గార్డును ఫూల్ చేసి గుంటనక్కల్లాగ..
అలబామా: జైలులో ఓ యువ గార్డుకు ఖైదీలు ఝలక్ ఇచ్చారు. అలబామాలో మొత్తం పన్నెండు మంది ఖైదీలు సునాయాసంగా అతడిని బురిడీ కొట్టించి తప్పించుకున్నారు. వీరిలో ఇద్దరు హత్యా చేసిన కేసులో శిఖ అనుభవిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం వీరిలో 11మందిని పోలీసులు తిరిగి అదుపులోకి తీసుకొని జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. ఒక ఖైదీ మాత్రం పోలీసులను ముప్పు తిప్పలుపెడుతున్నాడట. అయితే, వారు తప్పించుకున్న విధానమే పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎప్పటి నుంచో జైలు నుంచి తప్పించుకుందామనుకున్న కొంతమంది ఖైదీలు చాలా తెలివిగా ఆలోచించారు.
శనగలతో తయారు చేసిన పదార్థాన్ని ఉపయోగించి వారు ఉంటున్న సెల్ డోర్ నెంబర్ కనిపించకుండా చేశారు. బహుశా డోర్కు అదే వెనుక భాగం అనుకున్న యువ గార్డు కాస్త ఆ డోర్ బటన్ నొక్కి వెళ్లిపోయాడు. అదే అదనుగా చూసుకున్న ఖైదీలు పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిన ఈ వీడియో చూసిన అధికారులు అవాక్కయ్యారు. అప్పటికప్పుడు అప్రమత్తత ప్రకటించి పదకొండుమందిని తిరిగి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై జైలు అధికారులు మాట్లాడుతూ ’ఈ ఖైదీలు అచ్చం గుంట నక్కల మాదిరిగా ప్రణాళిక రచించారు. వారు చేసిన పని చాలా క్రేజీగా అనిపించింది. మిగితా ఒక్కడిని కూడా పట్టుకుంటాం’ అని చెప్పారు.