harita
-
మనిషికి మనిషిని జతకలిపే దర్జీలు
వారధి నిర్మాణ పనుల్లో ‘నేనెంత’ అనుకోలేదు ఉడుత. ‘నేను కూడా కొంత’ అనుకొని పనుల్లోకి దిగింది. వయనాడ్ సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులకు అండగా నిలవడానికి, తమ వంతు సహాయం అందించడానికి స్థాయి భేదాలు లేకుండా ఎంతోమంది మహిళలు వస్తున్నారు. శిబిరంలోని మహిళలకు బట్టలు కుట్టి ఇవ్వడం నుంచి పరిసరాల శుభ్రత వరకు దీక్షతో పనిచేస్తున్నారు...శృతికి చారమాలలో చాలా మంది బంధువులు ఉన్నారు. కొండచరియలు విరిగిపడిన సంఘటనలో కొందరు చనిపోయారు. మరికొందరు మెప్పడిలోని సహాయ శిబిరంలో ఉన్నారు. కొంతమంది మహిళలు స్నానం చేయడానికి శృతి ఇంటికి వచ్చినప్పుడు తమకు ఇచ్చిన దుస్తులకు సంబంధించిన సమస్యల గురించి చెప్పుకున్నారు. ఆల్ట్రేషన్కు అవకాశం లేకపోవడంతో తమకు సరిపోయే ఒకే జత దుస్తులనే వాడాల్సి వస్తోంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని స్నేహితురాలి దగ్గర కుట్టుమిషన్ తీసుకొని నిర్వాసిత కుటుంబాల సహాయ శిబిరానికి బయలుదేరింది శృతి.ప్రతి గదికి వెళ్లి ‘నేను రెండు రోజులు ఇక్కడే ఉంటాను. దుస్తుల సైజ్ సర్దుబాటు సమస్యలు ఉంటే నాకు చెప్పండి’ అని అడిగింది. ఇక ఆరోజు నుంచి చిరిగిపోయిన దుస్తులు, సైజు సరిగా లేని దుస్తులను సరి చేసే పని మొదలైంది.టైలరింగ్ వల్ల జరిగిన మరో మేలు ఏమిటంటే మనసును దారి మళ్లించడం. ఈ శిబిరంలో కొద్దిమంది టైలరింగ్ పని తెలిసిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో రమ్య మనోజ్ ఒకరు.‘భయపెట్టే జ్ఞాపకాల నుంచి బయటపడడానికి టైలరింగ్ అనేది చికిత్సామార్గంలా ఉపయోగపడింది. చాలా రోజులుగా మేము శిబిరంలో ఖాళీగా ఉన్నాం. ప్రతిరోజూ విషాద జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉండేవి. మెషిన్పై ఆల్ట్రేషన్ పనులు మొదలు పెట్టిన తరువాత నాకు ఎంతో ఉపశమనం లభించింది’ అంటుంది రమ్య మనోజ్.శృతి, రమ్య... మొదలైన వారిని దృష్టిలో పెట్టుకొని సహాయ శిబిరానికి కుట్టుమిషన్లను ఒక స్వచ్ఛంద సంస్థ విరాళంగా ఇవ్వనుంది.‘మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు రెండు రోజులు ఉండాలనుకున్నాను. ఇప్పుడు మాత్రం శిబిరం ఉన్నంతవరకు రోజూ వచ్చి పోవాలనుకుంటున్నాను’ అంటుంది శృతి.సహాయ శిబిరానికి శృతి రోజూ రావాలనుకోవడానికి కారణం కేవలం టైలరింగ్ పనులు కాదు. ఇప్పుడు అక్కడ ఆమె ఎంతోమంది బాధితులకు ఓదార్పునిస్తోంది. బాధితులు విషాద జ్ఞాపకాల నుంచి బయటపడడానికి సినిమాల నుంచి ఆటల వరకు ఎన్నో విషయాలు మాట్లాడుతుంటుంది.‘శిబిరానికి శృతి రావడానికి ముందు మా మాటల్లో బాధలు, కష్టాలు, చేదు జ్ఞాపకాలు మాత్రమే ఉండేవి. అయితే శృతి మమ్మల్ని అటువైపు వెళ్లనివ్వకుండా రకరకాల విషయాలు మాట్లాడుతుంటుంది. ధైర్యం చెబుతుంటుంది’ అంటుంది సహాయ శిబిరంలో తలదాచుకుంటున్న ఆశ.హరిత కర్మ సేన ఆల్ ఉమెన్ గ్రూప్పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న వారిలో కొందరు జ్వరం, దగ్గులాంటి సమస్యలతో బాధ పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పునరావాస శిబిరం పరిసరప్రాంతాల్లో అపరిశుభ్రత ఆనవాలు లేకుండా చేస్తున్నారు. పునరావాస శిబిరాలుగా మారిన పాఠశాలలు శుభ్రంగా కనిపించడానికి కారణం హరిత కర్మ సేన–ఆల్ ఉమెన్ గ్రూప్. భోజనాల తరువాత టేబుళ్లు, నేలను శానిటైజ్ చేస్తున్నారు. క్రిములు పెరగకుండా, వ్యాధులు వ్యాప్తి చెందకుండా, సహాయ శిబిరం చుట్టుపక్కల ప్లాస్టిక్, ఆహార వ్యర్థాలు కనిపించకుండా చూస్తున్నారు.కేరళలో మొత్తం 1018 హరిత కర్మ సేన యూనిట్లు పని చేస్తున్నాయి. పట్టణప్రాంతాల్లో 4,678, గ్రామీణప్రాంతాల్లో 26, 546 మంది మహిళలు పనిచేస్తున్నారు. ‘వేస్ట్ ఫ్రీ కేరళ’ నినాదాన్ని భుజాల కెత్తుకున్న హరిత కర్మ సేన కలెక్టింగ్, ట్రాన్స్పోర్టింగ్, ప్రాసెసింగ్, రీసైకిలింగ్, వేస్ట్ మెటీరియల్స్ డిస్పోజల్ అండ్ మేనేజ్మెంట్కు సంబంధించి వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ‘సమాజానికి ఉపయోగపడే మంచి పని చేస్తున్నాను అనే భావన మనసులో ఉండడం వల్ల కావచ్చు ఎంత పని చేసినా శ్రమగా అనిపించదు’ అంటుంది హరిత కర్మ సేన సభ్యురాలు ఉద్విత. -
