రేపటి నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 26 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ ఎంవీ రెడ్డి తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ 26వ తేదీ నుంచే ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ఈనెల 30 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, 31వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన విద్యార్థులు ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చని, ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి 3వ తేదీన రాత్రి 8 గంటల తర్వాత సీట్లు కేటాయించనున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 243 ఎంబీఏ కాలేజీల్లో 28,174 సీట్లు, 36 ఎంసీఏ కాలేజీల్లో 2,336 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎంబీఏలో గతేడాది దాదాపు 40 వేల సీట్లు అందుబాటులో ఉండగా ఈసారి 28,174 సీట్లలో ప్రవేశాలకే యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అంటే 11 వేలకు పైగా సీట్లు తగ్గిపోయాయి. ఎంబీఏ, ఎంసీఏల్లో చేరేందుకు నిర్వహించిన ఐసెట్లో అర్హత సాధించిన 63,549 మంది విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరు కానున్నారు. రాత పరీక్షకు 72,474 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, మే 19వ తేదీన జరిగిన పరీక్షకు 66,510 మంది హాజరయ్యారు. అందులో 63,549 మంది అర్హత సాధించారు.
వివరాలు..ఎంబీఏలో..
ప్రభుత్వ కాలేజీలు: 23
సీట్లు: 1,330
ప్రైవేటు కాలేజీలు: 220
సీట్లు: 26,844
ఎంసీఏలో..
ప్రభుత్వ కాలేజీలు: 14
ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు: 700
ప్రైవేటు కాలేజీలు: 22
ప్రైవేటు కాలేజీల్లో సీట్లు: 1,636