ఉచితంగా తిరుమల యాత్ర, దర్శనం
హైదరాబాద్ : గ్రామీణ, పట్టణ పేదలను ఉచితంగా తిరుమల యాత్రకు తీసుకెళ్లడానికి ఏపీ దేవాదాయ శాఖ కొత్తగా ప్రవేశపెట్టదలిచిన 'దివ్యదర్శనం' పథకం విధివిధానాలను ఆ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం గరిష్టంగా ఇంటికి ఐదుగురికి అవకాశం కల్పిస్తారు. మూడు ఏళ్ల లోపు పిల్లలను అదనంగా తీసుకెళ్లవచ్చు. హిందూమతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందినవారినే ఈ పథకంలో 90 శాతం లబ్దిదారులుగా ఎంపిక చేస్తారు.
అగ్ర కులాల్లో తెల్లకార్డులున్నవారిని, అదీ 70 ఏళ్ల లోపు వారే అర్హులు. ప్రతి జిల్లా నుంచి విడతల వారీగా ఏడాదికి పదివేల మందికి ఉచిత తిరుమల దర్శనం కల్పిస్తారు. ఉచిత తిరుమల యాత్ర 4-5 రోజుల పాటు ఉండేలా.. తిరుమల యాత్రతో పాటు మార్గమధ్యంలో నాలుగు ప్రధాన ఆలయాల దర్శనానికి అవకాశం కల్పిస్తారు. ఈ పథకానికయ్యే ఖర్చును టీటీడీ నిధులతో పాటు రాష్ట్రంలో ఏడు ప్రధాన దేవాలయాల ఆదాయం నుంచి ఖర్చు చేస్తారు. ఉచిత యాత్ర సమయంలో లబ్దిదారులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించడానికి దేవాదాయ కమిషనర్ చర్యలు చేపడతారని ఉత్తర్వులో పేర్కొన్నారు.