ఔటర్కు హరిత ‘రింగు’
-
ఔటర్కు హరిత ‘రింగు’
- ఔటర్కు ఇరువైపులా నందనవనం - రింగ్రోడ్డును పరిశీలించిన సీఎం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రింగ్రోడ్డుకు ఇరువైపులా మొక్కలు పెంచితే, హైదరాబాద్ హరితనగరంగా మారుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. మంగళవారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన.. ఔటర్రింగ్రోడ్డు ఆసాంతం పరిశీలించారు. ప్రత్యేక బస్సులో కండ్లకోయ నుంచి గచ్చిబౌలి, శంషాబాద్, బొంగ్లూరు, పెద్ద అంబర్పేట, ఘట్కేసర్ ప్రాంతాల గుండా సాగిన ముఖ్యమంత్రి.. ఔటర్ సుందరీకరణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. నగరానికి మణిహారంగా నిలిచే రింగ్రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటడం ద్వారా రాజధానిని పచ్చలహారంగా మార్చవచ్చని అభిప్రాయపడ్డారు. మొదట కండ్లకోయ రిజర్వ్ ఫారెస్ట్ను పరిశీలించారు. అటవీ ప్రాంతాన్ని సంరక్షించుకునేందుకు ప్రహరీలను నిర్మించాలని ఆదేశించారు. రిజర్వ్ ఫారెస్ట్లలో ఇంకా ఖాళీ ప్రదేశం ఉందని, వీటిలో కూడా విరివిగా మొక్కలను పెంచాలని సూచించారు. రింగ్రోడ్డు పరిసరాల్లో చాలా స్థలం ఉన్నందున.. అందమైన మొక్కలను పెంచడం ద్వారా సుందరీకరించాలని అన్నారు. హైదరాబాద్కు రాకపోకలు సాగించే జనాభా కోటి వరకు ఉంటుందని, ఏటా కనీసం పదిశాతం పెరుగుతోందని, ఈ జనాభాకు తగినట్లుగా లంగ్స్పేస్లను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. భావితరాల కోసం నగరాన్ని నందనవనం చేయాలన్నారు. ఫారెస్ట్బ్లాక్ల కింద లక్షా 50వేల ఎకరాల భూమి ఉందని, దీన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారుల దేనని చెప్పారు. నగరంలో భూమి విలువలు పెరుగుతున్నందున.. అటవీ భూములు కూడా అన్యాక్రాంతమయ్యే అవకాశం ఉందని, అధికారులు జాగ్రత్తపడాలన్నారు. ఘట్కేసర్లో పది లక్షల మొక్కలు పెంచుతున్న నర్సరీని సందర్శించిన కేసీఆర్.. ఈ ఏడాదికే కాకుండా వచ్చే ఏడాది అవసరాలకు అనుగుణంగా మొక్కలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రోడ్డు పనుల జాప్యంపై ఆరా ఘట్కేసర్ నుంచి శామీర్పేట వరకు ఔటర్రింగ్రోడ్డు పనులు ఇంకా పూర్తికాకపోవడంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైల్వేలైన్ బ్రిడ్జి నిర్మాణం కారణంగా రింగ్రోడ్డు పనులు ఆలస్యమవుతున్నాయని హెచ్ఎండీఏ కమిషనర్ శాలినీమిశ్రా వివరించారు. 2016 నాటికి ఈ మార్గాన్ని అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారికి రింగ్రోడ్డు స్వాగత ద్వారం కనుక.. ఆకర్షణీయమైన పూల మొక్కలతో సుందరీకరించాలని ఆదేశించారు. విజయవాడ-వరంగల్ రోడ్డు మధ్యన ఉన్న మూసీ ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం.. అక్కడి నుంచి గండిపేట వరకు 42 కిలోమీటర్ల మేర 40 ఇంటర్వెల్స్తో వంతెన నిర్మించాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనలో రవాణా మంత్రి మహేందర్రెడ్డి, గ్రేటర్ కమిషనర్ సోమేశ్కుమార్, అటవీ శాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, పీసీసీఎఫ్ మిశ్రా, కలెక్టర్ రఘునందన్రావు, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భూపాల్రెడ్డి, జాయింట్ కలెక్టర్ రజత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ముఖ్యమంత్రి శంషాబాద్, మహేశ్వరం, బొంగ్లూరు ప్రాంతాల్లో పర్యటన రద్దు కావడంతో టీఆర్ ఎస్ శ్రేణులు నిరాశకు గురయ్యాయి.