జిల్లాలో నదుల నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తూనే పోలీసులకు టోకరా వేస్తున్న పరిణామం కడు విస్మ యం కలిగిస్తుంది.
ఇసుక రవాణాను అటుంచితే, ఇందుకు వారు వాడుతున్న నంబర్ లేని ట్రాక్టర్ల వ్యవహారమే నివ్వెరపరుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్నపుడు ఇసుక గురించి మాత్రమే ఆరా తీస్తున్నారు తప్ప, ట్రాక్టర్లకు నంబ ర్లు లేని విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదని స్పష్టమవుతోంది. ఒకవేళ గుర్తించినా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించడం లేదని అర్ధమవుతుంది. నదుల్లో ఇసుక అక్రమరవాణా నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని ఉత్తర్వులు జారీచేసినా తాండవ, వరాహ, శారద నదుల నుంచి ఇసుక తరలింపు జరుగుతూనే ఉంది.
చోడవరం ప్రాంతంలో ఏకంగా స్మగ్లర్లు ప్రభు త్వ సిబ్బందిపై దాడికి తెగబడుతున్నా ఉన్నతాధికారులు అనుసరించిన వైఖరి విమర్శలకు పాత్రమైంది. ఇసుక అక్రమంగా తరలించే ట్రాక్టర్లలో సగానికి పైగా నెంబర్లు లేనివే ఉంటున్నాయన్నది స్పష్టం. యజమానులెవరో తెలియకుండా ఉండడానికి ఇటువంటి ట్రాక్టర్లు వాడుతున్నారు. వీటిని పోలీసులు సీజ్ చేయాల్సి ఉంది. కానీ వారు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. నంబర్లు లేని ట్రాక్టర్లు పట్టుబడ్డా పోలీసులు ఇసుక అక్రమ రవాణాపైనే కేసులు పెడుతున్నారు. నంబర్లు లేకపోవడంతో చిన్న చిన్న ప్రమాదాలైనా వాహనాల యజమానులు, డ్రైవర్లు తప్పించుకుంటున్నారు.
అభివృద్ది పనుల ముసుగులో..
ప్రభుత్వం చేపట్టే అభివృద్ది పనుల మాటున స్మగ్లర్లు పెద్దయెత్తున ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. వంతెనలు, రోడ్ల పేరుచెప్పి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అపార్ట్మెంట్లు, ప్రైవేట్ బిల్డింగ్ల నిర్మాణాలకు ఈ ఇసుకను వాడుతున్నారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది దాడి చేస్తే పర్మిట్లు ఉన్నాయని తప్పించుకుంటున్నారు. రాత్రి 10 గంటలనుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు సాగుతున్న ఇసుక రవాణాను అడ్డుకునే వారే కానరారు!